Pages

15/08/2026

Yizad by Saadat Hasan Manto


1947 లో జరిగిన అల్లర్లు ఎలా మొదలయ్యాయో అలానే ముగిసిపోయాయి. అచ్చం ఋతువులు మారినపుడల్లా మధ్యలో వస్తూండే గడ్డు కాలాల్లాగా! కరీందాద్ అన్ని ప్రతికూల పరిస్థితుల్నీ దేవుడి నిర్ణయం అని నిర్ణయించేసి మౌనంగా ఊరుకోలేదు. తనకి ఎదురయిన విపత్తులను, విషాదాలనూ, ఓ మొగవాడికుండాల్సిన మనోధైర్యంతో శాయశక్తులా ఎదుర్కొన్నాడు. ఎప్పటికపుడు, ప్రతికూల పరిస్థితులతో తలపడ్డాడు. అతని ఉద్దేశ్యం కేవలం పట్టుదలతో అలా ముఖాముఖీ సమస్యలని ఎదుర్కోవడమే తప్ప, వాటిని ఓడించేయగలనని కాదు. శత్రువు తనకన్నా బలవంతుడని, సంఖ్యాపరంగా కూడా శక్తిమంతుడనీ అతని చేతిలో ఓడిపోవడం తథ్యమని తెలిసినా కూడా, అసలు పోరాడకముందే ఓటమిని అంగీకరించడం, అస్త్రసన్యాసం చేయడం, అవమానం అని నమ్మే మనిషి. నిజం చెప్పాలంటే లోకానికి అతనిమీదున్న అభిప్రాయం కూడా అదే. అత్యంత క్రూరులైనవాళ్ళతో కూడా అతను ఎంతో గుండె ధైర్యంతో తలపడి, పోరాడడం కళ్ళారా చూసారు. కానీ ఎవరైనా కరీందాద్‌ను ఆ మాట అడిగితే, పరిస్థితులను ప్రతిఘటించకుండా ముందుగానే ఓటమిని అంగీకరించేసి, నేరుగా తలవంచడమన్నది తనొక్కడికే పరాభవం కాదు, సమస్త మానవాళికే జరిగే పరాభవంగా భావిస్తాడా అనిపించేలా - ఏదో క్లిష్టమైన గణిత సమస్య తీర్చమని అడిగినట్టు దీర్ఘాలోచనలో పడిపోతాడు. 



కరీందాద్‌కు కూడికలు, తీసివేతలు, హెచ్చివేతలు, భాగాహారాలూ లాంటి లెక్కలేవీ రావు. 1947 నాటి మత కల్లోలాల తరవాత జనం కూర్చుని ధన, ప్రాణ నష్టాలను లెక్కకట్టడం మొదలుపెట్టారు. కానీ కరీందాద్‌ను ఇవేవీ తాకనుకూడా లేదు. అతనికి తెలిసిన లెక్క ఒక్కటే. అది, తన తండ్రి రహీందాద్ ఈ యుద్ధంలో 'ఖర్చ'యిపోయాడన్నదే! ఆనాడు, అతను తన తండ్రి మృతదేహాన్ని ఎత్తుకుని భుజాలమీద స్వయంగా మోసుకొచ్చి ఒక బావి పక్కన పూడ్చిపెట్టాడు. 



గ్రామంలో ఎందరో మరణించారు. వేలాది యువకులు, ముసలివాళ్ళూ చంపబడ్డారు. ఎంతో మంది అమ్మాయిలు అదృశ్యమయిపోయారు. మరెందరో అత్యంత పాశవికంగా మానభంగానికి గురయ్యారు. బాధితులంతా గుండెలవిసేలా రోదించారు. వాళ్ళంతా తమ దురదృష్టాన్ని తలచుకుని, ఆ అకృత్యాలకు పాల్పడిన కిరాతకుల్ను శపిస్తూ ఏడ్చాడు. కానీ కరీందాద్ మాత్రం ఒక్క కన్నీటి చుక్కయినా కార్చలేదు. చివరి శ్వాస వరకు పోరాడిన తన తండ్రి ధైర్యసాహసాలను తలచుకుంటే అతనికి చాలా గర్వంగా అనిపించేది. అతని తండ్రి నిరాయుధుడై ఉండి కూడా, కత్తులు, గొడ్డళ్ళతో మీదపడిన పాతిక ముప్పై మంది ముష్కరులను ఒంటి చేత్తో ఎదిరించాడు. దాడి చేసిన వాళ్ళతో తన తండ్రి ధైర్యంగా పోరాడుతూ మరణించాడని విన్నాక, తండ్రి ఆత్మతో వీడ్కోలుగా చెప్పేందుకు అతనికి ఏదీ తోచలేదు - "యార్, పెద్ద పొరపాటు చేసావు. నీదగ్గర ఎప్పుడూ కనీసం ఒక్క ఆయుధమైనా ఉంచుకోమని చెప్పాను కదా!" అని మాత్రం అన్నాడు.



ఆ మాట అన్నాకా, తండ్రి శవాన్ని మోసుకెళ్ళి, ఒక బావి పక్కన గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. సమాధి పక్కన నించుని, ప్రార్ధనగా కూడా ఒక్కటే అన్నాడు, "దేవుడు పాపపుణ్యాల లెక్కలు చూసుకుంటాడు. నీకు స్వర్గం ప్రాప్తించాలిగాక!" 

రహీందాద్‌ను అతికిరాతకంగా చంపేశారని విన్నవాళ్ళందరూ ఆ దుండగులను శపించారు కానీ కరీందాద్ ఒక్క మాట కూడా అనలేదు. కోతకు సిద్ధంగా ఉన్న పంటపొలాలను దుండగులు పెట్టిన మంటలవల్ల కోల్పోయాడు కరీందాద్. అతని రెండు ఇళ్ళను కూడా అంతకు ముందే తగలబెట్టారు. అయినా, అతను ఆ నష్టాలను, తన తండ్రి ప్రాణ నష్టంతో లెక్కకట్టలేదు. అతను ఒకటే అనేవాడు. "ఏది జరిగినా సరే, అది ఇలా జరిగిందంటే, అది మన తప్పే!". అలాంటపుడు ఎవరైనా ఆ తప్పు ఏంటని అడిగితే, మౌనంగా ఉండిపోయేవాడు. 



గ్రామమంతా ఈ అల్లర్లలో మరణించిన వాళ్ళను తలచుకుంటూ శోక సంతాపాల మధ్య ఉన్నపుడు, కరీందాద్ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చామనచాయతో ముద్దులొలికే ‘జీనా’ అనే అందమైన అమ్మాయి మీద ఎన్నాళ్ళుగానో అతనికి మరులు. జీనా అప్పటికి తీరని దుఃఖంలో మునిగి ఉంది. ఆమెకు ఉన్న చెట్టంత అన్నను దుండగులు, ఆ మతకల్లోలాలలో నిర్దాక్షిణ్యంగా చంపేసారు. జీనా తల్లితండ్రులేనాడో పోయారు. ఆమెకు మిగిలిన అండా దండా, ఈ అన్న ఒక్కడే. జీనాకు కూడా కరీందాద్ అంటే ప్రేమే. కానీ తన అన్నను ఆ విధంగా కోల్పోవడం వల్ల కలిగిన శోకంలో జీనాకు ప్రేమకూడా భారంగా మారిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె కళ్ళు ఇప్పుడు సదా దుఃఖంతో, కన్నీళ్ళతో నిండి ఉన్నాయి. 



కరీందాద్ కు, ఏడుపులన్నా, రోదనలన్నా అసహ్యం. జీనా అలా శోకదేవతలా కనిపిస్తూ ఉంటే, అతనికి చాలా చిరాకు కలిగేది. కానీ తొందరపడి మాటలు తూలి, అసలే గాయపడి ఉన్న స్త్రీ హృదయాన్ని మరింత గాయపరచకూడదన్న స్పృహ అతనికి ఉండేది. ఒకరోజు పొలంలో ఆమె ఒంటరిగా ఉండగా, ప్రేమ గా, ఆమె చేయి పట్టుకుని అన్నాడు. "పోయినవాళ్ళని మనం పాతిపెట్టేసి ఏడాదయింది. ఇంకా ఎన్నాళ్ళయినా మనం ఇలా ఏడుస్తూ ఉంటే, ఆ వెళ్ళిపోయిన ఆత్మలు కూడా మన దీర్ఘ సంతాపాన్ని చూసి విసిగిపోతాయి. ఇక ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు ప్రియా! ముందు ముందు మనం ఇంకా ఎన్ని చావులు చూడాల్సి వస్తుందో ఎవకికి తెలుసు? ఈ కన్నీళ్ళను రేపటి కోసం కూడా దాచుకో!" 



జీనాకు ఆ మాటలు నచ్చలేదు. కానీ అతనంటే ఉన్న ప్రేమతో, అతను చెప్పిన మాటల గురించి పదే పదే ఆలోచించింది. ఒంటరిగా ఉన్నపుడల్లా ఆ మాటల్నే తలచుకుంటూ, వాటి వెనుక ఉన్న సత్యమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించేది. అలా చివరికి కరీందాద్ చెప్పింది నిజమేనని ఎలాగో ఒప్పుకుని, తన దు‌ఃఖంనుండి బయటపడింది. 

 

కరీందాద్, జీనాల పెళ్ళి ప్రస్తావన వచ్చినపుడు, గ్రామ పెద్దలు మొదట అభ్యంతరం చెప్పారు. కానీ వాళ్ళ నిరసనలో పస లేదు. ఏడాది కాలం సుదీర్ఘంగా, పోయిన పిల్లలనీ, పెద్దలనీ తలచుకుంటూ, అంతులేని వేదనతో, ఏడుపులతో గడిపి విసిగిపోయిన వాళ్ళకు ఈ పెళ్ళిని అడ్డుకోవడానికి పెద్ద కారణాలు ఏవీ కనపడక, వారి అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. అలా, కరీందాద్ పెళ్ళి జరిగింది. సంగీతవాయిద్యాలవాళ్ళను, పాటలు పాడేవాళ్ళనూ పిలిచారు. ప్రతి తంతూ పద్ధతిగా, సక్రమంగా జరిపించారు. అలా కరీందాద్ తన ఇంటికి, తన ప్రేయసిని, చట్టబద్ధంగా వివాహం చేసుకుని, భార్యగా తీసుకొచ్చుకున్నాడు. 



మతకల్లోలాల తర్వాత గ్రామం మొత్తం ఒక పెద్ద స్మశానంలా మారిపోయింది. కరీందాద్ పెళ్ళి ఊరేగింపులో బాజాబజంత్రీలు విని కొందరు గ్రామస్తులు భయపడిపోయారు - అది ఏ దెయ్యాల ఉత్సవమో అనుకున్నారు. ఈ విషయం కరీందాద్ స్నేహితులు అతనికి చెప్పినపుడు పగలపడి నవ్వాడు. కానీ కరీందాద్ నవ్వుతూ ఈ విషయాన్నే కొత్త పెళ్ళికూతురికి చెప్తే, ఆమె భయంతో వణికిపోయింది. 



కరీందాద్, ఎర్రని గాజులు వేసుకున్న జీనా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, "ఈ దయ్యం నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఏ భూతవైద్యుడూ, నీ నుండి నన్ను, అంటే ‘నా’ భూతాన్ని ఎంత పెద్ద తంతులు చేసినా వదలించలేడు"అన్నాడు కొంటెగా.



జీనా తన గోరింటాకు చేతి వేలిని మునిపంట పెట్టి, సిగ్గుతో గొణిగింది "కీమె.., నీకు దేనికీ భయపడవు కదా!"



కరీందాద్ నారింజ రంగు మీసాలను తన నాలుక అంచుతో తడుపుకుంటూ నవ్వి, "ఎవరైనా దేనిగురించయినా అసలు ఎందుకు భయపడాలి?" అన్నాడు. 



జీనా గుండెను కస్సున కోసే దుఃఖపు అంచు తన వాడిని మెల్లమెల్లగా కోల్పోసాగింది. ఆమె త్వరలో తల్లి కాబోతుంది. కరీందాద్ ఆమెలో విరుస్తున్న మాతృత్వాన్ని చూసి ఎంతో మురిసిపోయాడు. "దేవుని సాక్షిగా జీనా, నువ్వు రోజు రోజుకీ మరింత అందంగా మారిపోతున్నావు. నువ్వు, ఇంత అందంగా నా కొడుకు మూలానే తయారవుతున్నావు! వాడూ నేను ఇక నీకోసం ఒకరితో ఒకరం పోట్లాడుకుంటూ ఉండిపోతామేమో చూడు”, అని ఆటపట్టించేవాడు.



జీనా సిగ్గుతో, తన శాలువతో పొట్టను కప్పుకుంది. కరీందాద్ నవ్వుతూ ఆమెను మరింత ఆటపట్టించాడు. "ఎందుకు దాచడం? నువ్వు పడుతున్న ఈ తపనా, నీ తాపత్రయం అంతా నా ఈ పంది వెధవ గురించేనని నాకు తెలీదా?



జీనాకు సర్రున చిర్రెత్తింది. "నీ కొడుకుని అలా ఆ చెడ్డ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది?"



కరీందాద్ గోధుమవన్నె మీసం నవ్వుతో వణికింది. "కరీందాద్ అందరి కన్నా పెద్ద పంది కనుక".



మొదటి ఈద్ వచ్చింది. తరవాత రెండోది. కరీందాద్ రెండు పండగల్నీ ఎంతో సంబరంగా జరుపుకున్నాడు. నిరుడు సరిగ్గా ఈద్‌కు 12 రోజుల ముందే దుండగులు ఆ గ్రామం మీదికొచ్చారు. అప్పటి అల్లర్లలోనే, ‘రహీందాద్’, జీనా అన్న ‘ఫజల్ ఇలాహీ’లు చంపబడ్డారు. జీనా రహస్యంగా ఇద్దరినీ తలుచుకుని ఏడ్చింది. కరీందాద్ లాంటి ఏడుపు, విచారం అంటే పడని మనిషి సాంగత్యంలో, జీనాకు తనివితీరా ఏడ్చుకోవడానికి కూడా వీలుపడలేదు. 



ఎపుడు జీనా తన జీవితాన్ని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించినా, ఆమెకు తన గత జ్ఞాపకాల నుంచి, గత జీవితాన్నుంచీ తను ఎంత దూరంగా ప్రయాణించేసిందో అర్ధం అయి, ఆశ్చర్యం కలిగేది. తన తల్లితండ్రుల మరణాలు జ్ఞాపకం లేవు. ‘ఫజల్ ఇలాహీ’ ఆమె కన్నా ఆరేళ్ళు పెద్ద వాడు. అతడే, ఆమెకు తల్లీ, తండ్రీ, సోదరుడూ అన్నీ. తన అన్న తనవల్లనే పెళ్ళి చేసుకోలేదని ఆమెకు తెలుసు. జీనా మానాన్ని రక్షిస్తూనే ఫజల్ ప్రాణాలు కోల్పోయిన సంగతీ ఊర్లో అందరికీ తెలుసు. అన్న మరణం ఆమె జీవితంలో అత్యంత విషాదకరమైన అఘాతంగా మారిపోయింది. ఆమె మీదకు ఆ దుఃఖశిఖరం ఏ హెచ్చరికాలేకుండా విరుచుకుపడింది. అదీ రెండో ఈద్‌కు సరిగ్గా పన్నెండు రోజుల ముందు. ఆమెకు ఈ విషయం ఎపుడు గుర్తొచ్చినా, ఆ రోజు నుండీ తను ఎంత దూరం కొట్టుకుని వచ్చేసిందో, ఆ ఘోరం తరవాత, ఆ దుఃఖం నుండి బయటపడేందుకు, తన తలరాత ఎలా మారిందో అనే సంగతి ఆమె ఆలోచనల్లో చేరిపోయి కలవర పెట్టేది. 



ముహర్రం నాటికి, జీనా కరీందాద్‌ని తన మొట్టమొదటి కోరిక కోరింది. ‘ప్రసిద్ధికెక్కిన గుర్రాన్ని, తాజియానూ ఊరేగింపులో చూడాలని చెప్పలేనంత ఉబలాటంగా ఉంది‘ అంది. ఆమె తన స్నేహితుల దగ్గర ఈ ఊరేగింపు గురించి ఎంతో గొప్పగా వింది. ఆమె కరీందాద్‌తో "నాకు బాగుంటే, ఈ ఊరేగింపుకు నన్ను తీసుకు వెళ్తావా?" అని అడిగింది.



కరీందాద్ నవ్వి, "నీకు బాలేకపోయినా కూడా నిన్ను తీసుకుని వెళ్తాను.. ఇంకా నా పంది వెధవ ని కూడా!" అన్నాడు. 



అతను పుట్టబోయే తన పిల్లాడ్ని అలా పంది అనడం ఆమెకు అస్సలు నచ్చదు. అలా అతను అన్నపుడల్లా ఆమెకు కోపంతో విసుగొచ్చేసేది. కానీ అలా అన్నపుడు కరీందాద్ గొంతులోని మార్దవం, జీనా కోపాన్ని కాస్తా చెప్పలేనంత ఆనందానుభూతిగా మార్చేసేది. అతను అంత ప్రేమని అలా "పంది వెధవ" అనే చెత్త పదంలోకి ఎలా కుదించగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోయేది. 



ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించిన వార్తలు అప్పటికే కొన్నాళ్ళుగా వినిపిస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్ ఏర్పడిన తరవాత, రెండు దేశాల మధ్యా యుద్ధం జరగడం దాదాపు ఖాయం అయిపోయింది. అసలు యుద్ధం ఎపుడు మొదలవుతుందో గ్రామంలో ఒక్కరికీ తెలీదు గానీ, అందరూ అలజడిగా ఉన్న ఆ రోజుల్లో, కరీందాద్‌ని ఈ సంగతి అడిగితే, క్లుప్తంగా, "ఎపుడు జరగాలో అపుడు జరుగుతుంది. ఇప్పుడు దానిగురించి ఆలోచించడం దేనికి?" అని అనేవాడు.



జీనాకు యుద్ధం అన్న మాటకే వణుకు పుట్టేది. ఆమె సహజంగా శాంతిని ఇష్టపడే వ్యక్తి. ఊరికే స్నేహితుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా గాబరాపడిపోయేది. అలాంటిది, ఆమె అప్పటికి చాలానే హత్యలనూ, దోపిడీలు, దొమ్మీలను అతి సమీపాన్నించి, కళ్ళారా చూసేసింది. తన సొంత అన్న హత్యను ఆమె మర్చిపోలేకపోతోంది. ఒక రోజు భయంతో, "కీమె, ఇపుడు ఏమి జరుగుతుంది?" అని కరీందాద్‌ను అడిగింది. 

 

కరీందాద్ నవ్వి, "అమ్మాయి పుడుతుందో, అబ్బాయి పుడతాడో నాకెలా తెలుస్తుంది?” అన్నాడు. ఆమెకు చిరాకు కలిగినా కరీందాద్ చెప్పే కబుర్లలో, హాస్యాలలో, తన తలలో కమ్ముకుంటున్న యుద్ధ భయాలని మర్చిపోయేది.


కరీందాద్ నిర్భయుడు, బలశాలి, జీనా అంటే అపారమైన ప్రేమ కలవాడు. అతను ఒక రైఫిల్ కొని, దాన్ని గురి తప్పకుండా పేల్చడం నేర్చుకున్నాడు. వీటన్నిటి వల్లా, జీనాకు కొంత ధైర్యం చిక్కినా, గ్రామస్తుల నోట యుద్ధం గురించి ఏ పుకారు విన్నా, మళ్ళీ ఆమెను భయం కమ్ముకునేది. 

 

ఒకరోజు మంత్రసాని ‘భక్తో’ రోజూలానే జీనాను చూసేందుకు వచ్చినపుడు, భారతీయులు 'నది'ని మూసేస్తున్నారన్న వార్త తెచ్చింది. జీనాకు ఆ మాట అస్సలు అర్ధం కాలేదు. భక్తోను అడిగింది, "నది ని మూసేయడం ఏమిటి?" అని. 



