Pages

12/04/2019

Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 3

Part - 3


ఈ పుస్తకంలో శ్రీలంక చరిత్ర ని పూర్తిగా చర్చించండం జరిగింది. సింహళీయులు - తమిళులు మధ్య తగువు ఎలా మొదలయిందో వివరంగా రాసారు. శ్రీలంక చరిత్ర ప్రకారం శ్రీలంకీయులలో,  సింహానికి పుట్టిన సింహళులు కాకుండా హైనా సంతానం తరాచ్చులూ, కాకి సంతానం బలిభోజకులు, కుందేలు సంతానం లంబకన్నులు, నెమలి సంతానం మోరియాలూ ఉన్నారు.  సింహళులు, భారత దేశం నుండీ వెళ్ళగొట్టబడిన ఒక రాజు, తంబప్ని ప్రాంతంలో నాలుగో, ఆరో శతాబ్దంలో ఒక సిమ్హాన్ని వివాహం చేసుకోవడం ద్వారా జన్మించారు.  పైన చెప్పిన వివిధ జంతువులు ఆయా జాతులు ఆరాధించిన దేవతలు కావచ్చు. వీటికి ఆధారాలు ఏమీ లేవు. వారి పురాణ గాధల ప్రకారం కావచ్చు. ఉదాహరణ కి ఆంధృలు నాగులు అని ఒక థియరీ ఉంది. మహాభారత యుద్ధంలో నాగులు పాల్గొన్నారు. వారి సంతానమే ఆంధృలు  అంటారు. అలాగే వీళ్ళూ.  ఇప్పుడు ఈ సింహాలు తాము, తమిళుల మీదా, ఇతర తెగల మీదా ఆధిక్యం ప్రదర్శించడం - దానికి తిరుగుబాటు గా ప్రభాకరన్ పులులని ప్రతీక గా తీసుకుని బ్లాక్ టైగర్స్ ని తన జెండా గా మార్చుకోవడం, చరిత్ర.

నిజానికి డా. తమారా హెరాథ్ సింహళ మూలాలున్న బ్రిటిష్ వనిత.  అయినా తూకం ఎటూ బరువెక్కకుండా ఈ ఈలం పోరాటం తాలూకూ మూలాలనూ వేర్లనూ చక్కగా పక్షపాతం లేకుండా టైం, డేట్ లైన్లతో సహా వివరించారు.  సింహళాన్ని అధికార భాషగా తమిళుల మీద రుద్దడం ఇందులో ఒక భాగం.  సింహళ భాష రానివారికి ఉద్యోగాలు దొరకవు. బ్రతుకు తెరవు లేదు.  వివక్ష రూపాలనూ, నెమ్మదిగా మొదలయిన అసంతృప్తి తీవ్ర అసహనంగా రూపుదిద్దుకుని తీవ్రవాదం గా రూపాంతరం చెందడం ఇందులో కళ్ళకు కట్టినట్టు రచయిత్రి చెప్తారు.

 నిజానికి ఈలం అంటే అర్థం శ్రీలంకే.   తమిళ ఈలం అంటే శ్రీలంక లో తమిళ భాగం.  శ్రీలంక యొక్క తమిళ పదం 'ఈలంకై' కు మరో రూపమే ఈలం. భాషా ప్రాతిపదికన శ్రీలంక సమాజం చీలిపోవడానికి బ్రిటీషు వారి 'విభజించు పాలించు' సూత్రమే కారణం. అది రాను రానూ తమిళు ల పై వివక్ష, అత్యాచారానికీ. వారి తిరుగుబాటు కూ, మరిన్ని వ్యధలకూ కారణమయింది.  ఈ ఈలం పోరాటం 1970 లలోనే మొదలయింది.   

ఈ ఉద్యమంలో స్త్రీల ప్రవేశం, పిల్లల ప్రవేశం, మరణాల ద్వారా తగ్గిపోతున్న దళ సంఖ్యని పెంచడానికి పనికొచ్చేది. పైగా అణిచివేత, వెలివేత, ఉన్న ఊర్లనుండీ, ఇళ్ళ నుండీ   మాన ప్రాణాలు దక్కించుకుంటూ పారిపోతూ, జాఫ్నా, వన్ని లాంటి ఊర్లలో తల దాచుకున్న కుటుంబాలూ, చెట్ల కింద కుల మత, వర్గ భేధాలు లేకుండా కమ్యూన్ల మాదిరి బ్రతుకుతూ కలగలుపుకున్న స్నేహాలు, చెల్లా చెదురయిన బ్రతుకుకు, ఆగిపోయిన చదువుకూ, అత్యాచార బాధితులకూ, అందరినీ కోల్పోయిన అనాధలకూ ఎల్.టీ.టీ.యీ ఆశ్రయం ఇస్తూ అక్కున చేర్చుకోవడం మొదలయింది.  

