Pages

05/06/2008

పాపం మన్మోహన్!

పెట్రో - ఇంధనాల ధరలు పెరిగాయి - మనిషి వయసు, పెట్రోల్ ధర.. ఒకే లాంటివి. పెరుగుతాయి కానీ, వాటి చరిత్ర లో తగ్గటం అనేది ఉండదు. ప్రతి పక్షాలు ఎంత మొత్తుకున్నా, ఒక వేళ వచ్చే ఎన్నికల్లో వాళ్లు గెలిచినా, అధికారం లో కి వెళ్లి ఈ ధరలను ఎలానూ తగ్గించలేరు.

ఈ వార్త చదువుతుండగా ఒక విషయం దృష్టిని ఆకర్షించింది. అది మన్మోహన్ సింగ్ గురించి. '' ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ''ఈ పెంపు తప్పని సరి'' అని చెప్పి బాధపడ్డారు. జనాలందరినీ, ఇంధనాన్ని పొదుపు గా వాడమని ఎపీల్ చేసారు. అంతే కాకుండా, మనం ఇంక సంప్రదాయేతర ఇంధనాలూ, అణు ఇంధనాల మీద కూడా దృష్టి పెట్టాలని కూడా కోరారు''. ఇది చదివాక, మన్మోహన్ సింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఇండో-యూ.ఎస్ న్యుక్లియర్ డీల్ గుర్తొచ్చింది. అదేంటో, ఈ డీల్ ని తీవ్రంగా వ్యతిరేకించిన లెఫ్ట్ పార్టీల పెద్దలు, ఈ పెట్రో ధరల పెంపు కు ఒప్పుకున్నారు. ఒప్పుకోక చస్తారా?!

ప్రగతి ఆంటే ఏమిటో అర్ధం కావట్లేదు. దేశానికి ఏమీ చెయ్యలేక పోయి.. కేవలం 'అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధాని' (?!) గా మాత్రమే మిగిలిపోయారు మన్మోహన్. ఏమి చేద్దామన్నా, మొక్యాళ్ళు అడ్డేవాళ్ళే ఎక్కువ అయారు. ఇండియా లో, ఈ మధ్య కాలంలో అభివృద్ది చెందినది కేవలం ధరలే.

చంద్ర బాబు ముఖ్య మంత్రి గా ఉండేటప్పుడు.. హైటెక్ సిటీ వచ్చింది, హైదరాబాద్ కి బిజినెస్ వచ్చింది. రైతు బజారులోచ్చాయి. ఎం ఎం టీ సి రైలు వచ్చింది. ఎం.డీ.ఏ ఏవో కలలు చూపించి.. తనూ పాపం ఏవో కలలు చూసి, 'ఇండియా షయిన్' అవుతుందనుకుంది. ఆయితే గత ఎన్నికల లో ఒడి పొతే పోయారు కానీ.. దేశానికి ఏదో చెయ్యాలని, తాపత్రయం కనీసం కనపడేది వాళ్ళలో. ప్రస్తుత రాజకీయాల్లో.. నాయకులకు స్వంత ఎజెండాలే తప్ప, దేశానికి ఏదో చేద్దామన్న విజన్ అస్సలు లేదు.

ఈ రోజు మాత్రం మన్మోహన్ సింగ్ మాటల్లో.. 'న్యూక్లియర్ డీల్' బాధ స్పష్టంగా వినిపించింది. అయ్యో.. ఆయితే మీరు కూడా కనీసం 'ఏదో చేద్దామని' తాపత్రయ పడ్డారన్న మాట - అనుకుని, సంతృప్తి చెందాను.

7 comments:

Kathi Mahesh Kumar said...

పాపం మన్మోహన్ తో పాటు పాపం మనం కూడా. పెట్రోల్ ధరలు ఇలా మండిస్తేగానీ న్యూక్లియర్ డీల్ అవసరం ప్రజలకి తెలిసిరాదని ఇలా చేశారేమో!! ఎలా ఉందిమన conspiracy theory?

ఐనా ఈ లెప్ట్ పార్టీలకి గొంతెత్తి అరవడం తప్ప,గొంతునొక్కి ఒప్పించడం ఎప్పుడు తెలియాలీ?.వాళ్ళు మాత్రం హాయిగా కేరళ,బెంగాలు బంద్ చేసుకుని,తమ శక్తిని తమ ప్రజలకి మాత్రం తెలియజెబుతున్నారు.అక్కడ వీళ్ళు మళ్ళీ గెలవడం ఖాయం.

దేశానికి ఏదో చెయ్యాలని ఎన్.డీ.ఏ కి ఉండేదని అపోహ పడ్డారా? మధ్యప్రదేష్ బీజేపీ రాజకీయాలు మీకు తెలియవుగా...కనీసం కర్ ‘నాటకం’ తెలుసుగా!ఎవరొచ్చినా మన బతుకులింతే. అలాగని జేపీ అస్సలు రాడండోయ్. పాపం మనం

Sujata M said...

అయ్యో మహేష్.. అలా అనకండి. ఎన్డీఏ వాళ్ళే మనకి న్యుక్లియర్ పవర్ స్టేటస్ ఇచ్చారు. పోటా (చెడ్డ పేరూ ఉంది దీనికి) తెచ్చారు. అబ్దుల్ కలాం లాంటి మంచి రాష్ట్రపతిని సమర్ధించారు. దేశాన్నంతటినీ కలిపి మంచి రోడ్లు వేశారు. ఇంకా షైన్ చేయించేవారు. 'హిందుత్వ' తో దెబ్బ తినేసారు. యు పీ ఏ వాళ్లు రెండు పెద్ద విమానాశ్రయాలు కట్టించి ఒక దానికి రాజీవ్ పేరు పెట్టారు. మన రాష్ట్రం లోనే వోక్స్ వాగన్ పేరు చెప్పి పదకొండు కోట్లు తినేసారు. ఇంక చిట్టా ఏమి విప్పుతాం లెండి. అయినా ఈ గోల వొదిలేసి మీ అంబలి గారి గురించి మాటాడుకుందాం. చెప్పండి.. ఇపుడు టచ్ లో ఉన్నారా ?

Bolloju Baba said...

న్యూక్లియర్ డీల్ అవసరమేనేమో. ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ ఇంధన అవసరాలలో 85 శాతం అణు శక్తి నుంచే పొందుతున్నాయంట. మనదేశంలో దీని శాతం 5 కూడా లేదు. అలాంటప్పుడు తలతాకట్టు పెట్టయినా తెచ్చుకోవటం న్యాయం గానే అనిపిస్తుంది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించే వారి వాదన నాకింతవరకూ తారసపడలేదు. ఎవరైనా వివరించగలరా? భవిషత్తులో కాలుష్యాన్ని కలిగించే శిలాజ ఇంధన వనరుల స్థానంలో, లక్షలసంవత్సరాలపాటు ఉండే అణు ఇంధనాల వినియోగానికి మారిపోవటం తప్పదేమో. ఇందులో ఉండే తిరకాసల్లా అణు వ్యర్ధాల డంపింగ్. భవిషత్తులో దానికి కూడా పరిష్కారం లభించవచ్చు.
ఆశాజనకంగా ఉండే అణు ఇంధన డీల్ ను ఎందుకు కొంతమంది వ్యతిరేకిస్తున్నారో తెలియటంలేదు.
విజ్ఞులు తమ భావాలను పంచుకొంటే సంతోషించగలవాడను.

బొల్లోజు బాబా

Bolloju Baba said...

క్షమించాలి ఆఫ్ ద ట్రాక్ అయిపోయినట్లున్నాను. మీ పోష్టు నాలో రేపిన ఆలోచనలను ఇలా వంపేసాను. ఎందుకంటే పెట్రోలు రేట్లు పెంచినప్పటినుంచి దాదాపు ఇవే భావాలు మదినిండా లింగర్ అవుతున్నాయి. మీ పోష్టు బాగుంది.

బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

సుజాత గారు! అంబిలిని ఆఖరు సారి 2000 సంవత్సరంలో తన పెళ్ళికి(చెన్నై) వెళ్ళి ఆశీర్వదించి వీడ్కోలు పలికేసా. తరువాత ఏమైందో వాళ్ళాయనకెరుక.

Sujata M said...

బాబా గారూ..

నేను కూడా ఈ అణు-ఒప్పందం నీరు కారిపోయిందని బాధ పడ్డాను. ఏమో.. ప్రపంచం అంతా రాజకీయాలు అంటారు కదా.. అలా! అణు వ్యర్దాలూ.. రేడియేషన్ భయం లేకపోయుంటే, మూడో ప్రపంచ యుద్ధం ఎపుడో వచ్చేసేది అంటారు. అయితే అమెరికా స్వయంగా ఆఫర్ చేసినా.. కేవలం 'మన మాట!' పోతుంది అనే భయం తో అనిల్ కకోడ్కర్ నుంచీ, ప్రకాష్ కారత్ దాకా పెద్ద దేశ భక్తుల్లా గొడవ చేసారు. లాల్ కృష్ణ అద్వానీ మాత్రం, కొన్ని మార్పులూ, చేర్పుల తో ఈ ఒప్పందాన్ని ఆహ్వానించాడు. కాబట్టి, ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మనం, మన బూజు పట్టిన సిద్ధాంతాలూ బావుంటే చాలు అనుకోవడమే చెడ్డ విషయం. పెట్రోలు కీ, న్యూక్లియర్ డీల్ కీ ఏమిటి సంబంధం అంటే - సాంప్రదాయ వనరులు అంతరించి పోతున్నపుడు, ప్రత్నామ్యాయలకు చేతులు అడ్డం పెడితే.. భవిష్యత్తు - కష్టం అని చెప్పడానికే.

మహేష్ గారు..

హీ హీ హీ! అంబలి గారు బానే ఉండి ఉంటారు లెండి! మీ కాలేజీ కబుర్లు చదివే వాళ్ళందరికీ ఆవిడ నచ్చేసి ఉంటారు.

Anil Dasari said...

అమెరికన్ న్యూక్లియర్ డీల్ మీదనే అభ్యంతరాలు కానీ అసలు అణు శక్తే వద్దని ఎవరూ అనటం లేదు కదా. అమెరికా మీద అతిగా ఆధారపడ్డ వాళ్ల గతేమయిందో చరిత్ర చెప్పటం లేదా? అయినా అణు శక్తితో అన్ని సమస్యలూ తీరవు కదా. బస్సులు, కార్లు ఎలా నడుస్తాయి దానితో(ధోరియం లేదా యురేనియం ఆధారిత బ్యాటరీలు తయారు చేస్తే తప్ప - అప్పుడు తీవ్రవాదులకి పండగే)?