Pages

30/07/2017

కొల్లాయిగట్టితేనేమి? - మహీధర రామమోహనరావు

 కొల్లాయిగట్టితేనేమి  ఒక చారిత్రక నవల - ఒక ఆదర్శవాది జీవితం గురించి ఒక కధ.  భారత స్వాతంత్ర్య చరిత్ర లో తెలుగు వాళ్ళ పాత్ర -  గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, వీరేశలింగం లాంటి ఆదర్శ వాదుల కధ.  స్వాతంత్ర్యోద్యమం గురించి ఆ రోజుల్లోనే సమాజం చీలి వుండడం గురించి కూడా నిర్భయంగా చర్చించిన నవల.



మామూలుగా చరిత్ర అంటే రాజులు, రాణులూ, రాజకీయాలూ, సామ్రాజ్యాలూ,  యుద్ధాలూ వరకే తెలుసు. కొ.కొ. చదువు చదివాకా, స్వాతంత్ర ఉద్యమమ కాలం నాటి తెలుగు సమాజం కూడా కాస్త తెలుస్తుంది. ఈ కొల్లాయి గట్టితేనేమి లో చాలా విషయాలు, చరిత్రా, తెలుగు సాంఘిక జీవనం, కులం పట్టింపులు, ఆచారాలూ, అనాచారాలు, ముఖ్యంగా కులం, అస్పృస్యతా, దాన్ని కూడా సమయానుకూలంగా మార్చుకోవడం,  ఒకరి మీదొకరు ఆధారపడే సమాజంలో  మార్పు కోసం ఇరు వర్గాలూ కాంక్షించడం, విరోధించడం, మడీ, మైలా, అంటూ, సొంటూ, విచిత్రమైన మూఢ నమ్మకాలు - అన్నీ దేన్నీ వొదలకుండా  అన్నిటి గురించీ చర్చించారు.

పాత్రలు ఏవీ ఏకపక్షంగా ఉండకుండా, అసలు వాటి కంట్రోల్ లో లేని సంఘటనల్లో జీవితం కొట్టుకు పోతుంటే, ఎవరి నమ్మకాలూ, ఆదర్శాలూ, పట్టింపులూ, వీటి చుట్టూ పరిభ్రమిస్తూనే, జీవితం కంట్రోల్ లోకి వస్తుంటారు. వీటిల్లో అన్నిట్లో ఉత్తమ వ్యక్తిత్వం హీరో రామచంద్ర ది. మొండివాడు రాజు కన్న బలవంతుడు అనో మాట ఉంది.   జాతీయోద్యమం ఉధృతమవుతున్న రోజుల్లో రాజమండ్రి కాలేజీ నుంచీ ఇంగిలీషు చదువు బహిష్కరిస్తాడు.  విదేశీ వస్త్ర దహనం లో తనకున్న బట్టలన్నీ కాల్చి, వంద అప్పు చేసి, ఖద్దరు వస్త్రాలు కొనుక్కుంటాడు.  అప్పటికే పెళ్ళి అయి వుంటుంది.  భార్య కాపరానికి వచ్చే వయసు లో లేదు. మామ గారు సర్కిలిన్స్పెక్టరు.  చదివి కలెక్టరు అవుతాడేమో అనుకున్న అల్లుడు ఇలా చదువు మానేసి ఇంటికి రావడం ఆయనకు నచ్చదు. అదీ ఆయన రాజోద్యోగి. అల్లుడు రాజ ద్రోహి. ఎలా పొంతన కుదురుతుంది ?  కుటిలుడు, ముక్కోపి అయిన మామ కీ, ఆదర్శవాది, శాంత స్వభావి, మానవత్వం ఉన్నవాడూ అయిన అల్లునికీ జరిగే ఘర్షణే మిగతా అంతా.

చదువు మానేసి వచ్చిన రామ నాధం స్ఫురద్రూపి, సద్బ్రాహ్మణుడు.  తల్లి తండ్రీ చినతనం లోనే చనిపోగా పిన్నీ బాబాయిల పెంపకంలో పెరిగిన వాడు. అతని పెద్ద తండ్రి రెండో భార్య గా ఒక తక్కువ కులపు స్త్రీ ని పెళ్ళాడి, ఆమెను విడిగా ఉంచుతూ, ఒక కొడుకుని కంటాడు. ఆ అబ్బాయి వెంకట రమణ - అంతఃసంఘర్షణ ని  చక్కగా ప్రకటించడం రచయిత మానవత్వాన్ని చెప్తుంది.

అసలు తెల్ల వాడొచ్చి దేశానికి మంచిదే జరిగిందనీ, వాళ్ళ మూలంగానే మనకి చదువులూ, రైళ్ళూ, ఆస్పత్రులు, అభివృద్ధీ - ముఖ్యంగా వాళ్ళకి ఈ అస్పృస్యత పట్టింపులు లేవు.  సమాజంలో అస్పృస్యుల కు కూడా చదువ్కోవడానికీ, ఉద్యోగం చేసుకోవడానికీ అవకాశం దొరుకుతుంది. పాత దేశపు పద్ధతుల్లో అయితే మరి ఇలాంటివేవీ ఉండవు. అభివృద్ధి మాటే లేదు అనే వాదనా వుండేది.  అంతరాంతరాల్లో బ్రాహ్మణులూ, అగ్ర వర్ణీకులూ కాని వాళ్ళకైతే అలానే అనిపించేది. ఇప్పుడు ఈ మార్పుల్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఈ ఉద్యమం లేవనెత్తినట్టు వారు భావించారు.

నవల లో కధా కాలం - 1919-20 నాటిది. అప్పుడే జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది. దేశం లో ఉద్యమపు కార్చిచ్చు అంటుకుంది. కానీ కధా స్థలి - ముంగండ అనే ఓ చిన్న అగ్రహారం.   ఓ మారుమూల పల్లె. రాజమండ్రి నుండీ ఒక పగలూ ఒక రాత్రీ పడవలో అంచె ప్రయాణం చేస్తే గానీ చేరలేని ఊరిలో  గాంధీ ఎవరో తెలీని వాళ్ళూ ఉన్నరప్పటికి. గాంధీ మాట అంటేనే పడని వాళ్ళూ ఉన్నారు. గాంధీ పుణ్యాత్ముడనే వాళ్ళూ ఉన్నారు. ఆ వూర్లో అబ్బాయి రామనాధం. చిన్నప్పట్నించీ బ్రాహ్మణపు అలవాట్లూ... జంధ్యం, సంధ్య వార్చడం అవీ ఉన్నా కొద్దో గొప్పో ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాడు. చక్కగా పెళ్ళయి, హోదాలో మామగారిని మించిపోయేంత చదూకుంటాడూ, కలెక్టరు అవుతాడూ అనుకునీసరికీ ఉద్యమం లో చేరి, కాలేజీ మానేసి వస్తాడు.  అందరూ ఈ పిచ్చి పని ని వ్యతిరేకించేవాళ్ళే.  సభా ముఖంగా అతను కాలేజీ మానేయడం గురించి విని, గొప్పగా అభినందించిన కాలేజీ కుర్రాళ్ళే ఆఖరికి ఆ రాత్రే అతని చుట్టూ చేరి, అదెంత పిచ్చి నిర్ణయమో చెప్పడానికి ప్రయత్నించేసరికీ రామనాధానికి ముందున్నది చాలా పెద్ద యుద్ధమే అని తోస్తుంది.  అతనితో పాటూ మానేసిన మిగిలిన నలుగురూ తిరిగి కాలేజీ లో చేరతారు. రామనాధం మాత్రం చేరడు.

కాలేజీ వదిలేసి ఊరొచ్చేసే తోవలో పడవ లో సహ ప్రయాణికురాలు స్వరాజ్యం - ఇంగ్లీష్ చదువులు చదూతుందని మొగుడొదిలేసిన 20 ఏళ్ళ అమ్మయి.  తండ్రి వీరేశలింగం పంతులు స్నేహితుడు.  స్త్రీ కి విద్యే ఆభరణం అని నమ్మి, ఆ రోజుల్లో నే వియ్యంకులు ఎంత వద్దన్నా వినకుండా కూతుర్ని ఇంగ్లీషు చదివిస్తున్నాడు.  ఆ స్వరాజ్యం మాట విని.. అదేంటండీ.. గాంధీ గారు ఇంగ్లీషు చదువు వొదిలేయమంటుంటే మీరు జీవితాన్నే కాదనుకుని చదువుతున్నారేంటీ అని అడుగుతాడు రామనాధం.  ఈ ప్రశ్నలూ, వాటి జవాబులూ, మనిషి కాలంతో పాటూ ఎన్నో సార్లు మారతాడు. ఒకే లా వుండడు.   అతని అభిప్రాయాలు కూడా మారతాయి. మారాలి కూడా అన్నట్టు ఉంటాయి.

రామ నాధానికి  ముంగండ తిరిగొచ్చాకా, విపరీతమైన తిరస్కారమూ, అత్భుతమైన ఆదరణా ఏమీ లభించవు. పెంచిన బాబయ్య, అమ్మ (పిన్ని) ఇద్దరూ పెద్దగా ఆక్షేపించకపోయినా మీ మామగారేమంటారో ఆలోచించుకోలేక పోయావా అని మందలిస్తారు. దానికి రామనాధం తన ఆదర్శాన్నే జవాబు గా చూపిస్తాడు.  అయితే బలవంతంగా అతనికి 15 వ ఏటే వొద్దన్న పెళ్ళి చేసిన బాబాయి మాత్రం అతని జీవితాన్ని గాడిన పెట్టే ప్రయత్నాలు మొదలెడతాడు. అమ్మాయి కాపరానికొస్తే అబ్బాయి దార్లోకి వస్తాడని, ఊరిని ఉద్ధరించే కార్యక్రమాలు వొదిలి పెట్టి భార్యా పిల్లల కోసం ఉద్యోగాన్వేషణార్ధం మళ్ళా చదువు గాడిలో పెడతాడనీ ఆశిస్తాడు.  అతని భార్యని కాపరానికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. పిల్ల వయసు రీత్యా రామనాధం దానికి నిరాకరిస్తాడు.  దాంతో పెద్దల అసహనం ఒక్క మాట పెరుగుతుంది.  కుటుంబాలు దూరమవుతాయి, అతని పెళ్ళి పూర్తిగా అస్థవ్యస్థమవుతుంది. రోజులు గడుస్తున్నాయి.

గ్రామంలో అతని జీవితానికి ఒక దిక్సూచి ఏమీ లేకుండా పోతుంది. ఈ లోపు పొరుగు గ్రామపు పిల్లే కావడం వల్ల స్వరాజ్యం తో స్నేహం చిగురించిస్తుంది. తన భవిష్యత్తు భార్య తోనే అనుకున్న రామనాధం,  తన మూలంగా పాడైపోతున్న వైవాహిక జీవితంలో,  భార్య తప్పేముందని భావించిన రామ నాధం తన ఆదర్శాలనీ, కలల్నీ తన ఖద్దరు జీవితాన్నీ భార్య అంగీకరిస్తుందో లేదో తెలుసుకుందామని ఆమెను కలవడానికి మామగారింటికి వెళ్ళి, అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనలో మామ గారి చేత దెబ్బలు తిని, జైలు పాలవుతాడు.  జైల్లో నానా హింసా భరించి, పురుగుల అన్నం తిని,  విడుదలయ్యి ఇంటికొచ్చాకా,  ఇంట్లో అతనికి పట్టింపుల బ్రాహ్మణత్వం ఎదురవుతుంది. జైలుకెళ్ళొచ్చినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోమంటే నిరాకరించి, తోటలో గుడిసె వేస్కొని కొత్త జీవితం మొదలుపెడతాడు. ఇక్కడ వుండగా చెరువు లో నీళ్ళను ఆ ఊరి అస్పృస్యులను తాకనివ్వకపోవడం చూసి, బాధపడి, కొన్నాళ్ళు వాళ్ళకి నీళ్ళు తోడి పోసి, వాళ్ళకి శాస్వత ప్రాతిపదిక న తన తోత లో బావి నీళ్ళని వాడుకోనిచ్చి,  కుల బహిష్కృతుడవుతాడు.

ఆఖరికి అతను ఈ ఉద్యమ బాట లోనే నడిచి, తన మేనల్లుళ్ళకి, ఊర్లో కొత్త తరానికి ఆదర్శం గా నిలిచి,  ఖద్దరు ప్రచార బాధ్యత ని తల కెత్తుకుని ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడం, గాంధీ గారు దాన్ని చూడడానికి ఆ కుగ్రామానికి రావడం తో నవల ముగుస్తుంది.  ఆ సంఘటనలు మానవ ప్రయత్నం తోనే జరిగి దైవికంగా జరిగినట్టు అనిపించేలా చెయ్యబడడం కూడా అర్ధం కానంత అమాయకుడు రామచంద్రం.  కానీ ఒక మాట నమ్మాక మాత్రం వెను తిరిగే లక్షణం లేదతనిలో.  ఎంత కష్టం వచ్చినా గానీ ఎదురు నిలుస్తాడు. ఇలాంటి ఎందరో రామచంద్రాలు పోరాడితే నే మన సమాజంలోనూ,  భవిష్యత్తు లోనూ మార్పులొచ్చాయి. ఎంత చిన్న స్థాయిలో ఎంత కొంచెంగా మొదలు పెట్టినా కానీ ఆ లక్షణాన్ని నిలుపుకున్నాడు కనకనే ఆ విజయం సాధించాడు అని చెప్పినట్టుంటుంది.

నవల ముగిసే నాటికి, వివాహం విఫలమైన రామ నాధం, స్వరాజ్యం, పెళ్ళి చేసుకుంటారు.  అతని జాతీయోద్యమపు జీవితం ఎందరో మహనీయుల్ని అతని స్నేహితులను చేస్తుంది. దువ్వూరు సుబ్బమ్మ తో రామనాధం సాన్నిహిత్యం, సుబ్బమ్మ అందర్నీ ఎగదోస్తుందని ముంగుండ లో అమ్మ లు ఆవిణ్ణి ఆడిపోసుకోవడం అవీ బావుంటాయి. తమ తమ జీవితాల్ని ప్రభావితం చేస్తున్న గాంధీ కూడా వాళ్ళకి అయిష్టుడే. కానే అదే గాంధీ వాళ్ళ ఊరికి వస్తే మాత్రం, అంతవరకూ అస్పృస్యులతో రాక్షసంగా ప్రవర్తించినవాళ్ళే - దాన్ని రూపుమాపడానికి ప్రయత్నించిన మహాత్మునికి బ్రహ్మరధం పడతారు.



ఈ నవల లో ప్రతీ పాత్ర కి ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుంది.  ఏవీ అనవసరమైనవి కావు. ప్రతీ పాత్ర ప్రవర్తన వెనకా ఒక విశ్లేషణ ఉంటుంది. అవి ఎంత సహజంగా, నమ్మదగ్గవి గా ఉంటాయో, ప్రతీ పాత్రా - అది విలన్ పాత్రన్నా సరే,  కాస్తయినా అర్ధం చేసుకోగలిగితె ఎంత బావుంటుందో అనిపిస్తుంది.  రావణ బ్రహ్మ భయంకరమైన విలన్ నే అయినా ఆయన ఆదర్శాలూ - ఆయన కారణాలూ ఎవరైనా విడమరచి చెప్పినప్పుడు అరే - ఈ వాదన కూడా భలే బావుందే అనిపిస్తుంది.   రామనాధం మామ గారు - ఇందులో విలన్!!   తాననుకున్నట్టుగా జరగక పోతే ఏ మనిషైనా ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలీదు.  కాబట్టి ఈ నవల్లో ఈ విలన్ ని కూడా పెద్ద విమర్శించడానికి ఉండదు.  రామ నాధం ఎంత న్యాయం గా ప్రవర్తించినా, ఈ మంకుపట్టు కఠినత్వం, క్రూరత్వాల మామ గారు, కూతురి జీవితం అల్ల కల్లోలమైనా సరే - తాననుకున్నదే జరగాలని భీష్మించుకునే రకం. దానికి విరుగుడు ఉండదు.   అలాంటతను తన భార్య స్వరాజ్యాన్ని అవమానిస్తే, రామనధం ఆయన దగ్గరకి స్వరాజ్యాన్ని తీస్కెళ్ళి - మీకు తెలీదు గాబట్టి చెప్తున్నాను. ఈమె నా భార్య అని పరిచయం చేస్తాడు.

ఆ రోజుల్లో తెలుగు నేల లో జీవితం, పల్లె లో ప్రయాణాలూ,  జాతీయోద్యమం లో పాల్గొన్న ప్రముఖులూ, వాళ్ళ కు ఎదురైన మంచీ చెడ్డా అనుభవాలూ, వాళ్ళ తో పాటూ వాళ్ళ కుటుంబాలు అనుభవించిన సంఘర్షణా - ఈ నవల్లో బాగా చర్చించారు.  ఎందరో హిందూ మతానికి మచ్చ అయిన అంటరాని తనాన్ని, కుల మాత్సర్యాన్నీ  అసహ్యించుకుని బ్రహ్మ సమాజం బాట పట్టారు. ఎందరో చదువుకున్న వాళ్ళూ, చదువుకోలేక పోయిన వాళ్ళూ మార్పు ని కోరుకున్నారు. అది సాంఘిక మార్పు. మొదట మనం మారి, గ్రామాన్ని మార్చి, సమాజాన్ని గాడి లో పెట్టి - అప్పుడు దేశానికి స్వాతంత్రం కోరదాం అనే ధోరణి ఎక్కువ గా కనిపిస్తుంది.

గాంధీ లాంటి ఒక మహాత్ముడు ఈ  కొత్త వేవ్ ని ఒడిసి పట్టి, ప్రజలందర్నీ ఒక తాటికి తెచ్చి, దేశాన్ని స్వాతంత్ర ఉద్యమం వైపుకు నడిపించి, గెలిపించాడు. ఆయన్ని ఆరాధించిన దేశ ప్రజల ప్రేమ, గాంధీ మాటంటే, నోరెత్తకుండా పాటించే అభిమానం ఏ కొల్లాయి తో నైతే సాధించుకున్నాడో ఆ కొల్లాయి, ఈ నవల వచ్చిన కొన్నాళ్ళ తరువాతే ఆయన ధరించడం మొదలు పెట్టాడంట.  ఈ కొల్లాయిగట్టితేనేమి కి కొనసాగింపుగా, దేశం కోపం, జ్వాలా తోరణం రాసారు మహీధర రామమోహనరావు గారు. అవి ఎక్కడ దొరుకుతాయో తెలీదు గానీ ఈ పుస్తకం మాత్రం కినిగె లో ఉచితంగా దొరుకుతుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 1965, 1978 తరవాత జూలై 2015 లో ఓ వెయ్యి కాపీలు వేసింది.  ఇదీ కధ.

First published in pustakam.net.

08/07/2017

Tempest - AVM Cecil Parker

ఒక్కోసారి నేను రాసే చిన్న చిన్న కధనాలూ, అనుభవాలూ చదివిన పాఠకుల స్పందన లోంచీ మరిన్ని కొత్త కబుర్లు పుట్టుకొస్తాయి. ఇదీ అలాంటిదే. నేను మా కాలంలో టెంపెస్ట్ నడిపిన అనుభవాల్ని ఈ మధ్యే పంచుకున్న తరవాత,  భారతీయ మూలాలున్న కెనడా పౌరుడొకరు నాకు ఈ మెయిల్ రాసారు.  తానెపుడూ కలవనే లేక పోయిన తన తాతయ్య, భారతీయ వాయు సేన లోనే పని చేస్తూ,  టెంపెస్ట్ ప్రమాదంలోనే మరణించడాన్ని ఆయన ప్రస్తావించారు.    ఈ పాఠకుడు చెప్పిన అతని తాతయ్య  పేరు విన్నాకా ఆయన వాయు సేన లో నా సీనియర్ 'ఫలానా' అని గుర్తొచ్చింది.   1953 లో పూనే లో టెంపెస్ట్ ను నడుపుతూ, ప్రమాదవశాత్తూ ఇంజన్ ఫెయిలయిన సంఘటన లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 

                                                                         టెంపెస్ట్ విమానం లో ఒక రకం 


టెంపెస్ట్ టూ ఎ (Tempest II A)  - RIAF/IAF  (రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ / ఇండియన్ ఏర్ ఫోర్స్) లో 1946 - 53 దాకా తన సేవలందించింది.  మొట్ట మొదటి స్వాతంత్రోత్సవ వేడుకల్లో మొత్తం 12 టెంపెస్ట్ విమానాల్లో ఎర్ర కోట మీద భారతీయ వాయు సేన ఫ్లై పాస్ట్ (Flypast) నిర్వహించింది.  అప్పట్లో ఫ్లై పాస్ట్ దేశానికెంతో గర్వకారణమైన క్షణాలని పదిలం చేసే వేడుక.  ఈ 12 విమానాల శ్రేణి కి అప్పటికి స్కాడ్రన్ లీడర్  (ఇప్పుడు అయిదు నక్షత్రాల రారాజు, మార్షల్ ఆఫ్ ద ఏర్ ఫోర్స్) అర్జన్ సింగ్, DFC,  నేతృత్వం వహించారు.

ఈ విమానం మన వాయుసేన ఏర్పడిన కొత్తల్లోనిది.  1948-49 కాష్మీర్ యుద్ధంలో పదాతి దళాల దూకుడు కు సాయంగా, (offensive support)  విరివిగా వాడబడింది.  బరువైన, శక్తివంతమైన, ఇంకా నడపడం చాలా కష్టంగా ఉండే ఈ టెంపెస్ట్,   ఒక ఇంజెన్, ఒకే సీట్,  పిస్టన్ ఇంజన్ ఉన్న ఆఖరి విమానాల్లో ఒకటి.   ఏదయితేనేం - టెంపెస్ట్ అప్పట్లో వాయు సేనకు పెద్ద దిక్కు.  కొత్తగా వైమానిక దళం లో చేరే యువ పైలట్లకు, 1952 చివర్లో వీటిల్లోనే శిక్షణ లభించేది.

అయితే జెట్ ఇంజన్ల ప్రవేశం మొదలయ్యాకా, కొత్త విమానాల కీ, ఈ పాత విమానాలకీ పొంతన ఏర్పరుస్తూ కూడా శిక్షణ ఇచ్చేవాళ్ళు.  హార్వార్డ్ ట్రైనర్ కీ, టెంపెస్ట్ కీ ఉన్న తేడాల్ని అధిగమించడానికి కనీసం నాలుగు సార్టీలు స్పిట్ ఫైర్ ఎం కె నైన్ [Spitfire MK IX] (స్పిట్ ఫైర్ లో ట్రైనింగ్ శ్రేణి విమానం)  ఎగరాల్సొచ్చేది.  టెంపెస్ట్ టూ ఎ లో ఉండే సెంటారస్ ఇంజన్, కనెక్టింగ్ రాడ్ వైఫల్యం వల్ల తరచూ ఇబ్బంది పెట్టేది.


                                                                                         Spitfire MK IX 


టెంపెస్ట్ కన్వర్షన్ మధ్యలో ఇంజన్ వైఫల్యం చెందిన సంఘటన లో నా కోర్స్ మేట్ ఒకడు విమానాన్ని బలవంతంగా దించాల్సి వచ్చింది (force landing).  ఈ సంఘటన జరిగిన సరిగ్గా ఒక వారం తరవాత, టెంపెస్ట్ లో ఎగురుతూన్న నేను కూడా, నా విమానం ఇంజన్ ఫెయిల్ అయి, కూలబోతోన్న తరుణం లో,  అదృష్టవశాత్తూ పారాషూట్ సాయంతో బయటపడగలిగాను.    ఇది జరిగిన కొద్ది రోజులకే,  మా ఇద్దరికీ దక్కినంత అదృష్టం దొరకక,  మా ఇంకో కోర్స్ మేట్, ఒక నావికదళ పైలట్, టెంపెస్ట్ తో పాటూ నేల కూలి  ప్రమాదంలో మరణించాడు.

ఆ తరవాత పూణే లోనూ, బారక్పూర్ లో పదవ స్క్వాడ్రన్ లోనూ ఇలానే టెంపెస్ట్ ప్రమాదాలు జరగడం, పైలట్ల దుర్మరణం చెందడం, ఎక్కువగా జరగడం తో  తరవాత ఈ టెంపెస్ట్ ల ను వైమానిక దళం నుంచీ తప్పించారు.  క్షణాల వ్యవధి లో జరిగే ఈ విమాన ప్రమాదాల్లో  పారాషూట్ ని వాడనే వాడకుండా పైలట్లు మరణించడం అత్యంత విషాదకరం.   ఈ ప్రమాదాల లో ఆఖరి సమయాలలో ఎమర్జెన్సీ తలుపులు తెరుచుకోకుండా ఏవో అవరోధాలు కలిగినట్టు, డిసైన్ లో లోపాలున్నట్టు, నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం, టెంపెస్ట్ ల వాడకాన్ని నిలిపివేసింది.  టెంపెస్ట్   విమానం  గ్రౌండ్ కావడం వల్ల మా ట్రైనింగ్ ప్రోగ్రాం వాంపైర్ (Vampire) జెట్లున్న స్క్వాడ్రన్ ల కు తరలిపోయింది.

రిటైర్ అయ్యాకా కొన్నేళ్ళ క్రితం కాటర్పిల్లర్ క్లబ్ (Caterpillar Club) లో భారతీయ సభ్యత్వం కోసం  రీసెర్చ్ చేస్తున్నప్పుడు నా కోరికపై భారతీయ వాయుసేన పూర్తి విమానాల సేఫ్టీ డేటాను పంపించింది.  ఫ్లైట్ సేఫ్టీ డేటా అప్పటి దాకా జరిగిన విమానాల ప్రమాదాల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగాయో,  మరణాల్నీ, బెయిల్ ఔట్ లనీ అన్నిట్నీ సాధికారంగా తెలుసుకోవచ్చు.  అయితే  దీన్లో టెంపెస్ట్ పై సమాచారం చాలా అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపించింది.

ఈ అధికారిక డాటా ప్రకారం చూస్తే, నేను ఒక్కణ్ణే టెంపెస్ట్ నుండీ పారాషూట్ ద్వారా తప్పించుకున్నట్టు ఉన్నాను.   మిగిలిన టెంపెస్ట్ ప్రమాదాల్లో పైలట్లు కూడా విమానంతో పాటూ, తలుపులు తెరుచుకోక, పారాషూట్ వాడే అవకాశం కూడా లేకుండా మరణించారు.  అయితే నాకున్న సమాచారం ప్రకారం, ఇంకో పైలట్ వింగ్ కమాండర్ సిడ్నీ నరోన్ హా, మహా వీర్ చక్ర,  [Wg Cdr Sydney Noronha, MVC]  కాశ్మీర్ లో టెంపెస్ట్ ప్రమాదం నుండీ పారాషూట్ ద్వారా ప్రాణాలతో తప్పించుకున్నారు.  దీన్ని బట్టి,  ఆ రోజుల్లో ప్రమాద వివరాల క్రోడీకరణ శాస్త్రీయంగా జరగలేదన్న సంగతి నాకర్ధం అయింది.

అందుకే నా పై అధికారులూ, సీనియర్లూ అయిన కొందరి అనుభవజ్ఞులయిన పైలట్లని పారాషూట్ బెయిల్ ఔట్ ల గురించి ఏమన్నా సమాచారం ఉందేమో చెప్తారా అని సంప్రదించాను.  నా ఉత్తరాలకు వచ్చిన స్పందన ల లో మార్షల్ ఆఫ్ ద ఏర్ ఫోర్స్ అర్జన్ సింగ్, డీ ఎఫ్ సీ ఇచ్చిన సమాధానం అత్భుతం గా అనిపించింది.  ఆయన మన వాయు సేన ప్రముఖుడు.    బ్రిటీష్ ఇండియా  లోనే వాయుసేన లో పైలట్ గా చేరారు. ఆయన ట్రైనింగ్  బ్రిటన్ లో క్రాన్వెల్ (RAF College, Cranwell, 1938) లో జరిగింది.   రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన చేసిన పరాక్రమ ప్రదర్శన కు ఆయనకు అతి చిన్న వయసులోనే, 1994 లో,  డీ ఎఫ్ సీ (DFC - Distinguished Flying Cross (UK) ) లభించింది.  ఈ పద్మ విభూషణుడిని 2002 లో భారతీయ వాయు సేన,  "మార్షల్ ఆఫ్ ద  ఏర్ ఫోర్స్" (Marshal of the Air Force) స్థాయికి ప్రమోట్ చేసి, తన గౌరవాన్ని చాటుకుంది.  ఫీల్డ్ మార్షల్ మానెక్ షా మరణానంతరం,   జీవించి ఉన్న అయిదు నక్షత్రాల రాంక్ ఉన్న ఏకైక భారతీయ సైన్యాధికారి ఈయనే.   ఇండో పాక్ యుద్ధం లో  పాల్గొన్న ఆయన,  కేవల 45 ఏళ్ళకే వాయుసైన్యాధ్యక్షుడు అయ్యారు.  ఆయన విలువలకీ ఆదర్శాలకీ ఈ ఉత్తరం అద్ధం పట్టింది.

ఆయన సమాధానం చూడండి :

"మీ ఉత్తరానికి సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.  నేను ఏనాడూ పారాషూట్ వాడలేదు. కనీసం ప్రాక్టీస్ సమయంలో కూడా!   క్రాన్ వెల్ లో నియమాలు ఎంత కట్టు దిట్టంగా వుండేవంటే, మాకు ఒకే ఒక విషయం నూరిపోసారు. అది "మనం జీవితం లో ఒక్క సారే తప్పు చేస్తాం"  ఈ తప్పు మీదే మన జీవితం ఆధారపడి ఉన్నప్పుడు,  మేము ఈ 'చివరాఖరి మార్గాన్ని"  (బెయిల్ ఔట్) ని ఎంచుకునేందుకు సాహసించేవాళ్ళం కాదు.  మా దృష్టి విమానాన్ని సరి అయిన పద్ధతి లో నే నడపడం, దించడం  మీదే వుండేది.  మధ్యేమార్గం మాకు తెలియనే తెలియదు.  ఇప్పుడు ఆధునిక ఎగిరే యంత్రాలలో  ఎజెక్షన్ సాంకేతికత పెరిగిన తరవాత ఈ సిద్ధాంతాన్ని ఎవరూ పట్టించుకోరనుకోండి.  కానీ నాకు గుర్తున్నంత వరకూ టెంపెస్ట్ లాంటి అత్యంత క్లిష్టమైన, ఎగరడానికీ, దించడానికీ కూడా కఠినంగా అనిపించే విమానంలోంచీ మీరు సకాలంలో బయట పడగలిగారంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండి ఉండరు.  భారతీయ వాయు సేన తొలి నాటి రోజుల్లో  'ఇర్విన్ '  పారాషూట్ వాడి సురక్షితంగా బయట పడింది మీరే "




ఆయన సమాధానం నన్ను అబ్బుర పరిచింది.  ఆ రోజుల్లో పరిమిత సాంకేతికత సాయంతో కూడా అత్యంత సాహసోపేతంగా విమానాలు నడిపిన తరం ఉండేది.   టెంపెస్ట్ అలాంటి విలువల కాలం నాటిది.   ఈ రోజుల్లో ఆధునిక విమానాల్లో ఇంకా ఆధునికమైన ఎజెక్షన్ (ejection) సీట్లు ఈ పాత కాలపు సిద్ధాంతాల్ని బేఖాతరు చేసేసాయి. "తప్పు"  చేసినా తప్పించుకోగలమనే దృక్పధం మాకు కొత్త!    అయితేనేం?     ఈ డెబ్భయి ఏళ్ళ నాటి టెంపెస్ట్ కబుర్లు నా కెనడా పాఠకుని ఈ మెయిల్ కు,  సరైన సమాధానాన్ని ఇస్తాయేమో అని నా ఆశ. 


- ఎయిర్ వైస్ మార్షల్ సెసిల్ పార్కర్, మహా వీర్ చక్ర, వాయు సేనా మెడల్ (రిటైర్డ్ )
AVM Cecil Parker, MVC, VM (Retd)
[ఆర్ ఎస్ ఐ మాగజీన్, జూలై, 2017 నుంచీ. ]

(Translated, with permission of the AVM)

 ----------------------------------------------------------------------------------------------------------------------
Note :

1.  కాటర్ పిల్లర్ క్లబ్ :  యుద్దం లోనూ, శాంతి యుత ట్రైనింగ్ లోనూ,  కూలిపోబోతున్న విమానాల్లోంచీ పారాషూట్ ల ద్వారా బయట పడ్డ పైలట్ ల కోసం మాత్రమే ఏర్పడిన క్లబ్ ! దీన్లో ఔత్సాహిక స్కై డైవర్లకు ప్రవేశం నిషిద్ధం.  "బెయిల్ ఔట్"  క్షణాల వ్యవధి లో, కేవలం ఆఖరి మార్గం గా తీసుకోవాల్సిన నిర్ణయం, అత్యంత చాకచక్యంగా, అత్యంత స్వల్ప వ్యవధి లో సాహసంతో, ఎక్కడ దిగుతామో తెలియని పరిస్థితి లో భౌతిక సూత్రాల కు వ్యతిరేక పరిస్థితుల్లో శరీరాన్ని ఎయిర్ క్రాఫ్ట్ నుండీ సెకెన్ల లో వేరు చేసేందుకు, ఈ పైలెట్ ల కుశాగ్రత, సాహసం, అదృష్టం, అన్నీ అవసరం.   అందుకే ఇవి కేవలం బెయిల్ ఔట్ అయిన పైలట్ల క్లబ్. నిజానికి దీన్ని ఇర్విన్ ఎయిర్షూట్ కంపెనీ  1922 లో మొదలు పెట్టింది.  లెస్లీ ఇర్విన్, 1922 లో కనిపెట్టిన పారాషూట్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎందరో పైలట్ల ప్రాణాల్ని కాపాడింది.  కాటర్ పిల్లర్ అని ఎందుకు పేరు పెట్టారంటే, తొలినాటి  పారాషూట్ల  వస్త్రం,  పట్టు తో చేయబడడం వల్ల - ఈ పట్టు పురుగుల పట్ల గౌరవం తో.   పైగా కాటర్ పిల్లర్లు తమ కుకూన్ లనుండీ బయటపడితేనే వాటికి జీవితం. అందుకే ఈ పోలిక, అందుకే ఈ పేరు.

2. AVM Cecil Parker, MVC, VM :  ఎయిర్ వైస్ మార్షల్ సెసిల్ వివియన్ పార్కర్ (Cecil Vivan Parker)  - 28 అక్టోబర్ 1952 న రొటీన్ సార్టీ లో,  కూలుతోన్న టెంపెస్ట్ (Tempest-II)  నుండీ  హకీంపేట లో పారాషూట్ సాయంతో బయటపడ్డారు. ఇదొక్కటే ఆయన ఘనత కాదు.  బాంగ్లా విమోచన యుద్ధంలో వింగ్ కమాండర్ గా 20 వ స్క్వాడ్రన్ హంటర్స్ తరపున  పాకిస్తానీ సాబర్ విమానాన్ని కూల్చి,  శత్రు భూభాగం లో "అటోక్"  లో రిఫైనరీ ని బాంబ్ చేసి,  విపరీతమైన దగ్గరి, ఫైరింగ్ లో కూడా ప్రతిభను ప్రదర్శించి, శత్రువు కు ఎక్కువ నష్టం కలిగించి, డిసెంబర్ 1971 లో భారత్ విజయానికి తోడ్పడ్డారు.  ఆయన ప్రదర్శించిన సాహసానికి పరమ వీర చక్ర తరవాత అంత గొప్పదైన మహా వీర చక్ర పురస్కారం లభించింది. ప్రస్తుతం, పదవీ విరమణ తరవాత ఫ్రీ లాన్స్ రైటర్ గా పని చేస్తున్నారు.  

3. RSI (Rajendra Singhji Institute) : మొదటి  సైన్యాధ్యక్షుడు మహారాజా రాజెందర్ సింఘ్ జీ పేరిట ఏర్పడిన ఆర్మీ క్లబ్.  కంటోన్మెంట్ లో పని చేస్తున్న సైన్యాధికారులూ, మాజీ సైన్యాధికారులూ సభ్యులు.   దేశం లో దాదాపు అన్ని ప్రముఖ కాంటోన్మెంట్ లలోనూ ఉన్నా, బెంగళూరు లో క్లబ్,  ప్రముఖమైన,  ఆధునికమైన RSI క్లబ్.  ఏ వూరి క్లబ్ మెంబర్ల రచనలు నెలకో సారి విడుదలయ్యే ఆ వూరి క్లబ్ మేగజీన్లో చదవొచ్చు. చాలా వరకూ ఈ రచనలు పాత, కొత్త జ్ఞాపకాల కలబోత. 

 4. Marshal Arjan Singh, DFC, Padma Vibhushan : ఆయన గురించి వికీ లో పూర్తి సమాచారం చదవచ్చు.  పై ఉత్తరం రచయితకు ఆయన జూలై 1994 లో రాసారు. కాబట్టి  ఈ రచయిత జ్ఞాపకాలు చాలా పాతవి అని గమనించొచ్చు. 
--------------------------------------------------------------------------------------------------------------------------
**ఇది నాకున్న పరిమిత జ్ఞానంతో ఒక మిలిటరీ తరహా వ్యాసాన్ని అనువదించేందుకు చేసిన ప్రయత్నం. గూగుల్ నుండీ తీసుకున్న ఫోటోలు కేవలం ప్రతీకలు.