Pages

06/12/2010

నథ్థా & రూప్ కన్వర్

నిన్నే జీ టీవీ లో అమీర్ ఖాన్ మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పాడని 'పీప్లీ లైవ్ ' చూసాను. నచ్చింది. పీ.సాయినాధ్ ద హిందూ లో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల గురించి రాస్తున్నప్పుడు - ఆసక్తి గా (విరక్తి గా కూడా) ఫాలో అయిన ప్రాణం నాది. ఒక సమయంలో వెల్లువెత్తిన రైతు ఆత్మహత్యల బాక్ గ్రౌండ్ లో నథ్థా అనే ఒక పేద రైతు, కాంపెన్సేషన్ కోసం ఆత్మహత్య చేసుకుందామని నిశ్ఛయించుకుంటాడు. ఆ తరవాత, ఓ వైపు ఎన్నికలు ముంచుకు రావడంతో సమీకరణాల పోటీల్లో, టీ ఆర్ పీ ల వేట లో మీడియా, రాజకీయ నాయకులూ వెంటబడటం, ఆ రైతు కుటుంబం పడిన పడరాని పాట్లూ - నవ్వు తెప్పిస్తాయి. కరిస్తే కప్పకు కోపం, విడిస్తే .. అన్నట్టయిపోతుంది. బర్ఖా దత్ (రాడియా ఉదంతంలో ఖంగు తిన్నది) లాంటి ఒక పాత్ర, అందులో ఒదిగిపోయిన నటి మొహంలో 'తప్పంతా నీదే!' అనే ఎక్స్ప్రెషనూ - ముఖ్యంగా నచ్చాయి.


మొత్తానికి ఆత్మహత్య చేసుకుంటాడని ఆ రైతు గురించి పొగ గుప్పుమనడంతో గ్రామం లో జాతర మొదలవుతుంది. సరిగ్గా ఈ పాయింటు దగ్గర మార్క్ టుల్లీ రాసిన 'నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా !' గుర్తొచ్చింది. ఇందులో 1987 లో దేశాన్ని ఒక కుదుపు కుదిపిన రూప్ కన్వర్ సతీ ఉదంతం గురించి టుల్లీ సవివరంగా చెప్పాడు. విలేఖరి కున్న విశాలమైన దృక్కోణంతో ప్రత్యక్షంగా చూసి, చదివి, వినీ, అనుభూతించి సవివరం గా రాసిన ఒక చాప్టర్ ఈ సతి.

రూప్ కన్వర్ సతీ సహగమనం జరిగినప్పుడు అత్తింటి వాళ్ళు, రూప్ కన్వర్ తనంతట తానే స్వచ్చందంగా తన భర్త పార్ధివ శరీరంతో సహా తగలబడి చనిపోయిందని, ఇది గ్రామస్థులందరి సమక్షం లోనూ, తేట తెల్లంగా జరిగిన విషయం అనీ, ఘంటాపధంగా చెప్తారు.

రూప్ కన్వర్ సతి సంగతి, కన్న వారికి చెప్పనే లేదు. గ్రామం అంతా కూడబలుక్కుని ఒక 18 ఏళ్ళ అందమయిన రాజపుత్ మహిళ ని, సతి అనే దురాచారానికి బలి చేసారని కన్న వారి ఆరోపణ.

సతి జరిగిన కొన్ని రోజుల తరవాత, సతీ రూప్ కన్వర్ సజీవంగా తగలబడిపోయిన ప్రదేశంలో ఒక గుడి లాగా తయారవుతుంది. ఇప్పుడు మన ప్రాంతాల్లో వివిధ స్త్రీ ల పేర జరిగే జాతర లాగా - అక్కడ పెద్ద యెత్తున జాతర, వ్యాపారం మొదలవుతాయి.

గ్రామస్థులంతా ఈ వ్యాపారాభివృద్ధికి సంతోషించాలా, పోలీసుల, విలేఖరుల ప్రశ్నా శరాఘాతాలనించీ కాసుకోవాలా అన్న మీమాంశలో పడినట్టు కనిపిస్తారు.

రచయిత థీరీ ప్రకారం, రాజపుత్ కులస్తులు, సతీ జరగడంతో తమ ప్రతాపాల కీ, ఆచారాలకీ ఆదరణ దొరికిందని గర్విస్తారు. మార్వారీలు, వ్యాపారం పెరిగిందని ఆనందిస్తారు. ఇలా గ్రామంలో ఒక్కో కులానిదీ ఒక్కో బాధ !

పీప్లీ లో ఆఖర్న నథ్థా, గ్రామం వొదిలి పారిపోయి, డిల్లీ లో భవన నిర్మాణ కూలీ గా తేల్తాడు. అతని తోటి వాళ్ళందరూ, గ్రామాలు వొదిలి వలస వచ్చిన వ్యవసాయ కూలీలే. రైతులే ! వ్యవసాయం లో ఒడిదుడుకులని ఎదుర్కోలేక, విధాన పరమైన చిక్కుల్ని ఓర్చుకోలేక, డబ్బులేక, ఎందరో రైతులు వ్యవసాయాన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకోలేకపోతున్నారు. వ్యవసాయాన్ని మనం ఎంత నీర్సంగా తీసుకుంటున్నామో చూడండి.


రూప్ కన్వర్ సతీ లో కూడా వీధి మొగలో ఐస్ క్రీం బండీ వాడి దగ్గర్నించీ, రాజీవ్ గాంధీ దాకా, దీని వల్ల మనకేంటి ప్రయోజనం - మనకేంటి భంగం - అని ఆలోచిస్తారు తప్ప - చివరాఖరికి రూప్ కన్వర్ సంగతి / ఆవిడకి జరగాల్సిన న్యాయం సంగతి కూడా ఎవరికీ పట్టదు.

రూప్ కన్వర్ ని బలవంతంగా చంపేశారా / బ్రెయిన్ వాష్ చేసారా / ఆవిడ మానసిక స్థితి బాలేదా - ఎందుకలా చనిపోయింది ? గ్రామం మొత్తం కలిసి నేరస్థులా ? ఇలాంటి ప్రశ్నల కి సమాధానం ఎప్పటికీ దొరకదు.

రూప్ కన్వర్ శీలం మీద పనిలో పని గా కధలు వినిపిస్తాయి. పోలీసులు - చంపేశారనే అంటారు. కానీ, ఈ నేరం మీద అత్తవారిని అరెస్టు చేస్తే, గ్రామంలో ఆ మారణ కాండని చూసిన వారు, ప్రోత్సహించిన వారు, మూఢ నమ్మకం ముసుగులో గ్రామానికి రాబోయే పాప్యులారిటీ ని కేష్ చేసుకోదలచుకున్నవారూ - అందర్నీ అరెస్టు చెయ్యాలి.

రాజస్థాన్ ప్రభుత్వానీ, డిల్లీ గద్దెనూ, రూప్ కన్వర్, చచ్చి చాలా సాధిస్తుంది. కానీ అన్యాయమయిపోతుంది.

నథ్థా కూడా అంతే ! అతని కుటుంబానికి నథ్థా మిగలడు. ప్రభుత్వం నుంచీ రావలసిన సహాయమూ అందదు. మీడియా జాతరంతా, ఇంకో బ్రేకింగ్ న్యూస్ వెంబడి పరుగు తీసి పీప్లె ని ఖాళీ చేసేస్తుంది. ఎలక్షన్లు ముగియడంతో, పీప్లీ నుండీ నాయకులూ, పోలీసులూ కనుమరుగవుతారు. ఇంత కాలమూ ఈ సర్కస్ ని అంతా చూసిన గ్రామం, గ్రామస్థులూ, మళ్ళీ తమ తమ జీవితాల్లో నిశ్శబ్దంగా మునిగిపోతారు.

అయితే, ఇలాంటి సినిమాలూ, వ్యాసాలూ, పట్నాల్లో సుఖంగా పరుగులు తీస్తున్న మామూలు మధ్యతరగతి భారతీయుల్ని, ఒక సారలా తట్టి ఊరుకుంటాయి. రాజస్థాన్ లో ఇప్పటికీ బాల్య వివాహాలూ జరుగుతున్నాయి. ఇప్పటికీ సతీ సహగమనాలు జరుగుతున్నాయి (ట!) కానీ వాటిని గ్లోరిఫై చెయ్యడం - రాజకీయ కారణాల దృష్ట్యా తగ్గింది. టెలివిజన్ లో మాత్రం - సాంప్రదాయ కుటుంబాల్లో, సాంప్రదాయాలూ, ఆచారాలూ పాటించే, (నార్థ్ ఇండియన్) స్త్రీ ల దుఃఖ భరిత జీవితాన్ని గ్లోరిఫై చేస్తూనే ఉన్నారనుకోండి.

ఇంకా రైతులూ, చేనేతాజీలూ, వెధవది - టామిళ్ నాడ్ లో తిరుపూర్ గామెంట్స్ లో పంచేసే టెక్స్టైల్ కార్మికులూ - అందరూ - ఇలా ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఆత్మహత్య చాలా సంధర్భాల్లో - ఒక ఆక్రందన ! 'నాకు హెల్ప్ కావాలీ' అని - వ్యక్తి అరిచే ఒక అరుపు ! దాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు ? కొందరు రా.నా.లు 'వొళ్ళు బలిసి ఆత్మహత్యలు చేసుకుంటున్నార్రా ఈ రైతులు ! ' అని కోప్పడేస్తారు.

సరేలే ! అదంతా మనకెందుకు గానీ.. చెప్పొచ్చేదేంటంటే - మార్క్ టుల్లీ రాసిన -'No Full Stops in India చదవండి. ఇండియా గురించి మనకేటి తెల్సంటారు ? ఒక పాలి చదివితే తెలిసొస్తాది.

కాపోతే కుంజెం ఓల్ద్ హిస్టరీ. అంటరాని వర్గానికి చెందిన తన నౌఖరు ఊర్లో జరిగిన పెళ్ళి దగ్గర్నించీ, కుంభ్ మేళా, అతి పెద్ద మొదటి టెలీ సోప్ - రామాయణం, స్వర్ణ దేవాలయం, సతీ సహగమనం.. ఇలా దేశాన్ని ప్రభావితం చేసే ఉదంతాల - ఇంకో కోణాల్ని చర్చించారిందులో.

ఫాస్ట్ బీట్ జర్నలిజం ఉండదిందులో ! మనకి నచ్చేవీ, మనం వినాలనుకునేవీ కాకుండా, మనకి తెలియనివీ, మనం ఊహించనివీ, (అన్నీ తెల్సినవే), మన దేశంలో పాతుకుపోయిన బ్యూరాక్రసీ, నిష్కృయాప్రియత్వాన్నీ, ప్రజల పాట్లనీ హాస్యస్ఫోరకంగానూ, వ్యంగ్యంగానూ, కావాల్సిన చోట్ల, సీరియస్ గానూ చెప్తాడు మార్క్ టుల్లీ. మన దేశం గురించి ఒక బీ.బీ.సీ. వోడు ఎంత బయాస్డ్ గా చెప్తాడో అనుకునే వాళ్ళకి ఆశ్చర్యం కలిగి తీరుతుంది - ఆ నిజాయీతీకి, భారత దేశం మీద ఆయనకున్న ప్రేమకీ !

20/11/2010

The Financial Expert

 ''ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్'' -  ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం చదివాను. ఆర్.కే. నారాయణ్ - నా అభిమాన రచయిత, మాల్గుడీ నేనెంతో ఇష్టపడే ఊరు. ఈ ఊర్లోనే ఈ ఫీనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉండేది. పేరు మార్గయ్య.

ఒక బాంకు బయట రిజిస్టర్ పట్టుకుని కూర్చుని, అప్పులిస్తూ, డబ్బు సంపాదన మీద తోచిన సలహాలూ అమ్ముతూ జీవితాన్ని ఎలానో నరుక్కొస్తుండే వాడు. కానీ అతనిలో ఒక 'ఇది' ఉంది. అది డబ్బు సంపాయించి పెద్ద వాడవ్వాలనే 'కసి'. కానీ దారిద్ర్యం అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆఖరికి కొన్నాళ్ళకి కర్మ వశాన, శని దృష్టి వక్రీకరించి, 'మా బేంకు ముందు కూర్చుని మా (అప్పులిచ్చే) బిజినెస్సుకి అడ్డం పడుతున్నావంటూ' బేంకీ వాళ్ళు దెబ్బలాటకొస్తారు. బెంకు దగ్గర చెట్టు కింద తన పేషీ కోల్పోయాక, ఆదాయం కోసం పడరాని పాట్లు పడతాడు. అతనికి డబ్బు విషయంలో తన ప్రావీణ్యాన్ని అమ్ముకోవడం తప్ప ఇంకో విద్య తెలియదు. అప్పు తీర్చవలసిన వాళ్ళు ఇంకా ఉండనే ఉన్నారు ! (డబ్బు సర్క్యులేషన్ లో వుంది) వడ్డీలు (చక్ర వడ్డీ) ఇంకా కొందరు కట్టనే లేదు. చేతిలో చిల్లి గవ్వ ఉండని పరిస్థితి. దానికి తోడు మార్గయ్య కొడుకు కేవలం పెంకితనానికి అతని రిజిస్టర్ని చింపి దాన్ని కాలువలో పడేస్తాడు. అందులో చిట్టా పద్దులన్నీ - మార్గయ్య అప్పిచ్చిన వాళ్ళ వివరాలు వగైరా ఒక్కసారి పోతాయి. అవన్నీ ట్రేస్ లేకుండా కొడుకు ఇలా భగ్న పరచడంతో అతని వెన్ను విరిగినట్టు అవుతుంది. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో, అతనికి ఏదో ఒక ఆదాయ మార్గం కావాలి. కొడుకుని నాలుగు వాయంచినా, వాడంటే ప్రాణం మార్గయ్యకి. భార్యా బిడ్డల్ని ఎలానో ఒక లా పోషించుకోవాలి. ఏ ప్రయత్నమూ ఫలించక.. భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకోవడం ఎలా అని భయపడిపోతాడు మార్గయ్య ! ఈ పరిస్థితులే అతన్ని దేవుడి వైపు మొగ్గేలా చేస్తాయి. ఇలాంటి ఖర్మ కాలి, జీవితం మీద ఆశ పూర్తిగా కోల్పోయిన రోజుల్లో ఎవరో చెప్పారని లక్ష్మీ పూజ చేస్తాడు మార్గయ్య. [డబ్బు అనే విజన్ ఉన్న వాడు కాబట్టి లక్ష్మీ దేవి కటాక్షం కోసం వెంపర్లాడతాడు]


ఈ పూజకి ఏమేమి వస్తువులు కావాలో అవి ఖచ్చితంగా - తూ, చా, తప్పకుండా, ఆవు పాలు, బురద కుంట లోని కమలం - ఘృతం - ఇంకేవో - అలా. ఇలా పూజ సామాగ్రి సేకరించడం అతనికి రివాజుగా మారుతుంది. అలానే ఒక రోజు అడవిలో ఏదో (పూజకే) తెచ్చుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఇంకోడు డాక్టరును  అంటూ ఒక 'పాల్' (డా. పాల్) కలుస్తాడు. అలా మాటా మంతీ కలిసి ఇద్దరూ స్నేహితులవుతారు. డబ్బు కోసం అతని మాట విని బొమ్మలతో సహా 'సెన్సువల్  (sex)' సాహిత్యాన్ని ముద్రించడం మొదలు పెడతాడు. అది బంపర్ హిట్ అయి, వెంటనే అతని సక్సెస్ గ్రాఫ్ పైకి ఎగబాకుతుంది. ధనార్జన పెరుగుతుంది. అతను ఇంతకు ముందు ఏ బాంకు ల ముందు డబ్బా పెట్టుకుని కూర్చునే వాడో ఆ బాంకు ల కన్నా ఎక్కువ డబ్బు చేరుతుంది.  స్వతహాగా మార్గయ్యది ఒక 'అహనా పెళ్ళంట లో కోట శ్రీనివాసరావు' లాంటి పిసినారి/greedy మనస్తత్వం. దానికి ఈ  డబ్బు  పైత్యం కూడా తోడవ్వడంతో సమాజంలో కొద్దో గొప్పో (బైటికి కనబడని) నిరసన కూడా ఎదురవుతుంది.


జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను అనుభవించిన మార్గయ్య మార్గయ్య చెట్టు కింద పద్దులు రాసుకునే సామాన్యుడిగా జీవితం ఆరంభించినపుడు అతని సర్వస్వమూ ఆ రిజిస్టరే !  ఇప్పుడు జీవితం కుదుటపడిందయ్యా అనుకునేసరికి, (డబ్బు కోసం గడ్డి కరిచినా - డబ్బున్న వాడు డబ్బున్న వాడే - వాడి జీవితం నిలదొక్కుకున్నట్టే!) కొడుకు (ఈ Sex literature,  డబ్బు కారణంగా) చెడిపోయాడని, చెడు అలవాట్ల పాలయ్యాడనీ తెలుస్తుంది. కొన్నాళ్ళకి కొడుకు ఇల్లొదిలి పారిపోతాడు. ఎంతో కష్టపడి, అతని గురించి వాకబు చేసి ఇంటికి తీసుకొచ్చిన మార్గయ్య - అప్పటికీ కొడుకు మీద ఏవో ఆశలు పెట్టుకుంటాడు.

మొత్తానికి జీవితం చివరి అంకానికి వచ్చేసరికీ, బిజినెస్సు లో మోసం ఎదురయ్యి కొంతా (partner డబ్బంతా చేజిక్కించేసుకుంటాడు) , పరిస్థితులు కలిసి రాక కొంతా - నష్టాలు పలకరిస్తూ, చివరికి జోలె ఖాళీ అవుతుంది. మార్గయ్య బ్రతుకు ఎక్కడి నుంచి బయలు దేరిందో అక్కడికే చేరుతుంది. ఇంక చెయ్యడానికి ఏమీ లేక, కొడుకుని పద్దులు రాయడానికి,  అలాంటిదే ఓ రిజిస్టరు ఇచ్చి చెట్టు కింద కూర్చోమంటే, చెడిపోయిన కొడుకు నిరాకరిస్తాడు.


ముసలి అయిపోయిన మార్గయ్య మళ్ళీ యధా ప్రకారం చెట్టు కింద బేంకు ముందర అదే బల్ల, అలాంటి రిజిస్టరే పట్టుకుని కూర్చుంటాడు. స్థూలంగా ఇదీ కధ. అయితే ఇందులో irony  మార్గయ్య జీవితాంతం డబ్బు వెనకే పరుగు పెట్టినా, జీవితంలో మిగతా అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టక, నిర్లక్షం చేసి, ఆఖరికి డబ్బు చేతే నిర్లక్షం చేయబడతాడు.  డబ్బు కన్నా మానవ సంబంధాలు మెరుగైనవి అని తెలుసుకునే సరికీ పుణ్యకాలం వెళ్ళిపోతుంది.   అదీ - ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కధ ! ఎలక పందాల్లో గెలిచినా నువ్వు ఎలకవే అని అందరూ ఒప్పుకున్నా - ఎలక పందాల్లో పాల్గొనక మానరు. అదో విష్ణుమాయ !

14/11/2010

మామయ్య కు అభిమానంతో,



దాదాపు ఆరేడేళ్ళుగా కేన్సర్ తో తీవ్రంగా పోరాడి, ఈ రోజు మావయ్య మమ్మల్ని విడిచి, అమ్మవారి దగ్గరకు వెళ్ళిపోయాడు. జీవితంలో ఎన్నో విషాదాలను ధైర్యంగా ఎదుర్కొని, శాక్తేయంలో సర్వాన్నీ మరిచి, పులిలా బ్రతికి వెళ్ళిపోయిన మా పెద్ద మావయ్య, శ్రీ రామకృష్ణ గారికి ఎంతో అభిమానంతో నా ఈ అశృనివాళి. ఇంత కన్నా ఎక్కువ చెప్పడానికి దుఃఖం అడ్డొస్తూంది. కేన్సర్ కి సిగ్గుండాలి. డౌన్ డౌన్ కేన్సర్. జై హో మావయ్య !

పై ఫోటో లో మావయ్య, తన స్నేహితులు, నాద బ్రహ్మ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి తో ! (ఈ ఫోటో నేనే తీసేను విశాఖపట్నంలో మావయ్య వాళ్ళింట్లో, సాగర్ నగర్.)

02/11/2010

Charlie, Chocolate Factory, Diwali

దీపావళి రోజులు. ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా ప్రకటనలు. నా బుల్లెమ్మకి టీవీ పెట్టేసి ఏడ్స్ పెట్టేస్తే చాలు, నోరు స్పూను కు అనుగుణంగా, తొందరగా తెరుచుకుంటుంది. లేకపోతే, కొంచెం కష్టం.

పైగా దుకాణాల్లో భారతదేశపు నెంబర్ వన్ చాక్లెట్ కంపెనీ కాడ్బరీ ఇండియా లిమిటెడ్ - ఇస్ దివాలీ కో ఆప్ కిసే ఖుష్ కరేంగే ? అని ప్రశ్నా శరాలు సంధించేస్తూంది.

ఇప్పుడు దీపావళికి చాక్లెట్లూ, స్వీట్లూ ఇవ్వడం కన్నా ఎవర్ గ్రీన్ పుస్తకాలు ఇస్తే మంచిదనిపించి, మా 10 ఏళ్ళ బావగారబ్బాయికి, రాల్డ్ డహల్ రాసిన చార్లీ ఎండ్ ద చాక్లెట్ ఫేక్టరీ కొనిచ్చా. నాకే గనక ఎవరైనా ఆ పుస్తకం చిన్నప్పుడిచ్చుంటే, ఓలమ్మోర్నాయనో - వాళ్ళని తెగ గుర్తుపెట్టేసుకుందును. కానీ ఈ పుస్తకం పాతికేళ్ళు దాటాకా, చేపట్టి - అప్పట్నించీ రాల్డ్ కు వీర ఫేన్ అయిపోయాను.

మా అబ్బాయి కి ఈ పుస్తకం ఏమాత్రం నచ్చుతుందో నాకు ఐడియాలేదు. చార్లీ - బీదరికం, ఒకే బెడ్డ్ మీద ఒక వైపు అమ్మమ్మా, తాతారూ, ఇంకో వైపు నానమ్మా, తాతారూ సర్దుకుని పడుకుని, ఒకే రజాయి కప్పుకుని - ఒకే గదిలో చార్లీ అమ్మా, నాన్నల తో కలిసి సంతోషంగా వుండటాన్ని ఈ తరం 'అన్నీ ఉన్న ', కేవలం అమ్మా, నాన్నల తో మాత్రమే వుండే బాబు అర్ధం చేసుకుంటాడా అని అనుమానం.

నా చిన్నప్పుడు, రంగయ్యా, రంగమ్మా - రాత్రి పూట, మట్టి కుండలో వేడి అన్నం వండుకుంటూఉండే చందమామ శంకర్ ఇలస్ట్రేషన్ ఎంత స్వీట్ గా అనిపించేదో గుర్తొస్తుంది.

ఇప్పుడు, మనకున్న ఒక్కగానొక్క సంతానమూ, దీపావళి కోసం అయిదేసి వేల రూపాయలు పెట్టి పటాసులు కొనిపించుకుంటూన్నప్పుడు - వాళ్ళకి బీదరికంలో గ్లామర్ అర్ధం కాపోవడంలో వింత లేదు.


చార్లీ ఎండ్ ద చాక్లెట్ ఫాక్టరీ కధ సంగతి ఏమిటంటే, చార్లీ లాంటి కడు బీద కుర్రాడు - ఆ ఊర్లో విల్లీ వోంకా అనే ఒక పెద్దాయన నడిపే చాక్లెట్ ఫాక్టరీ లో ఒక కాంపిటీషన్ లో గెలిచి - ఆఖర్న ఆ ఫాక్టరీని గెలుచుకోవడం ! విల్లీ వోంకా - ఒక సారొక ప్రకటన ఇస్తాడు. తమ కంపెనీ చాక్లెట్లలో (ఇపుడు లక్స్ సబ్బులో బంగారం గెలుచుకోవడంలా) రేపర్ లో తన ఫాక్టరీ ని సందర్శించే అవకాశం కల్పించే ఇన్విటేషన్ ముద్రించినట్టు, ఆ చాక్లెట్ రేపర్లు (ఒక అయిదు) ఎవరు తెస్తే (ఆ పిల్లలకు) వారికి ఫేక్టరీ లో ఇంకో పోటీ పెడతాననీ - దాన్లో గెలిస్తే, యూ కెన్ విన్ ద ఫాక్టరీ ! అని !

అంతే, ఊర్లో తెగ సంత మొదలవుతుంది. పిల్లల్లో ఈ ఫాక్టరీ గురించి ఉత్సుకత, క్రేజ్ ! అయితే చిన్నప్పట్నించీ ఈ ఫేక్టరీ పరిసరాల్లో, పెరిగి, కోట లాంటి ఆ తలుపుల వెనుక ఉన్న ఫాక్టరీ, అక్కడ తయారయ్యే చాక్లెట్ గురించిన కలలు కంటూ వస్తున్న చార్లీ లో చిన్న ఆశ ! కానీ ఆ లక్కీ చాక్లెట్ తనకు దొరకాలంటే మాటలా ?

ఎంతో అత్భుతమయిన కధనం, చార్లీ మీద మనకు కలిగే ప్రేమా - చార్లీ కుటుంబ సభ్యుల చిన్న చిన్న త్యాగాలూ - విల్లీ వోంకా సహ్రుదయతా, మిగిలిన నాలుగు రేపర్లు సంపాయించిన నలుగురు పిల్లల పాత్రలూ - అన్నీ చార్లీ ఎండ్ ది చాక్లెట్ ఫేక్టరీ ప్రతిష్ఠ ని అజరామరం చేస్తాయి.


దీనికి సీక్వెల్ కూడా వుంది. ఇదే చార్లీ పరివారం, విల్లీ వోంకా తో కలిసి అంతరిక్ష యానం చేస్తారు. అది - చార్లీ ఆ ఫేక్టరీ గెల్చుకున్నాకా, యజమాని హోదాలో ఒక మేజిక్ ఎలివేటర్ - గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ లో చేసే మేజిక్ ప్రయాణం.

అభూత కల్పనలు - అమాయకత్వం, అబ్బురపరిచే విన్యాసాలూ - బాల సాహిత్యంలో రాల్డ్ డాహల్ చేసిన అత్భుత సృష్టి నాకు చాలా ఇష్టం.

ఇంతా చేసి - డహల్ కేవలం బాలల రచయిత కాదు. ఈయన కధలు చాలోటి తెలుగులో మనం ఎప్పుడో యండమూరి కలంలో చదివేసాం. వీటిల్లో ప్రముఖం అయినది - దుప్పట్లో మిన్నాగు అనే కధా సంకలనం. ఈ పుస్తకంలో అన్ని కధలూ, రాల్డ్ డహల్ కధల స్వేచ్చానువాదాలు ! ఏమో, ఆ విషయం యండమూరి ఒప్పుకోరనుకోండి.

మొత్తానికి ఈ దీపావళికి అందరికీ శుభాకాంక్షలు. టపాకాయల రూపంలో డబ్బులు తగలబెట్టుకుని ఆనందిస్తామనుకోండి. పర్యావరణం, టపాసుల తయారీ లో వెట్టికీ, దోపిడీ కి గురయ్యే బాల కార్మికులూ, అన్ ఆర్గనైస్డ్ సెక్టార్ లో ఉన్న మామూలు కార్మికులూ, ప్రమాదాలూ, ఇవన్నీ మీడియాలో చర్చకు రావాలి నాయంగా.

నా తరఫునుంచి మాత్రం, దీపావళి మర్నాడుదయం వీధుల్ని శుభ్రపరిచే మునిసిపల్ కార్మికులకు సలాం. మా బుల్లెమ్మ రెండో దీపావళి. బుల్లెమ్మ కి ఎప్పుడు చెప్తానో ఈ చార్లీ కధ ! .. హ్మ్మ్మ్ !

18/10/2010

Untouchable - Mulk Raj Anand






సత్యవతి గారి టపా చదివాక ఇది గుర్తు వచ్చింది. పాకీపని వాళ్ళమీద జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం కూడా గుర్తు వచ్చింది. కానీ ఇక్కడ చాలా లోతుగా హృదయాన్ని స్పృశించే అంశం - మన పాత కాలం నాటి అమానుష ఆచారాలు, కులం, వర్ణ వివక్ష! చిన్నప్పట్నించీ 'అంటరానితనం మహా పాపం అని నోటు పుస్తకాల అట్టల మీద చదువుతూ వచ్చి మడి కట్టుకున్న నానమ్మని సతాయించే మూర్ఖపు అమాయకత్వం నుంచీ ఎప్పుడు బైటికి వచ్చామో గుర్తు తెచ్చుకోవాలి. 

ఇప్పటికీ, భారత దేశంలో చాలా చోట్ల పారిశుధ్ధ పనివారు సత్యవతి గారు చెప్పిన విధానంలోనే మానవ వ్యర్ధాల్ని ఇంటింటి నుంచీ సేకరించి, తలలపై మోసి, శుభ్రపరిచే పనిలోనే జీవిస్తున్నారు. చీ ! అలాంటి వాళ్ళని ఎలా ముట్టుకోవడం ? ఈ ప్రాక్టీస్ - మనలాంటి ఇంకో మానవమాత్రుడు / స్త్రీ, మన నైర్మల్యాన్ని తాకడం, శుభ్రం చేయడం, అమానుషమని కొన్ని తరాల ముందు మాత్రమే, ఆలోచించడం జరిగింది. ఇప్పుడైతే, ఇది చట్ట ప్రకారం (కాయితాల మీద) అన్యాయం. ఈ రోజుల్లో, శౌచాలయాల సాంకేతికత పెరిగినా కూడా ఇలాంటి పద్ధతినొకటి మన దేశం ఇంకా వొదులుకోకపోవడం అన్యాయం. 

 అయితే, మనలో ఎందరు సత్యవతి గారిలా, మనసుతో ఆ భావాన్ని అనుభూతిస్తారు ? ఎవరు ఒక పారిశుద్ధ కార్మికుని మనోగతాన్ని అర్ధం చేసుకుంటారు ? హీనాతి హీనమైన ఆ బ్రతుకుని ఎవరు దగ్గరగా చూడగలరు ? ఎవరు ఆ బాధని అర్ధం చేసుకుంటారు ? సరిగ్గా ఇదే భావనతో ముల్క్ రాజ్ ఆనంద్ 'అన్ టచబుల్' అనే ఒక నవల ని 1935 లో రాసారు. దీనికి ముందుమాట ఈ.ఎం.ఫోర్స్టర్ (EM Forster) ది. 

ఈ కధ 18 ఏళ్ళ బాఖా ది. ఈ బాఖా, పెద్ద పాకీ మేస్త్రీ లాఖా కొడుకు. ఊరికి దూరంగా విసిరివేయబడిన అంటరానివారి కాలనీలో నివాసం. లాఖా కి కంటోన్మెంటు (Soldier's Barrack)  లో పని. బాఖా కి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ప్రతి ఉదయం, వరుసగా కట్టిన లావెట్రీ లలో ఊరి వారు విసర్జించిన అశుద్ధాన్ని, వొంచిన తల ఎత్తకుండా, ఇసుకా, గడ్డీ కలిపి ఎత్తడం, వాళ్ళు తిట్టిన బూతుల్ని నోరెత్తకుండా వినడం, వేడి నీటిలాంటి 'చా' (Chai) తప్ప ఏమీ తీసుకోకుండా కాలే కడుపుతో మధ్యాహ్నం దాకా పని చేయడం - ప్రతిఫలంగా ఎంగిలివీ, అంటువీ, మిగిలిన రొట్టెలు ఎవరైనా ఇస్తే తినడం. ఇదే బాఖా జీవితం. 

బాఖా చెల్లెలు, యవ్వనంలో ఉన్న అందగత్తె. అంటరాని కులానికి చెందినదే అయినా, ఆమె సౌందర్యాన్ని అగ్రకులాల వాళ్ళు కూడా వక్ర దృష్టి తో చూడటం పరిపాటి. మంచినీళ్ళ బావి దగ్గర స్వయంగా నీరు తోడుకోవడానికి లేదు. ఈమె బాధ్యత, ఇంటి లొ వంట చేసి, తండ్రికీ, సోదరులకూ వడ్దించడం. వంట చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి, కనీసం కడుపునిండా నీళ్ళయినా తాగడానికి మంచినీళ్ళకు వెళ్ళీ, బావికి కాస్త దూరంలో మిగిలిన నిమ్న జాతి స్త్రీల తో, వారికి కూడా కాస్త ఎడంగా కూర్చుని, ఏ పుణ్యాత్ముడో, దయతలచి, ఒక కడివెడు నీళ్ళు తోడి వీళ్ళకు పోస్తే సరి. లేకపోతే, ఆ నీళ్ళు కూడా దక్కవు. బావిని వీరు తాకడానికి లేదు. మౌనంగా ఎండలో ఎదురుచూడటమే వీరి పని. 

బాఖా తమ్ముడు కొంచెం పనిదొంగ. అందుకే, బాఖా, తండ్రి పని తలకెత్తుకుని వొళ్ళు చూసుకోకుండా ఈ పారిశుద్ధ్యపు పని చేస్తూనే, తన తోటివాళ్ళతో హాకీ ఆడటం కోసం మనసులోనే కలలు కంటూంటాడు. బాఖా కంటోన్మెంటు లో జవాల్న లెట్రిన్లు తుడుస్తూన్నప్పుడు అతనికో మంచి సిపాయితో పరిచయం కలుగుతుంది. బాఖా కు ఒక హాకీ కర్ర ని ఇస్తానని ఆ సిపాయి ప్రమాణం చేస్తాడు. బాఖా లాంటి అంటరానివాడు, ఈ సిపాయి ఏ పాత హాకీ కర్రనొ ఇస్తాడని భావిస్తాడు, తీరా ఆ సిపాయి సరికొత్త హాకీ కర్ర ని ఇచ్చేసరికి, బాఖ కు నమ్మశక్యం కాక, కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఆశ్చర్యంతో మాట రాదు. మనుషుల్లో ని ఆ మాత్రం కరుణ ని ఏనాడు ఎరిగి ఉండని అతని హృదయం ఆ ఆప్యాయ బహుమతి ని చూసి ఆనందంతో తన్మయమవుతుంది. 

Untouchable అంతా బాఖా జీవితంలో ఒక రోజు గురించి వివరిస్తుంది. ఈ ఒక్క రోజు చాలు. అంటరానితనం ఎంత హేయమైనదో పాఠకుడు అర్ధంచేసుకోవడానికి. బాఖా కళ్ళతో ప్రపంచాన్ని చూడటం, ఆ జీవితాన్ని జీవించడం - ఎంత కష్టమో తెలుసుకోవడానికి. అద్దంలో మన సమాజాన్ని చూసుకోవడానికి, సిగ్గుపడటానికి, ఈ పద్ధతులను నిరశించి, గాంధీ సృజించిన హరిజన పదం - ఎంత గొప్పదో అర్ధం చేసుకోవడానికి. 

కధలో హరిజనుల గురించి, అంటరాని, వెనుకబడిన కులాల వారిని ఆకర్షించడానికి చూసే ఇతర మత ప్రచారకులను, కొత్త (కధా కాలం నాటికి) శౌచ్య విధానాల (శుభ్రపరచేందుకు మనుష్యుల ప్రమేయం లేని) ప్రచారం గురించి యోచనా - ఇవన్నీ ఆసక్తికలిగిస్తాయి. వివిధం గా బాఖా లాంటి హరిజనుల జీవితాల్ని పరిచయం చేస్తూ, మానవత్వ భావనను విరజిమ్మే అన్ టచబుల్ ని తప్పకుండా చదవండి. టపా ఇన్నాళ్ళకి రాయడానికి స్ఫూర్తినిచ్చిన సత్యవతి గారికి ధన్యవాదాలు.





06/10/2010

Nice Ads.

TATA SKY - Very timely and to the point.



Nestle Munch - Vijender is rocking.



AXIS BANK Axis Bank has been the largest banker for Ind Army and now facing competetion from ICICI.




Cadburys Five Star Bar - Stupid ?! Not at all.

28/09/2010

నో కా బ్లా స Season 2

'నో కా బ్లా స' సూపరు హిట్టు పోస్టు అయింది. ఎడారిలో ఒయాసిస్సులా - బీటలు వారిన భూమి మీద లేలేత వాన చినుకుల్లా, ఆకలితో అలమటిస్తున్న పేదవాడికి పంచభక్ష్య పరమాన్నం లా (అ..క్ష..రా..లా..) 40 కామెంట్లు ఇప్పటివరకూ ! గడ్డిపూలు కళకళ్ళాడాయి. అయితే, నేనింత దాకా రిప్లయి సమాధానం ఇవ్వనందుకు సభ్యులు క్షమించాలి. బుల్లెమ్మ కి కుంచెం అనీజీగా వుంటేనూ, రెండ్రోజులు ఇటు తొంగి చూళ్ళేదు. కానీ, ఆఫీసులో ఎపుడైనా కామెంట్లు వచ్చేయో లేదో చూడటం, ప్రచురించుకుని మూడొందల ముప్పయి నాలుగోసారి మురిసిపోవడం వగైరా బాగా జరిగాయి.