"మన పొలాల్లో పంటలు పండనివ్వుకుండా వాళ్ళు నదిని మూసేస్తారంట" అంది భక్తో. 

జీనా ఓ నిముషం ఆలోచించి, పకాలుమని నవ్వి, "నువ్వు పిచ్చి దానిలా మాటాడుతున్నావు. అంత పెద్ద నదిని ఎవరు మూసేయగలరు? అది నది! ఇంటి వెనక పారే మురికి నీటి కాలువ కాదు!" అంది. 

భక్తో జీనా పెరిగిన పొట్ట మీద మృదువుగా తడుముతూ, "నాకు తెలీదు. నేను విన్నదేదో నీకు చెప్పాను. పేపర్ల నిండా ఇదే రాసుందంట" అంది.

 

"అది ఏమిటి?" జీనాకు అసలు నమ్మశక్యంగా లేదు. 

 

భక్తో తన ముడుతలు పడిన చేతులతో జీనా పొట్టని నిమిరి, "అదే… వాళ్ళు నది దారి మళ్ళిస్తారు, నీటి ప్రవాహాన్ని ఆపేస్తారు" అంది. ఆమె జీనా కమీజ్‌ను కిందికి లాగి, లేచి, అనుభవజ్ఞులైన మనిషికి ఉండే, నమ్మకమైన స్వరంతో "ఇలానే అంతా బావుంటే, పిల్లాడు ఇంకో పది రోజుల్లో బయటికొస్తాడు" అంది. 

 

కరీందాద్ ఇంటిలోకి అడుగు పెట్టీ పెట్టంగానే జీనా, అతన్ని నది సంగతి అడిగింది. మొదట ఆమె భయాలను కొట్టి పారేసేందుకే ప్రయత్నించాడు. కానీ ఆమె అదే పనిగా అడుగుతుంటే, "అవును నేనూ అలాంటిదే విన్నాను" అన్నాడు.

 

జీనా అడిగింది "ఏం విన్నావు?"

 

"హిందుస్తానీలు మన నది దారిని మూసేయబోతున్నారంట!"

 

"కానీ ఎందుకు?"

 

"అలా చేస్తే మన పంటలు ఎండి పోతాయని"



అప్పటికి నదుల ప్రవాహాన్ని కూడా మనుషులు ఆపగలరని ఎలానో జీనాకు నమ్మకం కలిగింది. ఆమె ఎలానో కూడబలుక్కుని నిస్సహాయంగా, "ఎంత క్రూరులు వాళ్ళు?" అంది. 



ఇది విని, కరీందాద్ చిరునవ్వుతో ఓ నిముషం ఆగి, "సరే ఇదంతా వదిలెయ్, భక్తో వచ్చిందా చెప్పు?" అన్నాడు.

 

ఆమె నీరసంగా, "వచ్చింది" అంది. 

 

"ఏమి చెప్పింది?"

 

"పిల్లవాడు ఇంకో పది రోజుల్లో పుడతాడని చెప్పింది"

 

కరీందాద్ ఆనందంతో గట్టిగా నవ్వి, "వాడు చల్లగా నూరేళ్ళు జీవించాలి" అన్నాడు.

 

జీనా తన అసహనాన్ని ప్రదర్శిస్తూ, "నువ్వర్థం కావు నాకు. ఇలాంటప్పుడు కూడా ఎలా నవ్వుతావో! ఏ ఉపద్రవం పొంచిఉందో, ఏ కర్బలా మనల్ని ముంచేసేందుకొస్తుందో ఆ దేవుడికే ఎరుక!” అంది. 

 

కరీందాద్ రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గ్రామంలోని మొగవాళ్ళంతా అప్పటికే గుమిగూడున్నారు. అందరూ గ్రామ పెద్ద 'చౌదరీ నత్తూ' చుట్టూ మూగిపోయి, నదిని ఆపేయడం గురించే ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళలో ఒకరెవరో, పండిట్ నెహ్రూని నానా తిట్లూ తిడుతున్నాడు. ఇంకొకడు శాపాలు పెడ్తున్నాడు. ఇంకొకడు, అసలు నది గతిని మార్చగలగడం అన్న భావననే నమ్మనంటున్నాడు. వాళ్ళలో ఇంకొకడు అసలు ఏమి జరగనుందో అంతా మన తప్పులకు దేవుడు వేయబోయే శిక్ష అని తీర్మానిస్తున్నాడు. ఈ ఘోరంనుండీ తప్పించమని దేవుడిని వేడుకునేందుకు అందరూ మసీదుకు వెళ్దామని ఇంకొకడు ప్రతిపాదిస్తున్నాడు.



