Pages

24/07/2023

రంగురంగుల కవిత్వం - సంపాదకుడు : అనిల్ బత్తుల (Part I)





ఒకే కవిత.. దానికి కొన్ని అనువాదాలు ! ఒక్కో అనువాదం ఒక్కోలా వుంటుంది. కొన్ని ఒకందుకు నచ్చుతాయి.. కొన్ని ఇంకోకందుకు! ఇదే కాన్సెప్ట్ ! 

"ఎవరి అనువాదం మనకు నచ్చింది ? ఎందుకు నచ్చింది ? ఆ అనువాదం పాఠకుడికి లేదా పాఠకురాలికి నచ్చడానికి వారు పెరిగిన వాతావరణం, చదువు, సాహిత్య పఠన జాబితా ఇలా ఎన్నో కారణాలుండవచ్చు. ఒక్క అనువాదం ఒక్కో రంగులో మన హృదయాన్ని తాకుతుంది. నాకు ఈ కవిత్వ అనువాదాలు సంక్రాంతికి పిల్లలు గాల్లో ఎగరేసే రంగుల గాలిపటాల్లా కనిపించాయి.  మనుష్య నీడలు తాకని రహస్య అడవుల్లో ఎగిరే పేరుతెలియని రంగుల పక్షుల్లా ఈ అనువాదాలు నాకు కలలో కనిపించాయి".

- అనిల్ బత్తుల 

Content :   79 కవితలకు 206 అనువాదాలు. ఒక్కో కవితకు, గరిష్టంగా అయిదు అనువాదాలు. కవితలంటే పెద్దగా పడని నాకు ఈ పుస్తకంలో కవితలు బహుశా లబ్దప్రతిష్టులవి కాబట్టి చాలా నచ్చాయి.   వీటిని "కవిత్వ ప్రేమికులకు" చాలా శ్రద్ధతో, కమిట్మెంట్  తో సమర్పించారు అనిల్. ఎప్పట్లాగే ఆయన టేస్ట్ - అత్భుతం. ఈ పుస్తకాన్ని   నాకు దయతో పంపించిన నౌడూరి మూర్తి గారికి వేల వేల ధన్యవాదాలు. నూటికి తొంభయ్యారు శాతం నా అంతట నేను ఈ పుస్తకం (కేవలం కవిత్వం అంచెప్పి) కొనేదాన్నయితే కాదు. మొదట ఆలా తిరగేస్తూ 'బనలతా సేన్' చదివాను. అసలే చుట్టూ బెంగాలీలు. జీవనానంద మాట ఎత్తేసరికీ 'బనలతాసేన్' ను తల్చుకున్నారు. ఇదో మంచి అనుభవమే. ఎంత బావున్నాయో 'బనలతా సేన్' కి ఉన్న వెర్షన్లు... 


మచ్చుకు ఓ చిన్న కవిత : 

---------------------------

గాధ  (1)

అనువాదం : రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ (శ్రీ శాలివాహన గాథాసతశతీసారము, 1951) 


కల(గవు కమలంబులు : హం

సలు గదలవు; చూడవత్త  చక్కగ నెవరో 

వెలికిలగా నాకాశము

నిలిపినవా రూరిచెఱువునీళులలోనన్ !


----------------------------


గాథ (2)

అనువాదం : వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య (గాథాసప్తసతి, 1968) 


తాఱుమాఱుగావు తమ్మిపూ లెగసిపో

నైనబోవు హంస లచటినుండి

తెలియ దెవరోగాని తలక్రిందుగా నభం

బూరి చెఱువునందు నుంచిరత్త !


-------------------------------


గాథ (3)

అనువాదం : తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి (ఆంధ్ర ప్రభ 1993) 


ఊరి చెరువులో ఆకాశం పడింది

ఒక్క తామర తెగలేదు

ఒక్క కొంగ తగ్గలేదు

-----------------------------

గాథ (4)

అనువాదం : నరాల రామారెడ్డి (గాథా త్రిశతి, 201)


చిత్రమగునత్త ! మనయూరి చెఱువునందు 

ఎత్తిపడవేసెరెవ్వరో ఇంత నింగి

నలినషండమ్ము లిసుమంత నలుగలేదు

ప్రాణభయమున నెగురదు హంసగణము.

----------------------


గాథ (5)

అనువాదం : దీవి సుబ్బారావు (ప్రాకృత గాథాసప్తసతి 2012)


తామరలు చెదరవు

హంసలు కదలవు, చూడు అత్తా !

ఆకాశాన్ని ఎవరో 

వెల్లకిలగా వూరి చెరువునీళ్ళలో 

పడుకోబెట్టినారు

----------------------------------------------------------------------------------

బనలతాసేన్ లో కొన్ని లైన్లు 



దివసాంతాన మంచురాలే మెత్తటి శబ్దంతో

సంధ్య ప్రవేశిస్తుంది; సూర్యగంధాన్ని దులుపుకుంటుంది డేగ        - ఇస్మాయిల్


సాయంకాలపు మంచురాలుతున్నవేళ

మహాశకుంతం తన రెక్కనుండి 

సూర్యబింబసుగంధాన్ని తుడిచేసుకుంటున్నవేళ     -   - వాడ్రేవు చినవీరభద్రుడు 


సాయమ్రశ్మి కప్పుకొన్న చెట్ల కొమ్మల సందుల నడుమ

కాకి తన రెక్కలమీద 

కమ్ముకొన్న సూర్య సౌరభాన్ని దులుపుకుంటున్న సమయాన   -  కుప్పిలి పద్మ


పవలంతా కడచినాక మంచుతుంపర పచ్చికపై మెలమెల్లన రాలినట్లు

విచ్చేస్తుంది మలిసంజ, రెక్కలపై ఎండతావి తుడుస్తాయి చీకట్లు.  -  ఆలూరి బైరాగి


సాయంగోధూళి కప్పిన చెట్ల కొమ్మల సందుల మధ్య 

అపశకునాల రేవెన్ పక్షి 

రెక్కల మీద వాలిన సూర్యకిరణాల సువాసనలు తుడిచేసుకుంటుంది.   - కుందుర్తి

---------------------

At the end of the day, with the soft sound of dew,
Night falls; the kite wipes the sun's smells from its wings; - Fakrul Alam


(ఇంకా వుంది)


23/07/2023

The Nutmeg's Curse - Amitav Ghosh



ఇండొనేషియా చాలా అందమయిన ద్వీపాల సమూహం.  ఇక్కడ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలున్నాయి. ఎన్నో అత్భుత పగడపు దీవులు, అందమయిన అగ్నిపర్వతాలు, అత్భుతమైన బీచ్ లు. మంచి గ్రీనరీ, ఇంకొంచెం చరిత్ర!! 'నట్మెగ్స్ కర్స్' ఆ చరిత్రని ఇప్పటి గ్లోబల్ వార్మింగ్ కి, మనుషుల అరాచకత్వానికీ, తద్వారా  సొంత గ్రహ వినాశనానికీ ముడిపెడుతూ రాసిన ఓ పుస్తకం.  మనది "వసుధైక కుటుంబం" కదా. ఎన్ని సామెతలో, భూమి గుండ్రంగా ఉందనీ, దునియా గోల్ హై అనీ, ఎక్కడి వాళ్ళమైనా మనం, అందరం ఒకటే!! ప్రకృతి విపత్తుల కోణంలో చూస్తే   ఎవరో పెట్టిన చిచ్చుకు ఇంకోరం బలవట్లేదూ, భూమికి బోర్డర్లుండవు. అది గీతలు గీసుకోదు. అందుకే, బందా (Island in Indonesia, once famous for Nutmeg cultivation)  నుంచీ కథ మొదలు పెట్టారు రచయిత. 