మొదటగా - వ్యాఖ్యానించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేనస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. మొదటి వ్యాఖ్య భాస్కర రామిరెడ్డి గారికి చాలా వినమ్ర నమస్కారాలు. సత్యం వచించారు.

సభ్యత్వం కోసం చాలా మంది బ్లాగర్లు పోటీ పడ్డారని చెప్పడానికి పట్టలేనంత ఆనందిస్తున్నాను.

కానీ, నా నో.కా.బ్లా.స పోస్టు కే చాలా వ్యాఖ్యలు వచ్చినందుకు దీని 'వెరీ స్పిరిట్' కి అన్యాయం జరిగిందని కూడా పలువురు అభిప్రాయపడ్డారు.

నేనే, ఎవరి బ్లాగు లోనూ కామెంటనని కూడా చీవాట్లేసేరు.

నా బ్లాగు లోనే కామెంట్లకి సమాధానం ఇవ్వానని కూడా మిత్రులు తలంటారు.

శరత్ గారు పదవి ఇమ్మన్నారు.

పద్మ గారు 'కామెంట్లొస్తేనే బాధ ! రిప్లయి ఇవ్వాలి !' అని Absolute Truth వచించారు.

కొన్ని అర్ధం కాని అభిప్రాయాలు (ఆడవాళ్ళకి ఎక్కువ కామెంట్లు వస్తాయి-ఆకాశ రామన్న) వగైరాలు కూడా ఉన్నట్టు తెలుసుకున్నాను.

టెంప్లేట్ గురించిన సూచనలు స్వీకరించాను. పూర్తిగా అమలు చెయ్యడానికి కుస్తీ పట్టాలి వీలును బట్టీ.

మొత్తానికి అసలు మొదలంటూ పెట్టాను కాబట్టి, దీన్లో సభ్యత్వం కోరుకున్న వాళ్ళందిరికీ, విత్ డ్యూ వెరిఫికేషన్, ఫ్రీ సభ్యత్వం ఇచ్చేస్తున్నా. ఇచ్చేస్తున్నా. సభ్యత్వ రుసుము ఏమీ లేదు.

సుజాత గారి లాంటి సానపెట్టిన వజ్రాలకు (పాప్యులర్ బ్లాగర్లకు) గౌరవ సభ్యత్వం ఇద్దామనుకుంటున్నా. వీళ్ళ దగ్గర మనం ట్యూషన్ లో చేరొచ్చు. ఆస్పత్రిలో చేరి, బాగుపడి ఇంటికొచ్చేసే రోగుల్లాగా, మనం ఈ సంఘంలో చేరి, అధ్వాన్నత నుంచి, ధన్యత కి ప్రయాణం చేసి, ఇంకా, బ్లాగ్ లోకంలో పైకి, పైపైకి చేరి, బోల్డన్ని పేరు ప్రఖ్యాతులు గడించేద్దాం. కామెంట్లే ప్రమాణం కాదని కూడా ఒట్టేసుకుందాం. (ఓథ్ / OATH అన్నమాట) శరత్ గారి పదవి సంగతి కేబినెట్ తో చర్చించి నిర్ణయిస్తా. మితృలు బులుసు సుబ్రమణ్యం గారు మాంచి పేరు (కాలే బ్లాస) సూచించారు. దీన్నీ కేబినెట్ కమిటీ కి పంపించా. చూద్దాం. (ఇంతకీ కాబినెట్టులో ఏమీ లేదు. ఖాళీ!) సరే ! ఇంక ఆపుతా !

నిజాయితీగా, నాకేం కార్యాచరణ గురించి ఐడియాలు లేవు. ఏదో సరదాకి టపాయించేను. అందరూ సరదాగా వ్యాఖ్యానించడం కూడా చాలా బాగా అనిపించింది. బుల్లెమ్మ ఫిట్ అయ్యాక, తప్పకుండా దీని గురించి కొంచెం సమయం, ఎనర్జీ, (శాయశక్తులా) ప్రయత్నిస్తాను.
నో.కా.బ్లా.స. కు సంఘీభావం తెలియచేసిన అందరు మితృలకూ, హృదయపూర్వక ధన్యవాదాలు.

24/09/2010

'నో కామెంట్ల' బ్లాగర్ల సంఘం

హలో ఎవ్రీబడీ ! బ్లాగుల్లో ఈ మధ్య ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్ ని చూసి నాకూ ఓ పెద్దగా పనికిరాని ఆలోచన వచ్చింది.

ఈమధ్య బ్లాగర్లు జట్ట్లు జట్ట్లుగా, ఊర్ల వారీగా, ప్రాంతాల వారీగా, రక రకాల భావసారూప్యాల వారీగా,వృత్తుల వారీగా, వ్యాపకాల వారీగా, కామెంట్ల వారీగా బ్లాగర్ల సంఘాలు తెరవడం, (ఆ తరవాత ఏమి జరుగుతుందో నాకూ తెలీదు - with few exceptions though) - ఫాలో అప్ చేసుకోవడం వగైరా బాగా నడుస్తోంది కాబట్టి నేనూ ఒక బ్లాగర్ల సంఘం తెరుద్దామని మధ్యాన్నం పగటి కల తర్వాత నిశ్చయించుకున్నాను. అదే ఈ 'నో.కా.బ్లా.స.' అనగా - నో కామెంట్ల బ్లాగర్ల సంఘం. అంటే ఈ బ్లాగర్లు ఎక్కడా ఏమీ కామెంటరని కాదు. అస్సలు కామెంట్లు రాలని టపాలు రాయటమే వీళ్ళ ప్రత్యేకత ! అనగా కామెంటు పెట్టే అవకాశం తమ తమ బ్లాగుల్లో ఇచ్చినా కూడా పెద్దగా వ్యాఖ్యలు రానివాళ్ళు ఈ సంఘం లో వీజీ గా చేరొచ్చు.

బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో ఉండే ఉత్సాహం ఇప్పుడు లేదు. ముఖ్యంగా, ఈరోజే ఎవరో బ్లాగులో చదివినట్టు - కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైపులో - పోస్టు రాయడం, ఆ వచ్చే ఒకటీ, అరా లేదా సున్నా వ్యాఖ్యల కోసం కళ్ళల్లో వొత్తులు వేసుకొని ఎదురు చూడటం - వగైరాలు నా ఒక్కరికే సొంతాలు కావేమో అనిపించింది.

ముఖ్యంగా నేను ఎంతో మనసు పెట్టి రాసిన కొన్ని టపాలకు (నా సొంత రేటింగు ప్రకారం - కొన్ని పుస్తక పరిచయాలు) రాలని చెప్పట్లు, కొన్నాళ్ళకి నాకే స్టుపిడ్ అనిపించే ఇంకో రకం టపాలకు భలే వినిపిస్తాయి. ఒక సారి సుజాత గారిని టిప్స్ కూడా అడిగినట్టు గుర్తు. కానీ సలహాలని కేష్ (వ్యాఖల / పాపులారిటీ రూపంలో) చేసుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యాను.


కారణాలేమైనా కానీ, చాన్నాళ్ళ నుంచీ బ్లాగు రాసినా, అందులో సంగతి లేక సగం, ఇంకో సగం నాకు తెలీని కారణాల వల్లనూ, నా సేల్స్ గ్రాఫ్ (Comments) ఇన్ని సంవత్సరాలనుంచీ, దారిద్ర్య రేఖ కు (కనాకష్టం గా 3-4 వ్యాఖ్యలకు) దిగువునే ఉంది గాబట్టి, నానూ ఒక ఐ.కా.స పెడతాను.


చేరబోయే వాళ్ళు కామెంటు చెయ్యక్కర్లేదు. ఇంతకీ నా 'నో.కా.బ్లా.స.' / 'ఐ.కా.స' నియమాలు ఏమిటంటే, ఏమి రాసినా కామెంట్లు రాని బ్లాగర్లకు దీన్లో సభ్యత్వం ఇస్తాం. (ను!) అదేంటో, మనం పోస్టు పెట్టిన్రోజే, కూడల్లో ట్రాఫిక్ ఎక్కువయి, మనం అట్టడుక్కి తరవాత పేజీ నుంచీ బైటికీ - అయిపోయి బహుసా కామెంట్లు రావట్లేదు అనుకునే వాళ్ళకు కూడా సాదర ఆహ్వానం.

ఇతరుల దృష్టి లో పడాలని ఎంతగా ప్రయత్నించినా, కొన్ని రకాల వ్యక్తిగత, వృత్తి పరమైన కారణాల మూలంగా బ్లాగ్లోకంలో ఒంటరి గా ఫీలయిన వాళ్ళకు గౌరవ సభ్యత్వం అందచేస్తాము (ను!). సెక్స్, రాజకీయాలు, కుట్రలు, తవిక, గాసిప్, వార్తలూ, సినీమా, మతం - ఇలా జనాల్ని ఆకర్షించే అత్భుత విషయాల మీద అనర్గళంగా రాసే ప్రతిభ లేని వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వొచ్చు. ఈ సంఘం లో ఎవరు & ఎందరు చేరబోతున్నారో చూసి, దానిబట్టి మిగతా కార్యాచరణ అంటే మీటింగులూ వగైరా ప్లాన్ చెయ్యబడుతుంది.

ఈ టపా చదివి విచిత్రంగా పెట్టిన మీ మొహాల మీదుగా జూం చేసిన క్లోసప్ షాట్ మీద భయంకరమైన రాంసే బ్రదర్స్ తరహా నేపధ్య సంగీతంతో -



బ్రేక్.


----


------



-------- {మళ్ళీ కలుద్దామా.. ప్లీజ్ ? }

22/09/2010

తప్పక చదవండి - విజయా వారి 'మాయా బజార్'


మాయాబజార్ - అశేష తెలుగు సినీ అభిమానులకు కొంగుబంగారం. వీళ్ళూ, వాళ్ళూ, పెద్దలూ, బడుగులూ, పిల్లలూ, పిడుగులూ అని లేదు. ఎవర్ని కదిలించినా మాయాబజార్ వాళ్ళ అభిమాన చిత్ర రాజం అని చెప్పక తప్పరు. ఎన్నో సన్నివేశాలూ, మనసుకు హత్తుకుపోయే సంభాషణలూ, మన బాల్య జ్ఞాపకాలతో పెనవేసుకుపోయిన అబ్బురపరిచే నృత్య సగీత మాయా విశేషాలు.

నేను స్కూల్లో ఉన్నపుడు చూసాను, సినిమాలో రాక్షసుల ఎటెండెన్సు తీసుకోవడం. 'పేర్ల పట్టిక' తీసి చిన్నమయ వాళ్ళ హాజరీ తీసుకోవడం. బాకా ఊదగానే funny రాక్షసుల ఫాలిన్ కావడం (వరుసలో నించోడం).
చిన్నమయ పేరు పేరునా పిలుస్తాడు.

''దుంధుభీ''
'అయ్యా !' - (ఎస్స్ సార్)

''ధుంధువా ''
''హై గురూ ''

'ఉగ్రా - పగ్రా - గగ్గోలకా - గంద్రగోళకా' - అందరూ పలుకుతారు 'వై గురొ' , 'జియా' - అంటూ !.. ఆఖర్ని 'లబూ జంబూ - అని రెండుసారులు పిలిస్తే గానీ రారు ఆవలించుకుంటూ ఈ లంబూ జంబూ !


'బాగా చౌవుకున్నారో మీకు వాక్శుద్ధి చేస్తాను. లేదా ఘటోత్కచుల వారు వచ్చి మీకు దేహ శుద్ధి చేస్తారు' - అంటాడు చిన్నమయ ! ఈ సన్నివేశమనే కాదు.. వివాహ భోజనంబు నుంచి, లాహిరి లాహిరి దాకా, మధురమైన నేపధ్య గానాలు - (నేను ఇప్పటికీ మా బుల్లెమ్మ అన్నం తినకపోతే అటు తంతాం, ఇటు తంతాం తంతాం తంతాం తంతాం అంటే ఏమర్ధం అవుతుందో భలే నవ్వుతుంది) - ఎన్నని నెమరు వేసుకోగలం? అన్నీ పసందైనవే !

ఈ డైలాగులు - ఈ సినిమా సృజించిన బోల్డన్ని కొత్త తెలుగు పదాలు - ప్రస్తుతం మన పత్రికల వాళ్ళు ఎక్కువగా ఎత్తుకుపోయినా, చాలా మటుకూ మన జీవితాల్లోకీ 'పరవేశించాయి'.

ఉదాహరణ కి - 'అసమదీయులు', 'తసమదీయులు', 'వీర తాడు' - మొదలయినవి.


ఈ సినిమాని చదివితే ఎలా వుంటుందో అని అవిడియా తట్టినట్టుంది ! 2007 లో మాయాబజార్ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా రావికొండలరావు రచించగా ఆర్కే బుక్స్ వారు అచ్చొత్తారు. వెల : నూర్రూపాయలు. విశాలాంధ్రా లో దొరుకుతాయి. చాలా పాత న్యూస్ ! బ్లాగర్లు అంటే చాలోటి మంది పుస్తకప్రియులు కాబట్టి, అందునా మాయాబజార్ కున్న అపారమైన జనాకర్షణా సామర్ధ్యం తెలిసిందే కాబట్టి, పుస్తకం (Subject) గురించి పెద్దగా పరిచయం చెయ్యక్కర్లేదు.


మాయాబజార్ గురించి, చాల సమాచారం అందుబాటు లో ఉంది. ముఖ్యంగా కలర్ మాయాబజార్ విడుదల కు ముందు ప్రచార సాధనాల్లో హోరెత్తిన సమాచారం ఇంకా పచ్చిగానే వుంది. ఒక 'చందమామ' లా - 'మాయాబజార్' - ఓల్డ్ వైన్ లా పాతబడే కొద్దీ రుచి గా, వయసు పెరిగిన కొద్దీ గ్లామరస్ గా, క్రేజ్ పెంచుకుంటూ వస్తూంది.

కాబట్టి - ఈ పుస్తకం లో ప్రస్తావించదగిన అంశాల గురించి టూకీ గా :


సినిమాని నవల రూపంగా చదవడం కొత్త పద్ధతి కాపోయినా, ఇదో కొత్త (శాస్త్రీయమైన) అనుభవం. ముందుమాట నాటకీయంగా లేకుండా చాలా ఇంఫర్మేటివ్ గా, సౌకర్యవంతంగా మొదలయింది. సినిమా గురించిన సమాచారంలో - ఈ కధను ఆధారంగా చేసుకుని వివిధ భాషల్లో, మూకీల కాలంలో తయారయిన రక రకాల సినిమాల గురించి ప్రస్తావించారు.

సినిమా స్క్రీంప్లే - పాటలు, పద్యాలు - ఫోటోలు, స్కెచ్చులూ, తెర వెనుక కబుర్లూ - డీటైల్స్ తో సహా - రమ్యంగా అల్లారు. స్కెచ్చులు - సినిమా ని మన కళ్ళ ముందు వుంచడానికి దాని ప్రస్థానంలో ఉన్న రక రకాల నిచ్చెన మెట్లను - వాటి వెనుక దాగున్న నిబద్ధత, నిజాయితీ, శ్రమను, తెర మీదికిసన్నివేశాల్ని స్పాట్ లెస్ గా తీసుకు రావడానికి నటీ నటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల ప్రతిభ - ఇలా అన్నిట్ని, కళ్ళ ముందు వుంచుతాయి.


మూస పోసిన సినిమా ఫార్మ్యులా లు, సినిమా కీ, సమాజానికీ ఉన్న బాదరాయణ సంబధం, సినిమా ని చూసి సమాజం పాడవుతుందా, సమాజం సినిమాని చూసి తగలడిందా అంటూ సాగే జీడిపాకం చర్చలూ - పెరిగిన సాంకేతిక విలువల నేపధ్యంలో నీరసించిపోయిన కధ నీ - చూసి చూసి విసిగెత్తిన ఈ తరం కూడా కలర్ మాయా బజార్ ని ఆదరించడానికి సినిమా నిస్సందేహంగా లో వినోదాత్మకత, ఎప్పటికపుడు ఫ్రెష్ గా అనిపించే కధా ముఖ్య కారణం కావచ్చు.

ముగించే ముందు -

ఎస్.వీ.రంగారావు ఇంట్రడక్షన్ సీన్ - (ఇప్పటి దర్శకులైతే, మొదట చెప్పులో, బెల్టో దగ్గర్నుంచీ మొదలు పెట్టి - గాలీ, తుఫాను ల్లో సారు వారు పెట్టే అడుగు మీద కేమెరా ఫోకస్ చేసే వాళ్ళెమో) - సినిమాలో నేను ఇప్పటికీ చాలా ఇష్టపడే సీన్ - కధలో ట్విస్టు ఇక్కడే కదా మొదలయ్యేది !

ఆ పద్యం -

అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై మన
శుంభ ధ్వజము గ్రాల చూడవలదె !
గగన పాతాళ లోకాలలోని సమస్త
భూత కోటులు నాకె మ్రొక్కవలదె !
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి
సంభ్రమాశ్చర్యాల జరుగవలదే
'హై హై ఘటోత్కచ' 'జైహే ఘటోత్కచ'
అని దేవగురుడె కొండాడవలదె !

ఏనె ఈయుర్వినెల్ల శాసించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధు హితులకు ఘనతలన్ని
కట్ట పెట్టిన ఘనకీర్తి కొట్టవలదె !

- ఏమో - నాకీ పద్యం 'మాయా బజార్' సినిమాకి కూడా సూట్ అయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి పద్యాల (పాటలయితే పాపులరే !) కోసమైనా ఈ 'మాయా బజార్ ' సినిమా నవల్ని చదవాలి.

దీన్ని మాయా బజార్ అభిమానులయితే తప్పకుండా లైబ్రరీ లో వుంచుకోవాలి. ఎందుకంటే 'వివాహ భోజనంబు !' పాట పూర్వాపరాలు - దీని 'మెక్సికన్ మెర్రీ గో రౌండ్' మూలం కధా కమామీషూ, ఇతర రసవత్తర విషయాలూ తెల్సుకోవద్దూ ?! పాత పాత పోస్టర్లు చూడొద్దూ ? 'రాజ్యాలు పోతేనేం ? ప్రతాపాలెక్కడికి పోతాయ్?' అని నిష్ఠూరాలాడొద్దూ ? సున్నిత హాస్యం, లలితమైన దృశ్యం, మధుర సంభాషణలు - తరచి తరచి గుర్తు చేసుకోవడానికి ఇదో గ్రేట్ ఐడియా !

