Pages

28/01/2024

The Ivory Throne - Manu S Pillai

 


The Ivory Throne - Chronicles of the House of Travancore - Manu S Pillai 


ఈ రోజుల్లో ఎందరో షీరో ల గురించి చదువుతున్నాము.   ఏ రంగమైనా కావచ్చు - ఎన్నో అత్భుత విజయాలు సాధించినవాళ్ళనీ,  వాళ్ళు తమ తమ పరిధుల్లోనే, పరిమితుల్లోనే, అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి  మార్పులకు కారణమయ్యేవాళ్ళని గురించి తెలుసుకోవాలి.  Rulers మంచి నిర్ణయాలను తీసుకోవడం వల్ల అవి కాలక్రమేణా ఎందరి జీవితాలలోనో  వెలుగు తీసుకువస్తాయి.   తమ పాలనలో రాజకీయంగా, పరిపాలనా రంగంలో, సామాజికంగా,  స్త్రీలు తీసుకొచ్చిన మార్పుల్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.   కేరళ లో ఉన్న మూడు ప్రసిద్ధమైన రాజవంశాలలో ఒకటైన ట్రావన్ కోర్ రాజవంశం లో ప్రస్తుత కేరళ సమాజం మరిచిపోయిన ఒక (Last Queen) రాణి గురించిన ఏకపక్ష కథ ఈ "ఐవరీ థ్రోన్". రాసింది చాలా చిన్న వయసులో ఉన్న అబ్బాయే. కానీ తన రాష్ట్ర  చరిత్ర రాయడానికి  అతను చేసిన పరిశ్రమ మెచ్చుకోదగ్గది.   

కేరళ లో  తిరువనంత పురం లో ఉన్న ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయం, అక్కడి బ్రహ్మాండమైన నిధులని గురించి ప్రపంచం అంతా మారుమోగిపోయిన నాడు, రాజ వంశం చాలా విమర్శలకు గురయింది.  దేశానికి స్వతంత్రం వచ్చి, రాజరికాలు రద్దయినాక, రాజు కేవలం ఆ అనంత పద్మనాభ స్వామికి దాసునిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకే తిరువనంతపురం లో తన అంతఃపురం లో ఉండాల్సి వచ్చి ఇంత నిజాయితీగా, భక్తిగా, ధర్మ బద్ధంగా బ్రతుకుతూన్నపుడు - ఆయన మీద ఆలయ సంపద ను టిఫిన్ బాక్స్ లో తరలిస్తున్నట్టు ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. 

పుస్తకం, తిరువనంతపురం రాజరికం గురించి విస్తారంగా వివరిస్తూ అక్కడి మాతృస్వామ్య పరిపాలనా వ్యవస్థ గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. పుస్తకం లో చాలా వరకూ రాణి సేతు లక్ష్మీబాయి (సీనియర్ రాణి), సేతు పార్వతీ బాయి (జూనియర్ రాణి) ల మధ్య జరిగిన పోరాటం గురించే గానీ, ఇంతవరకూ బయటికి రాని కొన్ని  విషయాల్ని గురించి కూడా చెప్తూ ముఖ్యంగా రాణి సేతు లక్ష్మీ బాయి గురించి, ఆవిడ తన కున్న తక్కువ పరిపాలనా కాలంలో, తన పరిధిలోనే ఎంత చక్కగా పరిపాలించిందో, కేరళ సమాజంలో ఎన్ని కొత్త మార్పులకు ఆవిడ నిర్ణయాలు ఊతమిచ్చాయో, మాతృస్వామ్య వ్యవస్థ లో మహిళ సామాజిక స్థానం ఏమిటో చాలా బోల్డంత విపులంగా వివరిస్తుంది.  ఇంత ఎక్కువ సమాచారం ఎలా సేకరించి ఉంటాడో ఈ అబ్బాయి. ఎన్ని ఇంటార్వ్యూ లు ! ఎన్ని కోట్ లు, ఎంత క్రోడీకరణ, ఎంత పరిశోధన, ఎన్ని ప్రశంసలు, ఎన్ని విమర్శలు !! 

మను పిళ్ళై కేరళలో పుట్టి, పూనే, లండన్ ల లో విద్యాభ్యాసం ముగించి, శశీ థరూర్ పార్లమెంట్ ఆఫీస్ లో కొన్నాళ్ళు, లండన్ లో  లార్డ్ బిలిమోరియా దగ్గర కొన్నాళ్ళూ పని చేసాడు. ఆ తరవాత బీబీసీ లో హిస్టారియన్ గా కూడా పని చేసాడు. "ద ఐవరీ థ్రోన్" అతని మొదటి పుస్తకం. ఆరేళ్ళు పట్టింది ఈ పుస్తకం రాయడానికి. అతను ఎంత ప్రయత్నించినా, 'జూనియర్ రాణి' కుటుంబం నుంచీ అతనికి ఒక్క ఇంటర్వ్యూ కూడా దొరకలేదు.  దాంతో అతని రీసెర్చ్ అంతా 'సీనియర్ రాణి' కుటుంబం చెప్పిన విషయాలు, అప్పటి డాక్యుమెంట్ లు, చారిత్రక సాక్షాల ఆధారంగా సాగింది. కాబట్టి ఇది ముగించేసరికీ, ఇదంతా సీనియర్ రాణిని సమర్ధిస్తూ రాసిన కథ అనిపిస్తుంది. కాకపోతే, ఆ సీనియర్ రాణి ఒక షీరో కాబట్టి - ఆవిడ జీవితం, ఒక Matriarch గా ఆవిడ జీవన విధానం, రాణి గా ఆమె సాధించిన విజయాలు, మాజీ రాణి గా అనుభవించిన బాధలు చదివి - ఇప్పటి కేరళ సమాజం ఆమె గురించి పూర్తిగా మర్చిపోయింది కాబట్టి అలాంటి వ్యక్తి ఒకరంటూ ఉన్నారని తెలియజేయడం కోసం రాయబడిన పుస్తకం అనిపిస్తుంది.    

Travancore గురించి ఇంత సమాచారం చదవడం ఒక పెద్ద  విషయం. ఇన్ని డీటైల్స్ - ఇన్ని వివరణలు, ఇంత ఒక పుస్తకం లో ఇరికించడం కష్టమే. కేరళ లో మొదట విదేశీయులు అడుగుబెట్టి, వ్యాపారం మొదలు పెట్టినప్పటికే అక్కడి సామాజిక పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తాయి. కేరళ ఒక రాజకీయ దేశం. అక్కడి ప్రజలు చైతన్యవంతులు. ముఖ్యంగా పోరాట వీరులు. స్త్రీలు పురుషులతో సమానంగా యుద్ధాలలో పోరాటాలు చేసారు. రాజ్యాలని ఏలారు. అలాంటి   రాజ్యంలోకి సిరియన్ లు, ఫ్రెంచు వారు, పోర్చు గీసు వారు, అరబ్బులు వచ్చారు. దక్షిణ మలబార్ లో కాలికట్ ని ఏలిన రాజు జమోరిన్ (సమూథిరి)  (ఇంద్రుడి లాగా ఇదో టైటిల్) ఆ రోజుల్లో  కేరళ రేవులకి రారాజు. వాస్కోడి గామా కేరళ తీరం చేరగానే అతనికి 'మను విక్రముడు' అనే జమోరిన్ నుండీ పిలుపు వస్తుంది. 

అప్పటి దాకా యూరోపియన్ లకి అరబ్బుల వల్ల, ఇస్లాం వల్ల ఖండాంతర వాణిజ్యంలో దాదాపు పూర్తిగా బాగా restrict అయిన దారిలో ప్రయాణించి, మొత్తనికి కేరళ తీరం చేరుకున్నాక వాళ్ళకి అప్పటికే వ్యాపారంలో ఎంతో ప్రగతి సాధించేసిన జాతి ఎదురయింది. అరబ్బులు పర్షియా, యూరోప్ నుండీ, చైనా నుంచీ మింగ్ రాజులు కేలికట్ ని తరచూ సందర్శించేవారు. 140 నుండీ 1430 వరకూనే చైనీస్ ఎడ్మిరల్ ఝెంగ్ ఏడు సార్లు 250 ఓడల్లో, 28000 మంది సైనికులతో కేలికట్ వచ్చాడు.  చైనీస్ ఆఖర్న కేరళ  వొదిలి వెళ్ళీనాటికి కేలికట్ లో సగం మళయాళీ, సగం చైనీ, మలయ్ ల తో కూడిన 'చిన్న క్రిబల' అనే ఉప జాతి కూడా తయారయింది. ఇక్కడ ఇంత వాణిజ్యం జరుగుతుంది కాబట్టి ఇక్కడి రాజు కూడా చాలా బలవంతుడు. ధనికుడు. అసలు పోర్చుగీసు వాళ్ళకి ఈ సంపద చూస్తే కళ్ళు తిరిగినట్టయింది. 

అయితే యూరోపియన్ లకు అరబ్బుల నిండీ వ్యాపారపరంగా ఎదురైన పోటీని నిలువరించడానికి పోర్చుగీసు మెల్లగా కేరళ లో ఇతర రేవు పట్టణాల వైపు చూడడం మొదలుపెట్టింది. కొచ్చిన్, మలబారు ల మధ్య ఉన్న చారిత్రాత్మక గొడవలని అడ్డు పెట్టుకుని, జమోరిన్ ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ, తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నం చేసాయి. పైగా కేరళ అప్పట్లో రాజకీయంగా దేశంలో ఇతర దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా యుద్ధ భయాన్ని ఎదుర్కొంటూ అటు సముద్రంలో పోర్చుగీస్ తో యుద్ధం చెయ్యడం - వగైరాల వల్ల కాస్త వెనకబడుతుంది. జమోరిన్లు వైభవంగా పోరాడి విఫలం అయ్యారు. కేరళ చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. 18 వ శతాబ్దం వచ్చ్చేసరికీ కేరళ తన గత ప్రాభవానికొక నీడ లా మిగిలిపోయింది. 

