Pages

25/04/2013

ప్రయాణించే పుస్తకాలు Book Crossing




పుస్తకాలు - ఒక వ్యామోహం కొందరికి. వ్యసనం మరి కొందరికి. కొందరికి  హస్త భూషణం. ఎవరింటికైనా వెళ్ళినపుడు వాళ్ళింట్లో పుస్తకాల షెల్ఫుల్ని బట్టి ఒక మంచి/చెడ్డ అభిప్రాయం ఏర్పరుచుకోవడం కూడా పరిపాటి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పుస్తకాల గురించి చర్చలూ, విమర్శలూ, మెచ్చుకోలులూ, ప్రస్తావనలూ, నిరాశలూ, ప్రొమోషన్లూ, కొనుగోళ్ళూ - ఇవన్నీ మనకిపుడిపుడే అందుబాట్లోకి వస్తున్నాయి.  ఏకంగా ప్రచురణకర్తలే వేదికల్ని ఏర్పరిచి పుస్తక ప్రియుల్ని ఒక చోట చేర్చి రక రకాల సాహిత్యాన్ని ప్రజలకి పరిచయం చేస్తున్నారు.  ఘనమైన లిటరేచర్ ఫెస్టివళ్ళు - ప్రచార పటాటోపం తోనూ, పుస్తక ప్రియుల పండగల్లా, అభిమాన విజయం గానూ నిర్వహిస్తున్నాం.


ఇవన్నీ - 'పుస్తకం' అనే ఓ 'వింత వస్తువ' మాయ లో జరుగుతూంటాయి. లోకమంతా ఒక 'మాయ' ఐతే, పుస్తకం ఒక 'విష్ణుమాయ'! చాలా మంది పుస్తక ప్రియులకి పుస్తకాలు వేన వెర్రిగా కొనడం అలవాటు. కొందరు కేవలం 'అలంకరణ కే ' కొంటారు.  కొందరు పుస్తకాల్ని బహుమతులు గా ఇస్తూంటారు.  కొందరు కొన్ని "అత్భుత పుస్తకాల్ని" ఎంతో అపురూపంగా దాచుకుంటారు. కొందరు పుస్తకాల కి పెట్టినంత ఖర్చు ఇంకే వస్తువకీ పెట్టరు. కొందరు పుస్తకాలు అరువివ్వరు. కొందరు (99.9% మంది) అరువు తీసుకున్న వాళ్ళు వాపసు ఇవ్వరు.   పుస్తకం 'పోయిందీ - అనగా వాపసు రాలేదు, రాదు!' అని రియలైస్ అయిన్నాడు అన్నం సహించకపోవడం చాలా మందికి అనుభవం.  కొన్ని అపురూపమైన సెంటిమెంట్లు అతుక్కున్న పుస్తకాలుంటాయి. రచయిత స్వయంగా సంతకం చేసిచ్చినవి, ఫలానా పాండీ బజారులో మండుటెండలో రోడ్డు పక్కన కొన్నవి, ఎవర్నో బ్రతిమలాడి ఎక్కడ్నించో తెప్పించుకున్నవి - ఇలా. ఎవరి లైబ్రరీ వారికి అపురూపమైన గని. పుస్తకం మహా మాయ. ఆ మాయ లోంచీ బైటపడ్డం కష్టం.

ఫలానా 'పుస్తకం మా దగ్గరుంది, ఫలానా 'పుస్తకం' చదివానూ అని చెప్పుకోవడం కొందరికిస్టం.  ఏదో ఒక పుస్తకం చదివి ట్రాన్సు లోకి వెళిపోయి, అదేదో లోకాన్ని సొంతంగా సృష్టించేసుకుని, తీవ్రంగా అభిమానించే జనం కొందరు.  వీటన్నిటిలో, పుస్తకాన్ని పక్క వాడికి పంచడం అనే పెద్ద హృదయం చాలా తక్కువ మందికి వుంటుంది.

ప్రతి  పుస్తకానికీ ఒక చరిత్రుంటుంది. సాధారణం గా మన దగ్గర ఏదైనా పుస్తకం తాలూకూ కాపీ అదనంగా ఉన్నపుడు ఏ స్నేహితులకో గిఫ్ట్ గా ఇస్తాం. కొన్ని చదివినా నచ్చని పుస్తకాలూ ఉంటాయి. కొన్ని చదివి, ఇంకోరితో చదివించేంత మంచి పుస్తకాలూ వుంటాయి. కొందరు పుస్తక ప్రియులకు, ముఖ్యంగా వృద్ధాప్యం లో వున్న వాళ్ళ దగ్గర కుప్పలు గా పేరుకుపోయిన అమూల్య సంపదని పరిరక్షించే స్పూర్థి ఉన్న వారసులు ఉండకపోవచ్చు. పుస్తకం తాలూకూ ధన్యత అది నలుగురు చదివితేనే కదా చిక్కేది.  పుస్తకం షెల్ఫుల్లో పడి ధూళి పేరుకునే బదులూ, దాన్ని నమ్మకంగా చూసుకునే ఏ లైబ్రరీ కో ఇద్దామని చాలా మందికి వుంటుంది.

కొందరు పుస్తకాల్ని ఇష్టం వొచ్చినట్టు పేర్చి, నాశనం చేస్తారు. లైబ్రరీ సైన్సు చదువుకున్న వాళ్ళనడగండి. పుస్తకాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలో.  నాకు తెలిసి ఒక పెద్దాయన, అపురూపమైన తెలుగు వాగ్మయాన్ని ట్రంకు పెట్టెల్లో సంవత్సరాలు గా పెట్టి ఆఖరికి చెదల పాలు చేసారు.  ఆయన పోయాకా, పెట్టె తెరిచి చూస్తే, పిండే మిగిలింది.  ఆయన కి ఆ పుస్తక సంపద అంటే తెగ మోహం. ఎవరికీ ఇచ్చేవారు కాదు. అపుడపుడూ రిఫర్ చేసే వారేమో గానీ, ఎందుకనో అవన్నీ పాడైపోయాయి.

కొందరికి ఇంట్లో ఎటు చూసినా పేరుకు పోయిన పుస్తకాల్ని చూస్తే విసుగ్గా వుంటుంది. ఎప్పుడో ఫ్రస్ట్రేషన్ లో అన్నీ తూకానికి వేసినా వెయ్యొచ్చు.  కొందరికి కొన్ని కాలక్షేపం నవలల్ని వొదిలించుకోవాలనుంటుంది. ఇవీ చాలా మటుకూ, తూకానికో, విదేశాల్లోనైతే, రీ సైక్లింగ్ కో పడేస్తారు.