15/09/2010

వెటకారం డాట్ కాం

నిజానికి వెతుకుతున్న వీడియో దొరకలేదు. 'యెటకారం.కాం' అని ఒక చిన్న స్పూఫ్ తరహా వీడియో - ఏ టీవీలోనో గుర్తులేదు.. చూసి చాలా ఇష్టపడ్డాను. ప్రధానంగా తెలుగు టీవీ పాలిటి చెత్తెస్ట్ యాంకరు కం ప్రొడ్యూసర్ - ఓంకార్ మీద స్పూఫ్లు ప్రత్యేకంగా చెయ్యడం ఈ యెటకారం.కాం ఎజెండా. ఇక్కడ ఆ 'సృజనాత్మకత' ని మెచ్చుకోవాలి.

''ఆట'' అనే రియాలిటీ డాన్స్ ప్రోగ్రాం కి యాంకరింగ్ చేసి, అంతకు ముందు ఆదిత్య టీవీ లో మ్యూజిక్ వీ.జే గా అపార అనుభవం, టీనేజి అమ్మాయిలూ, అబ్బాయిల్లో భయంగరమా ఫాలోయింగూ సంపాయించిన ఓంకార్, తెలుగు టెలివిజన్ కోసం చాలా కార్యక్రమాలు స్వయంగా నిర్మించారు, యాంకరింగ్ చేసారు. ఇలాంటి టెలివిజన్ సెలిబ్రిటీ ని టార్గెట్ చెయ్యడం కొద్దో గొప్పో సాహసమే !

యెటకారం.కాం నిర్మించిన వీడియో/టీవీ బైట్ లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది, ఆట పై వెటకారంగా చేసిన వీడియో ! 'ఆట-n' అనే కార్యక్రమం, దాన్లో పాల్గొన్న డాన్సర్లూ, మెంటర్లూ, వాళ్ళ పనికిమాలిన పోట్లాటలూ, (మరి అది రియాలిటీ షో - రియల్ అనిపించేలా కార్యక్రమం మొదలు నుంచీ చివరి దాకా కావాలని ఒకర్నొకరు తిట్టుకు చచ్చే జడ్జీలూ, మెంటర్లూ !), వీటి మీద చాలా వెటకారం గా స్పూఫ్ ఈ స్పూఫ్ వీడియో సాగుతుంది. నిజానికి ఆ వీడియోని ఇక్కడ పెట్టుంటే, చాలా మందికి నచ్చి వుండేది.

ఈ వీడియో ఆ 'ఆట' ఆణిముత్యం కాదు గానీ, just, యెటకారం.కాం గొప్పదనాన్ని తెలియచెప్పడానికి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో లో(/ల్లో ) ఓంకార్ లా నటించిన అబ్బాయికి నా బ్లాగ్ ముఖంగా అభినందనలు. తొణక కుండా, బెణకకుండా ఓంకార్ లాంటి వ్యక్తిని ఇమిటేట్ చెయ్యడం చాలా కష్టం అని నా ఫీలింగ్. ఆట మీద 'యెటకారం.కాం' వీడియో దొరికితే ఇంకో సారి పంచుకుంటాను.
ఈ రోజుకి మాత్రం ఈ వీడియో ని చూసి నవ్వుకోండి.

11/09/2010

విశాఖా హరిగానం !

ఈద్ కా చాంద్ చాలా బావుంటుంది అని ఒక ప్రధ ! ఈ రోజు ఆకాశం కేసి చూద్దామంటే, భయం. ఆకాశానికి కావాలని మొహం చాటెయ్యడం, నాలాంటి వినాయకుడి కధ నమ్మేవాళ్ళకి బాహా అలవాటు. అలా అని రోజూ చుక్కలు లెక్కెడతామని కాదు.. కానీ, ఈద్ రోజూ, కార్తీక పౌర్ణమికీ, శరన్నవరాతృలప్పుడూ, ఆకాశం, చందమామా, వాళ్ళ వైఫులూ అంటే, కుంచెం ఉబలాటం కలుగుతుంది.

కానీ ఈ సారి వాళ్ళకి ఈద్ ముబారక్ అయితే, మనకి 'డాం డమారుక్' అయింది. చందృణ్ణి చూడ్డానికి కుదరదు. మనసు లాగుతుంది. కాబట్టి కాలక్షేపానికి ఇంకో సోర్సు వెతుక్కోక తప్పదు. టీ.వీ. బోరు కాబట్టి, చక్కగా ఇంటర్నెట్ పై పడ్డాను.

ఎప్పుడో జయా టీవీ లో అనుకుంటాను శ్రీమతి విశాఖా హరిజి గారి హరికధ విన్నానేమో - ఒక్క ముక్ఖ అర్ధం కాకపోయినా, చాలా ఎంజాయ్ చేయటం మంచి అనుభూతి. అసలు తామిళ్ వాళ్ళ హరి కధ ఎంత బావుంటుందో ! అనిపించింది.

మన టెల్గూ హరికధ కొంచెం ఎక్కువ గా జనాల్లోకి చొచ్చుకుపోవడానికనుకుంటాను.. పిట్టకధలూ, గెంతులాటలూ - ఇలా క్లాసికల్ చిత్రాన్నుంచీ, పక్కకు జరిగినట్టు నా అనుమానం. హరికధా పితామహులు చాలా మంది ఎన్నో రకాలుగా ఈ కళ ను ప్రభవిల్లజేస్తూ ఉండొచ్చు గాక. కానీ విశాఖా హరి లాంటి 'కొత్త తరాల్ని ' కూడా కలుపుకు పోతూనే, స్వచ్చంగా, మోడ్రన్ గా, క్లాసికల్ గా, గౌరవనీయంగా, ఒక పాప్ కచేరీలా ఆడియన్స్ ను మంత్ర ముగ్ధుల్ని చేసేది మాత్రం కొందరే !



ఈ వీడియో చూడండి.



ఈ హరికధల్ని 'సంగీత ఉపన్యాసం అని అంటారంట. ఎప్పుడైనా టీవీలో కనపడితే మాత్రం, ఈ హరికధల్ని వినబుద్ధవుతుంది. ఈవిడకున్న అభిమాన గణంలో విశేషంగా బ్లాగర్లూ, యువతా వున్నారుట.

'విశాఖా హరి' కార్యక్రమాల గురించి, ప్రత్యేకంగా బ్లాగులూ నడుస్తున్నాయి. ఈ వీడియోల్లో ఎందరు స్పెల్ బౌండ్ అయిపోయి వింటున్నారో చూడండి ! కచేరీ ల కన్నా విశాఖా హరి ప్రసంగాలు ఎక్కువ మంది ప్రక్షకులను ఆకర్షించడానికి తను చెప్తున్న / పాడుతున్న విషయం మీద ఆమెకున్న పాండిత్య ప్రతిభ, ఆ వ్యాఖ్యానం కారణం కావచ్చు. మనకూ ఏదయినా కచేరీ లో ఏ బాలమురళీనో పాటల్ని విడమర్చి చెప్తూ పాడుతూ మనల్నీ ఆ ఉత్కృష్ఠ భావ జలధిలో ఓలలాడిస్తుంటే ఎలా వుంటుంది ?

తెలుగు హరికధ కూడా ఈ టమిళుల హరికధ లాగా స్టాండర్డ్ ని పెంచుకుని, కొంచెం రూపాంతరం చెంది, ఎక్కువ మంది ప్రేక్షకులని ఆకర్షించేలా మారితే బావుంటుందేమో అని నా General (పామర) అభిప్రాయం.

పాండిత్యం ప్రతిభా ఇప్పటికే తెలుగు పండితులకు భక్తీ చానెళ్ళలో, ప్రవచనాల్లో, కావ్య విమర్శల్లో బాగా పనికొచ్చింది. అసలు ఏ చాగంటి వారో సౌందర్య లహరి (అరటి పండు వొలిచినట్టు) చెప్తుంటే, వినే వాళ్ళు మామూలు హరికధా కాలక్షేపం టీవీలో వస్తే ఎందుకు ఇష్టపడరు ? తెలుగు వాళ్ళకి మ్యూజిక్ మీద అంతగా ప్రేమ లేకనా ? కధ అనే ప్రక్రియ ఇష్టపడకా ? ఏమో ! ఏమో ! మీరే చెప్పాలి.

గణేశ ప్రార్ధన



తొండము నేకదంతమును
దోరపు బొజ్జయు వామహస్తమున్,
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున
కోరిన విద్యల కెల్ల నొజ్జవై,
యుండెడి పార్వతీ తనయ!
ఓయీ గణాధిప ! నీకు మ్రొక్కెదన్.

తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన ! నీకు మ్రొక్కెదన్
ఫలితము సెయుమయ్య నిను
ప్రార్ధన చేసెదనేకదంత! నా
వలపటి చేతిఘంటమున
వాక్కున నెప్పుడు బాయకుమీ
తలపున నిన్ను వేడెదను
దైవ గణాధిప! లోకనాయకా !!

09/09/2010

నగరం మీద ప్రేమగీతం

టాంక్ బండ్ సన్నని నడుంచుట్టూ చెయ్యి చుట్టి
అందమైన నగర ముఖాన్ని దగ్గరగా తీసుకుని
ఆశలతో అలసమైన అబిడ్స్ కళ్ళలోకి చూసి
దీపాల వెలుతురు ప్రతిఫలించే చెక్కిళ్ళపై ముద్దు పెట్టుకో

సిగలో నౌపహాడ్ నాగరం తళుక్కున మెరుస్తుంది
బంజారాహిల్స్ వక్షోజాలుద్రిక్తంగ చలిస్తాయి
అలా అలా నైలాన్ చీరకింద మెత్తని గాగరాలో
సికిందరాబాద్ జఘనోరు సౌందర్యం నిన్ను కవ్విస్తుంది.

వేలవేల బార్లలో కొన్నివేల నిషాగీతాలమధ్య
బాళిగొలిపే జవరాలి నృత్యం పరవశింప చేస్తుంది.
ఓరగా తెరచిన జనానాల తలుపులలోంచి
ఉండి ఉండి నిలవగాలి వస్తుంది
హుసేన్ సాగర్ మీద ఒలికిన వెన్నెల లోంచి
ఒక విరహిణి మధు విషాదగాధ వినిపిస్తుంది.

వాడినపువ్వుల వాసన వేడివేడి పాదాలకు తగులుతుండగా
రోడ్లమీద అజ్ఞాతకామం ప్రతిరోజూ రాత్రి ప్రవహిస్తుంది.
తెలుగువాళ్ళ తెలివిలేనితనం ధోవతి కుచ్చెళ్ళతో పాటు మోటుగా
యం.యల్.ఏ.క్వార్టర్స్ దగ్గర యెబ్బెట్టుగా జీరాడుతుంది.
దర్బారులో సిగ్గుల్నీ, వగల్నీ ఒలకబోసే నెరజాణతనం నుండీ
దాపరికంలేని పారిశ్రామిక నాగరికతా నగ్నత్వంలోకి
ఎదుగుతూన్న నగరసుందరిని ఒదులొదులుగా కౌగలించుకో
మదం, మదం, మృగమద పరిమళం మత్తెక్కిన కన్నుమూతలో
పెట్రోలు వాసన ఫెళ్ళుమని తగిలి ఉలిక్కి పడతావు.

మూసీనది ముతకశృంగారాన్నే, పాపకశ్మలాన్నీ
మౌనంగా, దీనంగా మోసుకుపోతూ వుంటుంది,
ముసలిగద్ద చార్మినార్ మీద గత వైభవాన్ని తలుచుకుని
మూలుగుతూ ''మోసం!'' అని అరుస్తుంది.

అయినా యౌవనం తగ్గలేదు, లావణ్యం తగ్గలేదు
మెహబూబ్ జిందాబాద్ !
ఫ్యూడల్ రహస్యాల్ని నేటికి దాచుకున్న
పుండ్రేక్షు కోదండం హైదరాబాద్ !

-1956
- దేవరకొండ బాలగంగాధర తిలక్
(అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నుండీ)


{హైదరాబాద్ మీద కవిత అనేసరికీ ఇంటరెస్టింగ్ అనిపించి..}

08/09/2010

Idga - Munshi Premchand

 




ఇది మున్షీ ప్రేంచంద్ రచించిన చిన్ని హిందూస్తానీ (ఉర్దూ) కధ. హమీద్ అనే నాలుగేళ్ళ బీద పిల్ల వాడు - తన అమ్మమ్మ తో కలిసి ఉంటూ ఉంటాడు. 30 రోజుల పవిత్ర రోజా పాటించిన తరవాత తరవాత ఈద్ పర్వదినం వచ్చింది. వీధి లో అందరు పిల్లలూ బొమ్మలూ, మిఠాయిలూ కొనుక్కుంటున్నారు. పెద్దలు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఇంట్లో చిన్న చితకా వస్తువులూ కొనుక్కుంటున్నారు. చంకీలు ఉన్న తమ టోపీల చిరుగులు కుట్టుకుంటున్నారు. 

పండగ కాబట్టి చిన్న పిల్లలందరికీ వారి పెద్దలు ఈదీ (బహుమానంగా కొంచెం డబ్బు) ఇచ్చేరు. ఆ డబ్బుతో పిల్లలంతా బజారులో / ఈద్ సంత లో ఎంజాయ్ చేస్తున్నారు. హమీద్ అమ్మమ్మ కడు బీదది, నిస్సహాయురాలైన వృద్ధురాలు! ఆవిడ పాపం హమీద్ కు 3 నయా పైసలు మాత్రం ఇవ్వ గలుగుతుంది. ఈద్ కోసం నిజానికి ఈ పిల్లల బేచ్ లో చాలా రోజుల నుండీ ప్లానింగ్ నడుస్తూ ఉంది. వీళ్ళంతా ఈదీ తో ఫలానా బొమ్మలు కొనుక్కుంటామనీ, ఇంకేదో చిరుతిండి కొనుక్కుంటామనీ కలలు కంటున్నారు. 

హమీద్ కు ఇవన్నీ కొనుక్కునే స్థోమత లేదు. మిగతా పిల్లల ముందు చిన్నబుచ్చుకుంటాడని అమ్మమ్మ ఎలానో మూడు పైసలు ఇచ్చింది. వీటితో ఏమి కొనుక్కోగలడు ? ఏదీ మూడు పైసలకు రాదు. మిగతా పిల్లలు కొనుక్కున్న రక రకాల బొమ్మలు చూస్తూ, నిరుత్సాహ పడుతూ సంత లో ప్రతీ ఆట వస్తువ విలువా అడుగుతూ తిరుగుతూ ఉంటాడు హమీద్. 

ఉన్నట్టుండి వాడికి చిమ్మ్ టా (పట్టకారు / Tong ) అమ్మేవాడు కనపడ్డాడు. వెంటనే హమీద్ కు అమ్మమ్మ గుర్తొచ్చింది. హమీద్ కు ఈ ప్రపంచంలో ఉన్నదల్లా ఆ ముసలి అమ్మమ్మే. ఆవిడ వంట చేసే టప్పుడు / రోటీలు చేసేటప్పుడూ, చేతితోనే రొట్టెలు పట్టుకు కాలుస్తూ ఉంటుంది. ఆవిడకు రొట్టెను పట్టుకునే ఆ పట్టకారు లాంటి చింటా లేదు మరి. వెంటనే బేరం జరుగుతుంది. మూడు నయాపైసలకు చింటా ఇవ్వనంటాడు దుకాణదారు. అయితే, అంతకన్నా ఎక్కువ డబ్బు హమీద్ దగ్గర లేదు. నిరుత్సాహ పడి వెనుతిరిగి పోతున్న పిల్లవాడిని పిలిచి, ఎలాగో ఆ మూడు పైసలకే చింటా ఇచ్చేస్తాడు దుకాణదారు ! 

సంత నుండీ తిరిగి వస్తున్న హమీద్ ను మిగిలిన స్నేహితులు ఆటపట్టిస్తారు. బొమ్మలు కొనుక్కోమని డబ్బు ఇస్తే, చింటా కొంటావా అని ఏడిపిస్తారు. ఆ నాలుగేళ్ళ బుడ్డోడు మాత్రం ఈ వేళాకోళాలకు అదరడు - బెదరడు. పైగా తన చింటా అందరికన్నా గొప్ప ఆటవస్తువ అని, భుజం మీద పెట్టుకుంటే, గద అవుతుందనీ, విల్లు లా సంధిస్తే, విల్లు అవుతుందనీ.. ఇలా ఎలా కావాలంటే అలా దానితో ఆడుకోవచ్చని వాదిస్తాడు. 

పిల్లలు - అమాయకులు. మొదట కాసేపు హమీద్ మాటలు నమ్మక పోయినా, కొంత సేపటికి తమ తమ బొమ్మలతో ఆడి, బోరు కొట్టి, వాళ్ళకి హమీద్ దగ్గరున్న చింటా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఒక్కొక్కరూ.. 'ఒరే, నీకు నా బొమ్మ ఇస్తాను - కాసేపు నీ చింటా నాకివ్వరా..!' అని అడుగుతూ.. ఎక్స్చేంజ్ చేసుకుని చింటాతో ఆడుకుంటారు. మొదట టాం సాయర్ చచ్చిన ఎలకని ఇవ్వడానికి బెట్టు చేసినట్టు కాసేపు బెట్టు చేసినా... చింటా ఇచ్చి, తను ముచ్చట పడిన స్నేహితుల బొమ్మలతో తనూ కాసేపు ఆడుకుని తన సరదా తీర్చుకుంటాడు హమీద్. 

ఇలా... సాయంత్రం ఇల్లు చేరేసరికీ, హమీద్ తన స్నేహితులందరి బొమ్మలతోనూ ఆడేసుకునుంటాడు. సరదాగా.. ఉల్లాసంగా ఇంటి సావిట్లోకి అడుగుపెట్టీసరికీ, తన కోసం ఆందోళన తో ఎదురుచూసిన అమ్మమ్మ..'ఇంత ఆలస్యమైందేమిరా.. ఈదీ తో కొన్న బొమ్మ ఏదీ ?' అని అరుస్తుంది. ఆవిడకి చింటా చూపిస్తే.. మొదట కోపగించుకుంటుంది. 'నీకు బొమ్మ కొనుక్కోమని డబ్బులిస్తే, ఇలంటి వస్తువ కొన్నావేమి రా?' అని విరుచుకుపడుతుంది. 

ఆవిడకి పాపం తల్లీ తండ్రీ లేని తన మనవడంటే, చాలా ముద్దు. ఎన్నడూ వాడి సరదాలు తీర్చగలిగే శక్తి ఆమెకు లేకపోయింది. ఈ ఈద్ కి ఎలా అయినా వాడికి ఏదో ఒకటి కొనిపెట్టాలని ఆమె తాపత్రయం. వెంటనే.. 'నీకు చింటా లేదు కదా అమ్మమ్మా.. రొట్టెలు చేస్తున్నప్పుడు నీ చేతులు కాలడం నాకు తెలుసు. అందుకే ఈ చింటా నీ కోసం తీసుకొచ్చాను !' అని హమీద్ అనగానే, తన పట్ల మనవడికున్న ప్రేమకూ, అభిమానానికి నోట మాట రాక మ్రాన్ పడిపోయి, కొంత సేపటికి కన్నీళ్ళపర్యంతం అవుతుంది ఆ అమ్మమ్మ. 

కధ నాకు గుర్తున్న మటుకూ స్థూలంగా ఇది. ఈ కధ నాకు మామూలుగా తెలియక పోను. నాకు హిందీ సాహిత్యం తో (లోగ్ లుగాయీ తరహా..) తో పరిచయం అంతంత మాత్రం. అయితే ఈ కధ ను ఎన్నో సంవత్సరాలు స్కూల్ టీచర్ గా పని చేసి రిటైర్ అయిన ఒక స్నేహితురాలు చెప్పారు. ఇది ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం సంగతి. ఆవిడ, స్వతహాగా టీచర్ మరియూ మంచి పాఠకురాలు గాబట్టి ఈ కధను చిన్న పిల్లలకు చెప్పినట్టు, రసరమ్యంగా చెప్పారు. మున్షీ ప్రేంచంద్ రచించిన ఈ కధ (ఈద్ వస్తున్నది గాబట్టి గుర్తొచ్చింది. తప్పులు / మరచిపోవడాలూ ఉండొచ్చు ! కానీ హృద్యమైన ఈ కధని అందరితో పంచుకుందామని చెప్పానిక్కడ) 


For Reading Idgah in Hindi - Check here 

Video for kids to watch 

Ad by Havells India, inspired by Idgah 

02/09/2010

అప్రస్తుతం !





జీవితంలో తెరలు తెరలుగా ప్రత్యక్షమవుతున్న భయాలను ఒక్కొటిగా ఛేదిద్దామని – నిర్వికారమైన మనస్తత్వాన్ని సాధిద్దామని, బుల్లెమ్మ తో కలిసి ఇంట్లోనే ఉండిపోదామనీ ఏవేవో కోరికలు !

ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోవడం అనే ఆటలో బాధ పడుతున్న మనసును జోకొట్టి, ధైర్యం సమీకరించుకుందామని లాలస ! ఈ ఆట బాగా ఆడాలనే కోరిక లో నన్ను నేనే ఓడించేసుకుంటానేమో అనే సందేహం !

ప్రస్తుతం ఇదీ నేను.

20/08/2010

ప్రపంచ దోమల దినం.

నిజంగా - ఈ రోజు ప్రపంచ దోమల దినం. 113 సంవత్సరాల క్రితం సర్ రోనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ ఆర్మీ డాక్టర్, (on 20 Aug) మలేరియా దోమ కాటు వల్ల వస్తుందని కనుక్కున్నాడు. ఈ సంగతి తెలియక ముందు మలేరియా వ్యాధి బారిన పడి మిలియన్లాది మంది జనం యుద్ధాలలో, ఇతరత్రానూ మరణించేవారు. మొదట మలేరియా నిలవ ఉన్న నీళ్ళ ద్వారా వ్యాపిస్తుందని భావించే వారు. కానీ సర్ రోనాల్డ్ రాస్ మాత్రం ఇది ఒక రకానికి చెందిన దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుందని నిర్ధారించేడు. ఆ సంబడానికి..ఇదే రోజున (ఇదే డాక్టరు) దోమల వల్ల వ్యాధులొస్తాయని కనుక్కున్నారని, ఈ రోజుని దోమల దినం గా జరుపుకుంటారంట !

అప్పటికి దోమల్లో, ఒకానొక రకం దోమని (ఏదయితే మలేరియాకు సంబంధించిన సూక్ష్మ జీవుల్ని తనలో మోస్తూ, కుట్టడం ద్వారా మనుషుల్లో వ్యాధికారక క్రిముల్ని మనిషిలో వొదుల్తుందో) కనిపెట్టి ఉండడం వల్ల రోనాల్డ్ రాస్ ఇంకో విచిత్ర ప్రయోగం కూడా చేసాడంట. మలేరియా రోగిని కుట్టిన దోమల్ని ఒక సీసాలో నీళ్ళతో సహా బంధించి, అవి చచ్చేదాకా ఎదురు చూసి, ఆ నీళ్ళను అతి కష్టం మీద లచ్మన్ అనే ఒక నౌఖరుకిచ్చి తాగమన్నాడంట. ఆ నౌఖరు కి 10 రోజుల దాకా ఎటువంటి జ్వర లక్షణాలూ కనిపించలేదు. ఆఖర్న కొంచెం జ్వరం, తలనొప్పి వచ్చినా, అవి ఫ్లూ కారణం గా వచ్చిందని పరిశోధన లో తేలింది.


20 ఆగస్ట్ 1897 లో మన పాత బేగంపేట్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో పరిశోధనా కేంద్రం లోనే ఆనోఫోలీన్ రకం దోమ టిష్యూ లో మలేరియా సూక్ష్మజీవుల్ని మొదటిసారి చూసాడు రోనాల్డ్ రాస్. ఈ డిస్కవరీకి గాను 1902 లో నోబుల్ బహుమతి గెలుచుకున్నాడు. ఈయన - నోబుల్ గెలిచిన రెండవ వ్యక్తి. నోబుల్ గెలుచుకున్న మొదటి & ఆఖరి ఆర్మీ ఆఫీసరు. నోబుల్ గెలుచున్నవారిలో అందరికన్నా వయసులో చిన్నవాడు.

మలేరియా బారిన పడి చాలా మంది ప్రజలు ఇప్పటికీ చనిపోతూనే వున్నారు. ఒక్క దోమకాటు గురించి - ఎక్ మచ్చర్, ఆద్మీ కో హిజ్డా బనా దేతా హై అని ఒక ప్రముఖ హిందీ సినిమా డైలాగు వినే వుంటారు. ఈ ఒక్క దోమకాటే, ఎందరో ప్రముఖుల ఉసురు తీసింది. [కింగ్ టట్ మమ్మీ మీ వూరొచ్చిందా? ఆయన మలేరియాతోనే ఔట్ అయిపోయాడుట. మలేరియా తోనే మన ముగాంబో అమ్రీష్ పురీ కూడా మరణించాడు] మలేరియా ఇప్పటికీ పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. క్వినైన్ లాంటి ఆంటీ మలేరియల్ మందులు చాలా వరకూ మృత్యువును నివారించగలిగినా, ఇప్పటికీ మలేరియాకు వైద్య పరిభాషలో ''కింగ్ ఆఫ్ ఆల్ డిసీసెస్'' అని బిరుదు ఉంది.

కాబట్టి రోనాల్డ్ రాస్ మన సికందరాబాద్ లో చేసిన ముందంజ ని 113 సంవత్సరాల తరవాత కూడా మనం గుర్తుచేసుకుంటున్నాము. పరిశుభ్ర వాతావరణం ఉన్నప్పటికీ, వాతావరణంలో వివిధ తేమ పరిస్థితుల వల్ల, దోమలు నగరాల్ని కూడా చుట్టుముడుతూనే వున్నాయి. ఏజెన్సీ లలో జన జీవనాన్ని అతిగా ప్రభావితం చేసేవి, రక్షితమంచినీరు లేకపోవడం వల్ల కలిగే కలరా, ఇంకా, దోమ కాటు వల్ల సంభవించే మలేరియా !

మలేరియా మరణాలు ఇప్పటికీ సంభవిస్తున్నాయి. ఎన్నో ఎన్.జీ.వో.లు దోమల మీద యుద్ధాన్ని ప్రకటించాయి. దోమల్ని చంపే వివిధ రకాల సాధనాలు మార్కెట్లో సౌకర్యవంతమైన పరిమాణాన్ని సంపాయించుకున్నాయి. మిలిండా గేట్స్ ఫౌండేషన్ మన దేశంలోనే దోమకాటును నివారించడానికి ఎన్నో దోమతెరలను పంపిణీ చేస్తోంది. ఇంతకీ రోనాల్డ్ రాస్, ఇండియన్ మెడికల్ సర్వీసు లేదా ఇప్పటి కాలం ప్రకారం భారత-బ్రిటీష్ సైనిక సాంప్రదాయాల ప్రకారం 'సైనిక వైద్యుడు' కాబట్టి ఇక్కడి ఆర్మీ మెడికల్ విభాగం, ఒస్మానియా యూనివర్సిటీ (Medical College), రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ లో ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. రోనాల్డ్ రాస్ కి ఒక అరడజను వీరతాళ్ళు !

అయితే ఈ రోజుకి ఏ రోనాల్డ్ రాస్ పేరో, మలేరియా పేరో పెట్టకుండా, మస్కిటో డే అని ఎవరు పేరు పెట్టేరో గానీ విచిత్రంగా ఉంది. ఇలా పేరు పెట్టడం వల్ల 'దోమల మీద అవగాహన పెరుగుతుందని అనుకున్నారేమో ! కరెంటు పోయినా, సాయంత్రం వీధి తలుపు తెరిచినా ఇంట్లో దూరి పిల్లా పీచూ తేడా లేకుండా కుట్టి సాధించే దోమలంటే ఎవరికి ఇష్టం ? అయినా సరే, దోమలు ప్రాణాంతకాలు కాబట్టే, దోమల్ని దూరంగా వుంచడం, అవి పెరగకుండా పరిసరాలు శుభ్రంగా వుంచుకోవడం, దోమ కాటుకు వీలయినంత మటుకూ గురికాకుండా వుండడం - వగైరా ప్రివెంటివ్ విధానాల పట్ల దృష్టి సారించాలి మన సమాజం అని, ఆ పేరు పెట్టుండొచ్చు.

ఇదీ సంగతి.

26/07/2010

జ్ఞాపకాల గజిబిజి

1) మార్క్ ట్వైన్ రాసిన 'ప్రిన్స్ ఎండ్ ద పాపర్' - అయితే ఇంగ్లీషు ఒరిజినల్ గానీ లేదా మన నండూరి వారి 'రాజు - పేద' అనే తెలుగు అనువాదం గానీ చాలా మంది పెద్ద పిల్లకాయల దగ్గర వుండొచ్చు. ఇదే సబ్జెక్టుతో అప్పుడెప్పుడో, మా టీవీ లో ఒక సినిమా చూసాను. బహుశా ఆ సినిమా పేరు కూడా రాజు-పేద నే అనుకుంటాను. ఇందులో బీద అబ్బాయి (టాం కాంటీ) తండ్రి (జాన్ కాంటీ) పాత్ర లో నూనుగు మీసాల 'ఎన్ టీ ఆర్' నటించారు. 'ఎన్ టీ ఆర్' ని ఇలా నెగటివ్ పాత్ర లో చూసి ఆశ్చర్య పోయానపుడు. బహుశా ఆయన కెరీర్ మొదట్లో చేసిన సినిమా అయి ఉండొచ్చు. దురదృష్టవశాత్తూ ఆ రోజు కేబుల్ వాళ్ళకు పోయిందో, మాకు పోయిందో గానీ కరెంటు పోయి సినిమా చూడ్డం జరగలేదు. ఆ సినిమా ఏమిటి ? మళ్ళీ చూడాలంటే ఎలా ? ఆ సినిమా మళ్ళా ఎప్పుడూ టీ.వీ.లో ప్రసారం అయినట్టు లేదు. ఏమి సాధనం ?

2) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శ్రీమతి వేదవతీ ప్రభాకర్, శ్రీమతి చాయాదేవి పాడిన ఒక మాంచ్హి భజన వుంది. టీ.టీ.డీ వాళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడు విడుదల చేసిన, పేరు మర్చిపోయిన ఒకానొక కేసెట్లో మా ఇంట్లో ఉండేది. ఆ కేసెట్టు అరగ్గొట్టాకా, టేపు పాడయ్యి, మిగతా కేసెట్ల సంత లో కలిసిపోయాకా, మళ్ళా ఆ భజన దొరకనేలేదంటే నమ్మండి.

ఆ భజన మొదటి లైన్లు

''కమలా వల్లభ - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా

యశోదబాలా - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా

భక్త మనోహర - గోవింద మాంపాహి
కళ్యాణ కృష్ణా - గోవిందా ''

ఇలా మూడు చరణాల లాంటివి - ఇంటర్నెట్టు వచ్చాకా వెతుకుతూనే వున్నాను. ఎక్కడో ఏ మహానుభావులో దాచి ఉంచి వుంటారుగా అని ! నా బావి పరిధుల్లో ఈ పని కాలేదు. ఎప్పటికైనా ఈ భజనను ఎలా అయినా సంపాదించి వినాలని చాలా ఆశ పడుతున్నాను.

అందుకే నా humble request ఏంటంటే : పై రెండు ప్రశ్నలకీ సమాధానం తెలిసిన స్నేహితులు దయచేసి నన్ను గైడ్ చెయ్యగలరు !

25/07/2010

In My Father's Court



ఇది ఒక Memoir. ఒక ఆటో బాలాగ్రఫీ. అసలిలాంటి పుస్తకాలు చదివినప్పుడు - ఏదో అత్భుత లోకాల్లోకి మనమూ బాలలమై విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పట్లాగే నా పరిశీలన ప్రకారం ఈ బాలాగ్రఫీలకే సాహిత్యంలో మంచి గుర్తింపూ, ఆరాధనా లబించింది. బాలాగ్రఫీ అంటే మరేం లేదు. ఆయా ప్రముఖ రచయితలు (ఇస్తాన్ బుల్ లాగా, నేనింతకు ముందు రాసిన ఏంజెలాస్ ఏషెస్ లాగా) తమ చిన్నతనంలో తామెదుర్కొన్న కష్టాల్నీ, కన్నీళ్ళనూ కమనీయంగా గుర్తుచేసుకుని, వాటిని మనతో పంచుకునే సొంత కధ(లు).

వెధవది ఎప్పుడూ కష్టాలేనా అని అనుకోనక్ఖర్లేదు. యూరోపియన్ లేదా ఆంగ్ల సాహిత్యంలో తరచూ కనిపించే యుద్ధం (మొదటిదీ, రెండోదీ) మనన్ని ఒక్కో సారి విసుగెత్తించినా, ఈ తరం పిల్లలు ఎంత ఆనందకరమైన కాలంలో పుట్టారో, (అంతెందుకు ? మనం కూడా!) ఒక్క సారి గుర్తుచేసుకో బుద్ధవుతుంది.

అయితే ఈ చెప్పబోయేది యుద్ధ కధ కాదు. యుద్ధం కన్నా ముందు వార్సా (Warsaw) లో ఒక రబ్బై (Rabbi) గారబ్బాయి చెప్పుకున్న ఒక చిన్నఆత్మ కధ. రచైత పేరు ఇసాక్ బాషెవిస్ సింగర్ (Isaac Bashevis Singer). ఈ పుస్తకం ఒరిజినల్గా యిద్దిష్ లో 'బెథ్ డిన్' అనే పేరుతో ప్రచురించబడింది. ఇదో చిన్న చిన్న వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు అప్పటి వార్తా పత్రికల్లో సీరియల్గానూ, పలు సందర్భాలలో ప్రత్యేకంగానూ అచ్చయ్యాయిట. వీటిని క్రోడీకరించి, మొత్తం కధనంతటినీ గుది గుచ్చి (ముత్యాల సరాల్లాగా) ఒక పుస్తకరూపం ఇద్దామని సంకల్పించి సింగర్ ఈ బెథ్ డిన్ ని రాయడం జరిగింది. ఈయన ప్రముఖ రచయిత. నోబుల్ గ్రహీత. అందుకేనేమో, ఈ పుస్తకం ముందుమాటలో - ఈ రచనలో తన శైలి కన్నా భిన్నంగా రాసినట్టు అనిపిస్తుందనీ, తన చిన్నతనం నుంచే కామోసు ఈ జ్ఞాపకాలని గురించి ఇలా రాద్దామని అనుకుంటున్నాననీ చెప్పుకుంటాడు. ఈ బెథ్ డిన్ కు ఆంగ్ల అనువాదమే 'ఇన్ మై ఫాదర్స్ కోర్ట్'.

1966 లో మొదటిసారి అచ్చయిన ఈ పుస్తకం పురాతన జ్యూయిష్ సాంప్రదాయమైన 'బెథ్ డిన్' (Beth Din) ని గుర్తు చేస్తూ నడుస్తుంది. జూదులలో రబ్బై ది సామాజికంగా, (ఎలానూ మతపరంగా కూడా) ఒక విశిష్ఠ స్థానం. ఈ రబ్బై చెప్పిందే వేదం అని కాకుండా, మతం పట్లా, దేవుడి పట్లా, పాప పుణ్యాల పట్లా విశ్వాసులైన యూదు మతస్థులు ఎంతో పవిత్రంగా ఆయన ఆశ్రయంలోకి వస్తూ ఉంటారు. జీవితం లో సమస్యలనెదుర్కొంటున్నవారూ, సలహా కావలసిన వారూ, న్యాయపరమైన, మతపరమైన వ్యాజ్యాల పరిష్కారం కోసం వచ్చే వారూ - ఇలా రబ్బైని ఆ యూదు సమాజం నమ్ముకుంటుంది. ఈ మతగురువు వారికి న్యాయ బద్ధంగా, మతపరంగా వివిధ చట్టాల ప్రకారం, ధర్మ గ్రంధాల ప్రకారం తగిన సూచనలు ఇస్తూ ఉంటాడు. కేవలం ఆయనమీదా, దేవుని మీదా, గౌరవం గలవారే ఈ వ్యవస్థ ప్రకారం ఆయా తీర్పుల్ని సమ్మతిస్తూ, నడుచుకుంటారు. ఎవరికి సమ్మతం లేకపోయినా, ఆ తీర్పు కి విలువ వుండదు కదా. అయితే ఇప్పుడీ ప్రాక్టీస్ యూదులలో లేదుట. రచయిత వివరించిన దాని ప్రకారం.. ఇది ప్రాచీన కాలాల నాటిది. రాజకీయ సామాజిక అధికార అంచె పోటీలలో జ్యూయిష్ సమాజం చిక్కుకుపోక మునుపు మాట.

ఇసాక్ తండ్రి, తాతలు వార్సా (Warsaw, Poland) లో తరాలుగా రబ్బైలు. తల్లి కూడా ఒక ప్రముఖ రబ్బై కుమార్తె. ఇసాక్ బాల్యమంతా తండ్రి, తల్లి ల అమ్మాయకపు ప్రేమ, మత విశ్వాసం వగైరాలతో వార్సా లో నెంబర్ టెన్, క్రొచ్ మల్నా వీధి లో నిక్షేపంగా గడుస్తూంటుంది. యుద్ధపు నీలి నీడలు వార్సా లో పడలేదింకా ! (ఈ సింగర్ కుటుంబం యుద్ధం నేపధ్యంలో ఎన్నో యూదు కుటుంబాలలానే అమెరికా వలస వెళ్తుంది)

ఇన్ మై ఫాథర్స్ కోర్టు లో ఈ క్రోచ్ మాల్నా వీధి లో దగ్గర దగ్గర గా కాపురం ఉండే అందరి కధలూ ఇసాక్ కళ్ళతో, మనసుతో చదవచ్చు, చూడొచ్చు. మూఢ మత విశ్వాసం, అంధ విశ్వాసం, పేదరికం, నిజాయితీ, దేవుడి పట్ల నమ్మకం, ఇప్పుడు మనం మర్చిపోతున్న నైతికత, పాపభీతి - వగైరాలన్నీ వివిధ చిన్న చిన్న కధల్లో తెలుసుకోవచ్చు.

మచ్చుకి : ఇసాక్ తండ్రి రబ్బై కాబట్టి, ఇంట్లో ఆయన ఆదివారం ప్రార్ధనలు, పెళ్ళిళ్ళూ వగైరా నిర్వహిస్తూ ఉంటాడు. ఇదే ఆయన చెప్పే 'ఫాధర్స్ కోర్టు'. ఇదే ప్రార్ధనా మందిరం, ఇదే ఇల్లు, ఇదే న్యాయ స్థానం. వారం వారం జరిగే సబ్బాత్ మాత్రమే కాకుండా ఊర్లో జరిగే శుభ కార్యాలన్నింటికీ ఇదే వేదిక. ఏ వేడుక అయినా కుటుంబ సభ్యులకు విపరీతమైన పని. వంట, వడ్డనా, శుభ్రం చేసుకోవడం, వగైరా. కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలకీ, వ్యవహారాలకీ సాయం అందిస్తూ ఉంటారు. ఒకసారి సబ్బాత్ తరవాత ఇంట్లో వాళ్ళంతా ఒళ్ళెరగక నిద్రపోతారు. ఇసాక్ తండ్రి స్నేహితుడొకడు, ఆ అర్ధరాత్రి ఏదో పనుండి పొరిగూరికి ప్రయాణమౌతాడు. సబ్బాత్ సందర్భంగా వెలిగించిన కేండిల్స్ లో ఒకదానివల్ల మంటలు చెలరేగుతాయి. ఆ ఇంట్లో వెచ్చగా రజాయిల మధ్య పడుకున్న కుటుంబానికి ఈ సంగతే తెలీదు. పై అంతస్థు అంటుకున్న విషయం ఆ చీకట్లో కనిపెట్టిన స్నేహితుడు అర్ధరాత్రి తలుపులు బాది కుటుంబాన్ని మేల్కొలిపేదాకా ! అలా మృత్యువును అంత దగ్గర నుంచీ చూసిన ఆ కుటుంబం స్నేహితుని సాయంతో ప్రాణాలతో బయటపడడం ఒక మర్చిపోలేని సంఘటన.

ఇంకోటి : ఆ ఇంటికొచ్చే ముసలి చాకలామె. పండు ముసలిదైన ఆ చాకలామెకు మాట మీద నిలబడ్డం అంటే నమ్మకం. వొంగిపోయిన వీపు మీద బట్టల మూట పట్టుకెళ్తూ వుంతుంది. పోనీ ముసలామెకు పని ఇవ్వకూడదనుకుంటే, ఆ పని ఒక్కటే ఆమెకు ఆధారం. (ఆ రోజుల్లో కూడా) ముసలామెను కొడుకులు చూడరు. తన కాయకష్టం మీదే బ్రతకాలి. ఒక సారి ఆ ముసలామె ఎన్నాళ్ళకూ రాదు. ఆమె కోసం అంతా ఎదురు చూస్తుంటారు. వార్సాలో చాకలాళ్ళుంటుండే పేటకు వెళ్ళి ఆమె గురించి ఆరా తీస్తారు. నిజానికి వాళ్ళకు ఆమె ఎక్కడ వుంటుందో తెలియదు.

ఇలా ఆసక్తి రేకెత్తించే అమాయక కధలతో పాటూ, 'బెథ్ డిన్' లో భాగంగా ఇసాక్ సింగర్ తండ్రి వద్దకొచ్చె వివిధ కేసులు, కేండిడేట్లూ - వాళ్ళ సమస్యలూ, పరిష్కారాలూ - అలలలా కదిలిస్తూ, ఏనాటి వార్సా కో మనల్ని తీస్కెళిపోతాయి. దాంతో పాటూ, జెర్మనీ లో, రష్యాలో, ఆ రోజుల్లో యూదుల జీవితం, కొంచెం చరిత్రా, ఆనాటి సమాజం తో పాటూ, బండీ మీద తిరగాలనే బాల్య చాపల్యం అన్నీ చదవచ్చు.

ఇసాక్ సింగర్ రచనా శైలి కట్టిపడేసేదే. ఈ రోజుల్లో చెప్తారే అలా ''కిందపెట్టలేనటువంటిది'' (unputdownable) కాదు గానీ ఈ 'ఇన్ మై ఫాదర్స్ కోర్ట్' మాత్రం అమాయకత్వాన్ని, నిజాయితీ ని ఇష్టపడే వాళ్ళకి వొదలకుండా, సాంతం చదవబుద్ది కలిగిస్తుంది. అందుకే ఎప్పుడన్నా దొరికితే, చదవండి.

02/04/2010

కబుర్లు, కబుర్లు!

నా మెదడు కు ఈ మధ్య ఇన్ పుట్ తక్కువయిపోయి ప్రోసెస్సింగ్ సమస్యలు తలెత్తాయి. నిన్న ఏప్రిల్ ఫస్టు న మా అనిత ఫోన్ చేస్తే, 'మన పండగ' (Fools Day) శుభాకాంక్షలు చెప్పి కూడా ఘోరంగా ఫూల్ అయిపోయా. చిన్నపుడు ఏ కాలం (era) లోనో ఫూల్ అయిన సందర్భాలున్నా, పెద్దయ్యాకా మోసపోవడం అయితే జరిగింది గానీ, ఏప్రిల్ ఫూల్ కావడం దాదాపుగా జరగలేదు. ఇంతకీ అనిత ఫోన్ చేసి, మా (ఇంకో ఫ్రెండ్) ప్రత్యూష టీవీ లో వస్తూందని చెప్పింది. ది హిందూ లో లాగా బ్రాకెట్టులో పదాలు ఉచ్చరింపబడలేదు గానీ అర్ధం అదే ! నేను నిజంగానే నమ్మీసి, టీవీ పెట్టుకుని, ఆ ఫలానా చానెల్ చూసా. మధ్యాన్నం అయే ముందు అన్ని తెలుగు చానెళ్ళలోనూ వంటా, వార్పూ వగైరా లేడీసు కార్యక్రమాలు కావడంతో ఆ 'అభిరుచి ' ప్రోగ్రాం చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఒకవేళ మా ప్రత్యూష నిఝంగా టీవీ లో వంట చేసేస్తుందేమో అని అమాయకంగా ఊహించేసుకున్నాను. కానీ న్యాయంగా, సహజంగా - లాజికల్గా - ఇంకెలాగా కూడా అలా (ప్రత్యూష టీవీ లో వచ్చిమరీ వంట చెయ్యడం) జరగకూడదు కాబట్టి నేను ఫూల్ అయ్యానని వెంటనే గ్రహించాలి.

అయినా - మెదడు లో రసాయన చర్యలు జరగక, లైట్లు ఆలశ్యంగా వెలిగాయి. ఆ 'అభిరుచి' లో నిఝంగానే ప్రత్యూష అనే అమ్మాయి ములక్కాడ ముక్కలు శనగపిండి లో ముంచి రెండంటే రెండే - అలా సున్నితంగా నూనెలో వేయిస్తూంది. అప్పటికీ మా అనిత ని మళ్ళీ పిలిచి నా (చానల్ వినడంలో) పొరపాటేమయినా ఉందేమో అని చెక్ చేసుకోబోయి ఇంకోసారి ఫూలున్నర అయ్యాను. ఈ కోతి వేషాలు మానేసి చాలా ఏళ్ళయిపోయింది. ఫూల్ అయితే అయ్యాను గానీ.. భలే గా అనిపించింది. నేనూ, మేమూ, మా గాంగూ - మేం చేసిన అల్లరి, మేం చూసిన సినిమాలూ, మా ఆశలూ, ఆవేశాలూ, కలలూ - జీవితం అంతా గుర్తొచ్చింది ! ఫూల్స్ డే కు ధన్యవాదాలు.


ఈ రోజు పేపర్లో చూసారా ? ఇంకోసారి జనాభా లెక్కలు మొదలయ్యాయి. నిర్మాణ్ భవన్ ఎదురుగా ఆరుబయట మోనిటర్ లో డిజిటల్ అంకెలు (జనాభా సంఖ్య) వేగంగా - (ఈ బిగ్ బాంగ్ ప్రయోగం లాగా వేగవంతం చేయబడ్డట్టు) గిర్రున తిరుగుతూండటం గుర్తొచ్చింది. 2000 వ సంవత్సరంలో దేశ జనాభా 'ఒక బిలియన్ ' మైలురాయి ని దాటినపుడు డిల్లీ లో హంగామా చేసారు. ఆస్థా అనే పాప డిల్లీ ఆస్పత్రిలో పుట్టింది. తను దేశం లో 1000000000000 వ సభ్యురాలిగా దేశం గుర్తుంచి ఏవేవో బెనిఫిట్స్ ప్రకటించింది. ఇపుడు జనాభా లెక్కలు ముగిసాకా - ముందుగా స్త్రీ, పురుష నిష్పత్తీ, దాని తరవాత దేశవ్యాప్తంగా పిలకాయలూ, వారి విద్యా, ఆరోగ్య పరిస్థితులమీద దృష్టి పెడతారు. అపుడు పురిట్లో చనిపోతున్న పిల్లలు ఇందరూ, బడికి పోని పిల్లలు ఇందరూ - సరయిన భోజనం లేక చనిపోతున్న పిల్లలు ఇంతా అని లెక్కలు చెప్తారు చూడండీ ! చాలా బాధ కలుగుతుంది. కర్మ వశాన జరిగేది ఎలానూ జరిగినా, ఇలాంటి సామాన్య సామాజిక పరిస్థితులు మన చేతులు దాటిపోవడానికి కారణం అలవికాని జనాభా విస్ఫోటనమే కదా ! ఇపుడు కపిల్ సిబాల్ విద్యా హక్కు అంటూ ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు. సిద్ధాంతపరంగా మనం చాలా మంచి ప్రయత్నం లోనే ఉన్నాం. కానీ వాస్తవ పరిస్థితుల్లో, క్షేత్ర స్థాయిలో ఎన్నో అడ్డంకులు. అలా అని భయపడుతూ కూర్చోకుండా, కనీసం ప్రభుత్వం అనే వ్యవస్థ ఆలోచిస్తున్నందుకు అభినందించాలి.


మా అత్తయ్య ప్రభుత్వ పాఠశాల లో హెడ్ టీచరు గా పనిచేస్తుంది. తన సర్వీసులో ఎన్నో పల్లెలూ, పంచాయితీలలో ఎన్నో బడులు చూసింది. చిన్నపుడు అత్తయ్య చెప్పే స్కూలు కబుర్లు వినడానికి చాలా ఆసక్తి కరంగా ఉండేది. ఈ రోజుల్లో ఇపుడు వాళ్ళ బళ్ళో రోజుకు 800 మంది పిల్లకు భోజనం పెడతారు. విజయవంతమైన మధ్యాహ్న భోజన పధకం ఎందరో పిల్లల్ని బడికి తీస్కొస్తుంది. దాంతో పాటూ, సాధారణంగా నాగరికమైన శుభ్రం, శుచీ పాటించని ఆ పల్లె పిల్లకి - 'ఒరేయ్ పిల్లలూ, రేపట్నించీ మీరు తల దువ్వుకుని, స్నానాలు చేసి, ఉతికిన బట్టలు వేసుకుని రాకపోతే భోజనం పెట్టం చూడండి !' అని బెదిరించడానికి తనకి కష్తం గా అనిపించినా, పిల్లలకి బేసిక్ హైజీన్ నేర్పించడానికి ఈ సాంబారన్నం ఎంతో పని చేసిందని చెప్తుంది అత్తయ్య. నాకు నామిని సుబ్రమణి గుర్తొస్తాడపుడు. ఏమి చెయ్యడం ?

అబ్భ ! బోల్డంత 'గుర్తు రావడాల తో నింపేసానా ? మరంతా ఫూల్స్ డే మహిమ ! కధల్లో కధలు - ఆ ఫలానా మొదటి కధ చదివిన వారికే అర్ధమవుతాయి కదా ! అందుకే ఆలోచనలన్నీ ఎట్నుంచి ఎటో - అట్నుంచి ఇటు ఇలా తిరుగులాడాయి. బుల్లెమ్మ బజ్జుంది. ఇంతకన్నా మంచి సమయం దొరకదు అనిచెప్పి ఆలోచనలన్నీ తెరుచుకున్న కిటికీలలోకి తోసేసా. అదీ సంగతి.

23/03/2010

విచిత్ర వ్యక్తి (The Mysterious Stranger)




మనిషి - ధర్మా ధర్మ విచక్షణ ఉన్న జంతువు. జంతు లోకానికెల్ల సాధువు. అనంత సృష్టి లో అన్ని ప్రాణుల్లోకీ తెలివయిన వాడు. నాగరికుడు. పుణ్య పాపాల ఖాతరున్నవాడు. సంఘ జీవి. ధార్మికుడు. మార్మికుడు. దేవుణ్ణి ప్లీస్ చేసి, స్వర్గం లో ప్లేస్ కొట్టేసి, ఏ రంభ తోనో ఫ్రీ గా మదిరా సేవనం చేస్తూ పరలోకంలో కాలం గడిపెయ్యలని స్థూలంగా ఏ మతానికి చెందిన మనిషయినా ఇహలోకంలో తెగ తాపత్రయయపడుతూ ఉంటాడు. దేవుణ్ణి మెప్పించేది ధర్మ మార్గమే. 

అయితే ధర్మానికి ఒక్కో కాలంలో ఒక్కో నిర్వచనం ఉంది. హిందూత్వం లో (హిందూ మతం లో) - త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, .. అలా ఒక్కో యుగంలో ధర్మం నీరసిస్తూ వచ్చి, కలియుగం వచ్చేసరికి, నీరసించి కళ్ళు తేలేస్తుంది. అందుకే ఏవైనా ఘోరం జరిగితే, మనవాళ్ళు 'కలిధర్మం.. కలియుగం నాయనా !'  అని గునుస్తుంటారు. ధర్మం అంటే ఒక రూల్. ఇది మంచిది, ఇది కాదు అంటూ చెప్పే ఒక ఇది. 

అయితే ఈ ధర్మాన్నంటుకునే న్యాయం, అన్యాయం అంటూ కూడా ఉన్నాయి. ఒకపుడు బిచ్చమెత్తుకోవడం నేరం. బిచ్చగాళ్ళు, కడుపేదలు, అన్ననికి బిచ్చమెత్తుకుంటే, వాళ్ళని తీస్కెళ్ళి న్యాయం పేరిట వధించడం జరిగేది. పాశ్చాత్య లోకంలో మధ్య యుగాలలో నేరాలకి ఘోర శిక్షలుండేవి. మంత్రగత్తెలని అనుమానం వచ్చినాళ్ళని నిట్టనిలువునా సజీవంగా చంపేసేవారు. అసలు ఏ నేరానికైనా అమానవీయ, రాక్షస శిక్షలు ఉండేవి. నిలువునా, ప్రాణమున్న మనుషుల్ని చీరడం, ఫిరంగులకి కట్టి పేల్చడం.. ఇలా శిక్ష అమలుచేసే విధానాల్లో ఇప్పటికీ ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లోనూ కౄరత్వం - కొనసాగుతూనే ఉంది. 

దైత్యులంటే భయపడే మనల్ని (మానవులని)చూసి దైత్యులేమనుకుంటారో ఎవరైనా ఊహిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికీ యుద్ధాలూ, టెర్రరిజం, ఇంకేదో ఇజం.. ఇంకేదో రొచ్చు అనుకుంటూ, నిత్యం వేలాది మంది మన సాటి మానవుల్ని శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేస్తున్నదీ, అమానుషంగా చంపుతున్నదీ ''మనిషే''. ఇందులో 'అ-మానుషం' అంటూ ఏమీ లేదనీ.. మనిషి నైజమే అమానుషత్వమనీ ఒక సైతాను తేల్చిచెప్తే ఎలా వుంటుంది ? 

 మార్క్ ట్వెయిన్ రాసిన ఈ క్లాసిక్ ని ఇంతకుముందు (మూలం) చదవలేదు. మొన్నామధ్య హీరో వచ్చి నండూరి రామ్మోహన్ రావు గారి అనువాదం 'విచిత్ర వ్యక్తి' తెచ్చి ఇచ్చాకా, ఇన్నాళ్ళకి కుదిరింది. చదివాకా, అబ్బురం .. ఆశ్చర్యం, ఆనందం లాంటి ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారి కమ్ముకున్నాయి. ఇంతోటి సాటిస్ఫేక్షన్ కలిగించిన ఈ బుల్లి పుస్తకాన్నీ దాచుకుని, మా బుజ్జాయికి ఈ కధ అర్ధం చేసుకునే వయసు వచ్చాకా చదివించాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే, కావడానికి ఇది పిల్లల కధే అయినా, సారాంశంలో ఎంతో డెప్త్ ఉంది. 

పిల్లల కధ కదా, పిల్లలే హీరోలు. వీళ్ళు ముచ్చు ముగ్గురు. దయ్యాలంటే భయపడని ఈ పిలకాయల దగ్గరకు సైతాను (ఒకప్పుడు దేవత అయిన సైతాను దేవునితో విభేధించి, నరకంలోకి తోయబడతాడు - అప్పణ్ణించీ మనుషుల ను సైతాను వశపరచుకుని, వాళ్ళని దేవుని దారి నుంచీ తప్పించి నరకంలో పాపులేషన్ పెంచాలని ప్లాన్లో ఉంటాడు. కాబట్టి సైతాను అంటే మనుషులకి భయం) అన్న కొడుకొకడు (ఇతని ఇంటిపేరూ సైతానే కదా మరి) పరిచయం అవుతాడు. ఈ సైతాను అపుడపుడూ కనిపిస్తూంటాడు. వింతలు చేస్తుంటాడు - మిగతా వారికి అదృశ్యంగా ఉండి, ఈ ముగ్గురు పిలకాయలకు మాత్రమే కనిపిస్తూ, వీళ్ళతో స్నేహిస్తూ, తానూ వినోదిస్తూ, జీవితం అంటే విపులంగా ఏవేవో చెప్తూ ఉంటాడు. 