అయితే విదేశీయులతో ఇంత దీర్ఘమైన సంబంధాలుండడం వల్లనూ, ఎన్నో దేశాలనుండీ వలస వచ్చిన వివిధ మతాల వాళ్ళ వల్లనూ, కేరళ లో బోల్డన్ని మతాలు వ్యాప్తి చెంది, సమాజం చాలా inclusive  గా తయారయింది. అయితే కేరళ లో ఉన్న హిందూ సమాజం కూడా చాలా కులాలతో, శాఖలతో అల్లుకుని ఉంటుంది. దానిలో నాయర్ లు - పాములను పూజించే, యుద్ధ వీరులు. వాళ్ళ వృత్తి సైనిక వృత్తి ! వివిధ రాజుల తరఫున యుద్ధాలు చేయడం వాళ్ళ రక్తంలోనే ఉంది.  ఎపుడూ ఎక్కడో ఓ చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు యుద్ధానికి వెళ్ళి చచ్చిపొనైనా పోతారు, ఇంకోర్ని చంపేసేయినా వస్తారు. జమోరిన్ ల కూ, కొచ్చిన్ రాజులకూ మధ్య యుద్ధాలు, పగలు, ప్రతీకారాలూ ఎప్పుడూ జరుగుతూనే వుందేవి. అందుకని వాళ్ళలో పెళ్ళి, రొమాంటిక్ రిలేషన్ లు కూడా ఎక్కువగా, ఫ్రీ గా ఉండేవి. స్త్రీలకు పురుషులతో సమానాధికారాలు ఉండేవి. అవి బయటి నుండి చూసే విదేశీయులకు చాలా ఆశ్చర్యం కలిగించేవి.  అక్కడ స్త్రీలు వ్యక్తితం తో బ్రతుకుతూ, పెద్ద పెద్ద ఇళ్ళను, ప్రాంతాలను ఏలే వాళ్ళు. యుద్ధాలు చేసే వాళ్ళు. కత్తులతో, బాణాలతో వీళ్ళు చేసిన పోరాటాల్ని గురించి ప్రజలు జానపద గాధలు చెప్పుకునేవారు. పాటలు పాడుకునేవారు. అలాంటి జమోరిన్ ల రాజ్యం 1760 లలో యుద్ధాల బారిన పడి సమసిపోయినప్పుడు, జమోరిన్ లు తమ రాజ్యాన్ని, పేలేస్ లనూ విడిచిపారిపోవల్సివచ్చిన దశలో ట్రావన్ కోర్ (తిరువనంతపురం) రాజ్యం పైకి ఎదగడం ప్రారంభం అయింది. 

అప్పటికే చుట్టుపక్కల నాయక రాజులు (మధురై), ఆర్కోట్ నవాబు (మొఘలులు), కేప్ కేమొరిన్ కీ, ట్రావెంకోర్ కీ మధ్య ఉన్న ఈ చిన్ని జమీందారీ లాంటి రాజ్యాన్ని అన్నిరకాలుగా దోచేస్తున్నపుడు కుపాక వంశానికి చెందిన తిరువనంతపురం రాజుల్లో "మార్తాండ వర్మ" అనే అతను తిరగబడి, యుద్ధాలలో విజయం సాధిస్తాడు. అదీ తిరువనంతపుర 'కుపాక' వంశ  రాజుల మొదటి విజయం. అప్పటి దాకా తమలో తాము పోరాడుకుంటూ, విపరీతమైన కుల రాజకీయాల్లో, బ్రాహ్మణ-నాయర్ల ఫైటింగుల్లో చీలికలైపోయిన కేరళ అతన్ని గుర్తిస్తుంది. తనకిష్టం లేని పద్ధతుల్ని ఉక్కుపాదంతో అణిచేసి చాల శక్తివంతంగా ఎదిగాడు మార్తాండ వర్మ. 

హైదర్ ఆలీ కేరళను దాదపు తుడిచిపెట్టేసిన సమయానికి కేవలం దక్షిణ కేరళ లో 'తిరువంతంతపురం' మాత్రమే నిలబడగలుగుతుంది.  ఆఖరికి టిప్పు సుల్తాన్ కూడా కేరళ ను గెలిచేందుకు ప్రయత్నించి విఫలమవుతాడు. ఐతే నాయర్ల శౌర్య పరాక్రమాల వల్ల అప్పటిదాకా ఎలాగో నెగ్గగలిగినా - ఈస్ట్ ఇండియా కంపెనీ దేశం లో వేళ్ళూనగలిగే సరికీ, కంపెనీ అండ తన రాజ్యానికి అవసరం అని ట్రావెన్ కోర్ గుర్తిస్తుంది. అటు జమోరిన్ లు కోలుకుంటారు. మిగిలిన కేరళ అంతా కూడా రాజకీయంగా మారుతుంది. 

మార్తాండ వర్మ మరణం తరవాత రెండు వందల సంవత్సరాలు దేశం పరాయి పాలన లోనే ఉంది. అప్పటి నుండీ, ఇప్పటి దాకా తిరువంతంతపురం లో రాజరికపు ప్రయాణం గురించి ఈ పుస్తకం చాలా డీటైల్స్ ఇస్తుంది.  తిరువనంతపురం  పాలించిన రాజులు ఎందరో చాలా మంచి పాలనని తమ ప్రజలకు అందించారు. కంపెనీ కి ఎదురు తిరగకుండానే, ఒక స్థిరమైన వ్యవస్థ ని ఏర్పరిచారు, 

ఈ రాజుల్లో రాజ్యాన్ని ఏలిన మహారాణులున్నారు. వీళ్ళలో ఆఖరి రాణి సేతు లక్ష్మీ బాయి 1920 లలో దేశం లో పెను మార్పులు చోటు చేస్కుంటున్న టైం లో ఈ 'ఏనుగు దంతపు' సింహాసనం నుండీ రాజ్యాన్ని ఏలారు. బైటి శక్తులనుండీ, లోపలి శత్రువులనుండీ తనని తాను, రాజ్యాన్ని, మర్యాదలనీ కాపాడుకుంటూ చాలా నిజాయితీ గా తన పాత్రని పోషించారు. స్వతంత్రం వచ్చాక అంత వరకూ ఓ వెలుగు వెలిగిన ట్రావెన్ కూర్ రాజ్యం  మెల్లగా తెర వెనక్కు తప్పుకుంది. రాణి తన స్థానాన్ని వొదులుకుని సామాన్యురాలిగా జీవించింది.  

ఒకవిధంగా అధికారం కోసం కుటుంబం తో నే పోరాడలేక ఓడి,  రాజరికపు జీవితం నుండీ విషాదంగా, విరక్తి తో తప్పుకున్న రాణి జీవితం  గురించి చెప్పిన పుస్తకం ఇది.  ఆఖరికి  ఆవిడ చేసిన మంచి పన్లని చెప్పుకోవడానికి, ఆవిడ ముందుచూపు నీ, నిరాడంబరతనీ, నిజాయితీని, ఆవిడ కుటుంబం పాటించిన విలువలనీ ఎప్పటికీ కేరళ మర్చిపోకూడదని ఈ ప్రయత్నం చేసారు మను పిళ్ళై. 

కేరళ నుండీ వచ్చి, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకళాకారుడు రాజా రవి వర్మ కూతురి కూతురే సేతు లక్ష్మీ బాయి (పూరాడం తిరునాళ్ సేతు లక్ష్మీ బాయి).  కేరళ లో రాజరికం మాత్రుస్వామ్య పద్ధతిని అనుసరిస్తుంది. రాజు భార్య రాణి కాదు. రాజు కు పుట్టిన పిల్లలకూ వారసత్వం వెళ్ళదు.  కుటుంబంలో పెద్ద మహిళ (అమ్మ) రాణి అవుతుంది.  రాజు సోదరి పిల్లలు రాజ్యాధికారానికి అర్హులు. ఒక వేళ రాజు కు సోదరి లేకపోయినా, ఆ లైన్ లో పిల్లలు లేక పోయినా,  రాజ వంశానికి సోదరి వంశమయిన "అట్టింగళ్" వంశపు పాపాయిలను దత్తత తీసుకుంటారు. అలా రాజా రవివర్మ మనవరాళ్ళయిన ఇద్దరు పాపాయిలను దత్తతకు తీసుకున్నారు. వారిలో పెద్ద అమ్మాయి ఈ సీనియర్ రాణి. రెండో పాప జూనియర్ రాణి అన్నమాట (వీళ్ళ తల్లులు వేర్వేరు. రవి వర్మ కూతుర్లు) .   అయితే  వీళ్ళ తదనంతరం చట్టాల సవరణల కారణంగా  ఈ దత్తత సాంప్రదాయం ఇప్పుడు సమసిపోయినట్టే. ఆ రకంగా సేతు లక్ష్మీబాయి ఆఖరి రాణి.  ఆమె తరవాత జూనియర్ రాణి కుమారుడు రాజయ్యాడు. అతను పుట్టిన తరవాతనే సీనియర్ రాణికి కూతుర్లు పుట్టారు. కాబట్టి ఇంట్లో పెద్ద వాడు జూనియర్ రాణి కొడుకు కాబట్టి, ఆయనే రాజయ్యాడు. 

ఆవిడ పాలించిన కాలం 1924 - 1931 -(7 years, as a Regent)  చాలా కొద్ది సమయమే అయినా, ట్రావెన్ కోర్ లో కొన్ని మంచి పనులు జరిగాయి. దేవదాసీ వ్యవస్థ రద్దయింది. జంతుబలులను నిషేధించారు.  గ్రామాలలో స్థానిక ప్రభుత్వ వ్యవస్థని ప్రోత్సహించేందుకు పంచాయితీ వ్యవస్థను తెచ్చారు.   కుల చైతన్యం పెరిగింది. అంటరానితనం, ప్రధాన రహదారుల్లోకి హరిజనులను రానివ్వకపోవడం వంటివి ఆపారు. కొన్ని ప్రధాన ఆలయాల లోనికి అన్ని కులాల వారూ ప్రవేశించడాన్ని అనుమతించారు. 1928 లో చివరికి మాతృస్వామ్య వ్యవస్థ రద్దయి పితృస్వామ్య వ్యవస్థ కేరళ లో మొదలయింది. అయితే అదే సమయంలో సేతు లక్ష్మీబాయి పద్మనాభస్వామి దేవాలయంలోకి హరిజనులను అనుమతించకపోవడంతో విమర్శలకు గురయ్యారు.  కేరళ లోకి రైళ్ళు, విద్యుత్, కొత్త సాంకేతికతలు, ప్రవేశించాయి. ఇవన్నీ కేరళ సమాజం లో సామాజికంగా తీసుకొచ్చిన మార్పులకు దారితీసాయి.  

రాణి స్వయంగా స్త్రీ విద్య ని, ఉచిత ప్రాధమిక విద్య ని, అందరికీ సమానమైన విద్యావకాశాలను, స్కూళ్ళలో పిల్లలకు ఉచిత ఆహారాన్ని అందించడం లాంటి పనులను దేశంలో బహుశా మొదటి సారే మొదలు పెట్టారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుండీ, విద్యలో / అక్షరాశ్యతా శాతం, బళ్ళూ, రోడ్లూ, ఆస్పత్రులతో మంచి జీవన ప్రమాణాలని తన ప్రజలకు అందివ్వడంలో కేరళ ముందుండడానికి కారణం సేతు లక్ష్మీబాయి.  వైద్యాన్ని చాలా ఎక్కువ ప్రోత్సహించారు. మహిళలు వైద్య విద్యని చేపట్టేందుకు చాలా ప్రయత్నాలు చేసారు. మొదటి మహిళా వైద్యురాలిని దర్బారులోనికి తీసుకున్నారు. ఎందరికో స్కాలర్షిప్ లు ఇచ్చి డాక్టరీ చదివించారు. రహదారులు, రైల్వే లైన్లూ వేసారు. టెలిఫోన్లు వచ్చాయి. విద్య మీద బడ్జెట్ లో 22% కేటాయించారు. ఇవన్నీ ఆమె రీజెన్సీ ముగిసాక కూడా కేరళ ని దేశంలో ఎంతో అభివృద్ది సాధించిన దేశంగా నిలబెట్టాయి.  

అసలే మాతృస్వామ్య వ్యవస్థ చాలా కులాల్లో రద్దయినా, స్త్రీలు సామాజికంగా, ఆర్ధికంగా కూడా వెనకబడిపోలేదు. ఆడ పిల్లలు వైద్య వృత్తిలోకి, ఇతర సాంకేతిక విద్యల్లోకీ రావడానికి రాణి పాలసీలు ఎన్నో పని చేసాయి. ఆమె కాలంలో తలెత్తిన గొడవలు, రక్తపాతానికి ఎప్పుడూ దారితీయలేదు. గొడవల్ని నిర్దాక్షిణ్యంగా అణిచేసే ప్రయత్నమూ జరగలేదు. ఆంగ్ల విద్య ప్రాముఖ్యత దేశం లో పెరిగింది. అలాగే కేరళ లో కూడా క్రిస్టియన్లు, చిన్న కులాల వాళ్ళూ కూడా ఆర్ధికంగా ఎదిగారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువయి ఉన్న ఉద్యోగాలు తక్కువవడం వల్ల బయటి దేశాలలో ఉపాధి వెతుక్కోవడం, మనియార్డర్ ఎకానమీ రావడం సాధ్యపడింది. బ్రిటిష్ ఆంత్రోపోలజిస్ట్ ఆడ్రియన్ మేయర్ చెప్పినట్టు "కేరళ గురించి తెలిసిన ఎవరికైనా ఆమె సామాజికంగా చారిత్రకంగా ఒక గొప్ప మనిషి". ఒక రకంగా ఆమె గురించి ఇలా తెసులుకోవడం మనకీ బావుంటుంది.  

అప్పటికి దేశంలో మిగిలిన సంస్థానాల రాజులు, నల్లమందు, వేశ్య లతో, వేటలతో ఆనందాలలో వ్యసనపరులు, స్త్రీలోలులు గా మిగిలి - బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టాల్సిన కప్పం కోసం విపరీతమైన పన్నులతో వాయగొట్టి, ప్రజల్ని పీడించుకు తినడంలో మునిగిపోయి  అటు ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వం దృష్టి లోనూ చవటల్లా, పనికిరాని వాళ్ళుగా మారుతున్నప్పుడు, దేశంలో  చాలా మంచి పరిపాలనా విధానాలని ఈ రాణి అవలంబించింది. ఏదేమయినా గానీ, కొన్ని పొగడ్తలు, కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, స్వయానా మహత్మా గాంధీ కూడా ఆవిడ వ్యక్తపరచిన కొన్ని 'నిస్సహాయత' లను అర్ధం చేసుకోగలిగేలా చేసింది. తాను నిర్వర్తిస్తోన్నది ఒక డ్యూటీ నే! తన చేతిలో సర్వాధికారాలూ ఉన్నా కూడా  అందరి అంగీకారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ప్రజల మీద రుద్దడం లాంటివి చెయ్యలేదు. ఆఖరికి వివిధ కారణాల వల్ల తన కజిన్ (Junior Queen)  కుటుంబం తనని అమర్యాదకరంగా చూసినా సరే, ఆస్తుల్ని వొదులుకోవాల్సి వచ్చినప్పుడు చాలా  detached గా అన్నిటినీ వొదులుకున్నారు. 

ఈ పుస్తకం, ముందే చెప్పినట్టు ఏకపక్షంగానే అనిపించినా, కేరళ చరిత్రని చాలా విస్తారంగా రికార్డ్ చేసినందున విపరీతమైన డీటైల్స్ ఉన్నా కూడా చదవాల్ని అనిపిస్తుంది. దీనికి నేను ఇంతకు ముందు చదివిన రాజారవి వర్మ జీవిత చరిత్ర చాలా పనికొచ్చింది. తన మనవరాళ్ళని రాణులుగా దత్తత తీసుకోవడానికి జరిగిన ప్రయత్నాలనీ, వాటికి తమ కుటుంబంలోనే ఎదుర్కోవల్సిన వ్యతిరేకతనీ, ఆ మంటల్ని ఎప్పటికప్పుడు ఆర్పుకుంటూ వచ్చి చివరికి ఎంత సంప్రదాయబద్ధంగా దత్తత ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందో రవివర్మ చెప్పడం వల్ల, ఈ రాణుల వ్యవస్థ అర్ధం చేసుకోవడం సులువయింది.  

రాజుల కథల్ని మనం ఇంతగా ఎంజాయ్ చేస్తామనేనేమో ఈ పుస్తకం విడుదలయ్యాక శోభు యార్లగడ్డ (బాహుబలి నిర్మాత - ఆర్కా మీడియా) హక్కుల్ని కొన్నారట.  మార్తాండ వర్మ గా ఎవర్ని ఊహించుకుంటున్నా, రాణి సేతు లక్ష్మీ బాయి గా ఎవరు నటిస్తారో అని ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఈ కథ చాలా పెద్దది.  అయితే ఈ రాణుల  మనుమలు, మునిమనుమలు, తమ తమ రంగాల్లో పేరు తెచ్చుకున్నారు. వివిధ దేశాల్ల స్థిరపడ్డారు. వివాదాలలోకి లాగబడడానికి ఎవరికీ తీరికా, ఇష్టమూ లేనే లేవు.   ఇప్పటికీ సీనియర్ రాణి మనుమలు రాజులవడానికి టెక్నికల్ గా క్యూ లో ఉన్నా వాళ్ళు మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.  జూనియర్ రాణి వారసులు కూడా మౌనంగా పక్కకు తప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కర్నాటక సంగీత ప్రముఖుడు అశ్వత్థి స్వాతి తిరునాళ్ వంశం నుంచీ ఇప్పట్టి తరానికి సంగీత వారసత్వన్ని మాత్రమే ఘనంగా మోసుకొచ్చిన ప్రిన్స్ రామ వర్మ కూడా జూనియర్ మహారాణి వారసుడే. ఆయన కూడా రచయిత తో మాట్లాడేందుకు నిరాకరించడం అర్ధం చేసుకోతగ్గదే.  

ఇప్పుడు రాజరికాలేంటి ? ఆస్తుల పోరాటాలు తప్ప ! వివిధ వ్యాజ్యాలలో సీనియర్ రాణి వారసులు ట్రావెన్ కోర్ లో ఆస్తుల పై, పాలెస్ ల పై అధికారాల్ని కోల్పోయారు. కొన్ని సుప్రీం కోర్ట్ లో ఉన్నాయి.   కాబట్టి కహానీ అభీ ఖతం నహీ హుయీ. 555 పేజీల చరిత్ర  (పూర్తి పేజీలు వివరణలతో, నోట్స్ తో సహా 694 Pages) మొత్తానికి పూర్తి చేసాక ఏదో పెద్ద మహాభారతం చదివినట్టు తృప్తి దొరికింది. అదే కదా కావల్సింది.   వైకోం సత్యాగ్రహం, దీవాన్లు, కేరళ రాజకీయాలపై తమిళుల ప్రభావం, రాజరికాలు, పెన్షన్లు, గ్రాంటు లు, రాజుల పరివారాలు, ఆచారాలు, కట్టుబాట్లు, ట్రైనింగు లు, ఆంగ్ల విద్య, పర్యటనలు, మత రాజకీయాలు, ఆస్తులు, వ్యాజ్యాలు అన్నీ కలిపి చాలా పెద్ద కథ. కుటుంబ రాజకీయాలు, బ్రిటిష్ వాళ్ళ సొంత అభిప్రాయాలు వగైరాలు తప్ప  స్కాండల్, ఆకర్షణీయమైన అంశాలూ పెద్దగా లేవు. కానీ లక్ష్మీ బాయి జీవితానికి మంచి Tribute ఈ పుస్తకం. 

***



21/01/2024

Things Fall Apart (చెదిరిన సమాజం - చినువా అచెబీ) - Chinua Achebe



Telugu :  చెదిరిన సమాజం - చినువా అచెబీ

(అనువాదం : శ్రీ కొలసాని సాంబశివరావు) 


ఈ పుస్తకం (Things Fall Apart), నైజీరియన్ నవలాకారుడు చినువా అచెబీ మొదటి నవల. 1958 లో ప్రచురించబడింది.  ఇప్పటి వరకూ దాదాపు  20 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైన ఈ నవల, ఇంగ్లీష్ లో వచ్చిన తొలితరం ఆఫ్రికన్ సాహిత్యపు అక్షయ పాత్ర. 1923 నుండీ 2005 దాకా ఇంగ్లీషు లో వచ్చిన 100 గొప్ప పుస్తకాలలో ఒకటి గా Time చేత కీర్తించబడింది. 50 కి పైగా భాషల్లోకి అనువదించపడి, ఆఫ్రికా గురించి లోకం తెలుసుకునేలా చేసిన నవలల్లో ప్రసిద్ధి చెందినది.  నైజీరియాలో ఊహాజనితమైన ఒక గ్రామం, అక్కడి తెగలు, వాటి శౌర్యం, కట్టుబాట్లు, ఆచారాలు, మూఢ నమ్మకాలు,  చిక్కుముళ్ళు, సాంప్రదాయాల గురించి చాలా సహజమైన చిత్రణతో రూపుదిద్దుకున్న నవల ఇది. ఆఫ్రికన్ సమాజపు జీవితం, క్రైస్తవ మిషనరీల రాకతో ఎంతగా మారిపోతుందో - డాక్యుమెంట్ చేసిన నవల. అచెబీ తరవాత ఆఫ్రికన్ జీవన విధానం గురించి అలవొకగా రాయగలిగిన స్థానిక రచయితల్ని బాగా ప్రభావితం చేసిన నవల కూడా. 

ఒకొన్ క్వో ఈ నవలలో ప్రధాన పాత్ర. అతను దుర్భర బీదరికం  నుండీ తనను తాను రక్షించుకుని, కఠోర శ్రమతో తన జీవితాన్ని ఒక దారిలో పెట్టుకున్నవాడు. శ్రమకోర్వలేని, పిరికివాడయిన తన తండ్రి, తన భార్యాపిలల్ని అర్ధాకలిలోనే జీవితాంతం ఉంచడాన్ని, అప్పుల్లో మునిగి తేలి ఆడడాన్ని అస్సలు సహించని కొడుకు గా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదిగి, ముగ్గురు భార్యలు, పిల్లలతో, 'తెగ పెద్దల్లో' ఒకడుగా చలమణీ అయే స్థాయికి ఎదిగిన ఒకొన్ క్వో చుట్టూనే కథ నడుస్తుంది. 

అదృష్టవశాత్తూ ఈ నవలని తెలుగులో చదివి, తెలుగు భాషా సౌందర్యం, చదవడంలో సౌలభ్యంతో అసలు ఇంత సింపుల్ గా చక్కగా అనువదించినందుకు అనువాదకుడికీ, ఇంత సులువు భాషలో రాసినందుకు నైజీరియన్ రచయితకూ నమస్కారం పెట్టుకోవాలనిపించింది.  W.B. Yeats రాసిన The Second Coming  అనే కవిత  లోంచి శీర్షికనూ వస్తువునూ రచయిత స్వీకరించారు.  

----------------------------------------------------------------------------

Things fall apart ; the centre cannot hold ; 

Mere anarchy is loosened upon the world. 

అన్నీ చెల్లా చెదురైపోతాయి. ఎవరూ దాన్ని ఆపలేరు. 

ప్రపంచమంతటా అరాచకత్వమే వెల్లివిరిసింది. 

-----------------------------------------------------------------------------

ఒకప్పుడు ఐక్యంగా ఉన్న తెగకు సంబంధించిన కథ ఇది. అప్పట్లో ఆ తెగలో వారందరిదీ ఒకే మాట. అందరిలోనూ ఒకేరకమైన చైతన్యం వుంటుంది.  తెల్లవాడు వచ్చాక ఆ ఐక్యత భగ్నమవుతుంది పాత సమాజం క్రమంగా శిధిలం అయిపోతుంది. అశరీర వాణి (Oracle) ని దైవంగా ఆరాధించే ఒక ఆఫ్రికన్ తెగ - ఆ తెగ వారికీ ప్రకృతికీ గల అనుబంధం, కట్టుబాట్ల పేరుతో జరిగే న్యాయ తీర్పుల అన్యాయమూ, సంస్కృతి పేరుతో నడిచిన అనాగరికతలని గురించి, చెప్పిన రచయిత, చివరిదాకా - కథ ను గ్రిప్పింగ్ గా చెప్పుకుంటూ రావడం వల్ల, ఇప్పుడు ఎన్నో నాగరికతలు అంతరించిపోయి, రోజుకో కొత్త నాగరికత పుట్టుకొస్తున్న కాలంలో - కొత్త కొత్త తప్పొప్పుల మధ్య పాత విధానాలు సమసిపోయాక, ఏదో ఇతిహాసం చదివినట్టు అనిపిస్తుంది.  

నైజర్ నది ఒడ్డున ఇబో  గ్రామం లో  ఉమ్యోఫియా తెగలో  సోమరిపోతు తండ్రి ఉనోకా, అతని బలవంతుడైన కొడుకు ఒకోన్ క్వో ల కథ ఇది. ఉనోకా సంగీత కళాకారుడు. పిల్లంగోవి వాయిస్తాడు. కానీ అతనికి యుద్ధాలంటే భయం. ఒకోన్ క్వో కు బీదరికమంటే భయం. ఎవరయినా తనని అశక్తుడనో, భీరువనో అనుకుంటారని భయం. తన భయాలను అణుచుకునేందుకు అతనెంచుకునే మార్గం, ఎదురుదాడి, అహంకారం, శౌర్యం, కోపం.  పైగా అతను తన తండ్రి చివరి దశను చూసి ఉన్నాడు కనుక, అలాంటి ఒంటరి చావు తనకు రాకూడదని, తన తెగలో పెద్దమనుషుల్లో ఒకడిగా - అందరి మధ్యా, తన పెద్ద కుటుంబంతో బ్రతకాలని ఆశిస్తూ, తన జీవితాన్ని కేవలం శ్రమతో, కష్టంతో, విపరీతమైన పట్టుదలతో మలచుకున్నవాడు. అతనికి ఉన్న అవలక్షణం విపరీతమైన కోపం. అతని భార్యలు అతనికి అణిగిమణిగి ఉండటానికి ఆ కోపమే అతనికి ఉపయోగపడుతుంది.  అయితే అదుపులో ఉంచుకోలేని ఆ కోపమే అతని పతనానికి, వైఫల్యానికీ దారితీస్తుంది.  

ఎంబయినో గ్రామం వాడొకడు వీరి గ్రామపు మహిళను హత్య చేయడంతో పరిహారంగా  వారితో సంధి చేసుకోవడానికి ఒక పెద్ద మనిషిగా వెళ్ళి, (లేకపోతే ఉమ్యోఫియా తెగ వారు వారి గ్రామాన్ని మట్టి కరిపిస్తారు. వారికి, వారి తెగకూ, ఆ ప్రాంతాలలో కెల్లా గొప్ప యోధులని పేరుంది మరి)   అక్కడి నుండీ ఒక కన్నెపిల్లనూ, ఎకెమి ఫ్యునా అనే పదిహేనేళ్ళ బాలుడినీ తీసుకొస్తాడు ఒకోన్ క్వో.  పిల్లను మరణించిన మహిళ భర్తకు భార్యగా అప్పగిస్తారు. పిల్లవాడిని ఒకోన్ క్వో సంరక్షణలో నే ఉంచుతారు. ఆటవిక తెగల్లో, హత్యకు బదులు - హత్యే.   ఈ పిల్లాడి సంగతి తరవాత  చూద్దామని నిర్ణయిస్తారు. తన ప్రయాణం 'మృత్యువు వైపే' అని తెలీని ఆ పిల్లాడు మూడేళ్ళు తన సొంత ఇంటిని మరచి, వీళ్ళతోనే ఉంటాడు. ఒకోన్ క్వో ని "నాన్నా"  అని పిలుస్తాడు. అతని కొడుకుతో కలిసే పెరుగుతాడు. అందరికీ అతనంటే వాత్సల్యం పెరుగుతుంది. కానీ దైవం చెప్పాడని, మూడేళ్ళ పాటు తన పిల్లలతో సమానంగా సాకిన ఆ పిల్లాడిని,  నిర్దాక్షిణ్యంగా నరికేసి చంపేస్తారు.  ఆ చంపేస్తున్న వాళ్ళ గుంపులో ఒకోన్ క్వో కూడా వుంటాడు. "నాన్నా, నన్ను చంపేస్తున్నారు!"  అని అరుస్తూ తనకేసి పరిగెత్తుకొచ్చిన కుర్రాణ్ణి,  "తెగ గౌరవం కోసం, మిగిలినవాళ్ళు తనను పిరికివాడనుకుంటారని భయంతో",  నిలువునా నరికేస్తాడు.  

ఆ పాప కార్యం - 'తెగ దేవుడి' వచనం (భవిష్య వాణి)  ప్రకారం, తెగ కోసం, ప్రకృతి నియమాల కోసం అని సర్ది చెప్పుకున్నా కూడా చాలా రోజులు ఒకోన్ క్వో మనిషి కాలేకపోతాడు. ఒకోన్ క్వో కొడుకు 'న్యోయే'  మాత్రం, తాత మనస్తత్వంతో పుడతాడు. అతను పిరికివాడు. అతనికి, నరకడాలు, చంపుకోవడాలు ఇష్టం వుండదు. ఎకెమి ఫ్యూనా మరణం, తనని తండ్రిని ద్వేషించేందుకు దోహదం చేస్తుంది. కథలో చివరికి అతను తెగ కట్టుబాట్లకు వ్యతిరేకంగా తిరగబడి క్రైస్తవ మిషనరీల ప్రభావంలో పడి క్రైస్తవుడవుతాడు.  జీవితంలో ఒకోన్ క్వో వంటి వైభవం సంపాయించుకున్న నాయకుడు కూడా విధివశాత్తూ  విఫలుడౌతాడు. అతనితో పాటు అతని తెగ కూడా చిద్రమయిపోతుంది. 

తెగలో కొన్ని తీవ్రమైన కట్టుబాట్లుంటాయి. అక్కడ ప్రతి ఊరికీ, ఒక్కో "పాపిష్టి  అరణ్యం" ఉంటుంది. కుష్టు, మశూచి లాంటి జబ్బులతో చనిపోయినవారిని ఆ అడవుల్లో పాతుతారు. ఉనేకా మరణించేటప్పటికి అతని శరీరం వాచిపోతుంది. అట్లా  వాయటం వాళ్ళ నమ్మకాల ప్రకారం అరిష్టం.  జబ్బు అంటే నేలతల్లికి ఇష్టం వుండదు. కాబట్టి ఆ జబ్బు మనిషిని బ్రతికుండగానే ఆ అరణ్యంలోకి తీస్కెళ్ళి వదిలేస్తారు. అటు వంటి వారి మృతదేహాలకు సంస్కారాలేవీ ఉండవు. అవి అడవిలో ఎండాల్సిందే.   ఉనేకా ని అడవిలోకి ఈడ్చేటప్పుడు, అతను తన పిల్లంగ్రోవిని వెంట తీసుకుపోతాడు.  ఊర్లో ఎవరికైనా కవలలు పుడితే, ఆ పసి కూనలని కుండ పెంకుల్లో పెట్టి, చావడానికి, అడవిలో వొదిలేస్తారు.   కవల పిల్లలు పుట్టడం కూడా అపచారమే. అలా ఆ అరణ్యం దుష్ట ఆత్మలతో ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. 

అనారోగ్యాలతో, అశుభ్రత తో ఎందరో శిశువులు మరణిస్తుంటారు కదా. ఒక తల్లికి ఇలా పదే పదే పిల్లలు పుట్టి మరణిస్తుంటే, అలా మళ్ళీ మళ్ళీ పుట్టీ, చచ్చీ, తమ తల్లుల్ని క్షోభ పెడుతున్న్నందుకు ఆ చనిపోయిన శిశువు తాలూకు ఆత్మ, మళ్ళీ పుట్టేందుకు / పుట్టి మళ్ళీ చనిపోయేందుకు భయపడేలా ఆ మృతదేహాన్ని (ఆత్మ భయపడే విధంగా చిద్రం చేసి),  ఖండ ఖండాలుగా నరుకుతారు. మళ్ళీ  నేల తల్లి గౌరవార్ధం,  పంట వేసాక, ఒక వారం (శాంతి వారం)  పాటూ, గ్రామంలో ఎవరూ ఎటువంటి కోపతాపాలకూ, హింసకూ పాల్పడకూడదు. తప్పుల్లో, కావాలని చేసిన తప్పులు 'మగ' తప్పులు, పొరపాట్న జరిగిన తప్పులు 'ఆడ' తప్పులు  గానూ పరిగణిస్తారు. వీటికి వేరే వేరే శిక్షలుంటాయి.  తెగ లో నిషిద్ధం అని నిశ్చయం అయిన బోల్డన్ని పన్లు, ఎందరినో ఆశాంతికి గురి చేసినా కట్టుదిట్టంగా అమలు జరిపేంత ఐకమత్యం తెగ లో ఉంటుంది. ఈ ఐక్యతని (మత ప్రచారం ముసుగులో) తెల్లవాడు చెల్లాచెదురు చేస్తాడు. ఈ సంక్షోభం నుంచీ తెగని కాపాడుదామని బయల్దేరిన ఒకోన్ క్వో జీవితం కూడా చెదిరిపోతుంది.  

ఒకోన్ క్వో కూడా "ఆడ" తప్పు  (అనుకోకుండా జరిగిన హత్య)   ఒకటి పొరపాట్న  చేసి,  ఏడేళ్ళ పాటు  గ్రామ బహిష్కృతుడవుతాడు. అతను తన శిక్షాకాలం ముగిసి గ్రామానికి తిరిగొచ్చాక, సాంఘికంగా, రాజకీయంగా, మత పరంగా అక్కడ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. క్రైస్తవం, స్కూళ్ళూ, వ్యాపారమూ పెరుగుతాయి. ప్రజలు తెగ కోసమో, సాంప్రదాయాలకోసమో పాకులాడరు. ఒకోన్ క్వో లా తెగ కోసం, తన బిడ్డ లాంటి పిల్లాడిని చేతులారా చంపుకునేంత మూఢత ఎవరిలోనూ మిగలదు.  పదే పదే కవలల్ను వరుసగా కని, వారిని చేజేతులా అడవిలో చావడానికి వదిలేయాల్సొస్తుండే యువతి, ఈ సారి గర్భంతో ఉండగానే క్రైస్తవం లోకి చేరుతుంది. మూఢ నమ్మకాలనూ, ఉనికి పేరిట బూజు పట్టిన పాత మతాన్నీ, కట్టుబాట్లనూ, చదువు, ఆరోగ్యం, ఆయుష్హూ ఇవ్వని తెగ దురాచారాలని కొత్త తరం ద్వేషిస్తుంది. 

పెద్ద పెద్ద బిరుదులున్న గ్రామ పెద్దలూ క్రైస్తవులవుతారు.   అప్పటికి  తెల్లవాని వలస రాజ్యంగా మారిన నైజీరియా సామాజిక చిత్రం మారటాన్ని, తన సంస్కృతి మీద జరిగిన దాడిగా ఒకోన్ క్వో భావిస్తాడు. మార్పుని అర్ధం చేసుకోలేక, నైరాశ్యంతో అతను చింతకు గురవుతాడు.  ఈ పరిస్థితుల్లో,  తన దేవుడిని, తన ఉనికినీ, తన సమాజాన్నీ రక్షించుకోవడం, తన చేతుల్లో ఉందేమో అని ఒకోన్ క్వో భ్రమపడతాడు.   మారిన వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి, తనని తాను ఒంటరి గా చూసుకుని ఒకోన్ క్వో జీవితాన్ని,  తండ్రి లాగే నిస్సహాయంగానే ముగిస్తాడు.   

కోపంతో, తెగ కోసం ఒక కోర్టు ఉద్యోగిని చంపి, ఒకోన్ క్వో ఆత్మ హత్య చేసుకుంటాడు. అలా ఆత్మహత్య చేసుకోవడం ఆ తెగ ఆచారానికి విరుద్ధం.  అది నేలతల్లి పట్ల నేరం. అపచారం. అలా చేసిన మనిషి శవాన్ని ఆ తెగ మనుషులు పాతి పెట్టరు. అతడి శరీరం దుష్ట శరీరం. దానిని కేవలం కొత్తమనుషులు తాకడానికి మాత్రమే వీలుంటుంది.  అలా అపరిచితులు (ఒకోన్ క్వో ద్వేషించిన విదేశీయులు) అతని శవాన్ని దింపి ఖననం  చేయడం, ఒక విచిత్రమైన సన్నివేశం. అదీ ఈ కథ కు ముగింపు.  ఈ పుస్తకం జెర్మన్ లోకి అనువదించినప్పుడు ఆ పుస్తకానికి  పేరు, "ఒకోన్ క్వో" అనే పెట్టారు. ఇది ప్రధానంగా ఒకోన్ క్వో జీవిత గాధే !  

కథంతా చదవదగ్గదీ, నెమరు వేసుకోగలిగిన భాష తో, చెప్పుకోవాల్సిన సామెతలతో - అందమైన వాక్యాలతో నిండిపోయి ఉంటుంది. దీనికి కారణం రచయిత చెప్పినట్టే, "(ఇబో) ప్రజలలో సంభాషణా కళకు ఎంతో ప్రాముఖ్య త ఉంది. సామెతలు ఆ కళకు జవసత్వాలు ఇస్తాయి." 

ఇలా ఈ నవల సంప్రదాయ సంభాషణా చతురుని నైపుణ్యంతో సామెతలను వాడడం వల్ల, సామెత భావాలని స్పష్టంగా వివరించడమే కాకుండా ఆ భావాన్ని పాఠకుడి మనసులో శాశ్వతంగా పాతుకునేట్టు చేస్తుంది  ఈ నవల్లో ఉపయోగించిన సామెతలతో పాటు జానపదకథలు, వారి తెగ కు చెందిన సంప్రదయాల, నిషిద్ధాల జాబితా కూడా పెద్దది. మల్ల యుద్దం, వివాహ పద్ధతి, వ్యవసాయ పద్ధతులు, అంతిమ సంస్కారాలు - ఇలా ఎన్నో అంశాలు తెలుసుకోవచ్చు. .  ఉదాహరణకు కొన్ని  వాక్యాలు చదవండి : 

(i)   ఈ మతప్రచారకుని మాటలకు మంత్రముగ్దుడైన యువకుడొకడున్నాడు. వాడి పేరు న్యోయే.   ఒకోన్ క్వో పెద్ద కొడుకు.  అతనిని వశపరచుకున్నది పవిత్రత్రయపు పిచ్చి తర్కం కాదు. అది అతనికి అర్ధం కాలేదు. అతనిని వశపరచుకొందేమిటంటే, అది ఈ కొత్తమతంలోని కవిత్వం.  అది అతని ఎముకలలోని మూలిగను కదిలించింది.  చీకట్లో భయంభయంగా కూర్చున్న సోదరుల గురించి తెలియజెప్పిన ఆ పాట.  అతని లేత ఆత్మను వెన్నాడుతున్న ఒక వీడని అస్పష్టప్రశ్నకు జవాబు చెప్పింది.  ఆ ప్రశ్న - పొదలలో విలపిస్తున్న కవల పిల్లల ప్రశ్న - చంపబడిన ఇకెమి ఫ్యూనా వేసిన ప్రశ్న.  ఎండిపోయిన అతని ఆత్మపై ఆ పాట అతడికి ప్రశాంతినిచ్చింది.  ఆయాసంతో రొప్పుతున్న ఎండిన నేలతల్లి నాలుకపై కరుగుతున్న మంచుగడ్డల బిందువుల్లా వున్నాయి ఆ పాటలోని మాటలు.  న్యోయే పసితనపు మనసు అయోమయంలో పడింది. 

(ii) అతడు మన భాష కూడా మాట్లాడలేకపోతుంటే, ఇక ఆచారాలు, వ్యవహారాలు ఎలా అర్ధం చేసుకుంటారు ? కాని వాడు మన ఆచారాలు చెడ్డవని అంటున్నాడు. వాడి మతం పుచ్చుకున్న మన సోదరులు కూడ మన ఆచారాలు చెడ్డవి అంటున్నారు.  మన సోదరులే మనకు వ్యతిరేకమైనప్పుడు మనం వాళ్ళతో ఎలా పోరాడగలమని నువ్వు అనుకుంటున్నావు? తెల్లవాడు చాలా తెలివిగలవాడు. వాడు తన మతంతో పాటు నిశ్శబ్ధంగా, ప్రశాంతంగా ప్రవేశించాడు. వాడి తెలివితక్కువ తనం చూసి, నవ్వుకుని వాడుండడానికి అనుమతినిచ్చాము.  ఇప్పుడు మన సోదరులను తన వైపు త్రిప్పుకున్నాడు.  మన తెగ ఒకే మాటపై ఇక ముందు ఏ పనీ చేయలేదు.  ఏ విషయాలైతే మనందరినీ ఐక్యంగా నిలబెడుతున్నాయో, వాటన్నిటి మీదా వాడు కత్తి మోపాడు. దాంతో మనం చెల్లాచెదురైపోయాం. 

(iii)  వేలాడుతున్న తన స్నేహితుడి శరీరాన్ని అదే పనిగా చూస్తున్న ఒబైరికా అకస్మాత్తుగా జిల్లా కమీషనరు వైపు తిరిగి ఆగ్రహంతో అరిచాడు. "అతను ఉమ్యోఫియాలో గొప్ప వాళ్ళలో ఒకడు.  మీరు అతనిని ఆత్మహత్య చేసుకునేట్టు చేసారు. ఇప్పుడు అతను కుక్కలాగా పాతిపెట్టబడుతున్నాడు...." అతడు ఇంక ఏమీ మాట్లాడలేకపోయాడు.  అతని గొంతు వణికి, మాటలు రాకుండా పోయాయి. 

సంభాషణల్లో పొదిగిన కొన్ని సామెతలు

(1) ఎత్తయిన ఇరోకో చెట్టు నుండి కిందపడ్డ బల్లి ఎవరూ తనని పొగడకపోతే, తనకు తానే పొగుడుకుంటానందంట. 

(2) (దీనికి ఏదో ఒక కారణం వుంటుంది). కప్ప ఉత్తపుణ్యానికి పట్టపగలు గెంతదు. 

(3) (మనవాళ్ళు అన్నట్టు) పెద్దవారిని గౌరవించేవారు తమ పెద్దరికానికి బాట వేసుకుంటారు. 

(4) వినికే పక్షి ఇలా అందంట :   "గురి తప్పకుండా మనుష్యులు తనను షూట్ చెయ్యడం నేర్చుకున్న నాటి నుంచీ, తాను కూడా వాలకుండా ఎగరడం నేర్చుకున్నాను " అని. 

 (5) పట్టపగలే గంతులేస్తూ గోదురు కప్ప కనిపించిందంటే, దాని ప్రాణానికి ఏదో ముప్పు వచ్చినట్ట్లు తెలుసుకో. 

(6) మండే మంటే ఎప్పుడూ చల్లటి, శక్తిలేని బూడిదనే పుట్టిస్తుంది. 

(7) ఏమీ చెప్పనటువంటి మనిషిని ఎప్పుడూ చంపవద్దు. అతని నిశ్శబ్దం వెనుక ఏదో ఒక అశుభం వుంటుంది. 

***


నైజీరియా దేశం తెల్లవాళ్ళ పాలనలో ఉన్నప్పుడు, ఆ Colonization  ప్రభావాలలో ఒకటిగా దేశంలో ప్రవేశపెట్టబడిన ఇంగ్లీషు విద్య - అప్పుడు స్కూళ్ళలో చదువుకుని ప్రపంచాన్ని ఎరిగిన తరం లోని వాడు రచయిత చినువా. అందుకే అతను క్రైస్తవ మిషనరీల ప్రవర్తనలో తప్పుపట్టాల్సినదేదీ లేదన్నట్టూ, మిషనరీలు నడిపిన వారు స్థానికుల పై  అత్యాచారాలకు పాల్పడినట్టూ రాయలేదు. పైగా కొత్త నీరు, పాత నీరుని తొలగించినంత సహజంగా నైజీరియాలో పురాతన తెగల వారు కూడా ఇతర మతాల వైపు ఆకర్షితులయి, కొత్త జీవన విధానాల్ని స్వీకరించినట్టు రాస్తారు. అయితే దీనినే ఇప్పటి ఆధునిక యుగంలోకి తీసుకుంటే, ఇప్పటి గ్లోబలైజేషన్ ఎలా కొన్ని సమాజాలను చెల్లాచెదురు / వినాశనం చేసేస్తుందో గమనించవచ్చు. 

మొత్తానికి తేలిక పదాలతో, చక్కని భాషతో మూల రచయిత చెప్పదలచుకున్న కథ ని చాలా చక్కగా తెలుగులోకి అనువదించింది శ్రీ కొలసాని సాంబశివరావు గారు. ఈ పుస్తకం ఇప్పుడు తెలుగులో దొరికే అవకాశాలు తక్కువ కాబట్టి కథాప్రపంచం కిరణ్ గారు పంపిన జెరాక్స్ కాపీ (రెండు పేజీలు మిస్ అయ్యాయి) నే చదివి చాలా ఆనందించాను. ఒకసారి ఒకరు అపురూపంగా చదివి, అండర్లైన్లు చేసుకున్న పుస్తకాన్ని  - అంతే మురిపెంగా  పాత పుస్తకాల మార్కెట్ లో దొరకపుచ్చుకుని ఇంకొకరు ఆ పుస్తకానికి కొన్ని కాపీలు తీసి, పుస్తకప్రేమికులతో పంచుకోవడం ఒక మంచి అనుభూతి. మంచి పుస్తకాలు పాఠకుల్ని ఎలాగయినా చేరతాయి అనేందుకు ఇదో ఉదాహరణ. 

07/01/2024

Smoke and Ashes - Amitav Ghosh



కలకత్తా లో మొట్ట మొదట కళ్ళకు గుచ్చుకునేది దాని కొలోనియల్ పాస్ట్ ! ముందుగా వంటగదితో స్వాగతం పలికే పాత ఇళ్ళూ,  ఆ  వీధులూ, వెనీషియన్ బ్లైండ్స్ ఉన్న కిటికీ లూ, ఇంటి కిటికీ పక్కనే ఫుట్ పాత్, ఇరుకు వీధులు, వీధుల్లో పారలల్ పార్కింగ్, ఘనమైన మ్యూసియం లు, పాత వాసన కొట్టే గాలి, ఆగిపోయిన కాలాన్ని ప్రతిబింబించే డొక్కు ట్రాం లు, నల్లని బస్సులు, అతి భయానకమైన బీదరికం, ఇంకోపక్క విపరీతమైన ధనం,  ఆకాశహర్మ్యాలు,  వ్యవస్థ లో విపరీతంగా పాతుకుపోయిన వ్యవస్థాత్మకమైన అవినీతి !  

కొన్ని ప్రామాణికంగా తీసుకునే పాయింట్ల ప్రకారం, వెనకబడిన కలకత్తా మహానగరం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద వాణిజ్య నగరం. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అతి పెద్ద వ్యాపారం ఈ నగరం నుంచే జరిగింది. మన దేశం, ముఖ్యంగా తూర్పు భారతంలో 200 యేళ్ళ పరాయి పాలన ముగిసి దాదాపు ఎనభై ఏళ్ళవస్తున్నా ఇంకా బీదరికంలో మగ్గిపోవడానికి, "బిహారీ"లు కపటులు / దుర్మార్గులు, గూండాలు అనీ మిగతా అందరికీ మనసుల్లో పాతుకుపోవడానికీ, మన పరాయి ప్రభువులకూ ఒక సంబంధం ఉంది.  చైనా కి ఇక్కడి నుంచే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగుమతి చేసిన నల్లమందు / ఓపియం ఇప్పటికీ మన దేశాల మధ్య ఇరుకుని ప్రభావితం చేస్తూండడం, ఎన్నో సంవత్సరాల పాటు పబ్లిగ్గా + అతి రహస్యంగా జరిగిన ఓపియం వేలాలు, వ్యాపారం, ఒక దేశం (Britain)  ఇప్పుడు విపరీతమైన డబ్బుతో శక్తివంతంగా విర్ర వీగడానికి రెండు దేశాలు (India, China) ఒకప్పుడు  భ్రష్టుపడిపోవడానికి మూలాలు ఈ నగరం లోనే పడ్డాయి. అదీ ఈ పుస్తకం చెప్పే చరిత్ర.  

దాదాపూ 150 యేళ్ళు తూర్పు భారతం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళాక ఎలా, ఎంతలా దోపిడీకి గురయిందీ,  వాణిజ్య పంటల ముసుగులో, మొదట వరి పండించడాన్ని ఆపించి, రైతుల చేత ఎకరాల కొద్దీ మొదట నీలిమందు (ఇండిగో),  నల్లమందు, పత్తి, తరవాత ఓపియం పండించి, ఆ ఓపియం ను ఫాక్టరీలలో యంత్రాలతో కాకుండా, కూలీల చేతులతో, కాళ్ళతో ప్రాసెస్ చేయించి, దాన్ని పెట్టెల కొద్దీ వేర్ హౌస్ ల లో భద్రపరచి, కలకత్తా రేవు నుండీ, ప్రస్తుత Guangzhou,  హాంగ్ కాంగ్ (చైనా) కు పంపించి, చెప్పలేనంత సొమ్ము ని కొన్ని సంవత్సరాల పాటూ గడించి, భారతీయ రాజులతో చేసే యుద్ధాలకు డబ్బు ఎలా సంపాయించుకుంది, చాలా జాగ్రత్తగా పరిచయం చేసిన పుస్తకం ఇది.  డచ్, ఫ్రెంచ్, అమెరికన్ వ్యాపారులు కూడా ఈ వ్యాపారంలో కోట్లు, పేరు గడించారు. ఘనత వహించిన  F.D.R ముత్తాత కూడా వారిలో ఒకడు. మన దేశానికి చెందిన రబీంద్రనాథ్ పూర్వీకులు కూడా ఒకప్పుడు నల్లమందు వ్యాపారంలో డబ్బు ఆర్జించిన వారే. అందుకేనేమో ఆ ఇబ్బందిని మీరేందుకు  రబీందృడు మాత్రం చైనా ను సమర్ధిస్తూ, నల్లమందు కు వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడారు. 

ఈ ఓపియం చైనా ని కొన్ని వందల సంవత్సరాల పాటూ చాలా బాధ పెట్టింది. ప్రజలు మత్తు కు బానిసలయ్యారు. చాప కింద నీరులా అది కంఫ్యూషియస్ బోధలని తుడిచిపెట్టింది. కుటుంబాలను, రాజ్యాలను, మర్యాదలను, ఆరోగ్యాలను మంట కలపడమే కాకుండా, దేశాల మధ్య చిచ్చు పెట్టింది.  చైనా వరకూ ఇదో రాజకీయ, వాణిజ్య సమస్య. వేలాది మంది ఎడిక్ట్స్,  లక్షలాది మంది వినియోగదారులూ, దేశ రెవెన్యూ ను ఇంగ్లీషు వాడి చేతుల్లో పెట్టారు. చైనా నుండి అత్యంత విలువైన మేలురకం సిల్క్, తేయాకు సంగ్రహించి, వాటికి బదులుగా ఓపియం ను అమ్మి ఆ దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది ఈస్ట్ ఇండియా కంపెనీ / బ్రిటన్. 

ఈ వ్యాపారం లో భారతీయులు ఎంత గా ఇన్వాల్వ్ అయ్యారో, భారతీయ పార్సీలు హాంగ్ కాంగ్ లో / ప్రస్తుత చైనా లో, తైవాన్ లో రాజకీయ, వ్యాపార రంగాలలో ఎంతకా పాతుకుపోయారో చదివితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి అమెరికా లో, బ్రిటన్ లో అతి ఎక్కువ సంపద ఉన్న సంపన్నులు, భారతీయ సంపన్నులున్నూ ఒక తరంలో ఈ ఓపియం మత్తు మందు వ్యాపారంలో గడించిన వాళ్ళే.  Guangzhou City, Macao, Hong Kong   లు ప్రధాన వాణిజ్య (మత్తు మందు వ్యాపారానికి ప్రసిద్ధి) నగరాలు. వీటిల్లో భారతీయ వ్యాపారులు అనేకంగా వ్యాపారాలు చేసారు. హిందువులకు  సముద్రయానం నిషిద్ధం గాబట్టి, మన దేశం నుండీ ఆ రోజుల్లో బయటి దేశాలకు సముద్రాలు దాటి వెళ్ళింది పార్శీలే. వాళ్ళు అక్కడ సామాజికంగా, సాంస్కృతికంగా పాతుకుపోయి, గుళ్ళూ, స్మశానాలనూ నిర్మించుకున్నారు. కొందరు చైనీయ మహిళని వివాహమాడి "సైనో ఇండియన్" కమ్మ్యూనిటీ ని సృష్టించారు. వాళ్ళ సంతతి లో ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటులూ, వ్యాపార వేత్తలూ ఉన్నారు. 

ఇండియా చైనాల వాణిజ్య సంబంధాలలో చారిత్రాత్మకమైన గురుతులు చైనా కళాకారుల కళ.  కలకత్తాలో ఇప్పటికీ నిలిచిపోయిన చైనీయుల పేటలు, చైనీస్ రెస్టారెంట్లు, స్పాలు.  ఈ  కళ పాశ్చాత్యులను విపరీతంగా ఆకట్టుకుంది. అమెరికాలో చైనా చిత్ర కళ కు, మృణ్మయ కళ కూ ప్రత్యేకంగా మ్యూజియం లు కూడా ఏర్పాటు చేసారు. ముంబయి లో జె జె ఇన్స్టిట్యూట్ లో జెమ్షెడ్ జీ చైనా నుండీ తీసుకొచ్చిన అనేక చీనీ పెయింటింగ్లు ఉన్నాయి. చైనా అమ్మిన టీ, సిల్కూ, ఈ అత్భుత చిత్ర కళ, వేదాంతమూ ప్రపంచం ఎంత ఎంజాయ్ చేసిందో, బదులుగా చేసిన ఈ నల్ల మందు వ్యాపారంతో దానికి చెప్పరానంత చేటు చేసింది. 

కారు చవగ్గా నిముషాల్లో Portrait  లను వేసే చైనీయుల కళా ప్రతిభను ఇప్పటికీ అబ్బురంగా చెప్పుకుంటారు. యూరప్ లో portrait చేయించుకోవాలంటే అది డబ్బున్నవారికే చెల్లేది.  వ్యవస్థీకృతమైన చైనా నల్లమందు వ్యాపారం ఎందరో సైనికులనీ, నావికులనీ, వ్యాపారులనీ, రక రకాల దేశాక వాళ్ళని ఒక చోట చేర్చింది. ప్రారంభం లో బ్రిటిషర్లు చైనీయుల ప్రభుత్వ విధానాల్ని ఎంత మెచ్చుకున్నారంటే, ఇప్పటికీ మన దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రతిష్టాత్మక "సివిల్ సర్వీస్" పరీక్షల ని చైనీయుల ని చూసే (అప్పట్లో)  వీళ్ళూ ప్రవేశపెట్టారు. 


జరిగినన్నాళ్ళూ కలకత్తాలో రహస్యంగా జరిగిన ఓపియం వేలం పాటలు, (బిహారీ పొలాలలో పండిన పంట, యూ.పీ లో ఫాక్టరీలలో ప్రాసెస్ అయి, చైనాలో అమ్మకానికి సిద్ధపరచి, కలకత్తాలో వేలం వేసేది కంపెనీ. అది కొని, చైనా లో అమ్మినది మొదట పార్సీలు, తరవాత ఫోర్బ్స్ వంటి అమెరికన్లు, కొందరు బ్రిటీషు వ్యాపారులు) బొంబాయిలో బహిరంగంగా జరిగేవి. అయినా బ్రిటిష్ వలసరాజ్యం 'మరాఠవాడా' లో విస్తరించడానికి సమయం పట్టింది. అక్కడి రైతుల్ని / గ్రామాలనూ లొంగ దీసుకుని, ఓపియం పండించడం కూడా కష్టమైన పనే. అయితే డబ్బు ప్రవాహపు ఆశ బొంబాయి ని కూడా ఓపియం వ్యాపారం లోకి దించింది. ఇక్కడా కొందరు సంపన్నులు తయారయ్యారు.   HSBC Bank కి మూల ధనం వచ్చిందీ ఓపియం లాభాలనుంచే.    హాంగ్ కాంగ్ మొదట చైనా చేతుల్లోంచి జారి బ్రిటన్ చేత పడటం, ఇప్పుడు లీజు ముగిసి, చైనా కి చేరడమూ ఒపియం వ్యాపారం మూలానే (మొదటి ఓపియం యుద్ధం లో China ఓడిపోవడం వల్ల జరిగిన ఒప్పందం ప్రకారం). 

ఇప్పుడు అమెరికా లో ప్రబలంగా ఉన్న ఓపాయిడ్ డ్రగ్ సమస్య ఒకప్పుడు చైనా లో విపరీతంగా ఉండేది. చక్రవర్తులు, రాజులు శతవిధాల ప్రయత్నించినా, పాశ్చాత్యుల కుతతంత్రాల ముందు నెగ్గలేకపోయారు. 50 ల లో కమ్మ్యూనిస్ట్ ప్రభుత్వం తీవ్ర కఠిన చర్యలకు పాల్పడే దాకా కూడా ఈ ఓపియం విష సంస్కృతి ని తమ దేశం నుండీ తరమలేకపోయారు.  ఇండియా కూడా స్వతంత్రం వచ్చాక ఓపియం ను ఓ రెవెన్యూ గడించే ఉపాయం కింద తీసుకోకపోవడం ఉపశమనం తీసుకొచ్చింది. 



ఓపియం నిజానికి ఓ అత్భుత ఔషధం. ఎలాంటి వారికి అంటే, విపరీతమైన నొప్పి ఉన్న వాళ్ళకి, మృత్యు ముఖంలో ఉన్నవారికి, కేన్సర్ పీడితులకు, హాస్పైస్ లో ఉన్నవారికి, నొప్పి తెలీనివ్వకుండా వాడే ఔషధ ప్రమాణాలలో వాడితే అదొక వరం. కానీ అది ఇష్టం వచ్చినట్టు, వ్యాపార ధోరణిలోనే, ఒక కాలనీ లో బీద రైతులను భయపెట్టి, బీద కార్మికుల చేత భౌతికంగా ప్రాసెస్ చేయించి, యుద్ధాలు జరిపి, లక్షలాది పౌండ్ లను సంపాయించేందుకు ఒక జాతికి నల్ల మందు ని  విపరీతంగా అలవాటు చేయించి, వాళ్ళ బలహీనతలను సొమ్ము చేసుకుని ఒక మహా  సామ్రాజ్యమే నడిచిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

By the 1880s, opium was one of the most valuable commodities moving in international trade.  In an average year, export opium leaving Calcutta and Bombay averaged over 90,000 chests, containing more than 5,400 metric tons.  This staggering amount would meet the annual needs of between 13 and 14 million opium consumers in China and Southeast Asia who smoked opium on a daily basis. 

అదే సమయంలొ  తమ తమ స్వదేశాలో మాత్రం, ఓపియం వాడుక మీద నియంత్రణలు విధించారు పాశ్చాత్యులు. మత్తు మందుల వాడకం (ఆల్కహాల్ కాదు) ఒక నీతి మాలిన చర్య అని, చైనీయులు, తూర్పు ఆశియన్లూ దొంగలు, దుర్మార్గులు, నమ్మ దగని వాళ్ళూ కాబట్టి, వాళ్ళకు ఓపియం అమ్మవచ్చనీ ఒక భావజాలాన్ని సృష్టించారు. స్వదేశాలలో ఎందుకూ కొరగానివాళ్ళు కలకత్తా వచ్చి ఓపియం వ్యాపారంలో పాల్గొని, కోట్లు గడించారు. స్వదేశాలలో వితరణ శీలులుగా పేరు గడించారు. నోబుల్స్ గా హై సొసైటీలలో తిరిగారు. రాజ్యాల పోరాటాలను ఫైనాన్స్ చేసారు. దీనిలో అంత డబ్బా - అని ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది కదా. 

Charles Dickens writes in an essay - If you were to check or prohibit this drug, a craving would arise for some other stimulus, like as in England, where an intermperate advocacy of temperance often leads to a secret indulgence in something fully as bad as ardent spirits.  

ఇప్పుడు క్రిమినల్ కార్టల్స్ దొంగతనంగా నడిపే డ్రగ్ రాకెట్స్ ని, ఒకప్పుడు ప్రభుత్వాలు నడిపేవి. ఇండియా కూడా స్వాతంత్ర్యం వచ్చాక కొన్నాళ్ళు నడిపింది. ప్రజల్లో చైతన్యం వచ్చి, పోరాటాలు జరిగి, రబీంద్రనాథ్ టాగోర్ వంటి వారు వ్యతిరేకించడం బట్టి, స్త్రీలు తిరగబడడం వల్లనూ, మెల్లగా మన దేశంలొ నల్లమందు సాగు ఆగింది. తరాల పాటూ ప్రభుత్వ కనుసన్నల్లో ఇష్టం వున్నా లేకపోయినా, తాము తినడానికి కాసిని తిండి గింజలనైనా సంపాదించుకోలేని /  (పండించుకోవడానికి అనుమతి లేదు)   బీద రైతులు ఓపియం కీ, దాని వాసనకీ, మత్తు కీ, దళారుల దోపిడి కీ, వెట్టి చాకిరీ కీ కరిగిపోయి, కట్టు బట్టలతో మిగిలి, కుటుంబాలతో విదేశాలకు 'ఇండెంచర్ కూలీ' గా వలస పోయారు. బెంగాల్, బీహార్ లు వట్టిపోయాయి. అక్కడ, రెండు వందల సంవత్సరాల క్రితం నుండే సామాజిక అన్యాయం జరగడం అలవాటయిపోయింది. పిల్లలకు బళ్ళు లేవు. గ్రామాలకు రోడ్లు లేవు. ఇప్పటికీ పల్లెల్లో జీవనాధారం లేదు. ఆస్పత్రులు లేవు. ఉద్యోగాలు లేవు.  "బిహారీ", తన 'దేశం' (State) వదిలి బయటికొస్తేనే అన్నం తినగలడు. ఇప్పటికీ ! (బిహార్, యూపీలు ఒకప్పుడు బెంగాల్ ప్రావిన్స్ లో ఉండేవి - వనవాసి గుర్తుంది కద)

"ఐబిస్ ట్రైలొజీ" రాసినప్పుడు రచయిత చేసిన విస్తారమైన రీసెర్చ్ ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు మనకు అవసరమా అని అనుమానం వస్తే, దానికి ఒక సమాధానం ఉంది. 

డబ్బు సంపాదించేందుకు సంపన్నులకు ఎటువంటి సందేహాలు, ధర్మ సంకటాలు ఉండవు. వాళ్ళకు మానవాళి కొంప కొల్లేరయిపోతున్నా అస్సలు పట్టదు. వాళ్ళకు అస్సలు ఏమీ అవసరం లేదు. ధర్మం అన్న మాట పని చెయ్యదు. స్వార్ధం, కపటత్వం, దుర్మార్గం, అన్యాయం - అంతే వాళ్ళకు తెలిసినవి. 

In 1907, Britain signed an agreement with China, undertaking to phase out all opium exports from India, over a ten-year period, provided that China's suppression of its domestic drug industry meet similar annual targets.  It was assumed that china would fail to meet its targets.  However China's crusade to free her people from the opium curse, may be justly reckoned one of the greatest moral achievements in history - a challenge to Western world. 

ఇప్పుడు చైనా మీద ఓపియం ఎడిక్షన్ ప్రభావం అంతగా లేదు. కఠోరమైన రాజకీయ నిర్ణయాలు + వాటిని అమలు పరచడం లో నిజాయీతీ, చైనాను ఆ సమస్య నుండీ బయట పెట్టాయి. అయినా ఈ వ్యాపారంలో లాభాల కోసం, తమ బంగారు గుడ్డు పెట్టే బాతుని కాపాడేందుకు శతవిధాలా ఈ పాశ్చాత్యులు చైనా ని తీవ్రంగా విమర్శించి, ఇరుకున పెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు.  కేవలం ఇందువలన ఇప్పటికీ చైనా విదేశాంగ విధానం "అపనమ్మకం" మీదే ఆధారపడింది!  ఇతరులను నమ్మి చాలా సార్లు చైనా మోసపోయింది ఓపియం వాణిజ్యంలోనే.

ఈ 1907 నాటి ఒప్పందం మెల్ల మెల్లగా ఇండియా లోనూ ఓపియం వ్యాపార జ్వరం తగ్గుముఖం పట్టేందుకు దోహదపడింది.  1911 లో పట్నా ఓపియం ఫాక్టరీ మూతపడింది. 1930 లో నల్ల మందు నిషేదానికి చట్టాలు వచ్చాయి. అయినా డబ్బాశ తో 1935 లో దొరల ప్రభుత్వం నీమచ్ ఓపియం ఫాక్టరీ ని తెరిచింది. స్వతంత్రం వచ్చాకా వెక్కిళ్ళు పడుతూ భారత ప్రభుత్వం కూడా నల్లమందు తయారీని పూర్తిగా నిషేధించింది. నల్లమందు వ్యాపారాల లైసెన్సులు రద్దయ్యాయి. అయితే బ్రిటిషర్లు వాదించినట్టు ఆ పరిస్థితుల్లో గ్రామీణ భారత వ్యవస్థ కుప్పకూలిపోలేదు.  పొలాలలో తిండిగింజల ఉత్పత్తి జరిగింది. నల్లమందు కు బలయిన తరం, పక్కకు తప్పుకుని, సరైన వ్యవసాయాధార బ్రతుకుకు అవకాశం ఇచ్చింది. 


--------------------------------------------------------------------------

Chinese Statesman Ku Hung-ming wrote to Somerset Maugham in 1921 : 


Do you that that we tried an experiment that is unique in the history of the world? We sought to rule this great country not by force, but by wisdom.  And for centuries we succeeded.  Then why does white man despise the yellow? Shall I tell you? Because he has invented the machine gun.  That is your superiority. We are a defenseless horde and you can blow us into eternity.  You have shattered the dream of our philosophers that the world could be governed by the power of law and order.  And now you are teaching our young men your secret. You have thrust your hideous inventions upon us.  Do you know that we have a genius for mechanics ? Do you not know that there are in this country four hundred millions of the most practical and industrious people in the world ? Do you not know that there are in this country four hundred millions of the most practical and industrious people in the world ? Do you think it will take us long to learn ? And what will become of your superiority when the yellow man can make as good guns as the white and fire them as straight ?  You have appealed to the machine gun and by the machine gun shall you be judged.   -

-----------------------------------------------------------------------

మొత్తానికి మూడొందల సంవత్సరాల చరిత్ర ముగిసింది. ఎందరో ఈ చరిత్ర లో కలిసిపోయారు. ఓపాయిడ్ సమస్య అగ్ర దేశాలని ఇప్పుడు వ్యవస్థీకృతంగా బాధిస్తుంది. ఇప్పటికీ ఓపియం వివిధ రకాలుగా మ్యూటేటెడ్ వెరైటీలలో ఉత్పత్తి అవుతుంది. యుద్ధాలలో తుడిచిపెట్టుకుపోయిన ఆఫ్గనిస్తాన్, సిరియా, యెమెన్ వంటి రాజ్యాలు బ్రతుకుతెరువు కోసం కొత్త రకం వంగడాల ఓపియం ను వాణిజ్య స్థాయిల్లో పండిస్తున్నాయి.  లక్షలాదిగా మనుషులు కొత్త ఓపియం రకాల ఎడిక్షన్ లో పడి దారుణంగా చనిపోతున్నారు. ఇది ఆగిపోదు. వైద్య అవసరాల కోసం ప్రభుత్వ లైసెన్స్ తో కూడా ఓపియం పండుతోంది. 

For countries with weaker law enforcement systems, such as those of Indian subcontinent and Africa, it will be close to impossible to regulate the flow of opiates.  Pakistan already has a major heroin problem because of the steady inflow from Afganisthan.  The same is true of the Indian state of Punjab.  Matters are likely to become much worse in future, especially if many insurgencies in the region resort to poppy farming or drug running to fund their causes.

 

As Mark Twain famously observed 'History never repeats itself but it does often rhyme'.  It is a measure of Opium's peculiar ability to insert itself into human affairs that it has created many echoes and rhymes between past and present.   "చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవకపోయినా దానిలోని రిథం ఎప్పటికీ బ్రతికే వుంటుంది."  ఓపియం విధానాల లాంటివే ఇప్పటి పర్యావరణ విధానాలు. ఎప్పటికీ బహుళ జాతి సంస్థలూ, లభాలు ఆర్జించే ప్రభుత్వాలూ, పర్యావరణం కోసం ఆలోచించవు.  ప్రపంచం భూగోళాన్ని కాపాడుకోవడానికి అందుకే ఒకడుగు ముందుకు, పదడుగులు వెనక్కీ వేస్తుంటుంది. ఈ పర్యావరణ ప్రమాదాలలో, ప్రకృతి వికృతమైన పర్యవసానాలలో ప్రాణాలు కోల్పోయేది, బీదలూ, సాధారణ పౌరులే. శక్తివంతమైన వారు నిర్ణయించే జీవితం మనది. 

Today, in a world where climate disruptions are intensifying and many formerly stable institutions are crumbling, it is more and more evident that much of what we have been taught about the past is untrue.  Indeed, what was truly new about the great 'take-off' of the nineteenth century was that it created a system in which indifference to human suffering was not just accepted by teleologies and deceptive theories.  What this led to was, for the most part, a kind of 'slow violence', inflicted not by weaponry but rather by inaction, and refusals to intervene. 

అయితే ఏ రకంగా ఆకాలానికి అత్యంత శక్తివంతమైన ఓపియం వ్యాపారపు సామ్రాజ్యాన్ని ఓడించిన ప్రజాగ్రహం, చైతన్యం, సరికొత్త పర్యావరణ విధానాల మార్పుకూ ఏదో ఓరోజు ఊతమివ్వవచ్చు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించే దిశగా, భూమిని మరింత స్వచ్చంగా, నివాసయోగ్యంగా మార్చేందుకు మనిషి చేసే ప్రయత్నాలలో ఈ "లాభాపేక్షకుల" ఓటమి ఎప్పటికైనా జరగాలన్నదే ఒక ఆశ. 

ఒకప్పుడు ఎదురన్నదే లేని ఓపియం సామ్రాజ్యం ఎలా కుప్పకూలిందో, లేదా ఇప్పటికీ ఓపియం చరిత్ర వివిధ దేశాల్ని, ఆయా దేశాల సంపన్నులనీ, వాళ్ళ ధనాన్నీ, ఎలా అంటిపెట్టుకునుందో, మన దేశంలో ఎందరు పెద్ద పెద్ద వాళ్ళ సంపద వెనక నల్లమందు సామ్రాజ్యపు చాయలున్నాయో చదివేందుకు, చరిత్ర నుంచీ మంచిని నేర్చుకునేందుకు, ఈ పుస్తకం చదవచ్చు. 



--------------------------------------------------------------------------

"When Opium smokers craving comes on, their bodies feel shriveled and listless, their joints all stiff.  They must rely on opium to fire themselves up.  At the beginning of firing up, they wriggle like worms.  A little more fired up and they begin to flow like a great river.  Fired up for a good while, they brim and burst with energy and quickened in every limb they stream forth with indomitable heat.  By the middle of the night they have even more energy to spare." --- 

The use of the words 'energy' and 'fire' has deeply unsettling resonances in this age of intensifying climate change, when the burning of fossilized forms of carbon has at once energized the world into stupendous dance of acceleration while simultaneously entrapping it like the body of an addict, in coils from which it may never succeed in extricating itself.  Today the fact that the world's relation with fossil fuels is indeed nothing other than a deadly and self-destructive addiction is widely acknowledged. 

--------------------------------------------------------------------------