Pages

14/04/2024

UN Peace Operations - Maj Gen (Dr) AK Bardalai (Retd)

గడిచిన రెండేళ్ళూ,  ఐక్యరాజ్యసమితి కి  కష్టకాలం. ప్రపంచాన్ని కుదిపేసి వదిలిన  మహమ్మారి తగ్గుముఖం పట్టగానే యుక్రెయిన్ మీద రష్యా 22 ఫిబ్రవరి 2022 న దాడి కి నిర్ణయం తీసుకుంది. ఆయుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.  ప్రపంచం ఎన్ని ఆక్రందనలు చేసినా పట్టించుకున్న నాధుడు లేడు. ఈ లోపు ఆఫ్రికా లో ఐక్యరాజ్యసమితికి చెందిన మాలీ మిషన్ (UN Multidimensional Integrated Stabilization Mission in Mali - MINUSMA)  ను దేశం వదిలి వెళ్ళాల్సిందిగా మాలి కోరింది. కాంగో కూడా ఏడాది చివర్లోగా మెల్లగా తప్పుకోవాల్సింది గా  చెప్పేసింది. (UN Organization Stabilization Mission in the Democratic Republic of the Congo (MONUSCO).  

ఇది చాలదన్నట్టు 7 అక్టోబర్ 2023 న హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసింది. ఇజ్రాయిల్ ఎదురుదాడి ఎలాగూ ఒకరు ఆపగలిగేవిధంగా లేదిప్పుడు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు శాంతి  స్థాపక మిషన్ లు  ఇరుకున పడ్డాయి. అవి  UNTSO, UNDOF, UNIFIL. ఇవన్నీ పాలస్తీనా శాంతి ప్రక్రియ మీద ఆధారపడినవే. పాలస్తీనా లో పరిమిత యుద్ధం ఇప్పటికయితే ఆగేటట్టు కనిపించడం లేదు.  అసలు ఈ యుద్ధాలలో, మారుతున్న ప్రపంచ రాజకీయాలలో, గాజా లో అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ఈ పరిమిత యుద్ధం ఎన్నాళ్ళు పరిమితంగా ఉండగలుగుతుందో, పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా ఉండడానికి  ఐక్యరాజ్య సమితి, Israel లో ప్రస్తుతం పనిచేస్తున్న  దాని అనుబంధ సంస్థలు United Nations Truce Supervision  Organization (UNTSO), UNDOF (United Nations Disengagement Observer Force), UNIFIL (United Nations Interim Force in Lebanon (UNIFIL), అసలు ఏమి చేస్తున్నాయో తెలుసుకుందాం.  సమితి నిర్దేశించిన ఆపరేషన్లు ఎలా ఈ పెద్ద పెద్ద పోరాటాలలో  అసలు ఎలా పనికొస్తున్నాయో / పనికి రాకుండా పోతున్నాయో కూడా ఓ సారి ఆలోచించాలి.  

మిడిల్ ఈస్ట్ రాజకీయాలలో పాలస్తీనా సమస్య ఈ మూడు మిషన్ లనూ  కలుపుతుంది. అసలు ఈ మూడు సంస్థలూ ఎలా ఏర్పడ్డాయో, వాటి చరిత్ర, పాలస్తీనా తో వాటి అనుబంధమూ ఏమిటో మొదట చూద్దాము. 

UNTSO (United Nations Truce Supervision  Organization) : 

29 మే 1948 అరబ్ - ఇజ్రాయిల్ యుద్ధానంతరం ఇజ్రాయిల్, తన ఇరుగు దేశాలయిన ఈజిప్ట్, జోర్డన్, లెబనాన్, సిరియా లతో మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఏర్పడిన సంస్థ ఇది.  పాలస్తీనా భూభాగంలో "ఇజ్రాయిల్"  ఏర్పడుతున్నట్టు బ్రిటన్ 11 మే 1948 న ప్రకటించగానే ఈ "అరబ్ - ఇజ్రాయిల్  యుద్ధం",  పాలస్తీనా కి మద్దతుగా  మొదలయింది. ఈ యుద్ధం ఐక్యరాజ్యసమితి military observers జోక్యంతో ముగిసింది. అలా UNTSO మొట్టమొదటి శాంతి స్థాపక బృందంగా 29 మే 1948 న ఏర్పడింది.  ఇజ్రాయిల్ తో నాలుగు పొరుగు దేశాలూ కొట్టుకుని చచ్చిపోకుండా శాంతి కోసం జరిగిన ఒప్పందాలని సరిగ్గా అమలు జరిగేలా చూసే బాధ్యత UNTSO  పైన పడింది. అయితే 1978 లో UNTSO పరిశీలకులు రెండు గ్రూపులు గా ఏర్పడ్డారు. Observer Group Golan (OGG), Observer Group Lebanon (OGL).  ఈ గ్రూపులన్నీ సమన్వయంతో పనిచేస్తూ వస్తున్నాయి. ఈ పీస్ కీపింగ్ మిషన్ లలో భారత సైన్యం చాలా ఏళ్ళుగా మిలిటరీ, నాన్ మిలిటరీ భాగస్వామ్యం కలిగి ఉంది. ముఖ్యంగా సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో గోలన్ హైట్స్ వద్ద నేపాల్, భారత్ సైన్యాలు వంతుల వారీగా పరిశీలకులుగా పనిచేస్తున్నాయి.  


UNDOF (United Nations Disengagement Observer Force)  :

ఇది కూడా పాలస్తీనా భౌగోళిక నైసర్గిక రాజకీయాల పరిణామాలతో ముడిపడిన అంశాలను ఆధారంగా చేసుకుని మొదలయిన సంస్థ. గాజా పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడుల కు ప్రతీకారంగా 1956 లో పాలస్తీనా ఫిదాయీన్ దాడులు జరిగాయి. వీటి అనంతరం ఇజ్రాయిల్, ఈజిప్ట్ బంధాలు తీవ్రంగా చెడిన తరవాత,  ఈజిప్ట్ సూయెజ్ కెనాల్ లో ఇజ్రాయిల్ కదలికల్ని కట్టడి చేసింది. ఈ కట్టడి టిరాన్ స్ట్రైట్ లో కూడా తీవ్రతరం చేసింది. ఇది సూయెజ్ కాలువ సమస్యని అంతర్జాతీయ సమస్య గా మార్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ రహస్యంగా సూయెజ్ కాలువ ను తమ స్వాధీనంలోకి తీసుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. 29 అక్టోబర్ 1956 న ఇజ్రాయెల్ ఈజిప్ట్ సరిహద్దుల్ని దాటొచ్చి ఈజిప్ట్ పై దాడి మొదలుపెట్టింది. దానికి మద్దతుగా 31 అక్టోబర్ న ఉత్తరాన్నుంచి బ్రిటన్, ఫ్రాన్స్ లు ఈజిప్ట్ ని చుట్టుముట్టాయి. ఈ పరిణామాల అనంతరం United Nations Emergency Force ని ఏర్పాటు చేసారు.  

ఇదిలా వుండగా ఈజిప్ట్ ఇజ్రాయిల్ పై సూయెజ్ కాలువ పొడుగునా తిరుగుదాడులు మొదలు పెట్టింది. అటు సిరియా సేనలు  1973 అక్టోబర్ 6 న గోలన్ పర్వతశ్రేణుల పై ఇజ్రాయిల్ పోస్ట్ లపై దాడులు  మొదలు పెట్టాయి. ఈ యుద్ధం ముగిసాక, సిరియా, ఇజ్రాయిల్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 1974 లో జరిగింది. దీని అమలును పర్వవేక్షించేందుకు UNDOF ఏర్పడింది.అయితే దీనిలో  సైనికుల బృందాలుంటాయి. వీటి పాత్ర,  ఆయుధాలని Self-Defence కు  ఉపయోగించడానికే పరిమితం.  


UNIFIL (United Nations Interim Force in Lebanon (UNIFIL) : 

ఇది మూడో శాంతి స్థాపక మిషన్. ఇది ఇజ్రాయిల్, లెబనాన్ ల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు ఏర్పడింది. ఇది కూడా పాలస్తీనా కు లెబనాన్ మద్దతు ఇవ్వడం వల్ల ఏర్పడిందే. ఇజ్రాయిల్ స్థాపన ప్రకటన వెలువడ్డాక, అప్పటి దాకా పాలస్తీనా భూభాగం లొ ఉండిన "యూదులు కాని ప్రజలనందరిని"  వెస్ట్ బాంక్, గాజాలకు నెట్టేసారు.  ఈ ఉదంతం కారణాన  వేలాది పాలస్తీనియన్లు లెబనాన్ కు శరణార్ధులై పారిపోయారు. లెబనాన్ లో సివిల్ వార్ తరవాత PLO (Palestine Liberation Organization) దక్షిణ లెబనాన్ లో  బలం పుంజుకుని ఇజ్రాయిల్ మీదికి దాడులు మొదలు పెట్టింది. ఇజ్రాయిల్ తిరగబడి లెబనాన్ ని స్వాధీనం చేసుకునేందుకు మార్చ్ 1978 లో ప్రయత్నించింది. అప్పుడే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని, యుద్ధాన్ని ఆపి, దక్షిణ లెబనాన్ లో UNIFIL  ను స్థాపించింది.  అయినాసరే ఇజ్రాయిల్ 5 జూన్ 1982 న ఇంకోసారి,  హిజబొల్లా ఎత్తుకెళ్ళిన తన సైనికులను విడిపించేందుకని లెబనాన్ పై దాడి చేసి ముఖ్యంగా బీరూట్, దక్షిణ లెబనాన్ లలో PLO టార్గెట్ లను నాశనం చేసింది. ఇక్కడ అతి పెద్ద యుద్ధం జూలై 2006 న మొదలై 34 రోజుల పాటు సాగింది. 

ఇప్పటికీ దశాబ్దం పాటు యుద్ధం లాంటిదేదీ జరగక పోయినా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF), హిజబొల్లా ల మధ్య శతృత్వం బాగానే బలపడింది.  లెబనాన్ ఆర్ధికంగా చిక్కిపోయినా సరే పెరిగిన హిజబొల్లా ఆధునికీకరణ, దాని కొత్త ఆయుధ సాంకేతిక సంపత్తి, ఇజ్రాయెల్ ను  బాగా ఇరుకున పెట్టే విషయం.  హిజబొల్లా విజయం అంతా లెబనాన్ ప్రభుత్వానికీ, లెబనాన్ ప్రజానీకానికీ కేవలం తను మాత్రమే ఇజ్రాయిల్ దాడుల్నిండీ లెబనాన్ ని రక్షించగలదు అనే భావనను కలిగించడం పైనే ఆధారపడి ఉంది.  పాలస్తీనా కు మద్దతు ఇవ్వడం హిజబొల్లా ఉనికికి కీలకం కాబట్టి పాలస్తీనా ని ఘోరంగా అణిచేయడానిని నియంత్రించగల సత్తా హిజబొల్లాకు ఎంతోకొంత ఉందని ఇజ్రాయిల్ కు గుర్తుంటుంది. .  

ఈ మూడు సంస్థలూ ప్రస్తుతం గాజాకు మాత్రం పరిమితమైన యుద్ధం నాలుగువైపులా విస్తరించకుండా ఇకపై  ఎలా ప్రభావితం చేయగలవో చూడాలి. 

GAZA WAR : 

UNTSO, UNDOF, UNIFIL లు పాలస్తీనా సమస్య ఆధారంగా ఏర్పడినవే కాబట్టి, పాలస్టీన్ లో జరిగే ఘటనల ప్రభావం ఈ సంస్థల మీద ఖచ్చితంగా ఉంటంది.  గాజాలో పరిణామాల నేపధ్యంలో మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న అనిశ్చితి నుండీ లాభపడాలని చూసే దేశాలూ బాగానే ఉన్నాయి. యుద్ధం నుండీ గడించాలని చూసే వాళ్ళు దానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు ఇస్తారు.  గాజా మండిపోతుంటే ఆ మంటలలో చలికాచుకునే దేశాలున్నాయి. కాబట్టి ఈ యుద్ధానికి, మారణహోమానికీ మద్దతూ ఎక్కువగానే ఉంది. ఈ సమస్యకి  పరిష్కారం  దౌత్య పరంగా చిక్కాల్సిందే.  ఈ రెండు దేశాల మధ్యా ఇంత విపరీతమైన తరతరాలనాటి చారిత్రక శతృత్వం ఉన్నప్పుడు, ప్రతీకారేచ్చతో ఇరు వర్గాలూ ఊగిపోతున్నప్పుడు ఈ యుద్ధం శాంతియుతంగా ముగుస్తుందనుకోవడం అసాధ్యం.  కాకపోతే, ఈ యుద్ధం పెద్దదవడం, పాల్గొనబోయే దేశాలు ఎక్కువవడం, అగ్రరాజ్యం కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా చేరాల్సి రావడం లాంటివి జరగడం, ప్రపంచానికి మంచిది కాదు.   

అయితే ప్రణాళిక ప్రకారం జరిగే 2006 నాటి లెబనాన్ యుద్ధం, 2023 అక్టోబర్ హమాస్ దాడులు, వంటి Political గా ప్రేరేపింపబడిన దాడులను ఆపడం సాధ్యం కాదు.  Wimmen and Wood for Crisis Group పరిశీలన ప్రకారం, లెబనాన్ గానీ,  UNIFIL గానీ హిజబొల్లా ని నియంత్రించగలిగే స్థితిలో లేవు. అయితే ఇలాంటి పరిమిత స్థాయి యుద్ధాలలో సూత్రధారులు ఇతర శక్తుల్ని కూడా పాల్గొనేలా రెచ్చగొట్టే విధానాలకు దిగుతున్నప్పుడు వివిధ లౌక్య విధానాల ద్వారా వాటిని ఆపడం అవసరం. ఈ పనులు చెయ్యడానికి UNTSO, UNDOF, UNIFIL లు పనికొస్తాయి. అయితే, సరిహద్దుల్లో ఈ సంస్థలు  ఉన్న ప్రాంతాల పరిసరాల్లో దాడులకు దిగడం, బ్లూ లైన్ లలో పౌరులు సైతం నిరసన ప్రదర్శనలు చెయ్యడం రెచ్చగొట్టే విధానాల కిందికే వస్తాయి.   ఇవి సులువుగా పరిస్థితులు దిగజారడానికి కారణం కావచ్చు.  గాజా మద్దతు దారుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. నిజానికి ఈ మద్దతుదారు దేశాలు పాలస్తీనా లో విపరీతమైపోతున్న మారణహోమాన్ని ఆపేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తాయి. ప్రతీకాత్మక దాడులని అయినాసరే చేస్తాయి. 

యుద్ధవాతావరణం, దాడుల పరిస్థితులు,  శాంతి స్థాపక సంస్థల పనులను తీవ్రంగా దెబ్బతీస్తాయి. For eg, హమాస్ దాడుల అనంతరం UNDOF   పరిశీలకులను ఇజ్రాయెల్ ఎటూ కదలనివ్వలేదు.  ఒకవేళ ఈ ఉద్యోగులు క్షేత్ర స్తాయి లో జరిగేది తెలుసుకోవాలన్నా కూడా విచక్షణారహిత దాడులు వారి జీవితాల్ని కూడా ప్రమాదంలో పెడుతున్నాయి.  అయినప్పటికీ UN ఇజ్రాయిల్ లో చాలా మటుకు ఉద్రిక్తతల్ని నివారించిది. 

ఉదాహరణకు ఇజ్రాయెల్ లో "డ్రూజ్ కమ్యూనిటీ" ది ఒక ప్రత్యేక స్థానం. వీళ్ళు అరబ్బులే అయినా తమను తాము పాలస్తీనియన్లు అనుకోరు. వీరి విధేయత యూదుల వైపు ఉంటుంది. సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇరువైపులా వీళ్ళు ఉంటారు. హమాస్ దాడుల అనంతరం, సిరియా వైపు ఉన్న డ్రూజ్ లు అందరూ ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించారు. వాళ్ళ ఆవేశాలు ఎంత పెల్లుబికాయంటే, సిరియాలో తామున్న ప్రాంతం ఇజ్రాయెలైస్ చేయాలనుకున్నారు కూడా. ఇది సిరియా కు ప్రమాదకరం కాబట్టి,   UNDOF ఈ స్థానిక ఉద్రిక్తతని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది.  డ్రూజ్ ల పై దాడులు జరుగుతాయన్న భయాలనూ UNDOF చూసుకుంది వీటి వల్ల ఇంకో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. 

UNIFIL విషయానికొస్తే దక్షిణ లెబనాన్ లో సరిహద్దు గ్రామాల్ని ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ప్రాంతాల్లో హిజబొల్లా, IDF లు విపరీతంగా కాల్పులు, Shelling జరుపుకున్నాయి. ఇక్కడ కూడా UNFIL బోల్డన్ని సమావేశాలు జరిపి కాల్పుల్ని ఆపించింది.  యుద్ధం లో జరిగిన బోల్డన్ని అన్యాయాల్నీ, హత్యల్నీ విచారించేందుకు ఈ బృందాలకు చోటు చిక్కట్లేదు. కీలకమైన సహాయక బృందాలే దాడుల్లో దుర్మరణాలు చెందుతున్నప్పుడు, జవాబుదారీతనం లోపించిన సైన్యాల ఉద్రిక్తతల మధ్య హిజబొల్లా నూ, IDF  నూ శాంతపరిచి ఆ ప్రాంతాలలో యుద్ధాన్ని ఆపడం చిన్న విజయం ఏమీ కాదు. అయితే ప్రస్తుతం లెబనాన్, ఇజ్రాయిల్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినా సరే అవి రెండూ పూర్తిస్థాయి యుద్ధం చేయడానికి మాత్రం ఇష్టపడడం లేదు. హమాస్ ని నిర్మూలించేసేందుకని కంకణం కట్టుకున్న ఇజ్రాయిల్ హిజబొల్లా చేతుల్లో పడి తన దృష్టిని మళ్ళించుకోవాలనుకోవట్లేదు.  

అటు ఉత్తరాన సిరియా లో UNDOF ద్వారా కూడా హిజబొల్లా ని వెనక్కు తగ్గమని చెప్పించే ప్రయత్నం జరిగింది.  ఇదే సమయంలో  సిరియా సరిహద్దుల్లో  UNDOF లోని పరిశీలకులుగా  పెద్ద యెత్తున ఉన్న ఫ్రాన్స్ దళాలు  కూడా, ఇజ్రాయెల్ యుద్ధం సిరియా సరిహద్దులకు విస్తరించకుండా ఆపేందుకు ఒక కారణం. తన స్నేహితులైన ఫ్రాన్స్ సైనికుల ప్రాణాలకు హాని కలిగించి, అంతర్జాతీయంగా తన స్థానాన్ని బలహీనపరుచుకోవడం ఇజ్రాయిల్ కు మంచిది కాదు. కాబట్టి నెతన్యాహూ యుద్ధోన్మత్తత కు ధీటు గా,   సరిహద్దుల్లో వివిధ స్నేహపూర్వక దేశాల సైనికులతో నిండిన  UN దళాలు వారి భూభాగాలలో physically ఉండడం వల్ల యుద్ధం మొత్తం గాజా కే పరిమితం అయింది. ఇజ్రాయెల్ వ్యతిరేక సరిహద్దు దేశాల ఉద్వేగమైన బదుళ్ళను UN సంస్థలు పరోక్షంగా నియంత్రించిన కారణంగా ఇజ్రాయెల్ యుద్ధ విస్తరణ రెండు సరిహద్దులలో ఈ విధంగా  నిలువరించడం జరిగింది.    అతిశయోక్తి అనుకోకపోతే,  ఒకరకంగా ఈ యుద్ధం ఓ మోస్తరు ప్రపంచ యుద్ధం కాకపోవడానికి, UNDOF, UNIFIL, UNTSO ల Lobbying, బాక్గ్రౌండ్ వర్క్  తప్పకుండా పనికొచ్చింది. 


ఇది పెద్దస్థాయి యుద్ధం కాకపోవడానికి లెబనాన్, ఇజ్రాయిల్, సిరియా ల సందిగ్ధత తో పాటు   "ఇది ఈ రీజియన్ కు మంచిది కాదన్న భావన"  కూడా కారణం.    ప్రస్తుతం గాజా యుద్ధం విషయం లో  అమెరికా తప్ప ఇజ్రాయెల్ కు ప్రపంచ దేశాల మద్దతు పెద్దగా ఏమీ లేదు. గోలన్ పర్వత శ్రేణుల్లో సిరియా సరిహద్దులకు సమీపంలోకి రష్యా సేనలు చేరడం  ఇజ్రాయెల్  సిరియాను గట్టిగా వ్యతిరేకించే సాహసం చేయకపోవడానికి ఇంకో ప్రధాన  కారణం. అంటే ఉదాహరణ కు UNDOFకు ట్రూప్స్ ని ఇచ్చే ఫ్రెండ్లీ దేశాలు (TCC -Troop Contributing Countries) ను ఇబ్బంది పెడితే, వారిపై దాడులకు దిగితే  అంతర్జాతీయంగా ఏకాకై పోవడం తప్పదు. ముఖ్యంగా ఆ UN Peace Keeping సైనికుల మాతృదేశాలు బలవంతమైన  రాజ్యాలైతే మరీనూ. దీన్ని బట్టి శాంతి స్థాపక బృందాలు యుద్ధాల్ని ప్రభావితం చేయగలవన్నది స్పష్టం అయింది. 

హిజబొల్లా కూడా నోరు మూసుకోవడానికి చాలా వరకూ UNIFIL ప్రెసెన్స్ కారణం. హమాస్ డెప్యూటీ నాయకుడు 'సలె అల్ అరౌరీ' ని గానీ సీనియర్ హిజబొల్లా కమాండర్ 'విసం హసన్ అల్ తవీ' ని గానీ  లెబనాన్ భూభాగం మీద డ్రోన్ తో దాడి చేసి ఇజ్రాయెల్, చంపినపుడు హిజబొల్లా ప్రతీకార దాడులకు చప్పున దిగలేకపోవడానికి కారణం  UNIFIL Contingent కు ఏమైనా హాని (collateral damage) జరుగుతుందేమో అన్న భయం తోనే.  

లెబనాన్ లోని అతిపెద్ద పాలస్తీనా శరణార్ధుల శిబిరం "అయిన్ అల్ హిల్వే" నుండి తయారయిన చిన్న చిన్న చిల్లర సాయుధ మూకలు ఎడా పెడా ఇజ్రాయెల్ లోకి రాకెట్ దాడులు చేయడం, దానికి హిజబొల్లా రక్షణ, శిక్షణ, హమాస్ సహకారం ఎప్పటుంచో ఉన్నవే. వాటిని పూర్తిగా నిలువరించడం సాధ్యం కాకపోయినా ఈ అంతర్జాతీయ సంస్థల కారణంగా చిన్న చిన్న ఉద్రిక్తతలు చినికి చినికి గాలివాన లా మారకుండా మాత్రం చాలా కాలం పాటు ఆగాయి.  అలా అని వీటి పాత్ర ని కొండంతలుగా చేసి కీర్తించక పోయినా ప్రస్తుతం ప్రపంచ శాంతి కల్ల అనీ, ఐక్యరాజ్యసమితి అసలు ఎందుకు ఉందని వెల్లువెత్తుతున్న ప్రశ్నల మధ్య మారుతున్న ప్రపంచ రాజకీయాలలో ఐక్యరాజ్య సమితి ఉపయోగం ఎంతమాత్రం కొట్టిపారేయాల్సింది కాదని చెప్పుకోవచ్చు.  


ఇకపై ఏమి జరగనుంది ? 


ఇప్పటి దాకా, అతివాద ప్రభుత్వం పదవిలో ఉన్నందున ఇజ్రాయెల్ దాడుల ప్రకోపం ఎక్కువ ఉంది, (ఇజ్రాయెల్ ది పైచేయి గా ఉంది అనట్లేదు) ఈ రోజుకీ హిజబొల్లా  కన్నా ఇజ్రాయిలే ఎక్కువ దూకుడు గా ఉంది. నిజానికి హమాస్ పని ముగిసినట్టే. అయినా కూడా ప్రజాభిప్రాయం మాత్రం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగానే ఉంది.  ఎది ఏమైనా ఇప్పుడు దౌత్యం అంతా కాల్పుల విరమణ, యుద్ధం ఆగడం చుట్టూ తిరుగుతున్నందున హమాస్ కూ, ఇజ్రాయెల్ కూ, సమాన భాగస్వామ్యం ఉన్న ఒప్పందం ఒకటి తీసుకురావాలి. దీనిని అమలు చేయడానికి ఐక్యరాజ్య సమితి లాబీయింగ్ చాలా అవసరం. తెగేదాకా లాగడం ఇజ్రాయిల్ కూ, హమాస్ కూ ఇద్దరికీ మంచిది కాదు.  ఇజ్రాయెల్ కు మద్దతుగా ఒక అగ్రరాజ్యం, వ్యతిరేకంగా ఇంకొక అగ్రరాజ్యం ఒకదానికొకటి ఎదురుగా నిల్చున్నాయి. ఒక వేళ ఏదో ఒక ఒప్పందానికొచ్చి కాల్పుల విరమణ జరిగినా కూడా, ఉద్రిక్తతల డిగ్రీల కారణంగా ఎప్పటికైనా పూర్తి స్థాయి యుద్ధం ఏక్షణానైనా మొదలవ్వొచ్చు. కాబట్టి ఇరువర్గాల్నీ ఆపాల్సిన అవసరం ప్రపంచానికుంది. 

అయితే పీస్ కీపర్ కి ఉండే అవరోధాల్ని కూడా పట్టించుకుంటే, వీళ్ళలో తక్కువ ఆయుధాలు కలిగిన వారు, హెవీగా ఆయుధాలు కలిగిన వారు, ఆయుధాలు లేని పరిశీలకులు, ఎక్కువ రోజులు ఫీల్డ్ లో ఉండాల్సినవాళ్ళు, ప్రమాదం అంచుల్లో, అనిశ్చితి లో తీవ్ర మానసిక ఒత్తిడి కి లోనయ్యే వాళ్ళు, ఒక డైరెక్షన్ లేక కేవలం దౌత్యం, నిలువరింపు కార్యక్రమాలకు, నిస్సహాయంగా, రాజకీయాలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండాల్సి రావడం - ఇవన్నీ కూడా మారాల్సిన విషయాలు. యుక్రయిన్ విషయం లో UN ఏమీ పెద్దగా చెయ్యలేకపోయింది. UN సంస్థల్లోని ఉన్నతాధికారులు తమ తమ స్వదేశాల పొసిషన్ కు కూడా రాయబారులు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలు. స్థానిక లాబీయింగ్ లో కూడా ఒకోసారి కీలక పాత్ర పోషిస్తారు.  కాబట్టి సరైన పీస్ కీపర్ ని నిష్పాక్షికంగా  మెరిట్ ప్రకారం, అందరికీ ఆమోదయోగ్యంగా ఎంచుకోవడం కూడా పెద్ద సవాలే.   

గాజా యుద్ధం ప్రాంతీయంగా ఉన్నంత సేపు మనం అందరం క్షేమంగా ఉన్నట్టు.  ఎర్ర సముద్రపు వాణిజ్య మార్గాల్లోకి కూడా యుద్ధం విస్తరించింది. కానీ అది ఇంకా ఎక్కువగా ఇతర ప్రాంతాల్లోకి చిందడం అస్సలు క్షేమం కాదు.   ఈ యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించిందో అది ఎంత పెద్దదవుతుందో ఊహించలేము. కాబట్టి ప్రస్తుతానికి  పరిస్థితుల్ని దేవుడికి వదిలేయకుండా UN ని  acknowledge చేయడం, దానిని మరింత బలోపేతం చేయడం, మనం చేయాల్సిన పని. 

Free Translation of the Article : "Role of UN Peace Operations : An Actor of Stability in the Middle East", by  Maj Gen (Dr) AK Bardalai (Retd), UN Journal 2024.

No permissions taken. 

***

31/03/2024

పియా మోరా బాలక్ హం తరుణీగే - Mythili Poem by Mahakavi Vidyapati

 పియా మోరా బాలక్ హం తరుణీగే 

పియా మోరా బాలక్ హం తరుణీగే - 

కౌనె తప్ చుక్లో బెల్గౌన్ జననిగె


పహిరెలెల్ సఖి దక్షినక్ చీర్

పియా కె దెఖయిత్ మొరా దఘద్ శరీర్

పియా కె దెఖాయిత్ మోరా దఘద్ శరీర్

పీయా లెలె గోద్ కె చలాయి బజార్

హతియా కె లోగ్ పూచె కె లగె తొహర్

హతియ కె లోగ్ పూచె కె లగె తొహర్


నహీ మొరా దేవర్ కి నహి చోట్ భాయి

పూరబ్ లిఖాల్ చల్ బలము హమార్

పూరబ్ లిఖాల్ చల్ బలం హమార్

బత్ రె బతొహియ కె తహున్ మొర భై

హమరో సమద్ నైహార్ లెనై జాయ్

హమరో సమద్ నైహార్ లెనై జై


కహీ హున బబ కె క్నీయి ధెను గే

దూదవ పియ కె పొసత్ జమయి

దొదవ పియ కె పొసత్ జమయి

భనహి విద్యపతి సునహున్ బ్రిజ్ నారి

ధీరజ్ ధైరహున్ మిలత్ మురారి

ధీరజ్ దూఇరహున్ మిలత్ మురారి


పియా మోర బాలక్ హుం తరుణీగె

కౌనె తప్ చూకలొన్ భెలావూన్ జననీ గె

- Maithili Poem by Mahakavi Vidyapati 


నా భర్త బాలుడు (చిన్న పిల్లవాడు), నేనేమో యవ్వనం లో ఉన్న తరుణిని

నేను చేసిన పాపమేమో గానీ, నా భర్త బాలకుడు. 


సఖీ, ఏ దక్షిణ దేశపు చీరనో కట్టుకుని  అతన్ని చూస్తేసరికీ నా దేహం దగ్ధమౌతుంది. అతన్ని పట్టుకుని బజారు కు వెళ్దామన్నా, ప్రజలు అతను నీకేమౌతాడని అడుగుతున్నారే!


ఇతను నా మరిదీ కాదు, నా చిన్న తమ్ముడూ కాదు. విధి వశాన ఇతను నాకు భర్త అవుతాడు. పాంధుడా,  మాటవరసకైనా నువ్వు  నువ్వు నాకు సోదరుడివవుతావా ? నా కన్నవారి దగ్గరికి తీసుకుపోతావా ? 


నా తండ్రి తో చెప్పు ! నాకు ఓ   (బాగా పాలిచ్చే కామ) ధేనువు జాతి ఆవును కొనివ్వమని !  నీ అల్లుడిని సాకేందుకు నా దగ్గర ఏదీ లేదు కనీసం అతను ఆ పాలు తాగి పెద్దవాడవుతాడు. అని చెప్పు !!    స్త్రీ జనమంతా విద్యాపతి మాటలు వినండి . ఓర్పు తో వేచినవారికి మురారి (Lord Krishna)  తప్పకుండా దొరుకుతాడు. నేనేమి పాపం చేసానో గానీ నా భర్త ఒక బాలకుడు. 

***

ఇది ఒక 15 వ శతాబ్దపు స్త్రీ ల పరిస్థితి గురించి కవి చెప్పిన పదం. ఆ నాటి స్త్రీ లకు కనీస స్వతంత్రం, స్వేచ్చా లేకపోవడం, ఆర్ధిక సామాజిక వెనకబాటుతనం, ఎవరో వచ్చి ఉద్ధరిస్తే తప్ప బాగుపడని జీవితాలవడం,  నిస్సహాయత తో జీవితాన్ని గడపాల్సి రావడం గురించి మైథిలీ లో రాసిన పదం. ఈ పాట లో స్త్రీ బాలుడ్ని ఎందుకు పెళ్ళాడవలసి వస్తుందో గానీ, అది ఆవిడ తీసుకున్న నిర్ణయం కాదని, శిశువుని కట్టబెట్టి, ఆమె తల్లితండ్రులు ఆమె బరువును వదిలించుకున్నారనీ తెలుస్తుంది.   

ఆడపిల్లల్ని ఏదో ఒక లా పెళ్ళి చేసి వదిలించుకోవడం ఆనాటి సామాజిక పరిస్థితి. కట్నాలు, ఆస్తులు, లాంచనాలు వగైరా కారణాల వల్ల, ఆడపిల్లలని పుడుతూనే చంపేసే విధానాలు మామూలయిపోయిన దేశం లోది ఈ పాట. సాంఘిక దురాచారాలని కవులు, కధకులు ప్రజల్లోకి విస్తృతంగా బయటపెట్టి, చైతన్యం తీసుకురాబట్టి, ప్రజలలొ కాస్తయినా మార్పు వచ్చింది.  చట్టాల వల్ల వచ్చే సామాజిక మార్పు కన్నా, సాహిత్యం తీసుకుని వచ్చే మార్పు గట్టిది. కలకాలం నిలిచేదీనూ. 

***


Thanks to my young brother Atul for translating this poem in English and Hinglish, 

Reference : https://deoshankarnavin.blogspot.com/2015/01/1.html?m=1

Mahakavi Vidyapati 

16/02/2024

ఆవిష్కరణ - శ్రీదేవీ మురళీధర్

 ఆవిష్కరణ, (ఆల్కహాలిక్ ల పిల్లలు - ఒక అవగాహన) - శ్రీదేవీ మురళీధర్ 



ఆల్కహాలిజం ఒక (సామాజిక) రుగ్మత.  అధిక ఆదాయం తెచ్చిపెట్టే ఆల్కహాల్ వల్ల ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మద్య విధానాలు అవి తెచ్చి పెట్టే సంపద వలనా, సామాజికంగా, ఆర్ధికంగా వచ్చిన కొత్త మార్పుల వలనా, ఆల్కహాలిజం చాప కింద నీరులా మన సమాజంలో పాకిపోయి ఉంది. దీనివల్ల కుటుంబాలు ఎలానూ నాశనమవుతాయి. ముఖ్యంగా  ఆల్కహాలిక్ ల పిల్లలు ఎదుర్కొనే బాధలు,  "నొచ్చుకోళ్ళ స్థాయిలనుండి, అత్యాచారాలవరకూ, శారీరక మానసిక వేధింపులు, సామాజిక వెలివేత - ఆర్ధిక వెనుకబాటు" - వీటి మధ్య నలుగుతున్న పిల్లలు! వీళ్ళ గురించి ఎంతో చక్కగా రాసిన పుస్తకం ఇది. 


ఆల్కహాలిజం ఒక వ్యాధి. దీని బారిన పడినవాళ్ళు తాగకుండా ఉండలేరు. దీని నుండీ బయటపడడం అసాధ్యమేమీ కాదు. దానికి సంకల్ప బలం ఉండాలి. ఇది తరవాత. ముందు, ఆల్కహాలిక్ ల కుటుంబ సభ్యులు దీనికి ఎలా బలవుతారో, దీనికి పరిష్కారం ఏమిటో తెలియాలి. సోషల్ డ్రింకింగ్ వేరు, మెల్లగా అలవాటు పడిపోవడం, అది వ్యసనంగా మారడం, మత్తు కోసం కుటుంబ సభ్యులను, వృత్తిని నిర్లక్ష్యం చేయడం, ప్రమాదాల బారినపడడం, లేదా ఇతరులను వేధించడం వేరు.  ఆల్కహాలిక్ ని కుటుంబం ఎలానో ఒకలా రక్షిస్తూ ఉంటుంది. అతని భార్య పిల్లల కడుపు నింపడం కోసం ఎలానో బాధ్యతల్ని తలకెత్తుకుంటుంది. పైగా బయటివారికి చాలా వరకూ తమ ఇంటిలో ఆల్కహాలిజం సమస్య ఉన్నట్టు తెలియడం అవమానకరం / ప్రమాదం అనుకుంటుంది.  ఇలాంటి స్టిగ్మా లు, త్రాగుడు అవమానకరం గా భావించడం, తండ్రి ఎప్పుడు చూసినా మత్తులో మునిగి ఉండడం - భార్యా, పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారడం వగైరాలు మనం తరచుగా చూస్తూంటాము. సమాజం త్రాగుబోతు కుటుంబాన్ని ట్రీట్ చేసే పద్ధతి గురించి కూడా అందరికీ తెలిసినదే. 


పిల్లలు తల్లి తండ్రుల మధ్య సంఘర్షణకు ప్రత్యక్ష సాక్షులు. మత్తు లో జరిగే నేరాలు - పైగా పిల్లల ఎదుటే భార్యను కొట్టడం, కొన్ని విపరీత పరిస్థితుల్లో చంపడం, దానికి పిల్లలు అతి దగ్గరి, సాక్షులవడం మనకు పేపర్లలో / వార్తల్లో తెలుస్తుంటుంది. ఒక వేళ హింస ఇంత స్థాయిలో లేకపోయినా, ఆల్కహాలిక్ ల పిల్లలు - చిన్నబోవడం, ఇతరుల్లా తమ బాల్యం ఎందుకు చీకూ చింతా లేకుండా గడవదో తెలియకపోవడం, తల్లి నిస్సహాయత, తండ్రి ఆదరణ కు నోచుకోకపోవడం / ఉన్న డబ్బల్లా ఆల్కహాల్ కే ఖర్చుకావడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం - ఇవన్నిటికీ గురవుతారు.  పిల్లల్ని తమ రెక్కల మధ్య పొదువుకోవల్సిన తల్లిదండ్రులు ఆల్కహాలిసం కారణంగా పిల్లలను ఎంత అంధకారంలోకి నెట్టేస్తున్నారో తెలుసుకోవాలి. (ఈ పుస్తకంలో - బీద మధ్యతరగతి భారతీయ కుటుంబాలను ప్రస్తావించారు. ఈ కుటుంబాలలో స్త్రీల కన్నా, పురుషుల్లో ఆల్కహాలిసం ఎక్కువ. కొన్ని సార్లు స్త్రీలు కూడా ఈ వ్యసనానికి గురయి ఉండవచ్చు, ఈ రోజుల్లో పిల్లలలో కూడా త్రాగుడు, డ్రగ్ ఎడిక్షన్, ప్రవర్తనా దోషాలు మొదలయ్యాయి. వీటికి ఇలాంటి ఆల్కహాలిజపు కుటుంబ నేపధ్యం ఉండడం చూస్తున్నదే).   


చాలా సార్లు ఈ పిల్లలు అపరాధ భావంతో, న్యూనత తో బాధ పడతారు. ఈ పిల్లలు  మగపిల్లలయితే, చిన్నవయసు నుందే కుటుంబ బాధ్యతల్ని మోయాల్సొస్తుంది. తమ లక్ష్యాలనూ, ఇష్టాలనూ, ఆటపాటలను పక్కన పెట్టి చిన్న చిన్న ఉపాధి మార్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.  ఆడ పిల్లలయితే, చాలా మటుకూ బడి మానేసి, తమ కన్నా చిన్న పిల్లల్ని సాకాల్సొస్తుంది.  తండ్రి తాగి తాగి ఉపాధి కోల్పోయాక, తల్లి సంపాదించేందుకు, ఇంటి పని నీ, తన కన్న చిన్న వయసు  పిల్లల్ని,  ఆడ పిల్లల కు అప్పజెప్పి పనికి వెళ్ళాల్సి వస్తుంది.  