వీటన్నిటికీ పరిష్కారంగా ఒక సోషల్ నెట్ వర్కింగ్ బుక్ క్లబ్ ని ఎవరో పుస్తకప్రియులే కనిపెట్టారు.  దీని పేరు 'బుక్ క్రాసింగ్'. ఈ క్లబ్ లో చేరిన పుస్తకాలు ప్రపంచం అంతా ప్రయాణిస్తాయి.  దీన్లో చేరిన సభ్యులు తమ పుస్తకాల్ని ఒక సైట్ లో రిజిస్టర్ చేసుకుంటారు. చేరిన ప్రతి పుస్తకానికీ ఒక యూనిక్ బుక్ క్రాసింగ్ ఐడీ నెంబరు ఇస్తారు. ఇది పుస్తకానికో గుర్తు అన్న మాట.  మీరు ఇతరులతో షేర్ చేసుకోవాలనుకునే పుస్తకాన్ని ఆ ఐడీ ఒక లేబుల్ పై రాసి, మీ ఇష్టమైన పబ్లిక్ ప్లేస్ - సాధారణంగా పుస్తకం ఏమిటా అని చూసే వ్యక్తులు తారసిల్లొచ్చు అనుకునే ప్రదేశాల్లో, ఉదాహరణ కి - పబ్లిక్ లైబ్రరీల్లో / ఆర్ట్ గాలరీల్లో / కాలేజీ లో / బస్ లో / ట్రైన్ లో / విమానాశ్రయం లో - అలా విడిచిపెట్టొచ్చు.  దీన్ని తరవాత ఎవరో మనం ఎరుగని వ్యక్తి మనం ఎరుగని టైం లో చూడొచ్చు. ఆసక్తి ఉంటే, ఆ పుస్తకాన్ని తీస్కెళ్ళి చదువుతారు. లేదా వొదిలేస్తారు.  అలా చదివిన రీడర్ మళ్ళీ, ఆ పుస్తకాన్ని వేరేఅ చోట విడిచిపెట్టొచ్చు.  పుస్తకం దొరికిన తరవాత, బుక్ క్రాసింగ్ సైట్లో కి వెళ్ళి, పుస్తకం ముందున్న యూనిక్ ఐడీ నెంబర్ ని ఎంటర్ చేస్తే, మనకు పుస్తకం చరిత్రా తెలుస్తుంది, సైటు వాళ్ళకు / పుస్తక దాత కు పుస్తకం జాడా (ఎవరో ఒకరు చదివారన్న తృప్తి) దొరుకుతుంది.  ఇది పూర్తిగా ఉచితం, ఎక్కువ స్వంత సమాచారం ఇవ్వనక్కర్లేదు గాబట్టి క్షేమం కూడా.

సడన్ గా ఏ బస్ లో నో మీకో మంచి పుస్తకం దొరికిందనుకోండి ! ఎంత థ్రిల్ అవుతారు ? అలానే ఆ విషయం దాత కి సైట్లో తెలియజేస్తే, దాత కూడా థ్రిల్ అవుతారు.  పుస్తకం ఒక మంచి నేస్తం. ఈ పుస్తకాల ద్వారా మనం మరిందరు మనుష్యులతో ఒక లాంటి స్నేహమే చేస్తున్నాం.  పుస్తకాన్ని మరో మనిషి తో పంచుకోవడం ద్వారా ఒక లాంటి మానవీయ బంధమేదో ఏర్పరుచుకుంటున్నం. ఈ సైట్ లో చేరడం ద్వారా మన పుస్తకాలకి రెక్కలిస్తాం. (మళ్ళీ మన దగ్గరికి రావనుకోండి.  పుస్తకాలు మనల్ని విడిచి వెళ్ళిపోతాయి).


ఇదో చెత్త కాన్సెప్ట్. మన దేశం లో వర్క్ ఔట్ కాదేమో అని అనిపిస్తూందా ? ఎంత వీలయితే అంత.. చూద్దాం అనే పద్ధతి లో నైనా ఈ పద్దతిని మనం కూడా మొదలు పెట్టొచ్చు.  ఇంటర్నెట్ వాడకం మన దేశం లోనూ ఎక్కువయింది. సోషల్ నెట్ వర్కింగ్ అయితే లెక్కే లేదూ. ఏమో చెప్పలేం. మన దేశం లోనూ హిట్ కావచ్చు.  పైగా పబ్లిక్కు కి మంచి పుస్తకాల్ని దానం చెయ్యడం చాలా మంది వల్ల కాదనుకోండి. ఇలాంటి 'ప్రయాణించే పుస్తకాలూ బహుశా చాలా మంది 'వొదిలించు కుందామనుకునే రకం చెత్త పుస్తకాలేమో ' అని సందేహం కూడా రావచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలంతే, ఈ సైట్ ని ఓసారి దర్శించొచ్చు. 


వీళ్ళు చెప్తూన్న లెక్కల ప్రకారం, ప్రపంచ వ్యాప్తం గా ఈ (ప్రపంచ పుస్తక భాండారం అనొచ్చు) 9,667,897 పుస్తకాల్ని 1,807,007 గురు సభ్యులు షేర్ చేసుకుంటున్నారు.  సరే. అన్నిట్నీ గాలికి వొదిలేయక్కర్లేదు. ఇష్టమైన పుస్తకాల్ని సభ్యులతో షేర్ చేసుకోవచ్చు.  సైట్ వాళ్ళు నిర్వహించే పుస్తక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.  ఇంకా, ముఖ్యంగా, కొనుక్కో బోయే పుస్తకాల మీద డిస్కౌంటు పొందొచ్చు. 'అరుదైన  పుస్తకాల్ని సేకరించొచ్చు.

ఇలా పుస్తకాల్ని పంచుకోవడం ద్వారా, చాలా సంతోషాన్ని పొందే వాళ్ళు ఎందరో వున్నారు.  ఒక చిన్న అడుగు అటు వేద్దామనుకునే వాళ్ళ కోసం ఈలింకు :  http://www.bookcrossing.com/about

పుస్తకాల్ని షేర్ చేసుకోదలచుకుంటే, వీళ్ళ సహాయంతో మొదట పుస్తకాన్ని లేబుల్ చెయ్యాలి.  ఈ బుక్ క్రాస్ సభ్యులు మన దేశం లో కూడా వున్నారు. (ఓ తొమ్మిది పుస్తకాలనుకుంటాను - ప్రయాణిస్తున్నాయి మన దేశం లో కూడా)  పుస్తకాల పురుగులు పుస్తకాలు కేవలం చదువుతాం అనుకునేవాళ్ళు కూడా స్వాగతం.  అదీ దీని సంగతి.