కరీందాద్ ఓ మూల కూర్చుని, తన చుట్టూ సుడులు తిరుగుతున్న మాటల్ని మౌనంగా వింటున్నాడు. హిందుస్తానీలను తిట్టడం లో చౌదరీ నత్థూ మొదట ఉన్నాడు. ఈ గోలంతా విని కరీందాద్ అసహనంగా కదులుతున్నాడు. అందరూ ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకున్నారు - నదిని ఆపడం అనేది, చాలా నైతికంగా దిగజారిపోయిన వారి కుయుక్తి అని. అది మానవత్వం, మనస్సాక్షి లేనివారి అత్యంత హేయమైన, నీతిబాహ్యమైన చర్య. ఈ చర్య ‘యజీద్’ చేసిన పాపకార్యంతో సమానం. (యజీద్, కర్బలాలో జరిగిన యుద్ధంలో ప్రవక్త మనవడిని, అతని పరివారాన్ని, యూఫ్రటిస్ నది నుండీ నీరు వాడుకోనీయకుండా చేసి, తదనంతరం అతన్ని చంపిన వాడు. ఈ యుద్ధం తరువాత ముస్లిములు సున్నీలు, షియాలుగా విడిపోయారు. ఈ యుద్దం గెలిచిన యజీద్, రెండో కాలిఫ్ అయాడు.)

 

కరీందాద్ రెండుసార్లు దగ్గి, ఏదో చెప్పేందుకు గొంతు సవరించుకున్నాడు. కానీ అప్పటికి చౌదరీ నత్తూ నోటి వెంట బూతుల ప్రవాహం విరుచుకుపడింది. కరీందాద్ ఇక ఆగలేకపోయాడు, "వాళ్ళను తిట్టకు చౌదరీ!" అని అరిచాడు.

 

భయంకరమైన 'అమ్మ బూతు తిట్టు' ఒకటి చౌదురీ గొంతు లోనే ఇరుక్కుపోయింది. కరీందాద్‌ను ఆశ్చర్యంగా చూస్తూ తన తలపాగాని సవరించుకుంటూ, "ఏమన్నావు?" అన్నాడు చౌదరీ. 

 

కరీందాద్ నెమ్మదిగా ఖచ్చితమైన స్వరంతో, "నేను వాళ్ళను తిట్టొద్దు అన్నాను" అన్నాడు.

 

చౌదురీ తన గొంతులో ఆగిపోయిన బూతుని ఖాండ్రించి ఉమ్మేసి, కరీందాద్ వైపు తిరిగి కోపంగా, "ఎవరిని తిట్టొద్దంటున్నావు? వాళ్ళు నీకేమవుతారు?" అని, చుట్టూ చూసి, చౌపాల్ దగ్గర గుమిగూడినవాళ్ళతో అన్నాడు "విన్నారా మీరంతా? వీడి మాటలు? వాళ్ళను తిట్టొద్దంట. అందరూ అడగండి వీడ్ని… వాళ్ళు వీడికి ఏమవుతారో!". 

 

కరీందాద్ ఓపిగ్గా, "నాకు వాళ్ళేమవుతారు? వాళ్ళు నా శత్రువులు. అంతకంటే ఇంకేం కారు!” అన్నాడు.

 

ఏ పెద్ద నవ్వు లాంటి బొంగురు శబ్దం చౌధురి నోటి నండీ ఎంత వేగంగా బయటికొచ్చిందంటే, అతని మీసంలోని వెంట్రుకలు కూడా అదిరాయి! "విన్నారా? వాళ్ళు వీడికి శత్రువులంట. మరి మన శత్రువు ని ప్రేమించమంటావా, నాయనా?”



కరీందాద్ సమాధానం ఇస్తున్నట్టు, "కాదు చౌదరీ, నేను అలా అనట్లేదు. నేను అన్నదంతా - వాళ్ళను తిట్టొద్దు అని మాత్రమే" అన్నాడు.



కరీందాద్ పక్కనే కూర్చున్న అతని చిన్ననాటి స్నేహితుడు మీరాన్ బక్ష్ అడిగాడు "కానీ ఎందుకు?"

 

కరీందాద్ నేరుగా మీరాన్ బక్ష్‌తో, "వాళ్ళను తిట్టి ఏం లాభం, యార్? వాళ్ళు నదిని మూసేసి మన పంటలను నాశనం చెయ్యాలని చూస్తున్నారు. నువ్వు వాళ్ళను తిట్టి ఆ లెక్క సరిచేయగలనని అనుకుంటున్నావా? నువ్వు తిట్టినంత మాత్రాన ఆగుతారా? అసలు దీనికి ఏమైనా అర్ధం ఉందా? మన దగ్గర ఇంకే సమాధానమూ లేనపుడే ఎదుటివాళ్ళను తిడతాం" అన్నాడు.

 

మీరాన్ బక్ష్, "మరి నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా?" అని అడిగాడు. 

