Pages

15/12/2023

The Breast Giver - Mahashweta Devi

 


"స్తనదాయిని"  / "బ్రెస్ట్ గివర్", మహాశ్వేతా దేవి రాసిన బ్రెస్ట్ స్టోరీస్ సంకలనం లోని కథ. ఈ సంకలనంలో విషయం, ముఖ్యంగా స్త్రీల స్తనాలు.   స్త్రీ శరీరం  మహా వృక్షంలాంటిది. అది మొలకెత్తిన దగ్గరినిండీ, చివురై, పెరిగి, వృక్షమయి, మరణించాకా కూడా మనిషికి ఎలా  ఉపయోగపడుతుందో, స్త్రీ శరీరాంగాలు కూడా అలానే మానవాళికి ఒక్కోలా,  ఆమె బ్రతికినన్నాళ్ళూ  ఉపయోగపడుతూ వస్తున్నాయి.  

రేప్ ని ఒక ఆయుధంగా వాడి, స్త్రీని మానసికంగా కృంగదీసేందుకు మనిషి యుగాలుగా ఎలా ప్రయత్నిస్తూ వచ్చాడో, ఆమె శరీరాన్ని, అమ్మతనాన్ని కూడా అతిగా వాడేసుకుంటూ, ఒక ఆధిపత్యం చలాయించాడు. ఆ మానవ జాతి ఆధిపత్య పరిణామాల్ని నిర్మొహమాటంగా బయటపెట్టిన మూడు కథల్ని ఈ సంకలనంలో ప్రచురించారు. వీటిల్లో స్తనదాయని ఒక ముఖ్యమైన / పెద్ద కథ. 

ఈ సంకలనంలో మొదటి కథ 1971 యుద్ధ సమయంలో  లక్షలాదిగా లైంగిక హింసకు, హత్యలకూ గురయిన బెంగాలీ మహిళల కథల్లో ఒక ఆదివాసీ మహిళా విప్లవకారిణి  'ద్రౌపది' పై జరిగిన అత్యాచారాన్ని వర్ణిస్తుంది. ఆమెను వైన వైనాలుగా గుంజలకు కట్టి అత్యంత హింసాత్మకంగా సైనికులు గాంగ్ రేప్ చేసాక చీలికలైపోయిన స్తనాలు, రక్తపు మడుగైపోయిన శరీరమూ, తిండి లేక, దెబ్బలు తిని విపరీతమైన నీరసంతో కూలిపోవాల్సిన ద్రౌపది, తననీ, తన గాయాల్నీ బట్ట తో కప్పుకునేందుకు నిరాకరించడం ఆమె ధిక్కారాన్ని, ధైర్యాన్ని, మానసిక దృఢత్వాన్నీ బయటపెడతాయి. 

అయితే 'స్తనదాయని' మాత్రం పూర్తిగా భిన్నమైన కథ. జశోద ఈ కథ కి హీరోయిన్. ఆమె భర్త కంగాళీచరణ్ కీ ఆమెకీ బ్రతికున్న పిల్లలూ, చనిపోయినవాళ్ళూ కలిపి 20 మంది పిల్లలు పుట్టారు.  జశోదకి తన రొమ్మున పాలుతాగుతూ ఒక శిశువయినా లేకుండా ఎప్పుడూ లేదు. పిల్లలకి పాలివ్వడంలో ఆమె ఆరితేరింది. ఒక రకంగా రచయిత్రి మాటల్లో జశోద ఒక "Professional Mother". 

ఒకరోజు ప్రమాదవశాతూ, జశోద భర్త యజమాని హల్దర్ కొడుకు కారు కంగాళీచరణ్ కాళ్ళ మీదుగా నడవడంతో అతని మోకాలి కింది భాగం, పాదాలు తీసేయాల్సి వస్తుంది. దాంతో అవిటి వాడైన కంగాళీచరణ్ భార్యా పిల్లల్ని పోషించుకోవడం ఎలా ? ఒక బ్రాహ్మణుడికి హాని చేసానే అన్న చింతతో హల్దర్ బాబు అమ్మవారి ఆలయం ముందర ఉన్న తన ఇంటరుగునే వీళ్ళకిచ్చి దాన్లో షాప్ ని పెట్టిస్తాడు. అమ్మవారి దర్శనానికొచ్చే భక్తుల కొనుగోళ్ళతో సంసారం ఎలాగో నడుస్తుంది. 

అయితే, కంగాళీ చరణ్ స్నేహితుడు, అదే ఆలయం లో భక్తులకు గైడ్ గా ఉన్న నబీన్ కు ఎప్పుడూ జశోద పెద్ద స్తనాలే ఆకర్షణ. అతని కళ్ళు, కలలు, ఆమె రొమ్ముల ఆకర్షణలో దినం రాత్రీ మెరిసిపోతుంటాయి. అతని ఆలోచనల్లో జశోద దొర్లిపోతూంటుంది. ఆమెను చూసి అతను తిరిగే ఇబ్బందికరమైన మెలికలు కంగాళీ చరణ్, జశోదల కంటపడకపోలేదు. తన కి కొత్తగా వచ్చిన అవకరం వల్ల ఎక్కడ భార్య అతని ఆకర్షణలో పడిపోతుందో అని భయపడే భర్తకి జశోద మాత్ర భర్తకి ప్రమాణపూర్వకంగా చెప్తుందేమిటంటే - తన అందమైన రొమ్ములని కంగాళీ తప్ప ఎవ్వరూ తాకలేరు అని ! ఎందుకంటే, ఆమెకి సాక్షాతూ ఆ  "సింహవాహని" అమ్మవారే  రక్షణ గా ఉంటానని కల్లోకి వచ్చి చెప్పిందంట మరి. 

ఈ చిక్కుల్లో హల్దర్ బాబు అకస్మాత్తుగా గుండెపోటొచ్చి మరణించడం - దాని వల్ల ఆ యజమాని అండ కాస్తా పోయి, జశోద కుటుంబం వీధిన పడడమూ జరుగుతాయి.  హల్దర్ బాబు భార్య కు అకస్మాత్తుగా వైధవ్యం తో పాటూ, ఆస్తి మీదా, కుటుంబం మీదా యాజమాన్య హక్కులు రావడం, ఆస్తి మీద పెత్తనం రావడమూ జరిగాయి కాబట్టి, కొత్తల్లో ఆమె కు ఈ బ్రాహ్మణ కుటుంబాన్ని పోషించడం పెద్ద వృధా ఖర్చు గా భావించి  దాంతో మెల్లగా వీళ్ళని వెనక్కు పెట్టడం జరిగింది. పిల్లలకి ఏ తిండి పెట్టి పెంచడమో, ఏ నూతిలో దూకడమో జశోదకు దిక్కు తోచలేదు. 

అయితే, జశోద అదృష్టానికి హల్దర్ బాబు కోడలికి పురుడొచ్చి, బిడ్డ పుట్టాక, ఆమెకు పాలు పడలేదు. దాంతో అర్జంటుగా పాలిచ్చే దాది కావల్సి వస్తుంది. అప్పటికి జశోద కి పాలు తాగే పిల్లలున్నందున, యజమాని ఇంటికి వారి అవసరార్ధం వెళ్తుంది జశోద.  అయితే, ఆ వెళ్ళడం, వెళ్ళడం, జశోదని ఆ మొత్తం కుటుంబానికే "పాల దాది" ని చేయడం జరుగుతుంది. 

హల్దర్ బాబు కోడళ్ళూ, కూతుళ్ళూ ఒకరి తరవాత ఒకరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని కంటున్నారు. ఎవ్వరూ తమ పిల్లలకు పాలివ్వడం ఇష్టపడలేదు. వాళ్ళకి కామధేనువులాంటి జశోద ఉందిగా!    ఈ పాలే తనకీ, తన కుటుంబానికీ అన్నం పెడతాయి కాబట్టి, తను ఎప్పటికీ పాలు కుడిపేందుకు వీలుగా తానూ ఎప్పటికప్పుడు గర్భం ధరిస్తూ,  పిల్లల్ని కంటూ, వాళ్ళకి పాలిస్తూ, రోజూ హల్దర్ బాబు ఇంటికెళ్ళి వాళ్ళ పిల్లలకు పాలిస్తూ, వాళ్ళిచ్చే వస్తువులు ఇంటికి తెచ్చి తన కుటుంబానికి ఇస్తూ... ఇలా జశోద కొన్ని సంవత్సరాలే బ్రతికింది.  అటు హల్దర్ బాబు కుటుంబమూ పెరిగింది. జశోద కనీసం 50 మంది పిల్లలకి పాలిచ్చింది. అయితే కాలం గడిచేకొద్దీ మార్పులు జరగడం సహజం. 

హల్దర్ కుటుంబం పెద్దదయింది. జశోద పాలిచ్చి పెంచిన పిల్లలూ పెద్ద వాళ్ళయ్యారు.  వాళ్ళ ఇల్లు చిన్నదయింది.  హల్ల్దర్ బాబు భార్య కూడా ముసలామె అయింది. పిల్లలు వేరు కాపురం పెడదామనుకుంటున్నారు. అంతవరకూ కలిసి ఉన్న కుటుంబం కాస్తా, ఒక్కో బిడ్డా తరలిపోతుండగా పాలిచ్చి పెంచాల్సిన  హల్దర్ శిశువుల సంఖ్యా తగ్గిపోయింది. పైగా కొత్త పాల పదార్థాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.  శిశువును పాలసీసా తో పెంచడమూ ఒక పద్ధతే అనీ కొత్త అమ్మలు తెలుసుకున్నారు.

జశోద కూడా ముసలిదయింది. ఆమె నిజానికి ఎన్నో ఏళ్ళుగా హల్దర్ల ఇంట్లోనే ఉండిపోయింది. ఏ రాత్రప్పుడు ఏ శిశువు ఏడుస్తుందో అని, అక్కడే ఉండాల్సొచ్చేది. ఎప్పుడో గానీ ఆమె తన ఇంటికి వెళ్ళడం మానుకుంది. ఆమె బాగా పాలిస్తున్నన్నాళ్ళూ హల్దర్లు ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. ఇంట్లో పనిమనుషులు కూడా జశోదకి ఓ ఉన్నత స్థానాన్నే ఇచ్చారు. నెమ్మదిగా వయసు మీరి, పాల అవసరమూ, ఉత్పత్తీ తగ్గీసరికీ జశోదకి కష్టాలు మొదలయ్యాయి.  ముసలి కాలాన శరీరపు వన్నె తగ్గింది కాబట్టి, ఇంక తన పాల అవసరమూ తగ్గింది.  పైగా హల్దర్ బాబు విధవ కూడా పెద్దదయిపోవడం వల్ల, ఆమెకూ ఇంట్లో అదుపు తగ్గి, జశోదని వాళ్ళు  రిటైర్  చేసే టైం కి ఆమె ఇంట ఓ ముసలం పుట్టింది.    

ఇన్నాళ్ళ మానసిక దూరం తన సొంత పిల్లలు ఆమెను పట్టించుకోకుండా చేసేసాయి. పైగా జశోదకి ఇంట్లో ఒక సవితి కూడా తయారయింది. పెళ్ళాంతో పడక సుఖం తగ్గి, పైగా పెళ్ళాం పాలమ్ముకుని సంపాదించిన దినుసులూ, డబ్బూ, కంగాళీ చరణ్ మనసును బోల్తా కొట్టించి, అతొనొహత్తెను ఉంచుకున్నాడు.   

ఈ అవమానం, ప్రేమ రాహిత్యమూ భరించలేక జశోద హల్దర్ బాబు భార్యని ఆశ్రయం అడుగుతుంది. ఏదో చిన్నా చితకా పని చేసుకుంటూ మిగిలిన పనివాళ్ళతో కలిసి వారింటనే ఉండే ఏర్పాటు జరిగింది.   పెద్ద కోడలు ఇప్పుడు ఆ ఇంటికి యజమానురాలు. ఈ సారి ఇంటిలో వాళ్ళూ, పనివాళ్ళూ జశోదని హీనంగానే చూసారు. కానీ ఆమెకింకో గతి లేదు. 

ఆమె కంచమూ, బట్టలూ ఇక శుభ్రం చేసేది లేదని పనివాళ్ళు చెప్పేసారు. రొమ్మున పిల్లాడు లేక జశోదకు సగం మతి పోయింది.  వృద్ధాప్యమూ, అనారోగ్యమూ ఆమెమీద దాడి చేసాయి.  ఒంటరితనం ఆమెను ముంచెత్తింది.  జశోద తనలో తాను మాట్లాడుకునే స్థాయికి దిగజారిపోయింది.  తిండి అసలే సయించడంలేదు. 

రోజంతా జ్వరమూ, వొళ్ళు నొప్పులూ. కుడి రొమ్ము మీద ఏదో మచ్చ పడింది. అది రోజులు గడిచే కొద్ది పెద్దదయింది, వాచింది. రక్తమూ, రసీ కార్చింది. ఆమె అనారోగ్యం హల్దర్ బాబు పెద్ద కోడల్ని భయపెట్టింది. మొదట వంటింటి చిట్కాలనూ, ఆయుర్వేద  పై పూతలనీ ప్రయోగించారు. ఏ మాత్రమూ ఫలితం లేదు. మనిషి తిండి లేక  చిక్కిపోయింది. రొమ్ములు మాత్రం గుది బండల్లా బరువైపోయాయి. ఇంటికొక వైద్యుడొస్తే అతనికి జశోదని చూపించాలనుకుంటుంది పెద్ద కోడలు. జశోద మాత్రం ఇంకో మగాడికి తన రొమ్ముల్ని చూపించడానికి ఇష్టపళ్ళేదు. అప్పటికే ఆమె రొమ్ము మీద పలచని కొంగు ని కూడా కప్పి ఉంచలేకపోతుంది. భయంకరమైన బరువెక్కెన తన  రొమ్ముల్ని మొయ్యలేక నేల మీద వాటిని వాల్చి, పక్కకు తిరిగే పడుకునుండేది. డాక్టర్ గది బయటనుండే ఆమె లక్షణాలని కోడలి ద్వారా అడిగి తెలుసుకుని ఆమెను కేన్సర్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమంటాడు.  

కేన్సర్ నిర్ధారణ అయింది. ఆరోజుల్లో అంత గొప్ప చికిత్సలేమీ అందుబాటులో ఉండేవి కాదు. కానీ జశోద స్త్రీ సహజమైన సిగ్గుతో + సాంప్రదాయపు కట్టుబాటు, కండిషనింగ్ వల్లానూ  తన బాధని డాక్టర్ కు చూపించుకోకపోవడం వల్ల,  శరీరం సగానికి పైగా కుళ్ళే వరకూ డాక్టర్ దగ్గరకే పోనందున,  వ్యాధి అప్పటికి  చేతులు దాటేసి ఉంటుంది. ఆమె శరీరం బ్రతికున్నప్పటికీ  "కుళ్ళిన శవం" వాసన కొడుతుంటుంది. 

తను కనిన పిల్లలూ, పాలిచ్చిన పిల్లలూ ఎవరూ ఆమె చనిపోతుంటే చూడడానికి రారు. భర్త ని హల్దర్లు పిలిపిస్తారు. హాస్పిటల్ నుండీ ఆమెను అతనే తీస్కెళ్ళాలనీ, ఇక తాము చూసుకోలేమనీ కబురు పెట్టబట్టి -  కంగాళీ వస్తాడు.  భార్య ని ఆ దశ లో చూసి అతనికీ కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. 

ఆమెను ఎన్నేళ్ళు గానో కామించిన నబీన్ కూడా ఆమె ను చూసి హడలిపోతాడు. తనను ఎన్నో సంవత్సరాలుగానో కవ్వించిన ఆమె రొమ్ముల  పట్ల అతని దృక్కోణం, ఆమె హల్దర్ల ఇంట  'పాల దాది' గా చేరిననాటికే మారుతుంది.   ఆమెను తాను కొలిచే దుర్గా మాత కు ప్రతిరూపమే అనుకుంటాడు. ఎందరు పిల్లలకో తన రక్తం నుంచీ మార్చిన పాలిచ్చి బ్రతికించిన తల్లి కదూ ఇపుడు జశోద!   అయితే ఒంటి మీద స్పృహే లేక,  మృత్యువు నెమ్మదిగా తినేస్తుంటే పెద్ద పెద్ద నల్లని రాళ్ళై, దూది తప్ప ఆచ్చాదన లేని ఆమె రొమ్ముల్ని చూసి, "ఇవా తాను ఒకప్పుడు ఆరాధించిన రొమ్ములు.. ఇదా తానాశించిన శరీరం"  అనుకుంటూ వేదాంతి అయిపోతాడు. 

ఒక మంచి రోజు జశోద ఈ బాధల్ని అన్నిటినీ విడిచిపెట్టి మరణిస్తుంది.  ఆమెను ఎరిగిన అందరూ ఇక నిట్టూర్పు విడుస్తారు. ఇలా అందరికోసం తన ప్రాణాన్నీ, శరీరాన్నీ, యవ్వనాన్నీ, సర్వ శక్తుల్నీ ఒడ్డి, తనవాళ్ళనుకున్న వాళ్ళ కోసం బ్రతికిన జశోద, ప్రపంచంలో పెద్ద మార్పేమీ సృష్టించకుండా  ఎవరూ తన తోడు లేని పూట,  హాస్పిటల్లోనే రొమ్ము కేన్సర్ తో  కృశించి, కృశించి  మరణిస్తుంది. 

ఆమెకు అసలు రొమ్ము కేన్సర్ ఎందుకు వచ్చుంటుంది ? అంత మంది పిల్లలకి పాలిచ్చినందుకా ? ఏమో! డాక్టర్ దానికి "ఇదీ కారణం" అని చెప్పలేనంటాడు. ఆమె ఒక స్తనదాయిని. ఆమె పాలివ్వడం వల్ల హల్దర్ల కోడళ్ళు ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కనగలుగుతారు.  వాళ్ళ అందం చెక్కు చెదరదు. పైగా భర్తలతో గడిపేందుకు బోల్డంత సమయమూ దొరుకుతుంది. ఈ కిటుకు గ్రహించే హల్దర్ బాబు భార్య జశోదని ఒక "ప్రొఫెషనల్ స్తన దాయిని" గా మారుస్తుంది.  జశోద కుటుంబమూ ఆమె త్యాగం వల్ల బానే లాభపడింది. పాలివ్వాలనే మహా యజ్ఞం సుధీర్ఘంగా సాగేందుకు ఆమె భర్త ఆమె ద్వారా మరిందరు పిల్లల్ని కనేందుకూ పనికొస్తుంది.  వాళ్ళకు జరుగుబాటుకు లోటు ఉండకుండా కాపు కాస్తుంది.  ఇవన్నీ జశోదకు ఆఖరు సమయాల్లో పెద్ద సహాయం చెయ్యవు. ఇతరుల కోసం తనని తాను సమిధ గా మార్చుకున్న జీవితపు ఊబిలో జశోద కూరుకుపోతుంది. కేన్సర్ తో తొందరగా చావు రాకపోయుంటే, వృద్ధాప్యంలో తన వాళ్ళందరి నిరాదరణతోనే ఆమె  చనిపోయేదేమో. పెద్ద గుర్తింపుకు నోచుకోని జశోద జీవితం  - ఇలా ముగుస్తుంది. 

ఇదే "స్తనదాయిని" కథ.    గ్లోరిఫై చేయబడే స్త్రీ జీవితంలో ఆమె శరీరమే పెద్ద రాజకీయ సాధనం. త్యాగాల వెనుక, పెళ్ళిళ్ళ వెనకా, మాతృత్వం వెనకా కూడా పెద్ద రాజకీయ అణిచివేతే ఉంటుంది.  ఈ పుస్తకం మొదట 1997 లో ప్రచురితమైంది. అప్పటికే  ఇంత శక్తివంతమైన ఫెమినిస్ట్ రచన ని రచించిన మహాశ్వేత బెంగాలీ లో చాలా బాగా రాసిన కథలుగా ప్రాచుర్యం చెందాయి. . అనువాదం కూడా చాలా బావుంది.  

కొన్ని వాక్యాలు : 

(i)  Jashoda is "fully an Indian woman, whose unreasonable, unreasoning and unintelligent devotion to her husband and love of children, whose unnatural renunciation and forgiveness have been kept alive in the popular consciousness by all Indian women. She wants to become the earth and feed her crippled husband and helpless children with a fulsome harvest. 

(ii)  As Jashoda can only nurse if she herself is pregnant and nursing, she begins to have many children.  She is a professional mother and Kangali is a professional father.  Jasoda is highly valued at the Haldar place.

(iii)  Jashoda doesn't remember at all when there was no child in her womb, when she didn't feel faint in the morning when Kangali's body didn't drill her body like a geologist in a darkness lit only by an oil lamp. She never had the time to calculate if she could or could not bear motherhood. Motherhood was always her way of living and keeping alive her world of countless beings. Jashoda was a mother by profession, a professional mother. 

(iv)  Around the paved courtyard on the ground floor of the Haldar house, over a dozen auspicious milch cows live in some state in large rooms. Two Biharis look after them as Mother Cows. There are mountains of rind-bran-haygrass-molasses. Mrs. Haldar believes that the more the cow eats, the more milk she gives. Jashoda's place in the house is now above the Mother Cows. The Mistress's sons become incarnate Brahma and create progeny. Jashoda preserves the progeny. Mrs. Haldar kept a strict watch on the free flow of her supply of milk.

(v)   One has to die friendless, with no one left to put a bit of water in the mouth. Yet someone was supposed to be there at the end. Who was it? It was who? Who was it? Jashoda died at 11 p.m. The Haldar-house was called on the phone. The phone didn't ring. The Haldars disconnected their phone at night. Jashoda Devi, Hindu female, lay in the hospital morgue in the usual way, went to the burning ghat in a van, and was burnt. She was cremated by an untouchable. Jashoda was God manifest, others do and did whatever she thought.  Jashoda's death was also the death of God. When a mortal masquerades as God here below, she is forsaken by all and she must always die alone.


***

Originally written by : Mahashweta Devi in Bengali. 

Translation by : Gayatri Chakravorty Spivak

02/11/2023

మానవ హృదయం - ఉమేష్ కౌల్

 

మానవ హృదయం - ఉమేష్ కౌల్

(Translation) (Saranga, 01 Nov 2023)



"రాజరాణి అత్తయ్యా ! గాషా తో మాటాడి  నన్ను ఆ ఫతె కి ఇచ్చి పెళ్ళి చెయ్యొద్దని చెప్పవూ ? "  మెహర్ మొత్తానికి ధైర్యం చేసి రాజ రాణి ని అడిగేసింది. 


రాజరాణి అప్పుడే తన ఎడమ మోకాలి వైపుకు కుంపటి ని జరిపి, చిలుము నిండా బొగ్గు నింపుతూ "ఏం ?!!  ఫతేకి ఏమి తక్కువ ?!!" అనడిగింది. 


మెహర్ దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఆమె కేవలం రాజరాణి అత్తయ్య వైపు గుడ్లప్పగించి చూడటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయింది.చెప్పాలంటే  ఫతె లొ  ఎటువంటి దుర్లక్షణాలూ లేవు. అతను వయసులో ఉన్నాడు.  మంచి దేహ దారుడ్యంతో శుభ్రంగానే ఉంటాడు. కానీ మెహర్కి మాత్రం అతనిని పెళ్ళాడటం ఇష్టం లేదు. 


ఫతెహ్ ఆమె దగ్గరి బంధువే. ఆమె తండ్రి సోదరుడి కొడుకు.  అతని తల్లితండ్రుల మరణం తరవాత అతను మెహర్ తండ్రి,  పాలమ్ముకునే 'గాషా'  దగ్గరే ఉన్నాడు.  అనాధ అయిన ఫతే మీద జాలితో కాకుండా, గాషా అతన్ని చేరదీయడానికి వేరే స్వార్ధపూరితమైన  కారణాలున్నయి. అంతవరకూ ఇద్దరు అన్నదమ్ములకూ చెందిన ఇంటిని తానొక్కడే  మింగేయాలని గాషా ఆలోచన. అందుకే ఫతే ని పెంచి 'పెద్ద' చేసే బాధ్యతని భుజాన ఎత్తుకున్నాడు గాషా.  అతని తో పాటూ చనిపోయిన సోదరుడికి  చెందిన నాలుగు ఆవులనీ,  తన చేతికిందికి తెచ్చుకోవడమూ  గాషా మర్చిపోలేదు. పైగా రెండుసార్లు పెళ్ళాడినప్పటికీ గాషాకి మగ సంతానం లేదు. దాంతో అతని పాడి అదీ చూసుకోవడానికీ, ఇరవైనాలుగు గంటలూ అందుబాటులో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఆ పన్లకీ,  ఫతెహ్  సరిగ్గా సరిపోయాడు.  ఫతే కూడా చాలా మంచి అబ్బాయి.  వాడికి తన  మొదటి భార్య కూతురు మెహర్ ని ఇచ్చి పెళ్ళి చేస్తే ఫతె ఇంక ఇంటిని విడిచిపోడని గాషా ఆలోచన. 


ఫతే సరిగ్గా గాషా అవసరాలకి అతికినట్టు సరిపోయిన మంచి పని వాడు.  తన ఎనిమిదో ఏటి నుండీ, ఆవులని మేతకు తోలుకుపోవడం, వాటిని జాగ్రత్త గా చూసుకుని, చీకటి పడే వేళకి ఇంటికి తీసుకురావడం, అతనికి అప్పగించబడిన పనులు. పాలని ఖాతాదార్లకు ఇచ్చి వాళ్ళ దగ్గనుంచి వసూలు చేసిన డబ్బు గాషా కి అందివ్వడమూ ఫతే చాలా నిజాయితీ గా చేసేవాడు. ఏళ్ళు గడిచేకొద్దీ అతని బాధ్యతలు పెరుగుతూనే వచ్చాయి. తనకోసం అంటూ కాణీ కూడబెట్టుకోవడం తప్ప మిగిలిన అన్ని పన్లనీ యంత్రం లాగా చేసిపెట్టేసెవాడు.  

అతను బలవంతుడు, నిజాయితీ పరుడు, ముఖ్యంగా వొళ్ళు దాచుకోండా కష్టపడే మనిషి. అయినా మెహర్ కి అతనిలో 'జీవితపు మెరుపు' ఎక్కడా కనబడేది కాదు. ఎలాంటి మెరుపంటే, ఏ కాస్తంత కొంటెతనమో, పరిమళాలు వెదచల్లే ఓ మంచి మాటో, వెచ్చని స్వభావమో, ఏదీ ఆమెకు కనిపించేది కాదు. ఒకప్పుడు అనాధ అయిన అతని లోకం అంతా ఆ ఇల్లు, నాలుగు ఆవులు, బోల్డంత పనీ తప్ప ఇంకోటి లేదు. వీటన్నిటి మధ్యా నిజమైన ఫతే ఎప్పుడో మాయమైపోయాడు. 


మెహెర్ చిన్నప్పటి నుంచి పెద్దయాక తన పెళ్ళి ఫతే తోనే అని అందరూ చెప్తూండడం వింటూనే పెరిగింది.  కానీ ఆమె మాత్రం ఫతే ని ఆ దృష్టి తో చూడలేకపోయింది. ఆమె వరకూ అతను ఓ చల్లని, జీవం లేని బొమ్మ, ఆ బొమ్మ కి దేని గురించీ ఆర్తీ లేదు, నిస్పృహా ఉండదు. ఒట్టి మూర్ఖుడు. ఆమెని అతను చూసే చూపులు కూడా అభావంగానే ఉండేవి. ఆ కళ్ళలో నవ్వో, ఆనందమో ఎప్పుడూ కనపడలేదు ఆమెకు. అతనో పని చెయ్యడం మాత్రమే ఎరిగిన యంత్రం. 


హృదయం ఒక కొలను లాంటిది. తనకున్న ఆ  చిన్న పరిధి లోనే ఆకాశపు లోతులనీ , , సూర్యుడి వెలుగుల్నీ,  చంద్రుడి నవ్వుల్నీ ఒడిసిపట్టుకోగలదు.   మెహర్ కి ఫతే లో 'లేనిదే'మిటో  స్పష్టంగానే తెలుసు, కానీ దానిని ఇతరులకు బోధపరిచేంత భాషా పరిజ్ఞానం ఆమెకు లేదు.  అందుకే ఫతే కేమి తక్కువని అత్తయ్య అడుగుతుంటే  చెప్పేందుకు ఆమెకు నోరు రాలేదు. నిజానికి 'చేత' కాలేదు. అందుకే రాజ రాణి అత్తయ్య చిలుముని హుక్కాకు బిగించి, బొగ్గు మంట ని ఊది, నోరు విప్పని ఆ పిల్లని ఆరాగా  "నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా మరి ?" అని అడిగింది. 

"అబ్బే ! అలాంటిదేమీ లేదు.. కేవలం... "

అంతకన్నా మాట పెగల్లేదు ఆమెకు.  నిజానికి, ఆమెకు అసలు తెలిసినవాళ్ళే చాలా తక్కువ మంది. రాజరాణి, సుల్తాన్ పండిట్, కబీర్ వనీ లాంటి వాళ్ళందిరి ఇళ్ళ గుమ్మాల దాకా ఎన్నోసార్లు నీళ్ళు మోసి తెచ్చింది. కానీ తన మనసులో మాటలు చెప్పుకునేంత దగ్గరతనం ఎవరితోనూ ఆమెకు లేదు. వాళ్ళందరూ వేరే అంతస్తు వాళ్ళు. ఆమెతో అంతగా కలవరు. మెహర్ బట్టలు పేడ అంటుకుని మురిగ్గా ఉంటాయి. ఆమె నుంచీ నాచు కంపు కొడుతూంటుంది. ఆమెకు తన ముందంతా ఇసుక మేటలు వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ మేటల్ని ఏ పడవా దాటుకుని వచ్చి తనని తీరం చేర్చలేదు. ఏ రాకుమారుడూ వచ్చి ఆమెతో ఉంగరాలు మార్చుకోలేడు. ఆమె గురించి మేలి ముసుగుల పెళ్ళి పాటలు పాడేందుకూ ఎవరూ లేరు.

మెహర్ తన చుట్టూ కలియచూసింది. ఆమె గోడు వినిపించుకునేందుకు ఎవ్వరూ కనబళ్ళేదు. ఒక్క పడవ నడుపుకునే మధ్యవయసు హాంజీ తప్ప. అతని పడవని ఫతే ఎన్నో సార్లు కలుపులోంచీ తప్పించాడు. హాంజీ చేతులూ, కాళ్ళూ తారు రాసుకునీ రాసుకునీ నల్లగా తయారయ్యాయి. రేవులో రణగొణ ధ్వనుల మధ్య కస్టమర్లని ఆకర్షించేందుకు గొంతు పగిలేలా అరిచీ అరిచీ,  పెదవుల చుట్టూ చొంగ ఎండిపోయి,  అతని మొహం ఒక కుండలా పెళుసుబారిపోయి ఉంటుంది. అతని కళ్ళ స్థానంలో రెండు గుంటలుంటాయంతే.   ఇంకా మెహర్ పక్కింట్లోనే ఉండే ఒక నేత పని చేసుకునే కూలి మనిషి గుర్తొచ్చాడు.  ఇంకా నల్లమందుకి బానిసైన కిరాణా అంగడి యజమాని కూడా !  అతని దగ్గర జనాలు జ్వరానికీ, దగ్గులకీ కషాయానికి వెళ్తుంటారు. వీళ్ళు తప్ప మెహర్ కి తెలిసిన మనుషులే లేరు. వీళ్ళలో ఒక్కరు కూడా   ఆమె తరపున గాషా తో మాటాడో / పోట్లాడో ఒప్పించే వాళ్ళు లేరు 

అయితే ఆమె గుండె ఒక జారిపోని కన్నీటి బొట్టు లా, బైటికి చెప్పుకోలేని కోరికలా.. పుట్టే ముందే చచ్చిపోయే ఆలోచనలా, ఎప్పటికీ నిజం కాని స్వప్నంలా, కొట్టుమిట్టాడింది.

ఒక్కరు - ఎవరో ఒక్కరు - తన గోడు వినేవాళ్ళు.. ఒడుపుగా తన చేతిని పట్టుకుని, పల్లకిలో కుదేసి,  తనకి తెలీని అజ్ఞాత వ్యక్తి  - అతన్ని ఆమె చూడలేనంత అస్పష్ట వ్యక్తి, తనని తన పరిసరాల్నుండీ  ఎత్తుకెళ్ళిపోతే బావుణ్ణని ఆమె తపించిపోయింది. 'ఆ అజ్ఞాత వ్యక్తి అస్సలు ఫతెహ్ లా ఉండనేకూడదు'!!!  ఇలాంటి ఆలోచనల నీడలు తన మనసులో  తచ్చాడుతూ మెహర్ ని మరింత భయపెట్టేవి. అందుకే ఆమె రాజరాణి అత్తయ్యకు చప్పున సమాధానం ఇవ్వలేకపోయింది.

"మరి ఏంటే నీ బాధ ? ఫతే మీద నీకంత వ్యతిరేకత ఎందుకు? అడిగింది అత్తయ్య, కుంపటిని తన కుడి  మోకాలినిండీ ఎడమ మోకాలి కిందికి జరుపుకుంటూ.  అప్పటికి చిలుముని హుక్కాకి బిగించడం, పొగ ఊది దాన్ని పరీక్షించడమూ అయ్యాయి. 

"అతని మీద వ్యతిరేకత ఏమీ లేదు !! ...." అంతకన్నా ఇంకా ఎలా చెప్పాలో తెలీక మెహర్ సందిగ్దంగా ఆగిపోయింది.   మాటల్లో చెప్పలేని  భావాలు కన్నీళ్ళై ఉబికి వచ్చి, ఆమె చెంపల మీదుగా జారిపోయాయి. "నాకు ఫతే ని పెళ్ళి చేసుకోవాలని లేదు అత్తయ్యా.. దయ చేసి నువ్వే గాషా కి చెప్పాలి!!" వేడుకుంది. 

అత్తయ్య కుంపటిని బయటకు తీసి, భుజాల్ని ఎగరేసింది. చేతులు విరుచుకుంది. మెహర్ ని ఓదార్చింది.   "సరే అమ్మలూ.. నేను చెప్పి చూస్తాను. కానీ ఇలా చూడు. కాలం మారింది. మాలాంటి వాళ్ళ మాటలు ఎవరు వింటారు చెప్పు. గాషాని ఒప్పించగలనన్న నమ్మకం నాకు లేదు. కానీ కేవలం నీ కోసం అడుగుతాను"  అంది. 

రాజ రాణి అత్తయ్య అన్న మాటే నిజమయింది. గాషా ఆమె మాటల్ని లెక్క చెయ్యలేదు. అతని రెండో భార్య మాటల్నీ, తన స్వార్ధపుటాలోచనలనీ తప్ప ఇంకేదీ వినే ఆలోచనే అతనికి లేదు. నికా చదవబడింది. ఓ రెండు మూడు పెళ్ళి పాటలు పాడారు. కొందరు మనుషులెవరో భోజనాలు చేసారు. ఒక రోజంతా ఆనందంగా, గొడవగా గడిపేసారు. రాత్రి చీకటికి రెండు గ్యాసు దీపాలు వెలిగాయి. మెహర్ కీ ఫతే తో పెళ్ళయిపోయింది. 

మెహర్ బ్రతుకు ఎప్పట్లాగే ఉండిపోయింది. ఆమె సేద తీసుకోవడానికి  వాలేందుకు  ఇంటిలో అదే స్తంబం, అదే ఇంటి మెట్లు, అవే పేడ కుప్పలు, ఆమె నడిచే తోవంతా నాచు మొక్కలూ - అదే చాకిరీ ! ఫతే జీవితమూ ఏమాత్రం మారలేదు.  అతను పాత ఫతే లాగే తన పనికి పునరంకితమయ్యాడు. అతనిలో ఒక్క పిసరు మెరుపు కూడా రాలేదు. మెహర్ చేతి గోరింట వెలిసిపోయింది గానీ, ఆమె ని అతనితో కలిపి కట్టేసే బంధం ఏదీ అతనికి దొరకలేదు.  అతని రాక ఆమె జీవితంలో ఏ మాత్రం కొత్తదనాన్నీ తేలేదు. మెహర్ తన జీవితపు బావిలోకి మరింత కూరుకుపోయింది. ఒక్కోసారి ఆమెకు కిటికీలోంచీ దూకి చావాలనిపిస్తుంటుంది. కానీ అది కూడా ఎవరికీ 'పట్టని' పనే అని అర్ధం అయి, ఊరుకుంది.  దాని వల్ల కూడా ఫలితం లేదు.  ఇన్నాళ్ళూ సవతి తల్లితో తాను బ్రతకలేదూ.. ఇప్పట్నించీ ఫతే తో బ్రతుకుతానేమో.. అనుకుంది. ఆమె గోడు ఎప్పట్లాగే బయటికి వినబళ్ళేదు. తండ్రికి అస్సలు పట్టలేదు. 