PS:  నాకెలా తెలిసిందనుకుంటున్నారా ? మొన్న నాకో పుస్తకం మా వూరి మ్యూజియం లో దొరికింది. ఏమిటా అని తెరిచి చూస్తే, ఒక లేబుల్ - దాని మీద, 'మీకిష్టమైతే ఈ పుస్తకాన్ని తీసుకోండి చదవండి, మా సైట్ ని దర్శించండి - అని ఒక నోటూ, పుస్తకం జాతక చక్రం తాలూకూ ఐడీ నెంబరూ కనిపించాయి) పుస్తకం చదవలేదింకా. కానీ సైట్ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి, టైం కుదరగానే ఇలా బ్లాగుతున్నా. అది విష్యం.


ఆన్లైన్ లో సాఫ్ట్ కాపీల్ని పంచుకోవడం లా కాకుండా,    "నిజ (అంటే ??!) జీవితం" లో నిజం పుస్తకాల్ని పంచుకోవడం - అంత ఎథికల్ విష్యం కాపోవచ్చు వ్యాపారాత్మకం గా. కానీ 'మంచి తనం ', 'మంచి ఉద్ద్యేశ్యం ',  'పుస్తకాల్ని పంచుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం', 'పుస్తకాల ద్వారా స్నేహితుల్ని సంపాదించుకోవడం',  'మనిషి కి మనిషి  కనెక్ట్ కావడం",  కొంచెం మంచి విషయాలు గా తోచాయి.

ఇలాంటి ఇతర ప్రముఖ పుస్తకాలు పంచుకునే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఎవరికన్నా తెలిస్తే తెలియపరచకలరు. (నాకు తెలీటం ఇదే మొదటి సారి కాబట్టి ఇంకా ఎక్కువ సైట్లు ఏమన్నా ఉన్నాయేమో అనే ఆసక్తి ఉంది.)

22/04/2013

గాంధీ, మై ఫాదర్



గాంధీ గారు - మహాత్ములు. దేశానికి అహింస అనే అజేయమైన ఆయుధాన్ని కనిపెట్టిచ్చిన శాస్త్రవేత్త. 200 సంవత్సరాలు విడదీస్తూ పాలిస్తూ, దేశాన్ని చిధ్రం చేసిన విదేశీ పాలన నుండీ, పేదా గొప్పా, పండిత పామరులనూ, స్త్రీలనూ, పురుషులనూ, వీరూ వారూ అన్న తేడా లేకుండా ప్రభావితం చేసి, స్వాతంత్ర్య పొరాటానికే దిశానిర్దేశం చేసి, జీవితాంతం ప్రజలకు ఆదర్శం గా నిలుస్తూ, మహాత్ముడై, జాతికి పిత యై, ఏకతాటి మీద స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించి, దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిన మహనీయుడు.


ఇప్పటికీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడిచిపోయినా  "గాంధీ" నామం కాంగ్రెస్ కు ఆయువు పట్టు.  గాంధీ టోపీ అన్నా హజారేలకూ, అరవింద్ కేజ్రీవాల్ లకూ బ్రాండ్ ఎంబాసిడర్.  గాంధీ ఎవరో ప్రపంచం అంతా ఎరుగుదురు. ఓ నెల్సన్ మండేలా నూ, మార్టిన్ లూథర్ కింగ్ నూ ప్రభావితం చేయగల మహోన్నత వ్యక్తిత్వం గాంధీది. "గాంధీ గిరీ" సినిమాలకే కాదు ఇతరత్రా ప్రజాభిమానానికీ పనికి వచ్చే దివ్య సాధనం. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ? అయోమయం. గాంధీ జీవితం  అంతా అతని ఆదర్శ పోరాటానికి రాలిన సమిధ.  గాంధీ కొడుకు హరిలాల్ మోహందాస్ కరం చంద్ గాంధీ కధ ఈ 'గాంధీ మై ఫాదర్ '.

ఈ సినిమా నా ఫేవరెట్ ఆక్టర్ 'అక్షయ్ ఖన్నా  సినీ జీవితం లో కలికి తురాయి అని చెప్పొచ్చు.  అక్షయ్ ఖన్నా గాంధీ ఓడిపోయిన కుమారుడు హరిలాల్ గా అత్భుతంగా నటించాడిందులో.  ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని నిర్మించింది బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. దీన్ని కూడా అనిల్ కపూర్'s బెస్ట్ అని చెప్పొచ్చు.

చలిలో ఆస్థ్మాతో దీనాతి దీనంగా చనిపోతూ ఉన్న ఓ బిచ్చగాడిని ముంబాయి లో ప్రభుత్వాస్పత్రి వాళ్ళు తీస్కెళ్తారు. ఎవరు నువ్వు అని వాళ్ళు అడిగినపుడు నేను 'బాపూ కొడుకుని !' అని చెప్తాడు హరిలాల్. 'బాపూ ' పేరేంటి అంటే "మోహన్ దాస్ కరం చంద్ గాంధీ" ! అని అస్పస్ఠం గ చెప్తూంటాడు.  నిజానికి ఆ బిచ్చగాడు మహాత్మా గాంధీ మొదటి కొడుకు హరిలాల్ మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. జీవితం లో అన్నీ కోల్పోయి, అనీ ఓడిపోయిన వ్యక్తి.  జీవితపు చరమాంకలో ఉన్న అతనికి గుర్తు వస్తున్నట్టు గా ఈ మొత్తం సినిమా అంతా, అతని కౌమార దశ నుండీ మృత్యువు దాగా, గాంధీ కధ అంతా తెర ముదు ప్రత్యక్షం అవుతుంది

మోహన్ దాస్ కరం చంద్ గాంధీ - సౌత్ ఆఫ్రికా లో 'టాల్స్టాయ్ ఫార్మ్' రోజుల్నించీ  కధ మొదలవుతుంది.  పెద్దబ్బాయి హరిలాల్ (హరిలాల్, మనిలాల్, రాం దాస్, దేవదాస్ అనే నలుగురు కొడుకులు)  తన అడుగుజాడల్లో నడవాలని తండ్రి గా గాంధీ కోరుకుంటాడు. అదే అతని జీవితం లో చేసిన పెద్ద తప్పు. కొడుకు ఆశయాలకూ, అభిమతానికీ విరుద్ధంగా తనతో పాటూ జాతీయోద్యమం దిశగా కొడుకు నడవాలని, బారిస్టరు గాంధీ కోరుకుంటూంటాడు. హరిలాల్ చదువు మాతృభాషలో సాగాలని, సౌత్ ఆఫ్రికానుండీ, మెట్రిక్ చదివేందుకు రాజ్ కోట్ పంపేస్తాడు.  అక్కడ గులాబ్  అనే అమ్మాయినే హరిలాల్ కాబోయే భార్య గా కూడా నిర్ణయిస్తారు. కానీ హరిలాల్ చదువు ఆయా కారణాల వల్ల చెడుతుంది. సౌత్ ఆఫ్రికా కీ, ఇండియాకీ మధ్య దాదాపూ ఊగిసలాడుతున్న అతని చదువు, విసిగిపోయి, అతను గులాబ్ ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం, తిరిగి తండ్రి పిలుపు పై గులాబ్ ను వొదిలి, సౌత్ ఆఫ్రికా రావడం జరుగుతుంది.   

