Pages

06/12/2010

నథ్థా & రూప్ కన్వర్

నిన్నే జీ టీవీ లో అమీర్ ఖాన్ మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పాడని 'పీప్లీ లైవ్ ' చూసాను. నచ్చింది. పీ.సాయినాధ్ ద హిందూ లో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల గురించి రాస్తున్నప్పుడు - ఆసక్తి గా (విరక్తి గా కూడా) ఫాలో అయిన ప్రాణం నాది. ఒక సమయంలో వెల్లువెత్తిన రైతు ఆత్మహత్యల బాక్ గ్రౌండ్ లో నథ్థా అనే ఒక పేద రైతు, కాంపెన్సేషన్ కోసం ఆత్మహత్య చేసుకుందామని నిశ్ఛయించుకుంటాడు. ఆ తరవాత, ఓ వైపు ఎన్నికలు ముంచుకు రావడంతో సమీకరణాల పోటీల్లో, టీ ఆర్ పీ ల వేట లో మీడియా, రాజకీయ నాయకులూ వెంటబడటం, ఆ రైతు కుటుంబం పడిన పడరాని పాట్లూ - నవ్వు తెప్పిస్తాయి. కరిస్తే కప్పకు కోపం, విడిస్తే .. అన్నట్టయిపోతుంది. బర్ఖా దత్ (రాడియా ఉదంతంలో ఖంగు తిన్నది) లాంటి ఒక పాత్ర, అందులో ఒదిగిపోయిన నటి మొహంలో 'తప్పంతా నీదే!' అనే ఎక్స్ప్రెషనూ - ముఖ్యంగా నచ్చాయి.


మొత్తానికి ఆత్మహత్య చేసుకుంటాడని ఆ రైతు గురించి పొగ గుప్పుమనడంతో గ్రామం లో జాతర మొదలవుతుంది. సరిగ్గా ఈ పాయింటు దగ్గర మార్క్ టుల్లీ రాసిన 'నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా !' గుర్తొచ్చింది. ఇందులో 1987 లో దేశాన్ని ఒక కుదుపు కుదిపిన రూప్ కన్వర్ సతీ ఉదంతం గురించి టుల్లీ సవివరంగా చెప్పాడు. విలేఖరి కున్న విశాలమైన దృక్కోణంతో ప్రత్యక్షంగా చూసి, చదివి, వినీ, అనుభూతించి సవివరం గా రాసిన ఒక చాప్టర్ ఈ సతి.

రూప్ కన్వర్ సతీ సహగమనం జరిగినప్పుడు అత్తింటి వాళ్ళు, రూప్ కన్వర్ తనంతట తానే స్వచ్చందంగా తన భర్త పార్ధివ శరీరంతో సహా తగలబడి చనిపోయిందని, ఇది గ్రామస్థులందరి సమక్షం లోనూ, తేట తెల్లంగా జరిగిన విషయం అనీ, ఘంటాపధంగా చెప్తారు.

రూప్ కన్వర్ సతి సంగతి, కన్న వారికి చెప్పనే లేదు. గ్రామం అంతా కూడబలుక్కుని ఒక 18 ఏళ్ళ అందమయిన రాజపుత్ మహిళ ని, సతి అనే దురాచారానికి బలి చేసారని కన్న వారి ఆరోపణ.

సతి జరిగిన కొన్ని రోజుల తరవాత, సతీ రూప్ కన్వర్ సజీవంగా తగలబడిపోయిన ప్రదేశంలో ఒక గుడి లాగా తయారవుతుంది. ఇప్పుడు మన ప్రాంతాల్లో వివిధ స్త్రీ ల పేర జరిగే జాతర లాగా - అక్కడ పెద్ద యెత్తున జాతర, వ్యాపారం మొదలవుతాయి.

గ్రామస్థులంతా ఈ వ్యాపారాభివృద్ధికి సంతోషించాలా, పోలీసుల, విలేఖరుల ప్రశ్నా శరాఘాతాలనించీ కాసుకోవాలా అన్న మీమాంశలో పడినట్టు కనిపిస్తారు.

రచయిత థీరీ ప్రకారం, రాజపుత్ కులస్తులు, సతీ జరగడంతో తమ ప్రతాపాల కీ, ఆచారాలకీ ఆదరణ దొరికిందని గర్విస్తారు. మార్వారీలు, వ్యాపారం పెరిగిందని ఆనందిస్తారు. ఇలా గ్రామంలో ఒక్కో కులానిదీ ఒక్కో బాధ !

పీప్లీ లో ఆఖర్న నథ్థా, గ్రామం వొదిలి పారిపోయి, డిల్లీ లో భవన నిర్మాణ కూలీ గా తేల్తాడు. అతని తోటి వాళ్ళందరూ, గ్రామాలు వొదిలి వలస వచ్చిన వ్యవసాయ కూలీలే. రైతులే ! వ్యవసాయం లో ఒడిదుడుకులని ఎదుర్కోలేక, విధాన పరమైన చిక్కుల్ని ఓర్చుకోలేక, డబ్బులేక, ఎందరో రైతులు వ్యవసాయాన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకోలేకపోతున్నారు. వ్యవసాయాన్ని మనం ఎంత నీర్సంగా తీసుకుంటున్నామో చూడండి.


రూప్ కన్వర్ సతీ లో కూడా వీధి మొగలో ఐస్ క్రీం బండీ వాడి దగ్గర్నించీ, రాజీవ్ గాంధీ దాకా, దీని వల్ల మనకేంటి ప్రయోజనం - మనకేంటి భంగం - అని ఆలోచిస్తారు తప్ప - చివరాఖరికి రూప్ కన్వర్ సంగతి / ఆవిడకి జరగాల్సిన న్యాయం సంగతి కూడా ఎవరికీ పట్టదు.

రూప్ కన్వర్ ని బలవంతంగా చంపేశారా / బ్రెయిన్ వాష్ చేసారా / ఆవిడ మానసిక స్థితి బాలేదా - ఎందుకలా చనిపోయింది ? గ్రామం మొత్తం కలిసి నేరస్థులా ? ఇలాంటి ప్రశ్నల కి సమాధానం ఎప్పటికీ దొరకదు.

రూప్ కన్వర్ శీలం మీద పనిలో పని గా కధలు వినిపిస్తాయి. పోలీసులు - చంపేశారనే అంటారు. కానీ, ఈ నేరం మీద అత్తవారిని అరెస్టు చేస్తే, గ్రామంలో ఆ మారణ కాండని చూసిన వారు, ప్రోత్సహించిన వారు, మూఢ నమ్మకం ముసుగులో గ్రామానికి రాబోయే పాప్యులారిటీ ని కేష్ చేసుకోదలచుకున్నవారూ - అందర్నీ అరెస్టు చెయ్యాలి.

రాజస్థాన్ ప్రభుత్వానీ, డిల్లీ గద్దెనూ, రూప్ కన్వర్, చచ్చి చాలా సాధిస్తుంది. కానీ అన్యాయమయిపోతుంది.

నథ్థా కూడా అంతే ! అతని కుటుంబానికి నథ్థా మిగలడు. ప్రభుత్వం నుంచీ రావలసిన సహాయమూ అందదు. మీడియా జాతరంతా, ఇంకో బ్రేకింగ్ న్యూస్ వెంబడి పరుగు తీసి పీప్లె ని ఖాళీ చేసేస్తుంది. ఎలక్షన్లు ముగియడంతో, పీప్లీ నుండీ నాయకులూ, పోలీసులూ కనుమరుగవుతారు. ఇంత కాలమూ ఈ సర్కస్ ని అంతా చూసిన గ్రామం, గ్రామస్థులూ, మళ్ళీ తమ తమ జీవితాల్లో నిశ్శబ్దంగా మునిగిపోతారు.

అయితే, ఇలాంటి సినిమాలూ, వ్యాసాలూ, పట్నాల్లో సుఖంగా పరుగులు తీస్తున్న మామూలు మధ్యతరగతి భారతీయుల్ని, ఒక సారలా తట్టి ఊరుకుంటాయి. రాజస్థాన్ లో ఇప్పటికీ బాల్య వివాహాలూ జరుగుతున్నాయి. ఇప్పటికీ సతీ సహగమనాలు జరుగుతున్నాయి (ట!) కానీ వాటిని గ్లోరిఫై చెయ్యడం - రాజకీయ కారణాల దృష్ట్యా తగ్గింది. టెలివిజన్ లో మాత్రం - సాంప్రదాయ కుటుంబాల్లో, సాంప్రదాయాలూ, ఆచారాలూ పాటించే, (నార్థ్ ఇండియన్) స్త్రీ ల దుఃఖ భరిత జీవితాన్ని గ్లోరిఫై చేస్తూనే ఉన్నారనుకోండి.

ఇంకా రైతులూ, చేనేతాజీలూ, వెధవది - టామిళ్ నాడ్ లో తిరుపూర్ గామెంట్స్ లో పంచేసే టెక్స్టైల్ కార్మికులూ - అందరూ - ఇలా ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఆత్మహత్య చాలా సంధర్భాల్లో - ఒక ఆక్రందన ! 'నాకు హెల్ప్ కావాలీ' అని - వ్యక్తి అరిచే ఒక అరుపు ! దాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు ? కొందరు రా.నా.లు 'వొళ్ళు బలిసి ఆత్మహత్యలు చేసుకుంటున్నార్రా ఈ రైతులు ! ' అని కోప్పడేస్తారు.

సరేలే ! అదంతా మనకెందుకు గానీ.. చెప్పొచ్చేదేంటంటే - మార్క్ టుల్లీ రాసిన -'No Full Stops in India చదవండి. ఇండియా గురించి మనకేటి తెల్సంటారు ? ఒక పాలి చదివితే తెలిసొస్తాది.

కాపోతే కుంజెం ఓల్ద్ హిస్టరీ. అంటరాని వర్గానికి చెందిన తన నౌఖరు ఊర్లో జరిగిన పెళ్ళి దగ్గర్నించీ, కుంభ్ మేళా, అతి పెద్ద మొదటి టెలీ సోప్ - రామాయణం, స్వర్ణ దేవాలయం, సతీ సహగమనం.. ఇలా దేశాన్ని ప్రభావితం చేసే ఉదంతాల - ఇంకో కోణాల్ని చర్చించారిందులో.

ఫాస్ట్ బీట్ జర్నలిజం ఉండదిందులో ! మనకి నచ్చేవీ, మనం వినాలనుకునేవీ కాకుండా, మనకి తెలియనివీ, మనం ఊహించనివీ, (అన్నీ తెల్సినవే), మన దేశంలో పాతుకుపోయిన బ్యూరాక్రసీ, నిష్కృయాప్రియత్వాన్నీ, ప్రజల పాట్లనీ హాస్యస్ఫోరకంగానూ, వ్యంగ్యంగానూ, కావాల్సిన చోట్ల, సీరియస్ గానూ చెప్తాడు మార్క్ టుల్లీ. మన దేశం గురించి ఒక బీ.బీ.సీ. వోడు ఎంత బయాస్డ్ గా చెప్తాడో అనుకునే వాళ్ళకి ఆశ్చర్యం కలిగి తీరుతుంది - ఆ నిజాయీతీకి, భారత దేశం మీద ఆయనకున్న ప్రేమకీ !