ఒక పూర్తి ఏడాది ఏ మార్పూ లేకుండా గడిచిపోయింది.  ఎక్కడా పొరపాట్న కూడా కొత్తగా ఏమీ జరగలేదు. ఆమె స్నేహితులు అలానే ఉన్నారు. రోజూ పొద్దెక్కుతోంది.   రాత్రుళ్ళు దీర్ఘంగా, చిన్నగా, కాలం తో పాటు మారాయి. ఇంటి పనీ అలానే ఉంది.   ఒకే ఒక్క సంగతి మారింది. గాషా కి ఫతె అంటే అయిష్టం కలగడం మొదలయింది.    

గాషా కి తన రెండో భార్య మాట అంటే ఆన. ఆవిడ ద్వారా ఫతే గురించి కొత్త సంగతులు తెలుస్తున్నాయి గాషాకు. పెళ్ళయ్యాక ఫతే మారాడు. అతని వ్యవహారం గాషా కు అస్సలు నచ్చడం లేదు. కస్టమర్లనుండీ డబ్బు వసూలు చేసుకోవడం లో ఏదో అసహజత్వం కనిపిస్తుంది. పైగా నలుగురూ నాలుగు మాటలంటున్నారు. ఎవరితోనో ఫతే, గాషా నుండీ తన వాటాను అడుగుతానన్నట్టుగా పుకారు వినపడింది.  ఇంకెవరో, గాషా, ఫతే ఇంటి వాటాని ఇకనైనా విడిచిపెట్టాలని అన్నట్టు తెలిసింది. చికాకులు ఎక్కువయ్యయి. ఫతే తిరుగుబాటు సంగతి గాషా కి అస్సలు జీర్ణం కాలేదు.  వొళ్ళు మండి, ఒకరోజు వీధిలో కేకలేసాడు. 'ఇకపై తన కూతురితో విడాకులిప్పించేస్తాననీ, అతనికి తనకీ ఇక ఏ సంబంధమూ లేదనీ, ఫతె ఇక తన సంగతి తాను చూసుకోవాలనీ' అరిచాడు.  కూతురిని పిలిచి "నువ్వ్వపుడు ఎంత చెప్పినా విన్నాను కాదు. నీకు ఫతె సరైన మొగుడు కాదు. ఇక విడాకులిచ్చెయి. అర్ధమయిందా?' అని బెదిరించాడు. ''ఇక చాలు ఆ వెధవని గుమ్మం తొక్కనీయను. పోనీ కదా అని చేరదీస్తే ఇలా మారుతాడా. నీకింకో మంచి సంబంధం తెస్తాను. వాడికిక విడాకులిచ్చేయి.."


అతనిలా మాట్లాడుతుండగానే మెహర్ కి గడిచిన ఏడంతా గుర్తొచ్చింది. ఆ రోజులన్నీ ఎప్పుడో మర్చిపోయింది. వాటిలో గుర్తు పెట్టుకునేందుకు ఏముందో ఆమెకు తోచలేదు. కానీ గాషా అరుపుల మధ్య, మెహర్ కు ఏ దీర్ఘ నిద్ర లోంచో మెలకువ వచ్చినట్టు అనిపించింది.  అంత గాఢాంధారంలో ఎక్కడో వెలుగు కనిపించినట్టు, తనెవరో, తనెలా ఉండేదో, తన పరిస్థితి ఎలా ఉండేదో అన్నీ కొత్తగా తెలుస్తున్నట్టు అనిపించింది.   ఒక విషయం గుర్తొచ్చింది. 


ఒకరోజు ఆమె వరండాలో ఉంది. ఫతె సరస్సులోంచీ పెద్ద  నీటి కలుపు మొక్కల మోపుని తెస్తున్నాడు. అదెంత బరువుగా ఉందంటే, అతని కాళ్ళు ఆ బరువు మొయ్యలేక వంకరగా పెట్టి, కాస్త ఊగుతూ ఘాట్ మీదుగా మోసుకొస్తున్నాడు.  మెహర్ అసంకల్పితంగా అతని ముందుకు పోయి, బరువందుకుని, మోపును కిందికి దించేందుకు సాయం చేసింది.  బరువు దించాకా ఫతే కాసేపు కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచి చూసాడు. నెమ్మదిగా అతని కళ్ళలోకి వెలుగొచ్చినట్టయింది. అలుపు తీర్చుకుని, నుదుట చెమటను, మొక్కలనుండీ కారిన నీళ్ళనూ తుడుచుకున్నాడు. మెహర్ కాసేపు అతన్ని చూసి "ఎందుకంత మొయ్యలేని బరువు మోస్తావు? అంది. 

ఆ మాత్రం సానుభూతికే,  స్తబ్దుగా ఉండే అతనిలో ఏదో కదలిక వచ్చి,  తన టోపీ తీసి దులిపి,  భర్తగా ఆమె మీద అధికారం ధ్వనించే గొంతుతో,   మృదువుగానే  "ఏం చెయ్యను ?  తప్పదు!" అన్నాడు.  


 "ఎందుకు ?   ఏదయితే అది కానీ - వదిలెయ్ ఇంక!" అంది అసంకల్పితంగానే.  ఆరోజు బహుశా అతని మీద మొదటి సారిగా ఆమెలో జాలి లాంటి భావన కలిగింది.  "ఎంతయినా, అతనూ మనిషే. ఎంతకని అతనిలా కష్టపడగలడు ? అతని శరీరం ఎంత పనిభారాన్ని సహించగలదు? అతనేమయినా రాక్షసుడనుకుంటున్నారా వాళ్ళు ?" అనే ప్రశ్నలతో సతమతమయింది.  అసలతని మీద తనకు జాలి కలిగిందన్న భావమే ఆమెకు ఎందుకో చాలా సంతృప్తిని ఇచ్చింది.

అసలిది అంతా ఇప్పుడు గుర్తొస్తుంటే ఆమెకు ఈ క్షణాన కూడా  అదే సంతృప్తి కలుగుతుంది. ఈ భావోద్వేగంతో  ఉక్కిరిబిక్కిరవుతూన్న తన శరీరపు భారాన్నంతా కిటికీకి ఆన్సి నించుంది. ఆమెకు ఫతె పేరుని తన గొంతు చించుకుని అరవాలని అనిపించింది. అయితే కిందనుండి గీషా  అరుపులు వినిపిస్తున్నాయి. అతను ఫతె ని వదిలేయమంటున్నాడు. ఏడాది క్రితం వరకూ ఆమెకు అతనంటే ఎటువంటి సానుభూతీ లేదు. కానీ పెళ్ళయి ఏడాది అయేసరికీ తన మనసులో ఈ భావాలెందుకు కలుగుతున్నాయో!?   అసలు అతనేమయిపోతే తనకు ఎందుకు ? విధి లో ఇలా జరగాలని రాసిపెట్టుంటే తప్పించుకోవడం ఎవరికి సాధ్యం ?  అసలు తన గుండె ఇన్ని కృత్రిమ వలలు పన్నుతుందెందుకు.. ?  అసలు ఫతె తన కోసం ఏం చేసాడని ?

మెహర్ ఇలా ఆలోచిస్తుండగానే ఆమెకు ఇంకో సంగతి గుర్తొచ్చింది.  శ్రావణ మాసం లో ఒక రోజు ఆమె తన మోచేతిని గోడకి అదిమి నించుని ఉంది. కడుపులో లుంగలు చుట్టేస్తున్న ఆకలి!   అది భోజనాల సమయం దాటి అందరూ టీ తాగే మధ్యాన సమయం.  ఇంట్లో పొయ్యి ఆరి చాలా  సేపయింది. కుండలు, పాత్రలు అన్నీ ఖాళీ.  ఒకవేళ అవన్నీ  వెతికి ఏదయినా తినేందుకు దొరికబుచ్చుకున్నా, సవితి తల్లి కేకలేస్తుంది.  ఈ బాధతో సుడులు తిరుగుతూ ఆకలి నకనకలాడుతుండగా ఏవో రెండు లిలీ పూ గింజలు దొరికితే నోట్లో వేసుకుంది. అవి జఠరాగ్నిని ఇంకాస్త పెంచాయే తప్ప ఇంకెలాగూ పనికిరాలేదు.  ఆమె కళ్ళ ముందే పొద్దు గుంకుతూంది. అప్పుడే ఆమె ఎదురుగా ఫతే వచ్చాడు. ఆమెను "ఈ ఎండలో ఎందుకు నించునున్నావు ?" అని అడిగాడు మొహమాటంగా. 

"ఏమీ లేదు ! "  అందామె ముక్తసరిగా. అతనికి చెప్పనే కూడదనుకున్నా, మాటలు ఆమె నోట్లో ఆగలేదు.  "నాకు చాలా ఆకలిగా ఉంది. నా లోపల అంతా పగిలి ముక్కలయ్యేలా ఉన్నట్టుంది" అంది.  ఫతె తనని ఏదో బరువైన వస్తువేదో  బలంగా తాకినట్టు అదిరిపడ్డాడు. మెల్లగా ఆమె భుజాన్ని తట్టి - "నాకెందుకు చెప్పలేదు ? ఉండు! రెండు నిముషాల్లో నీకు రొట్టె తెస్తాను!"  అన్నాడు. అన్నట్టుగానే ఉరుకులు పరుగుల మీద దుకాణానికి వెళ్ళి, రెండు రొట్టెలు తెచ్చాడు..   రావడం రొప్పుతూనే వచ్చాడు. చాలా సేపటి వరకూ, మెహర్ కు అతను తన భుజం మీద తట్టడం, అతని స్పర్శ,  గుర్తు ఉండిపోయింది.   అతని రొప్పు తున్న శబ్దం, బరువైన ఊపిరి, ఆమె చెవుల్ని   చాన్నాళ్ళ వరకూ  వీడలేదు.   ఆరోజు పని ముగిసాక మాటాడలనిపించి అతనికోసం ఎదురుచూసింది. అసలు తనని 'సరిగ్గా'  ఒకసారైనా చూడాలనుకుంది! 

మెహర్ మెల్లగా కిటికీ నుండీ వెనక్కు వచ్చింది. ఆమెకు ఇంతవరకు తను ఫతె మొహాన్ని 'సరిగ్గా' చూసిన గుర్తు కూడా లేదు.   గడిచిపోయిన సంవత్సరం అంతా ఆమెకు ఈ స్పృహే లేకపోయింది. వాళ్ళి చిన్నప్పటినుండీ ఒకరినొకరు ఎరిగినవాళ్ళే. చాలాసార్లు ఆమె అతనితో  మాటాడేది, పని చేసేది. ఎపుడైనా పోట్లాట కూడా వేసుకునేది.  అయినా ఆమెకు అతన్ని తాను సరిగా కనులారా చూసిన జ్ఞాపకం లేదు.  ఇప్పుడు ఆమె తండ్రి అతన్ని వొదిలేయమంటున్నాడు.   ఏడాది క్రితం తాను మొరపెట్టుకున్నప్పుడు అతను వినుండాల్సింది.  ఇప్పుడు ఆమె హృదయం వేరే లా ఆలోచిస్తుంది. ఏడాది క్రితం కథే వేరేలా ఉండేది. మరి ఇపుడు .... ?  

మెహర్ తను ధరించిన బట్టల అంచుల్ని, వాటి మీద ఉన్న గీతల్నీ,  దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తూండిపోయింది. భగవంతుడికే తెలుసు.. తన నుదిట్న ఏమి రాసుందో!  పోయిన ఏడాది ఈద్ పండుగ గుర్తొచ్చింది. చిన్నప్పటినుండీ మెహెర్ పక్కింటి 'వని' కూతుర్లని గమనించేది. వాళ్ళు ఈద్ కి కొత్త బట్టలో, కొత్త చెప్పులో తొడుక్కునేవాళ్ళు. ఈద్ ముందురోజే వాళ్ళ కానుకల్ని వాళ్ళ మధ్యలో పేర్చుకుని చర్చించుకునేవాళ్ళు. "నువ్వు టైలర్ దగ్గరికి వెళ్ళావా?" అని ఒకరినొకరు  ఆరా తీసుకునేవాళ్ళు . 'ఈద్' కు తనకూ ఏదయినా కొత్త వస్తువు ఉంటే బావుండునని మెహెర్ కి కూడా అనిపించేది.  కానీ ఆమెకు ఎప్పుడూ ఆ రాత ఉండేది కాదు. మర్నాడు ఏ పక్కవాళ్ళ పిల్లో తలకు కొత్త వస్త్రం కట్టుకునొ, కాళ్ళకు కొత్త చెప్పులు వేసుకునో కనబడేది.   ఇపుడు తను పెళ్ళి బట్టలే తొడుక్కుంటుంది  -  ఇపుడు మళ్ళీ  వాటినే వేసుకున్నా, దుపట్టా మాత్రం లేదు దానికి.   అదన్నా కనీసం ఉండాల్సింది అనుకుంది.   ఆరోజు సాయంత్రం ఫతె ఆమె ఎదుట  ఒక పొడవైన మస్లిన్ బట్ట పరిచి ఆమెను నిశ్చేష్టురాల్ని చేసాడు. అంత మంచి బట్ట!!!  ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది.  ఆమె నోట ఒక్క మాట కూడా పెగల్లేదు. కాసేపటికి ఫతే అరిగిపోయిన బట్టలు గుర్తొచ్చి.. "నీకోసం ఏమీ కొనుక్కోలేదా నువ్వు?"  అని మాత్రం అనగలిగింది.  

"ఓహ్.. దాన్ని గురించి వొదిలెయ్.  నా బట్టలు ఎవరు చూస్తారు?  కానీ నువ్వు చెప్పు. ఈ దుపట్టా నీకు నచ్చిందా ?" అనడిగాడు. ఆరోజు,  ఆమె అతనిలో 'కొత్త ఫతె' ని చూసింది.  ఈరోజు పక్క మీద వాలి ఆ రోజు తాను అతనిలో చూసిన కొత్తదనాన్ని గుర్తు తెచ్చుకుంది. ఆ నాటి  ఫతె రూపం లోని కొత్తదనం ఆమెలో ప్రవేశించి, ఆమె మెత్తని, బలమైన శరీరానంతంటినీ ఆక్రమించి,  ఆమె సంశయాలని చెల్లా చెదురు చేసింది.  అతని జ్ఞాపకాలు అన్నీ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.  ఫతె మొహం ఆమె కళ్ళ ముందు మెదులుతుంది.  ఆ భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మెహర్ తన చేతులు తన చుట్టూనే గట్టిగా బిగించుకుని తనని తానే బలంగా  హత్తుకుంది. ఆమెలో ఇంకో జ్ఞాపకం కూడా నిద్రలేచింది. 

ఆ రోజు ఆవు ఈనింది.  మెహర్ తన చేతుల్లోకి ఆ లేగ దూడ ని తీసుకుని ఆడుకుంటూ దాని చెవుల్ని పట్టి గుంజుతోంది. దూడ ఆమె చేతుల్లోంచీ తప్పించుకునేని,  తల్లి దగ్గరకు పాలకోసం వెళ్ళేందుకు గింజుకుంటూంది. మెహెర్ కి ఈ పెనుగులాట సరదాగా ఉంది. కానీ తల్లి ఆవుకు మాత్రం కోపం వచ్చేసి దాని చెవులు నిక్కబొడుచుకున్నాయి.  ఫతె గుమ్మం నుండి 'దాన్నిక వొదిలెయి.. నువ్వు దాని చెవులు గుంజేసేలా ఉన్నావు' అని కేకేసాడు. 

'చూడు - ఆ ఆవు ఎంత కోపంగా ఉందో?!. దాని చెవులు పైకి లేచే ఉన్నాయి'  అంది మెహర్. 

'అవును మరి. దానికి కోపం రాదూ. అది తల్లి బాధను అనుభవిస్తుంది. నీకది ఎలా తెలుస్తుందిలే !' అన్నాడు -  మెహర్ 'అస్సలు అలవాటు పడని' సున్నితమైన కొంటెతనంతో.  మెహర్ కి చాలా సిగ్గేసింది. ఆ సంగతి గుర్తు రాగానే ఆరోజులాగే ఇప్పుడు కూడా ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. ఆమె శరీరమంతా ఏదో విద్యుత్ ప్రకంపన లాంటిది కలిగింది. ఆమె రొమ్ముల్లో మధురమైన పులకరింత. ఆమె హృదయమంతా ఏదో దివ్యలోకాలకి మాత్రమే చెందిన తియ్యటి భావన నిండిపోయింది. 

అసలు హృదయం ఏమిటి చివరికి ?  బరువు మోసేవాడి సాయానికి ముందుకొచ్చిన ఆపన్న హస్తమా . ఆకలి గొన్నవాడికిఇచ్చిన ఒక రొట్టె నా ?   ఈద్ కి కొన్న దుపట్టా నా?   మనసుని పరవశింపజేసి, గుండెలోతుల్లో 'కాలం మొదలయిన నాటినుండీ'   భద్రంగా దాచుకున్న ఆ 'కొత్తదనపు'  మెరుపు తాలూకు  జ్ఞాపకమా ?  

మెహర్ దీనంతటిలో దేనినీ విడమరచి చెప్పలేకపోవచ్చు. కానీ ఆమె హృదయం మాత్రం  ఫతె లో ఉన్న మెరుపుని "ఇప్పుడే" ఎరిగినది కావడం వల్ల కలిగిన ఆనందంలో మునిగిపోయింది. తన చుట్టూ నిండిపోయిన బూడిద కుప్పల్లో, సరస్సులో పద్మం పూల గుట్టల్లో, ఈగలువాలిన పేడ పోగులలో, ఆమెకు మాత్రమే కనిపించే మెరుపుని ఫతె ఆమె కోసమే జాగ్రత్త చేసాడు. ఆ మెరుపు ఆమెకు మాత్రమే సొంతం. అతని నవ్వు ఆమె కోసమే!!!  హఠాత్తుగా, ఆమెకు, తను అతన్ని వదిలేస్తే అతను అదే చిత్తడినేలల్లో కూరుకుపోతాడనిపించింది. ఈ నవ్వునూ, మెరుపునూ కోల్పోతాడని తోచింది.   తానిన్నాళ్ళూ పల్లకిలో తీసుకుపోతాడని కలలు కన్న అజ్ఞాత వ్యక్తి 'ఫతె' నే అని అర్ధమయింది. అప్పుడు సరిగ్గా కనీ కనిపించని ఆ కలలాంటి రూపం, ఇప్పుడు ఓ రూపు తెచ్చుకుంది.  ఈ యవ్వన, దృఢ, పవిత్రమైన మోము కలిగిన పెళ్ళికొడుకు 'ఫతే'నే!  అతన్ని కోల్పోతే,   తన చీకటి ఊబుల్లోంచీ తాను ఇక ఎప్పటికీ బయటపడలేదు . 