 

కరీందాద్ ఒక క్షణం ఆగి, "ఈ సమస్య నా ఒక్కడిది కాదు. ఇది వేలాది మందికి సంబంధించిన విషయం. నా సమాధానం అందరి సమాధానం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోలోతుగా ఆలోచిస్తే అందరికీ అంత సంతృప్తికరమైన సమాధానం దొరకుతుంది. వాళ్ళు నదీ ప్రవాహాన్ని ఒక్కరోజులో ఆపలేరు. వాళ్ళకు ఆ పని చేసేందుకు ఏళ్ళు పడతాయి. కానీ మీరేమో వాళ్ళ మీద మనసులో పేరుకుపోయిన కక్షనంతటినీ ఒక్క క్షణంలో బూతులుగా మార్చి తిట్టేసి దులిపేసుకుంటున్నారు". కరీందాద్, మీరాన్ బక్ష్ భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా, "నాకు తెలిసిందల్లా ఒక్కటే యార్. హిందుస్తాన్‌ను నీతిమాలిందని, కౄరమైందని, అల్పమైనదని చిన్న మనసుదనీ అనడం తప్పు."

 

మీరాన్ బక్ష్ బదులు చౌదురీ నత్తూ అరిచాడు, "ఇప్పుడు ఇది వినండి మరి!"

 

కరీందాద్, మీరాన్ బక్ష్‌తో తన మాటలు కొనసాగించాడు. "నా ప్రియ మిత్రమా, ఇది మూర్ఖత్వం! శత్రువులనుండి కనికరాన్ని ఆశించడం మూర్ఖత్వం. యుద్ధం వచ్చినపుడు మన దగ్గర ఉన్నదానికంటే శత్రువు దగ్గర పెద్ద ‘బోరు’న్న రైఫిలు ఉందని ఏడవడం లాంటిది! మనం చిన్న చిన్న బాంబులు విసురుతూ వాళ్ళు పెద్ద పెద్ద బాంబులు వాడుతున్నారని ఫిర్యాదు చేయడం లాంటిది! చిన్న కత్తి అయినా పెద్ద కత్తిలాగే ప్రాణాలు తీయగలదు కదా. నేను చెప్పేది నిజం కాదా?"

 

మీరాన్ బక్ష్ బదులు, చౌధరీ నత్తూ ఆలోచనలో పడినా, వెంటనే తన చిరాకుని ప్రదర్శిస్తూ, "కానీ ఇక్కడ సమస్య అది కాదు, వాళ్ళు మన నీళ్ళను ఆపబోతున్నారు. మనం ఆకలితో, దప్పులతో చావాలని కోరుకుంటున్నారు."

 

కరీందాద్ తన చేతిని మీరాన్ బక్ష్ భుజంమీదనుండి తీసి, చౌదరీ వైపు తిరిగి, "మనం ఒకరిని శత్రువు అని ప్రకటించేసాక, వాళ్ళు మనల్ని ఆకలీ, దాహాలతో చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని ఫిర్యాదు చేయడం దేనికి? మనన్ని ఆకలికి ఎండగట్టకుండా, మన పచ్చని పొలాలను బీడు భూములు చేయకుండా మన ఇంటికి డేగిశాల నిండా పులావులూ, కుండల నిండా తీయని షర్బత్‌లూ పంపుతారనీ, మనం ఆడుకోవటాని కోసం తోటలూ, తోపులూ పెంచుతారనుకుంటామా?"



ఇది చౌదరికి మరింత కోపాన్ని తెప్పించింది. "ఏంటి ఈ అర్థం పర్థం లేని మాటలు?" అని అడిగాడు ఆగ్రహంగా.



మీరాన్ బక్ష్ కూడా మెల్లగా, "అవును యార్, ఏంటిది అర్ధం లేకుండా?" అడిగాడు.



"ఇది అర్ధం లేని విషయం కాదు మీరాన్ బక్ష్!" అన్నాడు కరీందాద్ సేహితుడికి విషయం భోధపరిచేందుకు ప్రయత్నిస్తూ, "ఆలోచించు! యుద్ధంలో రెండు పక్షాలూ ఎదుటివాళ్ళను ఓడించేందుకే ప్రయత్నిస్తారు. కుస్తీ పోటీలో వస్తాదు అన్నిటికీ సిద్ధపడి నడుం బిగించి రంగంలో ఎలా దూకుతాడో, ఎదుటివాడిని మట్టికరిపించడానికి తనకు చేతనయిన అన్ని యుక్తులనూ వాడి, తన శాయశక్తులా ఎలా పోరాడతాడో ఇది కూడా అంతే." 

 

మీరాన్ బక్ష్ ఒప్పుకున్నట్టు నున్నగా గుండు చేసున్న తన తల ఊపుతూ, "అవును, అది నిజమే" అన్నాడు.

 

కరీందాద్ నవ్వి, "అలాంటప్పుడు నదిని మూసేయడం కూడా సరైనదే. అది మనకు కౄరత్వంలా అనిపించచ్చు. కానీ, వాళ్ళ దృష్టిలో అది సరైన చర్యే"

 

"దాహంతో నీ గొంతెండిపోయి, నాలుక పిడచకట్టుకున్నప్పుడు అ‍‍డుగుతాను ఇది సరైన పనో కాదో! నీ పిల్లలు అన్నం ముద్ద కోసం ఏడ్చినప్పుడు కూడా ఇదే మాట అంటావా? నదిని ఆపడం సరైన పనేనని!"