హరిలాల్ నిజానికి చిన్నప్పటినించీ తండ్రిలా ఇంగ్లండ్ వెళ్ళి పెద్ద చదువులు చదివి బారిస్టర్ అవ్వాలని కలలు కంటూంటాడు. వీట్ని గురించి తెలిసినా గాంధీ ఒక రకమైన మొండితనంతో హరిలాల్ తన తో పాటూ దేశం కోసం పని చెయ్యాలని కోరుకుంటాడు. ఇది ఎంత తప్పుడు నిర్ణయమో అతనికి తెలియదు.

సౌత్ ఆఫ్రికా లో గాంధీ అపార్థీడ్ (వర్ణ వివక్ష ) కు గురి అవుతూ ఉన్న సమయం. బారిస్టర్ అయి వుండి, ఫస్ట్ క్లాస్ టికట్ ఉన్నా కూడా రైల్ లోంచీ నెట్టివేయబడతాడు. ఫుట్ పాత్ మీద అందరు తెల్ల వారితో సమానంగా నడిచినందుకు 'కూలీ ' అంటూ గద్దింపబడతాడు. అతనితో ఉన్న భారతీయులందరూ, మెల్లగా స్వతంత్ర్య భావనలతో ఉత్తేజితులవుతున్నారు. అపుడే వీళ్ళు ఆయా ప్రాంతాలలోకి వెళ్ళాలంటే వీళ్ళకు పాస్ లు ఉండాలంటూ కొత్త చట్టం తీసుకొస్తారు తెల్ల దొరలు. భారతీయులంతా తమ తమ పాస్ లను తగలబెడతారు. ఆ ఉద్యమం ఊపందుకుంటున్న నేపధ్యంలో హరిలాల్ తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తాడు. జైలుకు వెళ్తాడు.

సహజంగా మొహమాటస్థుడూ, మిత భాషీ అయిన హరిలాల్ కు తండ్రి కన్నా తల్లి దగ్గరే చనువెక్కువ. తండ్రిగా గాంధీ చాలా క్రమశిక్షణ ని పాటిస్తూ, పిల్లల్ని తననుకున్న పద్ధతుల్లోనే పెంచుతూంటాడు.  భార్య కస్తూర్బా కూడా ఎన్నో త్యాగాలు చేస్తూ,భర్త అడుగుజాడల్లో నడుస్తూ, గాంధీ మార్గాన్ని సులభతరం చేసింది.   కాబట్టి తండ్రి దగ్గర చెప్పుకోలేని తన ఆకాంక్షల్ని తల్లితో పంచుకుంటాడు హరిలాల్. ఇద్దరూ ఎంత ప్రయత్నం చేసినా, మోహన్ దాస్ మనసు మార్చలేకపోతారు.  ఈలోగా ఊపందుకున్న పోరాటంలోకి హరిలాల్ కూడా యువకుడు కావడం వల్ల ఉత్సాహంగా దూకుతాడు. కానీ అతనికి తెలుసు - తన లక్ష్యం బారిస్టరు కావడం.

హరిలాల్ భార్యని వొదిలి తండ్రి తననైమైనా బారిస్టరీ చదివిస్తాడేమో అనే ఆశతోనె సౌత్ ఆఫ్రికా వస్తాడు. అక్కడ పుస్తకం లో దాచుకున్నముగ్ధ లా వున్న అతని భార్య ఫోటోని చూసి, గాంధీ సెక్రటరీ, వెంటనే గాంధీ గదిలోకి వెళ్ళి : "మిస్టర్ గాంధీ - ఈ ఫోటో చూడండి ? వీళ్ళిద్దర్నీ విడదీయడానికి మీకు మనసెలా వొప్పింది?" అని అడుగుతుంది చనువుగా. వెంటనే గులాబ్ (భూమికా చావ్లా) ని సౌత్ ఆఫ్రికా పిలిపిస్తారు. కానీ కొన్నాళ్ళ సంసార జీవనం తరవాత, హరిలాల్ జైలుకి వెళ్ళాక, గులాబ్ నీ, పిల్లల్నీ (హరిలాల్ ఆదర్శ జాతీయోద్యమ జీవితానికి అడ్డురాకుండా వుండేందుకని) తిరిగి ఓడ లో ఇండియా కి పంపేస్తాడు మోహందాస్ గాంధీ.

గాంధీ కుమారుడిగా హరిలాల్ కు ఒక సంపన్న గుజరాతీ 'బారిస్టరీ ' చదవడానికిచ్చిన స్కాలర్ షిప్ ను తమకు తెలిసిన 'సొరాబ్జీ' ల అబ్బాయి కి మళ్ళిస్తాడు తండ్రి. ఇలా రెండు సార్లు చేతి దాకా వచ్చిన అవకాశాన్ని తండ్రి తిప్పికొట్టడం చూసిన హరిలాల్ చాలా హతాశుడైపోతాడు.  

ఇవన్నీ (తన నిర్ణయాలకూ, తన ఇస్టాయిస్టాలకూ సంబంధం లేకుండా) అన్నీ తానై తనకి వ్యతిరేకంగా ఉన్నందుకు తండ్రిని అసహ్యించుకునే పరిస్థితికి హరిలాల్ దిగజారుతాడు. ఇక్కడ ఆయా నటుల నటనా, మోహన్ దాస్ గాంధీ గా చేసిన జరీలాల్ నటనా చాల బావుంటాయి.  ఆ ద్వేషం హద్దులు దాటి, తండ్రినీ, అతని ఆదర్శాల్నీ ధిక్కరించి ఇండియా వచ్చేస్తాడు హరిలాల్. అప్పటికీ తండ్రిని ఎదిరించలేక, మారువేషం తో డర్బన్ లో ఓడ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడి ఇల్లు చేరతాడు. ఆ తరవాత తండ్రీ కొడుకుల మధ్య చినుకులా మొదలైన వాగ్వివాదం ముదిరి, తండ్రి ని తనని రాజ్ కోట్ పంపించేయమని బ్రతిమలాడి ఇండియా వచ్చేస్తాడు హరిలాల్.  ఇక్కడ తండ్రి గా గాంధీ తన తప్పిదాన్ని గుర్తించినా,  ఆదర్శాల కోసం దాన్ని సరిదిద్దలేక, అర్ధం చేసుకోని కొడుకు బాధనీ అర్ధం చేసుకుంటాడు. అక్కడితో ఒక అధ్యాయం ముగుస్తుంది.

రాజ్ కోట్ లో భార్యా, నలుగురు పిల్లతో, అద్దె ఇంట్లో హరిలాల్ ఇబ్బందులు పడుతూ, అటకెక్కిన చదువుని గాడిలో పెట్టే ప్రయ్తంతం చేస్తూంటాడు. మెట్రిక్ మూడు సార్లు తప్పుతాడు. ఈలోగా లోకమాన్య తిలక్ తదితరుల ఆహ్వానం పై గాంధీ భారత్ తిరిగి వస్తాడు. తల్లి తండ్రుల ని కలుసుకుని, వారి ప్రధమపర్యటన పర్యాంతం, కుమారుడిగా తన బాధ్యత గా తోడుంటాడు హరిలాల్. అప్పటికే గాంధీ పేరు భారత దేశం అంతటా మహాత్ముని పేరు మారుమోగుతూంది. కొత్తగా దిగివచ్చిన దేవత లాంటి భావన, ప్రజలందర్లోనూ, తీవ్రమైన ఎక్స్పెక్టేషన్ ! సౌత్ ఆఫ్రికా లో గాంధీ చేసిన పోరాటం, అంత పెద్ద బారిస్టరూ, దేశ పురవీధుల్లో సామాన్యుడిలా పర్యటించడం, ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి.  గాంధీ కొడుకుగా హరిలాల్ పతనం కూడా పూర్తి స్థాయికి చేరుకుంటూంటుంది.

హరిలాల్, ఉద్యోగం కోసమో, ఆర్ధిక సహాయం కోసమో తండ్రిని చేసిన అభ్యర్ధనలు నిరాకరించబడతాయి. గాంధీ పేరు, అతనికి ఏ విధం గానూ సహాయపడదు. నలుగురు పిల్లలూ, నిరుద్యోగం, జీవితం లో అపజయం, హరిలాల్ ని కుంగదీస్తాయి. తండ్రి అంటే ద్వేషం పతాక స్థాయికి చేరుకుంటుంది. కొందరు మోసగాళ్ళు గాంధీ పేరును ఉపయోగించుకునేందుకు హరిలాల్ ను వాళ్ళ మిధ్యా వ్యాపారాల్లోకి లాగి, అతన్ని అధో పాతాళానికి చేరుస్తారు. తాగుడు కు బానిస అవుతాడు. అప్పుల వాళ్ళ బెదిరింపులు ఎక్కువవుతాయి. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకువా అని నిందలూ మొదలవుతాయి. తండ్రి పేరు కున్న పెద్ద నీడ లో గాంధీ అసమర్ధ కొడుకుగా తనకున్న పేరుతోనూ, అవస్థలు పడుతూ, హరిలాల్ మానసిక, ఎమోషనల్ చిత్రవధ ని అనుభవిస్తాడు. పోషించుకోవడానికి హరిలాల్ భార్య, పిల్లని తీసుకుని కన్నవారింటికి చేరుతుంది.  అక్కడే హరిలాల్ కొడుకు మరణిస్తాడు. ఆ వార్త విని మామ గారింటికి చేరిన హరిలాల్ కి భార్య మృత్యు వార్త కూడా ఎదురయి, నిలువునా దుఃఖ సాగరంలో మునిగిపోతాడు.   హరిలాల్ లో ఉన్న విచక్షణ అంతా అంతరించుకుపోయి మనిషి పూర్తిగా మారిపోతాడు.


ప్రశాంతత కోసం ఇస్లాం స్వీకరిస్తాడు. ఆతరవాత వేశ్యా వాటికల కి వెళ్తాడు, అప్పుల వాళ్ళని తప్పించుకుని తిరుగుతూంటాడు.  వ్యక్తిగా దిగజారుతూంటాడు.  తల్లి కస్తూర్బా వచ్చి అతని పరిస్థితి చూసి బాధపడితే, ఆమె కోసం మళ్ళీ బ్రహ్మ సమాజం లో చేరి, హిందువు గా మారతాడు.  అయితే, జీవితంలో ఓటమి, అతని స్థాయిని దిగజార్చి తాగుడుకు బానిస గా చేస్తుంది.  తండ్రి అంటే ఎలానూ ప్రేమ లేదు. తల్లిని  మాత్రం కలవడానికి అదీ కొద్ది నిముషాలు మాత్రమే ! ప్రయత్నిస్తాడు. ఎక్కడన్నా తల్లీ తండ్రీ, ఏ గృహనిర్బంధం లో ఉన్నపుడో, దేశంలో ఎక్కడికైనా రైల్లో ప్రయాణం చేస్తున్నపుడో తారసపడుతుంటాడు. దాదాపు బిచ్చగాడిలా, జేబులో కాణీ లేక, ఒక్క క్షణం ప్రత్యక్షమై, తల్లిని పరామర్శించి మళ్ళీ అదృశ్యం అవుతుంటాడు. గాంధీ, ఎంతో సాదరంగా కొడుకుని ఇంటికి ఆహ్వానిస్తూనే వుంటాడు. అయినా, తండ్రి కళ్ళలోకి చూడ్డానికి కూడా హరిలాల్ ఇష్టపడడు.


చివరి క్షణాల్లో కస్తూర్ బా, హరిలాల్ ని గురించి తలుచుకుని బాధపడుతూనే కన్ను మూస్తుంది.   భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు ఎవరో రోడ్డు పక్కన దీనాతిదీన స్తితి లో బిచ్చగాడిలా పడున్న హరిలాల్ చేతిలో లడ్డూ పెడతారు. అప్పటికే హరిలాల్ మానసిక సంతులితను కోల్పోయి వుంటాడు. స్వాతంత్ర్యం వచ్చినన్న స్పృహ లేనే లేదు.  గాంధీ కూడా చనిపోయే ముందు రోజు తన సెక్రటరీ ని హరిలాల్ ని ఇపుడు వెతకగలమా ? అతన్ని చూడాలనుంది అని అడుగుతాడు. కానీ హరిలాల్ ని వెతకడం ఎంత కష్టమో తెలిసి నిస్సహాయంగా ఫీల్ అవుతాడు. 

గాంధీ హత్య జరిగినపుడు హరి ఒక చిన్న హోటల్లో ఏదో తినడానికి వెళ్తాడు.  రేడియోలో గాంధీ మరణ వార్త విని సొంత తండ్రి పొయైనట్టే (బాపూ ) అంటూ బాధపడుతూ హరిలాల్ చేతిలో ఏదో తినడానికి పెట్టి, డబ్బులు తీసుకోకుండా కొట్టు మూసేస్తాడా హోటెలు యజమాని. అప్పుడూ, ఆ వార్త రిజిస్టర్ అయినట్టుండదు హరిలాల్ కి. 

అయితే పతనం లోకి జారిపోతున్న హరిలాల్, రోడ్డు పక్కన బిచ్చమెత్తుకునే బీద స్థితిలోకి వెళిపోతాడు. చలిలో, వర్షంలో రోడ్డు మీదే నివాసం. శ్వాస్ కోశ వ్యాధికి గురవుతాడు.  ఆ రోజున తండ్రినీ, తన జీవితాన్నీ తలుచుకుంటూ కళ్ళు మూసిన ఆబిచ్చగాడు   -  ఆ హరిలాల్ - ఆఖరి శ్వాస తీసుకున్నాకా, అతని జేబు లో దొరికిన ఫామిలీ ఫోటోలూ, వగైరాల ద్వారా అతనే హరిలాల్ అని అందరికీ తెలుస్తుంది. అలా.. మహాత్మా గాంధీ కొడుకు అత్యంత దీనమైన పరిస్థితి లో కన్ను మూస్తాడు.

గాంధీ జీవితంలో ఈ చీకటి కోణం,అపారమైన పుత్ర శోకం, చాలా మందికి తెలీదు. ఈ నిజ జీవిత కధను అత్యంత హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడికి చాలా పేరు వచ్చింది.  చాలా జాగ్రత్తగా ఎన్నుకున్న తారాగణం, చారిత్రక చిత్రం కాబట్టి నిజాల్ని నిజాలుగానే వుంచుతూ, కల్పనల్ని పక్కన పెట్టి, చక్కగా తీసిన ఈ చిత్రం, ఓ అత్భుతం. యూ ట్యూబ్ లో పూర్తి సినిమా వుంది. గుజరాతీ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పాట ఒకటి చాలా బావుంటుంది. మంచి సినిమా ఈ "గాంధీ, మై ఫాదర్".








16/04/2013

నాణానికింకో వైపు - విశాఖపట్నం

వేసవిలో కష్టపడకుండా చెమట చిందించేయొచ్చు. గాఢ నిద్ర లోంచీ, వొళ్ళంతా, దిండంతా చెమటకి తడిచిన చెమ్మకి మెలకువ రావడం, మా వూరి స్పెషాలిటీ.  ఏసీ లొచ్చి బ్రతికించాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ఈ విపరీతమైన ఉక్క పోత ప్రాణసంకటం.


చండీదాస్ నవలల్లో విశాఖ తీరం అందాల్ని గుర్తు తెచ్చుకుందుకు.. మహరాణీపేట లేడీస్ హాస్టల్ డౌను రోజుల్ని నెమరు వేసుకుందుకూ బీచీకి కారు లో షికారు పోయేరు. అద్దం నిండా ఉప్పుగాలి చెమ్మ. ఇదీ మా సముద్రం. వేడి నుండీ తప్పించుకోవడానికి జనం తండోపతండాలుగా వచ్చి, సముద్రం నుంచీ వీచే ఉక్కిపోయిన గాలి రంధిలో తలనొప్పి తెచ్చుకుని బయల్దేరొచ్చు. కళ్ళజోడుతో స్కూటరు నడపడం కష్టం.  అద్దాల్నిండా మబ్బులు కమ్మేసి వుంటాయి. 


"మురీ మిక్సరు (పిడత కింద పప్పు లాంటి ఒక స్నాక్)  అమ్మేవాడెవడికో ఎయిడ్స్ ఉందిట. ఒకసారి వాడి రక్తం  టొమాటోలు తరిగినపుడో తెగిన రక్తం లోంచీ కలిసి తిన్నవాళ్ళకి కూడా ఎయిడ్స్ వచ్చిందంట ! "  అని ఎవరో మా చిన్నపుడు పుకారు లేవదీసారు.  ఆ ఆనందం కూడా  పెద్దయ్యాకా హైజీను గొడవలో పడి కోల్పోయాం.  బీచి లో గవ్వలన్నీ జనం ఎత్తుకుపోయారు. ఇపుడు నల్లని కుళ్ళిన మట్టీ, నీళ్ళలో కలుస్తున్న ఓపెన్ డ్రైనేజీ ప్రవాహాలూ, ఒక ముసలి గుర్రం, చిక్కిన ఇసుక మేటా తప్ప ఏమీ లేవక్కడ.  అన్నమయ్య విగ్రహం పక్కనా, మాస్టరు 'ఈ.కే' (ఎక్కిరాల కృష్ణమాచార్య) విగ్రహం పక్కనా కూడా ఏదో కోల్పోయినట్టనిపిస్తూంటుందండీ - అని మహేశ్వరి నిట్టూర్చింది.  


పొద్దున్నే తాజా గాలి పీల్చుకుందికి లేదు. తెల్లారే  గాలిలో అదోలాంటి వాసన. ఎవరో ఫాక్టరీ వాళ్ళు ఏవో వాయువుల్నీ, కల్మషాల్నీ వదిలినట్టుంది. సూర్యుడి ప్రతాపానికి చల్లదనం కరుగుతుంటే, ఆ వాసన కూడా విరుగుతూంటుంది. ఈలోగా పనుల తొందర్లో, తాజా గాలి సంగతి మర్చిపోవచ్చు.

ఒకపుడు సిటీ ఆఫ్ డెస్టినీ. ఇపుడు, పిల్లలెగిరిపోయిన ఖాళీ కాకి గూడు లా మిగిలింది.  పిల్లలందరూ, ఈ విశాఖ మెట్టుమీద ఓ కాలుంచి, ఇంకో కాలు ఏ హైదరబాదు మీదో వుంచి, విదేశీ అటక ఎక్కిపోయారు. తల్లితండ్రులు, రైతు బజారులో దేశవాళీ టొమాటోలూ, ఏజెన్సీ నుంచొచ్చిన పచ్చి అల్లం గురించే కబుర్లు చెప్పుకుంటున్నారు. 'రామాయణ కల్పవృక్షాని' కే ప్రైజిచ్చిన విశ్వవిద్యాలయం - తమ మీద తమకే నమ్మకం లేనట్టు మసిబారుతూ రోడ్డుపక్కన నించుంది. 

సింధియా మీంచెళ్ళి గంగవరం వెళ్ళొద్దాం అని ప్లాన్. డాల్ఫిన్ నోస్ పక్కనే ఏదో కొత్త నగరం.  'సబ్బవరం పిల్లా సబ్బు కావాలా ?" అని ఈవ్ టీజరు నోట పాట. మువ్వల వాని పాలెం నిండా రక రకాల రెస్టారెంట్లూ, బ్రహ్మాండమైన స్కూళ్ళూ, మిఠాయి దుకాణాలు. రవీంద్రా టైలర్సు ఎత్తేసి చాలా కాలమైంది.  కైలాసగిరి కొండ మీద గోవింద నామాల్లో సగం లైట్లు వెలగనే వెలగట్లేదు. చుట్టూ చెట్ల పొడవెక్కువయి సరిగ్గా కనిపించడం లేదు కూడాను. చిరంజీవి గారికి ఆలోచన రాలేదు. వస్తే అక్కడ ఎల్.ఈ.డీ.లైట్లు పెట్టిద్దురు.

విజీనారం అమ్మోరి పండగని (విజయనగరం అమ్మవారు - పైడితల్లి) ఓ నాల్రోజులూ, వాళ్ళ వీధి అమ్మోరి 'పరస'ని (విశాఖ లో అమ్మవారి పండగ) ఓ రెండ్రోజులూ సెలవెట్టేసేడు అప్పారావు మా వాచ్మెను.  "నాగేశ్వర రావు గారి కుటుంబం శ్రీకూర్మం వెళ్తున్నారుట. అలా అరసవిల్లి చూసుకుని వస్తారు ! వాళ్ళ పెద మావగారి తద్దినం అక్కడ శ్రీకూర్మం (కూర్మ నాధ స్వామి కోవెల - పితృకార్యాలకి ప్రసిద్ధి) గుళ్ళోనే ట !"  అని చిన్న మణి చెప్పింది.  కార్లో ప్రయాణం బానే వుంటుందిలే. ఇపుడు మంచి రోడ్లు పడ్డాయి. అంది వాళ్ళక్కయ్య !

'తెలంగాణా వస్తే మరి పట్టలేం. మధురవాడలోనో, ఎండాడ లోనో, కొమ్మాది లొనో ఇల్లు కొని పడేద్దాం అని" ప్రతీ ఒక్కడూ అనుకోవడమే ! అని ఇసుకతోట లో నాలుగు ఫ్లాట్లున్న డాక్టరు గారు వాపోయారు. అందుకే చూడండి. పల్లెటూళ్ళు ఊరు ఊరంతా ఎగిరిపోయి ఎపార్టుమెంట్ల నగరాలు లేచేస్తున్నాయి. విజీనారానికీ, విసాపట్నానికీ తేడా మరి ఉండదు లెండి... పూసపాటిరేగ వరకూ మెట్రో వేస్తారు చూడండి - అందుకే రామానాయ్డు ఇక్కడ స్టూడియో కట్టేడు.  అట్చూడండి - ఆ కనపడే కొండా కోనా అన్నీ జగనన్నవే. వైజాగ్ లో గమ్మున ఇల్లు కొనుక్కోవాలండీ. ధరలు పెరిగిపోతాయి మరి ! " -  రియాల్టరు విశ్వేశ్వర రావు ఉవాచ.

కొత్తగా మాళ్ళూ అవీ వచ్చాయనుకోండి. అయినా విశాపట్నం పెద్ద పల్లెటూరే !   అని మా భవాని అత్తయ్య నవ్వింది.

పేపర్లో ప్రకటన చూడండి. హాస్పిటలు వాళ్ళకి ఒరిస్సాలో కమీషన్ ఏజెంట్లు కావాల్ట. ఒరిస్సా నుంచీ పేషెంట్లని తీసుకు రావడానికి. పాపం వాళ్ళ అనారోగ్యానికి వాళ్ళకి ఏ భువనేశ్వరమో వెళ్తేగానీ మంచి ఆస్పత్రనేది ఉండదు.  వాళ్ళకి పరమోగతి ఈ విశాపట్నమే. ఇక్కడి కే.జీ.హెచ్ వీధి నిండా వెలిసిన డాక్టర్ల దుకాణాలూ, చిన్నా పెదా ఆస్పత్రులూ, రాం నగర్లో మెడికల్ షాపులు సైతం, ఒరియా భాషలో లాడ్జీలూ, సగం వేరే రాష్ట్రం వాళ్ళ సేవ లోనే గడిపేయవూ ? ఇపుడీ పీ.ఆర్.వో ఉద్యోగాలు కూడానూ -  అని పీటరు బాధపడిపోయాడు. పోన్లెద్దురూ.. ఎవరి కష్టాలు వాళ్ళవి. అని ఊరుకోబెట్టాం."ఇందులో విపరీతం ఏముంది ? 'విన్ - విన్ సిట్యుయేషన్ !" అన్నడు రమణ.


రైళ్ళన్నీ ఇంక నుండీ దువ్వాడ వెళ్ళే ఎక్కాలి కామోసండీ అని అప్పారావు గారి ఆవేదన. 'అసలెంత మంది వెళిపోతున్నారండీ వెధవ హైదరాబాదుకీ? ప్రతి రోజూ 12 రైళ్ళూ, 60 బస్సులూ ఉన్నా, ఏ పూటకీ రిజర్వేషను ఇదిగో కంఫెర్మూ అని టికెట్టు దొరికి చావదు. ఎప్పుడూ గోదావర్లో వెయిటింగ్ లిస్టు ఏ మూడొందల పాతికోనే. రైలెక్కే వరకూ భరోసా లేదు. అయినా, ఈ డబ్బంతా ఆ ఒరిస్సాకే తరలిపోతూంటుంది !" అని సింహాచలం గారి ఆందోళన. ఆయన కూతురూ అల్లుడూ, హైదరాబాదులోనే ఉండడం.  

లోకల్ న్యూస్ పేపరు కి వార్తలు రాసే విలేఖరి డీఆరెం ఆఫీసులో తెగ తిరిగేస్తున్నడు.  "అదృష్టం ! విశాపట్నం స్టేషన్ కైనా రాంపు (ప్లాట్ఫారాలు మారడానికి మెట్ల దారి తో పాటూ) ఉంది. వీల్ చైర్లు /స్ట్రెచర్లూ, ముఖ్యంగా ఈ చక్రాల పెట్టెలూ బాగులూ లాక్కోడానికి అనువుగా. ఏ హైద్రబాదు సికిందరాబాదుల్లో ఉందండీ ఈ ఫెసిలిటీ ?"  అని ఓ విశాఖా రైలాభిమాని చాతీ ఉప్పొంగించారు.  "మా మాంగారు హార్టు పేషెంటు. అత్యవసరంగా ప్రయాణం కట్టాల్సొచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాదు స్టేషన్ లో రైలు దిగి  ఏ బాటరీ కారూ, వీల్ చైరూ దొరక్క, మూడుగంటలు వెయిట్ చేసి, ఆఖరికి మెట్లనీ ఎక్కి ప్లాట్ ఫాం నుంచీ బయటికి వచ్చారు. ఆ తర్వాత నాల్రోజులకే పోయారు" అని రాజీ చెప్పింది.

"ఎంత సేపూ రాజమండ్రీ నుండీ పొలస చేపలూ, కాకినాడ నుండీ చుక్కల పీతలూ - అంటూ రాజులొండిన గొడావరీ ఫిష్ గొప్పలు చెప్పుకోవడమేనా - అలా బీచ్ రోడ్డులో రోడ్డు పక్కన ఎండబెట్టిన చేపల సువాసన చూస్తారా ? "  అనడిగేడు దేవుడు. అబ్బ ! విశాలాక్షి నగర్ వెళ్ళే తోవలో ఆంధ్ర భూమి పక్కన ఎన్ని చేపలో - ఎండ కి వెన్నెల నక్షత్రాల్లా మెరుస్తూ ! అని భావుకత ప్రదర్శిస్తాడు మా సురేషు.  'అబ్బ చీ ! అవి కాదు డెక్కు మీద (చేపలు పట్టే పెద్ద పడవల డెక్) ఎండబెట్టినవి - చూడండి ఇసకన్నది ఉండదు - తీస్కోండి బాబూ - అని రాగాలు తీస్తుంది మా కాంతమ్మ ! 


"(ఫిషింగ్) హార్బరు కెళ్ళి వస్తున్నాం !" - ఆదివారం రోజు నర్మదా వన్ ఫిఫ్టీ (Narmada 150 Scooter) మీద ప్లాస్టిక్ బాగ్ నిండా చేపల 'వాసన'  తో ఎదురొచ్చిన రాజుగారు మనం పలకరించకుండానే చెప్తారు. నేవీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఆటోల్లో చేపలు తీస్కెళ్తుంటారు - బహుశా వారానికి సరిపడా గ్రాసం కాబోలు.

"విజీనారం మ్యూజిక్ కాలేజీ లో చదూకున్నార్ట ! ఆ సాగర్ ఎపార్ట్మెంటులో కొత్తగా దిగేరు. మ్యూజిక్ నేర్పిస్తార్ట. "మాళవిక" లేదూ - వాళ్ళ వేలు విడిచిన చుట్టాలంట."  - ఆ చెంపనొక్కుల పెద్ద నుదురు, కొత్త పావలా కాసు లాంటి నాజూకు బొట్టూ, బెంగాల్ కాటన్ చీరలు కట్టుకునే పెద్దావిడ గురించే చెప్తున్నారనుకుంటా.  "అవునవును. ఆవిడ బాల్కనీ లో కూర్చుని వీణ వాయిస్తుంటే చూసాను!" అంది రత్న.  (అంటే ఈవిడ బాల్కనీ లోంచీ ఆవిడ హాల్ లోకి చూసిందన్నమాట !)

రత్న కూతురు  రోజూ స్కేటింగ్ కని వుడా పార్కుకి వెళ్తూంటుంది.  "వీళ్ళందర్నీ మొన్న వాకింగ్ లో చూసేం. పాండురంగపురం అప్ కి తీస్కెళ్ళి వొదిలేడు కోచ్. తొడలు నొప్పెట్టేలా పిల్లలు స్కేట్ల కాళ్ళను తొందరగా కిందకి జారిపోకుండా ఆపుకుంటున్నారు. నాకైతే చాలా జాలి వేసిందనుకో !"  అని బాధపడ్డారు.. గొలుసులూ, సూత్రాలూ తీసేసి చుడీదార్ తో వాకింగ్ కి పోయే రాజ్యలక్షి గారు. మ్యూజిక్ టీచరు మాటే మర్చిపోయి.  రత్న కళ్ళూ అరమోడ్పులయ్యాయి - గర్వం తో !


గణేష నవరాత్రుల్లో సంపత్ వినాయకుడి గుడి ముందు డెకరేషన్లు చూడ్డానికిభలే సంబరంగా వుంటుందనుకో ! అని మా స్వప్న అంటూంటుంది. నిజమే ! ఆ రోడ్డంతా మారిపోయింది. కొత్త దుకాణాలూ, కొత్త అలంకరణలూ !  తిరపతి మాడవీధుల్లా అన్ని రోడ్లూ వెడల్పయ్యాయి. దానికి తగ్గట్టే ట్రాఫిక్కూ.. అటు చూడండి పెదవాల్తేరు రోడ్డ్ల పక్కన అశోకుడు నాటించినట్టుండే  చిక్కని నీడనిచ్చే చెట్లని కొట్టిపడేసారు.   బాధపడింది స్వప్న !

"మరీ బాధలు భరించలేనట్టు అనిపిస్తే, ఎన్.హెచ్ ఫైవ్ (NH5)  మీద్నుంచో, మధురవాడ వైపునుంచో సిమ్హాచలం వెళ్ళి సంపెంగ వాసన్లు పీల్చుకుని రండి. సాయంత్రం అయితే సిమ్హాచలం చాలా అందంగా వుంటుంది" - మా మణి పెద్దమ్మ చెప్పింది.  అయితే చాలా మంది సుప్రభాతం వేళ అప్పన్న అందంగా వుంటాడంటారు. నాకైతే లక్షివారం ఆ సిమ్హపు కవచం తో నచ్చుతాడు. 

అడవి సంపెంగలూ, తెలుపు సంపంగలూ, పచ్చ సంపెంగలూ, మల్లెలూ, కనకాంబరాలూ, విరజాజులూ, సన్న జాజులూ, మరువం, జూకా మల్లెలూ, సువర్ణ రేఖలూ, రక రకాల రసాలూ, తియ్యని పనస పళ్ళూ.. బెల్లమూ - కలిసినట్టు - ఏదో దివ్యవైన వాసన కదూ ఆ కనకమాలక్ష్వి కోవెల్లొ ? కొంచెం ఇరుకు వీధి ! తప్పదు మరి. అమ్మోరు - మా వూరి పెద్దమ్మ కదూ.


Disclaimer : ఇందులో విషయాలన్నీ దేన్నో ప్రత్యేకంగా ఉద్దేశ్యించి గానీ, ఎవరన్నా హర్ట్ చేద్దామనీ రాయలేదు. ప్రస్తుత పోకడ / ట్రెండ్ గురించి చాలా మంది స్వగతాన్ని ప్రతిబింబించాలని చిన్న ప్రయత్నం. ఊరు విడిచిపెట్టిన స్నేహితులకి కూడ ఓ పలకరింపు లా అనిపించాలని కోరుతూ ..

04/04/2013

Random Shots





Pictures taken in Glasgow, Millport Cumbrae and Ferry point at Largs, Scotland.