Pages

29/09/2025

Greek Lessons – Han Kang


సియోల్ లో ఓ క్లాస్ రూం లో ప్రాచీన గ్రీక్ భాష నేర్చుకునే విభాగంలో, గ్రీకు పాఠాలు చెప్పే 'పురుషుడు'  క్లాస్ లో ఉన్న ఒక మూగ 'మహిళ' తో ఏర్పరచుకునే కనెక్షన్ ఇది. ఇద్దరివీ భిన్న ధృవాలు. అతనికి వారసత్వంగా వచ్చిన చూపు ఇబ్బంది. క్రమంగా త్వరలోనే మసక కూడా మాయమయ్యి పూర్తిగా గుడ్డివాడుగా మారబోతున్న మనిషి.  అతను తన కండిషన్ ని దాచి, కేవలం గుర్తుంచుకున్న పాఠాల్ని బోర్డ్ మీద రాస్తూ, పాఠాలు నేర్పిస్తుంటాడు.  అతనినే,   బోర్డు మీద రాసిన తను  చేతి రాత చదవమంటే, సాధ్యం కాదతనికి.

 

ఆమె, పరిస్థితుల ఒత్తిడి తట్టుకోలేక, తన గొంతు కోల్పోయిన మహిళ. పూర్వాశ్రమంలో సొంతంగా చదివి పైకొచ్చిన కవయిత్రి, ఉపాధ్యాయురాలైన గతం ఉన్నా, తల్లి మరణం, తరవాత విడాకులు, తొమ్మిదేళ్ళ కొడుకు భాద్యతలని కోర్టు లో గెలుచుకోలేక, బలవంతుడైన మాజీ భర్తని ఎదిరించే శక్తీ, గొంతూ లేక, తన భాష ని, గొంతుని, జీవితేచ్చనీ కోల్పోయి, క్రమంగా మూగబోయిన మనిషి ఆమె. ఇద్దరి పేర్లూ తెలీవు.  అతను, ఆమె. అంతే.

 

తల్లి గా ఆమె ప్రయాణం, అపుడపుడూ ఇంటికి వస్తూండే కొడుకుతో గడిపే సమయం మాత్రమే ఆమెను  బ్రతికుంచే బంధం. ఈ మధ్యనే, తండ్రి తనని ఇక తల్లి దగ్గరకు పంపీయబోవట్లేదని, ఇద్దరినీ దూరంగా ఉంచేందుకు, తనని ఎక్కడికో దూరంగా పంపేయబోతున్నాడనీ చెప్పినపుడు, ఆమె మనసులో పిడి బాకు దిగినట్టయి, పూర్తిగా మూగబోతుంది. 

 

ఆవేశంలో, కోపంలో, ఆక్రోశంతో భర్తకు ఫోన్ చేసినా, గొంతు పెగలని దీనత.  తనని బ్రతికున్నాళ్ళూ ప్రోత్సహించి, దన్నుగా నిలబడిన తల్లీ చనిపోయి, ఇటు పిల్లాడూ దూరమయి, ఒంటరి అయిపోతుంది. ఈ మహిళ, ఎవరికీ అక్కర్లేని ఓ మృత భాషని నేర్చుకుని, ఏమి సాధించాలనుకుంటుందో తెలీదు. ఒకవేళ ఆ గ్రీకు భాష నేర్చుకున్న,  దానిని పలకడం ఎలా సాధన చేస్తుంది. చేసినా ఎవరితో మాటాడడానికి ?   తెలీదు. క్రమం తప్పకుండా క్లాసు లో సమయానికి హాజరు కావడం, టీచర్ చెప్పినవి పెన్సిలు తో నోట్ చేసుకోవడం, ఎవ్వరితోనూ మాట మాత్రం మాటాడకుండా, కనీసం తను మూగది అన్న విషయం కూడా తెలియనీకుండా, క్లాసు లోంచీ వెళిపోతుంటుంది.

 అతను ఆమెను గమనిస్తాడు. క్లాసులోనే. ఈ శోకదేవత మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. ఆమె కథ మధ్య మధ్యలో చాప్టర్లలో వస్తుంది. కథ మెల్లిగా విసుగు నుండీ నడిచి, చిక్కబడుతూ, ఇద్దరి బాధల్నీ చెప్తుంది. పాఠకుడి మనసు కరుగుతూ, ఈ అన్యాయానికీ, దురదృష్టానికీ, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులనుండీ ఆమె బయటపడితే బావుణ్ణనిపిస్తుంది.

 అతను కొరియన్ అయినా, జెర్మనీ లో పెరిగాడు. అతని కంటి డాక్టరు కూతుర్ని ప్రేమిస్తాడు. ఆమెకు అతని క్రమేపీ పోతున్న కంటి చూపు గురించి తెలుసు. ఆమె పదే పదే గుర్తొస్తు ఉంటుంది. తల్లి, చెల్లెలు, జెర్మనీ లో నే ఉంటారు. ఇక చూపు కోల్పోవడం ఖాయం, తన తండ్రికి ఇలానే జరిగింది. అసలది ఎలా ఉంటుందో నేర్చుకోవాలని అతనికి తోచింది. పూర్తిగా చూపు పోయే ముందు సియోల్ వెళ్ళాలనుకున్నాడు. గ్రీకు లాటిన్ లు వచ్చు కాబట్టి ఈ పాఠాల ఉద్యోగం దొరికింది. ఒక్కడూ సియోల్ లో ఉంటున్నాడు. తన దారులు, ఇంటి కొలతలు, వైశాల్యాలు, వీధి వెలుతుర్ల బట్టీ సమయాన్ని చెప్పగలగడం, తనంతట తానే నేర్చుకుంటున్నాడు. చెల్లెలు ఉత్తరాల ద్వారా ప్రోత్సహిస్తూంటుంది. క్రమేపీ ఆమె ప్రోద్బలంతో బ్రెయిల్ నేర్చుకుంటాడు. చెల్లెలు బ్రెయిల్ లో నే రాస్తుంది.  కళ్ళ నిండా చీకటి అలముకున్నాక ఎలా జీవించాలో నేర్చుకోవడం అతనికి అవసరం.

 అతని చూపు పూర్తిగా కోల్పోబోయే ముందు దశ లో ఆమెను చూస్తాడు. ఆమె అతనిలో ఎన్నో జ్ఞాపకాలని తట్టి లేపుతుంది. చెల్లెలికి రాసే ఉత్తరాలలో ఆమె గురించి రాస్తాడు. పెద్దగా తెలీదు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి. ఒకసారి ఆమె నోట్ బుక్ లో గ్రీకు అక్షరాలతో కవిత లాంటిది రాస్తుంది. ఆమె క్లాస్ మేట్ 'ఈమె కవిత రాసింది " అంటాడు. అతనికి ఆశక్తి కలుగుతుంది. మాట్లాడబోతాడు. ఆమె వెంటనే నోటు బుక్ మూసేసి, క్లాసు నుండీ వెళిపోతుంది. ఆమెకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు.  తల్లి దగ్గరికో, కొడుకు దగ్గరికో వెళ్ళలనిపిస్తు ఉంటుంది.  మధ్య మధ్యలో పిల్లాడి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఒకరినుంచి ఒకరు దూరం కాబోతున్నామని తెలిసాక, ఆమె లో ఆప్యాయత, వాత్సల్యం ఎక్కువవుతాయి. ఆమెది భర్త కన్నా చాలా తక్కువ ఆదాయం వచ్చే జాబ్. అందుకని పిల్లాడి  సంరక్షణ    కోర్టు తండ్రి చేతిలో పెడుతుంది. అతనికి అర్ధబలం, కంఠబలం ఉన్నాయి. ఆమె తనమీద పడుతున్న ఈ  దెబ్బ మీద దెబ్బలకు తల్లడిల్లి సగం, మనిషి జీవితాన్ని కల్లోలం చేయగల మాటలంటే, అసహ్యం పుట్టి సగం, క్రమేపీ తన గొంతుని, మాటలను పెగిల్చే సామర్ధ్యాన్నీ కోల్పోతుంది.

 పేజీల కొద్దీ ఇద్దరి విషాదమూ ఎస్టాబ్లిష్ చేసాక, ఒకరికొకరు ఎదురు పడుతూనే ఉన్నా మాటాడుకోని ఇద్దరూ, ఒక సారి అనూహ్య పరిస్తితుల్లో ఒక చోట చేరాల్సొస్తుంది.  అతను క్లాస్ కు రోజూ లా రాడు. ఆమె ఎదురు చూస్తుంటుంది. ఆరోజు అతను ప్రమాదవశాతూ, ఒక కాలేజీ లోనే  భవనం బేస్మెంట్ మెట్ల మీంచి పడిపోతాడు. కళ్ళజోడు విరుగుతుంది. వాటిని వెతికే క్రమంలో చేతులకు గాయాలవుతాయి. చీకటి పడబోతుంది. రక్షించే నాధుడు లేడు. అతనికి ఏమీ కనిపించదు. ఆమె అతనెందుకు రాలేదా అనుకుని  క్లాసు నుండి వెనక్కి మళ్ళినపుడు ఎక్కడో లీలగా అతని గొంతు వినపడుతుంది. ఆమె అతన్ని ఆ బేస్ మెంట్ నుండీ జాగ్రత్తగా పైకి తీసుకొస్తుంది. అతనిని మొదట హాస్పిటల్ కీ, తరవాత అతని ఎపార్ట్ మెంట్ కీ చేరుస్తుంది.  ఆమె కు మాటలు రావని అతనికి ముందే తెలుసు. అతనికి వచ్చిందల్లా జెర్మన్ సైన్ లాంగ్వేజ్ ! ఆమెకు వినబడదేమో అనుకుని, ఆ సైన్ లాంగ్వేజ్ లో  మాటాడడానికి ఇంతకు ముందు ప్రయత్నించాడు కూడా.

 

కానీ ఆమెకు అతను గుడ్డివాడని తెలీదు. కళ్ళ జోడు లేని అతని ముఖాన్ని ఆమె అప్పుడే అంత దగ్గరగా చూడడం. అతని దెబ్బ తాకని ఇంకో అరచేతి మీద చూపుడు వేలితో మెల్లగా వాక్యాలు రాస్తూ, కమ్మ్యూనికేట్ చేస్తుంది. అతను టాక్సీ లో కూడా తాను వెళ్ళాసిన చోటి గురించి స్పష్టంగా చెప్తాడు. ఆమె అతని ఇల్లు చేరాకా, ఆపకుండా ఆమెతో లొడ లొడా మాటాడతాడు. బయట చీకటి పడబోతుంది. చేతి గాయానికి కట్టు ఉంటుంది. ఆమె అతని మాటల్ని చాలా సేపు మౌనంగా వింటుంది. అసలు ఆమె తన గదిలో ఉండడం, తను పూర్తిగా గుడ్డివాడయ్యే సమయానికి ఒక ప్రాణి తనకు తోడుగా ఉండడం, అతనికి ఊరటనిస్తుంది. అంతవరకూ మసకబారిన చూపుతో నెట్టుకొచ్చిన అతనికి ఇదే అంతం అనీ, ఈ మాత్రం కూడా ఇకపై తనకు కనబడదనీ అర్ధం అయింది. అతనికి స్వాంతన కావాలి. ఆమె అతని ఎదురుగా బెంచ్ మీద కూర్చుని ఉంది. అతను వస పిట్ట లా తన గురించి చెప్తూనే వుంటాడు. ఆమె నిశ్శబ్దంగా అతని పెదవుల నుంచీ వెలువడుతున్న హృదయ భాషని వింటుంది. చూపు కోల్పోతూ తాను ఎదుగుతున్నపుడు తను చూసిన కలల్ని చెప్తాడు. "కలల్లో నేను చాలా అత్భుతాలని చూస్తాను. వాటర్ మెలన్ లో ని ఎరుపుని చూస్తాను. బుద్ధుడి పుట్టినరోజు వేడుకలు చూస్తాను. మంచు రాలుతున్నదీ చూస్తాను. కానీ కల ముగిసి, కనులు తెరిచి లేచానంటే, ఇంకేమీ కనబడన్న బెంగతో లేస్తాను. నా రంగులన్నీ కలలకే పరిమితం." అంటాడు.   చాలాసేపు వింటుంది. కానీ చీకటి పడుతుంది. వర్షం కూడా పడుతుంది. ఇక నేను వెళ్ళాలి అని అతని చేతి మీద రాసి చెప్తుంది. అతనికి ఆమెను వెళ్ళనీయకూడని, ప్రాధేయపడాలనుంది. కానీ ఏమన్లేకపోతాడు. ఆ రాత్రి పెద్ద వర్షం. ఆమె తన రూం లో లేదని అర్ధమయి, అతను చాలా సేపు ఏడుస్తాడు.

 ఆమె మనసు స్పందనల గురించి అతనికి ఏమీ తెలీదు. ఆమె బాధలు ఆమె చెప్పుకోలేదు. ఆమె పెదవులు ఒక టేప్ వేసి అంటించినట్టు, మాటలకు మాత్రం కదలవు.  ఆమె రూపం ఇకపై లీల గా కూడా అతనికి ఇకపై తెలియదు. ఆ రాత్రి అతను అనుభవించిన ఆవేదన చెప్పలేనిది. పొద్దున్న తెల్లవారినట్టు, కిటికీ లోంచీ పడే వెలుగు తీవ్రత బట్టి తెలుసుకుంటాడు. అతనిని మళ్ళీ హాస్పిటల్ కు తీసుకెళ్ళేందుకు ఆమె మళ్ళీ వచ్చింది.  ఆమె నుండీ వచ్చే ఏపిల్ సెంట్ ని అతను గుర్తు పడతాడు.  ఈ సారి ఆమె వచ్చినట్టు తెలిసి, అతని గుండె ఉప్పొంగిపోతుంది.  అతనిని రెడీ అవమని చెప్పి బల్ల మీద కూచున్న ఆమెను సమీపించి, భుజాలను పట్టుకునిఎన్నో యుగాలుగా మూగబోయిన ఆమె పెదవులను ఇక వీడలేనంత బెంగతో ముద్దు పెట్టుకుంటాడు. ఆమె కూడా అతని ముఖాన్ని తన చల్లని కోమలమైన చేతులతో లాలనగా స్పృశిస్తుంది. 

 వాళ్ళ జీవితాలతో కలిసి ప్రయాణం చేసిన పాఠకుడు ఎమోషన్ తో కదిలిపోతాడు. ఇద్దరినీ కలిపే శక్తి ఏదయినా, ఆమెకు ఇకపై అతనిచ్చే ప్రేమతో మాటలాడగలే సామర్ధ్యం వస్తుందేమో, ఇద్దరూ ఒకరికొకరు తోడు గా నిలబడతారేమో, అతని తల్లి, చెల్లెలు, ఈ పరిణామానికి ఎంత ఆనందిస్తారో, అతను ఆమెకు గొంతయి నిలబడతాడు, ఆమె అతనికి చూపు !  హమ్మయ్య!! అనుకుంటాడేమో పాఠకుడు.  తెలీదు. ఒక రచన ఇదీ అని చెప్పకుండా ముగిసినపుడు ఆయా పాత్రలతో కలిసి, వాళ్ళ చేతుల్లో చేతులేసి నడిచి, వాళ్ళని సమీపం నుంచి చూసాక కలిగే దగ్గరితనం సాధించడం రచయిత 'సృష్టి' సాధించిన విజయం.  ఎంతయినా రచయిత్రి ప్రతిభ కలది. ఆవిడ ఇంతకు ముందు రాసిన 'వెజిటేరియన్' ను సరిగ్గా అనువాదం చేయలేదనీ, మూలం ఇంకా అత్భుతంగా ఉంటుందనీ ఎందరో అభిమానులు వాపోయారు.  నాకు ఇదే మొదటి హాన్ కాన్ నవల. నచ్చింది.

 ***

 

 

28/09/2025

ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర - M.ఆదినారాయణ


 

ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర 2019 లో మొదటిసారి  (ఆదినారాయణ గారి వెర్షన్) ప్రచురితం అయింది. ఒక పాత రచనని ఇంతగా సంస్కరించిఈ కాలానికి చెందిన పాఠకుడికి అర్ధం అయేందుకు చేయాల్సిన మార్పులు చేసి స్కెచ్ లు వేసి,  ఆ కాలంలో ఆయా ప్రాంతాలు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు వీలుగా ఉండే  పెయింటింగ్ లు సేకరించి అందంగా కూర్చిచాలా శ్రద్ధగా తీసుకొచ్చిన పుస్తకం / యాత్రా సాహిత్యం లో మైలురాయి. 2023 లో రీప్రింట్  అయింది. ఈ పుస్తకం అందరికీ అర్ధం కావడానికీదీనిని ప్రచురించేందుకు రచయిత చేసిన ప్రయత్నమూకృషీ - చాలా మెచ్చుకోదగ్గవి. ఎన్నో పరిచయాలు చదివిఎన్నో మెచ్చుకోళ్ళు వినిఎన్నో ఏళ్ళ తరవాత తెప్పించుకోగలిగిచదివినందుకు పూర్తి తృప్తి ని ఇచ్చిన పుస్తకం. 

 "పుస్తకం గురించి ఎన్నో వ్యాసాలు అందుబాటులో ఉన్నందునఈ పరిచయం ముఖ్యంగా నాకు నేను రాసుకునే లాగ్ ఎంట్రీ కాబట్టి నచ్చిన కొన్ని విషయాలు రాస్తున్నాను. 

  ఏనుగుల వీరాస్వామి (1780-1836) రాసిన కాశీయాత్రా పుస్తకం ఆయన జీవించి ఉండగా ముద్రణ కాలేదు. మొదటిసారిగా 1839 వ సంవత్సరంలో ఆయన ప్రాణ స్నేహితుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ దీనిని ముద్రించాడు. 1869 లో దీన్ని ఎలాంటి మార్పులు లేకుండా బ్రిటీషు గవన్రమెంట్ ప్రచురించింది. మూడవసారి దిగవల్లి వెంకట శివరావు ఎడిట్ చేసిఅధ్యాయాలుగా విభజించివాక్యాలకి కామాలు ఫుల్ స్టాపులుఫుట్ నోట్స్ ఇచ్చి 1941 లో విజయవాడ లో ప్రచురించారు. 1973 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీషులోకి అనువదించారు. తరవాత తెలుగు విశ్వవిద్యాలయం వారుతరవాత ఏషియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్న్యూడిల్లీ వారు 1991, 1992 లలో ముద్రించారు. 2014 లో రీంస్ పబ్లికేషన్స్ వారు తెలుగు అంకెల్ని మార్చి మొదటి సారి హిందూఅరబిక్ అంకెలు వేసారు.  

 1993 లో ఆదినారాయణ గారు ఈ కాశీ యాత్ర చరిత్ర చదివిఅది చదివేందుకు చాలా ఇబ్బందులు పడిదీన్ని సరళీకరించడానికి ప్రయత్నించిపుస్తకం వెనకున్న చరిత్రని తవ్వి తీసిఏనుగుల వీరాస్వామి తాను బ్రతికి ఉన్న రోజుల్లో బ్రౌన్ కి అందచేసిన కాపీని కూడా సంపాదించి తేడాలు గుర్తించిఎంతో కృషి చేసిఇప్పుడు మనం చదవగలుగుతున్న పుస్తకాన్ని తిరిగి రాసారు.  ఇంత శ్రద్ధఅంకితభావంచరిత్ర పట్లమనుషుల మధ్య ఉండాలిసిన గౌరవం వల్లఈ పుస్తకం ఇప్పటి రూపం లో మనకి దొరుకుతుంది.  180 సంవత్సరాలుగా మార్కెట్ లో ఉన్న ఈ పుస్తకానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గలేదు.

ఆరోజుల్లో కాశీ వెళ్ళాలంటే ప్రాణం మీద ఆశవదులుకుని చేస్తూండే సుదూర ప్రయాణాల్లో ఆత్మవిశ్వాసంతోవీరాస్వామి ఎంతో  నాలుగువేల కిలో మీటర్లువందమందితో కలిసి ప్రయాణం చేసాడు. దీనిలో గంగమీద వెయ్యి కిలోమీటర్ల పడవ ప్రయాణం కూడా ఉంది. అతనికి ఉన్న తెగువప్రతిభదహిర్యంతపనడబ్బు ఎవరికీ లేవు. అతని ముందు ఎందరో పెద్దలురాజులు కాశీ ప్రయాణం చేసినాఇతనిలా ఆ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసినది ఎవరూ లేరు.  పైగా భార్యతో పాటూ తన తల్లిని కూడా ఇంత దూరం పల్లకీ యాత్రకు తీసికెళ్ళి క్షేమంగా తీసుకొచ్చాడు. 

 అతని ప్రయాణంలో ప్రతి ఊరూప్రతి రోజుప్రతీ తేదీసమయమూవాగువంకరోడ్డూడొంకాఅన్నీ రికార్డ్ అయ్యాయి. డోలీల ప్రయాణం కాబట్టినడవాల్సిన  నేల స్వభావంవాతావరణంమధ్యలో కుదుర్చుకున్న బోయీలుమార్గంలో  విడిది సౌకర్యమూటెంటులూవాటిక్కావల్సిన పనిముట్లూదారంతా కొనుక్కోగల/కొనుక్కోవాల్సిన వంట ద్రవ్యాలుపరిచయాలుసిఫార్సు లేఖలుఎదురొచ్చిన జబ్బులూచేతికాపుకొచ్చిన మందులువివిధ ప్రాంతాలలో ఆచార వ్యవహారాలుముఖ్యంగా రక రకాల ప్రాంతాలలో చలామణీలో ఉన్న డబ్బునాణాలుకొలతలుకాలాలు గురించి చక్కని సమాచారం తో,  దుర్గమమైన అరణ్యాలలో ప్రయాణించి కూడా తాను తీస్కెళ్ళిన వాళ్ళందరిని తిరిగి క్షేమంగా చెన్నపట్నం చేర్చగలగడందాదాపు ప్రతిరోజు ప్రయాణం గురించీతన స్నేహితుడు శ్రీనివాస పిళ్ళకు  క్రమం తప్పకుండా ఉత్తరాల ను రాయడం వల్ల ఈ పుస్తకం రావడం సాధ్యపడింది.

 ఎన్నో వ్యాసాలుఈ పుస్తకం గురించి అందుబాటులో ఉన్నా,  180 సంవత్సరాల క్రితం,  కొన్ని తెలిసిన స్థలాల గురించి, ఆయన అబ్సర్వేషన్ నచ్చింది.  ఇప్పుడు మనమూ భూలోకమే అదిరిపోయేంతటి  దేశ విదేశ యాత్రలు చేస్తున్నాం. లక్షల రూపాయలు చెల్లించి 'చార్ ధాం' యాత్రలని మోగించి, హిమాలయాలని నాశనం చేసాం.  వెళ్ళిన ప్రదేశాలలో బాక్సులు టిక్ చేసుకోవడం, సోషల్ మీడియా లో ఫోటోలు పెట్టుకుని మురిసిపోవడం తప్ప చూడబోయే / చూసిన ప్రదేశాల గురించి కనీస అవగాహన కూడా లేకుండా కూడా ప్రయాణిస్తున్నాం.    ఆ కాలంలో, యాత్ర పొడుగునా ఆయన ప్రయాణించిన ఊర్లలో కొన్నిటి గురించి,  ఆయన రాసిన వివరాల్లోంచి,  చిన్న పేరాలే ఇస్తున్నాను. వీటిలో వెళ్ళిన ప్రదేశం గురించి, అక్కడి  చిన్న చిన్న విషయాల గురించి కూడా ఆయన ఎంత కుతూహలంగా విషయసేకరణ చేసి ఉంటాడో అనిపించింది.  

 తిరుమల :-

 ఎగువ తిరుపతి స్వామికి చెల్లుబడి అయే ప్రార్ధనల వల్ల కుంఫిణీ (ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి సుమారు లక్ష రూపాయలు ఆదాయం వస్తూ ఉంది.   సత్కార్యం  అయినా ఎగువ తిరుపతిలో జరిపించడానికి సర్కారుకు రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ పరమాత్ముడు సంపూర్ణ కటాక్షంతో ప్రతిఫలించిలోకుల పాపాన్ని వారి రూపాయలగుండా హరించి ఇష్ట సిద్ధి చేస్తూ ఉన్నాడు. 

 

హైదరాబాదు :

 కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్టు ఈ షహరుకు మొహరం పండుగ ప్రబలమైన ఉత్సవం.

 అన్ని విధాలైన ఆరాధనలను అంగీకరించి "యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ" (నీకు ఎలాంటి భావన వుంటేసిద్ధి అలానే జరుగుతుంది) అనే న్యాయ ప్రకారం లోకుల ఇష్ట సిద్ధిని చేసే పరమాత్ముడు ఒకడే గనుక ఈ ఉత్సవ కాలంలోపరమాత్మ చైతన్యం ఇక్కడ ప్రతిఫలించుట చేతఈ స్థలంఈ కాలమందు పుణ్యస్థలమని భావించి ఇక్కడ పండుగ రోజుల్లో నన్ను ప్రవేశపెట్టినందుకుఈశ్వరుణ్ణి చాలా కొనియాడాను.

సికిందరాబాదు :

 కంపెనీ ఉండే స్థలం సికింద్రాబాద్హైదరాబాదు కన్నా దినదినానికీ ఎక్కువగా బస్తీ అవుతూ ఉంది. ఇరవై సంవత్సరాల కింద నేను చూచినప్పటికన్నఇప్పటికి ఆశ్చర్యకరమైన్ బసీ అయింది. షహరులో వస్తువులకు సుంకం లేదు. ఏ వస్తువు మీద సుంకానికి ఎవరు ఊహిచి ధరకాస్తు చేసినా దివాన్ జీ సుంకం గుత్త కి ఇస్తాడు. కట్టెల బళ్ళకువిస్తరాకులకుషహరులోకి రావడానికినాలుగైదు రకాల సుంకాలు విధిస్తారు. పన్ను విధించే వారు ఎంతంటే అంత ఇవ్వవలసిందే. ఇంగ్లీషు దండులో ఈ ఇబ్బంది లేకుండా న్యాయవిచారణ కూడా కొత్వాల్ చావడి లో కమీసరియాట్ అసిస్టెంటు ద్వారా జరుగుతుంది. అందువలన ప్రజలువర్తకులు ఈ దండులో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు.

శ్రీశైలం :

 1830, జూన్ 17 వ తేదీ గురువారం మద్యాహ్నం మూడు గంటల వరకూ శ్రీశైలం మీద గుళ్ళో కళ్యాణమండపంలో ఉన్నాను. గుడికి రెండు ప్రాకరాలు ఉన్నాయి. బయటి ప్రాకారం గోడామీద శివలీలలుశృంగారమైన ప్రతిమలు ప్రాకారం నాలుగు పక్కలా గోడ మీద చెక్కబడి ఉన్నాయి. అర్చకులకు సమ్మతి అయినప్పుడే స్వామికి నైవేద్య దీపారాధనలు చేతున్నారు. భ్రమరాంబా  దేవికి మాత్రం మిరాసి అర్చకుల తరఫున ఒకడు నియమంగా గుళ్ళో కాపురం ఉండి అర్చన చేస్తూ ఉంటాడు. అలా అర్చన చేసే గుమస్తా ఒక సవత్సరం పాటు ప్రాణంతో నివడం దుస్తరం. ఈ గుళ్ళో లింగం  భూమికి జానెడు పొడుగుగా ఉన్నది.    గుళ్ళో ఎక్కడ చూచినా అడవి మొలిచిపాములుపులులకు నిలయంగా మారింది. ఈ అడవిని కొట్టి చక్కగా చేసే దిక్కు లేదు.   అయినా ఇది సర్వజన పూజితమైన ప్రసిద్ధి పొందిన స్థలం.  శ్రీశైల శిఖర దర్శన మాత్రం చేతనే జన్మాదులు లేవని పురాణాలు మొర పెడుతున్నాయి. ఈ స్థలానికి వెళ్ళిఇక్కడ ప్రతిఫలించే పరమాత్ముడి చైతన్యాన్ని ఆరాధించగలిగినందుకు భగవంతుడిని హృదయపూర్వకంగా నమస్కరించాను.

 కాశీ:

 ఇక్కడ ఉండే ఆలయాలు అన్నీ చిన్నవి గానూఅరటి పువ్వు లాంటి సౌదాశిఖరాలు కలిగి ఉన్నాయి. వాటిల్లో అర్చకులు సరిగ్గా లేకపోవడం వలన ఎద్దులతోఆవులతో నిండి ఉన్నాయి.  ఆరాధనలు చేసేవారు పత్రంపుష్పంఫలంతోయం తో వారే తోచినంత మటుకి ఆయా మూర్తులను జాతినియమాలు లేకుండా ఆరాధిస్తున్నారు. అక్కడ కాచుకుని ఉండే అర్చకులు ధనికుల వద్ద యాచన చేస్తూ పేదవారు ఇచ్చినది తీసుకుంటున్నారు.

 ఈ కాశీలో ఉండే ఉపద్రవాలు మూడు అని చెప్పుకోవడం ఉంది. అది ఏమంటే రాండుసాండుచీడీ అనే మూడు ఉపద్రాలు. (వేశ్యలువృషభాలుపెద్ద పెద్ద మెట్లు)

 భిక్షాటకులుగా చాలామంది బైరాగులతో పాటుగా తిరుగుతుంటార్. కంగాళీలు అనే భిక్షాటకులకు లెక్కే లేదు. సవారీ సమేతంగా యాత్రకి వచ్చే వారిని యాచించే కంగాళీలుఫకీరులుగల్లీలలో సవారీని సాగనివ్వరు. ఇచ్చినా తృప్తి చెందరు. ఇవ్వని వారి గతి చెప్పనక్కరలేదు.

కలకత్తా:

 ఈ కలకత్తా షహరుకి 10 కిమీ దూరంలో దక్షిణంగా ఒక కాళీ గుడి ఉంది. దీనికి విశాలమైన గర్భ గృహంముఖ మండపం ఉన్నాయి. ఆ గుడికి దగ్గర లోనే గంగ వాగు ఒకటి పారుతూ ఉంటుంది. బంగాలీ వారికి కాళీమాత ప్రత్యక్ష దేవత. ముప్ఫయి రూపాయలతో వస్త్రసమేతంగా షోడసూఅపచార పూజ జరుగుతుంది. భిక్షకులు వెయ్యిమందికి తక్కువ ఉండరు.  ఈ దేశాన్ని గౌళ దేశమనివిరాట దేశమనీ చెప్తారు. ఇక్కడ శిష్టులు అయిన బ్రాహ్మలు కూడా సహజంగా మత్ష్యభక్షణ చేస్తారు. నాలాంటి అతిధులు వచ్చినపుడు లేత చేపల కూరని ఇతర తినుబండారాలతో పాటు పంపిస్తుంటారు.

 ఈ నగరంలో ఇరవై ముప్ఫయి లక్షలు కలవారు నూటికి రెండువందల వరకూ ఉంటారు. ఇది బస్తీ అవడంతో గొప్పవారి ఇళ్ళన్నీ ఇంగ్లీషు వారి తరహాలోనే కట్టుకున్నారు. కోటా చుట్టూ ఎస్ప్లనేడ్ అనే కొంత బయలు వదిలిఅవతలగా ఇంగ్లీషు వారు రెండు మెద్దెలకు తక్కువ లేకుండా అయిదు అంతస్థులకు ఎక్కువ లేకుండా గొప్ప ఇళ్ళు అనేకం కట్టారు.

 కలకత్తా నగరం అందమంతా విదేశీయుల ఇళ్ళ వద్దనూఇంగ్లీషు వారు నివసించే గంగా తీరంలోనే ఉంది. కానీ హిందువుల ఇళ్ళ వద్దకు పోతేసామన్య స్త్రీలకు రాజుని చూచిన కళ్ళతో మొగుణ్ణి చూసినట్లవుతున్నది. ఓడరేవు ఉంది కాబట్టి అన్ని ద్వీపాంతర వస్తువులు దొరుకుతున్నాయి. వర్తకులు సుఖంగా ఉన్నారు.

జాజిపూరు:

 జాజిపూరు అనే పేరుగల నాభిగయ లో ఈ వైతరణీ నదీతీరంలో దేహానంతరంజీవుడు వైతరణి దాటే కష్టం పొందకుండా ఉండటానికి వైతరణీ ప్రయుక్తంగా ఒక గోదానం చేసినాభి ఆకారంగా ఉండే ఒక చిన్న బావిలో పిండ ప్రదానం చేయాలి. ఉత్కళ బ్రాహ్మలు నూటయాభై ఇళ్ళవారు నాభిగయావళీలని పేరు పెట్టుకుని యాత్ర వారిని యాచించి జీవనం గడుపుకుంటున్నారు. ఇక్కడ ఉత్కళ బాధితులు 500 మంది దాకా ఉన్నారు.

 పూరీ:

 ఇక్కడ గుడి నాలుగు వందల అడుగుల చదరంలో సుమారు తిరువట్టూరి గుడి అంత విశాలంగా ఉండి దానికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. గర్భ గృహం మీద స్తూపి అరటి పువ్వు మాదిరిగా రెండు తాటిచెట్ల ఎత్తులో కట్టిమీద చక్రం ఉంచారు. ముఖమండపం విశాలంగాపైన గుమ్మటం అందంగాస్తూపీలు ఉంచి కట్టారు.  ముఖమండపం బయటి ప్రాకారంలో గోడలో తురకరాయి మీద శిల్పం (చిత్తుళిపని) బహుసుందరంగా చేసారు. గర్భగృహం చుట్టూ చిల్లర గుళ్ళు చాలా ఉన్నాయి. గుడి లోపల ఒక అక్షయవటంఒక ముక్తి మండపం ఉన్నాయి. వాటికింద జపం చేస్తే ముక్తి కలుగుతుందని నియమంగా ఉంది

 వెలుపల ప్రాకారంలో 400 పొయ్యిలు గల వంటశాల విశాలంగా  ఒకటి ఉంది. ఒక్కొక్క పొయ్యి మీద 12 పిడతలు ఉంచి అన్నం వండుకునే విధంగా చేసి ఉన్నారు. ఒక్కొక్క పొయ్యి 5 వేల రూపాయలకు కథా చిత్తుగా అమ్మకానికి దొరుకుతుంది. పచనం అయ్యే ప్రసాదంలో పొయ్యి కలవారికి ప్రతి పిడతకీ స్వతంత్ర హక్కు ఉంది. అందువలన పొయ్యి కలవాడికి ఆదాయం ఎక్కువ. నిత్యం రమారమి అయిదు గరిసెల బియ్యం భోగంగా నివేదన అవుతుంది. పిడతలు చేసే కుమ్మరులు 500 ఇళ్ళు వారు ఉన్నారు.

లింగరాజ మందిరం (భువనేశ్వరం)

 భువనేశ్వరం అనే గొప్ప బస్తీ లో శివస్థలం - లోకనాథస్వామి అనే పేరుతో ఉంది. హిందువులలో చాకలి వారినీచండాలురను గుడిలోనికి రానీయరు. ఈ ఓఢ్ర బ్రాహ్మణులలో 48 తెల్గల వారు ఉన్నారు. అందులో జగన్నాధపురపురాజు పురోహిత వంశానికి చెందినవారు శ్రేష్టులు అనిగుడి పూజలు చేసే పండాలు నికృష్టులని ప్రసిద్ధి.  ప్రతి దినం ఏడుసార్లు భోగానంతర దర్శన సమయాలు ఉంటాయి. అందువలన ఎపుడు గర్భగృహంలోకి వెళ్ళి పీఠదర్శనంప్రదక్షిణం చేయదలచుకున్నా శనివారాల్లో తిరువళిక్కేణి లో గర్భగృహంలో ఉండేటంత సందడి ఉంటూనే ఉంటుంది.

 ఈ స్థలం వదిలేటపుడు గుడి ఇలాక పండాలకు నూరు రూపాయలు ఇస్తే వారందరూ పంచుకుని తృప్తిని పొందుతున్నారు. ఈ పండా పురోహితులు ఎంత మాత్రం తృప్తిని పొందడం లేదు. నా పరువు కాపాడుకోవడానికి మూడువందల రూపాయలు ముట్టచెప్పినానా పురోహితుడికి కనికరం పుట్టలేదు.

శ్రీకూర్మం

 1831 జులయ్ 7 వ తేదీన శ్రీకాకుళం అనే గొప్ప ఊరు చేరాను అక్కడికి 16 కి.మీ ల దూరంలో శ్రీకూర్మం అనే మహాస్థలం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తిన రూపాన్ని శిలతో చేసిన విగ్రహంలో శంఖుచక్ర లాంచనాలతో కూడా ఉంచారు.

 ఈ శ్రీకాకుళం బలరామ క్షేత్రమని ప్రసిద్ధి. ఊరికి పక్కనే లాంగుల్యా (నాగావళి) నది ఒకటి ఉంది. ప్రవాహకాలంలో ఊళ్ళో వీధుల్లో నది సంబంధమైన నీళ్ళు వస్తూ ఉంటాయి. అందువలన నిలువెత్తు మిట్టలు వేసివాటి మీద ఇళ్ళు కట్టుకున్నారు. నదీతీరంలో కోటీశ్వరుడు అనే శివస్థలం ఒకటి పురాణ ప్రసిద్ధమై ఉంది. ఈ ఊళ్ళో బ్రాహ్మణ గుజరాతీ వాళ్ళు నలయి ఇళ్ళవారు వ్యాపార సాహుకారు పన్లు చేస్తున్నారు.

 

 

 

 

ఇంకా ఉంది.  -