అలా ఆలోచనల్లో మునిగి, తనకు తెలీకుండానే మెహర్ రాజ రాణి అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. 

రాజ రాణి అత్త  హుక్కా పీలుస్తుంది. ఎప్పటి లాగే ఆమె కాళ్ళ కింది కుంపటి పెట్టుకుని కూర్చుంది. 

"దయచేసి గాషాకి చెప్పత్తయ్యా.. నన్నూ, ఫతె నూ విడిదీయవద్దని -" .... ప్రాధేయపడింది మెహర్

"ఓహో ! అయితే ఫతే నీ మీద ఏ మంత్రం వేసాడే పిల్లా ?"   మేలమాడింది అత్తయ్య. 

"మంత్రం కాదు అత్తయ్యా.. కానీ ...."  

మెహర్ అత్తయ్యకు తన బాధనంతా విడమరచి చెబ్దామనే అనుకుంది గానీ.. బెంగతో, దుఃఖంతో గొంతు పూడుకుపోయి,  ఎప్పట్లాగే మాటాడలేకపోయింది. ఎలాగో గొంతు పెగుల్చుకుని,  "కానీ నాకతన్ని వదిలేయాలని లేదు అత్తయ్యా. నువ్వు దయచేసి గాషాకు చెప్పు" అంది దీనంగా.    

***

From : The Greatest Kashmiri Stories Ever Told"

Name of the Story :  "Human Heart"  - by -  Sri  Umesh Kaul.

Translated from Kashmiri to English : Ms.Neerja Mattoo 

 



25/09/2023

FM Galicia - Taras Prokhako

తాతయ్య అంత్యక్రియల తర్వాత నేను గమనించింది ఏంటంటే,   ఆయన  స్నేహితులు మెల్లగా నా చుట్టూ చేరడం,  నన్ను చాలా జాగ్రత్తగా పరామర్శించి,  అవి, ఇవి,  ముచ్చట్లాడి మెల్లగా,  తాతయ్య ఏ రకం పొగాకు చుట్ట కాల్చేవాడో ఆరా తీయడం. "ఆ పొగాకులో ఏదో గడ్డి, లేదా  ఏ  మూలికో కలిపేవాడురా!  భలేగా ఉండేది!!  అది ఏ గడ్డి ? నిమ్మగడ్డి కాదే,  అది ఏదో నబ్బా!!!  ఆ పొగ మాత్రం అద్భుతంగా ఉండేది!!" అని ముక్కుపుటాలు ఎగరేసే వాళ్ళు.  నాకైతే తాతయ్యకి, ఆ రహస్య విచిత్ర 'గులేబకావళి' తరహా గడ్డికి ఏ సంబంధం లేదని గట్టి నమ్మకం. అదే చెప్పేసరికి మా ఊళ్లో జనం, నా నిజాయితీని శంకించి దూరం పెట్టేసేవాళ్ళు.

తాతయ్య పొగ తాగే విధానం నాకు గుర్తుంది ఆయన దగ్గర ఒక మామూలుదే అయినా మంచి నాణ్యమైన పైపు ఉండేది.  కూడా  ఎప్పుడు ఒక చిన్న సంచిలో మామూలు పొగాకు ఉండేది.  మధ్యాహ్నం పొలంలో పనిచేసేటప్పుడు అలుపు తీర్చుకోవడానికి,  చిన్న విరామం తీసుకుని  తన పనిముట్లను పక్కనపెట్టి,  ఎత్తుగా పెరిగిన  అడవి గులాబీల పొద పక్కన,   రేగు  చెట్టు నీడన హాయిగా పొగ తాగేవాడు. ఒకసారి ఆ రేగు చెట్టు కిందనే, ఆయనకి ప్రాణాంతకం అయిన 'ఆస్తమా ఎటాక్' వచ్చింది.  అది ఆయన యౌవనంలో  'ఏకాంత వాసపు జైలు శిక్ష' అనుభవించినప్పుడు లైజాల్ తాగిన కాంక్రీట్ గచ్చు మీద ఎన్నో రోజులు పడి, గడిపిన దాని ఫలితం. *

ఎటాక్  తర్వాత తాతయ్య పొగ తాగడం ఆపేసాడు.  కానీ పొగ తాగాలన్న కోరికను అణుచుకునేందుకు,  కొన్ని నెలలపాటు ఆయన జేబులో ఎండు రేగు పండ్లను పెట్టుకుని వాటిని  నమిలేవాడు. పిల్లలు   ఆయన వెంటపడి ఆ  పండ్లను  అడిగి తీసుకునే వాళ్ళు.   తాతయ్య పోయే నాటికి, ఆయన దగ్గర 1950 నాటి విషపూరితమైన రకానికి చెందిన  మఖోరా పొగాకు సగం ప్యాకెట్, హెర్జ్ గోవినా - ఫ్లార్ సిగరెట్లు ఓ రెండు ప్యాకెట్లు,  ఎవరో "మతి లేని" వాడు"మింట్ '' అని పేరు పెట్టిన సోవియట్ చేదు ఫిల్టర్  సిగరెట్లు మిగిలాయి.  అప్పుడప్పుడు ఈ ముసలి వాళ్లు నా దగ్గరకు వచ్చి ఆ 'రహస్య గడ్డిని'  గురించి కూపీలు లాగేవాళ్ళు.  నేనెంత నాకు తెలియదు బాబోయ్!  అని మొత్తుకున్నా సరే, కనీసం వాళ్లకు ఆ గడ్డిని చూపించినా చాలునంట.   మొదట్లో నవ్వులాటగానే ఉన్నా కొన్నాళ్ళకు ఇదేదో తాతయ్యకి సంబంధించిన "పెద్ద" రహస్యమే అని తెలిసి వచ్చింది.


చాలా ఏళ్లు గడిచాక ఓసారి క్రిస్మస్ పండక్కని కొన్ని సామాన్లు అవసరమై,  ఆటకని వెతికాను.  అక్కడ ఒక బుల్లి రేకు డబ్బాలో  "లువ్యేవ్ కాఫీ పొడి"**  కనబడింది.   డబ్బా మూత తీసి చూద్దును కదా -  అమోఘమైన పరిమళం గుప్పుమంది. అది వేసవి  పూదోట  పరిమళం.  తోటల్లో పండే తీయని మధుర ఫలాల పరిమళం. మాంత్రికమైన మూలికల మీద తేనె పరుచుకున్న పరిమళం.  క్షణంలో నాకు ఆ కమ్మని వాసన ఏంటో  గుర్తొచ్చేసింది. అది నా వరకు ఒక చిన్ననాటి జ్ఞాపకం.  ఆ వాసన ప్రత్యేకంగా తాతయ్యదే!!  అప్పుడే ఇంకో సంగతి కూడా గుర్తొచ్చింది - ఆయన పైపులో పొగాకు నింపాక ఈ కాఫీ పొడి ఓ చిటికెడు దానిపై చల్లేవాడు. ఈ చిన్న డబ్బాలో దాగున్నదే, ఈ ముసలి వాళ్ళంతా నా చుట్టూ మూగి 'సంగ్రహించాలి అనుకున్న రహస్యం' అన్నమాట !!  ఇది తాతయ్య నుండి నాకు చిక్కిన  మొత్తం వారసత్వ సంపద అంతటిలో అన్నిటికన్నా ఎంతో విలువైనది.

ఆయన కనుక్కున్న ఈ కాఫీ + పొగాకు మిశ్రమం, ఆ నిష్పత్తి,  ఒక "కళాఖండం".  ఇది చెత్త రకం పొగాకును 'మంచి'గా మారుస్తుంది. మేలు రకం పొగాకును 'అద్భుతం'గా మారుస్తుంది. తాతయ్య తలుచుకునుంటే,  లేదా ఆయన ఏ  ప్రపంచంలో వేరే ఏ ఇతర ప్రాంతానికి చెందినా గాని,  ఆయన పొగరాయళ్ళు అందరిలోనూ పెద్ద హీరో అయి ఉండేవాడు.  ఈ ఫార్ములా ఆయన్ని పెద్ద బిజినెస్ మాగ్నెట్ చేసీసి ఉండేది.  కానీ ఆయన ఈ బాధ్యతను నా మీద వదిలి వెళ్ళిపోయాడు.  తాతయ్య జ్ఞాపకార్థం ఈరోజు ఆ మార్మిక కాఫీ పొడిని ఓ చిటికెడు తీసి నా 'డచ్ పొగాకు' లో కలుపుకుని, పైప్ లో నింపుకుని నాకు నేనే ఒక పార్టీ ఇచ్చుకున్నాను. అయితే ఈరోజుకీ ఆ పొడిలో  ఏ మూలిక/గడ్డి  కలిసి ఉందో నాకు తెలియనే లేదు!!


From :  Writing from Ukraine. Fiction, Poetry and Essays since 1965 (2017), Penguin 2022. 


Written by :  Taras Prokhako, "FM Galicia", 2010. 

(ఊరికే సరదాగా  చేసిన అనువాదం)

*  Subjecting to solitary confinement for years is in vogue  for the  Ukrainian revolutionaries. 

** Lviv Ground Coffee

**********








24/08/2023

వీరయ్య - కృష్ణ గుబిలి

ఈ పుస్తకం 2020 లో విడుదల అయినప్పుడు ఆన్ లైన్ ప్లాట్ ఫారాలలో సంచలనం సృష్టించింది.  చాలా మంది చదువరులు ప్రశంసలు కురిపించారు. చాలా చోట్ల ఆన్ లైన్ రివ్యూలు చాలా పాసిటివ్ గా వచ్చాయి. అసలు నేను ప్రత్యేకం గా / కొత్తగా చెప్పేందుకు కొత్తగా ఏమీ లేకపోయినా, ఇది చాలా మంచి/బహుశా special, out of the box  పుస్తకం అని ఖచ్చితంగా చెప్పగలను. 

మనం బానిస వ్యవస్థ గురించి, తమ తమ ఊళ్ళలో ఉన్న ఆఫ్రికన్లని ఉన్నపాటుగా ఎత్తుకెళ్ళిపోయి, ఓడల్లో అమానవీయ పరిస్థితుల్లో కుక్కి, రేవుల్లో జంతువుల్ని అమ్మినట్టుగా అమ్మి, తల్లుల్నీ పిల్లల్నీ వేరు వేరుగా అమ్మి, వాళ్ళ జీవితాల్ని కొన్ని తరాల పాటూ సర్వనాశనం చేసేసి, వాళ్ళ మీద అత్యంత క్రూరమైన అత్యాచారాలకు పాల్పడటం, జాత్యహంకారాన్ని ప్రదర్శించడం గురించి చాలా సినిమాలూ చూసాము, చాలా పుస్తకాలూ చదివాం. 

కానీ బానిస విధానపు నిర్మూలన తరవాత, దాదాపు అదే స్థాయిలో వెట్టిచాకిరీ చేయడానికి భారత ఉపఖండం నుండి 1800-1900 మధ్యలో వేలాదిగా తరలివెళ్ళి, రబ్బరు, చెరుకు లాంటి కఠిన వ్యవసాయ ఉత్పత్తులను  పండించేందుకు, రక రకాల కొత్త దేశాలలో, ఖండాలలో అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో ఊడిగం చేసి,   నానా కష్టాలు అనుభవించిన భారతీయుల గురించి, తిరిగి రాలేక, అక్కడి సమాజాలలో భారతీయ సంతతి వారిగా సమైక్యమైపోయి,  అక్కడే ఉండిపోయిన ప్రవాస భారతీయుల కథల్ని పెద్దగా చదవలేదు. మనకు దాదాపు ప్రవాసుల కథలు అభివృద్ధి చెందిన దేశాల నుంచే వచ్చాయి గానీ, ఖండాంతరాలలో మగ్గిపోయిన బీద  తెలుగు ప్రవాసుల గురించి పెద్దగా చదవడానికి ఏదీ దొరకలేదు. 

అలాంటి పరిస్థితుల్లో, కేవలం ఆసక్తి కొద్దీ, దక్షిణ ఆఫ్రికాలో కొన్నేళ్ళపాటూ పనిచేసి, పుట్టిన గడ్డకు తిరిగొచ్చి, మరణించిన తన ముత్తాత వీరయ్య గారి మూలాలను వెతుక్కుంటూ, కృష్ణ గుబిలి గారు చేసిన అన్వేషణ, దక్షిణ ఆఫ్రికా  లో తెలుగు, తమిళ ప్రవాసులు గడిపిన బానిస జీవితం గురించీ, వీళ్ళని తీసుకెళ్ళి, పని చేయించిన చెరకు తోటలు, పంచదార ఫాక్టరీల గురించి, కలుసుకున్న తన "విడిపోయిన" కుటుంబంగురించీ చాలా చక్కగా ఆయన రాసిన ఇంగ్లీష్ పుస్తకానికి, తన తండ్రిగారిచేతనే తెలుగులోకి అనువదింపజేసి తీసుకొచ్చిన పుస్తకం ఇది. 

వీరయ్య చాలా కష్టపడి పైకొచ్చిన మనిషి. ఆయన బోల్డన్ని కష్టాలనుభవించి, దళారుల వలలో పడి, కూలీ గా దక్షిణాఫ్రికా చేరి, అక్కడ కొన్నేళ్ళ పాటూ కూలీగా పనిచేసి, తన సామర్ధ్యాలు, కష్టపడే తత్వం కారణంగా సూపర్వైసర్ (సర్దార్) గా ఎదిగి, ఒక స్థాయికి తన కుటుంబాన్ని చేర్చిన వ్యక్తి. తను చిన్ననాట వదిలి వెళ్ళిన తన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆయన ఇండియా తిరిగిరావడం ఒక కథ.   బాధలు పడ్డా,  కష్టాన్ని ఆసరాగా చేసుకుని  బోల్డంత ధనం సంపాదించగలిగినా, చివరకు "బంధు" రాబందుల చేతిలో అన్నీ కోల్పోయి, కళ్ళెదురుగానే పిల్లల్ని కోల్పోయి, అసహాయుడైపోయి,  వృద్ధాప్యంలో  మనోవ్యధ తో  మరణించారు. 

అయితే, ఆయన కోడలు నాంచారమ్మ గారు (కృష్ణ గారి నాయనమ్మ) మాత్రం, మామగారిని మర్చిపోలేదు.  ఆవిడనే అసలు ఈ పుస్తకం బయటకు రావడానికి   ప్రేరణ.  ఆమె ఒక కూతురిలా చెల్లాచెదురైన  తన  కుటుంబం గురించి ఆరాటపడి, ఎటువంటి కమ్మ్యూనికేషన్ సాధ్యం కాని రోజుల్లోనే,  రికార్డ్ గా పనికొచ్చే ప్రతి అంశాన్నీ దాచి, తన మనుమలకు తమ మూలాలను గురించి చెప్తూ,  ఆసక్తి రగిలించడంలో,  ఖండాంతరాలలో చెదిరిపోయిన  కుటుంబాన్ని కలుసుకోవాలనే కోరికను సజీవంగా ఉంచడంలోనూ ప్రధాన పాత్ర వహించారు.  

నాయనమ్మ వర్ణనల్లో తమ తాతయ్య, ముత్తాతలు హీరోలు, ఆజానుబాహులు, ఆదర్శ పురుషులు, కానీ నిజానికి వారి గురించి వివరాలేవీ తెలీని పరిస్థితుల్లో, కృష్ణగారు సరదాగా మొదలుపెట్టిన వంశవృక్షపు ప్రాజెక్టు, ఒక్కో వివరమూ తెలిసేకొద్దీ, దక్షిణాఫ్రికాలో సగం, ఇండియాలో సగం గా చెల్లాచెదురైన బంధువుల్ని వెతుక్కుంటూ, బదులు రాని అసంఖ్యాక ఉత్తరాలు రాస్తూ, ఒక్కో గొలుసునీ నిర్మించుకుంటూ వస్తూన్నకొద్దీ, ఒక్కో బంధువూ దొరకడం చాలా ఓపికగా ఒక్కో ఫేస్ నూ దాటుకుంటూ, మొత్తానికి దక్షిణాఫ్రికా వెళ్ళి, అక్కడి ఒక Institution లో ఎంతో వెతుకులాట అనంతరం, ఇండియానుంచి వచ్చిన ఒక "ఓడలో దిగిన వారి లిస్టు" లో తమ ముత్తాతయ్య   వీరయ్య గారి పేరును కనుక్కుంటారు. 

కుటుంబం మొత్తానికి కలుసుకుంది. అదీ, దక్షిణాఫ్రికాలో  అపార్థీడ్ రోజులు ముగిసాక. అంటే, నెల్సన్ మండేలా జైల్ నుండీ విడుదలయ్యాక, ఆయన అధికార పీఠాన్ని ఎక్కాక. అంతవరకూ, కనీసం ఉత్తరం రాయగలిగే పరిస్థితుల్లో కూడా లేరు అక్కడి ప్రవాస భారతీయులు.  అదీ వారి స్వాతంత్రం.  ఇలా వేలాది చిక్కుల్ని ఒక  Consistent  పోరాటం వల్ల, కృష్ణ గారు అధిగమించగలిగారు.  అయితే ఈ అన్వేషణలో ఆయన చాలా చేదునిజాల్నే తెలుసుకోవల్సి వచ్చింది. ఇలా తమ మూలాల్ని కనుక్కోగలిగే ఓపిక, ఆసక్తి, నిజాయితీ, స్పూర్థి, కాస్తో కూస్తో దారి చూపించే అదృష్టమూ, అందరికీ ఉండకపోవచ్చు. అందుకే  ఆ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చెయ్యడం అవసరం గా భావించి, దాన్ని తెలుగులోకి కూడా తీసుకురావడం, ఈ పుస్తకం విలువని గుర్తించి,  "అన్వీక్షకి"  దాని చక్కగా ప్రచురించడం, మెచ్చుకోదగిన విషయాలు. 

INDENTURED LABOUR (ఒక విధంగా ఒప్పంద కూలీలు) వ్యవస్థ గురించి వివరాలతో వచ్చిన తొలి తెలుగు పుస్తకం కూడా ఇదే. వనవాసి లో "మంచీ" ఏ అస్సాం టీ తోటలలో బానిసయిపోయిదో అని ప్రొటాగనిస్ట్ భయపడినట్టూ,   'బాలా' తీసిన "పరదేశి"  సినిమాలో, నెలలపాటు గొలుసులతో బంధించిన కాళ్ళతో మైళ్ళకొద్దీ నడిచి, టీ తోటల లో బానిసలుగా పనిచేసిన వేలాది తమిళ కూలీల వ్యధను చూసినట్టూ,  కూలీ భార్యాభర్తలను వేరు వేరుగా వేరువేరు తోటలకు (యజమానులకు) అమ్ముకోవడం, తల్లీ పిల్లల్ని విడదీసేయడం, భాష, చదువూ రానివారిచే కాంట్రాక్టుల మీద వేలిముద్రా సంతకాలు తీసుకుని, వారు దానికి కట్టుబడేటట్టు వంచించడం, ఈ ఇండెంచర్ కార్మికుల విషయంలో కూడా జరిగాయి. వీళ్ళలో కూడా, బీద, నిస్సహాయ మహిళలు దారుణమైన దోపిడీకి గురయ్యారు. 

కాలంతో పాటూ మారిన సామాజిక, ఆర్ధిక పరిస్థితుల వల్ల  మెల్లగా ఈ విధానం నశించి,  అక్కడ, నాటుకుని, జీవితాలని ఒక దారిలోకి తెచ్చుకుని, తరవాత వీరు వెస్టిండీస్ దీవులు, మారిషస్, ఫిజీ వంటి ఆయాదేశాలలో స్థిరపడ్డారు. వీరయ్య గారి కథ దక్షిణ ఆఫ్రికాకే పరిమితం అయినా, అనుబంధంలో ఏయే దేశాల్లో ఈ వ్యవస్థ ఉండేదో చక్కగా వివరించారు. ఇప్పుడు    ఆ దేశాలలో బానిసల్లా మగ్గిన ఇండెంచర్ కార్మికుల సంతతే ఇప్పుడు "భారతీయ" సంతతి అయ్యారు. ఆ విషయాల్నీ, నైపాల్ లాంటి ఇండెంచర్ కార్మికుల సంతతి ఎంత పైకెదిగారో, ఇలా ప్రతీ దేశం నుంచి, పేరొందిన ప్రవాస భారతీయుల సమగ్ర సమాచారాన్ని, కృష్ణ అందించారు. ఇది ఇండెంచర్ కార్మికులకు  తెలుగు దేశం చేసిన సలాం. 

బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ రాసిన చంద్రగిరి శిఖరంలో భారతీయులు ప్రవాసంలో కనిపిస్తారు. ఉగాండా ఊచకోతల సమయంలో మార్వాడీలు టార్గెట్ అవడం గుర్తుండి ఉంటుంది. మొన్నే నేను చదివిన నట్మెగ్స్ కర్స్ లో, ఒక భారతీయుడే సంక్షోభ సమయంలో జాజికాయ, జాపత్రి విత్తుల్ని (నట్ ని) రక్షించి, అవి ద్వీపం లో బ్రతికుండేలా చేస్తాడు. ఇవే ద్వీపాలలో స్థానికుల్ని ఊచకోత కోసేందుకు జపాన్ సమురాయ్ (కత్తి యుద్ధ వీరులు) లని విస్తారంగా వాడారు. వాళ్ళు తలారుల్లా పనిచేసేవారు. వాళ్ళు జీవం తీస్తే,  ఒక ప్రవాసీ భారతీయుడు,  జాజి కాయ వంగడపు జీవాన్ని  రక్షిస్తాడు. This small act of kindness, మన దేశం గురించి మనల్ని గర్వపడేలా చేస్తుంది.  

గాంధీ లాంటి మహాత్ముడు దక్షిణాఫ్రికాలో ఈ ఇండెంచర్ కూలీల వైపునుండీ మాటాడడం ద్వారా తన ఉద్యమ జీవితాన్ని మొదలు పెట్టడం జరిగింది. గాంధీ ప్రవేశం తరవాత, ఆయన వీరి బాధల్ని గ్రహించి బ్రిటిష్ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడం వల్లనే ఇండెంచర్ కార్మికుల జీవితాలలో కాస్త కుదురు వస్తుంది. గాంధీని ఇలాంటి కార్మికుల సంతతి వాడనుకునే,  రైల్లోంచీ నెట్టేయడం జరిగింది. దీన్ని బట్టి, పనులకోసం వేరే దేశాలకు మోసపూరితంగానో, ఇష్టపూర్వకంగానో తరలివెళ్ళిన మన పూర్వీకుల కృషి ని తెలుసుకోవడం అవసరమే అనిపిస్తుంది. 

చాలా మంచి పుస్తకం. కేవలం ఒక కుటుంబం కథ కాదు. "వీరయ్య" ఒక వసుధైవ కుటుంబకం గురించిన పుస్తకం. దాదాపు మూడు సంవత్సరాల తరవాత అయినా చదవగలిగినందుకు సంతోషం కలిగించిన తెలుగు పుస్తకం ఇది.  ముందుమాట రాసినది తనికెళ్ళ భరణి. ఈ పుస్తకం కూడా ఈ రూపు దాల్చడానికి వెనుక  ఒక పెద్ద "కుటుంబమే" ఉంది. అలాంటి సమిష్టి కృషి, సహకారం, ప్రోత్సాహం, ఈ మధ్యకాలంలో మనం చూసి ఉండం.  వీళ్ళందరికీ అభినందనలు. 


***

https://fb.watch/nLCKxRzoeP/?mibextid=NnVzG8&startTimeMs=113634



01/08/2023

రంగురంగుల కవిత్వం - సంపాదకుడు : అనిల్ బత్తుల (Part II)


-------------------------

Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.

                                                                                                          - Rabindranath Tagore

ఈ కవిత : మా బాస్ రూం లో ఒక పెద్ద చెక్క board పై చెక్కి ఉంటుంది. (ఏ నాటిదో - పాత గా ఉన్నా, దాన్ని మార్చేయలేదు) కొత్తగా ఇక్కడికొచ్చినపుడు, కేవలం ఆ బోర్డు మార్చేయనందుకు బాస్ మీద మంచి అభిప్రాయం కలిగింది. బహుశా మనందరికీ మన భారతీయత మీద  గర్వపడేలా చేయగలిగిన కవిత ఇది.  దీని అనువాదాలు రెండు వెర్షన్లు చూద్దాం :

స్వర్గసీమ : దేవులపల్లి కృష్ణశాస్త్రి  (1948)

ఎచట నా మస్తకమ్మెగయు హిమశృంగమై 
ఎచట జ్ఞానమ్మందు నెల్లరకు ముక్తమై, 
నిర్భీతి మన సెచట నిశిత హేతిగ మెరయు,
లోకమెట విడదిరుకు చీకుగోడల చిదికి,
వాక్కు లెచ్చోట వెల్వడును నిశ్చల సత్య
గర్భమ్ము నుండి నిర్భరజీవనదులుగా,
ఎచ్చోట తీవ్ర వేగోచ్చలిత దుర్వార 
కర్మధారలు నిండుకడలి లోపల పండు,  
స్వచ్చందమై స్వచ్చ సరళమై ఎచట వి
జ్ఞాన మింకదు జడాచార సికతా సీమ, 
ఎచట మనసెపుడు పరువెత్తు క్రొంగ్రొత్త భా
వాధ్యముల కండరములందు జాగృతి నించి,
అచ్చోట ఆ స్వర్గమందు మేల్కొలుపవా
ఈ పురాణ ధరిత్రి నీ భారత సవిత్రి,
నీ దయాధృఢహస్త నిర్దయాఘాతమున ! 

-----------------------------------------------------------------------

గీతాంజలి : రొంపిచర్ల భార్గవి (2014)

ఎక్కడ మనస్సు నిర్భయంగా వుండి తల పైకెత్తుకోగలదో
ఎక్కడ జ్ఞానానికి స్వేచ్చ వుందో
ఎక్కడ కుటిలమయ కుటుంబపు గోడలు లోకాన్ని ముక్కలుగా చెయ్యవో
ఎక్కడ నిజాల లోతుల్లోంచి పదాలు వెలువడుతాయో
ఎక్కడ నిరంతర శ్రమ పరిపూర్ణత కోసం చేతులు చాస్తుందో
ఎక్కడ హేతువు అనే తేట నీటి ప్రవాహం
ధూళి ధూసరితమైన పాత అలవాట్ల ఎడారి దారి పట్టదో
ఎక్కడ నా మనసు నీ మార్గదర్శకత్వంలో
విశాల భావాల, చర్యల దిశగా సాగుతుందో 
అలాంటి స్వేచ్చాస్వర్గంలో నా తండ్రీ
నా దేశాన్ని కళ్ళు తెరవనీ.  

--------------------------------------------------------------------------


Night of the Scorpion - Nissim Ezekiel

I remember the night my mother 
was stung by a scorpion. Ten hours
of steady rain had driven him
to crawl beneath a sack of rice.

Parting with his poison - flash
of diabolic tail in the dark room -
he risked the rain again.

The peasants came like swarms of flies
and buzzed the name of God a hundred times
to paralyse the Evil One.

With candles and with lanterns
throwing giant scorpion shadows
on the mud-baked walls
they searched for him: he was not found.
They clicked their tongues.
With every movement that the scorpion made 
his poison moved in Mother's blood, they said.

May he sit still, they said
May the sins of your previous birth
be burned away tonight, they said.
May your suffering decrease
the misfortunes of your next birth, they said.
May the sum of all evil
balanced in this unreal world

against the sum of good
become diminished by your pain.
May the poison purify your flesh

of desire, and your spirit of ambition,
they said, and they sat around
on the floor with my mother in the centre,
the peace of understanding on each face.
More candles, more lanterns, more neighbours,
more insects, and the endless rain.
My mother twisted through and through,
groaning on a mat.
My father, sceptic, rationalist,
trying every curse and blessing,
powder, mixture, herb and hybrid.
He even poured a little paraffin
upon the bitten toe and put a match to it.
I watched the flame feeding on my mother.
I watched the holy man perform his rites to tame the poison with an incantation.
After twenty hours
it lost its sting.

My mother only said
Thank God the scorpion picked on me
And spared my children.

ఈ కవిత అనువాదాన్ని మాత్రం కాస్త రుచి (One version) చూపించేసి ఆపేస్తాను. 

మా అమ్మని తేలు కుట్టిన ఆ రాత్రి నాకు బాగా గుర్తుంది. 
పది గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం
తేలుని బియ్యపుబస్తా క్రిందకి వెళ్ళేలా  చేసింది
చీకటిగదిలో ఒక్కసారి తోక జాడించి,
తోకకున్న విషం ఎక్కించి మళ్ళీ వర్షంలోకి పారిపోయింది. 

రైతులందరూ ఈగల్లా మూగిపోయేరు
వందసార్లు భగవన్నామ జపం చేసేరు
ఆ తేలు ఎక్కడుంటే అక్కడ ఆగిపోడానికి.
కొవ్వొత్తులూ, లాంతర్లూ
మన్ను మెత్తిన గోడల మీద 
పెద్ద తేలు లాంటి నీడలు కదులుతుండగా
దానికోసం వెతికేరు గానీ, లాభం లేకపోయింది.
"ళబళహళబళబ" అంటూ నాలికతో చప్పుడు చేసేరు
దాన్ని భయపెట్టడానికి.
దాని ప్రతికదలికకీ, అమ్మ రక్తంలో 
విషం  మీదకి ఎక్కుతుందని చెప్పేరు.
తేలు కదలకుండా చూడాలని అన్నారు. 
అమ్మతో మీరు పూర్వజన్మలో చేసిన పాపాలు 
ఈ రాత్రి దహించుకుపోవాలన్నారు
అప్పుడు అనుభవించిన బాధ మళ్ళీ జన్మలో 
ఆమె అనుభవించబోయే కష్టాల్ని తగించాలన్నారు. 
ఇక్కడ చేసిన పాపాలు, పుణ్యాలలో
కొట్టుకుపోతాయి గనుక ఆమె అనుభవించిన బాధకి
కొంత పాపం కొట్టుకుపోతుందన్నారు. 
విషం ఆమె రక్తాన్ని శుభ్రపరచాలనీ,
ఆమె కోరికలూ, ఆశలూ అణిగిపోవాలనీ చెప్పి
అమ్మని మధ్యలో కూచోబెట్టి
అందరూ చుట్టూ కూచున్నారు.

అందరిముఖాల్లోనూ ఆమె బాధపట్ల సానుభూతి.
మరిన్ని కొవ్వొత్తులూ, మరిన్ని లాంతర్లూ, 
మరింతమంది చుట్టుపక్కలవాళ్ళూ,
మరిన్ని పురుగులూ, ఆగకుండా మరింత వాన.
మా అమ్మ నొప్పితో కింకలు చుట్టుకుపోతూ
పాపం చాపమీద అటూ ఇటూ దొర్లుతోంది.
హేతువాదీ, ఏదీ ఓ పట్టాన నమ్మని మా నాన్న
చూర్ణం, మిశ్రమం, వేరు, పసరు, ఒకటేమిటి
ప్రయత్నించని మందు లేదు..
చివరికి, కుట్టిన వేలిమీద కొంచెం పేరఫిన్ వేసి
అగ్గిపుల్ల వెలిగించేడు కూడా.
ఆ మంటకి మా అమ్మ చర్మం బొబ్బలెక్కడం చూసేను. 
విష బాధ  నివారణకి మంత్రగాడు వచ్చి 
ఏవో పూజలు చేసి మంత్రాలు చదవడం చూసేను.
అలా ఇరవై గంటలు గడిచిన తర్వాత
ఎలాగయితేనేం విషం ప్రభావం తగ్గింది. 

మా అమ్మ తర్వాత ఒకటే మాట అంది.
భగవంతుడు చల్లగా చూడబట్టి
ఆ తేలేదో నన్ను కుట్టింది 
నా పిల్లల్ని కుట్టకుండా. 

                                                         -  నౌడూరి మూర్తి 


------------------------------------------------------------------------------------
ఈ కవితల్ని యధాతధంగా పుస్తకం నుండీ ఎత్తేసి ఇలా పోస్ట్  చెయ్యకూడదు. కానీ ఇంకెలా ఈ పుస్తకం చాలా బావుందని చెప్పాలో అర్ధం కాలేదు. Words failed me.  This is the best thing to happen in recent times, good content, good taste, good quality and good collaboration. Big Thanks.







***

Victory City - Salman Rushdie



రెండువందల నలభై ఏడు ఏళ్ళ వనిత, కళ్ళు లేని కవయిత్రి, మంత్రగత్తె, సోది చెప్పే "పంప కంపన" ఈ బిస్నగ సామ్రాజ్యం గురించి రాసిన దీర్ఘ కవిత ఈ "విక్టరీ సిటీ". అంటే విజయ నగరం కథ.   కాల పురుషుడు మన హెచ్చు తగ్గుల్నీ, జరామరణాల్నీ నిర్ద్వందంగా చూస్తూ ఏ అనురక్తితో సృష్టి స్థితి లయ విన్యాసాలు చేస్తాడో అలా రష్దీ,  "విజయనగర సామ్రాజ్యాన్ని" సృష్టిస్తాడు.  దాని కర్తా, కర్మ క్రియల్ని దర్శిస్తాడు. ఆఖరికి  దాని వినాశనాన్ని కూడా దర్శింపచేస్తాడు. ఇది  మొదటి విజయనగర రాజుల నుండీ, మలినాటి తుళువ వంశం / ఆఖరికి రామరాయల దాకా,  వాళ్ళు గెలిచిన, ఓడిన రాజ్యాల దాకా,  హంపి వీధుల్లో, శిధిలాల్లో, బండరాళ్ళ గుట్టల్లో, తుంగభద్ర అలల్లో, చరిత్రను  వెతుక్కునే యాత్రీకుడి కళ్ళ ఎదుట ఓ మహా సామ్రాజ్యాన్ని దృశ్యాలుగా నిలబెట్టి, పెద్ద సినిమా చూపించినట్టు చూపిస్తాడు. 

ఈ పుస్తకాన్ని నేను చాలా ఎంజాయ్ చేసాను. రాజుల కథ, చందమామ కథ లాగుంది. అయితే ఓ హైదరాబాదీ గా, హంపి, బీదర్, ఔరంగాబాద్ లాంటి మహరాష్ట్ర లో కొన్ని భాగాలు, గత మూడేళ్ళలోనే కవర్ చెయ్యడంతో రష్దీ వర్ణనలు మరీ బాగా మెదడులోకి ఇంకి, పైగా, ఇలాంటి చందమామ కథల సినిమాలు చూసి ఉండడంతో  ఎక్కువగా ఆనందించగలిగాను.  "పంప కంపన" ఈ నవల్లో హీరోయిను. ఆవిడ తండ్రి ఓ మామూలు బుల్లి రాజు. ఆయన ఆ రోజుల్లో దిల్లీ సుల్తానుల కోసం దక్షిణాదిన  జరిగిన అసంఖ్యాక యుద్ధాలలో,  అంటే, మరీ స్పష్టంగా చెప్పాలంటే, "ఊరూ , పేరులేని" ఒకానొక  యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు.  తల్లి, నది ఒడ్డున తనలాంటి మిగిలిన   యుద్ధవీరుల విధవలతో కలిసి  మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.  అప్పటికి బాలిక అయిన పంప (తండ్రి పేరు కంపన)  కళ్ళెదురుగానే,  ఆ నిప్పుల్లోకి మౌనంగా వ్యాహ్యాళికెళ్తున్నట్టు వెళ్ళిన తల్లి, ఇంకా ఆ   స్త్రీల బృందం, మంటలు శరీరాన్ని దహించివేస్తున్నా, మాంసం కాలి నరకయాతన అనుభవిస్తున్నా, చిన్న కేక కూడా బయటికి రానివ్వకుండా ధైర్యంగా సజీవ దహనం అయి చనిపోతారు. తల్లి  ఆ నిప్పుల్లోకి తన చేతిని వొదిలి నడిచెళ్తుంటే, ఇదుగో ఇప్పుడే వచ్చేస్తుందిలే అని ఎదురు చూసిన పంప కి, ఆమె ఎముకల నుండీ కాలిన మాంసం రాలుతుంటే, తల్లి ఇక తిరిగి రాదని అర్ధమయిపోతుంది.   బ్రతికేందుకు దమ్ము లేక, సుగంధ ద్రవ్యాలతో, గంధపు చెక్కలతో చితి పేర్చుకుని ఆ స్త్రీలు చేసిన ఆత్మత్యాగం విలువ ఏమిటో, ఆ చిన్న వయసులో కూడా పంపకేమీ అర్ధం కాదు.   అప్పుడే ఆమెకు చావంటే అయిష్టం కలుగుతుంది. ఎప్పటికీ ఆత్మ హత్య చేసుకోకూడదని, చావు  దేనికీ పరిష్కారం కాదనీ ఆ క్షణాన్నే బాల్యాన్ని కోల్పోయిన ఆ పిల్ల గట్టిగా నిశ్చయించుకుంటుంది.   ఏదో తెలీని గగుర్పాటుతో, తీవ్ర అలజడితో పంపా నది ఒడ్డున నుల్చున్న ఆ అనాధ పిల్లకు అశరీరవాణి  "దీర్ఘాయువు"ను ప్రసాదిస్తున్నట్టు వరం ఇస్తుంది. 