ఇళ్ళలో పెద్దవారు ప్రభాకరన్ గురించి, అతని దళం గురించీ అబ్బురంగా  చెప్పుకోవడం, ప్రభాకరన్ ప్రదర్శించే నైపుణ్యమైన పెద్దన్న తరహా లక్షణాలు, మెరిసే బూట్లూ, పులిచారల యూనిఫాం, చేతిలో తళుక్కుమనే తుపాకీ, మెడలో రక్షణ కోసం ఉండే సైనేడ్ - ఇవన్నీ పెద్ద ఆకర్షణలు. ఇంకే భవిష్యతూ లేని తరానికి ఈ వాలంటీరింగ్ తప్ప వేరే దారి లేదు. అలా అని ప్రతీ అత్యాచార బాధితురాలూ ఈలం పోరాటంలో చేరినట్టు కాదు. ప్రతి ఆత్మాహుతి దాడి జరిపిన మహిళా,  అత్యాచార బాధితురాలు కాదు. కానీ ఎక్కువ సార్లు ఇదే జరిగింది.  వారిని బ్రెయిన్ వాష్ చేయడం సులభం. ఇదో ఆబ్లిగేటరీ ఆల్ట్రూయిస్టిక్ సూయిసైడ్. 

పైగా తమిళులపై జరిగిన అకృత్యాలలో భాగంగా గాంగ్ రేప్ లకు గురయిన మహిళలకు తమ శరీరం అపవిత్రం అయిందనీ, ఆత్మాహుతి దాడి ద్వారా దాన్ని పునీతం చేసుకోవచ్చనీ, (అగ్నిప్రవేశం) లేదా ఇలా ప్రతీకారం తీసుకోవచ్చనీ కొన్ని భావాలు అప్పటికే పాతుకుపోయి ఉండేవి.  తమని ప్రత్యక్షంగా అతిక్రమించిన వ్యక్తుల మీద ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా ఈ పతనానికి కారణమైన నేతల మీదా, వ్యవస్థ మీదా ప్రతీకారం తీసుకోవడం ద్వారా సమాజానికో సందేశం ఇవ్వడానికీ  బెల్టు బాంబు ఉపయోగపడేది. 

పైగా ప్రభాకరన్ దళంలో అత్యాచార బాధితులని తక్కువగా చూడడం, తక్కువ కులాల వారిని వివక్ష తో చూడడం అలాంటివేవీ లేకపోవడం, బయట సమాజం కన్నా దళంలో దొరికిన సమానత్వం, గుర్తింపూ, బంధనాలూ వారిని ఎక్కువగా ప్రభావితం చేసేవి.  ఇలా అగ్ని పునీతం అవ్వడం లాంటి ఎల్.టీ.టీ.యీ తరహా నమ్మకాలు మత పరమైన బ్రెయిన్వాషింగ్ కి ఉపయోగపడ్డాయి.   

ఎల్.టీ.టీ.యీ లో అందరు దళ సభ్యులూ ఏదో రకం బాధితులే.  అందరూ అన్నా, అక్కా, అలా వరసలు కట్టి పిలుచుకుంటూ ఒకే కుటుంబం లా ఉంటూండే వారు.  పురుషులదో గ్రూప్, మహిళలది వేరే గ్రూప్.  వారి మధ్య ఇంటరాక్షన్ తక్కువ. గెలుపు సంబరాల్లో కూడా ఎక్కడా స్త్రీ పురుషులిద్దరూ కలిసి నృత్యం చేసిన ఆనవాళ్ళు లేవు. మహిళలు వేరే గా, పురుషులు వేరే గా సంబరాలు చేసుకునే వారు.  ఒక వేళ స్త్రీ పురుసుల మధ్య ప్రేమ తలెత్తితే, వారి పెళ్ళి బయటి సమాజం లొ లానే జరిగేది. తమిళుల విలువల ప్రకారం, అబ్బాయి అమ్మాయి దళ కమాండర్ కు తన ప్రేమ విషయం చెప్పి అనుమతి కోరాలి.  అమ్మాయికి ఈ సంబంధం అంగీకారం అయితేనే పెళ్ళి జరిగేది. పెళ్ళయే దాకా వారు ఎప్పుడూ కలుసుకోనే కూడదు అనే నియమం తో.  

పైగా ప్రభాకరన్, మాలథి (మాథి) ల పెళ్ళయే దాకా, దళంలో పెళ్ళి ని, ప్రేమలనూ నిషేదించారు.  అవి దళ సభ్యులను లక్ష్యానికి దూరం చేస్తాయేమో అని భయపడ్డారు.   పెళ్ళి, పిల్లలూ, ఝంఝాటం తమకు వద్దనుకున్నారు.  కానీ ప్రభాకరన్ మాలతి ని కిడ్నాప్ చేసి తమిళ నాడు లో ఉంచి పెళ్ళి చేసుకోవడం పెద్ద కధ.  ఆయన వివాహం తరవాత దళ సభ్యుల్లో ప్రేమ పెద్ద ఆక్షేపణ కాలేదు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి ఇష్టప్రకారమే జరిగేది. అమ్మాయి ఇష్టపడకపోయినా, సమయం కోరినా ఆమె మాటకు పూర్తి విలువ ని ఇచ్చేవారు. మహిళలు సాధికారంగా ఫీల్ అవడానికి ఈ నియమం ఎంతగానో పనిచేసింది. తమ పట్ల ఇంత మానవత్వంతో వ్యవహరించే దళం వారికి కుటుంబం కన్నా ఎక్కువ అయ్యేది. 

సాధారణం గా దళంలోకి రిక్రూట్మెంట్ ద్వారా గానీ వాలంటరీ గా గానీ [ఆడ, మగ] పిల్లలు, మహిళా సభ్యులు 16 లేదా అంత కన్నా చిన్న వయసులోనే చేరేవారు. ఒక లక్ష్యంతో ఆధర్శం తో చేరే వారు. వారికి పెళ్ళి పెద్ద లక్ష్యం కాదు. చాలా మంది పెళ్ళి కి ఇష్టపడలేదు కూడా. పెళ్ళి చేసుకుంటే, బయటి సమాజంలో లాగే తమ స్త్రీపాత్ర ని పోషించండానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు.    

తీవ్రవాదం లోకి మహిళలని మతపరంగా ఆకర్షించడం పాలస్తీనా లో ప్రయత్నాల గురించి తెలుసుకున్నాం కదా. యాసర్ అరాఫత్ పిలుపు ను అందుకుని రంగంలోకి దూకిన మహిళలని "ఆర్మీ ఆఫ్ రోజెస్" అన్నారు.  'దారీ అబూ ఆయెషా' అనే మహిళ ఇద్రిస్ తరహాలో కాకుండా పక్కా ప్రణాళిక తో, వీడియో రికార్డింగ్ తో సహా మొదటి అధికారిక ఆత్మాహుతి దాడి కి పాల్పడ్డాకా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ నుంచీ 2003 లో ముగ్గురూ, హమాస్ నుండీ 2004 లో ఒకరూ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.  

హమాస్ కు చెందిన మత గురువు షేక్ యాసిన్, కొరాన్ లో స్త్రీలు ఇలాంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకూడదని ఎక్కడా లేదనీ, వారు భేషుగ్గా పాల్గొనచ్చనీ ప్రకటించి గేట్లు బార్లా తెరిచాడు.  2004 లో 14 జూన్ న 'రీం రియాషీ'  అనే మహిళ, ఒక భార్య, తల్లి, బామ్మ,  అన్ని బాధ్యతలూ ఉన్న మహిళ హమాస్ తరఫున మొదటి ఆత్మాహుతి దాడికి పాల్పడి చరిత్ర సృష్టించింది. అంటే, బాదరబందీలు లేని, సమాజానికి భారమయ్యే విధవల్లాంటి వారే (వర్త్ లెస్) తీవ్ర వాద దాడి చేయక్కర్లేదు. అందరూ ఆహ్వానితులే అని దీనర్ధం. 


పైగా దీనికో మత విశ్వాసం కూడా తోడ్పడింది.  నలుగురిని చంపుతూ ఇలాంటి దాడిలో పొందిన వీర మరణం తరవాత దొరికిన స్వర్గంలో సర్వ సుఖాలతో పాటూ, ఒక మంచి భర్త లభించడం, తద్వారా 70 మంది బంధువులని కాపాడబడడం లాంటి బోనస్ లు కూడా ఉంటాయిట. దీని అర్ధం నాకూ తెలీదు. కానీ ఇలాంటి మత విశ్వాసం ద్వారా, మరణానంతరం, అందరికీ సాయపడగలగడం, భర్త కి సేవ వగైరాల ద్వారా మళ్ళీ బాధ్యతలని స్వీకరించడం ద్వారా స్త్రీ త్యాగధనం మరింత పెంచే ప్రయత్నం జరిగినా.. అదో నైతిక ధర్మం అన్నట్టు జరిగిన మీడియా ప్రచారం, మధ్య ప్రాచ్యంలో మహిళలు విస్తృతంగా బాంబ్ బెల్టులను ధరించేలా ఆయుధాలు చేపట్టగలిగేలా చేసింది. 

Notes :

కోరా లో ఎ.టీ.టీ.యీ మహిళా బ్రిగేడ్ ల గురించీ, మహిళా సభ్యుల పాత్ర గురించీ విస్తృత వ్యాసం. 

ఆర్మీ ఆఫ్ రోజెస్ -  Yasser Arafat మహిళలను తమ దేశంకోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడమంటూ  వారిని తన 'ఆర్మీ ఆఫ్ రోజెస్' గా అభివర్ణించినప్పుడు వచ్చిన  అనుకోనంత గొప్ప రెస్పాన్స్, వఫా ఇద్రిస్ దాడి, మరణం.. చక చకా జరిగిపోయాక,  వేలాదిగా మహిళలు పాలస్తీనా పోరాటంలోకి దిగడం ఒక చారిత్రాత్మక మలుపు.