బందా ద్వీపాలు ఒక పది.   అగ్నిపర్వతం పేలినతరవాత ఏర్పడిన దీవులు. ఎన్నో ఏళ్ళుగా పర్వతంలో మరిగిన ఆ మట్టి ఎన్నో వేల కోట్ల అత్భుతమయిన మూలికలకు, సహజ వనరులకు నెలవు. ప్రపంచంలో అప్పటికి ఎక్కడా లేనటువంటి నట్ మెగ్ (జాజికాయ) అక్కడే పుట్టింది.  అది ఎంత విలువైన పండో!    జాజికాయ, బందా దీవుల్లో తప్ప మొత్తం భూమి మీద అసలు ఎక్కడా పండేది కాదు. దాన్ని వ్యాపారులు, ముఖ్యంగా అరబ్ లు, ఎన్నో సంవత్సరాలుగా పాశ్చ్య, పాశ్చాత్య దేశాలకు అమ్మేవారు.    అప్పటికి అమెరికా కనిపెట్టబడలేదు. సో, ఐరోపాలోనూ, ఇండియాలోనూ ఈ జాజికాయను వంట దినుసుల్లోనూ, సుగంధ ద్రవ్యాలలోనూ,  ఔషధాల  తయారీలోనూ వాడేవారు.  నిజానికి ఐరోపాలో కన్నా ఎక్కువ మొత్తంలో భారత దేశంలోనే జాజికాయని వాడేవారు. అరబ్బులు ఈ ద్వీపాలు ఎక్కడున్నాయో బయటి ప్రపంచానికి తెలీకుండా కొన్ని తరాల పాటూ దాచాకా, పోటీ ఎక్కువయి, మొత్తానికి పోర్చుగీసు వాళ్ళూ, డచ్ వాళ్ళూ, ఆఖరికి ఇంగ్లీష్ వాళ్ళ పాలపడింది ఈ ద్వీప సమూహం.


అక్కడి నుంచీ ట్రేడ్ వార్ పేర్న జరిగిన అకృత్యాలు, అమానవీయ సంఘటనలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి ఇతర ఖండాలలో జరిగినట్టే, ఇక్కడా జరిగింది.  సహజంగా ఆయా ప్రాంతాలకు చెందిన ఆదిమజాతుల వారిని, చంపేసారు. అదిరించీ బెదిరించీ వెళ్ళగొట్టారు. తరతరాలుగా వారిని వేధిస్తూ, వారి సంస్కృతినీ, భాషనీ సర్వనాశనం చేసారు.  డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ (Venerable East India Company - the Vereenigde Oostindische Compagnie, VOC)   ఆయా దేశాలో లాగానే ఇక్కడ కూడా నేటివ్స్ నీ, అసలు సొంతదారుల్నీ సమూలంగా నిర్మూలించి, తన వాళ్ళను తెచ్చుకుని, జాజికాయల వ్యాపారం మొదలు పెట్టింది. 

In the sixteenth century, the value of nutmeg soared when doctors in Elizabethan England decided that the spice could be used to cure the plague, epidemics of which were sweeping through Eurasia.  In the late middle ages, nutmegs became so valuable in Europe that a handful could buy a house or a ship.


Anglo-Dutch War లో ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ పెద్దగా వేగలేక, ఈ ద్వీపాల్లో ఒకదాన్ని (Island or Run, Treaty of Breda, 1667)  డచ్ వాళ్ళతో మార్పిడి చేసేసుకున్నారు. అంటే పది దీవుల్లో ఒకదాన్ని వొదులుకుని, దానికి బదులు అమెరికాలో ఇప్పుడు Manhattan/న్యూయార్క్ ని తీసుకున్నారు.  దాంతో జాజికాయల వ్యాపారం పూర్తిగా డచ్, పోర్చుగీసు వాసుల చేతికి వచ్చేసింది.  అమెరికాలోనూ ఇంగ్లీష్ వాళ్ళు జాతుల హననానికి విస్తారంగా పాల్పడ్డారు. బానిసల్ని ఆఫ్రికానుండీ ఎత్తుకొనొచ్చి సామ్రాజ్యాల్ని నిర్మించుకున్నారు. ఆ అకృత్యాలు ఒక మనిషి ఇంకో మనిషి పట్ల సాగించిన దురాగతమే కాదు. మనిషి భూమికి చేసిన అన్యాయం కూడా. అసంఖ్యాకంగా స్థానిక జాతుల వారిని నిర్మూలించడాన్నే కాకుండా, అక్కడి భూమిని ఆక్రమించుకునేందుకు విస్తారంగా అరణ్యాలను నరికేసారు. అక్కడి వన్యప్రాణులను వేటాడడానికే ప్రత్యేకంగా మనుషులుండేవారు. ఆ కళేబరాలను  / ఎముకల గుట్టలను / వాటి శరీరాలను కుప్పలుగా పోస్తే అవే కొన్ని వేల ఎకరాలను ఆక్రమించేవంట.  ఇక చిన్న చిన్న పురుగూ పుట్రా, పక్షులూ జీవనాధారంలేక వాటిమటుకవే సమసిపోయేయి. అలా అప్పట్నించే పర్యావరణానికి హాని చెయ్యడం మొదలుపెట్టాడు మానవుడు. 

ఇక ఇండోనేషియా కి తిరిగొస్తే - ఇక్కడ అన్నట్టు చుట్టుపక్కల దీవుల్లో లవంగాలు కూడా పండేవి.  ఇక గుత్తాధిపత్యం వీళ్ళదే కాబట్టి,  ఆ రకంగా యూరోపియనులు  స్పైసెస్ వ్యాపారంలో వేల కోట్లు గడించారు. ఇక్కడినుంచీ ఓడల్లో స్పైసెస్ ఇంత ఖర్చు భరిస్తూ యూరోపు తీసుకెళ్ళడం ఎంత ఖరెదైన సంగతైనా, దానికి పది పన్నెండు రెట్లు ఎక్కువ సంపాయించేవారు కాబట్టి, వాళ్ళకి ఈ దీవుల మీద రాజ్యం చెయ్యడం, ఏలడం చాలా అవసరం. అయితే, అధికారం కోసం ఒకళ్ళతో ఒకళ్ళు కీచులాడుకుంటే మొదటికే ఎసరు వస్తుందని వ్యాపారులే ఒక సిండికేటు (VOC/Dutch East India Company) గా ఏర్పడి ఓ దోపిడీదారు వ్యవస్థని ఏర్పరచుకుని,  ట్రీటీల ద్వారానూ, జీనొసైడ్ ల ద్వారా రక రకాల పద్ధతులను అనుసరించి,  అక్కడి ఆదివాసీల్ని సమూలంగా (Exterminate) నాశనం చేసేసి, అరకొరా మిగిలున్నవాళ్ళని 'బానిసల్ని'  చేసేసి (ఎందుకంటే వాళ్ళకి ఈ నట్ మెగ్ సాగు గురించి తెలుసును కాబట్టి) ఆ దీవుల్ని కొన్ని ఏళ్ళపాటూ పీల్చి పిప్పి చేసేసారు.    ప్రపంచంలో కెల్ల ధనిక దేశాలలోకి చేరిపోయారు. (VOCs monopoly on the spices of the East Indies made the Dutch famous across Europe for their enterprise and commercial prowess. The prodigious increase of the Netherlands, is the envy of the present and may be the wonder of future generations).

 

దానితో ఆగక, తమ జాతి తత్వాన్ని నిరూపించుకుంటూ, రంగు తక్కువున్న, అనాగరిక జాతుల వారని చెప్పి, మొదట బందా జాతి పెద్దల్ని, తరవాత, వారి వాళ్ళందరినీ విచక్షణ లేకుండా, జాలీ దయా లేకుండా తిరుగుబాటు చేసారనే  వంకతో తెగ నరికేసారు.  ప్రాణాలతో మిగిలినవాళ్ళని బానిసలుగా చేసుకున్నారు. అయితే కాలం / కర్మా చాలా పెద్ద సంగతులు. ఆ దీవుల చరిత్ర తెల్లవాళ్ళే రాసారు. తమ వీరుల్ని న్యాయంగా, దీవులలో మరణించిన జాతులవారిని అన్యాయంగా చిత్రీకరించారు.  అంత్యంత కౄరంగా జాతిహననానికి, నమ్మకద్రోహానికీ పాల్పడ్డ తమ తమ సైన్యాధికారులని తరాల పాటు ఆరాధించారు. వాళ్ళ వాళ్ళ దేశాల్లో వారికి విగ్రహాలు కట్టారు. కూడళ్ళకూ, మ్యూజియాలకీ వాళ్ళ పేర్లు పెట్టారు.  అదెలాగూ అన్ని చోట్లా ఉండేదే. గానీ, ఎబారిజన్ / ఆదివాసుల కి ఓ శక్తి ఉంటుంది. ఎంతగా నిర్మూలించేందుకు ప్రయత్నించినా, ప్రకృతి తో పోరాడి, ప్రకృతికి అణిగిమణిగి, ప్రకృతితో స్నేహం చేసి, ఎలాగో ఒకలా 'సర్వైవ్'  అవ్వడానికి వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి. మొన్న కొలంబియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బ్రతికిన చిన్న పిల్లలు భయంకరమైన అడవిలో 40 రోజుల పాటు బ్రతకగలిగారంటే, సురక్షితంగా బయటపడగలిగారంటే, వాళ్ళు ఆదివాసుల జాతికి చెందినవారు కావడమే కారణం. They naturally have this TEK Traditional Ecological Knowledge.

 ఆదిమవాసులనీ, ఆయా దీవుల ప్రజలనీ జంతువుల లాగా/ brutes and savages గా చూశారు. ఇప్పటికీ జాత్యాహంకారం వారి రక్తంలో ఇంకి అప్పుడప్పుడు విరుచుకు పడుతుంటుంది. అదే అహంకారం ఇప్పటి విచక్షణ లేని వ్యాపారాలలో, యుద్ధాలలో, mass shootings లో  తొంగిచూస్తుంటుంది.

"The elite orthodoxies, in turn, were the product not just of the subjugation of human "brutes and savages" but also of an entire range of nonhuman beings - trees, animals, and landscapes.  Indeed "subdue" was a keyword in these conquests, recurring again and again in reference not just to human beings but also to the terrain. 


భూమి కి ఎందరో బిడ్డలు. మానవులు, మానవేతర ప్రాణులు, అసంఖ్యాకమైన వృక్షాలు, ఇప్పటి మన శక్తి చోదకాలైన రకరకాల ఇంజన్లకు అవసరమైన శిలాజ ఇంధనాలు, ఇవన్నీ భూమి నుండీ పుట్టినవే, ఇప్పుడు మనిషి భూమిని విడిచి మార్స్ మీద బ్రతికేందుకు ఎగురుతున్నాడు. భూమిని కోలుకోలేనంత దెబ్బ తీసి, తన ఇల్లు తనే కాల్చుకుంటున్నాడు. ఇప్పుడు భూమి అలసిపోయింది.   మనం కొన్ని వేల ఏళ్ళుగా పాడుచేసుకుంటున్నదాన్ని బాగుచేసుకోవడానికి భూమి కూడా విశ్వప్రయత్నమే చేస్తుంది.    భూమి గురించి ఆఫ్రికన్ జానపద కథ ఒకటి ముక్తవరం పార్థసారథి గారు అనువదించగా సాక్షి ఫండే లో చదివాను. ఆ కథ గుర్తొస్తుంది. ఆవిడ అమ్మ. పిల్లలు మహా మహా దుష్టులు. ఆవిడని నానా హింసా పెడతారు. ఆవిడ మహాశక్తివంతురాలైనా తల్లిప్రేమ కాబట్టి పిల్లలు  తనను హింసిస్తుంటే ఊరుకుంటూ ఓర్చుకుంటూ వస్తుంది. ఒకరోజు మాత్రం తల్లికి ఇక ఓర్పు నశిస్తుంది. అదీ కథ.  ఆరోజు గనక వస్తే ఆ పిల్లల్ని కాపాడగలేది ఎవరు ? పురాణాల్లో చెప్పినట్టు, సృష్టి ఒకసారు పూర్తిగా అంతరించి, ఇంకో సారి తాజాగా మొదలవుతుంది. అంతేనేమో. కాకపోతే, ఎప్పుడో దూరాన కనిపించాల్సిన అంతం ఏదో, ఇంకొన్ని సంవత్సరాల దూరం లోనే కనబడేసరికీ, మనిషి ఉలిక్కిపడుతున్నాడు. 

"we are today even more dependent on botanical matter than we were three hundred years (or five hundred, or even five millennia) ago, and not just for our food.  Most contemporary humans are completely dependent on energy that comes from long-buried carbon - and what are coal, oil, and natural gas except fossilized forms of botanical matter ?"


కాలం గొప్పది కదా. మనతో పాటే చెట్లూ భూమి కడుపున పుట్టినవే.  చెట్ల వయసుని రచయిత ప్రస్తావిస్తారు. ముఖ్యంగా పురాతన అరణ్యాలలో, ఎప్పటివో చెట్లు. కొన్ని కొన్ని వందలేళ్ళు బ్రతుకుతాయి. ఆ జీవితకాలంలో తన కళ్ళ ముందు పుట్టి, గిట్టిన మనుషుల్ని, ఇతర జీవుల్నీ ఎన్నిటినో చూసుంటాయి. ఇంకా చూస్తూనే ఉంటాయి. వాటి శక్తి ముందు మనమెంత ? ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి పొరల్లో కూరుకుపోయిన చెట్లు, ఆకులు, అలములు, వాటి నీడన మరణించిన జంతువులు, అవి ఇప్పుడు శిలాజ ఇంధనాలుగా కూడా ప్రకృతిలో తమ శక్తిని నిరూపించుకుంటున్నాయి. చెట్లను నరికేసో, అనాగరికుడైన ఏ ఆదివాసినో నరికేసి, ఇష్టం వచ్చినట్టు కనబడిన జంతువుల్ని చంపేసి, ఏ బేలెన్స్ ని కోల్పోయాడో ఈ నాగరిక మానవుడు ! ధనం సంపాయించి ఉండొచ్చు. బోల్డంత అభివృద్ధి సాధించి ఉండొచ్చు. కానీ మహా ప్రళయం ముంచుకొచ్చినప్పుడు ఖరీదైన లైఫ్ బోట్ లో ఎక్కి తప్పించేసుకోగలనులే అనే ధీమాతోనే ఈ పాపాలన్నిటినీ చేసేస్తుంటాడు కదా. కానీ ఆ లైఫ్ బోట్ సైతం, అతన్ని చివరికి కాపాడలేదు.  


కరోనా లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఆఫ్రికాలో శవాల గుట్టలు లేస్తాయని నిపుణులు అంచనా వేసారు. కానీ జరిగింది దానికి విరుద్ధం. ఎంతో ప్రగతిని సాధించామని భావించిన అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో నాగరికమైన మనుషులు వేలలో చనిపోయారు. వాళ్ళలో చాలామంది ఆస్పత్రుల్లో ఒంటరిగానే చనిపోయారు. బీద దేశాలు కాస్త బాగానే తట్టుకున్నాయి. కరోనా సమయంలో కూడా ప్రభుత్వాలు వివక్షని పాటించాయి. బ్రజీల్ లాంటి దేశం, తమ ఏమజాన్ వాసుల్ని గాకికొదిలేసింది. అమెరికాలో నల్లవాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళలో చావులు విస్తృతంగానే చోటు చేసుకున్నాయి. బ్రజీల్ అధ్యక్షుడు కరోనా "మామూలు జ్వరమే" అని అసలు పట్టించుకోనేలేదు.  పైగా పేండమిక్ లో ప్రపంచం పట్టించుకోలేని పరిస్థితి లో  ఉన్నప్పుడు, సందు చూసుకుని, నిస్సిగ్గుగా, అధ్యక్షుడి కనుసన్నల్లోనే,  ఏమెజాన్ అడవుల్లో కొన్ని వేల ఎకరాల్ని, కార్పొరేట్ల కోసం నరికేసారు.  ఇది కూడా తెల్ల జాతి దురహంకారానికి ఒక ప్రతీకే. వారి దృష్టిలో "అవసరం లేని జాతులు" ఇలా జబ్బొచ్చి చనిపోతే వాళ్ళకి సంతోషమే.  ఇలాంటి తేడాల్ని ప్రజలు పసిగట్టగలిగారు.  నిజానికి మశూచి వంటి ప్రాణాంతకమైన జబ్బులంటించి ఎందరో ఆదివాసుల్ని చంపిన ఘన చరిత్ర యూరోపియనులది. ఇప్పుడూ అదే రిపీట్ అయిందని కొందరి ఉవాచ. కరోనా నుంచి కొన్ని కమ్యూనిటీలకు  రక్షణ కల్పించలేదు. నల్లజాతి వారు,  పేదలు పని చేసే బుచరీలను యుద్ధ ప్రాతిపదికన తెరిచారు. వారి హాస్పిటళ్ళలో వసతుల్లేవు. వారి శవాలను తొలగించడానికి సదుపాయాల్లేవు. ఇదంతా ఏ బీద దేశాల్లోనో జరగలేదు. ప్రపంచంలో కెల్లా ధనిక దేశమైన  అమెరికాలోనే జరిగింది. 

