Pages

25/09/2018

The playing fields of Shimla from "No Man is an island" by Ruskin Bond







దీర్ఘమైన చలికాలం ఒంటరిగా గడిచింది. ముఖ్యంగా నాలాంటి పన్నెండేళ్ళ అబ్బాయికి.  మా నాన్నగారి హఠాన్మరణం నాలో రగిలించిన దుఃఖ జ్వాల ఆరనే లేదు. అప్పటికీ ఆయన మరణించి రెండేళ్ళవుతూంది.  మా అమ్మ అంతకు   మునుపే ఆయన నుండి విడిపోయి పాత కార్ల వ్యాపారం చేసే ఓ పంజాబీ పెద్దమనిషిని వివాహం చేసుకోవడం కూడా పెద్ద దెబ్బ నాకు.  మూడు నెలల నిరాసక్త శీతాకాలం ముగిసాక షింలా లోని మా బోర్డింగ్ స్కూల్ కు తిరిగి వెళిపోవడానికి ఎంతగానో ఎదురుచూసాననే చెప్పాలి.

కిప్లింగ్ మనసు గెలుచుకున్న ఆ శాంత గంభీర హిమాలయ శ్రేణుల్లోని  బ్రిటిష్ రాజ్ కు రాజధాని లాంటి 'షింలా' ఆనతి కాలం లోనే ఒక మామూలు ప్రాంతం గా మారబోతున్నదని నేనెప్పుడూ ఊహించనైనా లేదు. అలా అని స్కూల్ లో నాకు పెద్దగా స్నేహితులున్నారని కాదు. నేనెప్పుడూ ఒంటరి వాడినే. సిగ్గు, గుంభనాలతో మా నాన్న గారి అరుదయిన రాకపోకల కోసం మాత్రమే ప్రాణం కొట్టుకుపోతుండే చిన్ని ప్రాణాన్ని.   నాన్నగారు  రాయల్ ఏర్ ఫోర్స్ (RAF) లో పనిచేయడం వల్ల ఆయన కార్యస్థలి దిల్లీ, కరాచీ లాంటి ఎయిర్ ఫోర్స్ బేస్ ల లో మాత్రమే ఉండేది.

ఆయన నాకోసం వచ్చినపుడు మేము గడిపే అత్భుత క్షణాల కోసమే అచ్చంగా బ్రతికే వాణ్ణి. ఇప్పుడు ఆ క్షణాలు తిరిగి ఎన్నటికీ రావు.  ఇలాంటి పరిస్థితుల్లో నా ఒంటరి బ్రతుక్కి ఓ స్నేహితుడు ఉండి ఉంటే బావుండేదనిపించేది.  కానీ మా స్కూల్లో తుంటరి రౌడీ పిల్లల మధ్య  నా బోటి మృదు స్వభావిని వెతుక్కోవడం పరమ కష్టం.  డెస్క్ ల మీద చాకులతో పేర్లూ బొమ్మలు చెక్కడం, టీచర్ గారి కుర్చీ మీద నమిలిన చూయింగ్ గంలు అంటించడం లాంటి అరాచక కుర్ర చేష్టలు నాకస్సలు నచ్చవు.

మిగిలిన వాళ్ళలాంటి మామూలు జీవితం నాకూ ఉండి ఉంటే నేనూ వాళ్ళలా తయారయి ఉండేవాడినేమో.   కుర్ర పనులు చేస్తూ, కొంటె వేషాలూ వేసే వాడినేమో.  కానీ మా అమ్మా నాన్నల విడాకుల అనంతరం, నాన్న ఒంటరి తనాన్ని పంచుకోవలసి రావడం, అమ్మ కు దూరం కావడం, నన్ను తొందరగా ఎదిగేట్టు చేసాయి.  పైగా నేను చదివే సాహిత్యం లేదా పుస్తకాలు  అంటే డికెన్స్, రిచ్మల్ క్రాంప్టన్ , టాగోర్ ఇంకా  'చాంపియన్', 'ఫిల్మ్ కామిక్స్',  అప్పటి నా తికమక మనస్స్థితి కి అద్దం పట్టేవి.  ఎలక్ట్రానిక్ వస్తు వినిమయం తక్కువగా ఉంటూండే ఆ కాలంలో కూడా చదువరులు అరుదుగా ఉండేవారు.  వర్షా కాలంలో పిల్లలు పేక ఆడటమో, కామన్ రూం లోని పాత గ్రామోఫోను లో 'ఆర్టీ షో' వినడమో చేసే వారు.

మొత్తానికి నాలుగో ఫారం మొదలయ్యి నెల గడిచాక ఒక కొత్త అబ్బాయి 'ఒమర్' నా దృష్టిని ఆకర్షించాడు. దానికి ఏకైక కారణం, అతని స్వభావం.  ఒమర్ చాల నెమ్మది.   నిశ్శబ్దంగా, తన చుట్టూ చెలరేగిపోతూండే పిల్లకాయల సర్కస్ ని చిరునవ్వుతో పెద్దగా పట్టించుకోకుండా,  దాటవేసేవాడు. అలా అని అతనికి ఆ అల్లరి అసమ్మతం కూడా కాదు.  తన పనిని తాను చూసుకునే ఈ కుర్రాడిని గమనించడం  నాకు  అలవాటయింది.  ఒక పర్యాయం  అలాంటి గమనింపులోనే,  అతని కళ్ళు, నేనతని వంక చూడటాన్ని పసిగట్టి, స్నేహపూర్వకంగా, ఆర్ద్రంగా నవ్వటంతో మా స్నేహ పర్వం మొదలయింది.  మేము వెంట వెంటనే మాటాడేసుకోలేదు.  మా మధ్య పరిచయం, మాటల కన్నా ముందుగానే మొదలయింది.  కారిడార్లలో, క్లాసు రూము లో, డైనింగ్ హాల్ లో, ఆట మైదానాల్లో ఒకరి కొకరు ఎదురుపడినపుడు మర్యాదగా తలాడించుకునేవాళ్ళం.   ఆ పలకరింపు నాలోని మొహమాటాన్ని చాలా వరకూ బద్దలుకొట్టింది.

మా స్కూల్లో కనబడని ఓ వివక్ష ఉంటూండేది. ముఖ్యంగా వేరే వేరె హౌస్ వాళ్ళం ఒకరి జోలికి ఒకరం పొయ్యేవాళ్ళమే కాదు. ఉదాహరణ కు కర్జన్ హౌస్ కుర్రాడు రిమస్ లేదా లెఫ్రాయ్ హౌస్ వాళ్ళతో స్నేహం చేసేవాడు కాదు. కానీ స్కూలు హాకీ టీం లో మేమిద్దరం - అనగా నేను గోల్ కీపర్ గా, ఒమర్ ఫుల్ బాక్ గా చేరీ చేరడంతోనే ఈ కనబడని గోడల్ని అధిగమించాము.

గోల్ కీపింగ్ నాకు చాలా ఇష్టమైన, ముఖ్యంగా చాతనయిన కళ.  హాకీ, ఫుట్బాల్ రెండు క్రీడల్లోనూ నేను గోల్ కీపర్ గా ఉన్నాను. ఆట ని, నా జట్టునీ 'రక్షించడం'  నాకెంతో అత్భుతంగా అనిపించేది.  యాభ్యయేళ్ళ అనంతరం ఇప్పటికీ గోల్ కీపింగ్ చేస్తూనే వున్నానని చెప్పాలి.  అప్పుడు ఆట స్థలాల్లో, ఇప్పుడు నిజజీవితంలో నా కుటుంబాన్నీ, నా వ్యక్తిగత, రచనా స్వేచ్చనూ 'రక్షించడం' కోసం గోల్ కీపింగ్ చేస్తూనే వున్నాను.

అలా..  మా ఆట మమ్మల్ని దగ్గర చేసింది.  ఎప్పుడూ మౌనంగానే ఉంటూండే ఒమర్ మెల్ల మెల్లగా నాతో మాట్లాడుతూన్నాడు.  ఆటల్లోనూ, స్కూల్ లోనూ మేమిద్దరం ఈ మధ్య కలిసే ఉంటున్నాము.  మా ఇద్దరి మధ్యా మంచి సయోధ్య కుదిరింది.  నా ఆలోచనా ధోరణి, నేను వేయబోయే ఎత్తుల్నీ అతను పసిగట్టగలుగుతున్నాడు. అతని కదలికల్నీ, అతని లక్ష్యాల్నీ నేనూ అర్ధం  చేసుకోగలుగుతున్నాను.. ఇదంతా హాకీ,  మాలో ఆ సమన్వయం కుదిరేందుకు సహాయపడడం వల్లనే.    అందుకేనేమో, కొన్నేళ్ళ తరవాత కోనార్డ్ రాసిన  "ద సీక్రెట్ షేరర్" చదివాక, ఒమర్ నే తలచుకున్నాను నేను.

మా క్లాసు రూం, బందిఖానా లాంటి మా బోర్డింగ్ స్కూల్ గోడల్ని దాటే అవకాశం వచ్చాకా మా స్నేహం ఇంకా పరిమళించి, చిక్కబడింది.    మా హాకీ జట్టు, షింలా కు దగ్గర్లోని పర్వత సానువుల్లోని సనావర్ లో మా చిరకాల ప్రత్యర్ధి ' లారెన్స్ రాయల్ మిలటరీ స్కూల్'  తో తలపడటం కోసం బయలుదేరడం,  ఒక పెద్ద మలుపు.

సనావర్ లోని ఈ స్కూల్ లోనే మా నాన్న గారు చదువుకున్నారు. సనావర్ చేరాకా నాకు తెలిసిందేమిటంటే, ఈ స్కూలు మా నాన్నగారి టైంలో మిలిటరీ అనాధలకు ఆశ్రమం గా కూడా ఉండేదని.  మా నాన్నగారు కూడా అనాధే.  మా తాత గారు పదిహేడేళ్ళ వయసులోనే ఇల్లు విడిచిపెట్టి,  స్కాటిష్ రైఫిల్స్ లో పదాతి దళం లో పద సైనికుడిగా చేరారు.  ఆయన కిప్లింగ్ తాలూకు "ములవానీ, ఓథరీస్,  లీరాయిడ్"  లాంటి వారు.  అయితే ఆయన, పిల్లలు ఇంకా పసివాళ్ళు గానే ఉండగా మరణించడంతో మా నాన్నగారు ఈ స్కూల్ లో చేరడం వల్ల, ఇక్కడ అబ్బిన సంపూర్ణ విద్య, ఆయనకు,  సైన్యంలో ఒక ఆఫీసర్ గా అయ్యే భాగ్యం కలిగించింది.

సనావర్ లో నేనూ ఒమర్, భలే సరదాగా గడిపాము.  మామూలుగా అయితే అతి క్రమశిక్షణ తో  దుర్బరంగా గడపాల్సి వచ్చే ఆ మిలటరీ స్కూల్ లో అతిధులు గా భోగభాగ్యాలనందుకుంటూ, స్వేచ్చగా భ్రమరాలమైపోయాము.  ఇక్కడే దొరికిన తీరిక వల్ల, మనసు ఉల్లాసంగా ఉండటం వల్లనూ, బోల్డన్ని విషయాలు మాట్లాడుకున్నాము.  ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. నాలాగే ఒమర్ కూడా అనాధ. అతని తండ్రిని అరాచకత్వం రాజ్యమేలుతూండే పెషావర్ లో అల్లరిమూకలు కాల్చి చంపాయి.  డబ్బు పుష్కలంగా ఉన్న బాబాయి అతన్ని షింలా బోర్డింగ్ స్కూల్లో చేర్చి చదివిస్తున్నారు. అచ్చు నా చదువు ఖర్చు రాయల్ ఏర్ ఫోర్స్ భరిస్తున్నట్టు.  అందుకేనేమో ఒమర్ ఎక్కువ భాగం మౌనంగా గడుపుతాడు.

సనావర్ లో లారెన్స్ స్కూల్ చాపెల్ లో విహరించినప్పుడు స్కూల్ "రోల్ ఆఫ్ ఆనర్ బోర్డ్" లో రెండు ప్రపంచ యుద్ధాలలోనూ చనిపోయిన పూర్వ విద్యార్ధుల  లిస్ట్ లో మా నాన్న గారి పేరు "A A Bond" చదివి వొళ్ళు గగుర్పొడిచింది. 

ఆయన పూర్తిపేరు ఏమిటి ? అని అడిగాడు ఒమర్.
"అబ్రీ అలక్సాండర్ " చెప్పాన్నేను.
"చాలా అసాధారణమైన పేరు!" అన్నాడు ఒమర్
"నీకు రస్కిన్ అనే పేరెందుకు పెట్టారు ?"
"బహుశా మా నాన్నగారికి జాన్ రస్కిన్ రచనలు ఇష్టం కావడం వల్ల కాబోలు. జాన్ రస్కిన్, కళ, ఆర్కిటెక్చర్ లాంటి గంబీరమైన విషయాల మీద రాసేవాడు. ఇప్పుడు ఆయనకు పాఠకులెవరూ లేనట్టున్నారు.  అయితే నా రచనలకు పాఠకులు ఉంటారులే" అన్నాను నేను.  

అపుడప్పుడే నేనూ రాయడం మొదలు పెట్టాను. నా మొదటి నవల "తొమ్మిది నెలలు " స్కూల్ లో విద్యాసంవత్సరానికి సంబంధించినది. "గర్భావస్థ" గురించి కాదు.  మా స్కూలు లో మేష్టార్ల గురించీ, వార్డెన్, పోకిరీ పిల్లల గురించీ రాసాను. హాస్యం పండించే ప్రయత్నమూ జరిగింది. ఒమర్ నా 'తొమ్మిది నెలలు' చదివి, బానే ఉందన్నాడు.  "అయినా ఇది బయటపడితే చిక్కేమో ఆలోచించు ! ముఖ్యంగా ఓలివర్ గారు చదివితేనో ?! అని భయం వ్యక్తం చేసాడు.  ఓలివర్ గారిగురించి హాస్య కవితలు కూడా ఉన్నాయందులో. (ఓలివర్ గారు మా స్కూలులో మర్యాదస్తుడైన టీచర్).

అయితే అదేమీ గొప్పరచన కాదు. నేను సహజ రచయితను కాను. ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను సహజమైన క్రీడా కారుడిని. సనావర్ లో నేను చూపించిన మిరుమిట్లు గొలిపే ప్రదర్శన తరవాత అంతవరకూ నన్నో  సాదాసీదా కుర్రాడిగా పరిగణించిన మా స్కూల్ లో నా హోదా పెరిగింది.  అప్పటి దాకా అడపాదడపా మమ్మలిని ఇబ్బంది పెట్టిన రౌడీ పిల్లలు కూడా మాకు కాస్తో కూస్తో గౌరవం ఇవ్వడం మోదలయింది.  ఈ హీరోయిసం అంతా నా 'తొమ్మిది నెలలు'  మా హౌస్ మాస్టర్ చేతిలో పడేదాకా మాత్రమే సాగింది.  ఆరోజుల్లో పిల్లలని శ్రేష్ఠమైన మలక్కా కేన్ బెత్తంతో శిక్షించడం సాధారణ విషయం కాబట్టి, నా మొదటి రచన చిత్తు ప్రతి ముక్కలయ్యి చెత్త బుట్టలో దఖలయినా, నా పిరుదుల మీద ఊదారంగు లో తేలిన పేము బెత్తపు దెబ్బలు నా రచనా ప్రతిభను లోకానికి చాటాయి.  ఆసక్తి కనపరిచిన వాడికల్లా నా పిర్రల పై రంగు తేలిన దెబ్బలను గర్వంగా ప్రదర్శించి, నా గొప్పదనాన్ని చాటుకున్నాను.

ఒకరోజు ఒమర్ అడిగాడు నన్ను  - "ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే, నువ్వు కూడా వెళ్ళిపోతావా ?"  నేను  "తెలీదు. మా మారుటి తండ్రి భారతీయుడే కాబట్టి ఇక్కడే వుంటాను" అన్నాను.
"అందరూ చెప్పుకుంటున్నారు. మన నాయకులూ, బ్రిటిష్ వాళ్ళూ మన దేశాన్ని విడగొట్టేస్తారంట. అప్పుడు షింలా భారత దేశంలోనూ, పెషావర్ పాకిస్తాన్ లోనూ ఉంటాయంట" అన్నాడు ఒమర్.
"ఓహ్. అది జరిగే పని కాదులే. ఇంత పెద్ద దేశాన్ని ఎలా చీల్చుతారు..? అన్నాన్నేను తేలిగ్గా.

కానీ మేమిలా మాట్లాడుకుంటూండగానే, నెహ్రూ, జిన్నా, మౌంట్ బాటన్లు దేశానికి చెయబోయే శస్త్రచికిత్స కోసం ఆయుధాల్ని సమకూర్చుకుంటున్నారు.  వాళ్ళ నిర్ణయం మా బ్రతుకులను అల్లకల్లోలం చేయకముందు, మా స్కూలు భవనానికి చెందిన ఒక పాత డ్రైనేజీ సొరంగం రూపంలో మాకు కాస్త ఆటవిడుపు లబించింది.  అది ఇప్పుడు వాడకంలో లేని, దాదాపు పూడుకుపోయిన డ్రెయిన్ టన్నెల్.  సరదాకి లోపలికి దూరి, పాకుకుంటూ ఇరవయ్యడుగులు వెళ్ళాకా, తిరిగి రాలేక, సొరంగం చివర కనిపించే చిన్న వెలుతురును వెతుక్కుంటూ ముందుకు పోయినప్పుడు ఆ రెండో చివరన మా స్కూల్ అవతలిపక్కనున్న కళ్ళు జిగేలుమనిపించే కొండ వాలు లో తేలాం.

ఆ పచ్చని ప్రకృతి లో మనసు నిండే దాకా ఆడుకున్నాము. సాల్, దేవదారు వృక్షాల మధ్య కేరింతలు కొట్టాం. ఏమీ ఎరగనట్టు మళ్ళీ స్కూలు కు ఆ రహస్య మార్గం గుండానే చేరుకున్నాం.  వొట్టి చాదస్తపు క్రమశిక్ష(ణ)  పూరితమైన మా బందిఖానాలాంటి బాల్యంలో మాకు దొరికిన ఆ చిన్ని స్వేచ్చ ఎంత అమూల్యమైనదో చెప్పలేం.

దేశం అనిశ్చిత లో, ఆవేదనతో, అపనమ్మకంతో కొట్టు మిట్టాడుతున్న ఆ కాలంలో ఆ సొరంగం మాకో కొత్త లోకాన్ని చూపించింది. చెప్పలేనన్ని అమూల్య క్షణాలనూ, భద్రతనూ ఇచ్చింది.  షింలా చుట్టు పక్కల అడవులూ, మైదానాలూ, సెలయేళ్ళూ మా కిలకిలా రావాలతో, మా కబుర్లలో మునిగితేలాయి.  పెద్దలు నిర్ణయించిన సరిహద్దులు దాటి ఎటువంటి పత్రాలు, పాస్పోర్టులూ లేకుండా మరో ప్రపంచానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయాణం కట్టేవాళ్ళం. కొత్త సరిహద్దులూ, కొత్త అనుమతి పత్రాలూ మమ్మల్ని వేరు చేయనున్నాయని తెలీని అమాయకత్వం మాది.

కొన్ని నెలల తరవాత మాస్కూలు "రైసింగ్ డే" సందర్భంగా ముఖ్య అతిధి గా లార్డ్ మౌంట్ బాటన్ విచ్చేసారు. మా బిషప్ కాటన్, ఈ వైపుల్లో 'ఈటన్' కాలేజీ లాంటి ఘనత వహించిన స్కూలు.  మరి గౌరవాధ్యక్షులు గా వైస్రాయ్ కాక ఎవరొస్తారు ?  ఈ ఘనమైన స్కూలు ఎందరో సివిల్ సర్వెంట్లనీ, రాజకీయ దురంధరుల్నీ, జెనరళ్ళనూ అందించింది.  గొప్పలు పోయేందుకు బోలెడందరు పూర్వ విద్యార్ధులున్నారు.  జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పరువు పోయిన దుష్ట జెనరల్ డయ్యర్ లాంటి పూర్వ విద్యార్ధి గురించి మాత్రం ఒక్క ముక్క ఎత్తకుండా జాగ్రత్త పడతారు మా స్కూలు వాళ్ళు. లార్డ్ మౌంట్ బాటన్ చేతుల మీదుగా కొన్ని విభాగాల్లో ఏదో ఒక బహుమతిని నేను అందుకున్నానారోజు.

ఆ రోజు కొత్త భారతదేశం గురించి, మా చుట్టూ జరగబోతున్న, జరుగుతున్న వివిధ చారిత్రక సంఘటనల వైశిష్ట్యం  గురించి మౌంట్ బాటన్ దీర్ఘ ప్రసంగం చేసారు. త్వరలోనే భారత్ బ్రిటన్ కు సమానమైన శక్తిగా ఎదగబోతోందనీ.. వగైరా.

కొద్ది రోజుల అనంతరం పంజాబు, బెంగాలు ప్రావిన్సులను విడదీసారు. కోట్లాది ప్రజలు సరిహద్దులకిరువైపులకూ, ఉన్న పళంగా, కట్టు బట్టలతో అనాధలయి వలస ప్రయాణం కట్టారు. కోట్లాది ప్రజలు అన్యాయాలకూ, అత్యాచారాలకూ, దోపిడీకీ, మానభంగాలకూ, హత్యలకూ గురయ్యారు. కోటీశ్వరులు రాత్రికి రాత్రే బికారులయ్యారు. జమీందార్లు ఇళ్ళు లేక రోడ్డున పడ్డారు. ప్రయాణ భారంతో, మత కల్లోలాలతో సతమతమయ్యారు.  చెప్పలేనన్ని ఘోరాలు జరిగాయి. దేశం అతలాకుతలమైంది.  షింలా లాంటి శాంతియుతమైన ప్రాంతం కూడా మతకల్లోలాలను,  ఊచకోతల్నీ చూసింది.

కామన్ రూం లో ఈ పరిణామాల్ని రేడియో లో వినడమూ, అప్పుడప్పుడూ వచ్చే వార్తా పత్రికల్లో విషయాలు చదవడం, మమ్మల్ని భయపెట్టేవి.    కానీ ఇన్ని కల్లోలాల మధ్య ఒమర్, నేనూ, బురదంటని కమలల్లాగా ఆందందం గానే గడిపేవాళ్ళం.  సొరంగం లోంచీ కొండల్లోకి వాలిపోయి పైన్ చెట్లలో పాడే బుల్ బుల్ ల రాగాలు వినేవాళ్ళం.  గాలికకి  ఊగే పొడవైన గడ్డి మేటులు, విరగపూచే గడ్డిపూల తివాచీలలో పడి దొర్లే వాళ్ళం.  అక్కడి నిశ్శబ్దాల్లో వడ్రంగి పిట్ట ఎక్కడో ఏ చెట్టుకో ముక్కుని తాటిస్తూ తొలిచే శబ్దాల్నీ, ఏ హిమాలయ పక్షో చేసే విచిత్రమైన కూతల్నీ వినేవాళ్ళం.

ఒక సారి అలాంటి వేళల్లోనే "అన్ని యుద్ధాలూ ముగిసాక కూడా ఈ సీతాకోక చిలుకలు అందంగానే ఉంటాయి " అన్నాన్నేను.
"బావుంది. ఎక్కడన్నా చదివావా ఇది ?" అడిగాడు ఒమర్.
"లేదు. నాకే అనిపించింది"
"నువ్వు రచయితవయిపోయావు అయితే ! "
"లేదు లేదు... నేను హాకీ ఆడాలనుకుంటున్నాను. ఇండియాకి. ఇంకా.. ఫుట్ బాల్, ఆర్సినల్ కి. కేవలం గెలిచే జట్లలోనే!" నిశ్చయంగా చెప్పాన్నేను.
"ఎప్పుడూ గెలుస్తూనే ఉండడం కుదరదు. రచయితవే అయిపో !"  అన్నాడు ఒమర్.  తథాస్తు.

వర్షాకాలం వచ్చాక, మా సొరంగం మూసుకుపోయింది. కంకర, ఇసక, పూడిక మరింత పెరిగి మా సాహస యాత్రలకు ఆటంకం కలిగింది. ఆ రోజుల్లో లారెన్స్ ఓలివియర్ సినిమా "హాంలెట్" సినిమాని చూపించడానికి మమ్మల్ని ఊర్లోకి తీసుకొచ్చారు. మా అప్రశాంత మానసిక స్థితి లో ఆ చిత్తడి మద్యాహ్నం పూట చూసిన సినిమా, మాకు ఏ మాత్రం ఓదార్పునీయలేదు.  పైగా  బెంగను రగిలించింది.  ఆ సంవత్సరానికి అదే మా ఆఖరు సినిమా.  ఎందుకంటే అప్పుడే షింలా 'లోయర్ బజార్ ' లో మతకల్లోలాలు చెలరేగాయి.

కిప్లింగ్ చెప్పినట్టు, షింలా లో అన్ని దారులూ తెలిసినవాడు, పోలీసులను సులువుగా బురిడీ కొట్టించగలడు.   అలాంటి షింలా లో, "భారత దేశపు వేసవి విడిది" లో, కొన్నాళ్ళ పాటూ స్కూలు గోడల మధ్యే బందీలమైపోయాము. బయటికి తప్పుకునేందుకు సొరంగమూ లేదాయె.  బజారుకు వెళ్ళే ప్రశ్నే లేదు. నీరు నిలిచిన ఆట స్థలాలలో ఎవరూ ఆడుకోవట్లేదు. ఒమర్ నేనూ, చెమ్మ పట్టిన చెక్క బెంచీల మీద కూర్చుని భవిష్యత్తు గురించి పెద్ద ధీమా లేని మా ఆశలన్నిట్నీ చెప్పుకునేవాళ్ళం.  కానీ మా సమస్యలను పరిష్కరించుకోలేకపోయేవాళ్ళం.  సమస్యల సంగతి, నెహ్రూ, జిన్నా, మౌంట్ బాటన్లు కదా చూసుకునేది.


గొడవలు సద్దుమణిగాక, ఇక ఒమర్,  పాకిస్తాన్ వెళ్ళే సమయం వచ్చింది. కాస్త పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి స్కూల్ లో చదివే పాకిస్తాన్ ప్రాంతపు పిల్లలను సైన్యం రక్షణలో కాన్వాయి లో సరిహద్దులను దాటించేందుకు ట్రక్ లు వచ్చాయి.  అలా ఒమర్ పాకిస్తాన్ కు బయలుదేరిన రోజు చెప్పలేనంత బాధతో గొంతు పూడుకుపోయింది. అందరు విడవలేక విడవలేక వీడ్కోలు చెప్పుకున్నాము.

పిల్లలందరమూ చాలా బాధపడ్డాము. ఒకరిద్దరయితే అబ్బయిలయి కూడా గొల్లుమన్నారు. మా  పఠాన్ స్కూల్ కేప్టెన్, ఎప్పుడూ ఎటువంటి భావమూ వ్యక్తపరచని తన గంభీర ముద్రను వీడి,   ఆరోజు కంటతడి పెట్టాడు.  ఒమర్  ఆఖరికి సంతోషంగా చేతులూపి నాకు వీడ్కోలు చెప్పాడు. నేనూ చెప్పాను. ఏదో ఒక రోజు తప్పకుండా కలుసుకుందామని ప్రమాణాలు చేసుకున్నాము.  ఆ కేన్వాయి సురక్షితంగా పాకిస్తాన్ చేరినట్టు కబురందింది.  ఆ ఏడు బజార్లో దారి తప్పి రాక్షస మూక ఊచకోతల్లో బలయిపోయిన మా స్కూలు వంట వాడి మరణం తప్ప వేరే సంఘటనలు ఏవీ జరగలేదు. స్కూల్కు సంబంధించి అందరూ సురక్షితంగానే ఉన్నాము.

స్కూల్ సంవత్సరం ముగిసి, వేసవి సెలవులకు మేమంతా సిద్ధపడుతూండగా ఒమర్ నుండీ నాకో ఉత్తరం వచ్చింది. తాను చేరిన కొత్త స్కూలు గురించి రాసాడు. నన్ను, నా సాంగత్యాన్ని ఎంత మిస్ అవుతున్నాడో, మా ఆట స్థలాలూ, ముఖ్యంగా మా సొరంగం - ఆ సొరంగం బయట ఆట స్థలాల గురించి ఎంతో ఆప్యాయంగా రాసాడు. నేనతని ఇంటి చిరునామాకు ప్రత్యుత్తరమైతే రాసాను. కానీ అది చేరిందో లేదో తెలీలేదు. ఎందుకంటే ఒమర్ నుంచీ ఇంకే ఉత్తరమూ నాకు రాలేదు. ఈ విశాలమైన దేశమూ.. భూమీ చాలా పెద్దది. దానిలో మా అస్థిత్వం ఏ మాత్రం ? మేము కేవలం పిల్లలము.

ఓ పదిహేడూ, పద్ధెనిమిది ఏళ్ళ తరవాత ఒమర్ సంగతి నాకు తెలిసింది. కానీ పూర్తిగా వేరే పరిస్థితిలో.   అది  ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ సమయం - షింలాకు ఎంతో దూరంలేని అంబాలా పట్టణం మీద వైమానిక దాడి చేయ ప్రయత్నించిన ఒక పాకిస్తానీ విమానాన్ని కూల్చేసారు.  విమానంలో సిబ్బంది అందరూ ఆ క్రాష్ లో మరణించారు. ఒమర్ వారిలో ఒకడు.

ఆ వార్త తెలిసాకా ఒమర్ గురించే ఆలోచించాను.  విమానంలోంచీ  ఒమర్,  షింలా లో మేం బాలురుగా ఉన్నప్పుడు ఎంతో హాయిగా తిరుగాడిన,  ఆడుకున్న మైదానాల్నీ, కొండల్నీ, లోయల్నీ, వాలుల్నీ, మా ఆట స్థలాలనీ చూసి వుంటాడా ?    స్కూలు జ్ఞాపకాలు అతన్ని ముంచెత్తి వుంటాయి కదా. ముఖ్యంగా మా రహస్య సొరంగం గురించి అతనికి గుర్తు ఉండి వుంటుందా ?

మా ఒంటరితనాలలోంచీ, మా కఠొర జీవితాల్లోంచీ తప్పించి, స్కూలు బయటి వసంతాల్నీ, సీతాకోక చిలుకలనీ, చిరు స్వేచ్చ నూ, స్వతంత్రాన్నీ, ప్రేమనూ పరిచయం చేసిన ఆ పాత నిరుపయోగమైన సొరంగం అతనికి ఖచ్చితంగా గుర్తొచ్చే ఉంటుంది అనిపించింది.

కానీ తప్పించుకునేందుకు ఆకాశంలో సొరంగాలుండవు.


"The Playing Fields of Shimla"  from "No Man is an Island" by Ruskin Bond.



Notes :

Ruskin Bond

Partition of India

Eton College

Kipling :  Joseph Rudyard Kipling - ఇండియాలో పుట్టి "జంగల్ బుక్" రాసిన ప్రసిద్ధ బ్రిటిష్ రచయిత. హిమాలయాల ప్రేమికుడు.

Richmal Crompton

Secret Sharer 

Leyroyd, Mulavaney and Otheris - Three Muskateers - Kipling's characters

Laurence Olivier 



04/05/2018

Personal Recollections of Joan of Arc - Mark Twain


 



మార్క్ ట్వైన్ రాసిన అన్ని నవలల్లోకీ చాలా సీరియస్  నవల "పెర్సొనల్ రెకలెక్షన్స్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్".   కామిక్ రచయిత గా మొదలుపెట్టినా, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల కారణంగా, భార్య, ఇద్దరు కూతుర్ల మరణానంతరం, తన మలి సంధ్య లో.. సీరియస్, నిరాశాపూరిత కధలను రాయడం మొదలుపెట్టాడు ఈయన.  'జోన్ ఆఫ్ ఆర్క్'  గురించి ఇంగ్లీషు లోకంలో పెద్దగా తెలీని కాలంలో పన్నెండు సంవత్సరాలు శ్రమపడి, సమాచారాన్ని సేకరించి, రెండేళ్ళ పాటు రచించిన, అతను తన నవలల్లోకెల్లా ఉత్తమమైనదని భావించిన నవల ఇది.  1850 లో జోన్ గురించి తెలుసుకుని, ఆమె గురించి లోకానికి తెలపాలన్న తీవ్ర కాంక్ష తో, ఈ కధ నిజమా కాదా అని వెయ్యిన్నొక్క సార్లు నిర్ధారించుకుని, ఈ చారిత్రాత్మక నవలను ప్రేమ తో రాసాడు.

జోన్ ఒక చిన్న పేద రైతు బిడ్డ. ఫ్రెంచ్ వారి చరిత్రలో ఆమెది ఒక సుస్థిరమైన స్థానం.  ఆమె తో పాటూ పెరిగిన ఒక స్నేహితుడి జ్ఞాపకాల వెల్లువ ఈ పెర్సొనల్ రీకలెక్షన్స్ అన్న మాట.  లూయీ దె కాంట్ అనే జోన్ సహచరుడు, 82 ఏళ్ళ వృద్ధుడు, ఒక ఫ్రెంచు పల్లె లో,  వాళ్ళంతా చిన్న నాడు ఆడుకున్న చెట్టు దగ్గర కూర్చుని, జోన్ ని తలచుకుంటూ చెప్పిన కధ ఇది. "మొదటి నుండీ, ఆమె మరణం దాకా నేను తన తోనే ఉన్న వాడిని"  అంటూ.. మొదలుపెడతాడు. ఫ్రాన్స్ లో పిల్లలు, ఒక అయిదు వందల సంవత్సరాలో, వెయ్యి సంవత్సరాలో ఆమె ను గుర్తు చేసుకుంటారు. ఆమె గాధలను గానం చేస్తారు. ఫ్రాన్స్ ఆమె ను మర్చిపోకూడదు. ఆ త్యాగధని ని కొలుస్తూ ఉండాలి అని లూయీ ఆకాంక్ష.  

డోర్మెరీ లో పిల్లలందరకీ ఈ చెట్టు భలే ఇష్టం. వారి ఆట పాటలన్నీ ఈ చెట్టు చుట్టూతానే. ఎందుకంటే ఆ చెట్టు మీద ఫెయిరీ లున్నాయి.  అవి ప్రతీ రోజూ ఈ పిల్లలతో ఆడుకుంటూండేవి.  ఒక ప్రీస్ట్ ఫెయిరీలను ఆ చెట్టు నుండీ పొమ్మని శపించినపుడు అతన్ని ప్రశ్నించడం ద్వారా జోన్ నిజానికి కట్టుబడే మనిషి అని, చిన్న పిల్ల అయినా ధైర్య సాహసాలలో, తెలివి తేటలు ప్రదర్శిస్తూ వాగ్వాదం చెయ్యడంలో ఘనురాలు అని అందరికీ తెలుస్తుంది.  అదే విధంగా ఒక కరుకైన మంచు కురిసే చలి రాత్రి జోన్ ఇంట్లో అందరూ సమావేశమై ఉన్నపుడు ఒక బిచ్చగాడు చలికి వణికిపోతూ, ఆకలితో అలమటించిపోతూ అక్కడికి వచ్చినపుడు అందరూ అతన్ని ఏవగించుకున్నా, దయగల తల్లి తన ఆహారాన్ని అతనికిచ్చి,  ఆదరిస్తుంది. అతను పనికిమాలిన వాడైనా, వెధవ అయినా, ముందు అతని కడుపు నింపాకే మిగతా అంతా అని తండ్రితో వాదిస్తుంది.   మనుషులు తప్పు చెయ్యొచ్చు. ఆకలి గొన్న అతని పొట్టదేమి పాపం ?  అతనికి  భోజనాన్నివ్వడం మన ధర్మం. అతని పాప పుణ్యాల విచారణ కు ఇది సమయం కాదు అంటుంది.

ఈ పిల్లలు కాస్త శాంతియుతంగా ఉండే ఆ ప్రాంతాల్లో అలా పెరిగి పెద్దవుతున్నారు.  నిజానికి అప్పుడు ఫ్రాన్స్ అస్థిరత తో ఉడికిపోతుంది.  ఇంగ్లీష్ పాలన లో మగ్గుతూంది. రాజు పదవీచ్యుతుడయ్యాడు. ఫ్రెంచ్ అభిమానానికి తీవ్ర గాయమైన కాలం. బర్గుండీ లూ, ఇంగ్లీష్ వాళ్ళూ ఫ్రాన్స్ లో వివిధ ప్రాంతాలను ఏలుతున్నారు. ఫ్రెంచు వారి పరిస్థితి దయనీయంగా ఉంది.  పదవీచ్యుతుడైన రాజు ని డాఫిన్ అంటారు.  ఫ్రాన్సు కు చెందిన కేథరీన్ కూ ఇంగ్లాండు కు చెందిన హెన్రీ కీ వివాహం జరగబోతున్న వార్త విని ఫ్రెంచు వారు ఉడికిపోతున్నారు.  వాళ్ళ సంతానం ఫ్రాన్సు నూ ఇంగ్లండు నూ ఏలేట్టయితే  ఈ జన్మ లో ఫ్రాన్సు కు స్వాతంత్ర్యం లభించదనీ, డాఫిన్ ఇక రాజవ్వడనీ బాధపడుతున్నారు. 

రాజకీయ పరిస్థితులు ఇలా ఉండగా ఊర్లో ఒక బెనోయిస్ట్ అనే పిచ్చివాడు ఎక్కడో గొడ్దలి దక్కించుకుని, వీధుల్లో విలయ తాండవం చేస్తున్నపుడు, పిల్లలంతా పారిపోగా, జోన్ మాత్రం అతనికెదురెళ్ళి ఏదో లా అతన్ని కన్విన్స్ చేస్తుంది. ఆ మహాబలుడు, ఈ చిన్న పిల్ల మాట విని బుద్ధిమంతుళ్ళా  వచ్చి తనకై నిర్దేశించిన చెర లో కూచుంటాడు. అతన్ని తాళం వేసి బంధిస్తారు ఊరివాళ్ళు. అయితే దురదృష్టవశాత్తూ అదే రోజు శత్రు సేనలు ఊరి మీద దాడి చేస్తాయా రాత్రి. అన్ని ఇళ్ళూ తగలబెడతారు. ప్రజలు కట్టు బట్టలతో అడవిలోకి పారిపోతారు.  వారు పొద్దున్న తిరిగొచ్చి చూసేసరికీ, చెరలో ఈ మహాబలుడి కాలిన మృతదేహాన్ని చూసి, జోన్ తో సహా అందరూ దుఃఖిస్తారు.   అప్పుడు మొదటి సారిగా యుద్ధ భీభత్సం, ఫ్రాన్స్ స్వతంత్ర లాలసా జోన్ కి ఎరుకలోకొస్తాయి.

ఫ్రాన్స్ పతనాన్ని దర్శిస్తున్న ఈ పిల్లలు యుద్ధావేశంతో రగులుతున్న పెద్దవాళ్ళు, నిస్సహాయమైన పరిస్థితులు.. వీటన్నిటి మధ్యా, లూయీ ఒక మారు అడవిలో చెట్ల మధ్య జోన్ ఏదో పెద్ద వెలుగులో మాటలాడుతూండడం చూస్తాడు.  ఆ చిన్న పిల్ల తనకు దేవుడు ఫ్రాన్స్ రక్షణకై నియమించాడని, తనని రాజుని కలవనీయమనీ, కొందరు సైనికులనిమ్మనీ, సైన్యాధికారుల కు మొరపెట్టుకుని, ఎలాగో రాజుని కలిసి, ఆయన్ని గద్దెనెక్కిస్తానని ప్రమాణం చేసి, తరవాత ఎన్నో  యుద్ధాల్లో పాల్గొని, చిన్న పిల్లే అయినా మెరుపు లా యుద్ధం చేసి, ఆర్లియన్స్ లాంటి శతృదుర్భేద్యమైన కోటల్ని చార్లెస్ వశం చేస్తుంది.

నిండా 17 ఏళ్ళు అన్నా లేని పిల్ల సాధిస్తున్న విజయాలను చూసి, ఆమె ని విచ్ అనీ, మంత్ర కత్తె అనీ, ఇంగ్లీష్ సైనికులు అభాండాలు వేస్తారు. దేవుడే తనని నడిపిస్తున్నాడని నమ్మి జోన్, వెండి పళ్ళెంలో విజయాన్ని తెచ్చి రాజుకిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో విజయాలు, గాయాలు, అనవసరమైన విరామాలూ, ఈ లోగా రాజు చుట్టూ చేరిన కుయుక్తులు, జోన్ పారిస్ మీద దండెత్తినపుడు,  పారిస్ యుద్ధంలో విజయం సాధించక పోతే, ఫ్రాన్స్ పూర్తిగా స్వతంత్రమయేందుకు ఇంకో 20 యేళ్ళు పడుతుందని చెప్పిన జోన్ మాటల్ని మరిచి,    రాజు  అకస్మాత్తుగా సంధి ప్రకటించేలా చేసి, ఆమె చేతులు కట్టేస్తారు. ఆ యుద్ధంలోనే  ఈమె అత్యంత సాహసోపేతమైన జెనరళ్ళు వీర మరణం చెందుతారు. రాజు వైఫల్యం వల్ల ఫ్రాన్స్ ఓడిపోతుంది. 

జోన్ ను అరెస్ట్ చేసి, ఆమె ప్రజాదరణ ను దృష్టి లో ఉంచుకుని, ఆమె సాతానుకు చెందిన వ్యక్తి అని  ఋజువు చేయడానికి  శత విధాలా ప్రయత్నం జరుగుతుంది.   వాళ్ళడిగిన సొమ్మునిచ్చి జోన్ ని విడుదల చేసుకోవడానికి చార్ల్స్ అస్సలు ప్రయత్నించడు. అత్యంత దయనీయ నిస్సహాయ పరిస్థితుల్లో ఆమె పై విచారణ జరుగుతుంది.  ఒంటరి ని చేసి,  చెరలో ఆమె ని బలాత్కరించారు.  మానసికంగా ఆమెని లొంగదీయడానికి అమానవీయ పరిస్థితుల్లో బంధించి ఉంచారు.  ఆఖరికి చదువు రాని ఆ పిల్ల చేత ఒక తప్పుడు ఒప్పుకోలు సంతకం పెట్టించి, సజీవ దహనం చేస్తారు.      

బహిరంగంగా అమలు పరచిన ఆ శిక్ష ని లూయీ తన కళ్ళారా చూసి,  విల విలా ఏడుస్తాడు.  జోన్ చాలా నిస్సహాయంగా, ఒంటరిగా చనిపోతుంది.  ఆమె ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించిన వ్యక్తి బిషొప్ బావియా చరిత్రలో బాలిక ని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తి గా నిలిచిపోయాడు.  ఇది జరిగిన 20 ఏళ్ళకి చార్లెస్ యుద్ధంలో అంతిమ విజయం సాధించిన నాడు, జోన్ ని తలచుకుంటాడు

ఈ జోన్ కథ ను మార్క్ ట్వైన్ ఇంగ్లీషు మాట్లాడే ప్రజలకు పరిచయం చేసి,  జోన్ కు ఒక విస్తృత ప్రచారం కల్పించాడు.   ఫ్రాన్స్ విజయం తరవాత రాజు చార్ల్స్ పోప్ దగ్గర జోన్ పై పెట్టిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆమె హత్య తప్పని నిరూపింపచేసాడు అంటారు.  ఫ్రాన్స్ లో దేవతగా కొలువబడే జోన్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  మార్క్ ట్వైన్, చివరి దినాల్లో  సావకాశంగా ముగించి, ఒక రూపాన్నిచ్చిన ఈ కథ ని ఆధారంగా చేసుకుని వచ్చిన  హాలీవుడ్ సినిమాలు, నాటికలూ  కూడా ఆదరణ పొందాయి. ఎన్నో సార్లు పునర్ముద్రణ పొందిన జోన్ కథ,  పట్టుదలా, కరుణ, దయా, స్నేహమూ, త్యాగమూ, దేశభక్తీ లాంటి విలువలకు మానవ చరిత్రలో ఎంతో   ఆదరణ, గౌరవం, ఉండి తీరతాయని  నిరూపిస్తుంది. 
***

A Village by the Sea - Anita Desai



బాలల పుస్తకాలు రాసేవాళ్ళు అరటిపండు వొల్చినట్టు కొన్ని ముద్దైన కథలు చెప్తూంటారు.  బాల సాహిత్యంలో కష్టాలూ, కడగళ్ళూ ఉన్నా, ముగింపు పాసిటివ్ గా ఉండేదే మంచి కథ అని నా నమ్మకం.   ఈ రోజుల్లో పిల్లలు ఊహించలేనంత  దారుణాలకూ, దాడులకూ గురవుతున్నారు.  కష్టాలు మనసుల్ని రాటు తేలుస్తాయి. మనుషుల్ని దగ్గరగా కూడా తెస్తాయి, ప్రేమ తో, ఐక్యత తో  కుటుంబం అంతా వాటిని ఎదుర్కోవచ్చు అని ఒక భరోసా ఇవ్వాగలగడమే పెద్ద విషయం. అన్నిటికన్నా బీదరికం ఒక పెద్ద కష్టం. కుటుంబంలో అందరూ కలిసి, ప్రేమాభిమానాలతో ఆ బీదరికాన్నీ, విపరీతమైన నైరాశ్యాన్నీ ఎదుర్కోగలం అనే నమ్మకాన్ని ఒదులుకోలేకపోవడమే ఈ కధ లోని ఆత్మ.

సముద్ర తీరంలో తుళ్ (ముంబాయి కి 17 కిలో మీటర్ల దూరంలో) ఆలీబాగ్ కి దగ్గర్లో ఉన్న ఓ జాలరి పల్లె.  ఇక్కడ 13 ఏళ్ళ లీల, 11 ఏళ్ళ తమ్ముడు హరి, ఇంకో ఇద్దరు చిన్న వయసు చెల్లెళ్ళు బేల, కమల ల కొబ్బరాకుల తో కప్పిన పూరిపాక నుంచీ కథ మొదలవుతుంది.  వాళ్ళ తండ్రి తాగుబోతు, తల్లి అనారోగ్యంతో శుష్కించిన ప్రాణి.  పిల్లలకు వండి వార్చే పెద్ద దిక్కు లీలే.  హరి బాధ్యత తెలిసిన వాడు. తమ భవిష్యత్తు గురించి వయసుకు మించిన బెంగతో, పట్టుదలతో ఉక్కిరిబిక్కిరవుతుండే స్వచ్చమైన బాలుడు. తండ్రి తాగి పొద్దంతా నిద్రపోయి, రాత్రి లేచి, కల్లు పాక కి పోయి, తాగి, ఇరుగు పొరుగు తో గలాటా పెట్టుకుని ఇల్లు చేరి.. నిద్రపోవడమే తప్ప గ్రామంలో మిగిలిన వాళ్ళ లాగా పడవ మీద చేపల వేట కు వెళ్ళడమో, నాలుగు రాళ్ళు సంపాయించడమో పిల్లలు ఎపుడూ చూడనే లేదు.

అది ఒక సముద్ర తీర గ్రామం.  అభివృద్ధి కి దూరంగా, చేపల పడవల మీద జాలరులు సముద్రంలోకి పోయి ఏదో కొంత వేట తెస్తే అవీ, ఊరి నిండా ఉన్న కొబ్బరి చెట్ల నుండీ వచ్చే బొండాల ఆదాయమూ.. పొలాల్లో కొద్దొ గొప్పో పండే ధాన్యమూ తప్ప వేరే బ్రతుకు తెలియని వాళ్ళు.  వాతావరణానికీ, ప్రాణానికీ లంకె. అందరివీ నాటు పడవలే. మర బోట్ ఉన్న బిజూ అనే ఆసామీ స్మగ్లింగ్ చేస్తాడని, సముద్రంలో పెద్ద పెద్ద నౌకల నుండీ పెట్టెలు ఈ తీరానికి తీసుకు వస్తాడనీ అంతా అనుకుంటూంటారు. ఎందుకంటే బిజూ నే కాస్తొ కూస్తో సంపన్నుడు. డాబా ఇల్లు ఉన్న ఆసామీ.


ఊర్లో ఏదో చిన్న బడి తప్ప, పెద్ద సౌకర్యాలేమీ లేవు.  ఆసుపత్రి లేదు. లీల తల్లికి ఏమి జబ్బో తెలీదు.  ఆలీబాగ్ కి ఏ బస్సులోనో బండిమీదో తీసుకెళ్ళాలి.  ఆవిడకి సరైన వసతులలో చికిత్స ఇప్పించగలిగేంత డబ్బూ లేదు వీళ్ళకి. ఒకో పూట తినడానికి తిండి కూడా వుండదు. తండ్రికి ఇవేమీ పట్టవు. అప్పో సొప్పో చేసి తన తాగుడు వరకూ మాత్రమే చూసుకుంటాడు.  భార్యా పిల్లలు అసలు ఎలా ఉంటున్నారో, ఏమి తింటున్నారో కూడా తెలీదు అతనికి.  అతనికి అప్పిచ్చి మునిగిన వాళ్ళు అక్కసుతో పిల్లలు ప్రాణంగా పెంచుకుంటున్న "పింటో" అనే కుక్క పిల్లని చంపేయడంతో వాళ్ళ పరిస్థితులు మరింత దిగజారతాయి. ముఖ్యంగా పిల్లలు మానసికంగా చాలా దెబ్బ తినిపోతారు.

వాళ్ళకున్న కొద్ది పాటి స్థలంలో ఏవో కూర మొక్కలు పాతుకుంటారు. ఒక్కోసారి పిల్లలు తీరం దాకా నడిచెళ్ళి, ఒడ్డున రాళ్ళ కి పట్టిన నత్తల్ని ఏరుకొస్తారు.  హరి చిరిగిపోయిన పాత వల తో సముద్రం ఒడ్డునే ఏవో చేపలు పట్టాలని ప్రయత్నిస్తూంటాడు.  లీల పెరట్లో కాచిన మిరపకాయలతో పిల్లలకు ఏదో కాస్త తినడానికి ఇస్తుంది.  బేల, కమల లు బడికి వెళ్తూంటారు. లీల కి ఆ సౌకర్యం లేదు.  వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ హరీ, లీల ఆ సంసారాన్ని లాక్కొస్తున్నారు.

ఇంతలో ఊరిలో ఎరువుల ఫేక్టరీ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లభిస్తుంది. పల్లెలో ఒక కుదుపు. ఫేక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయని మభ్యపడుతున్న వారు,  భూములు ప్రభుత్వం లాక్కుంటే నిర్వాసితులమైతే తమ భవిష్యత్తు ఏంటని బాధపడేవారూ, ఈ లోగా పట్నం నుండీ వచ్చిన  పర్యావరణ వేత్తలూ, ఎరువుల కర్మాగారాలు వదిలే విష రసాయనాల వల్ల సముద్రంలో మరణించబోయే చేపల గురించి చెప్పి జాలర్లను అప్రమత్తం చేయడం.. ఇలా కొన్నాళ్ళు తుళ్, ఆ చుట్టు పక్కల గ్రామాల్లోనూ  ఉద్రిక్తత రగులుకుంటుంది.

ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా తనకి ఏదో ఒక ఉద్యోగమో, ఆధారమో కావాలని వెతుకుతున్న హరి ని కూడా ఆ సంఘర్షణ తాకుతుంది.   అందరూ బొంబాయి వెళ్ళి ఒక ప్రదర్శన లో పాల్గొని, ప్రభుత్వానికి తమ నిరశన వ్యక్తపరుస్తామని అనుకుంటారు. దానికి తుళ్ నుండీ, మిగతా గ్రామాల నుండీ, పడవల్లో సముద్రమార్గాన బయలు దేరుతారు. హరి పొద్దున్న వాళ్ళతో వెళ్ళి, రాత్రికి వచ్చేద్దామనుకుంటాడు -  హరి ఆలోచన బొంబాయి లో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని.   లీలా, హరీ ఆ విషయం మాటాడుకున్నప్పుడల్లా, లీల 'మమ్మల్ని వదిలి అంత దూరం వెళతావా హరీ ?' అని బెంగ గా అడుగుతూండడం వల్ల హరి ఎటూ తేల్చుకోలేకపోతుంటాడు.

తుళ్ లో ఒక బంగళా వుంటుంది. దాని సొంతదార్లు డిసిల్వాలు బొంబాయిలో వుంటారు. ఎపుడన్నా సెలవులకి తుళ్ కి వస్తూంటారు. వాళ్ళ పిల్లలు సముద్రంలో ఈదుతూ, నీళ్ళలో ఆడుకుంటూ, తోటల్లో తిరుగుతూ, ఎంజాయ్ చేసి, కొన్నాళ్ళ తరవాత బొంబాయి వెళిపోతుంటారు.   ఒక సారి డిసిల్వా హరికి తన ఎడ్రస్ ఇచ్చి, బొంబాయి  వస్తే కలువు నీకు ఏదైనా సాయం చేస్తాను అనడం... హరి బొంబాయి యాత్ర కి ఒక ట్రిగ్గర్.   వాళ్ళు వచ్చినప్పుడల్లా, వాళ్ళకి కావల్సిన సౌకర్యాలు చూడడానికి, పని చెయ్యడానికీ లీల, హరి వెళ్తూంటారు.  అందువల్ల వీళ్ళకి పరిచయం.

హరి మాత్రం ఆందోళన కారులతో బొంబాయి వెళిపోయాక,  ఇంక రాకుండా అక్కడే మరింత చిక్కుల్లో పడిపోతాడు. అతను డిసిల్వా ఇంటికి చేరేసరికీ, వాళ్ళు తుళ్ వచ్చి వుంటారు.  ఇక తిరుగు ప్రయాణమవుదామనే సరికీ, చేతిలో చిల్లి గవ్వ లేదు, రేవులో తమ పడవలు వెళ్ళిపోయాయి. ఆఖర్న మంచి మనసు గల వాచ్ మేన్, ఒక చవకబారు హోటల్ ఓనర్ జోగూ, ఒక వాచీ మెకానిక్ ల ఆదరణతో, పని చేసుకుంటూ, దీపావళి కల్లా కొంత డబ్బు, జీవించడానికి కావలసిన ఆత్మ స్థైర్యం, వాచీ మెకానిక్ పని నేర్చుకోవడం వల్ల చేతిలో జీవనాధారమైన విద్య తో ఇంటికి తిరిగొస్తాడు.   ఆ రోజుల్లో ఇప్పుడున్నంత మొబైల్ కమ్మ్యూనికేషన్ లేదు కాబట్టి, లీల కి తాను బొంబాయిలో ఉన్నట్టు ఎపుడో ఒక్క కార్డు రాయడం తప్ప - ఇంకే సందేశమూ, వార్తా ఉండదు.

ఇక్కడ తుళ్ లో డిసిల్వాలు సెలవులు ముగిసాక వెళ్ళబోతున్నప్పుడు వాళ్ళ తిరుగు ప్రయాణంలో ఆలీబాగ్ లో తమ తల్లిని ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర డ్రాప్ చెయ్యమని అడుగుతుంది లీల. ఈ మాత్రం దానికి మంచివాళ్ళైన డిసిల్వాలు లీల తల్లిని ఆస్పత్రి లో చేర్చి, కొంత డబ్బూ ఇచ్చి, డాక్టర్లతో మాటాడి, ఆవిడకి క్షయ కావడంతో కొన్నాళ్ళు అక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు.  ఇక్కడ లీల కోసం ఒక ఉద్యోగం కూడా ఏర్పాటు చేస్తారు. వారి బంగళాకొక పక్షి శాస్త్రవేత్త వచ్చి కొన్నాళ్ళుండబోతుండడం వల్ల, ఆయనకి కావల్సినవన్నీ చూడడం లీల పని. ఈ పని వల్ల లీల కి చేతుల్లో కొంత డబ్బు వస్తుంది. ఆమె నెలకోసారి ఆలీబాగ్ వెళ్ళి ఆస్పత్రిలో తల్లిని కలిసి రాగలుగుతూంది. 

ఈలోగా లీల తండ్రి కూడా మంచి వాడయి, తాగుడు మానేసి, ఆలీబాగ్ లో భార్య బాగోగులు చూసుకుంటూ, ఆస్పత్రి దగ్గరే ఉండిపోతాడు. దీపావళి నాటికి హరి ఇంటికి రావడం, తల్లి ట్రీట్మెంట్ ముగిసి ఆరోగ్యవంతురాలై తిరిగి రావడం, లీల చేసిన స్వీట్లూ,  వాళ్ళ జీవితాల్లో, మనసుల్లో ఆశ, భవిష్యత్తు కోసం బెంగ పోయి, ఒక ధైర్యం కలగడం.. నైరాశ్యం మీద ఇంటిల్లపాదీ కొందరు మంచి మనుషుల సాయంతో చేసిన పోరాటం వల్ల చిక్కిన ఆత్మ సంతృప్తి తో  హాయిగా నవ్వడంతో కధ ముగుస్తుంది.

ఈ నవల నిండా, జాలర్ల జీవితాల గురించి, చిక్కటి చేపల వాసనలు, సముద్రపు హోరు, వలలు, వేటలు, తుఫాన్లూ,  బొంబాయి నగరం. ఎందరో పేదలని అక్కున చేర్చుకుని ఆదరించిన నిర్దాక్షిణ్యమైన నగరం గురించీ... అక్కడ కూడా ఉన్న మంచి మనుషుల గురించి.. చదివి ఎంతో ఆనందం కలుగుతుంది.  తుళ్ ఒక సముద్ర తీర గ్రామం కావడం వల్ల జాలరులు సముద్ర తీరంలో ఉన్న బండలకి కొబ్బరికాయలు కొట్టి, పూలు, కుంకుమా సమర్పించి తమ ప్రాణాల కోసం ప్రార్ధించడమనే సాంప్రదాయం వుంటుంది.  కధ ఆ దృశ్యంతో,  మొదట లీల పూజతో మొదలయ్యి, చివరికి ఆరోగ్యం పుంజుకున్న లీల అమ్మ పూజ తో - ఆవిణ్ణి చూసుకుని మురిసిపోయే హరి, లీల ల నవ్వుతో ముగుస్తుంది.

ఇంత కన్నా మంచి బాల సాహిత్యం ఉంటుందా అనిపించింది.   కిరణ్ దేశాయ్ తల్లి అనితా దేశాయ్ చాలా రచనలు చేసినా, పిల్లల కోసం రాసిన పుస్తకాలు ప్రాచుర్యం చెందాయి.    సముద్రం అంటే ఉన్న ఇష్టం వల్ల - చిన్నప్పుడు చదివిన డేవిడ్ కాపర్ ఫీల్డ్  పెగోట్టీ ల ఇంటికి వెళ్ళడం అదీ, Yarmouth  జాలర్ల గ్రామం కూడా గుర్తొచ్చి భలే భలే సంబరంగా అనిపించింది.   సెలవుల్లో పిల్లల చేత చదివించొచ్చు.  1980 లలో రాసిన ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, నెహ్రూ బాల పుస్తకాలయం "సముద్ర తీర గ్రామం " అనే పేరుతో   ప్రచురించింది. అనువాదం ఎం.వీ.చలపతి. వెల : రూ.27/- మాత్రమే.

11/01/2018

సతి - శరత్ చంద్ర చటర్జీ [The Devoted Wife - Sharat Chandra Chatterjee]






బెంగాల్ లో పబ్నా అనే ఓ ఊర్లో హరీష్ ఒక పేరొందిన లాయర్.  అతని భార్య నిర్మల, అతని విధవ చెల్లెలు ఉమ. ఇదే అతని కుటుంబం.  హరీష్ ఆ ఊర్లో ప్రముఖుడు కావడాన, ఊర్లో జరిగే సభల్లోనూ, కార్యక్రమాల్లోనూ అతనిది ఓ చెయ్యి తప్పని సరిగా ఉంటుంది.  సాధారణంగా చూస్తే అతని జీవితం పూలపానుపు కావల్సింది. కానీ నిర్మల - అతని భార్య - ఆవిడ అనుమానంతో అతన్ని కాల్చుకు తినకపోతే, ఆర్ధికంగా మంచి స్థాయి కి చెంది, సమాజంలో పరువు ప్రతిష్ఠా ఉన్న,హరీష్ లాంటి మనిషి కి,  ఆ జీవితం చాలా బావుండేది. 

హరీష్ తండ్రి రాం మోహన్ బారిసాల్ లో సబ్ జడ్జ్ గా పనిచేసేవారు. అక్కడ పక్క ఇంట్లో హరకుమార్ మజుందార్ అనే స్కూల్ ఇన్స్పెక్టర్ కూడా ఉండే వారు.  రాం మోహన్ ఇంట్లో ప్రతీ సాయంత్రం మితృలతో గోష్టి లాంటిది జరుగుతూండేది.  కలకత్తా లో లా చదువుతూ, బారిసాల్ కి సెలవులకని  వచ్చిన  హరీష్ కి ఓ మారు ఈ గోష్టి లో హర కుమార్ సౌమ్య, స్థిర వాదనా, వ్యక్తిత్వమూ, మిత భాషణ చాలా ఆకర్షించి, ఇద్దరికీ మధ్య ఒక గురు శిష్య సంబంధం లాంటిది ఏర్పడుతుంది.  హర కుమారుడి కూతురు లావణ్య ప్రభ.  హరీష్ కన్నా చిన్నది.  పీ. యూ. సీ చదువుతూండేది.   వీళ్ళిద్దరి మధ్యా వయసులో ఉండటం వల్ల చిన్న ఆకర్షణ లాంటిదాంతో పాటూ, చనువు,  దగ్గరతనం ఏర్పడుతుంది.  హర కుమార్ స్నేహంలో, అతని నీడలో హరీష్ చదువు కూడా చక్కగా సాగి, పరీక్షలు రాయడానికి కలకత్తా వెళ్ళిన హరీష్ చక్కగా పాసవుతాడు.  ఈ పిల్ల లావణ్య మాత్రం ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినందుకు సిగ్గు పడదస్సలు.  ఇంటికొచ్చిన హరీష్ ఎందుకు ఫెయిల్ అయ్యావు అని నిలదీస్తే, ఇప్పుడు చదువు నా వల్ల కాదని చెప్పేసి, నవ్వి, అక్కడ్నుంచి వెళిపోతుంది లావణ్య.  ఎందుకు కాదో అర్ధం కాదు హరీష్ కి.

అయితే వీళ్ళిద్దరి సాన్నిహిత్యం చూసి భయపడిన హరీష్ తల్లి, తండ్రికి చెప్పడం, అతను పరమ ధార్మికుడైన, చాందసుడైన, తన స్నేహితుని కూతురు నిర్మల కి కొడుకుతో సంబంధం నిశ్చయించడం.. వెంట వెంటనే జరిగిపోతాయి. అక్కడ కలకత్తా లో చదువుకుంటున్న హరీష్ కి తండ్రి నిర్ణయం, తన వివాహపు వార్త తెలిసి ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. సన్యాసుల్లో కలిసిపోదామనుకుంటాడు.  అయినా సాంప్రదాయ వాది కాబట్టి, తండ్రి ఆజ్ఞ్య జవదాటలేక, నిర్మల ని పెళ్ళి చేసుకుంటాడు.  పెళ్ళి కి వచ్చిన హర కుమార్ మజుందార్ ని, ఈడొచ్చిన పిల్ల ని చదువు పేరుతో పెళ్ళి చెయ్యకుండా వదిలడం గురించి,  పాశ్చాత్య చదువులు, పోకళ్ళ గురించి వ్యంగ్య బాణాలతో  వధించాలని చూస్తాడు రామ్ మోహన్.   కానీ. మంటపం లో అందరికీ అర్ధం అయిన ఆ వ్యంగ్యాలు తనని ఉద్దేశించినవే అని  ఎంత మాత్రం  అర్ధం చేసుకోలేనంత స్వచ్చమైన మనస్సు ఉన్నవాడు హర కుమార్ మజుందార్.  

అలా నిర్మల హరీష్ జీవితం లో కి ప్రవేశిస్తుంది. పెళ్ళవుతున్న నిర్మల కు తల్లి ఇచ్చిన సలహా వీళ్ళ జీవితాల్ని శాసిస్తుంది.  అది "భర్తని ఒక క్షణం కూడా వొదలకుండా పర్యవేక్షించుతూ ఉండు. ఒక్క క్షణం కూడా కళ్ళు మూసావో, అతను నీ చేతిలోంచీ జారిపోగలడు జాగ్రత్త !  ఇల్లూ, సంసారం తరవాత. ముందు నీ పట్టు కోల్పోకు!! " అన్నది.   ఈ సలహా ని నిర్మల పెళ్ళయిన క్షణం నుంచీ మర్చిపోక, తూచా తప్పకుండా అమలు చేస్తూ, హరీష్ జీవితాన్ని సర్వ నాశనం చేస్తుంది. 

ఈ నిరంతర పర్యవేక్షణ, నిష్కారణ అభాండాలు, ఎప్పుడూ ఘర్షణ, హరీష్ సున్నిత మనస్తత్వాన్ని గాయపరుస్తాయి.  ఎంత సంపద ఉన్నా, సమాజంలో ఎంత స్థానం ఉన్నా, ఇంట్లో అతని బ్రతుకు దుర్భరం.  అతని ప్రతి చర్య, ప్రతి కదలికా, అతని సామాజిక జీవితాన్ని కూడా ప్రభావితం చేసేంత దిగ్బంధనం, లేశ మాత్రమైన ప్రేమ లేని వివాహ బంధం, అతనికి బంధనాల్లా, గుది బండల్లాగా తయారవుతాయి. అతను ఎంత లాయరయినా,  ఎంత చదువుకున్నా,  పాశ్చాత్య చదువులు చదివినా,   "నేను క్రైస్తవుణ్ణయితే  భార్య కు విడాకులివ్వ గలిగేవాణ్ణి, ముస్లిం అయి ఉంటే తలాక్ ఇచ్చేసే వాణ్ణి. బెంగాలీ బ్రాహ్మణుణ్ణి. ఏమని చెప్పి విడాకులివ్వాలి ?  ఈమెను వదిలేస్తే తరవాత ఆమె గతి ఏమిటి?" అని ఆలోచించి, సాలె గూళ్ళో చిక్కుకుపోయిన కీటకం లా -  విల విల లాడుతూంటాడు.  అతని తండ్రి అప్పటికి మరణించాడు.  ముసలి తల్లి తన తోనే వుంటుంది.  కానీ ఆమె తో మానసిక సాన్నిహిత్యం తక్కువ. అతన్ని కాస్తో కూస్తో సానుభూతి తో చూసేది ఉమే.  కానీ ఆమె కూడా అశక్తురాలు.

ఈ నిర్మల విచిత్రమైన వ్యక్తి. ఆమె కి భర్త అంటే ప్రేమ లాంటిదేమీ లేదు. అతను ఆమె ఆస్థి!  సంపాదన. అంతే.  అయితే ఒక సారి హరీష్ కి కలరా సోకి, డాక్టర్ ఆశ వదులుకొమ్మని చెప్పినప్పుడు - నిర్మల ఏ మాత్రం చలించక,  దేవాలయానికి వెళ్ళి దేవుడి విగ్రహం ముందు కఠోర ప్రతిజ్ఞ చేస్తుంది.  "హరీష్ కి బాగయ్యే దాకా నేను ఇంటికి వెళ్ళను. ఒక వేళ అతనికి ఏమన్నా అయితే, నేనూ అతని తోనే వెళ్ళిపోతాను!"  అని!   ఒక్క పూటే  భోజనం చేసి, ఓ పదిహేను రోజుల పాటు ఆ దేవాలయం లోనే నిద్రపోయి, అక్కడే పూజలు చేస్తూ గడిపేస్తుంది. 

హరీష్ అదృష్టమో, దురదృష్టమో, నిర్మల అదృష్టమో అతనికి ప్రమాదం తొలగి, ఆరోగ్యం కుదుటపడుతుంది. దాంతో అందరూ నిర్మల ను సతీ సావిత్రి లాంటి నిబద్ధమైన పతివ్రత అని, పుణ్యాత్మురాలని అని, వేనోళ్ళ కొనియాడతారు. హరీష్ అదృష్టాన్ని లక్ష నోళ్ళతో పొగుడుతారు.  హరీష్ కోర్ట్ కి వెళ్ళినా, బార్ కి వెళ్ళినా, క్లబ్ కి వెళ్ళినా.. ఇదే ప్రస్తావన, నిర్మల ని ఆకాశానికి ఎత్తేయడం. అయితే ఈ నాటకం (!)   అంతా ఎరిగిన హరీష్ వాళ్ళందరికి కేవలం ధన్యవాదాలు చెప్పి ఊరుకుంటాడు.  అతనికి తన అదృష్టం మీద నమ్మకం ఎప్పుడో పోయి ఉంటుంది.  


అటు వైపు లావణ్య బాగా చదువుకుంటుంది. ఆమె తల్లి తండృలు కూడా మరణిస్తారు.  ఆమెకి వివాహమై, ఒక కొడుకు. కలకత్తా లో ఉద్యోగం. కానీ దురదృష్టవశాతూ ఆమెను వైధవ్యం వెంటాడుతుంది. అయినా చదువు అండదండలతో తన జీవితం తాను చక్కగా బ్రతుకుతుంటుంది.   కలకత్తా హై కోర్ట్ లో ఏదో కేస్ నిమిత్తమై వచ్చిన హరీష్ కి ఆమె అనుకోకుండా కలుస్తుంది. మామూలు స్నేహితుల్లా కలుసుకుంటున్నా, ఇంటి దగ్గర బల్లెం లాంటి మాటలతో పొడుస్తుండే నిర్మల,  కలకత్తాకి వెళ్తున్నావు గా,   లావణ్య ని కలుసుకున్నావా అని  ఎంత గుచ్చి అడిగినా, ఆమె ను కలుసుకోలేదనే చెప్తాడు హరీష్. 

హరీష్ బ్రతుకు అప్పటికే ఇంట్లో పని వాళ్ల ముందు, ఆఫీస్ లో సిబ్బంది ముందు అవమానాల పాలవుతుంది.  నిర్మల రెండు కళ్ళు,  పదింతలై అతన్ని చుట్టు ముట్టేసే వుంటాయెప్పుడూ.  వాళ్ళిద్దరూ ఇలాంటి ఘర్షణ తలెత్తినప్పుడల్లా రోజుల తరబడి మాటాడనే కోరు.  అతను ఎన్నో ఏళ్ళుగా వేరే గదిలో నో, తన ఆఫీస్ గదిలోనో పడుకుంటున్నాడు.  క్లబ్ లో, బార్ లో మాత్రం,  అతని పరిస్థితి మరీ తల్లక్రిందులై వుంటుంది.  నిర్మల ఎపుడన్నా - వృత్తిరీత్యానో  లేదా, అవసరార్ధమయినా,  ఒక స్త్రీ తోనో, ఏ విధవ క్లైంట్  తోనో మాటాడుతున్నపుడు అకస్మాత్తుగా అతని ఆఫీస్ లోకి చొరబడి హరీష్ ని వాళ్ల ముందే కేకలేసి, వాళ్ళ సంభాషణ విన్నానని అదీ ఇదీ అంటూ,  భర్తని వొదలమని  ఆ స్త్రీ ల కాళ్ళ మీద పడి ఏడవడం,  వాళ్ళు ఈ ఏడుపూ, అనుమానపు అభాండాల్ని తీవ్ర అవమానం గా భావించి వెళ్ళిపోవడం జరగడం వల్ల, ఇలా, ఆమె  తన పరువు గురించి అస్సలు ఖాతరు చెయ్యకుండా ప్రదర్శించే విపరీతమైన చెత్త ప్రవర్తన తో హరీష్ ని అందరి దృష్టి లో స్త్రీ లోలుడిగా,  నిర్మల  అంతటి పతివ్రతా నారి కి తగని వాడిగా  ఒక లాంటి చెడ్డ ఇమేజ్ ఏర్పడి. అతని పరిధి ఇంటి నాలుగు గోడలకీ, లేదా ఆఫీస్ కీ పరిమితం అవుతూ ఉంటుంది.  అదే సమయం లో లావణ్య అతనున్న ఊరికే,   'బాలికా పాఠ శాల ఇన్స్పెక్టర్' గా వస్తుంది.  

లావణ్య ది నిర్మలమైన మనస్తత్వం, కలుపుగోలుతనం. తను నిర్మల ఇంటికి వచ్చినపుడు,  హరీష్ ని తాను కలకత్తాలోనే కలుసుకున్న విషయం చెప్తుంది. నిర్మల లో అనుమాన పిశాచం బలపడిపోతుంది.  తన పెళ్ళి అంత ఆదరబాదరాగా జరగడానికి వీళ్ళ ప్రేమాయణమే కారణం అని గట్టిగా నమ్మడం వల్ల  - పైగా హరీష్ తనతో  లావణ్య ని కలుసుకోనే లేదని అబద్ధం చెప్పాడన్న విషయం అర్ధం అయి లావణ్య వెళ్ళగానే,  విపరీతమైన కోపం తో ఊగిపోయి భర్త ని పూర్తిగా తన మాటలతో, తిట్లతో, ఏడుపులతో, నాటకం తో చిత్తు చిత్తు చేసేస్తుంది. ఈ అవమానం, తన పేరు ముడిపెట్టి, లావణ్య ని కూడా పరోక్షంగా అవమానించడం, అనుమానించడం తో హరీష్ పూర్తిగా మానసికంగా దెబ్బ తింటాడు. ఉమ అతన్ని ఓదారుస్తుంది.

అయితే ఇవేమీ తెలీని లావణ్య హరీష్ ని తన కొడుకు పుట్టిన రోజు పార్టీ కి పిలిచినప్పుడు, ఆ ఊర్లో తాను తప్ప లావణ్య కి దగ్గరివారు ఎవరూ లేనందున నిర్మల కి భయపడకుండా, ఆమె ఇంటికి వెళ్తాడు హరీష్.  ఆ తిరుగుబాటు ను అసలు ఊహించలేక, భరించలేక  నిర్మల ఆత్మహత్యా యత్నం చేసి, నలుగురి లో తన ఇమేజ్ ని పెంచుకుని, తన పాతివ్రత్యాన్ని, పతి పట్ల ప్రేమనీ నిరూపించుకుని,  సమాజం సానుభూతి ని మూటగట్టుకుంటుంది.  హరీష్ మాత్రం నౌకర్లు, డాక్టర్ తో సహా అందరి అవహేళనల్నీ దిగమింగుకుని,  మరింత అంతర్ముఖుడైపోతాడు. ఏమిటీ జీవితం అని కలత చెంది ఆఫీస్ రూమ్ లో కూర్చుండిపోతాడు.

అతను ఆలోచనల్లో మునిగి ఉండగా వీధి లో శ్రీ కృష్ణ భజన కారులు గుమ్మం ముందుకొచ్చి గోపీ విరహ గీతాలు పాడుతుంటారు.  పెద్దయ్యాక, గోపికలని విరహినులను చేసి,  బృందావని ని విడిచిన కృష్ణుడు ఆ పాటల్లో విలన్ గా వర్ణించపడతాడు.  కానీ ఆ పాటని విన్న హరీష్ కి కృష్ణుడి తప్పేమీ లేదనిపిస్తుంది. పొద్దస్తమానం తనని ప్రేమతో, బంధనాలతో కట్టి పడేసే రాధ నుండీ కాసేపు దూరం పారిపోవాలని తనకి అనిపించదూ అనుకుంటాడు.  తనకి చనిపోయేదాకా ఈ భార్య అనే బంధనాన్ని భరించక తప్పదని - చావు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తూ  నైరాశ్యంలో మునిగిపోతాడు.  

నిర్మల సతీత్వం అతని చావుకొచ్చింది.  అనుక్షణం ఇన్సెక్యూరిటీ తో బాధపడిపోతూ, ఇతరుల సానుభూతి ని ఒక స్త్రీ గా ఇట్టే గడించేయగల నిర్మలని  పెళ్ళి చేసుకుని ఆమె భర్త అయిన పాపానికి ఆమె బారిన పడి,  జీవితం లో ఓడి,  మానసికంగా చచ్చిపోయిన హరీష్ కథ ఇది.  నిర్మల కి సమాజంలో ఎక్కళ్ళేని సానుభూతి.  పెళ్ళయిన నాటి నుంచీ తన సహ ధర్మ చారిణి గా జీవితం లో తోడు రావడం మాట అటుంచి, కేవలం ఒక హక్కు లా.. హుకుం చలాయిస్తూ - వేయి కళ్ళతో అతని కదలికల్ని అదుపుచేస్తూ,  మానసికంగా రక రకాల అవమానకరమైన మాటలతో కృంగ దీస్తూ  అతన్ని జీవచ్చవం లా చేసిన ఈ సతీమణి, బయటి ప్రపంచానికి పతివ్రతా శిరోమణి.  ఇలా హిందూ వివాహ వ్యవస్థ లో ఒక బలహీన పార్శ్వాన్ని శరత్ చందృడు 1934 లోనే చర్చించాడు.  తాను ధర్మ నిరతుడు, విడాకులిస్తే ఆమె గతి ఏమవుతుందని ఆలోచించగలిగే హరీష్ కి ఆమె భార్యాత్వం వల్ల ఏమి ఒరిగిందో ఆలోచిస్తే బాధ కలుగుతుంది.
---------------------------------------------------------------------------------------------------------------------------
Notes : 
1.  ఈ పెద్ద కథ - శరత్  కథ ల సంపుటి లోనిది.  పుస్తకం పేరు : "Devdas and other stories", ఇంగ్లీష్ లోకి అనువదించింది శ్రీ విశ్వనాథ్ .ఎస్. నరవనె.  ఈ పుస్తకం లో  సంక్షిప్తీకరించిన నవల  'దేవదాస్',  అనుపమా ప్రేమ, మహేష్ ,  అసంపూర్ణ నవల  "శ్రీకాంత" లో కొన్ని భాగాలు,  ఇలా కొన్ని  శరత్ ప్రసిద్ధ కథలు చేర్చారు.   నేను  ఆరోవిల్లె లో పుస్తకాల దుకాణం లో  ఇష్టంగా కొనుక్కున "ఇహపర" గాధా సంపుటి ఇది.   చేత్తో పట్టుకోవడానికి సులువుగా ఉండే చిన్న పుస్తకం. కథలు కూడా సరళమైనవి. హృదయాన్ని తాకేవి. మహమ్మద్ ఖదీర్ బాబు చెప్పిన సద్లక్షణాలన్నీ  అంటే అంటే  పుస్తకం సైజ్, ప్రింట్, కంటెంట్, ముఖ చిత్రం, అన్నీ సంతృప్తికరం. 

 2.  Sarat Chandra Chatterjee (Sarat Chandra Chattopadhyay):  ప్రసిద్ధ బెంగాలీ నవలాకారుడు, రచయిత, వివిధ భారతీయ భాషల్లోకి విరివిగా అనువదింపబడిన సాహిత్యం సృష్టించి, సినిమాలు, నవల ల ద్వారా చరిత్ర లో నిలిచిపోయిన వాడు.  

3. V.S.Naravane : VishwanathS Naravane - ఫిలాసఫీ ప్రొఫెసర్ గా  పూనె యూనివర్శిటీ  లో కొన్నాళ్ళు పనిచేసి, వివిధ అమెరికన్ యూనివర్శిటీల్లో కూడా  గెస్ట్ స్పీకర్ గా భారతీయ కళ, సాహిత్యం,  చరిత్ర, పౌరాణిక గాధలు,  ఫిలాసఫీ గురించి చర్చిచిన వ్యక్తి.  అతని ఇతర రచనలు :  Modern Indian Thought ; A Philosophical Study, The Elephant and the Lotus: Essays in Philosophy and Culture, Best Stories from Indian Classics, monographs on Tagore, Coomaraswamy, Premchand and Sarojini Naidu. 

***




09/01/2018

A Fine Balance - Rohington Mistry


ఎమర్జెన్సీ,  ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో మర్చిపోలేని చీకటి అధ్యాయం. దీన్ని గురించి ఎన్నో నవలల్లో విస్తారమైన చర్చ చదివాము.  మొన్న మొన్నటి "మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హాపీనెస్"  లో కూడా ఎమర్జెన్సీ నాటి అకృత్యాల గురించి ప్రస్తావన ఉంటుంది.   'ఎ ఫైన్ బాలన్స్'   లో కూడా ఆ డార్క్ డేస్ గురించి, అస్సలు తెలీని వాళ్ళని పాఠకుల్ని నివ్వెరపోయేలా చేసిన  కథలు ఉంటాయి.

కథ ఎమర్జెన్సీ చుట్టూ తిరగకపోయినా, అధిక భాగం,  అవే చీకటి  రాజ్యపు అన్యాయాలకి బలైపోయిన జీవితాల గురించి, ముఖ్యంగా కుల ప్రాతిపదికన,  విడిపోయిన సమాజం,  కులం పేరుతో జరిగిన అన్యాయాలు, చమార్ (పశు చర్మంతో చెప్పులు తయారుచేసే వాళ్ళు) లు, సామాజికంగా తమ జీవితాల్లో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించినపుడు  గ్రామంలో పెద్దమనుషులు వాళ్ళని కుటుంబ సమేతంగా సజీవ దహనం చెయ్యడం,    కాలేజీల్లో  ప్రాణాంతకమైన రాగింగ్,  ఓ పక్క దేశ రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ రాజకీయాలు, చెల్లెలినే తప్పుగా చూస్తూ పెరిగిన అన్న,  ఆర్ధికంగా పరిస్థితి తల్లక్రిందులైనా,  ఆధారం లేకపోయినా అటువంటి అన్న ని, అతని ఆస్థిని, అతన్ని జీవితాంతం తప్పించుకుంటూ, తిరిగే చెల్లెలు.   వీటన్నింటి మధ్యా ఓ ఫైన్ బాలెన్స్ ఇది.

ఒక (బొంబాయేనేమో) ఊహా నగరం లో ఒక పార్శీ కుటుంబం లో ఒకమ్మాయి,   గ్రామ స్పర్ధల్లో కుటుంబంలో అందరూ చంపబడగా మిగిల్న ఇద్దరు చమార్లు (వాళ్ళు అంటరానితనాన్ని తప్పించుకునేందుకు ఒక ముస్లిం స్నేహితుని సాయంతో దర్జీ పని నేర్చుకుంటారు),  వాళ్ళతో పాటూ, పెద్ద చదువులు చదివేందుకు నగరానికొచ్చిన  ఈ పార్శీ స్త్రీ స్నేహితురాలి కొడుకు,  వీళ్ళ ముగ్గురిదీ ఈ కథ.

దీనా దయాల్ ఒక పార్శీ  పెద్దమనిషి కూతురు. పార్శీల్లో అమ్మాయిలు ఎలా సాంప్రదాయంగా, అణుకువగా పెరుగుతారో అలా పెరుగుతుంది.  అయితే తండ్రి మరణానంతరం దాదాపు పిచ్చి దానిలా మారిన తల్లి కారణాన అన్నే ఇంటికి పెద్ద దిక్కవుతాడు, కానీ ఆ అన్నది వక్ర బుద్ధి.  పెద్దయ్యాకా మధ్య తరగతికి చెందిన ఒక మంచి మనిషిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, అతను రోడ్ ప్రమాదంతో మృతి చెందినా, అతనితో గడిపిన చిన్న ఇల్లే తన లోకం అనుకుని, ఇక పుట్తింటికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడకుండా, తనకు చాతనయిన కుట్టు పనితో కాంట్రాక్ట్  కి  బండెళ్ళ చొప్పున బట్టలు కుడుతూ, వయసు పెరిగాక, సాయానికి ఇద్దరు దర్జీలని అసిస్టెంట్లు గా పెట్టుకుని తన చిన్న వ్యాపారం నడుపుకుంటుంది.

ఆమె దగ్గ చేరిన దర్జీలే ఈష్వర్ దర్జీ, ఓం ప్రకాష్ దర్జీ.  వీళ్ళు ఇద్దరూ నిజానికి చమార్లు. కానీ కొంచెం చదువుకున్నాక  అంటరానితనం నేరమని తెలుసుకుంటున్న తరం అది.  చమార్ వృత్తి చేసుకుంటూంటే తామెన్నటికీ అంటరానివారి గానే మిగిలిపోయే ప్రమాదం ఉందని, బ్రతుకు తెరువు కోసం దర్జీ పని నేర్చుకుంటారు.  వీరి వృత్తి మార్పు గ్రామం లో మిగిల్న వారికి కంటగింపు అవుతుంది. చిన్న బేధాభిప్రాయంతో గ్రామ పెద్దల  తీర్పు ననుసరించి కొంతా, కుట్ర కారణంగా కొంతా, ఆగ్రహించిన గ్రామస్తులు వీళ్ల ఇంటికి నిప్పు పెట్టేస్తారు. కుటుంబం మొత్తం,  కుటుంబ పెద్దా,  తల్లీ పిల్లలూ, సజీవ దహనం అవుతారు.   ఆ సమయానికి ఇంట్లో లేని ఓం ప్రకాష్, ఈశ్వర్ దర్జీలే మిగుల్తారు.  వీళ్ళు దీనా దగ్గర  కూలీ దర్జీలు గా చేరి, తమ పనితనం తో మెప్పించినా, వీళ్ళకి  ఆ నగరంలో నిలువ నీడ లేదు.   రాత్రిళ్ళు రోడ్ మీద నిద్రపోవడం, బిచ్చగాళ్ల తోనూ, వీధి రౌడీల తోనూ, దొంగల తోనూ నిద్రపోవడం,  పగలంతా అలివి కానంత పని చేసి, రాత్రి సుఖంగా నిద్ర పోవడానిక్కూడా లేక,  రోడ్ మీద పడుకున్న వీళ్ళని ఒక రాత్రి (ఎమర్జెన్సీ సమయం లో) పోలీసులు వచ్చి లారీల్లో ఎక్కించి నగరానికి దూరంగా ఎక్కడికో బట్టీల్లోకి తీస్కెళ్ళి  వెట్టి చాకిరీ చేయిస్తారు.  తాము బిచ్చగాళ్ళం కామన్నా వినే నాధుడెవరూ లేరు.  అక్కణ్ణించి తప్పించుకున్నాక దీనా ఇంట్లోనే ఓ మూల నిద్ర పోగలగడం, ఒక మజిలీ. వీళ్ళ జీవితాల్లో. 

మూడో పాత్ర  సున్నిత మనస్కుడైన మానెక్ కోలా.. కొండల్లో (బహుశా హిమాచల్) ఉండే ఓ ఊరు నుండీ నగరానికి చదువుకోవడానికి వస్తాడు. అతని తల్లి ఒకప్పుడు దీనా స్నేహితురాలే.  తండ్రికి ఓ చక్కని కిరాణా షాపు.  అందమైన బాల్యం. కానీ చదువు కోసం నాలుగో క్లాసు నుండే బోర్డింగ్ స్కూల్లో పడిపోవడం అతని సున్నిత హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది.  తల్లీదండృలను విడిచి ఉండటం అతనికి అస్సలు ఇష్టం లేకపోయినా చిన్నప్పట్నించీ అతని గురించిన నిర్ణయాలన్నీ తల్లితండృలే తీసుకుంటూండడం, ఆఖరికి రిఫ్రెజరేషన్, ఏర్ కండీషనింగ్ కోర్స్ చేయడానికి నగరానికి రావడం జరుగుతుంది.  మొదట హాస్టల్లోనే ఉన్నా, అక్కడ భయంకరమైన రాగింగ్ ని భరించడం చాలా కష్టం అవుతుంది.  శవప్రాయంగా  మారిపోతున్న కొడుకుని చూసి భయపడి, తల్లి అతన్ని దీనా దగ్గరకి పీ.జీ గా ఉండేందుకు పంపిస్తుంది.  దీనా కి ఈ పేయింగ్ గెస్ట్ ఇచ్చే డబ్బులు అవసరమై ఒప్పుకుంటుంది.  మొత్తానికి ఈ నలుగురూ, దీనా ఫ్లాట్ లో ఎలాగో సర్దుకుని,  మెల్లగా మంచి స్నేహితుల్లా మారతారు.

కానీ కాల క్రమాన, దీనా ఉంటున్న ఇంటి ఓనర్ ఇంతమంది జనాల్ని చూసి గోల పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.  అప్పుడు ఓం ప్రకాష్ కి పెళ్ళి చెయ్యడానికి ఈశ్వర్ (ఓం ప్రకాష్ తండ్రికి అన్న ఈ ఈశ్వర్ - అంటే పెదనాన్న - కాబట్టి ఆ బాధ్యతతో)  సొంత  ఊరికి ప్రయాణం కడతాడు. మానెక్ చదువయ్యాక తల్లి తండృల ఆకాంక్ష మేరకు  దుబాయ్ కి వెళిపోతాడు.  చివరికి  ఒంటరితనంతో వేగలేక, ఆ  వృద్ధాప్యంలో  ఇంటి ఓనర్, తనను  ఇంటి నుండీ నెట్టేయాల్సి రావచ్చనేంత గా  పరిస్థితి వచ్చాక, దీనా తప్పనిసరై అన్నా, వదినల దగ్గరికి వెళిపోతుంది. 

అక్కడ  సొంత ఊరు ఏమీ అక్కున చేర్చుకోక పోగా, గ్రామ పెద్ద (ఠాకూర్) కుట్ర మూలంగా  ఈశ్వర్, ఓం ప్రకాష్ లు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ల కు గురి అవుతారు.  పరిశుభ్రత అన్నదే పాటించకుండా, జంతువులకు చేసినట్టు, పెళ్ళి కాని ఓం ప్రకాష్ కు కూడా వేసెక్టమీ చేస్తారు.  పరిశుభ్రత లేక జరిపిన ఈ ఆపరేసన్ వల్ల ఈశ్వర్ కాళ్ళు ఇంఫెక్ట్ అయి,  రెండు కాళ్ళనీ మూలం నుండీ  తీసేయాల్సి వస్తుంది.  దాంతో అన్యాయంగా అతను కాళ్ళు లేనివాడయిపోతాడు.     అదే వేసెక్టమీ కేంప్ లో,  కుల వ్యవస్థ మీద తన కుటుంబం తిరగబడిన పాపాన,  గ్రామ ఠాకూర్ డాక్టర్ కి లంచమిచ్చి ఓం ప్రకాష్ ని కేస్టరేట్ చేయించేస్తాడు.   ఇలా జీవితం చీకటిమయం చేసిన ఆ గ్రామం నుంచీ ఎలాగో నగరానికి చేరుకున్న దర్జీలకు మళ్ళీ తిండీ, నీడా గగనమవుతాయి. దీనా ఇప్పుడు ఆ ఇంట్లో లేదు.  కానీ ఎలాగో ఈ పాత స్నేహితులు కలుసుకుని,  ఎప్పుడో ఓ సారి, ఏ వారానికోమారో, దీనా తన అన్నా వదినలు లేని సమయాన వీళ్ళిద్దరికీ అన్నం పెట్టే ఏర్పాటు చేసుకుంటారు. 

అటు మానెక్ తండ్రి మరణానంతరం దుబాయ్ నించీ తిరిగొచ్చి,  తీవ్రమైన ఒంటరి తనానికీ, డిప్రెషన్ కూ గురవుతాడు. తండ్రి జ్ఞాపకాలు అతన్ని స్థిరంగా ఉండనివ్వవు.  ఆ మానసిక క్షోభ కు  తోడు గా , తన చుట్టూ జరుగుతున్న  అన్యాయాలు, ఆత్మ హత్యలు,  అతన్ని తీవ్ర నైరాశ్యంలో ముంచేస్తాయి. , పాత మితృలను కల్సుకొనేందుకు  వచ్చి,  దీనా ని కలుసుకున్నాక,  ఓం, ఈశ్వర్ ల జీవితాన్ని గురించీ విని, ఇంక తట్టుకోలేక, రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకుంటాడు.  ఇంత పెద్ద కథ ని, ఇంత నైరాశ్యాన్నీ, ఇంత ఒంటరి తనాన్నీ, ఇన్ని వ్యవస్థల్నీ, వివక్షల్నీ,  మన దేశంలో పాతుకుపోయిన సామాజిక దురాచారాల్నీ,  వాటి వల్ల నాశనమైపోయిన తరాల్నీ, ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయాన దేశంలో మరణించిన వ్యక్తి స్వాతంత్రాన్నీ,  కను మరుగయిపోయిన మానవత్వాన్నీ - అన్నిట్నీ కేనడియన్ రచయిత  రోహింగ్టన్ మిస్త్రీ  చక్కగా పట్టుకున్నారు.

పార్శీ ల సామాజిక వ్యవస్థ దగ్గర్నుంచీ, జుత్తు కోసం బిచ్చగాళ్ళని హత్య చేసే హంతకుడి దాకా, [బొంబాయి లాంటి]  నగరం ఎంత మందికి ఉపాధి ని ఇచ్చి, ఎన్ని జీవితాల్ని నిలబెట్టినా అక్కడి పేదరికంలో కూడా పాతుకుపోయిన వ్యవస్థ లు. ఎప్పటివో 1984 నాటి వరకూ పరిస్థితులు,  ఇందిర మరణానంతరం జరిగిన సిక్కు హత్యలు, అంతకు ముందు నుండీ జరుగుతున్న ఘోరాలు, కట్నాలు, చావులు,    అన్నిట్నీ చర్చించి, - ఇంత నిరాశ లో కూడా "కింద పెట్టనివ్వకుండా" చదివించారు రచయిత.  పేదరికమే అన్యాయం. దాన్లో అంటరానితనం ఇంకెంత అన్యాయం.  ఇలాంటి సాంఘిక దురాచారం ఉన్నంత వరకూ ఏ గ్రామ స్వరాజ్యాలు ఏర్పడతాయి ? ఏ దేశం సుభిక్షం అవుతుంది ? అనిపిస్తుంది.   ఎమర్జెన్సీ ఒక పీడ కల.  ఆ పీడ కలని మర్చిపోతే మాత్రం ప్రజాస్వామ్యానికే పెద్ద దెబ్బ.   ఇదీ ఈ ఫైన్ బాలెన్స్.


...................................................................................................................................................................
Notes:

ఎమర్జెన్సీ :  1971 ఎన్నికల తరవాత, "గరీబీ హాటావో" అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి, బలమైన మెజారిటీ తో కాంగ్రెస్ గెలిచాక, బాంగ్లా విముక్తి యుద్ధానంతరం (1971) భారత విజయం తరవాత ప్రతిపక్ష నాయకుని చేత "దుర్గా మాత"  గా పిలవబడ్డాకా,   ఇందిరా గాంధీ  (ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిర అనే భ్రమలో)   ప్రధాని గా దేశం మీద తన పట్టు ను మరింత బిగించేందుకు,   అప్పటికే రాజ్యాంగేతర శక్తి గా ఎదిగిన సంజయ్ గాంధీ కి మరింత అండ ని ఇచ్చేందుకు, ప్రధాన మంత్రి, ఆమె కోటరీ ఏకపక్షంగా, తీసుకున్న నిర్ణయాల పరిణామం.

25 జూన్ 1975 - 21 మార్చ్ 1977  దాకా ప్రధానికి సర్వోన్నతాధికారాలు కట్టబెట్టి,  సాధారణ ప్రజల జీవితాల్ని అల్ల కల్లోలం చేసిన సమయం.  ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతీ గొంతు నీ నొక్కి, వందలాదిగా ప్రత్యర్ధుల్ని జైళ్ళలో పెట్టి, పత్రికల్ని సెన్సార్ చేసి, పోలీసులకి అపరిమిత అధికారాలు కట్ట బెట్టి, జనాభా నియంత్రణ కోసం అంటూ  లక్షలాదిమందికి అమానవీయంగా, అశాస్త్రీయంగా  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి,  ప్రజల హక్కుల్ని కాలరాసిన సమయం.   రోడ్డు మీద బిచ్చమెత్తుకునే అభాగ్యులని కూడా వొదలకుండా ట్రక్కుల్లో తీసుకుపోయి వెట్టి చాకిరీ చేయించడం,  బీదవాడి బ్రతుకుని దుర్భరం చేయడం,   ఇలా ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన సమయం.