Shiek Yassin of Hamas












10/04/2019

Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 2

Part - 2


సాధారణంగా పురుషాధిక్య సమాజంలో స్తీ కి వుండే వర్త్ లెస్ నెస్.. లేదా విలువ లేకపోవడం తీవ్రవాదంలో కూడా కనిపిస్తుంది. మాస్కో థియేటర్ దాడిలో కేవలం మహిళా ఉగ్రవాదుల శరీరాలకే  బాంబు బెల్టులు కట్టి ఉన్నాయి. దీని ద్వారా స్త్రీ విలువ, పురుషుని కన్నా తక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది.  పైగా ఆయా తీవ్రవాద పోరాటాల్లో ఆత్మాహుతి దాడికి ఎంచుకోబడిన స్త్రీలు, సాధారణంగా విధవలూ, పిల్లలు లేని వారు, పెళ్ళి కాని వారూ.. అలా బాధ్యతలూ, బంధనాలూ లేని వారిలోంచీ వుండేవారు. రాను రాను, పిల్లలున్న తల్లులు కూడా ప్రాణ త్యాగానికి సిద్ధపడటం మొదలయింది.  

జనవరి 2002 లో యాసర్ ఆరాఫత్ దృష్టి మగ "షహీద్" ల నుంచీ మళ్ళి మహిళా "షహీదా"ల పైకి, ఆత్మాహుతి దాడుల ద్వారా వారు ఉద్యమానికి చేయబోయే సాయాన్ని అత్యంత ప్రభావవంతంగా గ్లోరిఫై చేయడాన్ పట్లా మళ్ళింది.  వాళ్ళ త్యాగనిరతి ని హైలైట్ చేస్తూ,  ఈ పనుల ద్వారా వారు సాధించిన సమానత్వాన్నీ, ప్రదర్శించిన నిస్స్వార్ధత నీ, ముఖ్యంగా 'స్త్రీ జీవితం' తాలూకూ బాధ్యత నీ, గుర్తు చేస్తూ వాళ్ళని ప్రభావితం చేసేలా మారింది పాలస్తీన్ ఉద్యమం. 

అయితే తీవ్ర వాదంలో ఎల్.టీ.టీ.ఈ సాధించిన ఘనత ఏంటంటే, స్త్రీలని తీవ్రవాదంలోకి ఆకర్షించడం ద్వారా, చాందసవాద తమిళ శ్రీలంక సమాజంలో స్త్రీ ల పాత్రని మార్చి, తీవ్రవాదంలోనూ, బయట సమాజంలో కూడా స్త్రీల దృక్పథం మారడంలోనూ, వాళ్ళని కుల వర్గ ఆర్ధిక అంతస్తుల బేధాలు లేకుండా కలిసి పని చేసేలా చేసి,  శ్రీలంక సమాజం లో మార్పు తీసుకురావడం. కొన్ని  పురుషాధిక్య భావాలున్నా, సెక్సువల్ హెరాస్మెంట్ లేని, కుటుంబ వాతావరణం కల్పించడం ద్వారా, తమిళ మహిళా పులులు పూర్తి అంకిత భావంతో పని చేసేందుకు అనుగుణమైన వాతావరణాన్ని అందించడం.

ఇక్కడ పాలస్తీనా మహిళా తీవ్రవాదం లోకి వస్తే, 2000 లో 'ఆల్ అక్సా ఇంతిఫదా' తరవాత తమ బ్రతుకులు దుర్భరం అయ్యాయని వాళ్ళ కంప్లైంట్. వాళ్ళ లక్ష్యం (soft target) ఎప్పుడూ సాధారణ ప్రజలు, పౌర సమాజం, వీరి మీద ఆత్మాహుతి దాడి సులభం, ఖరీదు 150 అమెరికన్ డాలర్ల కన్నా చవుక.  పైగా మహిళలకు ఒక గుర్తింపు కల్పించడానికి ఒక ఆయుధం.  రెఫ్యూజీ కాంప్ లలో బ్రతుకు తిప్పలు, అష్ట కష్టాలూ పడుతూ (దీనికి ఒక సొల్యూషన్ లేదు.. బహుశా జీవితాంతమూ ఆ కేంప్ లోనే బ్రతకాలి)  తమ జీవితంపై అన్ని హక్కులూ గల సోదరుల, తండ్రుల, భర్తల, కొడుకుల నిర్ణయాలపై ఆధారపడుతూ బ్రతికే బ్రతుకు కూ, తమకు కాస్తో కూస్తో సాధికారతని ఇచ్చేదీ అయిన తీవ్రవాదం వైపు వారు సులువుగానే మళ్ళారు., ఈ విలువే లేని బ్రతుకు లో  చైతన్యం కోసం కొందరు ఉగ్రవాదం కోసం వస్తే, 'హమాస్',  'ఇస్లామిక్ జిహాద్' లు వారి ని తమ తమ స్వార్ధం కోసం సపోర్ట్ చేయడం,  'ఆల్ అస్కా మార్టిర్స్' సంస్థ పూర్తి లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడమూ చేసి పూర్తి తోడ్పాటుని అందించాయి. 