ఆల్కహాలిక్ లు కూడా పిల్లల వల్ల పెరిగిన కష్టాలవల్లే తాగుతున్నామని వాళ్ళ మీద నిందలేస్తారు. తల్లులు పిల్లల కు తండ్రి నిద్రపోతున్నాడనో, జ్వరం వచ్చి పడుకున్నాడనో అబద్ధం చెప్తారు. వీళ్ళ కుటుంబాలలో రాయని రూల్స్ ఉంటాయి. నిశ్శబ్దం, ఎప్పుడేం జరుగుతుందో అనే భయం, వేలాడుతుంటాయి. అందుకే చాలాసార్లు పిల్లలు "మా నాన్న తాగకుంటే ఎంత బావుండేది ? మా నాన్న తాగుడు ను నేను మానిపించలేనా ?"  అని బాధపడుతుంటారు. తండ్రి తాగి వచ్చి పడిపోతే పిల్లకి ఎంత అవమానంగా, బాధగా ఉంటుందో. వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఉండరు. ఎవరి నుంచి ఏ మంచిని గ్రహించాలో తెలియదు. తల్లి అవమానంగా ఫీల్ అవుతుంటుంది. పిల్లలు ఇతరులతో తమను తాము పోల్చుకుంటారు. చదువులో వెనుకబడతారు. ఇతరుల మీద జెలసీ ని పెంచుకుంటారు. న్యూనతను బయటికి కనిపించనీయకుండా అతి ఏక్టివ్ గా, జోకర్ల లా / అతి పని మంతుల్లా, అతి మంచి వారిలా అందరి  acceptance కోసం ఎదురుచూస్తూ, పొగడ్తల కోసం, గుర్తింపు కోసం వెంపర్లాడుతూ, పని రాక్షసులు కూడా అయిపోతారు.  


రచయిత్రి ఎడిక్షన్ కౌన్సెలర్ గా పనిచేస్తున్నారు. తన 28 సంవత్సరాల అనుభవం తో ఈ పుస్తకాన్ని ఆల్కహాలి క్ ల పిల్లల వైపు మన దృక్పథం మారాల్సిన సంగతి గురించి చర్చించేందుకు రాసారు. సామాజికంగా ఒక లాంటి మానసిక & ఎమోషనల్ వెలివేత ని పిల్లలు ఎలా ఎదుర్కోవాల్సొస్తుందో, వాళ్ళ ప్రవర్తనల్లో తేడాల కారణంగా టీచర్లు, కౌన్సెలర్ లు ఎలా గుర్తించాలో చెప్తారు.  చదువులో వెనకపడిన పిల్లలు, చుట్టూ ఉన్న పరిస్థితులకు ఎటువంటి స్పందననీ వ్యక్తపరచకుండా మౌనంగా ఉండిపోవడమే మేలనుకునే పిల్లలు, ఎవరినైనా  నమ్మడం అనవసరం అనుకునే పిల్లలు, తమలో బాల్య చాపల్యం వల్లో, మానవ సహజ నైజం వల్లో ఏవైనా కోరికలు ఉన్నా కూడా వాటిని ఎటూ నెరవేరవు కదా అని అణుచుకుని, చిన్నబోయి ఉండే పిల్లలు - బహుశా ఇంట్లో ఏదో రకమైన అబ్యూస్ కి గురవుతున్నవారు, అలవి కాని బాధ్యతల్ని మోయాల్సొచ్చేవారు - ఇలా ఆల్కహాలిక్ ల పిల్లలు ఎన్నో రకాలు. అయితే వీళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. వీళ్ళు 'ఎవరో ' చాలా తక్కువ పెర్సెంటేజీలలో లేరు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న పిల్లలలో ఆల్కహాలిజం బారిన పడిన కుటుంబాల పిల్లలే 20% ఉన్నారు. లైంగిక వేధింపులకు గురయ్యే పిల్లల కేసుల్లో 90% మంది నేరస్తులు ఆల్కహాలిక్ లే. 




ఈ పుస్తకం రాయడం వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. ఆల్కహాలిజం తాలూకు పర్యవసానం భయంకరమైనది. అదుపుతప్పిన మద్యపానం కాలక్రమేణా మతిభ్రమణం లేదా మరణం వైపు దారితీస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రిచ్చవచ్చు. 

ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన ఉన్న డాక్టర్ వైద్యసేవను, ఎడిక్షన్ కౌన్సిలింగ్ ను పొంది, త్రాగుడు కు స్తస్తి చెప్పడంతో ఒక ఆల్కహాలిక్ తప్పకుండా స్వస్థుడు కావచ్చు.  Alcoholics Anonymous  అనే స్వచ్చంద సంస్త ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాలిజం వ్యాధిన పడిన పేషెంట్ ల కోసం అపూర్వ సేవాభావంతో దశాబ్దాలుగా కృషి జరుపుతుంది. వాళ్ళని పూర్తిగా త్రాగుడు మానిపించగలిగేలా చేసింది. ఏ fee / కనీసం పేరు కూడా అడగకుండా ఈ సంస్థ తన సేవలను అందిస్తుంది. ఈ సంస్థ మన దేశంలో వివిధ ప్రాంతాలలో నడుస్తుంది. వాటి వివరాలు, ఎడ్రసులు, ఫోన్ నెంబర్లు పుస్తకంలో ఉన్నాయి. తాగుడు కు దూరంగా ఉన్న పేషెంట్ తప్పకుండా మంచి జీవితం మొదలుపెట్టగలుగుతాడు. ఇది స్వచ్చందంగా, మనస్పూర్తిగా పేషెంట్ తరఫునుండీ రావలసిన కోరిక / మార్పు. అలా ఆల్కహాల్ లేకపోతే చచ్చిపోతానేమో అనే భయాన్నిండీ, మానేసాక తన జీవితం ఎంత బావుండబోతోందో ఆలోచించుకునేలాగా చేయగలగడం, ఆ తరవాతి ప్రాసెస్ - దానికి ఈ సంస్థ ఇచ్చే తోడ్పాటు ల గురించి చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది.  ఎందుకంటే  ఆల్కహాలిజం కేవలం త్రాగే మనిషిని మాత్రమే కాకుండా, అతని కుటుంబ వ్యవస్థ ని పునాదులతో సహా కూల్చేసే ప్రమాదకరమైన వ్యాధి. 

ఆల్కహాలిక్ ల పిల్లలు సాధారణంగా పెద్దవాళ్ళయాక ఆల్కహాలిజం వైపు మళ్ళే అవకాశాలు ఎక్కువే.   ముందే చెప్పినట్టు, వాళ్ళు తమ రోల్ మోడళ్ళని కోల్పోతారు.  నిజానికి పిల్లలు ఆల్కహాలిజానికి కారకులూ కారు, ప్రేరకులూ కారు. కానీ దాని నష్టాలన్నీ పూర్తిగా అనుభవిస్తారు.  ఆదర్శంగా నిలవాల్సిన పేరెంటింగ్ వాళ్ళకు దక్కదు. అయితే, వాళ్ళని కౌన్సిల్ చేసే వాళ్ళు చేయాల్సిన మొదటి పని, తాము ఒంటరులం కాదని, తల్లితండ్రులు ఎడిక్ట్స్ అయితే దానిలో తమ తప్పు లేదనీ, తెలుసుకొనే లా చేయడం. ఇది వాళ్ళ గుండెల్లో భారాన్ని సగం తగ్గిస్తుంది. ఇంటిలో ఎలాంటి పరిస్థితులున్నా, హాయిగా ఆడుకోవడం, చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకుండా సంతోషంగా ఉండమని చెప్పడం ! అయితే ఎంతయినా అవి 100% భద్రతా భావాన్ని ఇవ్వవు. అ తల్లిదండ్రులు ఆల్కహాలిజం తాలూకూ విష వలయం నుండీ బయట పడి, వాళ్ళ కుటుంబం లో నార్మల్సీ రావడం మాత్రమే ఆ పిల్లలకి అవసరమైన భద్రత. 

పుస్తకంలో వివరాలు చాలా సమగ్రంగా ఉన్నాయి. పిల్లలు ఎన్ని బాధలు పడతారో, ఆ అనుభవాలు వాళ్ళ భవిష్యత్తును ఎలా మార్చేస్తాయో - పట్టికల లా, సైంటిఫిక్ ప్రశ్నావళులతో - ఉదాహరణలతో, డేటా తో చక్కగా వివరించే ప్రయత్నం చేసారు. ఈ పుస్తకం చేరాల్సిన వాళ్ళకు / సహృదయులకు తప్పకుండా చేరాలి.  నిజానికి అమూల్యమైన పుస్తకానికి ఏ వెలా లేదు. ఇది పుస్తక ప్రదర్శన లో ఉచితంగా పంచుతున్నారని విన్నాను. రచయిత్రి ఈ పుస్తకం తో పాటు నాకు 'బుజ్జి ఒక పని మనసు కథ ( Original : "Bottles Break" by Nancy Grande Tabor ) అని ఇంకో పుస్తకం కూడా పంపించారు. ఇది బొమ్మల పుస్తకం. బొమ్మలు బాలివి. ఇది కూడా ఉచితం. ఈ పుస్తకాలు నాకు పోస్ట్ లో వచ్చాకా ఎంత అయిందా అని వెల వెతుక్కున్నాను. జస్ట్ వివరాలడిగితే పుస్తకాలు పంపించారు. ఇంత మంచి పుస్తకాలు నిజంగా టార్గెట్ పాఠకులని చేరితే తప్పకుండా వాళ్ళ జీవితాల్లో మంచి మార్పుని తీసుకురాగలుగుతాయి.   

ఉదా : బుజ్జి నుంచి:-



పుస్తకాన్ని NS Mani Charitable Trust  తరఫున శ్రీదేవీ మురళీధర్ ప్రచురించారు. ఈ పుస్తకం అవసరమైన వాళ్ళకి / కావాలనుకున్న వారికి ఉచితం. ఇంత మంచి ప్రయత్నం చేసినందుకు, స్వచ్చందంగా దీనిని వీలైనంత మంది చదివేందుకు ఉద్దేశించినందుకు, శ్రీదేవి గారికి చాలా ధన్యవాదాలు, అభినందనలు. 

***

05/02/2024

Man's Search for Meaning - Viktor E Frankl

 


విక్టర్ ఫ్రాంకెల్ రాసిన "Man's Search For Meaning" ఒక గొప్ప పుస్తకం. ఎప్పుడైనా ఒక పుస్తకం లో ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగే ఒక్క పేరా గానీ, ఒక వాక్యం / ఒక ఐడియా ఉన్నా ఆ పుస్తకం గొప్పదని అనుకోవచ్చు. కొన్ని నచ్చిన వాక్యాల కోసం మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గ పుస్తకం ఇది. బహుశా సర్వైవల్ గురించి చెప్పిన మొదటి పుస్తకాలలో ఒకటి. జెర్మనీ లో, తూర్పు యూరోపు లో యూదులు ఎక్కడ తాము చాలా హాయిగా, secured గా ఉన్నామనుకున్నారో అక్కడ నాజీయిజం పుట్టి వైరస్ లా విజృంభించినప్పుడు విక్టర్ ఫ్రాంకెల్ తన తోటివాళ్ళతో కలిసి కాన్సంట్రేషన్ కేంప్ లకు పంపబడ్డాడు.  అయితే ఏదో అత్భుతం జరిగినట్టు, (బైబిల్ వాక్యంలాగా) అగ్ని సెగల నుండీ బయటకి తీసిన కట్టె లాగా అతను ఆ మారణహోమాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. అలా బయటపడేందుకు అతనికి చిక్కిన ఆధారం ఏది ?  
 

నీచా  ( Nietzsche)  చెప్పినట్టు "మనిషికి 'ఎందుకు ' బతకాలో తెలిస్తే 'ఎలా ' బతకాలో తెలుస్తుంది".  సరిగ్గా అలానే, ఈ మారణకాండ మధ్య, దుర్భర జీవన పరిస్థితుల్లో, ఎప్పుడు విడదలవుతామో, తమ వాళ్ళు ఎక్కడున్నారో, భార్యా పిల్లలు బ్రతికున్నారో, మరణించారో, తామెన్నాళ్ళు ఇలా బ్రతకాలో, ఎందుకు ఇలా జరుగుతుందో తెలీని ఘోర వేదన లో ఆ యూదు ఖైదీల్లో కొందరు తిండి, మందులు లేకపోవడం కంటే "ఆశ"  ని కోల్పోయి మరణించారు.  'ఆశ' ని వదిలేసినవాళ్ళకి ఎందుకు బ్రతకాలో తెలీక - బెంగతో కృశించి మరణించారు.   వీళ్ళకన్నా భిన్నంగా ఫ్రాంకెల్ లాంటి వాళ్ళు భార్య నో, బిడ్డలనో, కన్నవారినో, తాము చేయాల్సిన పనులనో, వైజ్ఞానికులైతే  విడుదలయ్యాక తాము మాత్రమే చేయగల పరిశోధనలనో తలచుకుని, ఆశను ఉగ్గబెట్టుకుని, ప్రాణాలను నిలుపుకున్నారు.  వాళ్ళకి "ఎందుకు" ఎలా అయినా ప్రాణాలు నిలబెట్టుకోవాలో అనేందుకు ఒక కారణం ఉంది. బహుశా వాళ్ళ జీవితానికి అర్ధం దాన్లోనే ఉంది. ఒక గోల్, మనకి ఆ కారణాన్నిస్తుంది. అది మనిషి బ్రతకడానికి అవసరం.

హాలోకాస్ట్ గురించి, మిలియన్ల కొద్దీ యూదులని నిర్దాక్షిణ్యంగా చంపేసిన నాజీ డెత్ కేంప్ ల గురించి ఎన్నో పుస్తకాల్లో చదివాము, సినిమాలు చూసాము.  అయితే అక్కడ 'లోపలి జీవితం ' ఎలా వుండేదో, ఖైదీల మధ్య కామ్రేడరీ, సోదర భావం, వాళ్ళ మధ్య సౌందర్యాభిలాష, స్నేహం, సాహిత్యపు, ప్రేమ లాలిత్యపు మానసిక దృఢత్వం, వాళ్ళ బ్రతుకు పోరాటం, ఊహించలేనంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా, రోజు రోజుకీ దిగజారుతున్న పరిస్థితుల్లో వాళ్ళు పాటించిన విలువలు, వాళ్ళలో ఒకళ్ళే అయి ఉండి కూడా కాస్త దిగజారి ప్రవర్తించిన కాపో (Capo) లు - నాజీ అధికారుల్లో కూడా కాస్తో కూస్తో దయ చూపించిన వాళ్ళు, వీళ్ళందరి గురించీ రాసిన పుస్తకం ఇది. అసలు చెప్పాలంటే మానవాళిలోనే కేవలం రెండు రకాల మనుషులే వుంటారు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. మంచివాళ్ళ సంఖ్య తక్కువే కావచ్చు. వారిలో చేరగలగడం కూడా కష్టమే.   

మన కోర్ ఏంటో నిరూపించుకోవడానికి కొన్ని సందర్భాలొస్తాయి. ఆ పరిస్థితుల్లో మానవత్వం మరిచిపోయి నిర్దాక్షిణ్యంగా మారణకాండకు సహకరించిన వాళ్ళు (డాక్టర్  జె లాంటి వాళ్ళు), అవే పరిస్థితుల్లో,  మంచి SS  కమాండర్స్ కూడా వున్నారు.   బవేరియా లో నిర్మించిన మొదటి కాన్సంట్రేషన్ కేంప్ లో విక్టర్ ఉన్నపుడు అక్కడి ఒక జెర్మన్ కమాండర్ ఎంత దయగలవాడంటే, అతను ఖైదీల కోసం చుట్టు పక్కల బవేరియన్ గ్రామాలలో దుస్తులు విరాళాలు గా తీసుకుని పంచేవాడు.  యుద్ధం ముగిసాకా, ఖైదీలు అతనికి అండగా  నిలిచారు.  యుద్ధం ముగిసాక, కేంప్ ఖైదీలే ఆ  నాజీ అధికారి అమెరికన్ ల చేత చిక్కకుండా తప్పించుకునేందుకు సహకరించి, అతని ప్రాణాలకి ఏ హానీ జరగదని హామీ తీసుకున్నాకే అతనిని అధికారులకు అప్పగించారు.    కాబట్టి, హిట్లర్ వాదించిన 'Race' లలో కేవలం రెండు రేస్ లే వున్నాయి.   'డీసెంట్ మేన్',   'ఇండీసెంట్ మేన్'.  ఏ జాతి ప్యూరిటీ కోసం సాటి మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా, మెర్సీ అనేదే లేకుండా, సామూహికంగా హత్యలు  చేసేసారో, అలాంటి జాతి ఫలానాదే అని ఏదీ వుండదు.  నాజీ గార్డులలోనూ మంచి వాళ్ళున్నారు, యూదు ఖైదీల్లోనూ ఘోరమైన మనుషులున్నారు. 

1942 లో వార్సా లో ఒక యూదు ఘెట్టో లో ఒక తిరుగుబాటు జరిగింది. గాస్ చాంబర్ లో విష వాయు ప్రయోగంతో చంపబడేందుకు తరలింపడవలసిన యూదు ప్రజలు జెర్మన్ నాజీ లకు లొంగేందుకు వ్యతిరేకించి తిరగబడ్డారు. వాళ ప్రయత్నం ఓటమికే దారితీసింది. ఐతే తిరగబడిన ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు తాము చేసే ప్రయత్నం ఫలిస్తుందని చేయలేదు.   ఓడిపోతామని తెలిసినా, తిరగబడేందుకు ప్రయత్నించారు. తమ ధిక్కారాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని వాళ్ళు ఎంచుకున్నారు.   చివరకి 13000 మంది ఘెట్టో వాసులను నాజీలు చంపేసారు. ఇదొక్కటే బహుశా యూదులు తమ అణిచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం.  అదీ విఫలమైంది.  

యుద్ధానంతరం ఆస్ట్రియన్ రేడియోలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది.  అది ఆ తిరుగుబాటులో పాల్గొని, తదనంతరం కేంపు కు తరలించబడి, ప్రాణాలతో విడుదలయిన ఒక ప్రముఖ హృద్రోగనిపుణుడి ఇంటర్వ్యూ.    ఆ వార్సా ఘెట్టో తిరుగుబాటు సాహసం ఎంత పెద్దదో - దాని వెనకున్న ధైర్యాన్ని తొక్కిపారేసెందుకు అధికారులు చేసిన ప్రయత్నమూ అంత పెద్దదే.   ఆ తిరుగుబాటుని హీరోయిజం గా  రేడియో రిపోర్టర్ అభినందించినప్పుడు, ఆ హృద్రోగ నిపుణుడు ఇచ్చిన  సమాధానం - "గన్ తీసుకుని కాల్చి చంపడం హీరోయిజం కాదు.  SS  నిన్ను గాస్ చాంబర్ కో లేదా సామూహిక హనన కేంద్రానికో తరలించి, అక్కడ స్పాట్ లో నిన్ను చంపుతున్నప్పుడు,  చనిపోవడం తప్ప, ఇంకేమీ నువ్వు చేయలేకపోతున్నప్పుడు. ఆ మృత్యువుని డిగ్నిటీ తో స్వాగతించడం హీరోయిజం!!"      అలా నిస్సహాయంగా దిక్కులేని మరణాల పాలయిన యూదులు, కేంపుల్లో గదులకు గొళ్ళాలు పెట్టి, తాళాలు వేసేసి, సజీవ దహనాలు చేసినపుడు చనిపోయినవాళ్ళు,  మళ్ళీ శవాల గుట్టలని ఎప్పటికప్పుడు క్లియర్ చేసి, క్రిమేషన్ లు చేసిన యూదు ఖైదీలు, తమలో తామే ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్న ఖైదీలు,   ఒకరి బదులు ఒకరు మృత్యువుని ఎదుర్కోవడానికి వెళ్ళిన ఖైదీలు - వీళ్ళందరూ హీరోలే.


మనిషి కి బ్రతుకు కి అర్ధం తెలియాలంటే, ఏమి తెలియాలి?!   ఊరూ పేరూ అస్తిత్వమూ మరచి కేవలం ఒక నెంబర్ గా మిగిలిన మనుషులకు -  నిరాశ, నిస్పృహలతో పాటు, రోజుకి కేవలం ఒక పిడిడంత రొట్టె ముక్క, గరిటెడు పలచని సూప్, అంధకారమైన భవిష్యత్తు, ఇళ్ళూ, వాకిళ్ళూ, ఆప్తులని కోల్పోవడం వల్ల కలిగిన వేదన, రోజూ భరించలేననంత నీరసంలోనూ కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సి రావడం, కళ్ళెదురుగా పిట్టల్లా రాలిపోతున్న ఇతర ఖైదీలు, ముఖ్యంగా మనిషిని మృగంగా మార్చేంత చలి!   వెచ్చదనం కోసం, అప్పుడే చనిపోయిన తోటి ఖైదీ జోళ్ళు, బట్టలు తీసి వెంటనే వేసేసుకునేంత ఘోర పరిస్థితులు కూడా మామూలవడం, కొన్ని కేంపుల్లో యుద్ధం ముగిసే సమయాలకి ఆ తిండి కూడా దొరకక, జెర్మనీ ఓడిపోయి, లిబరేషన్ ఇంకొన్ని నెలల్లోనే వస్తుందనగా, కరువు పరిస్థితులు ముదిరి, ఖైదీలు, చనిపోయిన ఇతర ఖైదీల మాంసం కూడా వండుకుని తిన్నారు.  అలాంటి (మనుషులు) తట్టుకోలేని కష్టాలని కొందరు ఎలా తట్టుకోగలుగుతారు ? ఎక్కడైనా సరే, adversity  కమ్ముకొచ్చినప్పుడు బలహీనుడు మట్టికరుస్తాడు. బలమైన వాళ్ళు బ్రతుకుతారు. అయితే బ్రతకడానికి వాళ్ళకీ,  మిగిలినవాళ్ళకీ ఖచ్చితమైన తేడాని ని గమనిస్తే, మానసిక దృఢత్వం, suffering  ని తాత్వికంగా తీసుకోగలగడం, భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం కలిగి ఉండడం ఎంత అవసరమో తెలుస్తుంది.  

కేంప్ కి తరలింపబడగానే యూదుల్లో ఓ తొంభయి శాతం మంది మరణానికే తరలింపబడేవాళ్ళు. మిగిలిన పది శాతం, వెట్టి చాకిరీకి. అదీ సేనిటేషన్ / disinfecting  పేరిట వాళ్ళ దగ్గరున్న విలువైనవన్నీ, దుస్తుల్నీ, చేతి గడియారాల్ని, ఫోటోల్నీ, (కనీసం పెళ్ళి ఉంగరాలనీ కూడా దగ్గరుంచుకోవడానికి వీల్లేదు) జోళ్ళతో సహా అన్నిట్నీ వొలిచేసి ఇచ్చేసి, వాళ్ళిచ్చిన యూనిఫాం, కుదరని బూట్లు, లేసులుగా వైరు ముక్కలు, చిరిగిన మేజోళ్ళు వేసుకోవాలి. అవి కూడా ఇంతకు ముందు మరణించిన ఖైదీలవి.  తమ ప్రయాణం బహుశా మృత్యువు వైపుకే అని తెలిసీ, మల మూత్రాలతో తడిచి నానిన గడ్డి నే అంటిపెట్టుకుని, వెచ్చదనం కోసం పక్కనున్నవాళ్ళ వొంటినే ఆసరాగా తీసుకుని, ఘోరంగా గురకలు తీసే తోటి ఖైదీని వాటేసుకుని గాఢ నిద్రలోకి జారిపోగలిగేంత శ్రమ చెయ్యడం, అలసట తీరకుండానే ఇంకో రోజు, ఇంకాస్త చాకిరీ, తాము మనుషులం అని మర్చిపోయి, మృగాలుగా మార్చేసే పరిస్థితులు. ఆత్మ హత్య చేసుకునేందుకు ఎలక్ట్రిక్ కంచె ఉండనే ఉంది. విసుగేస్తే దాని పైకి దూకొచ్చు. తప్పించుకునే ప్రయత్నం చేసినా తుపాకీ గుళ్ళకి బలవ్వొచ్చు. అదీ వద్దనిపిస్తే నిరాశ తోనే రోజుల వ్యవధిలో జీవితాన్ని ముగించొచ్చు. ఇన్ని వైడ్ ఆప్షన్ ల మధ్య కూడా కొందరు మాత్రం కేవలం మనసుల్నీ, హృదయాల్నీ కాపాడుకుంటూ గడిపారు.

రోజువారీ సఫరింగ్ లో కూడా జోక్ లు వేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ  గాజు పెంకులతో అయినా సరే ఖచ్చితంగా షేవింగ్ చేసుకున్నారు. అలా చెయ్యాడం వల్ల కాస్త యంగ్ గా కనిపిస్తే, వీళ్ళు పని చెయ్యడానికి పనికొస్తారని నిర్ణయింపబడే "పది శాతం" యూదుల్లో వుంటారు. కాలు వాచిందనో ఎముకలు విరిగాయనో, ఫ్రాస్ట్ బైట్ అనో కుంటుతూ నడిచినా - వీళ్ళని కాల్చి పడేయొచ్చు. అందుకే ఎంత నొప్పిగా ఉన్నా స్మార్ట్ గా నడిచారు. ఒకరినొకరు కాపాడుకున్నారు. ఒక ఆకలి బాధితుడు కిచెన్ లో ఏదో దొంగతనం చేసినందుకు 'అతన్ని పట్టివ్వకపోతే ఆరోజు కేంప్ లో ఎవరికీ తిండి ఉండదు!'  అని జెర్మన్ లు గర్జించినప్పుడు ఆ రోజు కేంప్ లో ఉన్న మొత్తం 2500 మందీ, ఉపవాసం ఉండడానికే నిర్ణయించుకున్నారు.   రేపో మాపో చనిపోతామని అనుకున్నవారు తోటి వాళ్ళకి  తమ ఆప్తులకు ఆఖరి సందేశాలు ఇవ్వడం వంటి వీలునామాలను అప్పజెప్పారు. 

విక్టర్  నాలుగు కేంపుల్లో మూడేళ్ళు గడిపాడు.  ఎన్నో చావులు, ఆత్మహత్యలు, భీష్ముడిలాంటి స్వయం మరణాలు చూసాడు. పారిపోయేందుకు ప్రయత్నించి మానుకున్నాడు.    అతను తన ఫేట్ ని మార్చుకోవాలనుకోలేదు. తన తోటి వాళ్ళకి భవిష్యత్తు లోకి చూడడం నేర్పించాడు. తన దేశస్తులతో కలిసి కలలు కన్నాడు. (ఆ ఖైదీలకు వచ్చే కలలు అంతా తిండి, సిగరెట్టు, శుభ్రమైన స్నానం, ఇంటికెళ్తే ఎదురొచ్చే భార్యా పిల్లలూ, ఇలా.). జెర్మనీ అతని దేశాన్ని ఆక్రమించే ముందే వియన్నా వదిలి అమెరికాకి వెళ్ళేందుకు వీసా వచ్చినా సరే 'ఫేట్' ను మార్చుకోకుండా తన వాళ్ళకోసం వియన్నా లోనే ఉండిపోయాడు.  అలాగే అతనికి కేంప్ నుండీ ఇంకో కేంప్ కి వెళ్ళే అవకాశం వచ్చినా,  ఖైదీలు ట్రక్ ఎక్కినపుడు ఆఖరున ఎక్కాల్సిన అతన్ని నిలువరిస్తారు.  అతనితో పాటు, ఆ నిస్పృహతో కేంప్ లో ఉండి, రాత్రి  నిద్రపోయిన మిగిలిన ఖైదీలని మిత్ర పక్షాల సైన్యాలు రక్షిస్తాయి. తరవాత కొన్ని సంవత్సరాలకు ఆ వేరే కేంప్ లో తమ స్నేహితులందరూ సజీవంగా తగలబెట్టబడి చంపబడ్డారని తెలిసినపుడు విధి రాత ని ఎవరూ ఎలా తప్పించుకోలేరో అర్ధం అయి, షాక్ కు అతీతమైన నిర్వేదం కలుగుతుంది. 

 

సైకాలజిస్ట్ గా / సాటి మనిషి గా Concentration Camp Prisoners ని దగ్గరగా గమనించడం, డాక్టర్ గా వాళ్ళ ని ఉన్న అతి తక్కువ మందులతో ట్రీట్ చేస్తూ, అతనో ట్రీట్మెంట్ విధానాన్ని తయారుచేసి దాని ఫలితాన్ని నిరూపించుకున్నాడు. అదే Logotherapy.  లొగొ థెరపీ గురించిన పుస్తకం నిజానికిది. కానీ కొత్త ప్రతులలో ఆ మాటే పుస్తకం లేబుల్ లో లేకుండా ప్రచురించేస్తున్నారు. ఈ పుస్తకం ఒక మానసిక వైద్య నిపుణుడు రాసినది.   రోగులనూ, బలహీనులనూ, వికలాంగులనూ నిర్దాక్షిణ్యంగా నాజీలు చంపేసిన కాలం లో యూదుడైనందుకు ఈ డాక్టర్ ని కేంప్  కి తరలించారు. అతను వియన్నా లో ఇంతకు ముందు పనిచేసిన చిన్న పిల్లల మానసిక వైద్యాలయంలో వందలాది పిల్లలను, ఆటిజం, లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్న నాలుగేళ్ళ వయసు పిల్లల్ని కూడా నాజీలు చంపేసారు.  ఎటు చూసినా కౄరత, విషాదం, దయాహీనత ! ఇలాంటి పరిస్థితుల్లో, తన చుట్టూ ఉన్న వాళ్ళలొ స్థైర్యాన్ని నిలబెట్టింది "ఈ కష్టాలు ఇలా  వృధా పోవాల్సిందేనాా!"  అన్న స్పృహ.  జీవితం లో అర్ధాన్ని వెతుక్కుని, దాని కోసం జీవితేచ్చని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం. 

 

విడుదల అయ్యాకా, అన్నాళ్ళూ ఆకలితో, అనారోగ్యాలతో, బానిసల లాగా, జంతువుల లాగా బ్రతికిన ఖైదీలకు ఎదురుగా జీవితం లో ఏముందో తెలియలేదు. వాళ్ళు ఆశించిన, కలలు కన్న స్వాతంత్రం  కన్నా భిన్నమైన భవిష్యత్తు వాళ్ళకు కనిపించింది.  హాలోకాస్ట్ బాధితులే కాక ఇతర పేషెంట్ ల లో కూడా లొగో థెరపీ విధానాల్ని ప్రయత్నించి అతను తయారు చేసిన మానసిక చికిత్సా విధానం, మనిషి తన సఫరింగ్ కి అర్ధం వెతుక్కోవడం అనే పద్ధతి !  'లొగో' అంటే గ్రీక్ భాష లో అర్ధం 'అర్ధం'. ఇది దాదాపు కర్మ సిద్ధాంతం లాంటిదికానీ కాదు.  మనం ఎపుడైనా ఇలా మనకే 'ఎందుకు'   జరుగుతుందో అని జీవితాన్ని నిలదీసుకుంటాం. మన కష్టాలనే అత్యంత ఘోరమైన కష్టం అనుకుంటాం.

హాలోకాస్ట్ విక్టిం లు తాము అన్ని కష్టాలు తట్టుకుని ఎలా బయటపడ్డామా అని ఆశ్చర్యపోతుంటారంట.  ఎవరికైనా భరింపరాని కష్టాలు కూడా అలవాటాయిపోతాయి. చీకటి పోయి వెలుగొస్తుంది. బాధ పడినవాడెవడూ చెడిపోడు. జీవితం నేర్పించే పాఠాన్ని వినమ్రంగా నేర్చుకున్నవాడు మనిషి. తమ బాధల్ని భూతద్దాలలో పెట్టి చూసుకుని 'ఆనందం ' వెనక పరిగెత్తే మనిషి, ఎప్పటికీ ఆనందాన్ని సాధించలేడు.  కష్టాలలో కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఓర్పు, సహనం, పోరాటం కూడా మనిషి కి కావాల్సిన విషయాలు. సంకల్పం మంచిదయి ఉండాలి. సహనం తో కొన్నిటిని సహించాలి. వీలయినంత గా తనని తాను కాపాడుకుంటూ, పక్కనున్న వాడిని కూడా కాపాడుకోవాలి. ఇదే జీవితానికి ఉన్న అర్ధం. ఇదే ఈ పుస్తకం.

ఈ పుస్తకానికి  Millions of Copies అమ్ముడయ్యాయి. ఇంకా అవుతూనే వున్నాయి. మనుషులు ఎదుర్కొనే existential crisis కీ, వెంపర్లాటలకీ, శూన్యతలకీ ఈ లొగోథెరపీ సమాధానం ఇస్తుంది. విక్టర్ బందీగా కేంప్ కి తరలింపబడగానే అతను వెంటనే కోల్పోయినది తన రీసెర్చ్ పేపర్లు.  కోటు పాకెట్లో ఉన్నందున కోటుతో సహా వాటిని అక్కడ కుప్ప పోసిన ఇతర ఖైదీల వస్తువుల్లో పారేయాల్సి వచ్చినపుడు అతననుభవించిన క్షోభ - చివరికి అతను విడుదలయ్యాక తిరిగి రాసుకోగలిగినపుడు, అనుభవించిన ఆనందం, తృప్తి ముందు చిన్నదే అనిపించింది.

బాధలూ, కష్టాలూ రెలేటివ్. కాలం, పరిస్థితులను బట్టి అవి మారుతాయి. దుర్భర పరిస్థితుల్లో కూడా సూర్యాస్తమయాల్ని, ఎర్రబారిన ఆకాశాన్ని చూసి ఆనందించగలిగే ఖైదీ ఆనందం లో ఎంత సానుకూల దృక్పధం ఉందో కదా అనిపిస్తుంది.   తన బట్టలు విడిచేసిన తరవాత కేంప్ లో ఇంకో ఖైదీ కోట్ ని అతనికి ఇస్తారు. దాని జేబులో ఒక యూదు ప్రార్ధనా శ్లోకం ఉన్న కాయితం దొరుకుతుందతనికి. దాని సొంతదారు గాస్ చేయబడి చనిపోయి ఉంటాడని తెలిసినా, అతనొదిలిన ఆ కాగితం అందించిన సాంత్వన ఫ్రాంకెల్ ని చాలా రోజులు అంటిపెట్టుకునుంటుంది. 

చాలా చిన్న పుస్తకమే అయినా అది డీల్ చేసిన బరువు వల్ల కాస్త మెల్లగా చదవాల్సొచ్చింది. ఎన్నో అత్భుతమైన వాక్యాలు. ఎన్నో కొటేషన్లు.  నిస్సందేహంగా అత్భుతమైన పుస్తకం !  కొన్ని పదునైన, ఘాటైన విమర్శలు ఎదుర్కొన్నా, విక్టర్ ఫ్రాంకెల్ డిప్లమసీ ని, పుస్తకం అత్భుత విజయం సాధించాకా, దానిని తన బాగ్ లో వేసుకుని రాజకీయ లౌక్యతని, డిప్లమసీ ని ప్రదర్శించాడనీ పలువురు ఈ రచయితని ధారాళంగా తిట్టుకున్నా కూడా, హాలొకాస్ట్ లాంటివి, అణ్వాయుధ దాడులూ మరెన్నడూ జరగకూడదని, గట్టిగా కోరుకుందాం.  అందరు మనుషులూ సమానమే అని - రేసిజం, అపార్థీడ్ లాంటిగాయాలు సమసిపోయి, అందరూ సుఖంగా వుండాలని అనుకుంటాం.

 

------------------------------------------------------------------------------------------------------------------------

Taste the content : 


Quotes :

1)  "He who has a Why to live for can bear almost any How."- Nietzsche 

2)  "That which does not kill me, makes me stronger." - Nietzsche

3) "What you have experienced, no power on earth can take from you."

4) "Mankind was apparently doomed to vacillate eternally between the two extremes of distress and boredom." - Schopenhauer

5) "The neurotic who learns to laugh at himself may be on the way to self-management, perhaps to cure." - Gordon W Allport.


/////some best  lines//// 

1) They died less from lack of food or lack of medicine than from lack of hope, lack of something to live for. 

2) I didn't know whether  my wife was alive, and I had no means of finding out ; but at that moment it ceased to matter.  There was no need for me to know ; nothing could touch the strength of my love, my thoughts, and the image of my beloved.  Had I known then that my wife was dead, I think that I would still have given myself, undisturbed by that knowledge, to the contemplation of her image, and that my mental conversation with her would have been just as vivid and just as satisfying.   "Set me like a seal upon thy heart, love is as strong as death.

3)  To draw an analogy, a man's suffering is similar to the behavior of gas.  If a certain quantity of gas is pumped into an empty chamber, it will fill the chamber completely and evenly, no matter how big the chamber.  Thus suffering completely fills the human soul and conscious mind, no matter whether the suffering is great or little.  Therefore the "size" of human suffering is absolutely relative. 

4) It is not for me to pass judgement on those prisoners who put their own people above everyone else.  No man should judge unless he asks himself in absolute honesty whether in a similar situation he might  not have done the same.

5) It didn't really matter what we expected from life, but rather what life expected from us.

6)  Pleasure is, and must remain, a side-effect  or by-product, and is destroyed and spoiled to the degree to which it is made a goal in itself. 

7)  Freedom, however,is not the last word.  Freedom is only part of the story and half of the truth.  Freedom is but the negative aspect of the whole phenomenon whose positive aspect is responsibleness. 

8)  World is in a bad state, but everything will become still worse unless each of us does his best. So, lets be alert - alert in twofold sense : 

      Since Auschwitz we know what man is capable of 

      And since Hiroshima we know what is at stake.

***********

Victor Frankl - Taken in 1942 and spent two years at Theresuebstadt, sent to Auschwitz and spent 5 days there and shifted to Dachau where he is liberated by Americans in 1945.

What is Holocaust

US Holocaust Museum

Warsaw Ghetto uprising

Logotherapy   

****

28/01/2024

The Ivory Throne - Manu S Pillai

 


The Ivory Throne - Chronicles of the House of Travancore - Manu S Pillai 


ఈ రోజుల్లో ఎందరో షీరో ల గురించి చదువుతున్నాము.   ఏ రంగమైనా కావచ్చు - ఎన్నో అత్భుత విజయాలు సాధించినవాళ్ళనీ,  వాళ్ళు తమ తమ పరిధుల్లోనే, పరిమితుల్లోనే, అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి  మార్పులకు కారణమయ్యేవాళ్ళని గురించి తెలుసుకోవాలి.  Rulers మంచి నిర్ణయాలను తీసుకోవడం వల్ల అవి కాలక్రమేణా ఎందరి జీవితాలలోనో  వెలుగు తీసుకువస్తాయి.   తమ పాలనలో రాజకీయంగా, పరిపాలనా రంగంలో, సామాజికంగా,  స్త్రీలు తీసుకొచ్చిన మార్పుల్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.   కేరళ లో ఉన్న మూడు ప్రసిద్ధమైన రాజవంశాలలో ఒకటైన ట్రావన్ కోర్ రాజవంశం లో ప్రస్తుత కేరళ సమాజం మరిచిపోయిన ఒక (Last Queen) రాణి గురించిన ఏకపక్ష కథ ఈ "ఐవరీ థ్రోన్". రాసింది చాలా చిన్న వయసులో ఉన్న అబ్బాయే. కానీ తన రాష్ట్ర  చరిత్ర రాయడానికి  అతను చేసిన పరిశ్రమ మెచ్చుకోదగ్గది.   

కేరళ లో  తిరువనంత పురం లో ఉన్న ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయం, అక్కడి బ్రహ్మాండమైన నిధులని గురించి ప్రపంచం అంతా మారుమోగిపోయిన నాడు, రాజ వంశం చాలా విమర్శలకు గురయింది.  దేశానికి స్వతంత్రం వచ్చి, రాజరికాలు రద్దయినాక, రాజు కేవలం ఆ అనంత పద్మనాభ స్వామికి దాసునిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకే తిరువనంతపురం లో తన అంతఃపురం లో ఉండాల్సి వచ్చి ఇంత నిజాయితీగా, భక్తిగా, ధర్మ బద్ధంగా బ్రతుకుతూన్నపుడు - ఆయన మీద ఆలయ సంపద ను టిఫిన్ బాక్స్ లో తరలిస్తున్నట్టు ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. 