తల్లి  తండ్రీ ఇద్దరూ పోయాక అనాధ అయిన ఆ పిల్ల, ఒంటరిగా ఈ దుష్ట ప్రపంచంలో  ఎలా బ్రతికి బట్టకట్టిందో, ఎలా దోపిడీకి గురయిందో, ఏమి కష్టాలు చూసి బ్రతికిందో చెప్పలేను.  విజయనగర  సామ్రాజ్యాన్ని  స్థాపించడంలో విద్యారణ్యులనే ఓ ఋషి పాత్ర ఉంది కదా.  ఈ కథలో అతను విద్యాసాగరుడు.  పంప  అనాధయేటప్పటికి ఈ విద్యాసాగరుడు  యువ సన్యాసి. ఒక్కడూ గుహలో తపస్సు చేసుకుంటున్నాడు.  ఆధ్యాత్మిక  గ్రంధాలని చదువుకుంటున్నాడు. అతని  ఆశ్రయంలోకి "పంప"ని విడిచిపెడతారు. పగలు  ఎలానో పనిపాటల్లో గడిచిపోయినా , రాత్రి సమయాల్లో ఆ యువకుడూ, ఈ వయసొస్తున్న పిల్లా ఒకే గుహలో పడుకుంటారు. కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న ఆయువ సన్యాసి కాస్తా,  ఆమెను శారీరకంగా వాడుకునేవాడు. 'పంప'  ఎలాగో బ్రతకడం కోసం,  ఇంకో దిక్కు లేక, తనని ఇలా వదిలేసిన తల్లిని నిందించుకుంటూ అతని పంచనే ఉండాల్సి వచ్చింది.  అయితే, అప్పటినించీ పంప 'మాట'లాడలేదు.   ఆమె మౌనం ఎన్ని సంవత్సరాలు  గడిచిందంటే, తనతో అన్నేళ్ళు 'బానిస'లా బ్రతికిన ఆ పిల్ల పేరేంటో  విద్యాసాగరుడికి తెలీదు. 


పంప యౌవనంలోకి వచ్చేసరికి అసమాన సౌందర్యవతి అయింది.  ఆమె సౌందర్యం లో ఎంతో గాంభీర్యం, హుందాతనం ఉండేవి.  అప్పుడే ఆ గుహ దగ్గరకి అప్పటికి చుట్టుపక్కల రకరాలుగా జరుగుతుండే యుద్ధాల్లో సైనికులుగా పనిచేసుకుంటూ, జీవిక చూసుకునే ఇద్దరు అన్నదమ్ములు (హరిహర బుక్క రాయలు) వస్తారు. వాళ్ళకి రాజ్య విస్తరణ (స్థాపనా) కాంక్ష ఉంది. విద్యాసాగరుని ఆశీర్వాదం కోసం వస్తారు వాళ్ళిద్దరూ.   గురువు దగ్గరికి ఒట్టి చేత్తో ఏమొస్తారు ? కొన్ని పళ్ళు, విత్తులూ ఉన్న బుట్ట ని తీస్కొస్తారు.   గురువు అప్పటికి పెద్దవాడయ్యాడు. పంప అతని కూతురో / భార్యో ఎవరికీ తెలీదు.  పంప  అంతవరకూ మూగదనే అనుకుంటున్నారందరూ.  

రాజ్యం మాటొచ్చాక పంప తొలిసారిగా వారితో మాటాడింది. వాళ్ళు తీసుకొచ్చిన విత్తనాల్ని వాళ్ళకే ఇచ్చి,  తుంగభద్ర చుట్టుపక్కలంతా చల్లమంది. ఆ  విత్తనాల్లోంచీ మనుషులు పుడతారు. దేశమంటే మట్టి కాదు కద. దేశమంటే ప్రజలు. ఆ  ప్రజలు అంటూ ఏర్పడ్డాకా, ఒక కోట కట్టి, అందులో రాజ్య స్థాపన చెయ్యమంటుంది. రాళ్ళు, రప్పలతో నిండిన ఆ భూమిలో ఆమె ఏ మంత్రం వేసి ఆ విత్తనాలిచ్చిందో కానీ,  వీళ్ళు ఇలా చల్లాక, తెల్లారేసరికీ ఓ అందమయిన రాజ్యం స్థాపించేయగలిగారు. 'ఖావల్సినంత' మంది  ప్రజలు  ఆ విత్తుల్లోంచీ పుట్టుకొచ్చారు. రకరకాల వృత్తుల వారు. వ్యాపకాలవారు. వ్యాసంగాలవాళ్ళు.. బోల్డుమంది.  మాట వినే ప్రజలు.. వాళ్ళకి గతం లేదు.  ఈ కొత్తజీవితంలో కొత్త ప్రాణులే అయినా, పంప  తన అలౌకిక శక్తులను వాడి, అశరీరంగా మారి,  ప్రతి ఒక్కరి చెవిలోనూ వాళ్ళకో కథ చెప్పేది… ఉదాహరణ కు కుమ్మరి వాడున్నాడనుకోండి.. "నీ పేరు ఫలానా… నువ్వు వృత్తి రీత్యా కుమ్మరివి.. నువ్వు ఎంతో నైపుణ్యంతో కుండలు చేస్తావూ" అని.. అలాగే వడ్రంగి నుంచీ సైనికుడికీ.. అందరికీ తమ తమ పాత్రలు తెలుసు. అదే  పంప పుట్టించిన రాజ్యం. పంప  సృష్టించిన మనుషులు.  పంప  చెప్పిన కథల్నే తమ తమ జీవితాలు చేసేసుకున్న ప్రజలు.  ఆలా విజయనగర సామ్రాజ్యం మొదలయింది. 

బుక్క రాయలు, అతని తమ్ముడు హుక్క రాయలలో మొదట ఈ రాజ్యానికి రాజు ఎవరవ్వాలి? రాజు  అంటూ అయాక, రాణి ఉండాలి కద మరి, పంప ని ఇద్దరూ ఇష్టపడుతున్నారాయె.  వీళ్ళిద్దరిలో పంప ఎవరిని ఎన్నుకుంటుంది?  పంప ఇద్దరినీ పెళ్ళాడుతుంది. మొదటి భర్తతో కొడుకుల్నీ, రెండో భర్తతో కూతుర్లనీ కంటుంది.  భర్త  ఉండగానే  తమ రాజ్యానికి గుర్రాలమ్మేందుకని వచ్చిన పోర్చుగీసు యువకునితో ప్రేమలో పడుతుంది.  అలా రాజు భార్యతో సంబంధం పెట్టుకోవడం పులిబోనులో తల పెట్టడమే అని తెలిసినా ఆమెను వొదులుకోలేని ప్రియుడూ, తన కళ్ళెదురుగానే ప్రియుడితో తిరిగే "ప్రశ్నించే వీలు కాని" భార్య ఉన్న రాజూ..  నిజానికి ఆవిడతో ఇక గడిపేందుకు భయపడో, అలా ఉండలేక బాధపడో, రాజు ఎక్కువగా యుద్ధాలలోనే గడిపేవాడు. అలా దక్షిణాదిన ముసల్మానుల రాజ్య విస్తరణను అడ్డుకుంటాడు. 

అదో  పెద్ద  కథ… పంప కంపన ఆతరవాత రెండు వందల ఇరవైయేళ్ళు బ్రతికింది. "తన వాళ్ళ" చేతే  వెళ్ళగొట్టబడింది.   రాజ్యం ఎన్ని చేతులు మారుతుందో చూస్తుంది. విజయనగరం రకరకాల వంశాల చేతుల్లోకి వెళ్తుంది. తను  సృష్టించిన ప్రజలే ఆమెను అసహ్యించుకుంటారు. కొన్నేళ్ళు అజ్ఞాతవాసం చేసి తిరిగొస్తుంది. భర్తలు, ప్రియులు, పిల్లలు – అందరూ తన కళ్ళెదుటే చనిపోతారు. విద్యాసాగరుడు చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు.   అతను మతమౌడ్యం మీద పునాదులేసుకుని, ఒక ఆశ్రమాన్నేర్పరచి, తరవాత రాజ్యవ్యవహారాలో చేయి పెట్టి,  రాజులాగా  దిగ్విజయంగానే బ్రతుకుతాడు.   పంప కంపన రాజ్య బహిష్కరణకి కారణం అవుతాడు.  ఎన్నో ఏళ్ళపాటు అడవుల్లో తలదాచుకుని, కాలంతో ప్రయాణం చేసి,  ఆఖరికి శ్రీ కృష్ణదేవరాయని కాలం లో పంప, తన ముని ముని ముని ముని ముని ముని మనవరాలితో కలిసి, రాజ్యానికి తిరిగొస్తుంది.  

తిమ్మరసు అంతటి "మంత్రిణి" అవుతుంది. ఎన్నో  అత్భుతాలు చేస్తుంది. పుట్టుక నుంచీ, విజయనగరం గతించిపోయే దాకా, దాని చరిత్రను స్వయంగా రచిస్తూ, దానితో పాటూ పుడుతూ, నశిస్తూ, మళ్ళీ జీవిస్తూ, ఎన్నో బాధలు సహిస్తుంది.   అయితే తన జీవితాన్ని అడుగడుగునా డాక్యుమెంట్ చేసి,  ఓ దీర్ఘ కవితలా రాసి, ఆ కాయితాల్ని ఒక మట్టి కుండలో భద్రపరుస్తుంది.  అదే ఈ కావ్యం.  ఈ కావ్యం లో The Woman King సినిమా లో లాగా అత్యంత శక్తివంతులయిన మహిళా సైనికులుంటారు. వాళ్ళకి ఉక్కులాంటి శరీరం, భయం ఎరుగని ప్రవృత్తి, యుద్ధ విద్యల్లో నైపుణ్యమూ, అసామాన్యమైన విశ్వాసమూ ఉంటాయి.  

ఆమె జీవితయానంలో  "ఘన విజయనగర సామ్రాజ్యం"లో ఎందరో విదేశీయులు రాజు తో కలిసి పనిచేస్తారు. "పోర్చుగీసు ప్రేమికుడు" పంపకు ప్రతి తరంలోనూ, ఒకడు ఎదురవుతాడు.  ఆమె వయసు పెరగని, మృత్యువు రాని యవ్వనవతి.  200 ఏళ్ళ వయసుకి 24 ఏళ్ళ పడుచు మనిషిలా కనిపిస్తుంది.  ఆ మొదటి పోర్చుగీసు ప్రేమికుడు ఆమెను ఎంత ప్రేమించాడంటే, ఆమెకోసం మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాడు. సముద్రాలు దాటి ఏదో ఒక వంకతో మన దేశానికొస్తాడు. దక్షిణాది కి గోవా నుంచొచ్చి, పంప ఎదుట నిల్చిన ప్రతిసారీ.. "వచ్చావా!" అంటుంది ఆమె నింపాదిగా, ఆపేక్షగా, అతనొస్తాడని ముందే తెలిసినట్టు!    అతనికి పూర్వజన్మవాసనలుండవేమో.. "కొత్త యువకుడు"  ఈమెని చూసి, "ఎన్నో యుగాల పరిచయం ఉన్నట్టుందే, ఎవరీమె?" అనుకుంటూ..  అయోమయపడతాడు.  చాలా సహజంగానే ఆమెతో ప్రేమలోనూ పడతాడు. 

పంప  కూతుర్లలో ఒక ఆమెను విజయనగర రాజుని ఆశ్రయించిన ఒక  చైనీయుడు పెళ్ళాడతాడు. వారిద్దరి  ప్రేమకథ అపురూపం. నిజానికి  వాళ్ళు పెళ్ళి  చేసుకోరు. తరతరాలుగా  కొన్ని జన్మల పాటు, మళ్ళీ మళ్ళీ పుడుతూ, కలుస్తూ, ప్రేమించుకుంటూ, కలిసే ఉంటూ - బ్రతుకుతారు.  వాళ్ళ..."ముని ముని ముని కూతురు" పెద్దయి, తన అమ్మమ్మ తో కలిసి విజయనగరానికొచ్చి శ్రీ కృష్ణదేవరాయని  "ప్రేమిక " అవుతుంది.   అసలు పెళ్ళాడేదేమో కానీ, రాజ్య వ్యవహారాలు చక్కబెట్టాల్సిన తిమ్మరసు సలహా మీద రాయలు ఒక రాజకుమార్తెను పెళ్ళాడాల్సి వస్తుంది. ఆవిడ పట్టమనిషి కాబట్టి, పంప మనుమరాలు "ప్రధాన ప్రేయసి" గానే మిగిలిపోతుంది. 


ఆనాటి రాచరికపు మర్యాదలు, కుట్రలు, కుతంత్రాలు,  అమర్యాదలు, రాజుల స్త్రీలోలత్వమూ, యుద్ధ కాంక్ష, విస్తార భ్రమణమూ అన్నీ వర్ణనలు, ఎలా ప్రతీదీ ఉండేదో, ఎలా జరిగేదో, రాయలు, తిరుపతి నుంచీ సింహాచలం దాకా  వివిధ రాజ్యాలలో క్షేత్ర దర్శనాలు చేయడం, శాసనాలు రాయించడం, బోల్డన్ని గుళ్ళు కట్టించడం, గుళ్ళకు భూరి విరాళాలివ్వడం, రాజ్యాలు గెల్చుకోవడం, అతని భార్యలు కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ప్రతిభని చాటడం, అతని రాజ్యంలో పేరెన్నిక  గన్న కవులూ,  రాజు స్వయానా అత్భుతమైన సాహిత్యం రచించడం, దక్షిణ, కళింగ దేశాలని ఏలడం..  వీటన్నిటినీ సల్మాన్ రష్దీ చాలా చక్కగా రాసుకొచ్చాడు.   ఇవన్నీ రష్దీ ఎలా ఒక కథ లో ఇమడ్చగలిగాడో అని చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 

చదివే వాళ్ళకి కథంతా చెప్పేసి, అన్యాయం చేస్తానని నా మీద ఒక ప్రథ ఉంది. క్షమించాలి. ముగింపు  చదవడం మాత్రం ఒక అనుభవం. మన కథలు GOT కన్నా ఏం తక్కువ ? ముగింపు చదవడం కోసం ఈ పుస్తకాన్ని కొనుక్కోండి. 


చిన్న సందేహం : 

తల్లి లాంటి పంప కంపన ని అచ్చు మన "మహామంత్రి తిమ్మరసు" సినిమాలో లాగానే 'రాయలే ' కళ్ళు పొడిపించేసి,  గుడ్డిదాన్ని చేసేస్తాడు. అప్పుడు నాకు ఎంటీఆర్ మీద గొప్ప కోపం వచ్చింది. Hee hee !!   నవలంతా నాకు భానుమతీ, ఎంటీ ఆర్, నాగయ్య, వీళ్ళే కనిపించారు.  Is it my Telugu conditioning ???

ఒక సౌత్ ఇండియన్ గా, మిస్టిసిసం తో మెరుస్తూ ఉండే హంపి నగర వర్ణనల మధ్య సరిగ్గా అలాంటి అలౌకిక శక్తి ఉన్న పంప "కళ్ళతో చూసినదీ, జ్ఞానేంద్రియాలతో, మనసుతో చెప్పినదీ" అయిన ఈ "విజయ నగర" కథ ని చదివి ఈవిడ (Rushdie)  - ఈ "విజయనగరా"నికి  "బిస్నగ" (BISNAGA) అని ఎందుకు పేరు పెట్టిందో కాస్త చెప్పండి.   నాకు ఎంత వెతికినా సరిగా తెలీలేదు. "బిస్నగ సామ్రాజ్యం " అనడిగితే, వికీ  "విజయనగర సామ్రాజ్యాని" కి దారి చూపిస్తోంది. దాని వెనకేముందో కథ మరి!! 

***

24/07/2023

రంగురంగుల కవిత్వం - సంపాదకుడు : అనిల్ బత్తుల (Part I)





ఒకే కవిత.. దానికి కొన్ని అనువాదాలు ! ఒక్కో అనువాదం ఒక్కోలా వుంటుంది. కొన్ని ఒకందుకు నచ్చుతాయి.. కొన్ని ఇంకోకందుకు! ఇదే కాన్సెప్ట్ ! 

"ఎవరి అనువాదం మనకు నచ్చింది ? ఎందుకు నచ్చింది ? ఆ అనువాదం పాఠకుడికి లేదా పాఠకురాలికి నచ్చడానికి వారు పెరిగిన వాతావరణం, చదువు, సాహిత్య పఠన జాబితా ఇలా ఎన్నో కారణాలుండవచ్చు. ఒక్క అనువాదం ఒక్కో రంగులో మన హృదయాన్ని తాకుతుంది. నాకు ఈ కవిత్వ అనువాదాలు సంక్రాంతికి పిల్లలు గాల్లో ఎగరేసే రంగుల గాలిపటాల్లా కనిపించాయి.  మనుష్య నీడలు తాకని రహస్య అడవుల్లో ఎగిరే పేరుతెలియని రంగుల పక్షుల్లా ఈ అనువాదాలు నాకు కలలో కనిపించాయి".

- అనిల్ బత్తుల 

Content :   79 కవితలకు 206 అనువాదాలు. ఒక్కో కవితకు, గరిష్టంగా అయిదు అనువాదాలు. కవితలంటే పెద్దగా పడని నాకు ఈ పుస్తకంలో కవితలు బహుశా లబ్దప్రతిష్టులవి కాబట్టి చాలా నచ్చాయి.   వీటిని "కవిత్వ ప్రేమికులకు" చాలా శ్రద్ధతో, కమిట్మెంట్  తో సమర్పించారు అనిల్. ఎప్పట్లాగే ఆయన టేస్ట్ - అత్భుతం. ఈ పుస్తకాన్ని   నాకు దయతో పంపించిన నౌడూరి మూర్తి గారికి వేల వేల ధన్యవాదాలు. నూటికి తొంభయ్యారు శాతం నా అంతట నేను ఈ పుస్తకం (కేవలం కవిత్వం అంచెప్పి) కొనేదాన్నయితే కాదు. మొదట ఆలా తిరగేస్తూ 'బనలతా సేన్' చదివాను. అసలే చుట్టూ బెంగాలీలు. జీవనానంద మాట ఎత్తేసరికీ 'బనలతాసేన్' ను తల్చుకున్నారు. ఇదో మంచి అనుభవమే. ఎంత బావున్నాయో 'బనలతా సేన్' కి ఉన్న వెర్షన్లు... 