సాయుధ, ఆత్మాహుతి యుద్ధంలోకి స్త్రీలను ఆరాఫత్ అధికారికంగా ఆహ్వానించిన రోజు 27 జనవరి 2002 నే 'వఫా ఇద్రిస్' అనే మహిళ, రెడ్ క్రీసెంట్ ఉద్యోగి, డిపార్ట్మెంటల్ స్టోర్ లోకి తన హాండ్ బాగ్ లో బాంబ్ ని తీసుకు వెళ్ళి పేల్చడం ద్వారా, ఒకరి మృతికి, 100 మంది ఇజ్రాయిలీలకు గాయాలకీ కారణం అవుతుంది.  'ఆల్ అక్సా బ్రిగేడ్' ఈ దాడికి బాధ్యత వహించింది. కానీ దాడికి ముందు సాధారణంగా పాలస్తీనియన్ తీవ్రవాదులు విడుదల చేసే వీడియో మెసేజ్ ఏదీ ఇద్రిస్ ఇవ్వలేదు.  కాబట్టి, ఆమెకు దాడి గురించి తెలియనే తెలియదనీ, ఆమెను ఒక పావులా గా వాడుకున్నారనీ ఆరోపణలు వచ్చాయి.  మొన్న కాష్మీర్ లో సీ.ఆర్.పీ.ఎఫ్ పైన జరిగిన దాడిలో తీవ్రవాది విడూల చేసిన వీడియో మెసేజ్ చూసే వుంటారు. అది ఒక ప్రొఫెషనల్ హాక్.  దాడి చేయడం ఎవరైనా చేస్తారు. ప్రచారం పొందడం ముఖ్యం కదూ.  అసలు తీవ్రవాదం లక్షణమే, భయాందోళనలకు గురి చేయడం.  [తానేదో మంచిపనినే చేస్తున్ననన్న నమ్మకంతో].  

వఫా మరణాన్ని గ్లోరిఫై చేసి ఆమె శ్రద్ధాంజలి లో  వఫా బలిదానం ద్వారా, పాలస్తీనా జాతీయోద్యమం లో మహిళల పాత్రకి గౌరవాన్ని తెచ్చిపెట్టినట్టు ప్రచారం జరిగింది.  ఆమె మరణం ఒక అత్యత్భుతమైన హీరొఇజం ని కళ్ళెదుట నిలిపినట్టు, మహిళలు కూడా ఇలా ఆత్మ బలిదానాలు చేయడం ద్వారా జాతి విముక్తి త్వరలోనే కలుగుతుందనీ, నమ్మకం కలిపించే ప్రచారం జరిగింది. 

ఇక్కడ తమిళ పులుల పోరాటంలో రేప్ బాధితులు - దాడుల ద్వారా, తమ శరీరాలు పవిత్రమైనట్టు భావించడం, వారికి వివిధ మాధ్యమాల ద్వారా దొరికిన సెన్షేషనల్ గుర్తింపూ, మీడియా రిపోర్ట్ లు అలాంటి పని చేసిన మహిళల మీద వివిధ  కధనాలు ప్రచారం చేయడం ద్వారా వారికి దొరికిన పేరు, పరువూ, ఖ్యాతీ,  ఈ మార్గంలోకి లాక్కొచ్చాయి.   అయితే ఇంత త్యాగం చేస్తున్నా, ఇంత సాహసం చేస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క తీవ్రవాద సంస్థ లోనూ, ఉదాహరణకి Urugvayan Tupamaros Revolutionary Group, Salvadorian Farabundo Marti Front for National Liberation, Nicaraguan SandivistasChinese Red Army, వగైరా ఎందులోనూ మహిళలకు తగిన రాంకులలో సమనత్వం, పై స్థాయి నాయకత్వ స్థానమూ దొరకననే లేదు.  దీనిని బట్టి వాళ్ళని పూర్తిగా పని దోపిడీ కి గురి చేసారన్న సంగతి , వాడుకున్నారు అన్న విషయం తెలుస్తుంది. వీటిల్లో LTTE


నయం.


Notes : 












09/04/2019

Women in Terrorism, Case of the LTTE - Tamara Herath



Part - I 

Netflix లో బోడీ గార్డ్ అని ఒక సిరీస్ ఉంది.  ఇంగ్లీష్ డ్రామా.  సరే. దీన్లో ఒక ముస్లిం మహిళ మొట్ట మొదటి ఎపిసోడ్ లోనే, తన చాందసవాద టెర్రరిస్ట్ భర్త కారణంగా బ్రెయిన్ వాష్ చేయబడి,  వళ్ళంతా బాంబ్ లు కట్టుకుని, ట్రెయిన్ లో వొణికిపోతూ హీరో కి కనిపిస్తుంది.  ఒక్క బటన్ నొక్కగానే విధ్వంసం సృష్టించగల క్షణాన, హీరో ఆమెతో మాట్లాడి, భయాన్ని పోగొట్టి, మెల్లగా ఆమె బాంబ్ ను పేల్చకుండా ఆపగలుగుతాడు.  ఇరవయ్యీ పాతిక కూడా మించని - బహుశా టీనేజ్ అమ్మాయి లా వుండే ఈ అతి భయస్తురాలు సిరీస్ అంతా చెమట్లతో, వొణికిపోతూ, భయపడిపోయి, తికమక పడుతూ పెడుతూ, ప్రేక్షకుల జాలి ని అంతా గాలన్ల కొద్దీ తాగేస్తూ... ఉండగా చివరాఖరికి ఈమే టెర్రరిస్టు అనీ, పెద్ద ఇంజనీరనీ, బాంబులు చిటికెన వేలు తో తయారుచేయగల సమర్ధురాలనీ, వగైరా తెలుస్తుంది.  అంతవరకూ ఆమె మీద జాలి పడిన ప్రేక్షకుడు షాక్ అవుతాడు. భయపడతాడు. నివ్వెరపోతాడు. ఈ పాత్ర పోషించిన నటి  "మొదట చేయననుకున్నాను గానీ, తరవాత ఈ పాత్ర చాలా శక్తివంతంగా అనిపించి,   Empowering గా అనిపించీ చేసానని" ఒక ఇంటర్వ్యూ లో చెప్తుంది.  పాత్ర పేరు 'నాదియా'. భయంకరమైన ఉగ్రవాది. అంత సున్నితమైన, పువ్వు లాంటమ్మాయి, మనుషుల ప్రాణాలంటే లెక్క లేని పిచ్చి మనిషి అనీ, అమాయకులని నిష్కారణంగా చంపేందుకు, అదీ, అత్యంత ఘోరంగా.... వెనకాడదనీ తెలుసుకున్నాక చాలా బాధనిపిస్తుంది. సరే.. ఈ పిల్ల కి తీవ్రవాదం ఎంపవరింగ్ గా అనిపించడం (పాత్రకూ, పాత్ర ధారికీ) చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి, ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

ఇరాక్ సిరియాల్లో ఐసిస్ మీద యుద్ధం ఓ కొలిక్కి వచ్చేలా అనిపిస్తూ, కలుగులోంచీ వందలాదిగా తీవ్రవాదులూ, ఇల్లూ, పొల్లూ, దేశమూ, సొంత జీవితాన్నీ విడిచిపెట్టి తీవ్రవాదులకి సాయం చేయడానికీ, పిల్లల్ని కనడానికీ వరసకట్టి వెళ్ళిన వివిధ దేశాల ఐసిస్ పెళ్ళికూతుర్లూ, ఐసిస్ విధవలూ, వారికి పుట్టిన, పుట్టి, గిట్టిన పిల్లల గురించీ కూడా విరివి గా వార్తలు వస్తున్నాయి. భవిత గురించి వాళ్ళ ఐడియాలూ, యెమనీ యజీదీ మహిళల సాక్షాలూ, వారిని తిరిగి సమాజం లోకి ఆహ్వానించడానికి జంకే దేశాలూ.. ఇవన్నీ తీవ్రవాదంలో మహిళల పాత్ర ఇలా కూడా ఉండటం,  ఇంటర్ నెట్ ద్వారా యువతులని ఆకర్షించి, సిరియా దాకా తీసుకొచ్చి, వాళ్ళని భార్యలుగా కుదిర్చడం, పెళ్ళిళ్ళు చేయడం, వారూ దీనికి సిద్ధపడీ, ఇష్టపడీ, బురఖాలు ధరించి, సామూహిక హత్యల్ని నిర్లిప్తంగా చూస్తూ, ఏదో 'మంచి పని చేసేస్తున్నట్టు నమ్మడం, వారి మానసిక స్థితీ, భవిష్యత్తూ.. తల నొప్పులన్నీ పక్కన పెడితే, అసలు తీవ్రవాదం ఎలా మహిళల్ని శక్తివంతం చేస్తుంది - సమాజికంగా, ఎమోషనల్ గా.. అనే ప్రశ్న ఎవరికైనా ఎదురవుతుంది.

కొన్ని సమాజాల్లో మరీ ఎక్కువగా, కొన్నిటిలో తక్కువగానూ మహిళలు అసహజమైన అసమానత ని ఎదుర్కొంటారు. వారికి  ఇష్టపడిన వారిని పెళ్ళాడే హక్కు లేదు. ఇష్టం లేనివాడిని వొద్దనే హక్కు లేదు.  చదువుకునే హక్కు లేదు. ఉద్యోగం చేసే హక్కూ లేదు. వారు కేవలం వస్తువులు. తండ్రీ, సోదరుడూ, భర్తా, కొడుకూ.. వీళ్ళ చేతుల మీదుగా బ్రతకాల్సిన బానిసత్వం చాలా మామూలు విషయం. మతం కూడా వీలైనంత తొక్కి పారేస్తుంటుంది. సాంప్రదాయం, ఆచారం, పద్ధతీ, ముఖ్యంగా శీలం, ప్యూరిటీ, పవిత్రత.. ఇవన్నీ మేకులై శిలువ కొట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తీవ్రవాదం నిన్నూ ఓ మనిషి గా గుర్తించి నీ బ్రతుక్కీ ఓ లక్ష్యం ఉంది.. నువ్విలా కా.. నువ్విది చెయ్యు.. నువ్వు చేయగలవూ.. ఇలా ప్రోత్సాహకరంగా ఉంటూన్నపుడు స్త్రీలు ఆకర్షితులవుతారు. పైగా దీని వెనక ఏవో ఆదర్శాలూ, మత పరమైన గుర్తింపూ దక్కేటప్పుడు. వగైరా వాదనలు, థియరీలను ఈ పుస్తకంలో చక్కగా చర్చించారు.

తమిళ పులుల గుర్నించి ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం అనితా ప్రతాప్ రాసిన"ఐలాండ్ ఆఫ్ బ్లడ్" చదివాక, ఎల్ టీ టీ ఈ గురించి ఒక పుస్తకం చదవడం ఇన్నాళ్ళకి ఇప్పుడే.   అనితా ప్రతాప్ తమిళ సింహళుల మధ్య ఈ యుద్ధం ఎందుకు జరిగిందో రాసినట్టు గుర్తు లేదు. కానీ ప్రభాకరన్ ఒక్కో సాటి తమిళ తీవ్రవాద, మిత వాద, అతివాద బృందాలనీ, లీడర్లనీ మట్టు పెట్టుకుంటూ వస్తూ, భయంకరం, భయానకమైన హత్యలు చేసి, తమిళ, సింహళ సమాజాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ, ఒక ప్రభంజనం లా ఎలా తెరమీదకొస్తాడో రాసారు. అయితే, అప్పటికి తమిళ ఈలం కోసం పోరాటం జరుగుతూండేది.  అనిత శ్రీలంక లో పర్యటించినపుడూ, తొట్ట తొలి గా ప్రభాకరన్ ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ గా నిలిచినప్పుడూ.. ఆ సమయాల్లో ఆమె ముందే ఎన్నో హత్యలు జరిగాయి. భీభత్సాన్ని కళ్ళారా చూసారావిడ.  కూడళ్ళలో, లాంప్ పోల్ ల దగ్గర కట్టేసి, తుపాకీతో కాల్చి చంపేసిన మనుషుల శవాలని చూసారావిడ.  భయాందోళనలు సృష్టించడమే ప్రభాకరన్ యూ ఎస్ పీ.. చివరికి ఈ అతి తీవ్రవాదమే, రాజీవ్ గాంధీ ని హత్య చేయడానికీ, ఆఖరికి తానూ మట్టుపడిపోవడానికీ దారి తీసింది.

Women in Terrorism Case of the LTTE ని ఒక మహిళ Tamara Herath  ఇంత సమర్ధవంతంగా రాయడం, తాను చెప్పే ప్రతీ వివరానికీ, రిఫరెన్సు, ఫుట్ నోట్సూ ఇవ్వడం.. టైం మెషీన్ మీద రైడ్ లా అనిపించాయి.  రాజీవ్ హత్య సమయంలో మేము ఫ్రంట్ లైన్, తెలుగులో కాబోలు అచ్చయ్యే ఇండియా టుడే లాంటి మేగజైన్ లని ఎంతో ఆసక్తి గా చదివే వాళ్ళం.  శ్రీలంక నుండీ పోటెత్తే తమిళ శరణార్ధులూ, వారి పై తమిళ రాజకీయాలూ అవీ చాలా ఆశ్చర్యం కలిగించేవి.  అయితే, వయసూ, అజ్ఞానం అదేదో మనకి సంబంధించిన విషయం కాదనుకోవడమూ.. అవన్నీ గుర్తొచ్చాయి.  తమిళ శరణార్ధులు, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి,  ప్రభాకరన్ మరణం తరవాత ఈలం మాటే లేకుండా ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించడం. పెరిగిన టూరిజం.  ఇదీ ఈ నాటి వాస్తవం.  కానీ ఒకప్పుడు అత్యంత అధిక సంఖ్య లో మహిళలూ, పిల్లలూ పనిచేసిన తీవ్రవాద సంస్థ ఈ ఎల్ టీ టీ ఈ.  రాజీవ్ హత్య లో చనిపోయిన, ఆత్మాహుతి దాడి చేసిన  తీవ్రవాది కూడా ఒక మహిళే. తీవ్రవాదులకు - వారు ఏ ప్రాంతానికీ, దేశానికీ, సంస్కృతికి చెందిన వారైన  ఒక కామన్ వర్క్ కోడ్ ఉండటం, తాము ప్రచారం పొంద దలచిన దాడులని, ముఖ్యంగా దళాన్ని ఉత్తేజితం చేసే ఎన్ కౌంటర్లనూ, ఆత్మాహుతి దాడులనూ వీడియో గ్రాఫ్ చేయడం - అదే వారి డిజిటల్ సిగ్నేచర్ కావడమూ,  చీకట్లో, తమిళ నాడు లో ఓ మారుమూల చిద్రమై చనిపోయిన రాజీవ్ హత్య కేసు ను సాల్వ్ చేయడానికి ఈ కేమెరాలే ఆధారం కావడమూ కాకతాళీయాలు.