   

అమెరికా, కేనడా, ఆస్ట్రేలియాలలో ఇప్పుడు సాధారణమయిన కార్చిచ్చులు ఒకప్పుడు అక్కడి ఆదివాసుల్ని పురుగులకన్నా హీనంగా చంపిన పాప ఫలితమేనేమో.  ఆదివాసులతో పాటు, వారి జీవనాధారమైన అనేక జంతువుల్ని వేలాదిగా నిర్మూలించారు యూరోపియన్లు.  (Colonial Terraforming lies at the heart of the planetary crisis) వారి పొలాలని ఆక్రమించుకున్నారు. వారి వ్యవసాయ విధానాలని తప్పు పట్టారు.  అక్కడి ఎకో సిస్టం నే పూర్తిగా మార్చేసారు.    కొన్ని పేరాలు చదివితే చాలా బాధనిపిస్తు ఉంటుంది. ఇప్పటికీ మనం అదే చేస్తున్నాం. మన దేశంలో అతి వినాశనకారమైన తీవ్ర పర్యాటకం, పవర్ కోసం అడ్డదిడ్డంగా కట్టిన బరువైన డాములు హిమాలయాల్ని నాశనం చేసేసాయి. పర్యావరణం అంటే ఏ మాత్రం జాగ్రత్త లేకపోవడం రేప్పొద్దున్న నగరాలు వరదల్లో మునిగిపోవడానికీ, ప్రళయాలకీ దారితీస్తుంటే, మనం మార్స్ కి పరిగెడదాములెమ్మని చూస్తున్నాం అంటారు రచయిత. ఆదివాసులకు ప్రకృతితో, పర్యావరణంతో ఉన్న గాఢ అనుబంధాన్ని ఈ నాగరికత ముసుగులో, అభివృద్ధి ముసుగులో మనం ఎంత దుర్మార్గంగా అర్ధం చేసుకున్నామో. దానివల్ల ఇప్పటికే కోలుకోలేనివిధంగా ఎంత నష్టపోయామో చెప్తుంది ఈ పుస్తకం. 


ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పాలంటే, ఇప్పటికీ అర్ధం పర్ధం లేని యుద్ధాలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి. యుద్ధాలకు ఎంత ఖర్చవుతుందో, వాటి విపరిమాణాలేమిటో పక్కన పెడితే, వాటి వల్ల, లేదా, యుద్ధానికి సర్వసన్నద్ధత వహించేందుకు దేశాలు  పర్యావరణానికి ఎంత హాని చేస్తాయో కూడా ఉదాహరణలు చూద్దాము.  


The Department of Defence has, at times, succeeded in lowering its total consumption of fossil fuels, it has not found a way of severing the primal bond between fossil fuels and military power that come into being in the early nineteenth century; every time the Pentagon fights a war its consumption of hydrocarbons surges.  Nor it is easy to conceive of that bond being broken without the invention of a new means of powering helicopters and supersonic jets; in some years, no less than 70 percent of the Pentagon's operational energy use is for jet fuel. 


ఈ పుస్తకంలో యుద్ధాల నుంచీ పారిపోతుండే రెఫ్యూజీల గురించే కాకుండా పర్యావరణ సమస్యల వలన శరణార్ధులుగా మిగిలిన బంగ్లాదేశీయుల గురించి కూడా తెలుసుకోవచ్చు. బంగ్లాదేశ్ లో తీరం అంచున ఇప్పటికే సముద్రంలో కలిసిన గ్రామాల ప్రజలే కాకుండ, ఏటా తుఫాన్ల బారిన పడి జీవనోపాధి ని ఇచ్చే పొలాలను ఉప్పునీటికి వొదులుకోవాల్సొచ్చి, ఇళ్ళు కోల్పోయిన ఎందరో!  దానికి తోడు, ఇలాంటి పరిస్థితులలో చెలరేగే రాజకీయ అనిశ్చితి వల్ల కూడా దేశాలు పట్టుకుని వలస పోతుండే పర్యావరణ శరణార్ధులు చాలా మందే ఉన్నారు. 


అలాగే   మనం మన కథల్ని ఎలా చెప్పుకుంటామో, రామాయణం, ఒడిస్సీ ల లాగా ఇతిహాసాలు రాసుకుంటూ, మన ప్రయాణాన్ని ఎలా నోట్ చేసుకుంటామో, మానవేతర ప్రాణులు కూడా అలాగే చేసుకుంటాయి. ఈ భూమి మీద మనతో పాటూ వాటికీ స్థానం ఉంది. అసలు వాటితో కలిసి ఉంటేనే మనకి బాలెన్స్, బ్రతుకు. అది ఇప్పుడు ప్రమాదంలో పడింది కదూ.   ఈ బ్రతుకు పోరాటంలో కార్పొరేట్ల అక్రమ మైనింగ్, అక్రమ అడవుల నిర్మూలన, అసలే జనాభా వల్ల తగ్గిపోతున్న జంతుజాలపు పర్యావరణాన్ని దెబ్బతీసేస్తూ ఉన్న కారణం వలన అనేక జీవుల అనేక జాతులు అంతరించిపోయాయి, ఇంకా ప్రతి రోజూ అంతరించిపోతూనే ఉన్నాయి. అవేమైనా మరీ అంత పనికిమాలిన ప్రాణులా ? ఆకులూ, చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని జగదీష్ చంద్ర బోస్ చెప్తే, అతన్ని ఈ వ్యాపార వాద పాశ్చాత్యులు పక్కకు లాగేసారు. కానీ ఇప్పటికీ చెట్లు మాటాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  అడవిలో గొడ్డలి వేటు పడుతున్న చెట్టు, తన చుట్టూ ఉన్న చెట్లని హెచ్చరిస్తుంది.  అలాంటి వాటిని అడ్డదిడ్డంగా నరికేస్తున్నాం కదా - జంతువులు చనిపోతున్నాయి కదా.. పక్షులు మాయమవుతున్నాయి.. ఇవన్నీ అంత పనికిమాలిన ప్రాణులా ? వాటికి ఏ విలువా లేదా ? 

It is well established now that many animals have long memories and are able to communicate in complex ways.  Some of these animals like elephants, whales, and migratory birds, also move over immense distances and appear to have attachments to particular places.  These movements cannot be described as purely mechanical, instinctive, or lacking in meaningful sequences.  Humpback whales, for instance, mark the passage of time by changing their songs, from year to year.  This would hardly be possible if they have lived "entirely in the Here and Now".


257 పేజీల (మొత్తం 339) ఈ పుస్తకంలో విస్తారంగా చర్చించిన విషయాలు

కరోనా, గ్రెటా థంబర్గ్, పర్యావరణ వలసలు, అమెరికాలో  ఆదివాసుల హత్యాకాండ ఏయే పద్ధతులని, సిద్ధాంతాలనీ అనుసరించి జరిగింది, ఏఏ మూఢ నమ్మకాలు యూరోపియనులకు ఉండేవి - ఆ భయంకరమైన విధానాల వల్ల, ఉదాహరణకు విచక్షణారహితంగా వేలాది యెకరాల అడవుల్ని నరికి ఎస్టేట్లు, పంట పొలాలుగా మార్చడం, యూరోపియన్ల విలాసాలకు భూమి నీ, ఆ చుట్టుపక్కల వన్యప్రాణుల్నీ లక్షలాదిగా మట్టుపెట్టడం, నేటివ్ లని అన్నివిధాలుగా చుట్టుముట్టి, వ్యాధుల తోనూ, బీదరికంతోనూ, వారి భాషనీ, సంస్కృతినీ లాగేసుకోవడం ద్వారానూ - వారి పిల్లని బలవంతంగా స్కూళ్ళలో చేర్చి విద్య (ఆధునిక విద్య) నేర్పించడం ద్వారా వారి వారి సహజ ఆదిమ విజ్ఞానాన్ని నాశనం చెయ్యడం, వాటి విపరిమాణాల్ని ఇపుడు గ్లోబల్ వార్మింగ్ పేరుతో ఎదుర్కోవాల్సి రావడం, డకోటా పైప్లైన్ గురించిన పోరాటం, కోర్టులలో కూడా పెరుగుతున్న ఎవేర్ నెస్!   ఇప్పటికీ బ్రతికుండి ఆస్ట్రేలియా, ఈస్ట్ ఇండీస్,  న్యూజీలాండ్, అమెరికా, బ్రజీల్ లలో తమ గొంతును వినిపిస్తున్న నేటివ్ లు, బందా హననాలు (యూట్యూబర్లు బందా ను చూపించినప్పుడు, ఆ ప్రాంతం సౌందర్యం చూస్తే - వళ్ళు గగుర్పొడుస్తుంది). యూరోపియన్ ల రక్తంలో సాంస్కృతికంగా  పాతుకుపోయిన దురహంకార భావనల వల్ల ఇప్పటికీ కొనసాగుతున్న యుద్ధాలు, క్రిస్ట్ చర్చ్ తరహా ఫాసిస్ట్ దాడులు  - ఇలా ఒకటి కాదు.  నాకైతే, ఈ పుస్తకం చదవడం, worth my time అనిపించింది. ఇప్పుడు జియో పోలిటిక్స్ ఎలా ఉన్నాయంటే డబ్బుని మించిందేమీ లేదు. కేవలం స్వార్ధం తోనే  alternative / sustainable energy మీద దేశాలు ఖర్చు చెయ్యవు. కేవలం డబ్బుతో ప్రపంచాన్ని శాసించేయాలని, అందరికీ మేలు చేసే విధానాలని ధనిక దేశాలూ పాటించవు, మేమెందుకు వెనకబడాలి అని బీద దేశాలు కూడా పాటించవు. ఇదో అంతు లేని సమస్య.  గ్లోబల్ వార్మింగ్ ఒక బ్లఫ్ అనుకోకుండా,  ప్రపంచం అంటే,   బ్రతుకంటే ప్రేమ ఉన్నవాళ్ళు, గత చరిత్ర లో మన పూర్వీకుల తప్పులు ఇంకా ఎన్ని విపరీతాలకు కారణం అవుతున్నాయో తెలుసుకునేందుకు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. 


Some points to ponder or appreciate :  


The mountain islands of Malaku often erupt with devastating force,  bringing ruin and destruction upon the people who live in their vicinity.  Yet there is also something magical about these eruptions, something akin to the pain of childbirth. For the eruptions of Malaku's volcanoes bring to the surface alchemical mixtures of materials that interact with the winds and weather of the region in such a way as to create forests that teem with wonders and rarities.  In the case of the Banda Islands, the gift of Gunung Api is a botanical species that has flourished on this tiny archipelago like nowhere else; the tree that produces both nutmeg and mace.

---------------------

On the Malakun island of Kai, not far from Bandas, there are a few villages that are, to this day, populated mainly by descendants of the survivors of the genocide of 1621.  The names of these villages evoke the lost homeland, and their inhabitants still speak turwandan, the Banda Language, their songs and stories still bring to life not just the "Banda Mountain" but also its blessing (or curse), the nutmeg.

--------------------

In this (Wars of extermination) lies a fundamental difference between settler-colonial conflicts and the colonial wars fought by Europeans in Asia and Africa.  The wars waged by the British in India, for example conformed to the usual patterns of Eurasian warfare: soldiers fought each other with human-made weapons, and the wars were usually limited in duration.

-----------------


The list of climate-related security threats is very long, partly because it includes many issues that would not, until recently, have been considered military matters at all.  Dealing with migrants and refugees, for instance, was once squarely within the sphere of civilian governance.  Today, whether in the waters around Australia or in the Mediterranean, or, along the US's southern border, or on India's border with Bangladesh, migration is largely in military and paramilitary hands.

------------------

The waning of anti-mechanistic, vitalist ideas as a potent force in Indian politics is due in large part to the caste system, which ensures that the people whose lives are most closely tied to the land's soils and rivers, forests and coasts, are relegated to the farthest margins of the power structure.  This outcome is the product of the very logic of caste, in which those who deal with certain organic substances that are regarded by upper castes as impure --manure, meat, leather, bodily wastes, and so on --- are consigned to the lower ranks of the hierarchy. 

-------------------------

Legal protections for Adivasis were never strong in India, since colonial times. officially designated forest lands --which cover no less than a fifth of the country's surface area -- have formed an internal "state of exception" where the normal functioning of the laws of the land is suspended.  This realm is controlled by the Forest Department (an immense bureaucracy with vast powers) and an army of forest guards that function like a paramilitary force.  The material basis of Adivasi life is being steadily undermined by restricting access to traditional foraging grounds and the banning of certain kinds of hunting and gathering. 

-------------------------

Even more insistently vitalist is the Native American movement of resistance which have long been based on an ethic that foregrounds the familial instinct to protect "all our relatives" -- that is to say, the entire spectrum of nonhuman kin, including rivers, mountains, animals and the spirits of the land. This approach is essentially spiritual or religious, yet it has been surprisingly effective. 

---------------------------

To everyone who is paying attention, especially young people, it is now perfectly clear that extractivist capitalism is on its last legs, its end foreordained by the withering of the very horizon on which its existence is predicted - the future.  When the future becomes radically uncertain, nothing works - insurance, share prices, credit, dividends, every money (which is, after all, a promissory note that someone must redeem). 

------------------------

Of enormous significance is the fact that the Catholic Church, under the influence of a pontiff who has taken his papal name from the most shamanic of Christian Saints, has significantly revised its doctrines in relation to the Earth.  Pope Francis speaks directly to more than a billion people and has already done more, perhaps, to awaken the world to the planetary crisis than any other person on Earth. 

----------------------------------------

Everyone must optimistically and continually do their part to promote the needed spiritual, ecological, and political changes.....  

The difference is that a vitalist mass movement, because it depends not on billionaires or technology, but on the proven resources of the human spirit, may actually be magical enough to change hearts and minds across the world.

-------------------------------------------

Much, if not most, of humanity today lives as colonialists once did - viewing the Earth as though it were an inert entity that exists primarily to be exploited and profited from, with the aid of technology and science.  Yet even the sciences are now struggling to keep pace with the hidden forces that are manifesting themselves in climatic events of unprecedented and uncanny violence.  


And as these events intensify they add ever greater resonance to voices that have stubbornly continued to insist, in the face of unrelenting, apocalyptic violence, that nonhumans can, do, and must speak.  It is essential now, as the prospect of planetary catastrophe comes ever closer, that those nonhuman voices be restored to our stories. 

---------------------------


నేనసలు ఈ పుస్తకం గురించి చెప్పాలనుకున్నదాన్లో పదిశాతం కూడా చెప్పలేకపోయాను. TEXT పెద్దదయిపోయి, చదివేవారికి విసుగొస్తుందని. దీనిని ఇంకెవరైనా సులువుగా రివ్యూ చెయ్యగలిగితే, ఇది ఎక్కువమందికి చేరితే చాలా ఆనందిస్తాను.

--------------------------

After reading how Navajo people in South America are systematically exterminated, by eliminating their hub of livelihood, by exposing them to disease and killing their livestock etc, recently, after the new movie "Oppenheimer",   I came across this Video:    ఇది ఎలా కంటిన్యూ అయిందో చూడండి. They were exposed to danger, without even caring for their life and future. 

 ---------------------------

ఇంకోటి.. Just nutmeg గురించి. 

******


03/07/2023

సముద్రపు పిల్లాడు - MSK Krishna Jyothi

 ఈ కథ - నాకు చాలా ఇష్టం అయిన పిల్లల కథ. ఒకరికి ఈ కథను చెప్పేందుకని రాసుకున్నాను.  ఇప్పుడు నా బ్లాగ్ చదివేవారికోసం ఇంకొక్కసారి. ఈ కథ నిజానికి ఎంతో depth, value ఉన్న కథ.. ఎంతో గుర్తింపు తెచ్చుకోవాల్సిన కథ. తెలుగు కథయిపోయి.. ఇలా మిగిలిపోయింది. 


సముద్రపు పిల్లాడు - MSK Krishna Jyothi


'చిన్నా' ఓ బెస్తవాళ్ళ గ్రామంలో ఉండే ,  మూడవ తరగతి చదివే చిన్న పిల్లవాడు. అతనికి స్కూల్ లో మిగతా పిల్లల కన్నా సముద్రం తోనే స్నేహం ఎక్కువ. వాడు చాలా చిన్నప్పుడు తల్లి అతనికి ఎండు చేప ముక్క ఓటి కాల్చి పెడుతుంది. వాడికి అది చాలా నచ్చేస్తుంది. ఇంకా కావాలని అడుగుతాడు. వాళ్ళ అమ్మ, పొట్ట నొప్పొస్తుందని తరవాత ఇస్తానమ్మా ఇప్పుడొద్దు అంటుంది. వెంటనే రోషం పుట్టి, జారిపోతున్న చెడ్డీని పైకి లాక్కుని సంద్రం వైపు నడుచుకుంటూ వచ్చేస్తాడు. తల్లి లబో దిబో మనుకుంటూ ఏడుస్తా పిల్లాడి కోసం వెళ్తుంది. 

అప్పటికి చిన్నా సముద్రంతో తన బాధ చెప్పుకుని కళ్ళలొంచీ, ముక్కులోంచీ నీళ్ళు కారుస్తూ ఏడ్చాడు. సముద్రం కూడా "ఓ" మని గోస చేస్తుంది. ఇంక నాలుగడుగులు వేస్తే వీడు సముద్రం లోకి వెళిపోతాడనగా  తీరంలో పిల్లలు కేకేసి వాడిని ఆపేస్తారు. వాళ్ళు వీడు చేప ముక్క కోసం ఏడుస్తున్నాడని తెలీకనే, వాళ్ళు అప్పుడు కాల్చుకుంటున్న చేప ని ఇస్తారు. అది చూసి చిన్నా చాలా ఆనందిస్తాడు. ఇంతలో అమ్మ వచ్చి చిన్నాని క్షేమంగా చూసి హమ్మయ్య అనుకుంటుంది. 


ఇంటికెళ్ళాక, బాగా ముద్దులు పెట్టి, ఇంకాసిని చేప ముక్కలు కాల్చి పళ్ళెంలో పెట్టి ఇచ్చింది. చిన్నాకి అది మొదలు, తను ఆ రోజు సముద్రం దగ్గరికి పోయి ఏడ్వడం వల్ల సముద్రమే తన కోరిక అలా తీర్చిందని -  నమ్మకం లా ఏర్పడిపోతుంది. అప్పటినిండీ ఏది కావలన్నా సముద్రానికి పోయి చెప్పుకుంటాడు. వాడికీ సముద్రానికీ మాత్రమే అర్ధమయ్యే ఒక భాష లాంటిది ఏర్పడుతుంది. ఏ కోరిక కలిగినా, సముద్రానికి చెప్పేసి, తరవాత ఇంటికొచ్చి అమ్మ కి చెప్తాడు. అమ్మ నానా తంటాలు పడి అతని కోరిక ని ఎలాగో తీరుస్తుంది. ఇంతకీ చిన్నా కోరికలు తన లానే చిన్నవి... సొరచేప తినాలనిపించడమో / ఎండు చేప ముక్క తినాలనిపించడమో - అలాంటివే!


కొంచెం పెద్దయ్యాక -  - కొద్దిరోజుల్లోనే ఒక కొక్కేనికి మెరుపు కాయితం చుట్టి తన చిన్న పొట్టకి తగినంత చిన్న స్థాయిలో చేపలు పట్టడం నేర్చుకుంటాడు.   కొన్ని రోజుల్లోనే పాపం వీడికి   ఇలా "చేప ముక్కలూ", "సొరచేప పిట్టు" లాంటివి కాకుండా ఒక పెద్ద అవసరం వస్తుంది.  ఓరోజు అప్పటికే చిరుగు కుట్లు ఉన్న  తన బీద స్కూలు బేగ్ కాస్తా పూర్తిగా చిరిగిపోయి, పుస్తకాలన్నీ  కింద పడిపోతాయి. పిన్నీసులు పెట్టినా, కుట్టినా సరి కానంతగా ఆ బేగ్ ఇక  చిరిగిపోయింది.  అమ్మకి చెప్తాడు కొత్త బేగ్ కావాలని. అమ్మ ఆ మాట విని భోరుమని ఏడ్చేసింది. 


ఇంతకు ముందు "నాన్న రానీ.. నాన్నొచ్చాక కొంటాను!"  అనేది. "నాన్నెప్పుడొస్తాడు" ?

 "సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే కాలమొచ్చినప్పుడు!".  

"ఆ కాలం ఎప్పుడొస్తుంది?"  అని ఎదురు చూసేవాడు.  చేపలు గుడ్లు పెట్టే కాలంలో వేటకి బోటుకి వెళ్ళిన బెస్తవాళ్ళంతా తీరానికి వచ్చి తమ ఇళ్ళల్లో గడిపేవారు. చిన్నా నాన్న కూడా పిల్లాడిని ఒక్క క్షణం వొదలకుండా ముద్దు చేసేవాడు. 

ఈ సారి మాత్రం చేపలు గుడ్లు పెట్టే కాలానికి అందరి నాన్నలు వచ్చినా చిన్నా నాన్న మాత్రం రాలేదు. అప్పటినించీ తల్లిని ఏమడిగినా ఏడుస్తుంది. పండక్కి ఏడ్చింది. మామ చిన్నాకిచ్చిన కొత్త చొక్కా పట్టుకుని ఏడ్చింది. చెప్పు తెగిపోయింది కొత్త చెప్పు కొనమంటే ఏడ్చింది. అమ్మ ఏడుస్తుందని పిల్లాడు ఈ మధ్య ఏమీ అడగడం లేదు అసలు. కానీ మర్చిపోయి కొత్త బేగ్ కావాలని అడిగీసేడు.  రేపు బడికి పుస్తకాలెలా తీస్కెళ్ళడమో తెలీలేదు. అమ్మ ఒక బియ్యం గోతం ఇచ్చింది. అది ఇంట్లోనే ఓ మూలకి విసిరి కొట్టి,  సముద్రం దగ్గరకి పరిగెత్తాడు. 


ఇసుకలో ఉత్తి కాళ్ళతో పరిగెత్తడం సులభం. చిన్నాకు చెప్పులు తెగిపోయి చాలా కాలమయింది. మళ్ళీ కొనలేదు.   చేతుల్లో బలం తెచ్చుకుని, బేగ్ ని సముద్రం లోకి దూరంగా విసిరేసాడు. "సముద్రంలోకి వేటకెళ్ళిన నాన్న ఇంకా రాలేదు కదా.. నాన్న ఈ సముద్రంలోనే వుండుండాలి. చేపలు గుడ్లు పెట్టే కాలం గడిచి చాలా కాలమైంది కదా. నాన్న ఇక రాకూడదూ!!"  అని బాధపడ్డాడు. వాడికి దుఃఖం వచ్చింది. వాడితో పాటూ సముద్రమూ ఏడిచింది. వాడు అలల్లోకి వెళ్ళిపోతున్న కొద్దీ, వెనక్కిపో అని వాడిని అలలు బెదిరించాయి. 

మరుసట్రోజు గోతాం సంచీ లో పుస్తకాలు పెట్టుకుని  బడికి తీస్కెళ్ళి చాలా అవమానపడతాడు. ఎలాగో ఆ రోజు గడిచాక, మరుసట్రోజు మామ దగ్గరికెళ్తానని తల్లి దగ్గర చిల్లర తీసుకుంటాడు.  ఎందుకంటే ఆ గోతాం తో బడికెళ్ళాలంటే సిగ్గు గా ఉంటుంది. బడికెళ్ళకుండా ఇంట్లో ఉంటే అమ్మ ఒప్పుకోదు. పైగా మామ తో మాటాడి, కొత్త బేగ్ కొనిపించుకోవాలి. 

మామ ఊరు దగ్గరే!  బస్సెక్కి చిన్నా మామ ఇంటికి చేరే సరికీ, అతను సముద్రం మీద వేటకు బైల్దేరుతూ ఉంటాడు. మామ చిన్నాని "వస్తావా?"  అనడిగితే, జీవితంలో మొట్ట మొదటి సారి చిన్నా బోటెక్కి సముద్రం మీదికెళ్తాడు. మొదట ఆ కుదుపులకి వికారం వస్తుంది. మెల్లగా సర్దుకుంటాడు. బోట్ల మీద బెస్త వాళ్ళంతా చేపల వలలు పన్ని పడుతుంటే అబ్బురంగా చూస్తాడు. వాడి ఆలోచనల్నిండా తన తండ్రే. నాన్న కూడా వీళ్ళలాగె ఇంతింత వలలు లాగేవాడా.. ఇన్నోటి చేపలు పట్టే వాడా అని అనుకుంటాడు.   