పుస్తకం, తిరువనంతపురం రాజరికం గురించి విస్తారంగా వివరిస్తూ అక్కడి మాతృస్వామ్య పరిపాలనా వ్యవస్థ గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. పుస్తకం లో చాలా వరకూ రాణి సేతు లక్ష్మీబాయి (సీనియర్ రాణి), సేతు పార్వతీ బాయి (జూనియర్ రాణి) ల మధ్య జరిగిన పోరాటం గురించే గానీ, ఇంతవరకూ బయటికి రాని కొన్ని  విషయాల్ని గురించి కూడా చెప్తూ ముఖ్యంగా రాణి సేతు లక్ష్మీ బాయి గురించి, ఆవిడ తన కున్న తక్కువ పరిపాలనా కాలంలో, తన పరిధిలోనే ఎంత చక్కగా పరిపాలించిందో, కేరళ సమాజంలో ఎన్ని కొత్త మార్పులకు ఆవిడ నిర్ణయాలు ఊతమిచ్చాయో, మాతృస్వామ్య వ్యవస్థ లో మహిళ సామాజిక స్థానం ఏమిటో చాలా బోల్డంత విపులంగా వివరిస్తుంది.  ఇంత ఎక్కువ సమాచారం ఎలా సేకరించి ఉంటాడో ఈ అబ్బాయి. ఎన్ని ఇంటార్వ్యూ లు ! ఎన్ని కోట్ లు, ఎంత క్రోడీకరణ, ఎంత పరిశోధన, ఎన్ని ప్రశంసలు, ఎన్ని విమర్శలు !! 

మను పిళ్ళై కేరళలో పుట్టి, పూనే, లండన్ ల లో విద్యాభ్యాసం ముగించి, శశీ థరూర్ పార్లమెంట్ ఆఫీస్ లో కొన్నాళ్ళు, లండన్ లో  లార్డ్ బిలిమోరియా దగ్గర కొన్నాళ్ళూ పని చేసాడు. ఆ తరవాత బీబీసీ లో హిస్టారియన్ గా కూడా పని చేసాడు. "ద ఐవరీ థ్రోన్" అతని మొదటి పుస్తకం. ఆరేళ్ళు పట్టింది ఈ పుస్తకం రాయడానికి. అతను ఎంత ప్రయత్నించినా, 'జూనియర్ రాణి' కుటుంబం నుంచీ అతనికి ఒక్క ఇంటర్వ్యూ కూడా దొరకలేదు.  దాంతో అతని రీసెర్చ్ అంతా 'సీనియర్ రాణి' కుటుంబం చెప్పిన విషయాలు, అప్పటి డాక్యుమెంట్ లు, చారిత్రక సాక్షాల ఆధారంగా సాగింది. కాబట్టి ఇది ముగించేసరికీ, ఇదంతా సీనియర్ రాణిని సమర్ధిస్తూ రాసిన కథ అనిపిస్తుంది. కాకపోతే, ఆ సీనియర్ రాణి ఒక షీరో కాబట్టి - ఆవిడ జీవితం, ఒక Matriarch గా ఆవిడ జీవన విధానం, రాణి గా ఆమె సాధించిన విజయాలు, మాజీ రాణి గా అనుభవించిన బాధలు చదివి - ఇప్పటి కేరళ సమాజం ఆమె గురించి పూర్తిగా మర్చిపోయింది కాబట్టి అలాంటి వ్యక్తి ఒకరంటూ ఉన్నారని తెలియజేయడం కోసం రాయబడిన పుస్తకం అనిపిస్తుంది.    

Travancore గురించి ఇంత సమాచారం చదవడం ఒక పెద్ద  విషయం. ఇన్ని డీటైల్స్ - ఇన్ని వివరణలు, ఇంత ఒక పుస్తకం లో ఇరికించడం కష్టమే. కేరళ లో మొదట విదేశీయులు అడుగుబెట్టి, వ్యాపారం మొదలు పెట్టినప్పటికే అక్కడి సామాజిక పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తాయి. కేరళ ఒక రాజకీయ దేశం. అక్కడి ప్రజలు చైతన్యవంతులు. ముఖ్యంగా పోరాట వీరులు. స్త్రీలు పురుషులతో సమానంగా యుద్ధాలలో పోరాటాలు చేసారు. రాజ్యాలని ఏలారు. అలాంటి   రాజ్యంలోకి సిరియన్ లు, ఫ్రెంచు వారు, పోర్చు గీసు వారు, అరబ్బులు వచ్చారు. దక్షిణ మలబార్ లో కాలికట్ ని ఏలిన రాజు జమోరిన్ (సమూథిరి)  (ఇంద్రుడి లాగా ఇదో టైటిల్) ఆ రోజుల్లో  కేరళ రేవులకి రారాజు. వాస్కోడి గామా కేరళ తీరం చేరగానే అతనికి 'మను విక్రముడు' అనే జమోరిన్ నుండీ పిలుపు వస్తుంది. 

అప్పటి దాకా యూరోపియన్ లకి అరబ్బుల వల్ల, ఇస్లాం వల్ల ఖండాంతర వాణిజ్యంలో దాదాపు పూర్తిగా బాగా restrict అయిన దారిలో ప్రయాణించి, మొత్తనికి కేరళ తీరం చేరుకున్నాక వాళ్ళకి అప్పటికే వ్యాపారంలో ఎంతో ప్రగతి సాధించేసిన జాతి ఎదురయింది. అరబ్బులు పర్షియా, యూరోప్ నుండీ, చైనా నుంచీ మింగ్ రాజులు కేలికట్ ని తరచూ సందర్శించేవారు. 140 నుండీ 1430 వరకూనే చైనీస్ ఎడ్మిరల్ ఝెంగ్ ఏడు సార్లు 250 ఓడల్లో, 28000 మంది సైనికులతో కేలికట్ వచ్చాడు.  చైనీస్ ఆఖర్న కేరళ  వొదిలి వెళ్ళీనాటికి కేలికట్ లో సగం మళయాళీ, సగం చైనీ, మలయ్ ల తో కూడిన 'చిన్న క్రిబల' అనే ఉప జాతి కూడా తయారయింది. ఇక్కడ ఇంత వాణిజ్యం జరుగుతుంది కాబట్టి ఇక్కడి రాజు కూడా చాలా బలవంతుడు. ధనికుడు. అసలు పోర్చుగీసు వాళ్ళకి ఈ సంపద చూస్తే కళ్ళు తిరిగినట్టయింది. 

అయితే యూరోపియన్ లకు అరబ్బుల నిండీ వ్యాపారపరంగా ఎదురైన పోటీని నిలువరించడానికి పోర్చుగీసు మెల్లగా కేరళ లో ఇతర రేవు పట్టణాల వైపు చూడడం మొదలుపెట్టింది. కొచ్చిన్, మలబారు ల మధ్య ఉన్న చారిత్రాత్మక గొడవలని అడ్డు పెట్టుకుని, జమోరిన్ ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ, తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నం చేసాయి. పైగా కేరళ అప్పట్లో రాజకీయంగా దేశంలో ఇతర దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా యుద్ధ భయాన్ని ఎదుర్కొంటూ అటు సముద్రంలో పోర్చుగీస్ తో యుద్ధం చెయ్యడం - వగైరాల వల్ల కాస్త వెనకబడుతుంది. జమోరిన్లు వైభవంగా పోరాడి విఫలం అయ్యారు. కేరళ చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. 18 వ శతాబ్దం వచ్చ్చేసరికీ కేరళ తన గత ప్రాభవానికొక నీడ లా మిగిలిపోయింది. 

అయితే విదేశీయులతో ఇంత దీర్ఘమైన సంబంధాలుండడం వల్లనూ, ఎన్నో దేశాలనుండీ వలస వచ్చిన వివిధ మతాల వాళ్ళ వల్లనూ, కేరళ లో బోల్డన్ని మతాలు వ్యాప్తి చెంది, సమాజం చాలా inclusive  గా తయారయింది. అయితే కేరళ లో ఉన్న హిందూ సమాజం కూడా చాలా కులాలతో, శాఖలతో అల్లుకుని ఉంటుంది. దానిలో నాయర్ లు - పాములను పూజించే, యుద్ధ వీరులు. వాళ్ళ వృత్తి సైనిక వృత్తి ! వివిధ రాజుల తరఫున యుద్ధాలు చేయడం వాళ్ళ రక్తంలోనే ఉంది.  ఎపుడూ ఎక్కడో ఓ చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు యుద్ధానికి వెళ్ళి చచ్చిపొనైనా పోతారు, ఇంకోర్ని చంపేసేయినా వస్తారు. జమోరిన్ ల కూ, కొచ్చిన్ రాజులకూ మధ్య యుద్ధాలు, పగలు, ప్రతీకారాలూ ఎప్పుడూ జరుగుతూనే వుందేవి. అందుకని వాళ్ళలో పెళ్ళి, రొమాంటిక్ రిలేషన్ లు కూడా ఎక్కువగా, ఫ్రీ గా ఉండేవి. స్త్రీలకు పురుషులతో సమానాధికారాలు ఉండేవి. అవి బయటి నుండి చూసే విదేశీయులకు చాలా ఆశ్చర్యం కలిగించేవి.  అక్కడ స్త్రీలు వ్యక్తితం తో బ్రతుకుతూ, పెద్ద పెద్ద ఇళ్ళను, ప్రాంతాలను ఏలే వాళ్ళు. యుద్ధాలు చేసే వాళ్ళు. కత్తులతో, బాణాలతో వీళ్ళు చేసిన పోరాటాల్ని గురించి ప్రజలు జానపద గాధలు చెప్పుకునేవారు. పాటలు పాడుకునేవారు. అలాంటి జమోరిన్ ల రాజ్యం 1760 లలో యుద్ధాల బారిన పడి సమసిపోయినప్పుడు, జమోరిన్ లు తమ రాజ్యాన్ని, పేలేస్ లనూ విడిచిపారిపోవల్సివచ్చిన దశలో ట్రావన్ కోర్ (తిరువనంతపురం) రాజ్యం పైకి ఎదగడం ప్రారంభం అయింది. 

అప్పటికే చుట్టుపక్కల నాయక రాజులు (మధురై), ఆర్కోట్ నవాబు (మొఘలులు), కేప్ కేమొరిన్ కీ, ట్రావెంకోర్ కీ మధ్య ఉన్న ఈ చిన్ని జమీందారీ లాంటి రాజ్యాన్ని అన్నిరకాలుగా దోచేస్తున్నపుడు కుపాక వంశానికి చెందిన తిరువనంతపురం రాజుల్లో "మార్తాండ వర్మ" అనే అతను తిరగబడి, యుద్ధాలలో విజయం సాధిస్తాడు. అదీ తిరువనంతపుర 'కుపాక' వంశ  రాజుల మొదటి విజయం. అప్పటి దాకా తమలో తాము పోరాడుకుంటూ, విపరీతమైన కుల రాజకీయాల్లో, బ్రాహ్మణ-నాయర్ల ఫైటింగుల్లో చీలికలైపోయిన కేరళ అతన్ని గుర్తిస్తుంది. తనకిష్టం లేని పద్ధతుల్ని ఉక్కుపాదంతో అణిచేసి చాల శక్తివంతంగా ఎదిగాడు మార్తాండ వర్మ. 

హైదర్ ఆలీ కేరళను దాదపు తుడిచిపెట్టేసిన సమయానికి కేవలం దక్షిణ కేరళ లో 'తిరువంతంతపురం' మాత్రమే నిలబడగలుగుతుంది.  ఆఖరికి టిప్పు సుల్తాన్ కూడా కేరళ ను గెలిచేందుకు ప్రయత్నించి విఫలమవుతాడు. ఐతే నాయర్ల శౌర్య పరాక్రమాల వల్ల అప్పటిదాకా ఎలాగో నెగ్గగలిగినా - ఈస్ట్ ఇండియా కంపెనీ దేశం లో వేళ్ళూనగలిగే సరికీ, కంపెనీ అండ తన రాజ్యానికి అవసరం అని ట్రావెన్ కోర్ గుర్తిస్తుంది. అటు జమోరిన్ లు కోలుకుంటారు. మిగిలిన కేరళ అంతా కూడా రాజకీయంగా మారుతుంది. 

మార్తాండ వర్మ మరణం తరవాత రెండు వందల సంవత్సరాలు దేశం పరాయి పాలన లోనే ఉంది. అప్పటి నుండీ, ఇప్పటి దాకా తిరువంతంతపురం లో రాజరికపు ప్రయాణం గురించి ఈ పుస్తకం చాలా డీటైల్స్ ఇస్తుంది.  తిరువనంతపురం  పాలించిన రాజులు ఎందరో చాలా మంచి పాలనని తమ ప్రజలకు అందించారు. కంపెనీ కి ఎదురు తిరగకుండానే, ఒక స్థిరమైన వ్యవస్థ ని ఏర్పరిచారు, 

ఈ రాజుల్లో రాజ్యాన్ని ఏలిన మహారాణులున్నారు. వీళ్ళలో ఆఖరి రాణి సేతు లక్ష్మీ బాయి 1920 లలో దేశం లో పెను మార్పులు చోటు చేస్కుంటున్న టైం లో ఈ 'ఏనుగు దంతపు' సింహాసనం నుండీ రాజ్యాన్ని ఏలారు. బైటి శక్తులనుండీ, లోపలి శత్రువులనుండీ తనని తాను, రాజ్యాన్ని, మర్యాదలనీ కాపాడుకుంటూ చాలా నిజాయితీ గా తన పాత్రని పోషించారు. స్వతంత్రం వచ్చాక అంత వరకూ ఓ వెలుగు వెలిగిన ట్రావెన్ కూర్ రాజ్యం  మెల్లగా తెర వెనక్కు తప్పుకుంది. రాణి తన స్థానాన్ని వొదులుకుని సామాన్యురాలిగా జీవించింది.  

ఒకవిధంగా అధికారం కోసం కుటుంబం తో నే పోరాడలేక ఓడి,  రాజరికపు జీవితం నుండీ విషాదంగా, విరక్తి తో తప్పుకున్న రాణి జీవితం  గురించి చెప్పిన పుస్తకం ఇది.  ఆఖరికి  ఆవిడ చేసిన మంచి పన్లని చెప్పుకోవడానికి, ఆవిడ ముందుచూపు నీ, నిరాడంబరతనీ, నిజాయితీని, ఆవిడ కుటుంబం పాటించిన విలువలనీ ఎప్పటికీ కేరళ మర్చిపోకూడదని ఈ ప్రయత్నం చేసారు మను పిళ్ళై. 

కేరళ నుండీ వచ్చి, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకళాకారుడు రాజా రవి వర్మ కూతురి కూతురే సేతు లక్ష్మీ బాయి (పూరాడం తిరునాళ్ సేతు లక్ష్మీ బాయి).  కేరళ లో రాజరికం మాత్రుస్వామ్య పద్ధతిని అనుసరిస్తుంది. రాజు భార్య రాణి కాదు. రాజు కు పుట్టిన పిల్లలకూ వారసత్వం వెళ్ళదు.  కుటుంబంలో పెద్ద మహిళ (అమ్మ) రాణి అవుతుంది.  రాజు సోదరి పిల్లలు రాజ్యాధికారానికి అర్హులు. ఒక వేళ రాజు కు సోదరి లేకపోయినా, ఆ లైన్ లో పిల్లలు లేక పోయినా,  రాజ వంశానికి సోదరి వంశమయిన "అట్టింగళ్" వంశపు పాపాయిలను దత్తత తీసుకుంటారు. అలా రాజా రవివర్మ మనవరాళ్ళయిన ఇద్దరు పాపాయిలను దత్తతకు తీసుకున్నారు. వారిలో పెద్ద అమ్మాయి ఈ సీనియర్ రాణి. రెండో పాప జూనియర్ రాణి అన్నమాట (వీళ్ళ తల్లులు వేర్వేరు. రవి వర్మ కూతుర్లు) .   అయితే  వీళ్ళ తదనంతరం చట్టాల సవరణల కారణంగా  ఈ దత్తత సాంప్రదాయం ఇప్పుడు సమసిపోయినట్టే. ఆ రకంగా సేతు లక్ష్మీబాయి ఆఖరి రాణి.  ఆమె తరవాత జూనియర్ రాణి కుమారుడు రాజయ్యాడు. అతను పుట్టిన తరవాతనే సీనియర్ రాణికి కూతుర్లు పుట్టారు. కాబట్టి ఇంట్లో పెద్ద వాడు జూనియర్ రాణి కొడుకు కాబట్టి, ఆయనే రాజయ్యాడు. 

ఆవిడ పాలించిన కాలం 1924 - 1931 -(7 years, as a Regent)  చాలా కొద్ది సమయమే అయినా, ట్రావెన్ కోర్ లో కొన్ని మంచి పనులు జరిగాయి. దేవదాసీ వ్యవస్థ రద్దయింది. జంతుబలులను నిషేధించారు.  గ్రామాలలో స్థానిక ప్రభుత్వ వ్యవస్థని ప్రోత్సహించేందుకు పంచాయితీ వ్యవస్థను తెచ్చారు.   కుల చైతన్యం పెరిగింది. అంటరానితనం, ప్రధాన రహదారుల్లోకి హరిజనులను రానివ్వకపోవడం వంటివి ఆపారు. కొన్ని ప్రధాన ఆలయాల లోనికి అన్ని కులాల వారూ ప్రవేశించడాన్ని అనుమతించారు. 1928 లో చివరికి మాతృస్వామ్య వ్యవస్థ రద్దయి పితృస్వామ్య వ్యవస్థ కేరళ లో మొదలయింది. అయితే అదే సమయంలో సేతు లక్ష్మీబాయి పద్మనాభస్వామి దేవాలయంలోకి హరిజనులను అనుమతించకపోవడంతో విమర్శలకు గురయ్యారు.  కేరళ లోకి రైళ్ళు, విద్యుత్, కొత్త సాంకేతికతలు, ప్రవేశించాయి. ఇవన్నీ కేరళ సమాజం లో సామాజికంగా తీసుకొచ్చిన మార్పులకు దారితీసాయి.  

రాణి స్వయంగా స్త్రీ విద్య ని, ఉచిత ప్రాధమిక విద్య ని, అందరికీ సమానమైన విద్యావకాశాలను, స్కూళ్ళలో పిల్లలకు ఉచిత ఆహారాన్ని అందించడం లాంటి పనులను దేశంలో బహుశా మొదటి సారే మొదలు పెట్టారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుండీ, విద్యలో / అక్షరాశ్యతా శాతం, బళ్ళూ, రోడ్లూ, ఆస్పత్రులతో మంచి జీవన ప్రమాణాలని తన ప్రజలకు అందివ్వడంలో కేరళ ముందుండడానికి కారణం సేతు లక్ష్మీబాయి.  వైద్యాన్ని చాలా ఎక్కువ ప్రోత్సహించారు. మహిళలు వైద్య విద్యని చేపట్టేందుకు చాలా ప్రయత్నాలు చేసారు. మొదటి మహిళా వైద్యురాలిని దర్బారులోనికి తీసుకున్నారు. ఎందరికో స్కాలర్షిప్ లు ఇచ్చి డాక్టరీ చదివించారు. రహదారులు, రైల్వే లైన్లూ వేసారు. టెలిఫోన్లు వచ్చాయి. విద్య మీద బడ్జెట్ లో 22% కేటాయించారు. ఇవన్నీ ఆమె రీజెన్సీ ముగిసాక కూడా కేరళ ని దేశంలో ఎంతో అభివృద్ది సాధించిన దేశంగా నిలబెట్టాయి.  