సైతాను అంటే అభిమానం పిల్లలకి. కానీ సైతాను అభిప్రాయాలు చూసి భయపడుతుంటారు. సైతానుకు మానవత్వం లేదు. మనుషులంటే పురుగులుగానో, కీటకాలుగానో భావన. నయా పైసా అభిమానం వుండదు. అసలు ధర్మాధర్మ విచకషణ వున్న ఏ ప్రాణి అన్నా సైతానుకు మంట. సైతాను తన ఆనందంకోసం మనుషుల్ని ఘోరాలకు గురిచేస్తుంటాడు. తనే ఒక చిన్న లోకం సృష్టించి, పిల్లలు చూస్తుండగానే ఆలోకంలో భూకంపం పుట్టిస్తాడు, తను సృష్టించిన మానవుల్ని తానె కౄరంగా చంపి వినోదిస్తాడు. 

అయితే, సైతాను చేతలకి ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే, ధర్మం అనే ఒక బ్రహ్మపదార్ధాన్ని పట్టుకుని, దాని ముసుగులో సాటి మానవుల్ని చంపుకు సాధించే మానవజాతి అంటే సైతానుకు కోపం. ఈ ముగ్గురు పిల్లలూ సైతాను స్పెల్ లో ఉండినా, సైతాను ఆలోచనలతో కొద్దో గొప్పో విభేధిస్తున్నారు. అయినా వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ కళ్ళముందు జరిగిన కొన్ని సంఘటనలు మనుషుల దారుణ మనస్తత్వాల గురించి తెలిసేలా చేసి, పిల్లల కళ్ళు తెరుచుకుంటాయి. అయితే మనుషులకి మేలు చెయ్యాలంటే, సైతాను ఎంచుకునే మార్గం విచిత్రంగా వుంటుంది. ఒకసారి ఈ మువ్వురిలోనే నికాలాస్ అనే కుర్రాడికి మేలు చేసేందుకు నికోలాస్ ని మృత్యువుకు అప్పగిస్తాడు. మృత్యువు మనిషి బాధలకీ, కష్టాలకీ ఆఖరి మజిలీ అని సైతాను వాదన. 'విచిత్ర వ్యక్తి' మిస్ కాకూడని పుస్తకం.

నండూరి వారి అనువాదం కట్టిపడేసే సమ్మోహకత్వంతో - సైతాను వాదనను పిల్లల సంఘర్షణనూ - హేతుబద్ధంగా మన ముందుచుతుంది. వివిధ సంఘటనల అల్లిక, సైతాను కొంటె చేష్టలు, సైతాను నిరంకుశత్వం - హేతువాదం - ఇవన్నీ నమ్మశక్యం కాని ఏదో లోకంలోకి - యాలీస్ లాగా మన చేతులు పట్టుకుని లాక్కుపోయి చివరి పేజీ కొచ్చేసేరికీ సైతాను సిద్ధాంతంతో అంగీకరించేలా చేస్తాయి. సైతానుకు వచ్చిన సందేహాలే చిన్నపుడో, పెద్దపుడో, మనకూ వచ్చుంటాయి. దేవుడు కొందర్ని మంచిగా, కొందర్ని బీదగా, కొందర్నే ఆరోగ్యంగా, కొందర్ని ఆయుక్షీణంగా ఇలా ఎందుకు చేస్తాడు ? మనమంతా దేముని బిడ్డలే అయినపుడు ఆయన ఎందుకిలా కొందరికి తీరని కష్టాల్నిచ్చేడు ? .. ఇలా! ముఖ్యంగా భారతీయ/హిందూ కర్మ సిద్ధాంతంతో మన పెద్ద వాళ్ళు సాధారణంగా సర్ది చెప్పేరు. 

హేతువాదులు - దేవుడా - అచ్చి చ్చీ - వొట్టిదే ! అంటారు. విచిత్ర వ్యక్తి లో సైతాను ప్రసంగాలు ఈనాటి మన విశ్వానికీ వర్తిస్తాయి. మానవుడు తప్పులు చేస్తూ, ఆ తప్పుల్ని జస్టిఫై చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిదే తప్పు అంటూ ఎలా రంకెలు వేస్తూడో, యుద్ధాలు ఎలా చేస్తాడో - మనుష్యుల మంద (మోబ్ మెంటాలిటీ) మనస్తత్వం ఎలా ఉంటుందో సైతాను గొంతులో వింటే, మనిషెంత భయంకర ప్రాణో అర్ధం అవుతుంది. 

అమెరికన్ పాఠకులకు (మూలం) మార్క్ ట్వెయిన్ ఇంకోసారి ప్రత్యక్షమై బుద్ధి చెప్పినట్టుంటాయి కొన్ని పేరాలు. ఇపుడు జరుగుతున్న ఇరాక్ యుద్ధం, దీని లో యూ.ఎన్.వో పాత్ర, ఇప్పటి రాజకీయ వాతావరణం..అన్నిట్నీ ఏదో దివ్యదృష్టి తో చూసినట్టు, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు రామ్మోహన్ రావుగారి అందమైన తెలుగు నుడికారంలో వింటూంటే, పాప పుణ్యాల రంధి లో పడి ధార్మిక ప్రేలాపనలతో ఇదే ధర్మం అంటూ విరచుకు పడే మన లో ఉన్న ఫెనాటిసిజాన్ని, చాందసత్వాన్ని, మేనర్స్ లేని జంతు గుణాన్నీ చూసి సిగ్గుపడతాం. 

అందుకే మనిషికి మనిషి జడ్జ్ ఏమిటి ? ఖర్మ కాకపోతే ! మనిషి ఇంకో మనిషి చంపేడని, మూడో మనిషి నిర్ణయించి, నాలుగో మనిషి చేత చంపించడం న్యాయం కదూ ! ఎవడో ఎవణ్ణో చంపుతాడేమో అని ఇంకోడు ఆ మొదటి వాణ్ణి ఆనవాలు లేకుండా చంపి పెట్టడం దౌత్యం ! జార్జి బుష్ నీ, ఒసామా బిన్ లాడెన్ నీ పట్టుకుని బంధించి ఈ పుస్తకం చదివంచాలి అనిపిస్తుందెవరికైనా!! పనిలో పనిగా, ఈ పుస్తకం లో ముందుమాటల్లో ప్రస్తావించిన నండూరి వారి అన్ని అనువాదాలూ చదవాలని తీవ్రమైన ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. గోపీచంద్ కలెక్షన్ లాగా పబ్లిషర్లు ఈ తరం 'తెలుగు చదివే' పిలకాయలకోసం అవన్నీ ఒక సెట్టులాగా తీసుకొస్తే భలే కమ్మగా గడిచిపోగలదు ఈ ఎండాకాలం.

04/03/2010

Angela's Ashes

సాహిత్యంలో ఎప్పటికైనా పావర్టీ గొప్ప ఇదైన సబ్జెక్టు. మనిషికీ మనిషికీ ఉన్న సామ్యత ని తెలియచేసేది, మనసుల్ని ఒద్దిక చేసేది కూడా ఈ దారిద్ర్యమే. ఇంత దాకా సాహిత్యంలో చాలా ఎక్కువ ప్రసిద్ధ రచనలు, ముఖ్యంగా ఎందరో మహానుభావుల ఆత్మ కధలు ఈ పావర్టీనే అల్లుకుపోయాయి. ఆయా రచయితలు తమ బాల్యం లో అనుభవించిన దారిద్ర్యం, కష్టాలూ - ఆ కష్టాల్లో మమతలూ, కలతలూ, త్యాగాలూ, ప్రేమలూ - ఇలా ఎన్నో నిరుపమానమైన జీవితపు రంగుటద్దా ల్లో తమ కధ ని - కాదు కాదు ఆ బీదరికపు కధ ని చెప్పుకొస్తే, మనం కళ్ళార్పకుండా చదువుతాం. కష్టాల్లోనే చాప్లిన్ తరహా హాస్యాన్ని ప్రదర్శిస్తే ఎంతో ఆనందిస్తాం.

ఇదెందుకో యూనివర్శల్ ట్రూథ్ ! మన దేశంలో ఇంకా ఎందరో బీదలు. రోజురోజుకీ పెరుగుతున్న బీద వారి సంఖ్య. బీదరికం ఒక శిక్ష. ఒక చాలెంజ్. కేవలం సరయిన ఆధారమూ, ఆదాయమూ లేక పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేక, స్కూళ్ళకు పంపలేక కళ్ళల్లో కన్నీటితో బ్రతుకు పోరాటం చేస్తున్న తల్లులకూ తండ్రులకూ ఈ బాధ తెలుస్తుంది. ఏ వైద్యమో అందివ్వలేక కన్న పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే చూస్తూ ఉండిపోవాల్సిన నిస్సహాయత బీదలది.


అందుకేనేమో - ఎన్నో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాహిత్య లోకపు అవార్డులు తమ రచనలతో బీదరికపు స్మృతులని పాఠకులతో పంచుకున్న రచనలని వరించాయి. కొడవటిగంటి కుటుంబరావు గారు తన 'చదువు ' లో అన్నట్టు 'ఇక ఇందే ఆఖరు.. జీవితం ఇంతకన్నా ఘోరంగా దిగజారడానికి వీల్లేదు!' అనుకునే అసంఖ్యాక సందర్భాలు ఎదురయ్యే జీవితం గురించి చదువుతుంటే, అలాంటి జీవితం లోంచి కూడా కుసుమాలు వికసిస్తాయి అనే ఆశ, నమ్మకం కలుగుతుంటే - అదో చక్కని ఫీలింగ్. జాలి, సానుభూతి కోసం కాకుండా రచయితలు ఆయా రచనల లో ఇంకేదో వ్యూహాన్ని అనుసరిస్తారు. అందుకే కొన్ని రచనలు, వాటి సౌరభాలతో మనల్ని కొన్ని రోజుల పాటూ కమ్ముకునే ఉండిపోతాయి.

ఎన్నాళ్ళుగానో ఈ పుస్తకం (Angela's Ashes) గురించి రాద్దామని అనుకున్నా, ఈ నిరుత్సాహ పరిచే బీద రచన ని గురించి ఏమి రాయడం అనిపించేది. కానీ ''ఏంజెలాస్ యాషెశ్' లో ఏదో ఉంది. ఇది ఐరిష్ దారిద్ర్యాన్ని గురించి వచ్చిన అత్యుత్తమ రచనలలో ఒకటి. యుద్ధ సమయంలో, గ్రేట్ డిప్రెషన్ లో - ఉద్యోగాలు పోయి, ఆదుకునే దిక్కులేక, దుర్భర దారిద్ర్యంలో వలస పోయిన అమెరికా నుంచీ అయిన వాళ్ళ దగ్గరకి ఐర్లాండు చేరి, అక్కడ కూడా ఉద్యోగాలు దొరకక, పసి పిల్లలతో నానా అవస్థలూ పడిన ఐరిష్ కుటుంబపు కధ.

ఈ కుటుంబంలోని జంట ప్రేమ వివాహం చేసుకుంటారు. ఉత్తర ఐర్లండ్ లో స్వతంత్ర పోరాటంలో సాయుధుడై పోరాడిన ఐరిష్ తండ్రి మెక్ కోర్ట్, తన తల కి వెల కట్టబడి, ప్రభుత్వం నుంచీ,దేశం నుంచీ అమెరికా పారిపోయి, అక్కడ పరిచయమయిన ఇంకో ఐరిష్ యువతి యేంజెలా ను పెళ్ళి చేసుకుంటాడు. వీళ్ళ పెద్ద కొడుకే (ఫ్రాంక్ మెక్ కోర్ట్) ఈ నవలా రచయిత.


స్వదేశానికి తిరిగి రావడానికి యేంజెలా తల్లి ఎలాగో టికెట్లు పంపిస్తే, షిప్ లో ఐర్లెండు చేరిన ఈ కుటుంబం అప్పటి నించీ మరిన్ని కష్టాల్ని ఎదుర్కొంటుంది. యుద్ధం వల్ల ఎక్కడా ఉద్యోగాలు ఉండవు. అందునా ఐర్లండ్.. ఇక్కడ చాలా మంది పురుషులు ఇంగ్లండు కి వెళ్ళి, ఆ దేశ సైన్యంలో చేరుతారు. ఇండియా కి, ఇతర ఆసియా దేశాలలోనూ డెప్యూట్ చెయబడతారు. వీళ్ళకి యుద్ధమే జీవనాధారంగా తయారైంది.

వీళ్ళ పెళ్ళి ఎంతమాత్రం ఇష్టం లేని ఇద్దరి తల్లి దండ్రులూ, చిన్న పిల్లల మొహం చూసి కూడా ఎంతమాత్రం సహాయం చేయరు. మెక్ కోర్టులయితే, ధనికులయినా కనీసం ఆశ్రయం ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. ఫ్రాంక్ భాషలో ఆ చిన్న హృదయం, తమ కష్టాలను అర్ధం చేసుకునే వయసు లేకపోయినా, తల్లి తండ్రుల నిస్సహాయతని, భయాలనూ చక్కగా వర్ణిస్తుంది.

ఫ్రాంక్ తండ్రి తాగుబోతు. కొన్నాళ్ళకి ఆ కుటుంబం ఎట్లాగో స్థిరపడినా, తన సంపదనంతా తాగడానికే వెచ్చించడంతో, ఆకలి, దాహం, చలి - ఇలా అన్ని కష్టాలూ ఆ కుటుంబాన్ని ముంచెత్తుతాయి. వీటిల్లో ఏంజెలా ఎన్నో సార్లు తన పిల్లల్ని అనారోగ్యాలనుచీ కాపాడుకోలేక, చనిపోతున్న పిల్లలని తలుచునుని రోదిస్తూ, బ్రతికి ఉన్న పిల్లలతో ఎలానో కాలక్షేపం చేస్తుంటుంది.

కొన్నాళ్ళకి ఫ్రాంక్ తండ్రి పని కోసం, బ్రతుకు తెరువు కోసం ఇంగ్లండ్ వెళ్తాడు. కొన్నాళ్ళు డబ్బు సరిగానే పంపినా తరవాత తాగుడుకి బానిసై, జబ్బుపడి తిరిగొచ్చి, ఐర్లండ్ లోనే కన్నుమూస్తాడు. అనాధ అయిన ఈ కుటుబానికి అద్దె చెల్లించుకునే స్తోమత లేక ఒక పెళ్ళికాని చుట్టం ఇంటికి తరలాల్సి వస్తుంది. అక్కడ ఈ చుట్టం (అంకుల్) కారణంగా పిల్లలూ, ఏంజెలా కూడా ఎన్నో అవమానాలకు గురి ఔతారు గానీ, ఆఖరుకి తన పిల్లల కోసం యేంజెలా అవన్నీ పంటి బిగువున భరిస్తూ ఉంటుంది. అతనికి ఉంపుడుగత్తెగా ఉండాల్సి వచ్చినా, పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఒక గూడంటూ ఉంటుంది కదా అని అతని ఇంట్లో పనిమనిషి లా పడి ఉంటుంది. చిరిగిన సాక్సులూ, కప్పుకోవడానికి వాడే చిరిగిన కోట్లూ - కప్పులు లేక పాత జాం జార్లలో టీ తాగడం, చర్చి చదువులూ, ఇలా నానా కష్టాలూ పడుతున్న పిల్లలు కనీసం ఈ అంకుల్ ఇంట్లో ఉంటే రాత్రి వెచ్చగా ఉంటారనే తల్లి ప్రేమని ఏ కొడుకు మర్చిపోగలడు ?

పెద్దయ్యాక పిల్లలు (చనిపోయినవాళ్ళు పోగా మిగిలిన వారు) ఎలానో ప్రయోజకులౌతారు. 19 ఏళ్ళ వయసులో Frank అమెరికా ప్రయాణం అవుతాడు. అమెరికా చేరాకా కొత్త జీవితం లోకి అతను చదువుకోవడం మీద కోటి ఆశలతో అడుగుపెట్టడంతో ఈ నవల ముగుస్తుంది. దీనికో సీక్వెల్ కూడా ఉంది. దాని పేరు 'Tis.

ప్రాధమికంగా ఈ రచనలో రచయిత ప్రతి పేరాగ్రాఫ్ లోనూ ఎంతో డీటైల్ తో - ఎక్కడా పొరపాటనేది దొర్లకుండా, ఐరిష్ జీవితాన్ని, బీదరికాన్నీ వర్ణిస్తాడు. ఆకలికి ఏడుస్తున్న తమ్ముళ్ళ నోటికి నీళ్ళు నింపిన బాటిళ్ళిచ్చి ఊరుకోపెట్టడం, ఇటాలియన్ పచారీ కొట్టువాణ్ణి ఈ మాటా,ఆ మాటా పెట్టి మభ్య పెట్టి అకణ్ణించీ అరటిపళ్ళు ఎత్తుకొచ్చి తన కన్నా చిన్న వాళ్ళకి తినిపించడం, ఇంట్లో ఫైర్ కోసం, రోడ్డు పక్కన బొగ్గులేరడం, పొద్దున్న పేపర్ బాయ్ గా పనిచెయ్యడం, తల్లి తండ్రుల ప్రేమనీ, వాళ్ళు పెద్దలనుంచీ ఎదుర్కున్న కష్టాలు అనిటినీ - చాలా హృద్యంగా వివరిస్తాడు.

యేంజెలాస్ యాషెస్ - నవల కాదు. ఇది ఫ్రాంక్ మెక్ కోర్ట్ తన బాల్య స్మ్ర్తులతో రాసిన ఆత్మ కధ అని చెప్పొచ్చు. దీనికి 1997 లో పులిట్జెర్ ప్రైజ్ లబించింది. అన్ని కష్టాల్లో, అంత బీదరికంలో నేను బ్రతికి బట్టకట్టడం విశేషమే. ఈ తరానికి తెలియని ఆ జీవిత పోరాటాన్ని మా అమ్మ స్మ్రుతికి అంకితం ఇస్తున్నా అంటాడు రచయిత. అయితే ఇన్ని కష్టాల్లో కూడా ఫ్రాంక్ ప్రదర్శించిన మంచి లక్షణం - దుఃఖం లో మునిగిపోకపోవడం. సెల్ఫ్ పిటీ లో కొట్టుకుపోకపోవడం. రచన అంతా మేటర్ ఆఫ్ ఫేక్ట్ గా కొనసాగుతుంది. అలా అని ఆ విషాదం మన హృదయాన్ని స్పృశించకపోదు. అదీ ఈ రచన ప్రత్యేకత. 2009 లో నేను చదివిన అన్ని పుస్తకాల్లో ఇదే ఎక్కువ నచ్చింది.

02/03/2010

డియర్ చీఫ్ జస్టిస్

మన ఇంత పెద్ద భారద్దేశం లో, ధర్మం ఒకప్పుడు నాలుగుపాదాలా నడిచేదంట. ఇపుడు కాలం మారింది. కలి మహిమ ! ఎంత ప్రజారాజ్యమైనా జనం ప్రభువుల పదఘట్టనల మధ్య చిత్తుకాయితాల్లా నలుగుతున్నారు. పుర్రెకో బుద్ధి అన్నట్టు, ప్రస్తుతం మనకో న్యాయం, ఊరందరికీ ఇంకో న్యాయం అమల్లోకి తెచ్చేం.

పుణ్యక్షేత్రాల్లో తీర్ధ ప్రజ, మామూలు గుళ్ళలో కూడా తొక్కిడి, టెలివిజన్లో భక్తి - బాబాలూ, అమ్మలూ - ఇవన్నీ చూసి, మాలతీ చందూర్ ని ఎవరో అడిగారు ; ప్రజల్లో దైవభక్తి ఇంతగా ఎందుకు పెరిగిందీ ? అని. ఆవిడ నిష్కర్షగా చెప్పింది - ప్రజల్లో పెరిగింది భక్తి కాదు - పాప భీతి అని. పాపభీతి సంగతేమో గాని, నేరాలు వివిధ క్షేత్రాల్లో, పరిధుల్లో - ఆయా రేట్లలో పెరుగుతూనే ఉన్నాయి.

మనకో న్యాయ వ్యవస్థ ఏడిచింది గానీ మొదట్నుంచీ ప్రజలకి కోర్టులంటేనే ఏవో పడని పాట్లు గుర్తొస్తాయి. కోర్టులో కేసులు తరతరాలుగా పేరుకు పోవడం, న్యాయం దొరకడం ఆలీశెం అయిపోవడం వల్లనా కోర్టు - గాడిదా సామెతలు పుట్టాయి. తడిసి మోపెడయ్యే వ్యాజ్య ఖర్చులు తలుచుకుని, కేసు గెలిచినవాడు ఇంటికెళ్ళి, గెలవని వాడు కోర్టు బయటా ఏడుస్తారని జోకులు పుట్టాయి.

ఇలా న్యాయం దుర్భరమైపోతే ప్రజలకి దొరికేది, మిగిలేది - అన్యాయమే. కానీ అన్యాయాన్ని ఎదిరించే దమ్మున్న, నిబద్ధత ఉన్న మనిషొకడు నిర్ణయాత్మక, క్రియాశీలక పదవి లో ఉంటే ? రాజకీయాలకు అతీతంగా, అదరక బెదరక - అవినీతితో కుళ్ళిన న్యాయ వ్యవస్థ కి వన్నెను తీసుకొచ్చిన జడ్జి ఒకరు ఉంటే ?

సరిగ్గా ఇలాంటి లక్షణాలున్న నిజంగానే గౌరవనీయులైన ప్రధాన న్యాయ మూర్తి అజయ్ ప్రకాష్, గత అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు. పత్రికలలో ఆయన మీద కురిసిన ప్రశంసలు చదివి చాలా ఆశ్చర్య పోయి ఈ మనిషిని గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందామని ప్రయత్నం చెయ్య బుద్ధయింది. అజయ్ ప్రకాష్ షా సుదీర్ఘ కెరియర్ లో మచ్చుకి కొన్ని మెచ్చు తునకలు :

గోధ్రా అల్లర్ల అనంతరం, గుజరాత్ ప్రభుత్వం - దూరదర్శన్ లో ప్రసారం కానివ్వకుండా అడ్డుకున్న టెర్రరిజం, అయోధ్య ల పై తీసిన డాక్యుమెంటరీలు 'ఇన్ మెమొరీ ఆఫ్ ఫ్రెండ్శ్ & 'రాం కే నాం' లను ప్రసారం చెయ్యాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించడం. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ - భారత పౌరుడుకి ఉన్న ప్రాధమిక హక్కు అని ప్రభుత్వానికి గుర్తు చేసారు ఈ న్యాయ మూర్తి.

విదేశాల్లో వికలాంగులను, వారికున్న సదుపాయాలను, పౌర జీవితం, నాగరికతా, వికలాంగుల కోసం పబ్లిక్ ప్లేసులను ప్రత్యేక సదుపాయాలతో సౌకర్య వంతంగా తీర్చిదిద్దడం చూసిన వారికి, మన దేశంలో వికలాంగులు పడే బాధలు చూస్తే ఎలా అనిపిస్తుంది ? మన దేశంలో ఇలాంటి వారికి మనం కల్పించే సౌకర్యాలు తక్కువ. బస్సు ల్లో, రైళ్ళలో, పని చేసే చోట్లలో - మానసిక అవకరం ఉన్నవాళ్ళకి, శారీరక వైకల్యం ఉన్నవాళ్ళకీ, రోజువారీ జీవితమే ఒక కార్గిల్ యుద్ధంలా తయారు చేసి పెట్టేం మనం. మరి వాళ్ళకి ఉన్న హక్కుల్ని ఎవరు గౌరవిస్తారు ? జస్టిస్ అజయ్ ప్రకాష్ మాత్రం ఆ పని చేశారు. ఎన్నో తీర్పుల్లో రవాణా సంస్థలనీ, ప్రభుత్వాల్నీ వికాలాంగుల హక్కుల కోసం కదిలించారు. లొంగని వాళ్ళని లొంగేలా చేసారు. ఈ ఒక్క వ్యక్తి, మానసిక అస్వస్థులు ఎదుర్కొనే వివక్ష ని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. అంతవరకూ మంచి ఆరోగ్యంతో ఉన్న ఉద్యోగులు, ఏ కారణం గానైనా మానసిక అస్వస్థత కు గురి అయితే, ఇలాంటి వారిని వృత్తి ఉద్యోగాల నుండీ బలవంతంగా నిర్మూలించడం, వారి వారి పెన్షన్ బెనిఫిట్లను నొక్కి పెట్టడాన్ని నిరసించి, చట్ట భద్రత కలిపించారు.

మహారాష్ట్ర లో మహాబలేశ్వర్, పంచ్ ఘని లను - ఆయా బీచ్ లనూ - అభివృద్ధి పేరిట వినాశనం చెయడాన్ని తన తీర్పులతో అడ్డుకున్నారు. ఆయా ప్రదేశాల 'ఇకో సిస్టం' ని భగ్న పరిచే ప్రయత్నాలు ఏవయినా తన దృష్టికి వస్తే వొదిలిపెట్టలేదు. హిందూ వివాహ చట్టం ప్రకారం - మొదటి భార్య బ్రతికుండగా, ఆ భర్త రెండో పెళ్ళి చేసుకుంటే, రెండో భార్యకు ఏ హక్కులూ ఉండవు. కానీ ఈ అంశాన్ని అడ్డంగా పెట్టుకుని భర్త విహీన అయిన రెండో భార్యని సమాజం ఎన్నో రకాలుగా వేధించడాన్ని ఈయన ప్రతిష్ఠాత్మకమైన తీర్పుల ద్వారానే నివారించగలిగారు. భారత విమాన యాన సంస్థ 58 సంవత్సరాల వయసు దాటిన మహిళా హొస్టెస్ లను బలవంతంగా రిటైర్ చేయించబోయినపుడూ ఈ అజయహస్తమే ఈ వయో, లింగ వివక్ష కు వ్యతిరేకంగా మహిళా ఏర్ హోస్టెస్ లు రిటైర్మెంట్ వయసు వరకూ పని చేయవచ్చని తీర్పిచ్చి ఆదుకుంది. విమాన యాన సంస్థ మొదట తన పనితీరు మెరుగు పరుచుకొని ప్రైవేటు రంగానికి దీటుగా నిలబడాలిగానీ ఏర్ హోస్టెస్ లను వొదిలించుకుని కాదని హితవు చెప్పింది ఈయన నాయకత్వం వహించిన బెంచ్.

అజయ్ ప్రకాష్ ఇచ్చిన ఎన్నో బెంచ్ మార్క్ తీర్పుల్లో - ప్రస్తుతం ఢిల్లీ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా కామన్ వెల్త్ క్రీడల నిర్వహణకు సిద్ధం అవుతున్న ఢిల్లీ లో బిచ్చగాళ్ళను వారి వారి స్వ రాష్ట్రానికి పంపిచడాన్ని కోర్టు తప్పు పట్టడం తాజాది. ఢిల్లీ ఎవరి సొంతం.. బిచ్చగాళ్ళనయినా సరే పొమ్మనడానికి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారు ? అనే భావన ని, ఎన్నో ఎన్.జీ.వో. ల మనోకాంక్షలని నిలబెట్టిందీ తీర్పు. అయితే, ఇపుడు అజయ్ పదవీ విరమణ చెయడంతో పరిస్థితి తారుమారు అయింది. ఎముకలు కొరికే నిర్దాక్షిణ్యమైన ఢిల్లీ శీతోష్ణ స్థితి ఏటా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంటోంది. ఇది కేవలం రాత్రి ఉండటానికి చోటు లేక పోవడం వల్లనే. చలి కాలంలో రాత్రి పూట రోడ్డు మీద నిద్రించే, ఇల్లు లేని కొన్ని వేల మంది అభాగ్యులకు ఎముకలు కొరికే చలి లో ప్రాణం నిలుపుకోవడానికి తినడానికీ (వొంట్లో వేడిని నిలుపుకోవడానికి), కప్పుకోవడానికీ ఏదయినా కావాలి. తిండి మాట దేవుడెరుగు. రాత్రికి 40 రూపాయల అద్దెకి కుక్కి మంచాన్నీ, కప్పుకునేందుకు రజాయినీ ఈ పేదలకి అందించే వాణిజ్యం కూడా అమలులో ఉందిక్కడ. కూటికి గతి లేక పోయినా, చలికి బ్రతికి బట్టకట్టేందుకు రాత్రికి 40 రూపాయల ఖర్చు కోసం తిండి కూడా తినకుండా పేదలు కటకటలాడుతున్నారు. వారిలో పిల్లలు, ముసలి వారు, వెనుకబడిన ప్రాంతాలనుంచీ పొట్టకూటికి నగరం చేరిన రిక్షా పుల్లర్లు, రక రకాల కూలి పనులు చేసుకునే వారు. వీళ్ళలో ఎందరో చలికాలం నిర్దాక్షిణ్యమైన చావు ని ఎదుర్కొంటున్నారు. కనీసం శీతాకాలం లోనైనా షెల్టర్లు నిర్మించి ఇవ్వమని ఆదేశించిన ఘన హృదయం జస్టిస్ అజయ్ ది.

లెక్కలేనన్ని ఎన్విరాన్ మెంట్ ఇష్యూస్, టెక్నాలజీ అంశాలూ - పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లూ - ప్రభుత్వ విధాన నిర్ణయాలూ - ఇలా ఎన్నో ప్రజోపయోగ తీర్పులతో ఎందరి జీవితాలనో తాకిన జస్టిస్ అజయ్ ప్రకాష్ లాయర్ల కుటుంబం నుంచీ వచ్చారు.

మన దేశంలో చాలా మందికి రుచించని 'గే' ల చట్టబద్ధతని, హోమో సెక్సువల్ ల హక్కులనూ - జస్టిస్ అజయ్ తీర్పే కల్పించింది.

జస్టిస్ అజయ్ ప్రకాష్ పదవీ విరమణ అనంతరం జాతీయ ప్రింట్ మీడియా ఆయన పనితీరుని ప్రత్యేకంగా శ్లాఘించింది. సాహసం, నిబద్ధతా, నిజాయితీ, మూర్తీభవించిన ఇలాంటి జడ్జి - జస్టిస్ దినకరన్ లాంటి కేసుల వల్ల దెబ్బతిన్న ఇండియన్ జ్యూడీషియల్ సర్వీసుల ప్రతిష్టని పెంచడానికి కావాలి. రాబోయే కాలంలో జస్టిస్ అజయ్ ప్రకాష్ ని ఏదో ఒక కమిటీ కి పెద్దగా చూడవచ్చేమో మనం.

సో.. ఎందరో మహానుభావులు. ఒక్కొక్కరికీ వందనాలు.

14/02/2010

నేను తీసిన కొన్ని ఫోటోలు


-- > మిట్ట మద్యాహ్నం తెన్నేటి పార్కు, విశాఖపట్నం


-- > గ్రేట్ రివర్ ఔస్ లో ఒక పాయ - బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్


-- > పెరట్లో విరగబూసిన చెట్టు, బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్


-- > (ప్రయోగాలు - భంగిమ) పాట్ ప్యూరి



-- > ప్రయోగాలు - దీపావళి అలంకరణ కోసం కొన్న గుర్రం బొమ్మలు


-- > Town Centre దగ్గరనుకుంటా! బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్

--> వెరసి, తోచీ తోచనమ్మ తీసిన ఫోటోలు! చాన్నాళ్ళకి చూసాకా, బావునాయే అనిపించి, ఇలా పోస్ట్ చేసాను.

08/02/2010

నాద నీరాజనం - SVBC

నాద నీరాజనం, శ్రీ వేంకటేశ్వరా భక్తి చానల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండీ, 7.30 దాకా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన దగ్గర నుంచీ దాదాపుగా అన్ని ఎపిసోడ్లూ చూస్తూనే వస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరా భక్తి చానెల్ దేవస్థానం శ్రీవారికి నిష్ణాతులయిన సంగీత కళాకారుల చేత, వారి అద్వితీయమైన సంగీత ప్రతిభ చేత, ఇస్తున్న స్వర హారతే ఈ నాద నీరాజనం.

ఈ డైలీ కాన్సెర్టులు - శ్రీ వారి ఆలయం ఎదురుగా బహిరంగం గా - అందరు భక్తులకోసం, ఆరుబయట నిర్మించిన మండపంలో నిర్వహించపడుతున్నాయి. ఇప్పటివరకూ ఈ వేదికపై ప్రముఖ సంగీత విద్వాంసులు, కర్ణాటక, హిందుస్తానీ - భజన - దాస సాంప్రదాయాలలో గాత్ర, వాయిద్య సంగీత ప్రదర్శనలతో ప్రజల్లోకి భారతీయ, హిందూ, భక్తి సంస్కృతులను ఆఘౄణింపచేస్తూ, సామాన్య భక్తులను తమ స్వర రాగాలయ దర్శనం చేయిస్తున్నారు.

అసలే తిరుమల. ఎన్నో వ్యయ ప్రయాశలకోర్చి చేసుకున్న శ్రీవారి దర్శనం. ఉస్సూరుమంటూ గుడి బైటికొచ్చిన భక్త కోటికి సాయంత్రాల్లో ఓదార్పు గా ఈ వీనుల విందు. ఉత్కృష్ఠమైన ఈ సాంప్రదాయ సంగీత కళ, దేశ విదేశాల్లో పేరెన్నిక గన్న కళాకారుల ఉక్కిరి బిక్కిరి చేసే ప్రదర్శనలు - ఉచితంగా, భక్తుల కోసం ఏ ఆస్థాన మండపంలోనో కాకుండా - ఆరుబయట ఏర్పాటు చేసిన వేదిక, దేవస్థానం వారి దూరదర్శని లో ప్రత్యక్ష ప్రసారం - ఇదీ నాద నీరాజనం లో ప్రత్యేకత.

భారతీయ శాస్త్రీయ సంగీతానికి పెరుగుతూన్న ఆదరణ, సామాన్య భక్త జనంలొ ఉన్న భక్తికి, సంగీతం పట్ల అనురక్తినీ జోడించి పారవశ్యంలో ఓలలాడిస్తున్న ఈ నిత్యమూ జరిగే కచేరీలు ఒక నిదర్శనం.

అయితే, ఈ కచేరీలలో, కొన్ని నిజంగా ఆణిముత్యాల లాంటి కచేరీలు - ప్రత్యక్ష ప్రసారం ఒక సారి జరిగిన తరవాత ఇంకోసారి చూసుకునే అవకాశం లేకపోవడం విచారించదగిన విషయం. మిగిలిన చానెళ్ళ లాగా బెస్ట్ ఆఫ్ నాదనీరాజనం లా ఈ మణిపూసల్ని ఇంకోసారి మరోసారి ఎపుడన్నా ప్రసారం చేసే ఆలోచన తి.తి.దే.వారికి ఉంటే బావుండేది.

మొన్ననే లతా మంగేష్కర్ చేత అన్నమయ్య సంస్కృత సంకీర్తనలను సీడీలు గా చేయించి విడుదల చేసిన సందర్భంలో ఈ నాదనీరాజనం వేదికను రసాభాసా చేసింది తి.తి.దే. నాద నీరాజనం కార్యక్రమం చోటుచేసుకునే ఆ సరస్వతీ మండపాన్ని రాజకీయ నాయకుల కాళ్ళు ఎక్కి తొక్కడం - లతా కచేరీ ఉంటుందని విశేషంగా జనాకర్షణ చేసిన సారాయి వీర్రాజు గారు వేదిక మీద త్రిభాషా ప్రసంగం చేసి (ఏ భాష లోనూ తీరా సరిగా మటాడ్లేకపోయారు) లతమ్మనూ, భక్తులనూ విసిగించడం దురదృష్టకరం. తీరా ఈ కార్యక్రమంలో లత పాడలేదు. కానీ ఆరోజు సభా ముఖంగా శ్రీవారికి తాను చేసిన స్వరార్చన (అన్నమాచార్య సంస్కృత సంకీర్తనలు హిందూస్తానీలో ఆలపించడం) సీడీలను విడుదల చేసి, ఏదో ఒక రోజు ఈ వేదిక పై కచేరీ చేయగల శక్తిని తనకు ఈయమని స్వామిని వేడుకుంది.

మంగళంపల్లి బాల మురళి, ఉన్నికృష్ణన్, ప్రియా సిస్టర్స్, హరిప్రసాద్ చౌరాసియా లాంటి ఎందరో ఉద్దండులు చేసిన కచేరీలు శ్రీవారికి నాద నీరాజనంగా సమర్పింపబడ్డాయి ఈ వేదిక మీదే. ప్రతి రోజూ సాయంత్రం భక్తులకు ఈ భక్తి సంగీత విందు - ఆసక్తి గల బ్లాగర్లకూ, సంగీత విద్యార్ధులకు మరి భలే పసందు. ప్రతి సంగీత కళాకారుడూ ఈ వేదిక మీద కచేరీ చేయాలని ఆశించే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రసరమ్యంగా నిర్వహిస్తున్న TTD, SVBC మరియూ ఈ.వో గారు శ్రీ కృష్ణారావుగారూ ధన్యులు. వీడియోలు యూట్యూబ్ లో కొన్ని చూడొచ్చు.