చిన్న వాడు  కాబట్టి వలలు లాగలేడు కాబట్టి, కొక్కెం తగిలించిన గేలం తో చిన్న చిన్న చేపలు పట్టుకుంటుంటాడు. చిన్నా మనసు నిండా నాన్నేగా! తను పెద్దవాళ్ళంత చేపలు పట్టలేదు గానీ, తను పట్టిన చేపలు పర్లేదు.   తన తండ్రి వాటిని చూసి సంతోషించేవాడా ? గర్వపడుండేవాడా?  ఈ కొద్ది చేపలు అమ్మితే వచ్చే డబ్బుతో తను స్వంతంగా, బేగు కొనుక్కోగలడా ?  .. ఇవే ఆలోచనలు!!

ఇంతలో ఒక పెద్ద చేప కొక్కేనికి చిక్కుతుంది. అది ఎంత బరువుగా ఉందంటే, ఆ బరువుకి పిల్లాడు ఎక్కడ సముద్రంలో పడిపోతాడో అని, దూరంగా ఉండి వీడి మీద కన్నేసిన మామ పరిగెత్తుకుంటూ సాయం వస్తాడు.  మామ సాయంతో గేలాన్ని లాగాక, ఆ పెద్ద చేపని చిన్నా రెండు చేతుల్తోనూ పట్టుకుని దాని వొళ్ళంతా మురిపెంగా తడుముతాడు.  అది గేలాన్నించీ తప్పించుకోవడానికి గాల్లోకి ఎగురుతోంది. పొగరుమోతు చేప. 

మామ బలంగా దాన్ని లాగుతున్నాడు.  చిన్నాకి ఏదో స్ఫురించి, ఒక రంపపు బ్లేడు తో గేలాన్ని కోసేస్తాడు. చేప మెరుపులా నీళ్ళలోకి వెళిపోతుంది. మామ విస్తుపోయి చూస్తే, "మామా, ఆ చేప పొట్ట లావుగా ఉంది. లోపల గుడ్లున్నాయి. దాన్ని మనం చంపేస్తే, గుడ్లు పెట్టే కాలం ఇక రానే రాదు. గుడ్లు పెట్టే కాలం వస్తేనే, నాన్నలు సముద్రం వొదిలి ఇంటికి వచ్చేది. బేగ్ లేకపొయినా పర్లేదు. గోతం సంచే పట్టికెళ్తాను" అన్నాడు. మామకి చిన్నా మాట్లాడేది ఒక్క ముక్క అర్ధం కాలేదు. 

ఇంతలో చిన్నా చేసిన మంచి పనికి మెచ్చుకుంటున్నట్టు, సముద్రమే మెల మెల్లగా నల్లని దూది మబ్బు ఐపోయి,  మేఘమై వర్షించి చిన్నాని ప్రేమగా తడిపేస్తుంటే, జాలర్లు బోట్లని వెనక్కి మళ్ళించి, ఒడ్డు దారి పట్టించారు.  సముద్రం మాత్రం చిన్నాతో "మనిద్దరం ఎప్పటికీ జతగా ఉందాం" అంటూ అలలు అలలుగా చిన్నాని తాకేందుకు ఆత్రంగా పైకి లేస్తూంది.  

***

నేను సరిగ్గా చెప్పానో లేదో ఈ కథని.  సముద్రం, జాలరి అయిన తన తండ్రిని కబళించినా, చిన్నాని మాత్రం కరుణతోనే చూస్తుందని అనుకోవడం లో ఒక విషాద రేఖ కనిపిస్తుంది. అమాయకుడు అయిన చిన్న పిల్లవాడి మంచి మనసుని చక్కగా చెప్తూ.. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా మనిషి కోల్పోకూడనిది మంచితనమే అని చెప్తుంది. అందుకే ఈ కథ నాకు చాలా ఇష్టం. ‌

01/07/2023

వెలుగు దారిలో - చెరుకూరి మురళీ కృష్ణ

This, was my Facebook post, which caught the attention of the Author Shri Muralikrishna. 


Posting few catchy things about the book and how the author can be reached for copies, by copy pasting his comment in my feed. Thank you.





నాకున్న కొంచెం టైమ్ లోనే ఏకబిగిన చదివించిన పుస్తకం ఇది. చెరుకూరి మురళీకృష్ణ గారు రాసిన ఒక అంధుని ఆత్మ కథ. 'భాస్కర్ పట్నాయక్' యుక్తవయసులో చూపు కోల్పోయిన వ్యక్తి. చిన్నతనం నుండీ చూపు కోల్పోతానని తెలిసి, తగ్గిపోతున్న కంటిచూపుతోనే చాలా ఇష్టం తో,  చాలా కష్టపడి తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ లో చదివి, చూపున్నన్నాళ్లూ వీలున్నంత ప్రపంచాన్ని,  ప్రకృతిని,   వెన్నెలనీ చూసి, చేతికందిన ప్రతీ కాగితమూ చదివేసిన అబ్బాయి. చూపు కోల్పోయాక మూడేళ్ల పాటు తీవ్రమైన డిప్రెషన్ లో కూరుకుపోయి, ఆ తరవాత కోలుకుని, అంధుల బడిలో చదువుకుని, దేశం లో మొదటి సారి బాంక్ లో ఉద్యోగం తెచ్చుకున్న అంధుడు. ఆయన జీవన పర్యంతం ఎదుర్కొన్న వివక్ష, అవనానాలు, ప్రోత్సాహం, చట్టం, పోరాటాలు. ఇంతే.  పుస్తకం లో నాకు చాలా నచ్చిన విషయాలు:-


1) కుటుంబం : ఒక వికలాంగునికి కుటుంబం ఎంత సహాయం, దన్ను ఇస్తుంది.. వాళ్ళ మధ్య బంధం ఎంత డీప్ గా ఉంటుందో.. అమ్మ, నాన్న, అన్నయ్యలు, అక్క, చెల్లెలు.. ఊర్లో బంధుమిత్రులు, కళ్లల్లో పెట్టుకుని చూసుకున్న జ్ఞాపకాలు.. మా గౌరాంగ అన్నయ్య.. నిరంజన్ అన్నయ్య అంటూ.. వారి చుట్టూ తన కృతజ్ఞతలు అల్లుతూ చెప్పిన స్వీయగాధ.  ముఖ్యంగా ఆయనకి‌ అండాదండా అయిపోయిన చెల్లెలికి !! 


2) పేర్లు : రచయిత ఎక్కడా తనకి మేలు చేసినవారి, సాయం చేసినవారి పేర్లు చెప్పారే తప్ప, తనని సాధించిన వారి పేర్లు బయట పెట్టలేదు. ఎలా ఎందుకు బాధపెట్టారో మాత్రమే చెప్పారు. ఇలా వేధించిన వారిలో కొందరు, తాము కేవలం అజ్ఞానం వల్ల అలా చేసామనీ, ఎవేర్ నెస్ వచ్చాక క్షమించమనడం వారి వారి గొప్పతనాలుగానే చెప్పారు. ముఖ్యంగా ఆయన అంధులు చెయ్యగలిగే పనులు గురించి, అంధుల హక్కుల గురించి తను పని చేసిన బాంకింగ్ రంగంలో అసాధారణ కృషి చేసారు. ఆయన వేసిన బాట ఆ తర్వాత ఎందరో ప్రతిభావంతులైన అంధుల ఉద్యోగజీవితాలని మెరుగుపరిచింది.


3) ప్రకృతి సౌందర్యం : ఒరిస్సా కోరాపుట్ లో జపనీయులు వేసిన రైలు మార్గాలు, వాటి వర్ణన!!!! అదీ ఓ తెల్లారుజామున మంచులో నడక ప్రయాణం, ఓ ఈదురుగాలుల వాన నాటి వర్ణన, లోయలో సెలయేరు, వంతెన, మృత్యువు, కొండల్లో చావుభయం.. ఆ ప్రకృతి శక్తి వర్ణన. ఓ గిరిజన గూడెం లో తుఫానులా చీకటిగా, చలిగా.. అది ఓ కాబోయే అంధుడు కళ్ళారా చూసి, గుండెల్లో దాచుకున్న  దృశ్యం.


4) వృత్తి : వికలాంగుల కోటాలో ఉద్యోగం వస్తే సరిపోదు.. ఇతనికి సమాన అవకాశాలు కావాలి!!  ప్రతిభ ని నిరూపించుకునే అవకాశాలు కావాలి! అతను చేయగలిగే పనినే చేస్తాడట. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అదీ ఇప్పిస్తే ఇంకా బాగా చేస్తాడంట! ఏమి గొంతెమ్మ కోరికలు?!! పదోన్నతి కావాల్ట.. పరీక్షలు రాస్తాట్ట. స్క్రైబు కావాలి..  పదిహేను నిముషాలు ఎక్కువ సమయం ఇవ్వాలట!  బదిలీ కావాలట!!  ఇలాంటి సూటిపోటి మాటలు, వేధింపులు,    కనీస హక్కు అనుకునే ప్రతీదీ..  ఇలా ప్రతీదీ అగ్నిగుండం!!  ఇవన్నీ దాటుకుంటే గానీ  ఉద్యగజీవితం వెళ్ళలేదు. దీనిలో సహకరించిన ప్రభుత్వ ఏజెన్సీలు, మంచి అధికారులు.. మొత్తానికి ఈయన వేసిన ఈ ముందడుగు "మార్గదర్శకాలు" మార్చడానికి,  లేదా అవంటూ ఉన్నాయని వ్యవస్థ కు తెలిసే మార్పు కు,  దారితీయడం. 


5) పోరాట తత్వము : ఊరికే హక్కనీ, ఆత్మాభిమానం అనీ మాటాడే మనిషికి బ్రతుకు చాలా కష్టం. కానీ ఇక్కడ పోటాడకుండా మూల కూచుంటే అస్తిత్వమే ఉండని పరిస్థితి వీరిది. అప్పటికే లోకం బెదిరిస్తుంది. పరిస్తితులు వికటిస్తాయి.  వెక్కిరింతలకీ, వేధింపులకీ భయపడి, తమ రాత ఇంతే అని వెనుదిరిగి రాజీపడితే ఇంకా ఇంకా కిందికి అణగదొక్కేస్తుంది. చాలాసార్లు ఒంటరి పోరాటం చెయ్యాల్సొస్తుంది.  మన మేలు కోరేవారు కూడా, మన బాధ చూళ్ళేక "ఎందుకులెద్దూ!" అని అనేస్తారు. కొన్నిసార్లు పట్టు విడుపులూ‌ ఉండాలి. అయినా లోపలున్న ధైర్యం కోల్పోకుండా పోరాడుతూ ఉండాలి. మార్పు అకస్మాత్తుగా రాకపోయినా కదలిక అయితే వస్తుంది. 


6) మాట సాయం / guidance : ఇది చాలా inspiring కథనం. పని ప్రదేశం లో వికలాంగుల  హక్కుల గురించి బాగా తెలుసుకోవచ్చు.  అలాగే వందశాతం వైకల్యం ఉన్న ఆటిజం వంటి సమస్యలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు కూడా అధికారుల / వ్యవస్థ ల దుర్మార్గమయిన పాలసీల వల్ల ఉద్యోగాలలో, బదిలీలలో ఎదుర్కొనే సమస్యల గురించి కూడా ఈ పుస్తకం లో చదవొచ్చు. ఈ కేస్ ని చదివిన వాళ్ళలో ఇలాంటి విధానాలు అమలుచేసే/ రూపొందించే ఉద్యోగులు ఉంటే.. కొంత perspective వస్తుంది వాళ్ళకి. మనిషి, సాటి మనిషికి సాయం చెయ్యగలగడాన్ని ఏ కఠినాత్మకత అడ్డుకుంటుందో కదా. దానికి తోడు ఈ లోపాలు ఉండటం నేరమా?  చాలాసార్లు అది మానసిక శారీరక వికలాంగుల పట్ల ఉన్న చిన్నచూపు వల్ల అని తెలుస్తూ ఉంటుంది. తమదాకా వస్తే గానీ ఎవరికీ ఏమీ పట్టదు.  ఈయన తన లాంటి ఎందరికో చట్టాల గురించి చెపుతూ, వివిధ కేసుల్లో సహాయం చేసారు. 


7) చట్టాల లోనో, విధానాలలోనో ఉన్న అస్పష్టత వల్ల ఇంకా జనానికి తెలీని ఎన్నో మంచి విషయాలు, దానివల్ల అవమానాలు, అనుమానాలూ రోజువారీ వ్యవహారాలు కావడమూ, ‌తమకున్న వికలాంగత్వం వల్ల సమాజం దౌర్జన్యం చెయ్యడానికి వెనకాడకపోవడం, పదే పదే తమ వికలాంగతని నిరూపించుకునేందుకు ధృవపత్రాలు అవసరం పడటం, వాటికోసం రకరకాల ఆఫీసులకి వెళ్ళాల్సి రావడం,  తమకోసం పనిచెయ్యడాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సైతం "చారిటీ' గా భావించడం, ఆ ప్రభుత్వాన్ని కూడా కొందరు నకిలీ ధృవపత్రాలతో మోసం చెయ్యడం .. ఇలా .. Practical difficulties ని వివరంగా రాయడం


8) సంస్థలు : కొన్ని ప్రభుత్వ సంస్థలు,  వాటిలో మంచి వ్యక్తులు,   తాడికొండ లో లెక్కల మేస్టారు, కొన్ని స్వచ్చంద సంస్థలు, కొందరు అద్భుతమైన మనసున్న మనుషులు, వారు చేసిన సేవలు, నిలబెట్టిన జీవితాలు. కొన్ని సేవ లోనే సేద తీరిన దివ్య ఆత్మలు.. ఇవి, శూన్యం అనుకున్న జీవితాల్ని వెలిగించడం!!  Kindness చాలా చాలా గొప్ప విషయం.  పిసరంత ఆ దివ్య లక్షణం ఉంటే మానవ జీవితం ఎప్పుడూ గొప్పదే అవుతుంది.   అదేవిధంగా ధైర్యం, అంగీకారం ! ఇవీ ఉండాలి ప్రతీ ఒక్కరిలోనూ. 


ఇంకా చాలా ఉంది. కానీ ఎప్పుడైనా రాస్తాను. ఇది భాస్కర్ పట్నాయక్ గారినీ, మురళీకృష్ణ గారినీ అభినందించడానికి! What an incredible story!!  థాంక్యూ.


**********

రచయిత వ్యాఖ్య:

ఈ పుస్తకం మేమే పబ్లిష్ చేసాము. స్టోర్స్ లో దొరకదు. మీరు 8008001356 కి అడ్రస్ పంపి ₹250.00 googlepay చేస్తే నేను పుస్తకాన్ని వెంటనే పంపిస్తాను.


రచయితగా నా parichayam:


నేను ఆంధ్రప్రదేశ్ బ్యాంకు లో చీఫ్ మేనేజర్ గా చేసి 2020 లో పదవి విరమణ చేసాను. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. నేను భాస్కర్ పట్నాయక్ చిన్నప్పటి నుంచి స్నేహితులం. అతనితో కలిసి చదువుకున్నాను.


నేను రచనా వ్యాసంగం మొదలుపెట్టి ప్రతిలిపి లో ( c.murali.krishna) profile తో పోస్ట్ చేస్తున్నాను. అతని జీవితం గురించి రాసినప్పుడు ఎక్కువ మందికి అది స్ఫూర్తిదాయకం అవాలన్న కోరికతో నేనే దానిని పబ్లిష్ చేసాను. మీరు ఆ పుస్తకాన్ని చదవడమే కాకుండా దివ్యంగులయిన పిల్లలకి కానీ వారి తల్లిదండ్రులకి కానీ బహుమతిగా ఇవ్వమని కోరుతున్నాను. నేను ఎన్నో పబ్లిక్ లైబ్రరీ లకి కొన్ని పుస్తకాలు ఇచ్చాను. ప్రస్తుతం ఈ పుస్తకం యొక్క ఆంగ్లనువాదం సిద్ధం చేస్తున్నాము. దానిని ఎవరన్నా పబ్లిషర్ కి ఇచ్చి ప్రింట్ చెయ్యాలని మా ఆకాంక్ష. మీ ప్రోత్సాహం కోరుతూ

 - మురళి కృష్ణ


News about one such fighter :


https://www.eenadu.net/telugu-news/india/sumit-who-was-born-blind-got-government-job/0700/123121572