 

కరీందాద్ ఎండిన తన పెదవుల్ని నాలుకతో తడుపుకుని సమాధానమిచ్చాడు, "అవును, అప్పుడు కూడా నేను ఇదే మాట అంటాను చౌదరీ. కేవలం వాళ్ళు మాత్రమే మన శత్రువులు కాదు, మనం కూడా వాళ్ళకు శత్రువులమే అన్న విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? మనకే వాళ్ళ అన్నపానీయాలను ఆపగలిగే వీలుంటే, నిర్దాక్షిణ్యంగా మనమూ అదే చేసుండేవాళ్ళము కదా. ఇపుడు వాళ్ళు మన నీళ్ళను ఆపేయగలిగి, నదిని మూసేయగల స్థితిలో ఉన్నపుడు పనికిమాలిన తిట్లవల్ల ప్రయోజనం ఏముంది? దీన్నుండీ బయటపడే మార్గం గురించి ఆలోచించాలి గానీ. శత్రువు మన కోసం ‘పాల నదుల’ను సృష్టించడు చౌదరీ. కానీ వీలుంటే మన వాటాకు వచ్చే ప్రతి నీటి చుక్కలోనూ విషం కలపగలడు. ఈ రకంగా ప్రాణాలు తీసే పద్ధతి నీకు నచ్చకపోవచ్చు. దాన్ని నువ్వు క్రూరత్వం అను, రాక్షసత్వం అను… కానీ ఇందులో వింతేముంది? యుద్ధం మొదలయే ముందే ఇరుపక్షాల వాళ్ళూ కూర్చుని కొన్ని షరతులూ, ఒప్పందాలూ మాట్లాడుకోవచ్చు కద… అంటే నిఖా చేసుకునేప్పటి మాటల్లాగా… మమ్మల్ని ఇలా ఆకలి, దాహాలతో చంపవద్దని, తుపాకులూ తూటాలతో చంపమని, అది కూడా మా దగ్గరున్నట్టే ఫలానా బోర్ ఉన్న తుపాకులతోనే రండి అని చెప్దామా? ఇవీ నిజానికి అర్ధం లేని మాటలంటే. నెమ్మదిగా, శాంతంగా ఆలోచించండి." 



అప్పటికి చౌదరి‌కి ఓపిక నశించి, నిరాశ అవధులు దాటింది, "ఎవరైనా ఓ మంచు పలక తెచ్చి నా గుండె మీద పెట్టండి" అని కోపంగా అరిచాడు.

 

"అది కూడా నేనే తెచ్చివ్వాలని ఆశిస్తున్నావా?" అని పకాల్న నవ్వాడు కరీందాద్. మీరాన్ బక్ష్ భుజం మీద చరిచి, లేచి, రచ్చబండ నుండి బయలుదేరాడు.



అతను ఇంటి గడప చేరీసరికీ ఇంటినిండీ బయటికొస్తూ భక్తో కనపడింది. ఆమె బోసినవ్వుతో "అభినందనలు కీమె! నీకు పండులాంటి బిడ్డ పుట్టాడు. వా‍డికి మంచి పేరు ఆలోచించు ఇప్పుడు" అంది.

 

"పేరా?" కరీందాద్ ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, "యజీద్… యజీద్."


భక్తో ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ కరీందాద్ ఇంటిలోపలికి వెళ్ళాడు. జీనా నులక మంచం మీద పడుకుని ఉంది. ఇంతకు ముందు కన్నా పాలిపోయి, నీరసంగా కనిపిస్తుంది. ఓ అందమైన శిశువు తన బొటనవేలిని చీకుతూ ఆమె పక్కనే పడుకుని ఉన్నాడు. కరీందాద్ ప్రేమగా, గర్వంగా వాడిని చూశాడు. వాడి లేత బుగ్గని చూపుడువేలుతో సున్నితంగా తాకి మృదువుగా అనాడు, "నా చిట్టి యజీద్!" 

 

జీనా ఆశ్చర్యంతో ఓ కేక వేసింది, "యజీదా?"

 

కరీందాద్ కొడుకు ముఖాన్ని దగ్గరగా చూస్తూ, వాడి పోలికల్ను గమనిస్తూ అన్నాడు, "అవును. యజీద్. ఇదే వీడి పేరు."

 

జీనా గొంతు నీరసబడిపోయింది, "ఏమంటున్నావు కీమె? యజీద్ ఏంటి…"

 

కరీందాద్ నవ్వి, "అందులో ఏముంది? అది కేవలం ఒక పేరు మాత్రమే!" అన్నాడు.

 

జీనా అతికష్టం మీద కీచుగా ఒక్క మాట అనగల్గింది, "కానీ… అది ఎవరి పేరు?" 

 

కరీందాద్ చాలా గంభీరంగా సమాధానమిచ్చాడు, "వీడు ఆ పాత యజీద్ అవ్వాలని ఏముంది. ఆ యజీద్ నదిని మూసేసాడు; మన కొడుకు దాన్ని తెరుస్తాడు."



***

మూలం: సాదత్ హసన్ మంటో కథ ‘యజీద్’

అనువాదం : నేను 🙎‍♀️

First published in Udayini Webzine.

***

Context of the story is weaponisation of natural resources.  Background is Indus Water Treaty between India and Pakistan & Op Sindhoor.

****




No comments: