Pages

08/02/2013

బోరింగ్ కబుర్లు



1. కొందరు నిరుద్యోగం భయంతో 'చిరుద్యోగాలు' చేస్తుంటారు.  ఎంత చిరుద్యోగాలయినా పర్లేదు. కాంట్రాక్టు ఉద్యోగాల్లో చేరి 'పెర్మినెంట్ ' ఎప్పటికైనా అవుతామేమో అని ఎదురు చూసే చాలా మంది ఆశావహుల్ని చూస్తుంటాం.  ఇది ఒక రకం అబధ్రత.  ఈ చిన్న ఉద్యోగం కూడా లేపోతే ఏం కాను అనే బెంగ తో కూడా ఆ చిన్న ఉద్యోగాన్ని చేస్తూనే వుంటారు.   కాంప్రమైస్ అయ్యి, ఆ తరవాత పోటీలో నెగ్గలేక, తరవాత అలవాటు పడి, అలా 'ఎక్కడ చేరిన గొంగళి ' ని అక్కడే వొదిలేస్తూంటారు. అది చాలా మటుకూ వ్యక్తిగత & వృత్తిగత నిర్ణయం అనుకోండి. కానీ మరీ ఇలానా ? 1971 - 2001 వరకూ, కేవలం నెలకు 15 రూపాయల కొన్ని పైసల  జీతంతో పని చెయ్యడం సాధ్యమా ?   

అది టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో టాయిలెట్లు కడిగే ఉద్యోగం. కానీ ఇన్నేళ్ళ శ్రమ కి ఇద్దరు మహిళా సఫాయీ వాలీ లకు ఇంతవరకూ అందిన జీతం మొత్తం కలిపి 5400/- ట. అన్యాయం కదా.  విషయం ఇప్పుడు ట్రైబ్యునల్లోనో కోర్టు లోనో ఉంది.  వాళ్ళకి జీతం పెంచే ప్రతిపాదన, ప్రభుత్వ పరిశీలన లో వుంది. గానీ ఈ ఇద్దరు మహిళలూ, గమ్మత్తుగా గెనీస్ బుక్ లో ఎక్కేందుకని దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళ ప్రత్యేకత, 'ప్రపంచం లో అతి తక్కువ జీతం తీసుకున్నవాళ్ళు !' నిజమే ! ఇంతకన్నా తక్కువ జీతం వుంటుందా ?

2.  Delhi లో జ్యోతీ సింగ్ రేప్ కేస్ సృష్టించిన సంచలనం ఇపుడిపుడే ఫేడ్ ఔట్ అవుతూంది.  ఇదో టీ కప్పు లో తుఫాను లా మిగిలిపోకుండా ఇంకా చాలా సంస్థలూ, మహిళా హక్కుల గురించి పోరాడే వాళ్ళూ కృషి చేస్తూనే వున్నారు.  అయితే ఇది అంత ఈజీ గా మర్చిపోగలిగే సంఘటన కాదు.  పరిస్థితి హాలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. అంటే ముఖ్యంగా అవన్నీ మహిళల పై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చేసే దారుణ ప్రయత్నాలే.  ఇలాంటి అత్యాచారాలు ఎన్నో! ఎన్నెన్నో !  అయితే ఇంత ప్రజాగ్రహం, దానికి ప్రభుత్వ స్పందనా, మిగిలిన ప్రపంచాన్ని కూడా ఆశ్చర్య పరిచింది.   అయితే ఈ బడబాగ్నిని మన తో పాటూ ప్రపంచం మొత్తం పంచుకుంటూంది కాబట్టి ఈ 14th of February, 2013 న  ఇది చేస్తున్నారు.   ప్రపంచం లో వివిధ ప్రాంతాలో మహిళలు వివిధ రకాలు గా లైంగిక అణిచివేత కి గురవుతున్నారు.  కోట్లాది మంది రేప్ సర్వైవర్స్, బాధితులు ఆ ఒక్కరోజు వీధుల్లో చేసే ప్రదర్శన, పెద్ద మార్పు తేలేకపోవచ్చు. కానీ సమస్య ఎంత పెద్దదో, ఎంత హేయమైనదో, తెలియజేస్తుంది.  వాళ్ళలో కొందరికైనా న్యాయం జరుగుతుంది అని ఆశ.  కొడవటిగంటి కుటుంబరావు - 'చదువు' లో ఒక  పాత్ర అంటుంది.  "రామకోటి రాస్తే స్వరాజ్యం వస్తుందంటావా - ఆనందంగా రాస్తాను"  - అని.  (అంటే ఈ లక్ష్యం కోసం నాకు చేతనైనది నేను చేస్తాను' అని)  దీనికి సంబంధించిన వీడియో :

http://www.youtube.com/watch?v=gl2AO-7Vlzk


06/02/2013

హజార్ చౌరాసీ కీ మా

గోవింద్ నిహలానీ, జయా బాధురీ, నందితా దాస్, సీమా బిస్వాస్, అనుపం ఖేర్ లాంటి దిగ్గజాల సినిమా కాబట్టి తప్పకుండా చూడాలనుకుంటూనే ఆ సరైన 'సమయం ' (ఎటువంటి అడ్డూ ఆటంకాలూ లేని, మూడ్ ఉన్నపుడు, వీలున్నప్పుడు, మరీ ముఖ్యంగా ఇవన్నీ కలిసొచ్చినా, మతిమరుపు పరాక్రమించకుండా, టైం కి గుర్తు వచ్చి, వెతికి, దొరికి) వచ్చి, చూసానీ అత్భుతమైన సినిమా. ఆర్ట్ సినిమా అనొచ్చు.

1970 లలో బెంగాల్లో పుంజుకున్న నక్సల్బరీ ఉద్యమం, ఎందరో నవ యువకులని, చదువుకుటున్న విద్యార్ధులనీ, స్కాలర్లనూ, మేధావుల్నీ ప్రభావితం చేసింది. ఎందరో ఉత్తేజితులు, ఈ యజ్ఞం లో సమిధలయ్యారు. మార్క్సిజం, సోషలిజం, అవినీతి వ్యతిరేకత, సమానత్వం, లాంటి భావ విస్ఫోటనం ఎందర్నో అయస్కాంతంలా ఆకర్షించింది.  అయితే ఈ దారి ముళ్ళదారి.  భద్ర సమాజానికి నక్సలిజం ఒక చెంపపెట్టు. భూస్వామ్య వాదానికి నక్సలిజం అంటే పక్కలో బల్లెం.  నక్సలిజం ఒక ఐడియాలజీ.  అయితే సమాజపు వ్యతిరేకత, పోలీసు ఆక్షన్, కఠినమైన అణిచివేతల మధ్య ఇదో నివురు కప్పిన నిప్పులా రగులుకుంటూనే వుంటుంది.  70 వ దశకంలో నక్సలిజం ఇప్పటిలా కొత్త (ఆయుధ సంపత్తి) శక్తులు పుంజుకోలేదు.  కానీ ఎందరినో ఆకర్షించింది.  సాహసులెందరో అజ్ఞాతంగా పని చేసారు.  ఇంకా చేస్తూనే వున్నారు.  అదో భావజాలం.  స్వప్నం.  అలాంటి స్వాప్నికులెందరో అమరులైయ్యారు.  ఆ రోజుల్లో ఎందరో యువత ఇళ్ళలోంచీ అదృశ్యం అయ్యారు. తల్లీ తండ్రీ కళ్ళు తెరుచుకునే సరికే ఏ ఎంకౌంటర్లోనో కళ్ళు మూసారు. కొందరు ఆనవాలు లేకుండా పోయారు.  వాళ్ళు విప్లవ భావాల వైపు మళ్ళారన్న సంగతే తెలియని తలీ తండ్రీ విస్తుపోయలా చేసారు.  అలాంటి ఒక తల్లే ఈ హజార్ చౌరాసీ కీ మా.  'మహా శ్వేతా దేవి ' రచన ఆధారంగా గోవింద్ నిహలానీ తీసిన ఈ సినిమా తో జయా బాధురీ, తన  నట జీవితపు రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టడం జరిగింది.

బంగారం లాంటి భవిష్యత్తున్న కొడుకు. కాలేజీ లో గోల్డ్ మెడలిస్ట్. కుటుంబం లో అందరికన్నా భిన్నుడు.  తల్లికి అతనంటే ప్రాణం. తల్లి సుజాత చటర్జీ బాంకు ఉద్యోగిని. సౌమ్య వాది. భర్తనీ పిల్లల్నీ, చూసుకుంటూ, ఉద్యోగం తో పాటూ సంసార భాద్యతలు చూసుకుంటూ, పెద్దగా ఎదిరంచే తత్వం లేని మనిషి. అవమానాల్ని సాధారణ భారతీయ గృహిణి లా సహిస్తూ, చిర్నవ్వుతో 'పోనిద్దూ..' అనుకునే మనిషి.  'అమ్మా ! ఇవన్నీ ఎలా సహిస్తావు ?' అని వయసొచ్చిన కొడుకు ప్రతీక్ అడిగితే, స్నేహితురాలిలా.. 'ఏమో! చిన్నపుడు అలానే పెరిగాను. అదే అలవాటయిపోయింది, కొత్తలో బధ కలిగేది. ఇపుడు ఏమీ అనిపించదు !' అంటుంది సహజంగా.  ప్రతీక్, సుజాత కొడుకు. అమ్మ కూచి. ఇంట్లో మిగిల్న కుటుంబ సభ్యుల కన్నా, తండ్రికన్నా, అక్క చెల్లెళ్ళ కన్నా, అన్న కన్నా ఎక్కువగా 'మనసున్న మనిషి ' లా తల్లిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, స్నేహితుడిలా వుంటాడు.  అయితే ప్రతీక్ కాలేజీ లో కొందరు మితృలతో కలిసి సామ్యవాద భావజాలం వైపు నడవడం, అతని తండ్రికి నచ్చదు. అసలు మరిగే సూర్యుని లా వున్న ప్రతీక్ వ్యక్తిత్వం, అవినీతిపరుడైన తండ్రికి సహించదు. అందుకే తండ్రికీ, కొడుక్కీ దూరం.   'నిజం ' మాట్లాడతాడని, ఇంట్లో ఎవరికీ పడదు.


అయినా ప్రతీక్ చాలా మృదు స్వభావి. ఎప్పుడూ వికసించిన కమలం లా, నవ్వు మొహం విచ్చుకునే వుంటుంది. ప్రతి విషయాన్నీ, చాలా సరదాగా చెప్తూ, తల్లినీ, వొదిన్నీ నవ్విస్తూ ఉండడం, మామూలు ఆ వయసు కుర్రాళ్ళలా ఇంట్లో ఒక చలాకీ వాతావరణాన్ని సృష్టించడం, తల్లి తో అతని ప్రేమాస్పదమైన కమ్మ్యూనికేషన్, వాళ్ళిద్దరి మధ్యా ఉన్న అందమైన బంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది.  

అయితే ఒక రాత్రి సుజాత కి ఎందుకో ఇబ్బందిగా అనిపించి లేచి, నొప్పికి మందు వేస్కుని మళ్ళీ మంచం మీదకి చేరేసరికీ, ఫోన్ మోగుతున్న శబ్దం వినిపిస్తుంది.  ఫోన్ తీసేసరికీ - ఒక నిర్లక్షమైన గొంతు - 'ఎవరు మీరు ? ఇంట్లో మొగవాళ్ళెవరూ లేరా ? మీరు వెంటనే కామార్పకూర్ రండి, ప్రతీక్ ని గుర్తించాలి !' అని చెప్పి సుజాత జీవితాన్నే మార్చేసే దుర్వార్త ని చెప్తుంది.   ప్రతీక్ ఒక నక్సలైట్ అని, అతని శవాన్ని గుర్తించడానికి రమ్మంటున్నారనీ, ఆ పిచ్చితల్లికి చాలా సేపటి వరకూ అర్ఢమే కాదు.

ప్రతీక్ శవాన్ని గుర్తించడానికి కుటుంబ సభ్యులెవరూ రానే రారు. ఒక నక్సలైట్ తమ సోదరుడని, కొడుకని చెప్పుకోవడానికే సిగ్గు పడతారు. ప్రతీక్ ని గుర్తించడానికి వెళ్ళిన తల్లి కి - మార్చురీ లో ఒక నెంబర్ ఇస్తారు. అదే హజార్ చౌరాసీ - 1084.  అత్యంత దారుణమైన బాధ అనుభవించి చనిపోయిన అయిదు మృతదేహాల కాళ్ళకున్న నెంబర్ టాగ్ ల ద్వారా, తల్లి తన 1084 నెంబరు మృతదేహాన్ని సమీపిస్తుంది. తోటీ వాడు 'తల మాత్రం మూసేసి - మొహం ఏమి చూస్తారమ్మా ? అంటూ, తెల్లని బట్టని చాతీ దాకా తీసి చూపిస్తాడు. చాతీ మీద రెండు తుపాకీ గుళ్ళ గాయాలు చూసి, సుజాత నిశ్చేష్ట అవుతుంది.  మొహం గుర్తుపట్టలేంతంగా దెబ్బ తింది గాబట్టి, శరీరం పై ఇంకో ఆనవాలు అధారంగా ప్రతీక్ ని గుర్తిస్తుంది.  అంతే ! అతటితో ప్రతీక్ సమాప్తం అవుతాడు.  అతని మృతదేహాన్ని ఇవ్వరు పోలీసులు.  కనీసం దహన సంస్కారం కూడా తల్లిని చేసుకోనివ్వరు. మరుసటి రోజు పేపర్లో ప్రతీక్ చటర్జీ పేరు తప్ప చనిపోయిన మిగిల్న నలుగురి పేర్లూ ప్రచురిస్తారు. ప్రతీక్ తండ్రి ఆ వార్త బయటకి రాకుండా లంచాలిచ్చి ఆపుతాడన్నమాట. 

ఎందుకంటే, ప్రతీక్ నక్సలైట్ అంటే, ఇంటికి పరువు తక్కువ. ప్రతీక్ గదిని పోలీసులు సోదా చేసి, తన సాహిత్యాన్నీ, డైరీనీ, బానర్లనీ అన్నిట్నీ తీసుకుపోతారు.  డైరీ లో కవితలుంటాయి. అసలు ప్రతీక్ అంత చక్కని కవితలు రాస్తాడనే తెలియని సుజాత, డైరీ అన్నా ఇవ్వమని అడుగుతుంది. పోలీసు ఇన్స్పెక్టర్ నిష్కర్ష గా (నిర్దయ గా) అన్నిట్నీ తీస్కెళిపోతాడు.  ప్రతీక్  మృతి, సుజాత ని చాలా గాయపరుస్తుంది. ప్రతీక్, తన కి ప్రాణమైన బిడ్డ.. చనిపోయే ముందు వరకూ ఎలాంటి జీవితం గడిపాడు ? ఎలాంటి ఆలోచనలు చేసాడు ? ఎలా చనిపోయాడు ? తను ఎవరెవరితో తిరిగే వాడు ? .. ఎందుకలా చేసాడు ? ఇలా చాలా ప్రశ్నలు !  కోడలి ద్వారా ఒక సారి మాటల్లో ప్రతీక్ కి నందిని అనే స్నేహితురాలున్నట్టు తెలుసుకుంటుంది తను.  నందిని ని చూడాలని అనుకుంటుంది కూడా.    ఒక రకంగా తనకి అత్యంత సన్నిహితుడూ, స్నేహితుడూ అయిన కొడుకు 'నిజ జీవితాన్ని  గురించి తనకు తెలిసింది ఎంత తక్కువో తెలిసి నివ్వెరపోతుంది.   నొచ్చుకుంటుంది. ప్రతీక్ యాద్ధృచ్చికం గా తన పుట్టిన రోజునే చంపబడతాడు.   ప్రతీక్ కి ఎలాంటి ప్రమాదం వుందో తెలీని తను ఆ రాత్రి తను బయటికి వెళ్ళకుండా ఆపగలిగి వుంటే తన కొడుకు బ్రతికి ఉండేవాడా అని మధనపడుతూ ఉంటుంది.

ఈ అతి సాధారణ గృహిణి, "హజార్ చౌరాసీ కీ మా" అయిన తరవాత, కొడుకు మృతి తో తల్లడిల్లిన తల్లితనం, ఆమె లో ఉదయింపజేసిన వేల ప్రశ్నల కి సమాధానం వెతుక్కుంటూ, కొడుకు మృతి కి దారితీసిన పరిస్థితులని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. పరివర్తనం చెందుతూ వుంటుంది.  ఒక లాంటి షాక్ లో 'ఎవరికీ అక్కర్లేని ' తన కొడుకు ప్రతీక్ తిరిగిన లోగిళ్ళూ, తను మరణించిన స్నేహితుడు సోమూ ఇల్లూ.. అన్నీ చూస్తుంది.  వర్గ 'హింస ' కు బలైన ప్రతీక్, అతని స్నేహితుల కుటుంబాలు చిదరవందర కావడం, అన్ని చూస్తూ, తెలుసుకుంటూ, కొన్నాళ్ళకు నందిని ని కలిసి, ఆమె లో ప్రతీక్ వెలుగుల్ని చూస్తుంది.  ప్రతీక్ కలలూ, అతని ఆశయాలూ, పోరాటం, అన్నీ తెలుసుకుంటూ, పోలీసుల కౄరత ని సమీపం నుంచీ చూసింది కావడం తో ఒక లాంటి మెచ్యూరిటీ... గతం లో నే జీవించకుండా, భవిష్యత్తు వైపు నడవడం, అలా, ప్రతీక్ ఆశయాల కోసం, తన చేతనైన సాయం చేస్తూ, ఆ మార్గాన ప్రతీక్ కు మరింత చేరువవుతూ, వ్యార్ధక్యం లో తన జీవిత సార్ధకతని తెలుసుకుంటుంది.

రిటైర్ అయ్యాక, హ్యూమన్ రైట్స్ సెంటర్ లో పని చేస్తూ, ప్రతీక్ స్నేహితులతో కలుస్తూ, జీవితాన్ని ఒక అర్ధవంతమైన రీతిలో గడుపుతూంటుంది. ఎప్పుడూ ఎవర్నీ దేనినీ ప్రశ్నించని మనిషి - ముసలి వయసులో, ప్రతీక్ స్నేహితుడ్ని దుండగులు పట్టపగలు రోడ్ మీద కాల్చి చంపడం చూసి, రియాక్టయి, వయసునీ, అనారోగ్యాన్నీ లెక్క చెయ్యకుండా, వాళ్ళలో ఒకడ్ని అత్యంత సాహసోపేతంగా పట్టుకుంటుంది.  తను 'హజార్ చౌరాసీ కీ మా ' ! ప్రతీక్ తల్లి.  తను ఒక ఎక్సాంపుల్.

సినిమా లో 'సీమా బిస్వాస్' ది అత్భుత నటన. అత్యంత బీదరాలు. ప్రతీక్ స్నేహితుడు సోమూ తల్లి. ఆమె కళ్ళ ముందే స్నేహితులందరి హత్యా జరుగుతుంది. నందితా దాస్ ది తొలి పరిచయం.  పాటలు ఏమీ లేవు. కేవలం గుండెల్ని తాకే ఒక మధుర ఆలాపన. 70 ల లో కలకత్తా జీవితం, రిక్షాలూ, గలీలూ, బెంగాలీ ల ఫాషన్, సమిష్ఠి  కుటుంబ జీవితం, అన్నీ కాలం తో పాటూ మనల్ని వెనక్కి తీసికెళిపోతాయి.   సుజాత అంతఃసంఘర్షణ, ప్రతీక్ అప్ప చెల్లెళ్ళ, ఇతర కుటుంబ సభ్యుల 'స్వార్ధ చింతన ', ఒక లాంటి 'భోళా తనం ',  ఇన్ని వ్యతిరేక ధ్రువాల మధ్య - అమ్మా ! మీ కోసమే ప్రతీక్ ఇల్లు విడిచి వెళ్ళలేద'ని నందిని చెప్పిన నిజం,  ప్రేక్షకుల్ని కదిలిస్తాయి. 

స్పందించే మనసున్న ప్రతి మనిషినీ తాకే చిన్న కధ ఈ 'హజార్ చౌరాసీ కీ మా !'  చాలా నింపాదిగా చూస్తే గానీ పట్టుబడదు. ప్రస్తుతానికీ, గతానికీ మధ్య అల్లిబిల్లి గా సాగే కధనం - నటీ నటుల అత్భుత ప్రదర్శన, నక్సల్ వాదుల కుటుంబాల జీవితాల్లో కష్టాలని కళ్ళముందు పెడతాయి.  తన కొడుకు నక్సలైట్ అయినందుకు ఆ తల్లి గర్వపడదూ, చింతించదూ.. కేవలం అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.  అర్ధం చేసుకున్నాకా, కొడుకు ఆశయాల కోసం తనదైన దారిలో ముందుకు నడుస్తుంది. అంతే. ఇంత నిష్పాక్షికత సాధించడానికి ఎంత పరిణత కావాలి ? అది ఒక 'బిడ్డ ని  ఓ స్నేహితురాలి లా, మనస్పూర్థి గా' తెలుసుకున్న'  తల్లికే సాధ్యం.  తప్పకుండా చూడాల్సిన మంచి సినిమా. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నచ్చినవాళ్ళకి చాలా ఎక్కువ నచ్చుతుంది.