మచ్చుకు ఓ చిన్న కవిత : 

---------------------------

గాధ  (1)

అనువాదం : రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ (శ్రీ శాలివాహన గాథాసతశతీసారము, 1951) 


కల(గవు కమలంబులు : హం

సలు గదలవు; చూడవత్త  చక్కగ నెవరో 

వెలికిలగా నాకాశము

నిలిపినవా రూరిచెఱువునీళులలోనన్ !


----------------------------


గాథ (2)

అనువాదం : వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య (గాథాసప్తసతి, 1968) 


తాఱుమాఱుగావు తమ్మిపూ లెగసిపో

నైనబోవు హంస లచటినుండి

తెలియ దెవరోగాని తలక్రిందుగా నభం

బూరి చెఱువునందు నుంచిరత్త !


-------------------------------


గాథ (3)

అనువాదం : తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి (ఆంధ్ర ప్రభ 1993) 


ఊరి చెరువులో ఆకాశం పడింది

ఒక్క తామర తెగలేదు

ఒక్క కొంగ తగ్గలేదు

-----------------------------

గాథ (4)

అనువాదం : నరాల రామారెడ్డి (గాథా త్రిశతి, 201)


చిత్రమగునత్త ! మనయూరి చెఱువునందు 

ఎత్తిపడవేసెరెవ్వరో ఇంత నింగి

నలినషండమ్ము లిసుమంత నలుగలేదు

ప్రాణభయమున నెగురదు హంసగణము.

----------------------


గాథ (5)

అనువాదం : దీవి సుబ్బారావు (ప్రాకృత గాథాసప్తసతి 2012)


తామరలు చెదరవు

హంసలు కదలవు, చూడు అత్తా !

ఆకాశాన్ని ఎవరో 

వెల్లకిలగా వూరి చెరువునీళ్ళలో 

పడుకోబెట్టినారు

----------------------------------------------------------------------------------

బనలతాసేన్ లో కొన్ని లైన్లు 



దివసాంతాన మంచురాలే మెత్తటి శబ్దంతో

సంధ్య ప్రవేశిస్తుంది; సూర్యగంధాన్ని దులుపుకుంటుంది డేగ        - ఇస్మాయిల్


సాయంకాలపు మంచురాలుతున్నవేళ

మహాశకుంతం తన రెక్కనుండి 

సూర్యబింబసుగంధాన్ని తుడిచేసుకుంటున్నవేళ     -   - వాడ్రేవు చినవీరభద్రుడు 


సాయమ్రశ్మి కప్పుకొన్న చెట్ల కొమ్మల సందుల నడుమ

కాకి తన రెక్కలమీద 

కమ్ముకొన్న సూర్య సౌరభాన్ని దులుపుకుంటున్న సమయాన   -  కుప్పిలి పద్మ


పవలంతా కడచినాక మంచుతుంపర పచ్చికపై మెలమెల్లన రాలినట్లు

విచ్చేస్తుంది మలిసంజ, రెక్కలపై ఎండతావి తుడుస్తాయి చీకట్లు.  -  ఆలూరి బైరాగి


సాయంగోధూళి కప్పిన చెట్ల కొమ్మల సందుల మధ్య 

అపశకునాల రేవెన్ పక్షి 

రెక్కల మీద వాలిన సూర్యకిరణాల సువాసనలు తుడిచేసుకుంటుంది.   - కుందుర్తి

---------------------

At the end of the day, with the soft sound of dew,
Night falls; the kite wipes the sun's smells from its wings; - Fakrul Alam


(ఇంకా వుంది)


23/07/2023

The Nutmeg's Curse - Amitav Ghosh



ఇండొనేషియా చాలా అందమయిన ద్వీపాల సమూహం.  ఇక్కడ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలున్నాయి. ఎన్నో అత్భుత పగడపు దీవులు, అందమయిన అగ్నిపర్వతాలు, అత్భుతమైన బీచ్ లు. మంచి గ్రీనరీ, ఇంకొంచెం చరిత్ర!! 'నట్మెగ్స్ కర్స్' ఆ చరిత్రని ఇప్పటి గ్లోబల్ వార్మింగ్ కి, మనుషుల అరాచకత్వానికీ, తద్వారా  సొంత గ్రహ వినాశనానికీ ముడిపెడుతూ రాసిన ఓ పుస్తకం.  మనది "వసుధైక కుటుంబం" కదా. ఎన్ని సామెతలో, భూమి గుండ్రంగా ఉందనీ, దునియా గోల్ హై అనీ, ఎక్కడి వాళ్ళమైనా మనం, అందరం ఒకటే!! ప్రకృతి విపత్తుల కోణంలో చూస్తే   ఎవరో పెట్టిన చిచ్చుకు ఇంకోరం బలవట్లేదూ, భూమికి బోర్డర్లుండవు. అది గీతలు గీసుకోదు. అందుకే, బందా (Island in Indonesia, once famous for Nutmeg cultivation)  నుంచీ కథ మొదలు పెట్టారు రచయిత. 


బందా ద్వీపాలు ఒక పది.   అగ్నిపర్వతం పేలినతరవాత ఏర్పడిన దీవులు. ఎన్నో ఏళ్ళుగా పర్వతంలో మరిగిన ఆ మట్టి ఎన్నో వేల కోట్ల అత్భుతమయిన మూలికలకు, సహజ వనరులకు నెలవు. ప్రపంచంలో అప్పటికి ఎక్కడా లేనటువంటి నట్ మెగ్ (జాజికాయ) అక్కడే పుట్టింది.  అది ఎంత విలువైన పండో!    జాజికాయ, బందా దీవుల్లో తప్ప మొత్తం భూమి మీద అసలు ఎక్కడా పండేది కాదు. దాన్ని వ్యాపారులు, ముఖ్యంగా అరబ్ లు, ఎన్నో సంవత్సరాలుగా పాశ్చ్య, పాశ్చాత్య దేశాలకు అమ్మేవారు.    అప్పటికి అమెరికా కనిపెట్టబడలేదు. సో, ఐరోపాలోనూ, ఇండియాలోనూ ఈ జాజికాయను వంట దినుసుల్లోనూ, సుగంధ ద్రవ్యాలలోనూ,  ఔషధాల  తయారీలోనూ వాడేవారు.  నిజానికి ఐరోపాలో కన్నా ఎక్కువ మొత్తంలో భారత దేశంలోనే జాజికాయని వాడేవారు. అరబ్బులు ఈ ద్వీపాలు ఎక్కడున్నాయో బయటి ప్రపంచానికి తెలీకుండా కొన్ని తరాల పాటూ దాచాకా, పోటీ ఎక్కువయి, మొత్తానికి పోర్చుగీసు వాళ్ళూ, డచ్ వాళ్ళూ, ఆఖరికి ఇంగ్లీష్ వాళ్ళ పాలపడింది ఈ ద్వీప సమూహం.


అక్కడి నుంచీ ట్రేడ్ వార్ పేర్న జరిగిన అకృత్యాలు, అమానవీయ సంఘటనలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి ఇతర ఖండాలలో జరిగినట్టే, ఇక్కడా జరిగింది.  సహజంగా ఆయా ప్రాంతాలకు చెందిన ఆదిమజాతుల వారిని, చంపేసారు. అదిరించీ బెదిరించీ వెళ్ళగొట్టారు. తరతరాలుగా వారిని వేధిస్తూ, వారి సంస్కృతినీ, భాషనీ సర్వనాశనం చేసారు.  డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ (Venerable East India Company - the Vereenigde Oostindische Compagnie, VOC)   ఆయా దేశాలో లాగానే ఇక్కడ కూడా నేటివ్స్ నీ, అసలు సొంతదారుల్నీ సమూలంగా నిర్మూలించి, తన వాళ్ళను తెచ్చుకుని, జాజికాయల వ్యాపారం మొదలు పెట్టింది. 

In the sixteenth century, the value of nutmeg soared when doctors in Elizabethan England decided that the spice could be used to cure the plague, epidemics of which were sweeping through Eurasia.  In the late middle ages, nutmegs became so valuable in Europe that a handful could buy a house or a ship.


Anglo-Dutch War లో ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ పెద్దగా వేగలేక, ఈ ద్వీపాల్లో ఒకదాన్ని (Island or Run, Treaty of Breda, 1667)  డచ్ వాళ్ళతో మార్పిడి చేసేసుకున్నారు. అంటే పది దీవుల్లో ఒకదాన్ని వొదులుకుని, దానికి బదులు అమెరికాలో ఇప్పుడు Manhattan/న్యూయార్క్ ని తీసుకున్నారు.  దాంతో జాజికాయల వ్యాపారం పూర్తిగా డచ్, పోర్చుగీసు వాసుల చేతికి వచ్చేసింది.  అమెరికాలోనూ ఇంగ్లీష్ వాళ్ళు జాతుల హననానికి విస్తారంగా పాల్పడ్డారు. బానిసల్ని ఆఫ్రికానుండీ ఎత్తుకొనొచ్చి సామ్రాజ్యాల్ని నిర్మించుకున్నారు. ఆ అకృత్యాలు ఒక మనిషి ఇంకో మనిషి పట్ల సాగించిన దురాగతమే కాదు. మనిషి భూమికి చేసిన అన్యాయం కూడా. అసంఖ్యాకంగా స్థానిక జాతుల వారిని నిర్మూలించడాన్నే కాకుండా, అక్కడి భూమిని ఆక్రమించుకునేందుకు విస్తారంగా అరణ్యాలను నరికేసారు. అక్కడి వన్యప్రాణులను వేటాడడానికే ప్రత్యేకంగా మనుషులుండేవారు. ఆ కళేబరాలను  / ఎముకల గుట్టలను / వాటి శరీరాలను కుప్పలుగా పోస్తే అవే కొన్ని వేల ఎకరాలను ఆక్రమించేవంట.  ఇక చిన్న చిన్న పురుగూ పుట్రా, పక్షులూ జీవనాధారంలేక వాటిమటుకవే సమసిపోయేయి. అలా అప్పట్నించే పర్యావరణానికి హాని చెయ్యడం మొదలుపెట్టాడు మానవుడు. 

ఇక ఇండోనేషియా కి తిరిగొస్తే - ఇక్కడ అన్నట్టు చుట్టుపక్కల దీవుల్లో లవంగాలు కూడా పండేవి.  ఇక గుత్తాధిపత్యం వీళ్ళదే కాబట్టి,  ఆ రకంగా యూరోపియనులు  స్పైసెస్ వ్యాపారంలో వేల కోట్లు గడించారు. ఇక్కడినుంచీ ఓడల్లో స్పైసెస్ ఇంత ఖర్చు భరిస్తూ యూరోపు తీసుకెళ్ళడం ఎంత ఖరెదైన సంగతైనా, దానికి పది పన్నెండు రెట్లు ఎక్కువ సంపాయించేవారు కాబట్టి, వాళ్ళకి ఈ దీవుల మీద రాజ్యం చెయ్యడం, ఏలడం చాలా అవసరం. అయితే, అధికారం కోసం ఒకళ్ళతో ఒకళ్ళు కీచులాడుకుంటే మొదటికే ఎసరు వస్తుందని వ్యాపారులే ఒక సిండికేటు (VOC/Dutch East India Company) గా ఏర్పడి ఓ దోపిడీదారు వ్యవస్థని ఏర్పరచుకుని,  ట్రీటీల ద్వారానూ, జీనొసైడ్ ల ద్వారా రక రకాల పద్ధతులను అనుసరించి,  అక్కడి ఆదివాసీల్ని సమూలంగా (Exterminate) నాశనం చేసేసి, అరకొరా మిగిలున్నవాళ్ళని 'బానిసల్ని'  చేసేసి (ఎందుకంటే వాళ్ళకి ఈ నట్ మెగ్ సాగు గురించి తెలుసును కాబట్టి) ఆ దీవుల్ని కొన్ని ఏళ్ళపాటూ పీల్చి పిప్పి చేసేసారు.    ప్రపంచంలో కెల్ల ధనిక దేశాలలోకి చేరిపోయారు. (VOCs monopoly on the spices of the East Indies made the Dutch famous across Europe for their enterprise and commercial prowess. The prodigious increase of the Netherlands, is the envy of the present and may be the wonder of future generations).

 

దానితో ఆగక, తమ జాతి తత్వాన్ని నిరూపించుకుంటూ, రంగు తక్కువున్న, అనాగరిక జాతుల వారని చెప్పి, మొదట బందా జాతి పెద్దల్ని, తరవాత, వారి వాళ్ళందరినీ విచక్షణ లేకుండా, జాలీ దయా లేకుండా తిరుగుబాటు చేసారనే  వంకతో తెగ నరికేసారు.  ప్రాణాలతో మిగిలినవాళ్ళని బానిసలుగా చేసుకున్నారు. అయితే కాలం / కర్మా చాలా పెద్ద సంగతులు. ఆ దీవుల చరిత్ర తెల్లవాళ్ళే రాసారు. తమ వీరుల్ని న్యాయంగా, దీవులలో మరణించిన జాతులవారిని అన్యాయంగా చిత్రీకరించారు.  అంత్యంత కౄరంగా జాతిహననానికి, నమ్మకద్రోహానికీ పాల్పడ్డ తమ తమ సైన్యాధికారులని తరాల పాటు ఆరాధించారు. వాళ్ళ వాళ్ళ దేశాల్లో వారికి విగ్రహాలు కట్టారు. కూడళ్ళకూ, మ్యూజియాలకీ వాళ్ళ పేర్లు పెట్టారు.  అదెలాగూ అన్ని చోట్లా ఉండేదే. గానీ, ఎబారిజన్ / ఆదివాసుల కి ఓ శక్తి ఉంటుంది. ఎంతగా నిర్మూలించేందుకు ప్రయత్నించినా, ప్రకృతి తో పోరాడి, ప్రకృతికి అణిగిమణిగి, ప్రకృతితో స్నేహం చేసి, ఎలాగో ఒకలా 'సర్వైవ్'  అవ్వడానికి వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి. మొన్న కొలంబియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బ్రతికిన చిన్న పిల్లలు భయంకరమైన అడవిలో 40 రోజుల పాటు బ్రతకగలిగారంటే, సురక్షితంగా బయటపడగలిగారంటే, వాళ్ళు ఆదివాసుల జాతికి చెందినవారు కావడమే కారణం. They naturally have this TEK Traditional Ecological Knowledge.

 ఆదిమవాసులనీ, ఆయా దీవుల ప్రజలనీ జంతువుల లాగా/ brutes and savages గా చూశారు. ఇప్పటికీ జాత్యాహంకారం వారి రక్తంలో ఇంకి అప్పుడప్పుడు విరుచుకు పడుతుంటుంది. అదే అహంకారం ఇప్పటి విచక్షణ లేని వ్యాపారాలలో, యుద్ధాలలో, mass shootings లో  తొంగిచూస్తుంటుంది.

"The elite orthodoxies, in turn, were the product not just of the subjugation of human "brutes and savages" but also of an entire range of nonhuman beings - trees, animals, and landscapes.  Indeed "subdue" was a keyword in these conquests, recurring again and again in reference not just to human beings but also to the terrain. 


భూమి కి ఎందరో బిడ్డలు. మానవులు, మానవేతర ప్రాణులు, అసంఖ్యాకమైన వృక్షాలు, ఇప్పటి మన శక్తి చోదకాలైన రకరకాల ఇంజన్లకు అవసరమైన శిలాజ ఇంధనాలు, ఇవన్నీ భూమి నుండీ పుట్టినవే, ఇప్పుడు మనిషి భూమిని విడిచి మార్స్ మీద బ్రతికేందుకు ఎగురుతున్నాడు. భూమిని కోలుకోలేనంత దెబ్బ తీసి, తన ఇల్లు తనే కాల్చుకుంటున్నాడు. ఇప్పుడు భూమి అలసిపోయింది.   మనం కొన్ని వేల ఏళ్ళుగా పాడుచేసుకుంటున్నదాన్ని బాగుచేసుకోవడానికి భూమి కూడా విశ్వప్రయత్నమే చేస్తుంది.    భూమి గురించి ఆఫ్రికన్ జానపద కథ ఒకటి ముక్తవరం పార్థసారథి గారు అనువదించగా సాక్షి ఫండే లో చదివాను. ఆ కథ గుర్తొస్తుంది. ఆవిడ అమ్మ. పిల్లలు మహా మహా దుష్టులు. ఆవిడని నానా హింసా పెడతారు. ఆవిడ మహాశక్తివంతురాలైనా తల్లిప్రేమ కాబట్టి పిల్లలు  తనను హింసిస్తుంటే ఊరుకుంటూ ఓర్చుకుంటూ వస్తుంది. ఒకరోజు మాత్రం తల్లికి ఇక ఓర్పు నశిస్తుంది. అదీ కథ.  ఆరోజు గనక వస్తే ఆ పిల్లల్ని కాపాడగలేది ఎవరు ? పురాణాల్లో చెప్పినట్టు, సృష్టి ఒకసారు పూర్తిగా అంతరించి, ఇంకో సారి తాజాగా మొదలవుతుంది. అంతేనేమో. కాకపోతే, ఎప్పుడో దూరాన కనిపించాల్సిన అంతం ఏదో, ఇంకొన్ని సంవత్సరాల దూరం లోనే కనబడేసరికీ, మనిషి ఉలిక్కిపడుతున్నాడు. 

"we are today even more dependent on botanical matter than we were three hundred years (or five hundred, or even five millennia) ago, and not just for our food.  Most contemporary humans are completely dependent on energy that comes from long-buried carbon - and what are coal, oil, and natural gas except fossilized forms of botanical matter ?"


కాలం గొప్పది కదా. మనతో పాటే చెట్లూ భూమి కడుపున పుట్టినవే.  చెట్ల వయసుని రచయిత ప్రస్తావిస్తారు. ముఖ్యంగా పురాతన అరణ్యాలలో, ఎప్పటివో చెట్లు. కొన్ని కొన్ని వందలేళ్ళు బ్రతుకుతాయి. ఆ జీవితకాలంలో తన కళ్ళ ముందు పుట్టి, గిట్టిన మనుషుల్ని, ఇతర జీవుల్నీ ఎన్నిటినో చూసుంటాయి. ఇంకా చూస్తూనే ఉంటాయి. వాటి శక్తి ముందు మనమెంత ? ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి పొరల్లో కూరుకుపోయిన చెట్లు, ఆకులు, అలములు, వాటి నీడన మరణించిన జంతువులు, అవి ఇప్పుడు శిలాజ ఇంధనాలుగా కూడా ప్రకృతిలో తమ శక్తిని నిరూపించుకుంటున్నాయి. చెట్లను నరికేసో, అనాగరికుడైన ఏ ఆదివాసినో నరికేసి, ఇష్టం వచ్చినట్టు కనబడిన జంతువుల్ని చంపేసి, ఏ బేలెన్స్ ని కోల్పోయాడో ఈ నాగరిక మానవుడు ! ధనం సంపాయించి ఉండొచ్చు. బోల్డంత అభివృద్ధి సాధించి ఉండొచ్చు. కానీ మహా ప్రళయం ముంచుకొచ్చినప్పుడు ఖరీదైన లైఫ్ బోట్ లో ఎక్కి తప్పించేసుకోగలనులే అనే ధీమాతోనే ఈ పాపాలన్నిటినీ చేసేస్తుంటాడు కదా. కానీ ఆ లైఫ్ బోట్ సైతం, అతన్ని చివరికి కాపాడలేదు.  


కరోనా లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఆఫ్రికాలో శవాల గుట్టలు లేస్తాయని నిపుణులు అంచనా వేసారు. కానీ జరిగింది దానికి విరుద్ధం. ఎంతో ప్రగతిని సాధించామని భావించిన అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో నాగరికమైన మనుషులు వేలలో చనిపోయారు. వాళ్ళలో చాలామంది ఆస్పత్రుల్లో ఒంటరిగానే చనిపోయారు. బీద దేశాలు కాస్త బాగానే తట్టుకున్నాయి. కరోనా సమయంలో కూడా ప్రభుత్వాలు వివక్షని పాటించాయి. బ్రజీల్ లాంటి దేశం, తమ ఏమజాన్ వాసుల్ని గాకికొదిలేసింది. అమెరికాలో నల్లవాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళలో చావులు విస్తృతంగానే చోటు చేసుకున్నాయి. బ్రజీల్ అధ్యక్షుడు కరోనా "మామూలు జ్వరమే" అని అసలు పట్టించుకోనేలేదు.  పైగా పేండమిక్ లో ప్రపంచం పట్టించుకోలేని పరిస్థితి లో  ఉన్నప్పుడు, సందు చూసుకుని, నిస్సిగ్గుగా, అధ్యక్షుడి కనుసన్నల్లోనే,  ఏమెజాన్ అడవుల్లో కొన్ని వేల ఎకరాల్ని, కార్పొరేట్ల కోసం నరికేసారు.  ఇది కూడా తెల్ల జాతి దురహంకారానికి ఒక ప్రతీకే. వారి దృష్టిలో "అవసరం లేని జాతులు" ఇలా జబ్బొచ్చి చనిపోతే వాళ్ళకి సంతోషమే.  ఇలాంటి తేడాల్ని ప్రజలు పసిగట్టగలిగారు.  నిజానికి మశూచి వంటి ప్రాణాంతకమైన జబ్బులంటించి ఎందరో ఆదివాసుల్ని చంపిన ఘన చరిత్ర యూరోపియనులది. ఇప్పుడూ అదే రిపీట్ అయిందని కొందరి ఉవాచ. కరోనా నుంచి కొన్ని కమ్యూనిటీలకు  రక్షణ కల్పించలేదు. నల్లజాతి వారు,  పేదలు పని చేసే బుచరీలను యుద్ధ ప్రాతిపదికన తెరిచారు. వారి హాస్పిటళ్ళలో వసతుల్లేవు. వారి శవాలను తొలగించడానికి సదుపాయాల్లేవు. ఇదంతా ఏ బీద దేశాల్లోనో జరగలేదు. ప్రపంచంలో కెల్లా ధనిక దేశమైన  అమెరికాలోనే జరిగింది. 

   

అమెరికా, కేనడా, ఆస్ట్రేలియాలలో ఇప్పుడు సాధారణమయిన కార్చిచ్చులు ఒకప్పుడు అక్కడి ఆదివాసుల్ని పురుగులకన్నా హీనంగా చంపిన పాప ఫలితమేనేమో.  ఆదివాసులతో పాటు, వారి జీవనాధారమైన అనేక జంతువుల్ని వేలాదిగా నిర్మూలించారు యూరోపియన్లు.  (Colonial Terraforming lies at the heart of the planetary crisis) వారి పొలాలని ఆక్రమించుకున్నారు. వారి వ్యవసాయ విధానాలని తప్పు పట్టారు.  అక్కడి ఎకో సిస్టం నే పూర్తిగా మార్చేసారు.    కొన్ని పేరాలు చదివితే చాలా బాధనిపిస్తు ఉంటుంది. ఇప్పటికీ మనం అదే చేస్తున్నాం. మన దేశంలో అతి వినాశనకారమైన తీవ్ర పర్యాటకం, పవర్ కోసం అడ్డదిడ్డంగా కట్టిన బరువైన డాములు హిమాలయాల్ని నాశనం చేసేసాయి. పర్యావరణం అంటే ఏ మాత్రం జాగ్రత్త లేకపోవడం రేప్పొద్దున్న నగరాలు వరదల్లో మునిగిపోవడానికీ, ప్రళయాలకీ దారితీస్తుంటే, మనం మార్స్ కి పరిగెడదాములెమ్మని చూస్తున్నాం అంటారు రచయిత. ఆదివాసులకు ప్రకృతితో, పర్యావరణంతో ఉన్న గాఢ అనుబంధాన్ని ఈ నాగరికత ముసుగులో, అభివృద్ధి ముసుగులో మనం ఎంత దుర్మార్గంగా అర్ధం చేసుకున్నామో. దానివల్ల ఇప్పటికే కోలుకోలేనివిధంగా ఎంత నష్టపోయామో చెప్తుంది ఈ పుస్తకం. 


ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పాలంటే, ఇప్పటికీ అర్ధం పర్ధం లేని యుద్ధాలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి. యుద్ధాలకు ఎంత ఖర్చవుతుందో, వాటి విపరిమాణాలేమిటో పక్కన పెడితే, వాటి వల్ల, లేదా, యుద్ధానికి సర్వసన్నద్ధత వహించేందుకు దేశాలు  పర్యావరణానికి ఎంత హాని చేస్తాయో కూడా ఉదాహరణలు చూద్దాము.  


The Department of Defence has, at times, succeeded in lowering its total consumption of fossil fuels, it has not found a way of severing the primal bond between fossil fuels and military power that come into being in the early nineteenth century; every time the Pentagon fights a war its consumption of hydrocarbons surges.  Nor it is easy to conceive of that bond being broken without the invention of a new means of powering helicopters and supersonic jets; in some years, no less than 70 percent of the Pentagon's operational energy use is for jet fuel. 


ఈ పుస్తకంలో యుద్ధాల నుంచీ పారిపోతుండే రెఫ్యూజీల గురించే కాకుండా పర్యావరణ సమస్యల వలన శరణార్ధులుగా మిగిలిన బంగ్లాదేశీయుల గురించి కూడా తెలుసుకోవచ్చు. బంగ్లాదేశ్ లో తీరం అంచున ఇప్పటికే సముద్రంలో కలిసిన గ్రామాల ప్రజలే కాకుండ, ఏటా తుఫాన్ల బారిన పడి జీవనోపాధి ని ఇచ్చే పొలాలను ఉప్పునీటికి వొదులుకోవాల్సొచ్చి, ఇళ్ళు కోల్పోయిన ఎందరో!  దానికి తోడు, ఇలాంటి పరిస్థితులలో చెలరేగే రాజకీయ అనిశ్చితి వల్ల కూడా దేశాలు పట్టుకుని వలస పోతుండే పర్యావరణ శరణార్ధులు చాలా మందే ఉన్నారు. 


అలాగే   మనం మన కథల్ని ఎలా చెప్పుకుంటామో, రామాయణం, ఒడిస్సీ ల లాగా ఇతిహాసాలు రాసుకుంటూ, మన ప్రయాణాన్ని ఎలా నోట్ చేసుకుంటామో, మానవేతర ప్రాణులు కూడా అలాగే చేసుకుంటాయి. ఈ భూమి మీద మనతో పాటూ వాటికీ స్థానం ఉంది. అసలు వాటితో కలిసి ఉంటేనే మనకి బాలెన్స్, బ్రతుకు. అది ఇప్పుడు ప్రమాదంలో పడింది కదూ.   ఈ బ్రతుకు పోరాటంలో కార్పొరేట్ల అక్రమ మైనింగ్, అక్రమ అడవుల నిర్మూలన, అసలే జనాభా వల్ల తగ్గిపోతున్న జంతుజాలపు పర్యావరణాన్ని దెబ్బతీసేస్తూ ఉన్న కారణం వలన అనేక జీవుల అనేక జాతులు అంతరించిపోయాయి, ఇంకా ప్రతి రోజూ అంతరించిపోతూనే ఉన్నాయి. అవేమైనా మరీ అంత పనికిమాలిన ప్రాణులా ? ఆకులూ, చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని జగదీష్ చంద్ర బోస్ చెప్తే, అతన్ని ఈ వ్యాపార వాద పాశ్చాత్యులు పక్కకు లాగేసారు. కానీ ఇప్పటికీ చెట్లు మాటాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  అడవిలో గొడ్డలి వేటు పడుతున్న చెట్టు, తన చుట్టూ ఉన్న చెట్లని హెచ్చరిస్తుంది.  అలాంటి వాటిని అడ్డదిడ్డంగా నరికేస్తున్నాం కదా - జంతువులు చనిపోతున్నాయి కదా.. పక్షులు మాయమవుతున్నాయి.. ఇవన్నీ అంత పనికిమాలిన ప్రాణులా ? వాటికి ఏ విలువా లేదా ? 

It is well established now that many animals have long memories and are able to communicate in complex ways.  Some of these animals like elephants, whales, and migratory birds, also move over immense distances and appear to have attachments to particular places.  These movements cannot be described as purely mechanical, instinctive, or lacking in meaningful sequences.  Humpback whales, for instance, mark the passage of time by changing their songs, from year to year.  This would hardly be possible if they have lived "entirely in the Here and Now".


257 పేజీల (మొత్తం 339) ఈ పుస్తకంలో విస్తారంగా చర్చించిన విషయాలు

కరోనా, గ్రెటా థంబర్గ్, పర్యావరణ వలసలు, అమెరికాలో  ఆదివాసుల హత్యాకాండ ఏయే పద్ధతులని, సిద్ధాంతాలనీ అనుసరించి జరిగింది, ఏఏ మూఢ నమ్మకాలు యూరోపియనులకు ఉండేవి - ఆ భయంకరమైన విధానాల వల్ల, ఉదాహరణకు విచక్షణారహితంగా వేలాది యెకరాల అడవుల్ని నరికి ఎస్టేట్లు, పంట పొలాలుగా మార్చడం, యూరోపియన్ల విలాసాలకు భూమి నీ, ఆ చుట్టుపక్కల వన్యప్రాణుల్నీ లక్షలాదిగా మట్టుపెట్టడం, నేటివ్ లని అన్నివిధాలుగా చుట్టుముట్టి, వ్యాధుల తోనూ, బీదరికంతోనూ, వారి భాషనీ, సంస్కృతినీ లాగేసుకోవడం ద్వారానూ - వారి పిల్లని బలవంతంగా స్కూళ్ళలో చేర్చి విద్య (ఆధునిక విద్య) నేర్పించడం ద్వారా వారి వారి సహజ ఆదిమ విజ్ఞానాన్ని నాశనం చెయ్యడం, వాటి విపరిమాణాల్ని ఇపుడు గ్లోబల్ వార్మింగ్ పేరుతో ఎదుర్కోవాల్సి రావడం, డకోటా పైప్లైన్ గురించిన పోరాటం, కోర్టులలో కూడా పెరుగుతున్న ఎవేర్ నెస్!   ఇప్పటికీ బ్రతికుండి ఆస్ట్రేలియా, ఈస్ట్ ఇండీస్,  న్యూజీలాండ్, అమెరికా, బ్రజీల్ లలో తమ గొంతును వినిపిస్తున్న నేటివ్ లు, బందా హననాలు (యూట్యూబర్లు బందా ను చూపించినప్పుడు, ఆ ప్రాంతం సౌందర్యం చూస్తే - వళ్ళు గగుర్పొడుస్తుంది). యూరోపియన్ ల రక్తంలో సాంస్కృతికంగా  పాతుకుపోయిన దురహంకార భావనల వల్ల ఇప్పటికీ కొనసాగుతున్న యుద్ధాలు, క్రిస్ట్ చర్చ్ తరహా ఫాసిస్ట్ దాడులు  - ఇలా ఒకటి కాదు.  నాకైతే, ఈ పుస్తకం చదవడం, worth my time అనిపించింది. ఇప్పుడు జియో పోలిటిక్స్ ఎలా ఉన్నాయంటే డబ్బుని మించిందేమీ లేదు. కేవలం స్వార్ధం తోనే  alternative / sustainable energy మీద దేశాలు ఖర్చు చెయ్యవు. కేవలం డబ్బుతో ప్రపంచాన్ని శాసించేయాలని, అందరికీ మేలు చేసే విధానాలని ధనిక దేశాలూ పాటించవు, మేమెందుకు వెనకబడాలి అని బీద దేశాలు కూడా పాటించవు. ఇదో అంతు లేని సమస్య.  గ్లోబల్ వార్మింగ్ ఒక బ్లఫ్ అనుకోకుండా,  ప్రపంచం అంటే,   బ్రతుకంటే ప్రేమ ఉన్నవాళ్ళు, గత చరిత్ర లో మన పూర్వీకుల తప్పులు ఇంకా ఎన్ని విపరీతాలకు కారణం అవుతున్నాయో తెలుసుకునేందుకు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. 


Some points to ponder or appreciate :  


The mountain islands of Malaku often erupt with devastating force,  bringing ruin and destruction upon the people who live in their vicinity.  Yet there is also something magical about these eruptions, something akin to the pain of childbirth. For the eruptions of Malaku's volcanoes bring to the surface alchemical mixtures of materials that interact with the winds and weather of the region in such a way as to create forests that teem with wonders and rarities.  In the case of the Banda Islands, the gift of Gunung Api is a botanical species that has flourished on this tiny archipelago like nowhere else; the tree that produces both nutmeg and mace.

---------------------

On the Malakun island of Kai, not far from Bandas, there are a few villages that are, to this day, populated mainly by descendants of the survivors of the genocide of 1621.  The names of these villages evoke the lost homeland, and their inhabitants still speak turwandan, the Banda Language, their songs and stories still bring to life not just the "Banda Mountain" but also its blessing (or curse), the nutmeg.

--------------------

In this (Wars of extermination) lies a fundamental difference between settler-colonial conflicts and the colonial wars fought by Europeans in Asia and Africa.  The wars waged by the British in India, for example conformed to the usual patterns of Eurasian warfare: soldiers fought each other with human-made weapons, and the wars were usually limited in duration.

-----------------


The list of climate-related security threats is very long, partly because it includes many issues that would not, until recently, have been considered military matters at all.  Dealing with migrants and refugees, for instance, was once squarely within the sphere of civilian governance.  Today, whether in the waters around Australia or in the Mediterranean, or, along the US's southern border, or on India's border with Bangladesh, migration is largely in military and paramilitary hands.

------------------

The waning of anti-mechanistic, vitalist ideas as a potent force in Indian politics is due in large part to the caste system, which ensures that the people whose lives are most closely tied to the land's soils and rivers, forests and coasts, are relegated to the farthest margins of the power structure.  This outcome is the product of the very logic of caste, in which those who deal with certain organic substances that are regarded by upper castes as impure --manure, meat, leather, bodily wastes, and so on --- are consigned to the lower ranks of the hierarchy. 

-------------------------

Legal protections for Adivasis were never strong in India, since colonial times. officially designated forest lands --which cover no less than a fifth of the country's surface area -- have formed an internal "state of exception" where the normal functioning of the laws of the land is suspended.  This realm is controlled by the Forest Department (an immense bureaucracy with vast powers) and an army of forest guards that function like a paramilitary force.  The material basis of Adivasi life is being steadily undermined by restricting access to traditional foraging grounds and the banning of certain kinds of hunting and gathering. 

-------------------------

Even more insistently vitalist is the Native American movement of resistance which have long been based on an ethic that foregrounds the familial instinct to protect "all our relatives" -- that is to say, the entire spectrum of nonhuman kin, including rivers, mountains, animals and the spirits of the land. This approach is essentially spiritual or religious, yet it has been surprisingly effective. 

---------------------------

To everyone who is paying attention, especially young people, it is now perfectly clear that extractivist capitalism is on its last legs, its end foreordained by the withering of the very horizon on which its existence is predicted - the future.  When the future becomes radically uncertain, nothing works - insurance, share prices, credit, dividends, every money (which is, after all, a promissory note that someone must redeem). 

------------------------

Of enormous significance is the fact that the Catholic Church, under the influence of a pontiff who has taken his papal name from the most shamanic of Christian Saints, has significantly revised its doctrines in relation to the Earth.  Pope Francis speaks directly to more than a billion people and has already done more, perhaps, to awaken the world to the planetary crisis than any other person on Earth. 

----------------------------------------

Everyone must optimistically and continually do their part to promote the needed spiritual, ecological, and political changes.....  

The difference is that a vitalist mass movement, because it depends not on billionaires or technology, but on the proven resources of the human spirit, may actually be magical enough to change hearts and minds across the world.

-------------------------------------------

Much, if not most, of humanity today lives as colonialists once did - viewing the Earth as though it were an inert entity that exists primarily to be exploited and profited from, with the aid of technology and science.  Yet even the sciences are now struggling to keep pace with the hidden forces that are manifesting themselves in climatic events of unprecedented and uncanny violence.  


And as these events intensify they add ever greater resonance to voices that have stubbornly continued to insist, in the face of unrelenting, apocalyptic violence, that nonhumans can, do, and must speak.  It is essential now, as the prospect of planetary catastrophe comes ever closer, that those nonhuman voices be restored to our stories. 

---------------------------


నేనసలు ఈ పుస్తకం గురించి చెప్పాలనుకున్నదాన్లో పదిశాతం కూడా చెప్పలేకపోయాను. TEXT పెద్దదయిపోయి, చదివేవారికి విసుగొస్తుందని. దీనిని ఇంకెవరైనా సులువుగా రివ్యూ చెయ్యగలిగితే, ఇది ఎక్కువమందికి చేరితే చాలా ఆనందిస్తాను.

--------------------------

After reading how Navajo people in South America are systematically exterminated, by eliminating their hub of livelihood, by exposing them to disease and killing their livestock etc, recently, after the new movie "Oppenheimer",   I came across this Video:    ఇది ఎలా కంటిన్యూ అయిందో చూడండి. They were exposed to danger, without even caring for their life and future. 

 ---------------------------

ఇంకోటి.. Just nutmeg గురించి. 

******