అసలే మాతృస్వామ్య వ్యవస్థ చాలా కులాల్లో రద్దయినా, స్త్రీలు సామాజికంగా, ఆర్ధికంగా కూడా వెనకబడిపోలేదు. ఆడ పిల్లలు వైద్య వృత్తిలోకి, ఇతర సాంకేతిక విద్యల్లోకీ రావడానికి రాణి పాలసీలు ఎన్నో పని చేసాయి. ఆమె కాలంలో తలెత్తిన గొడవలు, రక్తపాతానికి ఎప్పుడూ దారితీయలేదు. గొడవల్ని నిర్దాక్షిణ్యంగా అణిచేసే ప్రయత్నమూ జరగలేదు. ఆంగ్ల విద్య ప్రాముఖ్యత దేశం లో పెరిగింది. అలాగే కేరళ లో కూడా క్రిస్టియన్లు, చిన్న కులాల వాళ్ళూ కూడా ఆర్ధికంగా ఎదిగారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువయి ఉన్న ఉద్యోగాలు తక్కువవడం వల్ల బయటి దేశాలలో ఉపాధి వెతుక్కోవడం, మనియార్డర్ ఎకానమీ రావడం సాధ్యపడింది. బ్రిటిష్ ఆంత్రోపోలజిస్ట్ ఆడ్రియన్ మేయర్ చెప్పినట్టు "కేరళ గురించి తెలిసిన ఎవరికైనా ఆమె సామాజికంగా చారిత్రకంగా ఒక గొప్ప మనిషి". ఒక రకంగా ఆమె గురించి ఇలా తెసులుకోవడం మనకీ బావుంటుంది.  

అప్పటికి దేశంలో మిగిలిన సంస్థానాల రాజులు, నల్లమందు, వేశ్య లతో, వేటలతో ఆనందాలలో వ్యసనపరులు, స్త్రీలోలులు గా మిగిలి - బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టాల్సిన కప్పం కోసం విపరీతమైన పన్నులతో వాయగొట్టి, ప్రజల్ని పీడించుకు తినడంలో మునిగిపోయి  అటు ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వం దృష్టి లోనూ చవటల్లా, పనికిరాని వాళ్ళుగా మారుతున్నప్పుడు, దేశంలో  చాలా మంచి పరిపాలనా విధానాలని ఈ రాణి అవలంబించింది. ఏదేమయినా గానీ, కొన్ని పొగడ్తలు, కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, స్వయానా మహత్మా గాంధీ కూడా ఆవిడ వ్యక్తపరచిన కొన్ని 'నిస్సహాయత' లను అర్ధం చేసుకోగలిగేలా చేసింది. తాను నిర్వర్తిస్తోన్నది ఒక డ్యూటీ నే! తన చేతిలో సర్వాధికారాలూ ఉన్నా కూడా  అందరి అంగీకారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ప్రజల మీద రుద్దడం లాంటివి చెయ్యలేదు. ఆఖరికి వివిధ కారణాల వల్ల తన కజిన్ (Junior Queen)  కుటుంబం తనని అమర్యాదకరంగా చూసినా సరే, ఆస్తుల్ని వొదులుకోవాల్సి వచ్చినప్పుడు చాలా  detached గా అన్నిటినీ వొదులుకున్నారు. 

ఈ పుస్తకం, ముందే చెప్పినట్టు ఏకపక్షంగానే అనిపించినా, కేరళ చరిత్రని చాలా విస్తారంగా రికార్డ్ చేసినందున విపరీతమైన డీటైల్స్ ఉన్నా కూడా చదవాల్ని అనిపిస్తుంది. దీనికి నేను ఇంతకు ముందు చదివిన రాజారవి వర్మ జీవిత చరిత్ర చాలా పనికొచ్చింది. తన మనవరాళ్ళని రాణులుగా దత్తత తీసుకోవడానికి జరిగిన ప్రయత్నాలనీ, వాటికి తమ కుటుంబంలోనే ఎదుర్కోవల్సిన వ్యతిరేకతనీ, ఆ మంటల్ని ఎప్పటికప్పుడు ఆర్పుకుంటూ వచ్చి చివరికి ఎంత సంప్రదాయబద్ధంగా దత్తత ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందో రవివర్మ చెప్పడం వల్ల, ఈ రాణుల వ్యవస్థ అర్ధం చేసుకోవడం సులువయింది.  

రాజుల కథల్ని మనం ఇంతగా ఎంజాయ్ చేస్తామనేనేమో ఈ పుస్తకం విడుదలయ్యాక శోభు యార్లగడ్డ (బాహుబలి నిర్మాత - ఆర్కా మీడియా) హక్కుల్ని కొన్నారట.  మార్తాండ వర్మ గా ఎవర్ని ఊహించుకుంటున్నా, రాణి సేతు లక్ష్మీ బాయి గా ఎవరు నటిస్తారో అని ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఈ కథ చాలా పెద్దది.  అయితే ఈ రాణుల  మనుమలు, మునిమనుమలు, తమ తమ రంగాల్లో పేరు తెచ్చుకున్నారు. వివిధ దేశాల్ల స్థిరపడ్డారు. వివాదాలలోకి లాగబడడానికి ఎవరికీ తీరికా, ఇష్టమూ లేనే లేవు.   ఇప్పటికీ సీనియర్ రాణి మనుమలు రాజులవడానికి టెక్నికల్ గా క్యూ లో ఉన్నా వాళ్ళు మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.  జూనియర్ రాణి వారసులు కూడా మౌనంగా పక్కకు తప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కర్నాటక సంగీత ప్రముఖుడు అశ్వత్థి స్వాతి తిరునాళ్ వంశం నుంచీ ఇప్పట్టి తరానికి సంగీత వారసత్వన్ని మాత్రమే ఘనంగా మోసుకొచ్చిన ప్రిన్స్ రామ వర్మ కూడా జూనియర్ మహారాణి వారసుడే. ఆయన కూడా రచయిత తో మాట్లాడేందుకు నిరాకరించడం అర్ధం చేసుకోతగ్గదే.  

ఇప్పుడు రాజరికాలేంటి ? ఆస్తుల పోరాటాలు తప్ప ! వివిధ వ్యాజ్యాలలో సీనియర్ రాణి వారసులు ట్రావెన్ కోర్ లో ఆస్తుల పై, పాలెస్ ల పై అధికారాల్ని కోల్పోయారు. కొన్ని సుప్రీం కోర్ట్ లో ఉన్నాయి.   కాబట్టి కహానీ అభీ ఖతం నహీ హుయీ. 555 పేజీల చరిత్ర  (పూర్తి పేజీలు వివరణలతో, నోట్స్ తో సహా 694 Pages) మొత్తానికి పూర్తి చేసాక ఏదో పెద్ద మహాభారతం చదివినట్టు తృప్తి దొరికింది. అదే కదా కావల్సింది.   వైకోం సత్యాగ్రహం, దీవాన్లు, కేరళ రాజకీయాలపై తమిళుల ప్రభావం, రాజరికాలు, పెన్షన్లు, గ్రాంటు లు, రాజుల పరివారాలు, ఆచారాలు, కట్టుబాట్లు, ట్రైనింగు లు, ఆంగ్ల విద్య, పర్యటనలు, మత రాజకీయాలు, ఆస్తులు, వ్యాజ్యాలు అన్నీ కలిపి చాలా పెద్ద కథ. కుటుంబ రాజకీయాలు, బ్రిటిష్ వాళ్ళ సొంత అభిప్రాయాలు వగైరాలు తప్ప  స్కాండల్, ఆకర్షణీయమైన అంశాలూ పెద్దగా లేవు. కానీ లక్ష్మీ బాయి జీవితానికి మంచి Tribute ఈ పుస్తకం. 

***



21/01/2024

Things Fall Apart (చెదిరిన సమాజం - చినువా అచెబీ) - Chinua Achebe



Telugu :  చెదిరిన సమాజం - చినువా అచెబీ

(అనువాదం : శ్రీ కొలసాని సాంబశివరావు) 


ఈ పుస్తకం (Things Fall Apart), నైజీరియన్ నవలాకారుడు చినువా అచెబీ మొదటి నవల. 1958 లో ప్రచురించబడింది.  ఇప్పటి వరకూ దాదాపు  20 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైన ఈ నవల, ఇంగ్లీష్ లో వచ్చిన తొలితరం ఆఫ్రికన్ సాహిత్యపు అక్షయ పాత్ర. 1923 నుండీ 2005 దాకా ఇంగ్లీషు లో వచ్చిన 100 గొప్ప పుస్తకాలలో ఒకటి గా Time చేత కీర్తించబడింది. 50 కి పైగా భాషల్లోకి అనువదించపడి, ఆఫ్రికా గురించి లోకం తెలుసుకునేలా చేసిన నవలల్లో ప్రసిద్ధి చెందినది.  నైజీరియాలో ఊహాజనితమైన ఒక గ్రామం, అక్కడి తెగలు, వాటి శౌర్యం, కట్టుబాట్లు, ఆచారాలు, మూఢ నమ్మకాలు,  చిక్కుముళ్ళు, సాంప్రదాయాల గురించి చాలా సహజమైన చిత్రణతో రూపుదిద్దుకున్న నవల ఇది. ఆఫ్రికన్ సమాజపు జీవితం, క్రైస్తవ మిషనరీల రాకతో ఎంతగా మారిపోతుందో - డాక్యుమెంట్ చేసిన నవల. అచెబీ తరవాత ఆఫ్రికన్ జీవన విధానం గురించి అలవొకగా రాయగలిగిన స్థానిక రచయితల్ని బాగా ప్రభావితం చేసిన నవల కూడా. 

ఒకొన్ క్వో ఈ నవలలో ప్రధాన పాత్ర. అతను దుర్భర బీదరికం  నుండీ తనను తాను రక్షించుకుని, కఠోర శ్రమతో తన జీవితాన్ని ఒక దారిలో పెట్టుకున్నవాడు. శ్రమకోర్వలేని, పిరికివాడయిన తన తండ్రి, తన భార్యాపిలల్ని అర్ధాకలిలోనే జీవితాంతం ఉంచడాన్ని, అప్పుల్లో మునిగి తేలి ఆడడాన్ని అస్సలు సహించని కొడుకు గా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదిగి, ముగ్గురు భార్యలు, పిల్లలతో, 'తెగ పెద్దల్లో' ఒకడుగా చలమణీ అయే స్థాయికి ఎదిగిన ఒకొన్ క్వో చుట్టూనే కథ నడుస్తుంది. 

అదృష్టవశాత్తూ ఈ నవలని తెలుగులో చదివి, తెలుగు భాషా సౌందర్యం, చదవడంలో సౌలభ్యంతో అసలు ఇంత సింపుల్ గా చక్కగా అనువదించినందుకు అనువాదకుడికీ, ఇంత సులువు భాషలో రాసినందుకు నైజీరియన్ రచయితకూ నమస్కారం పెట్టుకోవాలనిపించింది.  W.B. Yeats రాసిన The Second Coming  అనే కవిత  లోంచి శీర్షికనూ వస్తువునూ రచయిత స్వీకరించారు.  

----------------------------------------------------------------------------

Things fall apart ; the centre cannot hold ; 

Mere anarchy is loosened upon the world. 

అన్నీ చెల్లా చెదురైపోతాయి. ఎవరూ దాన్ని ఆపలేరు. 

ప్రపంచమంతటా అరాచకత్వమే వెల్లివిరిసింది. 

-----------------------------------------------------------------------------

ఒకప్పుడు ఐక్యంగా ఉన్న తెగకు సంబంధించిన కథ ఇది. అప్పట్లో ఆ తెగలో వారందరిదీ ఒకే మాట. అందరిలోనూ ఒకేరకమైన చైతన్యం వుంటుంది.  తెల్లవాడు వచ్చాక ఆ ఐక్యత భగ్నమవుతుంది పాత సమాజం క్రమంగా శిధిలం అయిపోతుంది. అశరీర వాణి (Oracle) ని దైవంగా ఆరాధించే ఒక ఆఫ్రికన్ తెగ - ఆ తెగ వారికీ ప్రకృతికీ గల అనుబంధం, కట్టుబాట్ల పేరుతో జరిగే న్యాయ తీర్పుల అన్యాయమూ, సంస్కృతి పేరుతో నడిచిన అనాగరికతలని గురించి, చెప్పిన రచయిత, చివరిదాకా - కథ ను గ్రిప్పింగ్ గా చెప్పుకుంటూ రావడం వల్ల, ఇప్పుడు ఎన్నో నాగరికతలు అంతరించిపోయి, రోజుకో కొత్త నాగరికత పుట్టుకొస్తున్న కాలంలో - కొత్త కొత్త తప్పొప్పుల మధ్య పాత విధానాలు సమసిపోయాక, ఏదో ఇతిహాసం చదివినట్టు అనిపిస్తుంది.  

నైజర్ నది ఒడ్డున ఇబో  గ్రామం లో  ఉమ్యోఫియా తెగలో  సోమరిపోతు తండ్రి ఉనోకా, అతని బలవంతుడైన కొడుకు ఒకోన్ క్వో ల కథ ఇది. ఉనోకా సంగీత కళాకారుడు. పిల్లంగోవి వాయిస్తాడు. కానీ అతనికి యుద్ధాలంటే భయం. ఒకోన్ క్వో కు బీదరికమంటే భయం. ఎవరయినా తనని అశక్తుడనో, భీరువనో అనుకుంటారని భయం. తన భయాలను అణుచుకునేందుకు అతనెంచుకునే మార్గం, ఎదురుదాడి, అహంకారం, శౌర్యం, కోపం.  పైగా అతను తన తండ్రి చివరి దశను చూసి ఉన్నాడు కనుక, అలాంటి ఒంటరి చావు తనకు రాకూడదని, తన తెగలో పెద్దమనుషుల్లో ఒకడిగా - అందరి మధ్యా, తన పెద్ద కుటుంబంతో బ్రతకాలని ఆశిస్తూ, తన జీవితాన్ని కేవలం శ్రమతో, కష్టంతో, విపరీతమైన పట్టుదలతో మలచుకున్నవాడు. అతనికి ఉన్న అవలక్షణం విపరీతమైన కోపం. అతని భార్యలు అతనికి అణిగిమణిగి ఉండటానికి ఆ కోపమే అతనికి ఉపయోగపడుతుంది.  అయితే అదుపులో ఉంచుకోలేని ఆ కోపమే అతని పతనానికి, వైఫల్యానికీ దారితీస్తుంది.  

ఎంబయినో గ్రామం వాడొకడు వీరి గ్రామపు మహిళను హత్య చేయడంతో పరిహారంగా  వారితో సంధి చేసుకోవడానికి ఒక పెద్ద మనిషిగా వెళ్ళి, (లేకపోతే ఉమ్యోఫియా తెగ వారు వారి గ్రామాన్ని మట్టి కరిపిస్తారు. వారికి, వారి తెగకూ, ఆ ప్రాంతాలలో కెల్లా గొప్ప యోధులని పేరుంది మరి)   అక్కడి నుండీ ఒక కన్నెపిల్లనూ, ఎకెమి ఫ్యునా అనే పదిహేనేళ్ళ బాలుడినీ తీసుకొస్తాడు ఒకోన్ క్వో.  పిల్లను మరణించిన మహిళ భర్తకు భార్యగా అప్పగిస్తారు. పిల్లవాడిని ఒకోన్ క్వో సంరక్షణలో నే ఉంచుతారు. ఆటవిక తెగల్లో, హత్యకు బదులు - హత్యే.   ఈ పిల్లాడి సంగతి తరవాత  చూద్దామని నిర్ణయిస్తారు. తన ప్రయాణం 'మృత్యువు వైపే' అని తెలీని ఆ పిల్లాడు మూడేళ్ళు తన సొంత ఇంటిని మరచి, వీళ్ళతోనే ఉంటాడు. ఒకోన్ క్వో ని "నాన్నా"  అని పిలుస్తాడు. అతని కొడుకుతో కలిసే పెరుగుతాడు. అందరికీ అతనంటే వాత్సల్యం పెరుగుతుంది. కానీ దైవం చెప్పాడని, మూడేళ్ళ పాటు తన పిల్లలతో సమానంగా సాకిన ఆ పిల్లాడిని,  నిర్దాక్షిణ్యంగా నరికేసి చంపేస్తారు.  ఆ చంపేస్తున్న వాళ్ళ గుంపులో ఒకోన్ క్వో కూడా వుంటాడు. "నాన్నా, నన్ను చంపేస్తున్నారు!"  అని అరుస్తూ తనకేసి పరిగెత్తుకొచ్చిన కుర్రాణ్ణి,  "తెగ గౌరవం కోసం, మిగిలినవాళ్ళు తనను పిరికివాడనుకుంటారని భయంతో",  నిలువునా నరికేస్తాడు.  

ఆ పాప కార్యం - 'తెగ దేవుడి' వచనం (భవిష్య వాణి)  ప్రకారం, తెగ కోసం, ప్రకృతి నియమాల కోసం అని సర్ది చెప్పుకున్నా కూడా చాలా రోజులు ఒకోన్ క్వో మనిషి కాలేకపోతాడు. ఒకోన్ క్వో కొడుకు 'న్యోయే'  మాత్రం, తాత మనస్తత్వంతో పుడతాడు. అతను పిరికివాడు. అతనికి, నరకడాలు, చంపుకోవడాలు ఇష్టం వుండదు. ఎకెమి ఫ్యూనా మరణం, తనని తండ్రిని ద్వేషించేందుకు దోహదం చేస్తుంది. కథలో చివరికి అతను తెగ కట్టుబాట్లకు వ్యతిరేకంగా తిరగబడి క్రైస్తవ మిషనరీల ప్రభావంలో పడి క్రైస్తవుడవుతాడు.  జీవితంలో ఒకోన్ క్వో వంటి వైభవం సంపాయించుకున్న నాయకుడు కూడా విధివశాత్తూ  విఫలుడౌతాడు. అతనితో పాటు అతని తెగ కూడా చిద్రమయిపోతుంది. 

తెగలో కొన్ని తీవ్రమైన కట్టుబాట్లుంటాయి. అక్కడ ప్రతి ఊరికీ, ఒక్కో "పాపిష్టి  అరణ్యం" ఉంటుంది. కుష్టు, మశూచి లాంటి జబ్బులతో చనిపోయినవారిని ఆ అడవుల్లో పాతుతారు. ఉనేకా మరణించేటప్పటికి అతని శరీరం వాచిపోతుంది. అట్లా  వాయటం వాళ్ళ నమ్మకాల ప్రకారం అరిష్టం.  జబ్బు అంటే నేలతల్లికి ఇష్టం వుండదు. కాబట్టి ఆ జబ్బు మనిషిని బ్రతికుండగానే ఆ అరణ్యంలోకి తీస్కెళ్ళి వదిలేస్తారు. అటు వంటి వారి మృతదేహాలకు సంస్కారాలేవీ ఉండవు. అవి అడవిలో ఎండాల్సిందే.   ఉనేకా ని అడవిలోకి ఈడ్చేటప్పుడు, అతను తన పిల్లంగ్రోవిని వెంట తీసుకుపోతాడు.  ఊర్లో ఎవరికైనా కవలలు పుడితే, ఆ పసి కూనలని కుండ పెంకుల్లో పెట్టి, చావడానికి, అడవిలో వొదిలేస్తారు.   కవల పిల్లలు పుట్టడం కూడా అపచారమే. అలా ఆ అరణ్యం దుష్ట ఆత్మలతో ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. 

అనారోగ్యాలతో, అశుభ్రత తో ఎందరో శిశువులు మరణిస్తుంటారు కదా. ఒక తల్లికి ఇలా పదే పదే పిల్లలు పుట్టి మరణిస్తుంటే, అలా మళ్ళీ మళ్ళీ పుట్టీ, చచ్చీ, తమ తల్లుల్ని క్షోభ పెడుతున్న్నందుకు ఆ చనిపోయిన శిశువు తాలూకు ఆత్మ, మళ్ళీ పుట్టేందుకు / పుట్టి మళ్ళీ చనిపోయేందుకు భయపడేలా ఆ మృతదేహాన్ని (ఆత్మ భయపడే విధంగా చిద్రం చేసి),  ఖండ ఖండాలుగా నరుకుతారు. మళ్ళీ  నేల తల్లి గౌరవార్ధం,  పంట వేసాక, ఒక వారం (శాంతి వారం)  పాటూ, గ్రామంలో ఎవరూ ఎటువంటి కోపతాపాలకూ, హింసకూ పాల్పడకూడదు. తప్పుల్లో, కావాలని చేసిన తప్పులు 'మగ' తప్పులు, పొరపాట్న జరిగిన తప్పులు 'ఆడ' తప్పులు  గానూ పరిగణిస్తారు. వీటికి వేరే వేరే శిక్షలుంటాయి.  తెగ లో నిషిద్ధం అని నిశ్చయం అయిన బోల్డన్ని పన్లు, ఎందరినో ఆశాంతికి గురి చేసినా కట్టుదిట్టంగా అమలు జరిపేంత ఐకమత్యం తెగ లో ఉంటుంది. ఈ ఐక్యతని (మత ప్రచారం ముసుగులో) తెల్లవాడు చెల్లాచెదురు చేస్తాడు. ఈ సంక్షోభం నుంచీ తెగని కాపాడుదామని బయల్దేరిన ఒకోన్ క్వో జీవితం కూడా చెదిరిపోతుంది.  

ఒకోన్ క్వో కూడా "ఆడ" తప్పు  (అనుకోకుండా జరిగిన హత్య)   ఒకటి పొరపాట్న  చేసి,  ఏడేళ్ళ పాటు  గ్రామ బహిష్కృతుడవుతాడు. అతను తన శిక్షాకాలం ముగిసి గ్రామానికి తిరిగొచ్చాక, సాంఘికంగా, రాజకీయంగా, మత పరంగా అక్కడ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. క్రైస్తవం, స్కూళ్ళూ, వ్యాపారమూ పెరుగుతాయి. ప్రజలు తెగ కోసమో, సాంప్రదాయాలకోసమో పాకులాడరు. ఒకోన్ క్వో లా తెగ కోసం, తన బిడ్డ లాంటి పిల్లాడిని చేతులారా చంపుకునేంత మూఢత ఎవరిలోనూ మిగలదు.  పదే పదే కవలల్ను వరుసగా కని, వారిని చేజేతులా అడవిలో చావడానికి వదిలేయాల్సొస్తుండే యువతి, ఈ సారి గర్భంతో ఉండగానే క్రైస్తవం లోకి చేరుతుంది. మూఢ నమ్మకాలనూ, ఉనికి పేరిట బూజు పట్టిన పాత మతాన్నీ, కట్టుబాట్లనూ, చదువు, ఆరోగ్యం, ఆయుష్హూ ఇవ్వని తెగ దురాచారాలని కొత్త తరం ద్వేషిస్తుంది. 

పెద్ద పెద్ద బిరుదులున్న గ్రామ పెద్దలూ క్రైస్తవులవుతారు.   అప్పటికి  తెల్లవాని వలస రాజ్యంగా మారిన నైజీరియా సామాజిక చిత్రం మారటాన్ని, తన సంస్కృతి మీద జరిగిన దాడిగా ఒకోన్ క్వో భావిస్తాడు. మార్పుని అర్ధం చేసుకోలేక, నైరాశ్యంతో అతను చింతకు గురవుతాడు.  ఈ పరిస్థితుల్లో,  తన దేవుడిని, తన ఉనికినీ, తన సమాజాన్నీ రక్షించుకోవడం, తన చేతుల్లో ఉందేమో అని ఒకోన్ క్వో భ్రమపడతాడు.   మారిన వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి, తనని తాను ఒంటరి గా చూసుకుని ఒకోన్ క్వో జీవితాన్ని,  తండ్రి లాగే నిస్సహాయంగానే ముగిస్తాడు.   

కోపంతో, తెగ కోసం ఒక కోర్టు ఉద్యోగిని చంపి, ఒకోన్ క్వో ఆత్మ హత్య చేసుకుంటాడు. అలా ఆత్మహత్య చేసుకోవడం ఆ తెగ ఆచారానికి విరుద్ధం.  అది నేలతల్లి పట్ల నేరం. అపచారం. అలా చేసిన మనిషి శవాన్ని ఆ తెగ మనుషులు పాతి పెట్టరు. అతడి శరీరం దుష్ట శరీరం. దానిని కేవలం కొత్తమనుషులు తాకడానికి మాత్రమే వీలుంటుంది.  అలా అపరిచితులు (ఒకోన్ క్వో ద్వేషించిన విదేశీయులు) అతని శవాన్ని దింపి ఖననం  చేయడం, ఒక విచిత్రమైన సన్నివేశం. అదీ ఈ కథ కు ముగింపు.  ఈ పుస్తకం జెర్మన్ లోకి అనువదించినప్పుడు ఆ పుస్తకానికి  పేరు, "ఒకోన్ క్వో" అనే పెట్టారు. ఇది ప్రధానంగా ఒకోన్ క్వో జీవిత గాధే !  

కథంతా చదవదగ్గదీ, నెమరు వేసుకోగలిగిన భాష తో, చెప్పుకోవాల్సిన సామెతలతో - అందమైన వాక్యాలతో నిండిపోయి ఉంటుంది. దీనికి కారణం రచయిత చెప్పినట్టే, "(ఇబో) ప్రజలలో సంభాషణా కళకు ఎంతో ప్రాముఖ్య త ఉంది. సామెతలు ఆ కళకు జవసత్వాలు ఇస్తాయి." 

ఇలా ఈ నవల సంప్రదాయ సంభాషణా చతురుని నైపుణ్యంతో సామెతలను వాడడం వల్ల, సామెత భావాలని స్పష్టంగా వివరించడమే కాకుండా ఆ భావాన్ని పాఠకుడి మనసులో శాశ్వతంగా పాతుకునేట్టు చేస్తుంది  ఈ నవల్లో ఉపయోగించిన సామెతలతో పాటు జానపదకథలు, వారి తెగ కు చెందిన సంప్రదయాల, నిషిద్ధాల జాబితా కూడా పెద్దది. మల్ల యుద్దం, వివాహ పద్ధతి, వ్యవసాయ పద్ధతులు, అంతిమ సంస్కారాలు - ఇలా ఎన్నో అంశాలు తెలుసుకోవచ్చు. .  ఉదాహరణకు కొన్ని  వాక్యాలు చదవండి : 

(i)   ఈ మతప్రచారకుని మాటలకు మంత్రముగ్దుడైన యువకుడొకడున్నాడు. వాడి పేరు న్యోయే.   ఒకోన్ క్వో పెద్ద కొడుకు.  అతనిని వశపరచుకున్నది పవిత్రత్రయపు పిచ్చి తర్కం కాదు. అది అతనికి అర్ధం కాలేదు. అతనిని వశపరచుకొందేమిటంటే, అది ఈ కొత్తమతంలోని కవిత్వం.  అది అతని ఎముకలలోని మూలిగను కదిలించింది.  చీకట్లో భయంభయంగా కూర్చున్న సోదరుల గురించి తెలియజెప్పిన ఆ పాట.  అతని లేత ఆత్మను వెన్నాడుతున్న ఒక వీడని అస్పష్టప్రశ్నకు జవాబు చెప్పింది.  ఆ ప్రశ్న - పొదలలో విలపిస్తున్న కవల పిల్లల ప్రశ్న - చంపబడిన ఇకెమి ఫ్యూనా వేసిన ప్రశ్న.  ఎండిపోయిన అతని ఆత్మపై ఆ పాట అతడికి ప్రశాంతినిచ్చింది.  ఆయాసంతో రొప్పుతున్న ఎండిన నేలతల్లి నాలుకపై కరుగుతున్న మంచుగడ్డల బిందువుల్లా వున్నాయి ఆ పాటలోని మాటలు.  న్యోయే పసితనపు మనసు అయోమయంలో పడింది. 

(ii) అతడు మన భాష కూడా మాట్లాడలేకపోతుంటే, ఇక ఆచారాలు, వ్యవహారాలు ఎలా అర్ధం చేసుకుంటారు ? కాని వాడు మన ఆచారాలు చెడ్డవని అంటున్నాడు. వాడి మతం పుచ్చుకున్న మన సోదరులు కూడ మన ఆచారాలు చెడ్డవి అంటున్నారు.  మన సోదరులే మనకు వ్యతిరేకమైనప్పుడు మనం వాళ్ళతో ఎలా పోరాడగలమని నువ్వు అనుకుంటున్నావు? తెల్లవాడు చాలా తెలివిగలవాడు. వాడు తన మతంతో పాటు నిశ్శబ్ధంగా, ప్రశాంతంగా ప్రవేశించాడు. వాడి తెలివితక్కువ తనం చూసి, నవ్వుకుని వాడుండడానికి అనుమతినిచ్చాము.  ఇప్పుడు మన సోదరులను తన వైపు త్రిప్పుకున్నాడు.  మన తెగ ఒకే మాటపై ఇక ముందు ఏ పనీ చేయలేదు.  ఏ విషయాలైతే మనందరినీ ఐక్యంగా నిలబెడుతున్నాయో, వాటన్నిటి మీదా వాడు కత్తి మోపాడు. దాంతో మనం చెల్లాచెదురైపోయాం. 

(iii)  వేలాడుతున్న తన స్నేహితుడి శరీరాన్ని అదే పనిగా చూస్తున్న ఒబైరికా అకస్మాత్తుగా జిల్లా కమీషనరు వైపు తిరిగి ఆగ్రహంతో అరిచాడు. "అతను ఉమ్యోఫియాలో గొప్ప వాళ్ళలో ఒకడు.  మీరు అతనిని ఆత్మహత్య చేసుకునేట్టు చేసారు. ఇప్పుడు అతను కుక్కలాగా పాతిపెట్టబడుతున్నాడు...." అతడు ఇంక ఏమీ మాట్లాడలేకపోయాడు.  అతని గొంతు వణికి, మాటలు రాకుండా పోయాయి. 

సంభాషణల్లో పొదిగిన కొన్ని సామెతలు

(1) ఎత్తయిన ఇరోకో చెట్టు నుండి కిందపడ్డ బల్లి ఎవరూ తనని పొగడకపోతే, తనకు తానే పొగుడుకుంటానందంట. 

(2) (దీనికి ఏదో ఒక కారణం వుంటుంది). కప్ప ఉత్తపుణ్యానికి పట్టపగలు గెంతదు. 

(3) (మనవాళ్ళు అన్నట్టు) పెద్దవారిని గౌరవించేవారు తమ పెద్దరికానికి బాట వేసుకుంటారు. 

(4) వినికే పక్షి ఇలా అందంట :   "గురి తప్పకుండా మనుష్యులు తనను షూట్ చెయ్యడం నేర్చుకున్న నాటి నుంచీ, తాను కూడా వాలకుండా ఎగరడం నేర్చుకున్నాను " అని. 

 (5) పట్టపగలే గంతులేస్తూ గోదురు కప్ప కనిపించిందంటే, దాని ప్రాణానికి ఏదో ముప్పు వచ్చినట్ట్లు తెలుసుకో. 

(6) మండే మంటే ఎప్పుడూ చల్లటి, శక్తిలేని బూడిదనే పుట్టిస్తుంది. 

(7) ఏమీ చెప్పనటువంటి మనిషిని ఎప్పుడూ చంపవద్దు. అతని నిశ్శబ్దం వెనుక ఏదో ఒక అశుభం వుంటుంది. 

***


నైజీరియా దేశం తెల్లవాళ్ళ పాలనలో ఉన్నప్పుడు, ఆ Colonization  ప్రభావాలలో ఒకటిగా దేశంలో ప్రవేశపెట్టబడిన ఇంగ్లీషు విద్య - అప్పుడు స్కూళ్ళలో చదువుకుని ప్రపంచాన్ని ఎరిగిన తరం లోని వాడు రచయిత చినువా. అందుకే అతను క్రైస్తవ మిషనరీల ప్రవర్తనలో తప్పుపట్టాల్సినదేదీ లేదన్నట్టూ, మిషనరీలు నడిపిన వారు స్థానికుల పై  అత్యాచారాలకు పాల్పడినట్టూ రాయలేదు. పైగా కొత్త నీరు, పాత నీరుని తొలగించినంత సహజంగా నైజీరియాలో పురాతన తెగల వారు కూడా ఇతర మతాల వైపు ఆకర్షితులయి, కొత్త జీవన విధానాల్ని స్వీకరించినట్టు రాస్తారు. అయితే దీనినే ఇప్పటి ఆధునిక యుగంలోకి తీసుకుంటే, ఇప్పటి గ్లోబలైజేషన్ ఎలా కొన్ని సమాజాలను చెల్లాచెదురు / వినాశనం చేసేస్తుందో గమనించవచ్చు. 

మొత్తానికి తేలిక పదాలతో, చక్కని భాషతో మూల రచయిత చెప్పదలచుకున్న కథ ని చాలా చక్కగా తెలుగులోకి అనువదించింది శ్రీ కొలసాని సాంబశివరావు గారు. ఈ పుస్తకం ఇప్పుడు తెలుగులో దొరికే అవకాశాలు తక్కువ కాబట్టి కథాప్రపంచం కిరణ్ గారు పంపిన జెరాక్స్ కాపీ (రెండు పేజీలు మిస్ అయ్యాయి) నే చదివి చాలా ఆనందించాను. ఒకసారి ఒకరు అపురూపంగా చదివి, అండర్లైన్లు చేసుకున్న పుస్తకాన్ని  - అంతే మురిపెంగా  పాత పుస్తకాల మార్కెట్ లో దొరకపుచ్చుకుని ఇంకొకరు ఆ పుస్తకానికి కొన్ని కాపీలు తీసి, పుస్తకప్రేమికులతో పంచుకోవడం ఒక మంచి అనుభూతి. మంచి పుస్తకాలు పాఠకుల్ని ఎలాగయినా చేరతాయి అనేందుకు ఇదో ఉదాహరణ. 

07/01/2024

Smoke and Ashes - Amitav Ghosh



కలకత్తా లో మొట్ట మొదట కళ్ళకు గుచ్చుకునేది దాని కొలోనియల్ పాస్ట్ ! ముందుగా వంటగదితో స్వాగతం పలికే పాత ఇళ్ళూ,  ఆ  వీధులూ, వెనీషియన్ బ్లైండ్స్ ఉన్న కిటికీ లూ, ఇంటి కిటికీ పక్కనే ఫుట్ పాత్, ఇరుకు వీధులు, వీధుల్లో పారలల్ పార్కింగ్, ఘనమైన మ్యూసియం లు, పాత వాసన కొట్టే గాలి, ఆగిపోయిన కాలాన్ని ప్రతిబింబించే డొక్కు ట్రాం లు, నల్లని బస్సులు, అతి భయానకమైన బీదరికం, ఇంకోపక్క విపరీతమైన ధనం,  ఆకాశహర్మ్యాలు,  వ్యవస్థ లో విపరీతంగా పాతుకుపోయిన వ్యవస్థాత్మకమైన అవినీతి !  

కొన్ని ప్రామాణికంగా తీసుకునే పాయింట్ల ప్రకారం, వెనకబడిన కలకత్తా మహానగరం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద వాణిజ్య నగరం. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అతి పెద్ద వ్యాపారం ఈ నగరం నుంచే జరిగింది. మన దేశం, ముఖ్యంగా తూర్పు భారతంలో 200 యేళ్ళ పరాయి పాలన ముగిసి దాదాపు ఎనభై ఏళ్ళవస్తున్నా ఇంకా బీదరికంలో మగ్గిపోవడానికి, "బిహారీ"లు కపటులు / దుర్మార్గులు, గూండాలు అనీ మిగతా అందరికీ మనసుల్లో పాతుకుపోవడానికీ, మన పరాయి ప్రభువులకూ ఒక సంబంధం ఉంది.  చైనా కి ఇక్కడి నుంచే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగుమతి చేసిన నల్లమందు / ఓపియం ఇప్పటికీ మన దేశాల మధ్య ఇరుకుని ప్రభావితం చేస్తూండడం, ఎన్నో సంవత్సరాల పాటు పబ్లిగ్గా + అతి రహస్యంగా జరిగిన ఓపియం వేలాలు, వ్యాపారం, ఒక దేశం (Britain)  ఇప్పుడు విపరీతమైన డబ్బుతో శక్తివంతంగా విర్ర వీగడానికి రెండు దేశాలు (India, China) ఒకప్పుడు  భ్రష్టుపడిపోవడానికి మూలాలు ఈ నగరం లోనే పడ్డాయి. అదీ ఈ పుస్తకం చెప్పే చరిత్ర.  

దాదాపూ 150 యేళ్ళు తూర్పు భారతం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళాక ఎలా, ఎంతలా దోపిడీకి గురయిందీ,  వాణిజ్య పంటల ముసుగులో, మొదట వరి పండించడాన్ని ఆపించి, రైతుల చేత ఎకరాల కొద్దీ మొదట నీలిమందు (ఇండిగో),  నల్లమందు, పత్తి, తరవాత ఓపియం పండించి, ఆ ఓపియం ను ఫాక్టరీలలో యంత్రాలతో కాకుండా, కూలీల చేతులతో, కాళ్ళతో ప్రాసెస్ చేయించి, దాన్ని పెట్టెల కొద్దీ వేర్ హౌస్ ల లో భద్రపరచి, కలకత్తా రేవు నుండీ, ప్రస్తుత Guangzhou,  హాంగ్ కాంగ్ (చైనా) కు పంపించి, చెప్పలేనంత సొమ్ము ని కొన్ని సంవత్సరాల పాటూ గడించి, భారతీయ రాజులతో చేసే యుద్ధాలకు డబ్బు ఎలా సంపాయించుకుంది, చాలా జాగ్రత్తగా పరిచయం చేసిన పుస్తకం ఇది.  డచ్, ఫ్రెంచ్, అమెరికన్ వ్యాపారులు కూడా ఈ వ్యాపారంలో కోట్లు, పేరు గడించారు. ఘనత వహించిన  F.D.R ముత్తాత కూడా వారిలో ఒకడు. మన దేశానికి చెందిన రబీంద్రనాథ్ పూర్వీకులు కూడా ఒకప్పుడు నల్లమందు వ్యాపారంలో డబ్బు ఆర్జించిన వారే. అందుకేనేమో ఆ ఇబ్బందిని మీరేందుకు  రబీందృడు మాత్రం చైనా ను సమర్ధిస్తూ, నల్లమందు కు వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడారు. 

ఈ ఓపియం చైనా ని కొన్ని వందల సంవత్సరాల పాటూ చాలా బాధ పెట్టింది. ప్రజలు మత్తు కు బానిసలయ్యారు. చాప కింద నీరులా అది కంఫ్యూషియస్ బోధలని తుడిచిపెట్టింది. కుటుంబాలను, రాజ్యాలను, మర్యాదలను, ఆరోగ్యాలను మంట కలపడమే కాకుండా, దేశాల మధ్య చిచ్చు పెట్టింది.  చైనా వరకూ ఇదో రాజకీయ, వాణిజ్య సమస్య. వేలాది మంది ఎడిక్ట్స్,  లక్షలాది మంది వినియోగదారులూ, దేశ రెవెన్యూ ను ఇంగ్లీషు వాడి చేతుల్లో పెట్టారు. చైనా నుండి అత్యంత విలువైన మేలురకం సిల్క్, తేయాకు సంగ్రహించి, వాటికి బదులుగా ఓపియం ను అమ్మి ఆ దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది ఈస్ట్ ఇండియా కంపెనీ / బ్రిటన్. 

ఈ వ్యాపారం లో భారతీయులు ఎంత గా ఇన్వాల్వ్ అయ్యారో, భారతీయ పార్సీలు హాంగ్ కాంగ్ లో / ప్రస్తుత చైనా లో, తైవాన్ లో రాజకీయ, వ్యాపార రంగాలలో ఎంతకా పాతుకుపోయారో చదివితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి అమెరికా లో, బ్రిటన్ లో అతి ఎక్కువ సంపద ఉన్న సంపన్నులు, భారతీయ సంపన్నులున్నూ ఒక తరంలో ఈ ఓపియం మత్తు మందు వ్యాపారంలో గడించిన వాళ్ళే.  Guangzhou City, Macao, Hong Kong   లు ప్రధాన వాణిజ్య (మత్తు మందు వ్యాపారానికి ప్రసిద్ధి) నగరాలు. వీటిల్లో భారతీయ వ్యాపారులు అనేకంగా వ్యాపారాలు చేసారు. హిందువులకు  సముద్రయానం నిషిద్ధం గాబట్టి, మన దేశం నుండీ ఆ రోజుల్లో బయటి దేశాలకు సముద్రాలు దాటి వెళ్ళింది పార్శీలే. వాళ్ళు అక్కడ సామాజికంగా, సాంస్కృతికంగా పాతుకుపోయి, గుళ్ళూ, స్మశానాలనూ నిర్మించుకున్నారు. కొందరు చైనీయ మహిళని వివాహమాడి "సైనో ఇండియన్" కమ్మ్యూనిటీ ని సృష్టించారు. వాళ్ళ సంతతి లో ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటులూ, వ్యాపార వేత్తలూ ఉన్నారు. 

ఇండియా చైనాల వాణిజ్య సంబంధాలలో చారిత్రాత్మకమైన గురుతులు చైనా కళాకారుల కళ.  కలకత్తాలో ఇప్పటికీ నిలిచిపోయిన చైనీయుల పేటలు, చైనీస్ రెస్టారెంట్లు, స్పాలు.  ఈ  కళ పాశ్చాత్యులను విపరీతంగా ఆకట్టుకుంది. అమెరికాలో చైనా చిత్ర కళ కు, మృణ్మయ కళ కూ ప్రత్యేకంగా మ్యూజియం లు కూడా ఏర్పాటు చేసారు. ముంబయి లో జె జె ఇన్స్టిట్యూట్ లో జెమ్షెడ్ జీ చైనా నుండీ తీసుకొచ్చిన అనేక చీనీ పెయింటింగ్లు ఉన్నాయి. చైనా అమ్మిన టీ, సిల్కూ, ఈ అత్భుత చిత్ర కళ, వేదాంతమూ ప్రపంచం ఎంత ఎంజాయ్ చేసిందో, బదులుగా చేసిన ఈ నల్ల మందు వ్యాపారంతో దానికి చెప్పరానంత చేటు చేసింది. 

కారు చవగ్గా నిముషాల్లో Portrait  లను వేసే చైనీయుల కళా ప్రతిభను ఇప్పటికీ అబ్బురంగా చెప్పుకుంటారు. యూరప్ లో portrait చేయించుకోవాలంటే అది డబ్బున్నవారికే చెల్లేది.  వ్యవస్థీకృతమైన చైనా నల్లమందు వ్యాపారం ఎందరో సైనికులనీ, నావికులనీ, వ్యాపారులనీ, రక రకాల దేశాక వాళ్ళని ఒక చోట చేర్చింది. ప్రారంభం లో బ్రిటిషర్లు చైనీయుల ప్రభుత్వ విధానాల్ని ఎంత మెచ్చుకున్నారంటే, ఇప్పటికీ మన దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రతిష్టాత్మక "సివిల్ సర్వీస్" పరీక్షల ని చైనీయుల ని చూసే (అప్పట్లో)  వీళ్ళూ ప్రవేశపెట్టారు. 


జరిగినన్నాళ్ళూ కలకత్తాలో రహస్యంగా జరిగిన ఓపియం వేలం పాటలు, (బిహారీ పొలాలలో పండిన పంట, యూ.పీ లో ఫాక్టరీలలో ప్రాసెస్ అయి, చైనాలో అమ్మకానికి సిద్ధపరచి, కలకత్తాలో వేలం వేసేది కంపెనీ. అది కొని, చైనా లో అమ్మినది మొదట పార్సీలు, తరవాత ఫోర్బ్స్ వంటి అమెరికన్లు, కొందరు బ్రిటీషు వ్యాపారులు) బొంబాయిలో బహిరంగంగా జరిగేవి. అయినా బ్రిటిష్ వలసరాజ్యం 'మరాఠవాడా' లో విస్తరించడానికి సమయం పట్టింది. అక్కడి రైతుల్ని / గ్రామాలనూ లొంగ దీసుకుని, ఓపియం పండించడం కూడా కష్టమైన పనే. అయితే డబ్బు ప్రవాహపు ఆశ బొంబాయి ని కూడా ఓపియం వ్యాపారం లోకి దించింది. ఇక్కడా కొందరు సంపన్నులు తయారయ్యారు.   HSBC Bank కి మూల ధనం వచ్చిందీ ఓపియం లాభాలనుంచే.    హాంగ్ కాంగ్ మొదట చైనా చేతుల్లోంచి జారి బ్రిటన్ చేత పడటం, ఇప్పుడు లీజు ముగిసి, చైనా కి చేరడమూ ఒపియం వ్యాపారం మూలానే (మొదటి ఓపియం యుద్ధం లో China ఓడిపోవడం వల్ల జరిగిన ఒప్పందం ప్రకారం). 

ఇప్పుడు అమెరికా లో ప్రబలంగా ఉన్న ఓపాయిడ్ డ్రగ్ సమస్య ఒకప్పుడు చైనా లో విపరీతంగా ఉండేది. చక్రవర్తులు, రాజులు శతవిధాల ప్రయత్నించినా, పాశ్చాత్యుల కుతతంత్రాల ముందు నెగ్గలేకపోయారు. 50 ల లో కమ్మ్యూనిస్ట్ ప్రభుత్వం తీవ్ర కఠిన చర్యలకు పాల్పడే దాకా కూడా ఈ ఓపియం విష సంస్కృతి ని తమ దేశం నుండీ తరమలేకపోయారు.  ఇండియా కూడా స్వతంత్రం వచ్చాక ఓపియం ను ఓ రెవెన్యూ గడించే ఉపాయం కింద తీసుకోకపోవడం ఉపశమనం తీసుకొచ్చింది. 



ఓపియం నిజానికి ఓ అత్భుత ఔషధం. ఎలాంటి వారికి అంటే, విపరీతమైన నొప్పి ఉన్న వాళ్ళకి, మృత్యు ముఖంలో ఉన్నవారికి, కేన్సర్ పీడితులకు, హాస్పైస్ లో ఉన్నవారికి, నొప్పి తెలీనివ్వకుండా వాడే ఔషధ ప్రమాణాలలో వాడితే అదొక వరం. కానీ అది ఇష్టం వచ్చినట్టు, వ్యాపార ధోరణిలోనే, ఒక కాలనీ లో బీద రైతులను భయపెట్టి, బీద కార్మికుల చేత భౌతికంగా ప్రాసెస్ చేయించి, యుద్ధాలు జరిపి, లక్షలాది పౌండ్ లను సంపాయించేందుకు ఒక జాతికి నల్ల మందు ని  విపరీతంగా అలవాటు చేయించి, వాళ్ళ బలహీనతలను సొమ్ము చేసుకుని ఒక మహా  సామ్రాజ్యమే నడిచిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

By the 1880s, opium was one of the most valuable commodities moving in international trade.  In an average year, export opium leaving Calcutta and Bombay averaged over 90,000 chests, containing more than 5,400 metric tons.  This staggering amount would meet the annual needs of between 13 and 14 million opium consumers in China and Southeast Asia who smoked opium on a daily basis. 

అదే సమయంలొ  తమ తమ స్వదేశాలో మాత్రం, ఓపియం వాడుక మీద నియంత్రణలు విధించారు పాశ్చాత్యులు. మత్తు మందుల వాడకం (ఆల్కహాల్ కాదు) ఒక నీతి మాలిన చర్య అని, చైనీయులు, తూర్పు ఆశియన్లూ దొంగలు, దుర్మార్గులు, నమ్మ దగని వాళ్ళూ కాబట్టి, వాళ్ళకు ఓపియం అమ్మవచ్చనీ ఒక భావజాలాన్ని సృష్టించారు. స్వదేశాలలో ఎందుకూ కొరగానివాళ్ళు కలకత్తా వచ్చి ఓపియం వ్యాపారంలో పాల్గొని, కోట్లు గడించారు. స్వదేశాలలో వితరణ శీలులుగా పేరు గడించారు. నోబుల్స్ గా హై సొసైటీలలో తిరిగారు. రాజ్యాల పోరాటాలను ఫైనాన్స్ చేసారు. దీనిలో అంత డబ్బా - అని ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది కదా. 

Charles Dickens writes in an essay - If you were to check or prohibit this drug, a craving would arise for some other stimulus, like as in England, where an intermperate advocacy of temperance often leads to a secret indulgence in something fully as bad as ardent spirits.  

ఇప్పుడు క్రిమినల్ కార్టల్స్ దొంగతనంగా నడిపే డ్రగ్ రాకెట్స్ ని, ఒకప్పుడు ప్రభుత్వాలు నడిపేవి. ఇండియా కూడా స్వాతంత్ర్యం వచ్చాక కొన్నాళ్ళు నడిపింది. ప్రజల్లో చైతన్యం వచ్చి, పోరాటాలు జరిగి, రబీంద్రనాథ్ టాగోర్ వంటి వారు వ్యతిరేకించడం బట్టి, స్త్రీలు తిరగబడడం వల్లనూ, మెల్లగా మన దేశంలొ నల్లమందు సాగు ఆగింది. తరాల పాటూ ప్రభుత్వ కనుసన్నల్లో ఇష్టం వున్నా లేకపోయినా, తాము తినడానికి కాసిని తిండి గింజలనైనా సంపాదించుకోలేని /  (పండించుకోవడానికి అనుమతి లేదు)   బీద రైతులు ఓపియం కీ, దాని వాసనకీ, మత్తు కీ, దళారుల దోపిడి కీ, వెట్టి చాకిరీ కీ కరిగిపోయి, కట్టు బట్టలతో మిగిలి, కుటుంబాలతో విదేశాలకు 'ఇండెంచర్ కూలీ' గా వలస పోయారు. బెంగాల్, బీహార్ లు వట్టిపోయాయి. అక్కడ, రెండు వందల సంవత్సరాల క్రితం నుండే సామాజిక అన్యాయం జరగడం అలవాటయిపోయింది. పిల్లలకు బళ్ళు లేవు. గ్రామాలకు రోడ్లు లేవు. ఇప్పటికీ పల్లెల్లో జీవనాధారం లేదు. ఆస్పత్రులు లేవు. ఉద్యోగాలు లేవు.  "బిహారీ", తన 'దేశం' (State) వదిలి బయటికొస్తేనే అన్నం తినగలడు. ఇప్పటికీ ! (బిహార్, యూపీలు ఒకప్పుడు బెంగాల్ ప్రావిన్స్ లో ఉండేవి - వనవాసి గుర్తుంది కద)

"ఐబిస్ ట్రైలొజీ" రాసినప్పుడు రచయిత చేసిన విస్తారమైన రీసెర్చ్ ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు మనకు అవసరమా అని అనుమానం వస్తే, దానికి ఒక సమాధానం ఉంది. 

డబ్బు సంపాదించేందుకు సంపన్నులకు ఎటువంటి సందేహాలు, ధర్మ సంకటాలు ఉండవు. వాళ్ళకు మానవాళి కొంప కొల్లేరయిపోతున్నా అస్సలు పట్టదు. వాళ్ళకు అస్సలు ఏమీ అవసరం లేదు. ధర్మం అన్న మాట పని చెయ్యదు. స్వార్ధం, కపటత్వం, దుర్మార్గం, అన్యాయం - అంతే వాళ్ళకు తెలిసినవి. 

In 1907, Britain signed an agreement with China, undertaking to phase out all opium exports from India, over a ten-year period, provided that China's suppression of its domestic drug industry meet similar annual targets.  It was assumed that china would fail to meet its targets.  However China's crusade to free her people from the opium curse, may be justly reckoned one of the greatest moral achievements in history - a challenge to Western world. 

ఇప్పుడు చైనా మీద ఓపియం ఎడిక్షన్ ప్రభావం అంతగా లేదు. కఠోరమైన రాజకీయ నిర్ణయాలు + వాటిని అమలు పరచడం లో నిజాయీతీ, చైనాను ఆ సమస్య నుండీ బయట పెట్టాయి. అయినా ఈ వ్యాపారంలో లాభాల కోసం, తమ బంగారు గుడ్డు పెట్టే బాతుని కాపాడేందుకు శతవిధాలా ఈ పాశ్చాత్యులు చైనా ని తీవ్రంగా విమర్శించి, ఇరుకున పెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు.  కేవలం ఇందువలన ఇప్పటికీ చైనా విదేశాంగ విధానం "అపనమ్మకం" మీదే ఆధారపడింది!  ఇతరులను నమ్మి చాలా సార్లు చైనా మోసపోయింది ఓపియం వాణిజ్యంలోనే.

ఈ 1907 నాటి ఒప్పందం మెల్ల మెల్లగా ఇండియా లోనూ ఓపియం వ్యాపార జ్వరం తగ్గుముఖం పట్టేందుకు దోహదపడింది.  1911 లో పట్నా ఓపియం ఫాక్టరీ మూతపడింది. 1930 లో నల్ల మందు నిషేదానికి చట్టాలు వచ్చాయి. అయినా డబ్బాశ తో 1935 లో దొరల ప్రభుత్వం నీమచ్ ఓపియం ఫాక్టరీ ని తెరిచింది. స్వతంత్రం వచ్చాకా వెక్కిళ్ళు పడుతూ భారత ప్రభుత్వం కూడా నల్లమందు తయారీని పూర్తిగా నిషేధించింది. నల్లమందు వ్యాపారాల లైసెన్సులు రద్దయ్యాయి. అయితే బ్రిటిషర్లు వాదించినట్టు ఆ పరిస్థితుల్లో గ్రామీణ భారత వ్యవస్థ కుప్పకూలిపోలేదు.  పొలాలలో తిండిగింజల ఉత్పత్తి జరిగింది. నల్లమందు కు బలయిన తరం, పక్కకు తప్పుకుని, సరైన వ్యవసాయాధార బ్రతుకుకు అవకాశం ఇచ్చింది. 


--------------------------------------------------------------------------

Chinese Statesman Ku Hung-ming wrote to Somerset Maugham in 1921 : 


Do you that that we tried an experiment that is unique in the history of the world? We sought to rule this great country not by force, but by wisdom.  And for centuries we succeeded.  Then why does white man despise the yellow? Shall I tell you? Because he has invented the machine gun.  That is your superiority. We are a defenseless horde and you can blow us into eternity.  You have shattered the dream of our philosophers that the world could be governed by the power of law and order.  And now you are teaching our young men your secret. You have thrust your hideous inventions upon us.  Do you know that we have a genius for mechanics ? Do you not know that there are in this country four hundred millions of the most practical and industrious people in the world ? Do you not know that there are in this country four hundred millions of the most practical and industrious people in the world ? Do you think it will take us long to learn ? And what will become of your superiority when the yellow man can make as good guns as the white and fire them as straight ?  You have appealed to the machine gun and by the machine gun shall you be judged.   -

-----------------------------------------------------------------------

మొత్తానికి మూడొందల సంవత్సరాల చరిత్ర ముగిసింది. ఎందరో ఈ చరిత్ర లో కలిసిపోయారు. ఓపాయిడ్ సమస్య అగ్ర దేశాలని ఇప్పుడు వ్యవస్థీకృతంగా బాధిస్తుంది. ఇప్పటికీ ఓపియం వివిధ రకాలుగా మ్యూటేటెడ్ వెరైటీలలో ఉత్పత్తి అవుతుంది. యుద్ధాలలో తుడిచిపెట్టుకుపోయిన ఆఫ్గనిస్తాన్, సిరియా, యెమెన్ వంటి రాజ్యాలు బ్రతుకుతెరువు కోసం కొత్త రకం వంగడాల ఓపియం ను వాణిజ్య స్థాయిల్లో పండిస్తున్నాయి.  లక్షలాదిగా మనుషులు కొత్త ఓపియం రకాల ఎడిక్షన్ లో పడి దారుణంగా చనిపోతున్నారు. ఇది ఆగిపోదు. వైద్య అవసరాల కోసం ప్రభుత్వ లైసెన్స్ తో కూడా ఓపియం పండుతోంది. 

For countries with weaker law enforcement systems, such as those of Indian subcontinent and Africa, it will be close to impossible to regulate the flow of opiates.  Pakistan already has a major heroin problem because of the steady inflow from Afganisthan.  The same is true of the Indian state of Punjab.  Matters are likely to become much worse in future, especially if many insurgencies in the region resort to poppy farming or drug running to fund their causes.

 

As Mark Twain famously observed 'History never repeats itself but it does often rhyme'.  It is a measure of Opium's peculiar ability to insert itself into human affairs that it has created many echoes and rhymes between past and present.   "చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవకపోయినా దానిలోని రిథం ఎప్పటికీ బ్రతికే వుంటుంది."  ఓపియం విధానాల లాంటివే ఇప్పటి పర్యావరణ విధానాలు. ఎప్పటికీ బహుళ జాతి సంస్థలూ, లభాలు ఆర్జించే ప్రభుత్వాలూ, పర్యావరణం కోసం ఆలోచించవు.  ప్రపంచం భూగోళాన్ని కాపాడుకోవడానికి అందుకే ఒకడుగు ముందుకు, పదడుగులు వెనక్కీ వేస్తుంటుంది. ఈ పర్యావరణ ప్రమాదాలలో, ప్రకృతి వికృతమైన పర్యవసానాలలో ప్రాణాలు కోల్పోయేది, బీదలూ, సాధారణ పౌరులే. శక్తివంతమైన వారు నిర్ణయించే జీవితం మనది. 

Today, in a world where climate disruptions are intensifying and many formerly stable institutions are crumbling, it is more and more evident that much of what we have been taught about the past is untrue.  Indeed, what was truly new about the great 'take-off' of the nineteenth century was that it created a system in which indifference to human suffering was not just accepted by teleologies and deceptive theories.  What this led to was, for the most part, a kind of 'slow violence', inflicted not by weaponry but rather by inaction, and refusals to intervene. 

అయితే ఏ రకంగా ఆకాలానికి అత్యంత శక్తివంతమైన ఓపియం వ్యాపారపు సామ్రాజ్యాన్ని ఓడించిన ప్రజాగ్రహం, చైతన్యం, సరికొత్త పర్యావరణ విధానాల మార్పుకూ ఏదో ఓరోజు ఊతమివ్వవచ్చు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించే దిశగా, భూమిని మరింత స్వచ్చంగా, నివాసయోగ్యంగా మార్చేందుకు మనిషి చేసే ప్రయత్నాలలో ఈ "లాభాపేక్షకుల" ఓటమి ఎప్పటికైనా జరగాలన్నదే ఒక ఆశ. 

ఒకప్పుడు ఎదురన్నదే లేని ఓపియం సామ్రాజ్యం ఎలా కుప్పకూలిందో, లేదా ఇప్పటికీ ఓపియం చరిత్ర వివిధ దేశాల్ని, ఆయా దేశాల సంపన్నులనీ, వాళ్ళ ధనాన్నీ, ఎలా అంటిపెట్టుకునుందో, మన దేశంలో ఎందరు పెద్ద పెద్ద వాళ్ళ సంపద వెనక నల్లమందు సామ్రాజ్యపు చాయలున్నాయో చదివేందుకు, చరిత్ర నుంచీ మంచిని నేర్చుకునేందుకు, ఈ పుస్తకం చదవచ్చు. 



--------------------------------------------------------------------------

"When Opium smokers craving comes on, their bodies feel shriveled and listless, their joints all stiff.  They must rely on opium to fire themselves up.  At the beginning of firing up, they wriggle like worms.  A little more fired up and they begin to flow like a great river.  Fired up for a good while, they brim and burst with energy and quickened in every limb they stream forth with indomitable heat.  By the middle of the night they have even more energy to spare." --- 

The use of the words 'energy' and 'fire' has deeply unsettling resonances in this age of intensifying climate change, when the burning of fossilized forms of carbon has at once energized the world into stupendous dance of acceleration while simultaneously entrapping it like the body of an addict, in coils from which it may never succeed in extricating itself.  Today the fact that the world's relation with fossil fuels is indeed nothing other than a deadly and self-destructive addiction is widely acknowledged. 

--------------------------------------------------------------------------