మహిళ లని ఆయుధాలుగా వాడటం, వారి శరీరాలని ఆత్మాహుతి దాడుల కోసం వాడుకోవడమూ, అలా ఉద్యమం కోసం పనికిరాగలగడంలో తమ శక్తి ని ఉపయోగించడం వల్ల మహిళ శక్తివంతంగా ఫీల్ కావడం గురించి రక రకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది బ్లాక్ విడోస్ ఆఫ్ చెచెన్యా అనే మహిళా తీవ్రవాద సంస్థ.  రష్యా ఆక్రమణ లో అణగదొక్కబడిన చెచెన్లు విప్లవం లేవదీసినప్పుడు 1994 లోనే మహిళలు, ముఖ్యంగా ఉద్యమ ప్రభావితులైన విధవలు, తమ ఆత్మల్నీ, శరీరాల్నీ,  విప్లవం కోసం అంకితం ఇచ్చి, తిరుగులేని ఖ్యాతిని, తమ త్యాగం ద్వారా బహుశా స్వర్గం లో స్థానాన్నీ సంపాదించారు.

విధవా జీవితం లో పనికిరాకపోవటమనే నిరాశక్తికరమైన, దుర్భర, విలువ లేని జీవితాన్ని గడపడం కన్నా విప్లవం కోసం, దేశం కోసం, ఒక ఆదర్శం కోసం చనిపోవడమే మేలు అని తలిచిన చెచెన్ మహిళలు, బహుశా మొట్ట మొదటి మహిళా తీవ్రవాదులు.   1994-96 దాకా జరిగిన పోరాటంలో మహిళలు, ఆత్మాహుతి దాడుల్లో విస్తృతంగా పాల్గొనడం జరిగింది. కేవలం 2004 లోనే మహిళలు 12 ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.  అక్టోబర్ 2002 లో మాస్కో లో అత్యంత దారుణమైన థియేటర్ ముట్టడి లో పాల్గొన్న తీవ్రవాదుల్లో కేవలం 16 ఏళ్ళ అమ్మాయి కూడా ఉండటం చాలా బాధాకరం.  చెచెన్ ఆత్మాహుతి మహిళా దళాల స్పూర్థి ని పాలస్తనైసేషన్ గా కొట్టి పడేసారు కానీ నిజానికి పాలస్తీనా మహిళలే చెచెన్ మహిళల నుండీ స్పూర్థి పొందారు.  ముస్లిం మహిళలు గా చెచెన్ సోదరీమణులు చేసే సాహసాలను, త్యాగాలనూ మమ్మల్నీ చేయనివ్వండీ అంటూ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు ఉత్తరం రాసారు.

- ఇంకా వుంది.


Notes :

LTTE

Anita Pratap  :  Prabhakaran ను ఇంటర్వ్యూ చేసిన మొదటి జర్నలిస్ట్.   ఈమె పుస్తకంలో మహిళల పట్ల ప్రభాకరన్ సంస్కారవంతమైన ప్రవర్తన నీ, తమిళ పులుల విలువల గురించీ రాసారు.   ఈలం కోసం జరిగిన పోరాటంలో ప్రభాకరన్ ఎంతటి ఘోరాలకు పాల్పడినా, అతను గానీ, అతని సంస్థ లో సభ్యులు గానీ సిమ్హళ మహిళల పైన అత్యాచారాలకూ, అకృత్యాలకూ పాల్పడిన ఆధారాలు / కధనాలూ లేవు.  ఆఖరికి చివరి ఈలం పోరాటం తరవాత శ్రీలంక సైనికులు మాత్రము తమిళ మహిళలని చంపే ముందు అత్యాచారం చేసి, తీవ్రంగా అవమానించి, చిత్రవధలు చేసి చంపినట్టు, ట్రక్ లలోకి స్త్రీల నగ్న మృతదేహాలను గుట్టగా  విసిరేస్తూ.. "ఆమె ఇంకా కామంతో నిట్టూరుస్తుంది చూడు", " ఈమె కు ఇంకా కావాలంట !"  అని నవ్వుతూ  అంటూన్న శ్రీలంక సైనికుని వీడియో, చానెల్ 4 డాక్యుమెంటరీ లో చూడొచ్చు.

హమాస్ :  పాలస్తీనా కు చెందిన (తీవ్రవాద ) సంస్థ

Black Widows of Chechnya :  చెచెన్యా లో మహిళా తీవ్రవాదుల సంస్థ. షహీదా అనే పదానికి గుర్తింపు తెచ్చిన మొదటి సంస్థ

Grozny

Moscow Theater Seize 

The Hindu Article  :  ఈ పుస్తకం గురించి ఒక పరిచయం.  ఎంపవర్మెంట్ భ్రమల గురించి.