Pages

09/01/2009

మెట్రో మేన్ డాక్టర్ ఈ.శ్రీధరన్

ఢిల్లీ మెట్రో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఈ. శ్రీధరన్ – భారత దేశపు Metro Man గా, ఒంటిచేత్తో దేశ ఉపరితల రవాణా చరిత్రను తిరగరాసిన వ్యక్తి గా పేరు తెచ్చుకున్నారు. భారత దేశం లాంటి దేశంలో బ్యూరోక్రాటిక్ ఒడిదుడుకులనూ, రెడ్ టేప్ నూ సమర్ధవంతంగా చక్కబెడుతూ అనుకున్న సమయానికే ప్రాజెక్టులను పూర్తి చెయ్యగలగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన సాధించిన విజయం కేవలం ఇదే కాదు. డెడ్ లైన్లను అందుకోవడం, సమర్ధ వంతమయిన పనితీరూ, ఎవరూ వేలెత్తి చూపించలేని నిజాయితీ, ఒత్తిడికి లొంగని మనస్తత్వం – ఈ మెట్రో పురుషుడి ప్రభను ఇనుమడింప జేసాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమయిన ప్రాజెక్టులను ప్రణాళికా బద్ధంగా, నిర్ణీత వ్యవధి కన్నా ముందుగా, నిర్ణీత బడ్జెట్ లోనే ముగించగలగడం మామూలు విన్యాసం కాదు.

డాక్టర్ ఎలట్టువలపిల్ శ్రీధరన్ జూన్ 12, 1932 వ తేదీన కేరళ లో పాలక్కడ్ జిల్లాలో జన్మించారు. ఆయన పాల్ఘాట్ లో విక్టోరియా కాలేజీలో చదువుకున్నారు. కాకినాడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. కోజికోడ్ లో కేరళా పాలిటెక్నిక్ లో, ఒక సంవత్సరం పాటూ లెక్చరర్ గా పని చేసారు. ఆ తరువాత బాంబే పోర్ట్ ట్రస్ట్ లో అప్ప్రెంటీస్ గా పని చేసారు. ఆ తరవాత భారతీయ రైల్వే లో జాతీయ స్థాయి నియామకాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన్ను, మొట్ట మొదటి గా దక్షిణ రైల్వే లో ప్రొబేషనరీ అస్సిస్టంట్ ఇంజనీర్ గా నియమించారు.

భారతీయ రైల్వే లో అవిరళ కృషి,సంవత్సరాలుగా ఆయన సమర్ధవంతంగా నిర్వర్తించిన విధులూ, ఆయనకు పేరు ప్రతిష్ఠలను సంపాయించిపెట్టాయి. 1963 లో రామేశ్వరం ద్వీపాన్నుంచీ, భారత భూభాగానికి (Mainland) సముద్రంలో వేసిన పంబన్ రైల్ బ్రిడ్జ్ ఈ రోజుకీ ఒక ఇంజనీరింగ్ అత్భుతం గా నిలిచింది. పంబన్ బ్రిడ్జ్ విజయానికి గాను శ్రీధరన్ కు 1963 వ సంవత్సరానికి రైల్వే మంత్రి అవార్డ్ లభించింది. 1970 లో ఆయన్ను కలకత్తా మెట్రో ప్రాజెక్ట్ కు Dy Chief Engineer (Design, Planning & Implementation) గా నియమించారు. ఇది దేశంలోనే మొట్ట మొదటి మెట్రో ప్రోజెక్ట్. శ్రీధరన్ ఆధ్వర్యంలో కొచ్చిన్ పోర్ట్ కూడా రాణీ పద్మిని అనే నౌకను లాంచ్ చేసింది.

డాక్టర్ శ్రీధరన్ భారతీయ రైల్వే నుంచీ 1990 లో పదవీ విరమణ చేశారు. ఆ తరవాత ఆయన్ను ప్రభుత్వం కొంకణ్ రైల్వే కు సీ ఎం డీ గా నియమించింది. ఈ ప్రాజెక్ట్ ఎంత క్లిష్టమయినదంటే పశ్చిమ కనుమల్లో దట్టమయిన అరణ్యాల్లోంచీ, పర్వతాలూ, క్లిష్టమయిన దారుల్లోంచీ, మెత్తని మట్టి మీద బలమయిన రైల్వే లైను నిర్మాణం జరిగింది. సాధారణ రైల్వే సెట్ అప్ లో జరిగే జాప్యాలకు భిన్నంగా కేవలం ఏడు సంవత్సరాలలో మనిషికి ఏమాత్రం సహకరించని దారిలో 93 టన్నెళ్ళూ (సొరంగ మార్గాలు) (వీటిలో ఒక సొరంగం 83 కిలో మీటర్ల పొడుగు కలిగినది), 150 వంతెనలూ కూడిన 760 కిలో మీటర్ల రైల్వే లైను నిర్మించారు. భారత దేశంలోనే మొదటి సారిగా ఈ ప్రాజెక్టు లో బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (BOT) పద్ధతి ని ఉపయోగించారు. కొంకణ్ రైల్ విజయం లో తల ఎత్తిన కష్టాలనూ, అడ్డంకులనూ, సవాళ్ళనూ శ్రీధరన్ మొక్కవోని పట్టుదలతో, సమర్ధతతో ఎదుర్కొన్నారు.

ఢిల్లీ నగరంలో మెట్రో రైలు నిర్మాణం కూడా ఎంతో క్లిష్టమయిన ప్రాజెక్టు. ఢిల్లీ లో పురాతన, సాంప్రదాయ, చారిత్రాత్మక భవనాల మధ్య, వివాదాస్పదం కాకుండా, వివిధ ప్రదేశాల లో మొదలయిన పనిని అనుసంధానిస్తూ గడువు లో నిర్మించడం శ్రీధరన్ సమర్ధత కు నిలువెత్తు నిదర్శనం. ఢిల్లీ మెట్రో ఇప్పుడు లక్షలాది ప్రజలు సుఖవంతమయిన, వేగవంతమయిన ప్రయాణిస్తున్నారు. మీడియా ఈయన్ను మెట్రో పురుషుడిగా అభివర్ణించడం మొదలయింది. భారత దేశపు అత్యంత ప్రతిభావంతమయిన టెక్నోక్రాట్ గా శ్రీధరన్ గుర్తింపు పొందారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులూ, బిరుదులూ గెలుచుకున్నారు. 2001 లో పద్మ భూషణ్, 2005 లో ఫ్రెంచి ప్రభుత్వం నుంచీ చెవాలియర్ డి లా లీజియన్ డి హానర్, 2008 లో పద్మ విభూషణ్ అందుకున్నారు. ఢిల్లీ ఐ.ఐ.టీ ఆయనకు డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ సైన్స్ (ఆనరిస్ కాసా) తో సత్కరించింది. 2003 లో శ్రీధరన్ ను ఆసియా హీరోలలో ఒకరు గా టైం మాగజీన్ అభివర్ణించింది. శ్రీధరన్ 2008 లో CNN IBN ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం (పబ్లిక్ సర్వీస్) గెలుచుకున్నారు. 2002 – 03 సంవత్సరానికి గానూ లీడర్షిప్ మరియూ ఇంఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ విభాగంలో సీ ఐ ఐ జ్యూరర్ అవార్డ్ ఆయన్ను వరించింది. డాక్టర్ శ్రీధరన్ 2005 లో రిటైర్మెంట్ ను ప్రకటించారు. కానీ ప్రభుతం ఆయన పదవీ కాలాన్ని ఇంకో మూడేళ్ళ పాటూ పొడిగించింది. ఇపుడు పాకిస్తాన్ ప్రభుత్వం లాహోర్ నగర మెట్రో ప్రాజెక్ట్ కోసం శ్రీధరన్ ను సంప్రదిస్తూ ఉంది.

భారత దేశపు ఉపరితల / ప్రజా రవాణా వ్యవస్థ చిత్రాన్ని మార్చివేసిన మరియూ వృత్తి పట్ల నిభద్ధతా, నిజాయితీ లాంటి విలువలకు కట్టుబడి అద్వితీయ, అసమాన ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వ్యక్తి గా డాక్టర్ శ్రీధరన్ మిగిలిపోయారు.

(కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ జనవరి 2009 సంచిక నుంచీ)

3 comments:

చైతన్య.ఎస్ said...

హై.మెట్రో విషయంలో శ్రీధరన్ గారి అంచన నిజం కాబోతుంది అనుకుంటాను :)

Anil Dasari said...

రెండేళ్ల క్రితం ఢిల్లీ వెళ్లినప్పుడు స్థానిక స్నేహితుడొకడు అక్కడి మెట్రో గురించి బోలెడు బిల్డప్పిచ్చి ఓ మెట్రో స్టేషన్లోకి తీసుకెళ్లాడు. దాని ముందు భాగం స్లమ్ లా ఉంది. లోపల ఇంకెంత చెత్తగా ఉండబోతుందో అనుకుంటూ అడుగుపెట్టి షాక్ తిన్నాను. మన దేశంలోనే ఉన్నానా అనిపించింది. స్టేషన్, ట్రైన్లు అద్దాల్లా మెరుస్తున్నాయి. గేటు దగ్గరే సెక్యూరిటీ గార్డులు నిలబడి మెటల్ డిటెక్టర్లతో పరీక్షలు చేసి లోపలకి పంపుతున్నారు. పనిలో పనిగా ప్రయాణీకుల చేతుల్లో తినుబండారాలేవన్నా ఉంటే వాటిని లాక్కుని ట్రాష్ క్యాన్లలో పడేస్తున్నారు. ఢిల్లీ మహానగరంలో అంత పెద్ద భూగర్భ ప్రాజెక్టు అనుకున్నదానికన్నా తక్కువ సమయంలోనే పూర్తి చేశారని స్నేహితుడు చెబితే నమ్మలేకపోయాను. అప్పుడే శ్రీధరన్ గారి పేరు మొదటి సారిగా విన్నాను. ఇలాంటి వాళ్లు ఉండబట్టే అంత అవినీతున్నా మన దేశం ఈ మాత్రం బాగుంది. చక్కటి వ్యాసం రాశారు. ధన్యవాదాలు.

Anonymous said...

మరి ఇలాంటి శ్రీధరన్ పై రోశయ్య తదితరులు పరువునష్టం దావా వేయడానికి సిద్దపడ్డారు. పారం వారి పరువే పోతుందని ఆగారేమో. ఏది ఏమైనా మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు.