Pages

02/07/2024

Whereabouts - Jhumpa Lahiri

ఈమధ్య గ్రీస్ లో సముద్రతీరం వెంబడి అడవుల్లో కార్చిచ్చును ఆర్పేందుకు ఫైర్ ఫైటింగ్ విమానం నీళ్ళు కుమ్మరిస్తున్న ఫోటో ఒకటి పేపర్లో చూసాను. నీలం రంగు సముద్రం, పొగ రంగు ఆకాశం, వాటి విశాల విస్తృతి ముందు పిపీలికం లాంటి విమానం.. ఆ ఫోటో నన్ను వేర్ ఎబౌట్స్ లో పేరు తెలీని నగరానికి తీసుకెళిపోయింది. 

ఝుంపాలాహిరి ఇటాలియన్ లో రాసిన రెండో నవల, ఇది కూడా పదేళ్ళ క్రితంది, ఆవిడే స్వయంగా ఇంగ్లీష్ లోకి అనువదించిన నవల. ఏ పాత్రలకీ పేర్లుండవు, కథ జరిగే నగరానికీ, వీధులకీ, షాపులకూ వేటికీ, పేరుండదు. ఏ పరిస్థితికీ, ఏ బంధానికీ ప్రత్యేకమైన వివరణా ఉండదు. ఇది మీదీ, నాదీ కూడా ఒక అనుభవం అయుండొచ్చు, ఒక విశాల ప్రపంచంలో మన ఉనికి ఏమాత్రం? అంత వేదాంతపరంగా కాకపోయినా, రెలిటివ్ గా కూడా మనం ఎంత? మనం వదిలి వెళ్ళే జాడలు ఏపాటివి ? ఒక సామాన్య జీవితం ఎలా వుంటుంది ? అందులోనూ ఒంటరి జీవితం ? పెళ్ళీ, పిల్లలూ లేని నలభయిల్లో ఉన్న  ఇంట్రావర్ట్ మహిళ  జీవితం ? 

పరిస్థితుల కారణంగా, మనసు బాలేకో, తీరిక లేకో, చదవడానికి దూరమైపోతున్నప్పుడు ఇలాంటి పుస్తకం చదివితే, జీవితం కళ్ళ ముందు పరుచుకున్నట్టుంటుంది. ముఖ్యంగా తేలికయిన కథ, కాంప్లెక్స్ మెరుపులు లేని మామూలు జీవితం గురించి, అర్ధమయ్యే భాష లో కథ. 

హీరోయిన్ కి పేరుండదు. తల్లీ తండ్రీ వేర్వేరు వ్యక్తిత్వాలున్నవాళ్ళు. తండ్రి కొంచెం పలాయనవాది. తల్లి మరీ పెర్ఫెక్షనిస్టు.. లేదా మాట చెల్లించుకునే రకం - మధ్య వయసు, హార్మోన్లు, అతి జడ్జ్మెంటల్ ప్రవర్తన, ఇవన్నీ చిన్నతనపు జ్ఞాపకాలు. తల్లి విపరీతమైన డిసిప్లిన్ (తన దృష్టిలో) తో చిన్నపిల్లని సాధించేస్తున్నపుడు, తండ్రి ఆదుకోడు. పిల్లకి రక్షణగా నిలవాల్సింది పోయి, భార్యని ఎదుర్కోలేక, ఆవిడ గయ్యాళితనాన్ని తను మాత్రం భరిస్తూనో, భరించలేకపోతే, ఆ రూం నుండీ తప్పుకునో వెళిపోయేవాడు. ఈ పిల్ల, తల్లి గయ్యాళితనాన్ని తట్టుకుని పెరిగి పెద్దవుతుంది. ఎందుకనో పెళ్ళి చేసుకోదు. 

తండ్రి కి థియేటర్ ఇష్టం. మధ్యతరగతి పెంపకం, డబ్బు విలువైనది. తండ్రి కూడా జాగ్రత్తపరుడే కానీ, అతనికున్న ఒకే ఒక రసాస్వాదన, జీవితపు రుచి తెలిపే అభిరుచి, తన మీద తాను ఖర్చుపెట్టుకునే లక్సరీ - సాహిత్యం, థియేటర్. తనకిష్టమైన మూల కుర్చీలో కూర్చుని, నాటక ప్రపంచంలో మునిగిపోయే ప్రేక్షకుడు. కూతురికి కూడా కళలు ఇష్టమే. తండ్రి చిన్నవయసులోనే మరణిస్తాడు. ఇక తల్లి తెంపరి తనంతోనే "ప్రేమ తక్కువ" జీవితం గడిపి పెద్దదయి, ప్రయోజకురాలవుతుంది. తల్లి మీద చిన్న విరక్తి. అయినా ముసలామెను అపుడప్పుడూ కలుసుకోవడానికి వెళ్తూంటుంది. 

పుట్టి, పెరిగిన సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఊరు. మిత్రులు ఎక్కువే. వాళ్ళలో స్త్రీలు, పురుషులూ.. ఇద్దరూ.  నలభయి ఏళ్ళ అవివాహిత, తన కాళ్ళ మీద తాను నిలబడి, రోజు ముగిసి ఇంటికొచ్చాక, తననుకున్న విధంగా జీవిస్తుండే మహిళ కి ఏ అనుభవాలుంటాయి ? ఇష్టముంటే వంట, లేకపోతే దగ్గరలోని కఫే లోంచీ తెచ్చుకున్న ఆహారం. తన మగ స్నేహితులు ఎంత మంచివారంటే, తన తో పాటూ ఎక్కడికైనా కేజువల్ షాపింగ్ కు రాగలరు. ఒకసారి వీధిలో కలిసిన మగ స్నేహితునితో స్టాకింగ్స్ కొనుక్కోవడానికి వెళ్తుంది. అతను సెలెక్షన్ లో హెల్ప్ చేస్తాడు కూడా. 

అతను కాస్త క్లోస్. అతని భార్యా, పిల్లలూ - కూడా. అతనికి ఆమె అంటే అభిమానం. ఏ ఎమర్జెన్సీ అయినా ఈమెకు ఇంటి తాళం ఇచ్చి కుక్క బాధ్యత చూసుకోమని చెప్పగలిగేంత చనువు. ఆమెకూ అతనంటే అభిమానమే. అది ఆమెను చీల్చేస్తుంటుంది. కానీ దానిలో స్పష్టత కూడా ఉంటుంది. గ్రాసరీ షాప్ లో అనుకోకుండా ఎదురయి, పిల్లలవాడు కాబట్టి, ఆమెకు రెట్టింపుగా సామాన్లు కొనుక్కుని, ఒంటరి మహిళ కాబట్టి అంత సామాన్లు కొనని ఆమెను చూసి దిగులు చెంది, ఆమెను డ్రాప్ చేసేటప్పుడు - 'చూడు, నా గ్రాసరీ కాస్త తీసుకో, నీకు నెలరోజులు వస్తుంది. ఎందుకైనా మంచింది, స్టాక్ చేసి పెట్టుకో, మరీ అంత తక్కువ కొనుక్కున్నావూ ' - అని ఆఫర్ చేయగల అభిమానం వుంది అతని మనసులో. ఆ అభిమానం చాలు తనకు. సామాన్లేమీ తీసుకోదు. 

ఎపుడైనా తనలో ప్రశాంతతని చూసి తనకే ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఆ వయసులో తన తల్లి ఎంత భీతావహంగా,  కంట్రోలింగ్ గా ప్రవర్తించేదో, గుర్తు తనకు.  ప్రతి పైసా కీ లెక్కడిగేది, ప్రతి చేష్టకీ వివరణ అడిగేది. బాల్యం అంతా భయంభయంగానే, టీనేజ్ కూడా బెదురుగానే. ఇప్పుడు ఏదో స్వేచ్చ, తనకి కావల్సినవి కొనుక్కోగలిగే స్వేచ్చ, కావల్సిన చోటుకు వెళ్ళగలిగే స్వేచ్చ, ఆర్ధిక స్వేచ్చ, ఎమోషనల్ స్వేచ్చ.

ఒంటరి మహిళే అయినా ప్రేమ అంటే తెలియనిదేమీ కాదు తను. ఒక పెళ్ళయిన వాడితో కొన్నాళ్ళు ఒక ఫ్లింగ్ - అతను ఈమెను విపరీతంగా వెంటాడి, ఫ్లర్ట్ చేసి, తన వైపు తిప్పుకోవడం, అతనితో కలిసి భోజనానికి అని, లాంగ్ డ్రైవ్ లకు అనీ వెళ్ళడం, ఎవరైనా చూస్తారేమో అని అతను బెదురుతూ, ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు తీసుకెళ్ళడం, ప్రాక్టికల్ గా పెద్ద గా కుదరకపోవడంతో నిలిచిన ఒక అనుభవం. ఒక చిన్న పరిచయం.. 

ఎన్నాళ్ళకో కలిసిన స్నేహితురాలు, నీడ లాంటి భర్త తో ఇంటికి వస్తుంది. అతనూ రచయితే అంట. ఆమె ఇంట షెల్ఫుల్లో నిండిన పుస్తకాలని పరిశీలించి, తను ఇష్టపడే కవి పుస్తకం తీసుకుని, ఆమె ముఖానే, వీడిని నేను అస్సలు భరించలేను అని క్రాస్ గా మాటాడే తలపొగరు మేథావి. తన స్నేహితురాలు బాత్రూం కు వెళ్ళినపుడు, చాలా తేలికగా, ఆమెను తను అయిదు నిముషాల ముందే విమర్శించిన ఆ కవి పుస్తకం అరువు ఇమ్మని అడుగుతాడు. ఆమె నిర్మొహమాటంగా ఇవ్వనని చెప్పేస్తుంది. అతను ఏమనుకుని ఉంటాడు ? మనసులో తిట్టుకుని ఉంటాడు. స్నేహితురాలు బాత్రూం నుండీ వచ్చాక, ఆమె గ్రీన్ కళ్ళలో కాలేజీ రోజుల్నాటి మెరుపు లేకపోవడం స్పష్టంగా తెలుస్తుంది. ఆ నీడ, ఆ నెగెటివ్ మనిషి - ఆ భర్త ని ఆ మెరుపు ఎంత భయపెట్టి ఉంటుందో, ఆ మెరుపుకు వ్యతిరేకంగా తన శక్తి యుక్తులన్నిటినీ కేంద్రీకరించి, ఆమె మనసును తన "ఫ్రీక్" నాలుకతో రోజూ కోస్తూ ఉండుంటాడు ఇన్నాళ్ళూ అనుకుంటుంది. 

డబ్బు జాగ్రత్త తనకి తల్లిదండ్రుల నుంచీ వచ్చింది. చిల్లర నాణేలు మంచం కిందికి తోసేసాడని తన మొదటి బాయ్ ఫ్రెండ్ ని వదిలేస్తుంది. తన స్నేహితులు కూడా బాధ్యత గా ప్రవర్తించేవారే. అన్ ప్రొఫెషనల్, కష్టపడని, పైలాపచ్చీసు మనిషికి తన జీవితంలో పెద్ద చోటుండదు. ప్రొఫెషనల్ గా, తన వృత్తిలో ఎదురయిన విచిత్రమైన మనుషుల నుండీ, రోజువారీ జీవితంలోని పచారీ కొట్టు మనిషి వరకూ, రైలు కదిలిపోతున్నప్పుడు తన కాఫీ డబ్బులు తీసుకోకుండా ఆమెను రైలెక్కమని హెచ్చరించిన రైల్ స్టేషన్లో కాఫీ షాపు నడిపే దంపతుల నుంచీ, ఒక ప్రొఫెషనల్ ట్రిప్ లో హోటల్ లో, తానుండే అంతస్థు లోనే దిగిన ఇంకో పేరెన్నికగన్న ప్రొఫెసర్ కళ్ళలో కరుణ వరకూ - అన్నీ ఆమెకు చెప్పుకోదగ్గ విశేషాలే.  ఇలా  ఒక హాస్పిటల్ విజిట్ లో తనలాగే ఒంటరిగా వచ్చిన ఇంకొక మహిళని చూసి, తన భవిష్యత్తునీ, ఒంటరి వృద్ధాప్యాన్నీ తలచుకుని భయపడిన సంగతి గురించీ - దాదాపు చాలా విషయాల్ని కవర్ చేస్తుంది రచయిత్రి. 

రకరకాల మనుషులు, కరుణ తో ప్రవర్తించే వారు, పిచ్చి మనుషులు, తను వెర్రిగా ఊరికే అభిమానించే నెయిల్ ఆర్ట్ అమ్మాయి, ఒక పార్టీలో విసిగించేసిన ఇంకో అమ్మాయి.. ఇలా ఎందరో మనం కలిసే మనుషుల్లాంటి వాళ్ళే. వీటన్నిటి మధ్యలో జీవితపు సౌందర్యాన్ని చూడగలగడమే ఈ పుస్తకం ప్రత్యేకత. 

ఒంటరితనం శాపమూ, వరమూ కూడా. తల్లిని కలుసుకోవడానికెళ్ళినపుడల్లా, ఆమె తన కేర్ టేకర్ గురించో, తన ఆరోగ్యం గురించో చెప్పే ఫిర్యాదుల్ని ఏదో వినాలి కాబట్టి విని, ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి, వచ్చేస్తూ ఉండే తనకి ఊరి ని వొదిలి పక్క దేశంలో మంచి ఉద్యోగం రావడంతో వెళ్ళాల్సిన అవకాశం వస్తుంది. స్నేహితులు ప్రోత్సహిస్తారు. ఇల్లు ఖాళీ చెయ్యడం, శుభ్రం చెయ్యడం, వీడ్కోలు చెప్పాల్సిన వారికి చెప్పడం, ముఖ్యంగా తల్లికి ఇష్టమైన బిస్కెట్ టిన్ను ని ఇచ్చి, కొత్త సంవత్సరం సెలవుల్లో వీడ్కోలు చెప్పాల్సి రావడం, అప్పటివరకూ మొనాటనస్ గా అనిపించిన వీధులూ, రోడ్లూ, తనెప్పుడూ పట్టించుకోని మనుషులూ, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అందరూ ఆ ఆఖరి రోజు అభిమానంగా అనిపించడం.. ఇవన్నీ. ఒంటరిగానే, మధ్యవయసులో కొత్త మార్పుని ఆహ్వానించాల్సి రావడం, దానికి శ్రమించడం, కొత్త ఉదయం వైపు చూస్తూ నిల్చోవడం - దీనిలోనే ఆమెకు తన "వేరెబౌట్స్" తెలుస్తాయి. ప్రపంచంలో, తన చిన్ని విశ్వం లో తన స్థానం ఏమిటో తెలుస్తుంది. 

ఇంతమంది స్నేహితులు, శ్రేయోభిలాషులూ, (అసమర్ధ) తండ్రి తాలూకూ నిస్సహాయత, ప్రేమ, ఎప్పుడూ సణుగుతూ ఉండే తల్లి కి కూడా ఏవో బాధలు/భయాలు ఉండే ఉంటాయన్న స్పృహ, కల్మషాలేవీ లేకుండా తనని అభిమానించే ఆ స్నేహితుడు, వీళ్ళందరూ తన నిరంతర చలనంలో (ప్రయాణం) ఒక భాగం అని అర్ధమవుతుంది. మనం ఈ ఎపిసోడ్స్ లో ఎక్కడో ఒక చోట మనల్ని చూసుకుంటాం. ఇందులో ఉన్న పాత్రలలో కనీసం ఒకరైనా మన జీవితాలలో ఉండుంటారు. అందరూ ఏవేవో స్వీయ పోరాటాల్లో మునిగి తేలుతూ, ఒకడుగు మనవైపు వేసి ఓ స్నేహహస్తం ఇచ్చే ఉంటారు. వీళ్ళందరిలోనే మన జీవితం, వీళ్ళతోనే మన ఉనికి. అందుకే ఈ పిచ్చి చిన్న పుస్తకం నాకు నచ్చింది. 

కొన్ని విశేషాలున్నాయి ఈ పుస్తకానికి. దీనిని తేలిగ్గా, హాయిగా చదివించగలిగిన టైప్ ఫేస్ కి, బుక్ డిసైన్ చేసిన వారికీ గుర్తింపుకోసం ఒక నోట్ ఉంది చివరిలో. చాలా నార్మల్ గా అనిపించాల్సిన ఈ నోట్ కూడా ఎందుకో హృదయాన్ని తాకుతుంది!  అప్పటికి మన హృదయం కూడా కాస్తయినా ద్రవించి ఉండడం వల్లనేమో! అదే రచయిత్రి లక్ష్యం కూడా కద.

***
I flee, after a moment, terrified, from the great flame to the shadows; I fear the flame will consume me, that it will seize me and reduce me to an element even less signficant on this earth, a worm or a plant, I cant think straight, everything seems futile, life itself seems extremely simple. I dont care if nobody thinks of me anymore, if hardly anyone writes to me. (ఒక సూర్యోదయం చూసాక ఇంకో గొప్ప రచయిత ని కోట్ చేస్తూ ..)

17/06/2024

The Hungry Tide - Amitav Ghosh



ఒక వేళ అమితవ్ ఘోష్ ని చారు కాచడం మీద పుస్తకం రాయమంటే, చారు, దాని మూలాలు, దానిలో వాడే పదార్ధాల మూలాలు, వాటి చరిత్ర, అవి ఈ భూమి మీద, నీ తుచ్చ శరీరం మీదా, భవిష్యత్తరాల మీద వేయబోయే ఇంపాక్ట్, అన్నిటినీ ఒక నాలొగొందల పేజీల పుస్తకం రాసి, జీవితంలో చారు అంటే విరక్తి చెందేలా చేస్తాడనీ,  however,  చివరికి ఆఖర్లో చారు లేకపోతే బ్రతకలేం అనే స్పృహని కలిగించి, పాఠకుల్ని వంటింటి వైపు లాక్కునెళ్తాడనీ, ఫ్రెండ్స్ జోకులు వేసుకునేవాళ్ళు.  అలాంటి అనుభవమే ఇస్తుంది ఈ  పుస్తకం, ఘోష్ నాలుగో పుస్తకం. బొత్తిగా అమ్మాయిలు రాసిన రొమాన్స్ లా వుంటుంది. కాకపోతే, ఎప్పట్లాగే మానవత్వమూ, మనిషికి సాటి మనుషుల పట్లా, చుట్టూ ఉన్న ప్రకృతి పట్లా ఉండితీరాల్సిన ప్రేమ గురించి ఆంత్రోపాలజిస్టిక్ చూపుతో రాసిన పుస్తకం కాబట్టి  చెప్పుకోవాలి. 


దేశసరిహద్దులకు ఇరుపక్కలా ఉన్న బెంగాలు లో, మన దేశానికున్న తూర్పుతీరాన, సముద్రానికీ, నదులకూ మధ్య విస్తరించిన అతి పెద్ద చిన్ని చిన్ని ద్వీపాల సముదాయం సుందర్బన్ ప్రాంతం. ఈ చిన్నవీ పెద్దవీ ద్వీపాలు రోజువారీ సముద్రపు ఆటుపోట్లకు తరచుగా మారుతుండే లాండ్ స్కేపు లతో, భయంకరమైన పురుగూ పుట్రా, రాయల్ బెంగాల్ టైగర్లు, మొసళ్ళు లాంటి జీవులతో నిండి వుండి, దాదాపు మానవావాసానికి పనికి రాకుండా ఉన్నా కూడా, మనుషులు ఈ దీవుల్లో నివసించారు.   కొన్ని నివాసయోగ్యమైన ఒకటీ అరా   దీవులకి పశ్చిమ బెంగాల్ నుండి కొద్దో గొప్పో కనెక్టివిటీ ఉన్నా, అతి రిమోట్ దీవులు, కేవలం పడవల మీద ఆధారపడేవి కోకొల్లలు. పంటలు పండని ఉప్పు నేల. వంట చెరకుకోసం అడవిలోకెళ్తే ఏ పులో పట్టుకుపోయేది. చేపలు జీవనాధారం. ఉప్పు గాలి, పోటొస్తే ముంచెత్తే నీళ్ళు, వరదలు, విధ్వంసం, బీదరికం, నిరక్షరాశ్యత అక్కడి జీవన విధానం. 

ఇలాంటి సుందర్బన్ లను ప్రధానంగా ఒక విషయంగా తీసుకుని రాసిన నవల ఇది. ఈ సుందరమైన (నిజంగానే అత్భుత ప్రకృతి సౌందర్యం ఈ నీటి  గ్రామాల సొంతం) అభివృద్ధికి నోచుకోని ప్రాంతం, ఎన్నో వైవిధ్యమైన జీవరాసులకు ఆలవాలం.  బెంగాల్ లో బ్రిటీష్ వారి రాజ్యం నడుస్తున్నపుడు జనం లేని ఈ కీకారణ్యాలలో ఉచితంగా భూమిని ఇస్తామని చెప్పి ఎందరో నిర్భాగ్యులను ఈ ప్రాంతాలవైపు ఆకర్షించారు. బీహారు, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలనుండీ, కడు బీదలు కట్టు బట్టలతో ఈ చిత్తడి నేలలకు వ్యవసాయం చేసుకుందామని ఆశతో తరలి వచ్చారు.  అదృష్టం బావుంటే కొంత వరి పండే ఆ భూమికి చేరేసరికి, వాళ్ళలో సగం మంది ఆ నేల పై  ఎదురయ్యే ప్రమాదాలకే బలయ్యారు. కొందరు రాజకీయాలకు బలయ్యారు. మిగిలిన వాళ్ళు ఎలాగో ఎదుగూ బొదుగూ లేని జీవితానికి అలవాటు పడ్డారు. 


అలాంటి సుందర్ బన్  జీవ వైవిధ్యానికి పేరెన్నిక కన్నది. ఇక్కడి ఇరవాడి డాల్ఫిన్ ల గురించి పరిశోధనలు చేయడానికి పియా అనే cetologist, సుందర్బన్ లోకి అడుగుపెడుతుంది. అక్కడి స్థానికులు రెండు దేశాల మధ్య సంధి ప్రాంతానికి చెందినవాళ్ళు. అక్కడి రాజ్యం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే. అవినీతి, అరాచకం కమ్ముకుపోయిన ప్రాంతం అది. అలాంటి ప్రాంతానికి ఒంటరిగా వచ్చేందుకు పియాలీ అనే ఈ బెంగాలీ మూలాలు ఉన్న అమెరికన్ మెరీన్ బయాలజిస్ట్/cetologist సిద్ధపడడం ఇక్కడి స్థానిక సమాచారం లేకున్నా, భాష రాకున్నా ఏదో ఆవేశంతో దూసుకు పోవడం,  ప్రధానంగా ఉంటుంది.  ఈ పిల్ల రాకతో కరెస్పాండ్ అవుతూ, ట్రాన్స్లేటర్, రచయితా అయిన కనాయ్ కూడా సుందర్బన్ లలో లూసీబరీ అనే దీవికి వస్తాడు. అతను కోల్కతా వాసి అయినా, అతని అంకుల్, ఆంట్ లు లూసీబరీ లో స్కూలు నడుపుతూ అక్కడే స్థిరపడడం వల్ల, వాళ్ళని కలిసేందుకు  కనాయ్ చిన్నతనంలో కొన్నిసార్లు లూసీబరీ రావడం వల్ల, అతనికి అక్కడి వాళ్ళతో కాస్తో కూస్తో పరిచయాలుంటాయి. అయినా ఎన్నో ఏళ్ళ తరవాత అతను లూసీబరీ కి ఆంటీ కోరిక మీద వస్తాడు. వీళ్ళిద్దరూ రైల్లో కలిసి, పరిచయం ఏర్పరుచుకుంటారు.


ఇప్పుడు కనాయ్ చిన్నప్పటికీ, కథాకాలానికీ ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. లూసీబరీ నిజానికి ఒక ఇంగ్లీషు దొర తన భార్య లూసీ కోసం, పేరు లేని ఆ కొత్త దీవిలో నిర్మించిన ఇల్లు.  ఆవిడ ని ఈ ఆటుపోట్ల సముద్ర నదీ సంగమ ద్వారంలోకి పడవలో తీసుకొస్తున్నపుడు ఆ పడవ మునిగి పాపం మరణించింది. అయితే, ఆమె జ్ఞాపకార్ధం ఆ ఇంటినీ, ఆ దీవినీ కూడా స్థానికులు లూసీబరీ అనే పిలవడం మొదలయింది. అలాంటి లూసీబరీ లో కనాయ్ ఆంటీ, అంకుల్ లు వుంటారు. వాళ్ళకి పిల్లల్లేరు. వాళ్ళు బెంగాల్ లో విప్లవం వర్ధిల్లిన రోజుల్లో కమ్యూనిజం వంటబట్టించుకున్నా, అనారోగ్య సమస్యల వల్ల విప్లవాన్ని వదిలి, జనంకోసం జీవించే ముని దంపతుల్లా మిగిలిపోయి, అప్పటికి చదువూ, సంధ్యా, హాస్పత్రులూ లేని ఆ దీవికి తమంతట తామే వచ్చి, ఆ ఇల్లు కొనుక్కుని, జనానికి సేవలు చేస్తూ స్థిరపడతారు. 


వీళ్ళ ప్రయాణంలో ఎందరో దీవి జనాలు తారసపడతారు. శుద్ధ పల్లె అమాయకత్వం, అవిద్యా, నిస్సహాయుల్ని చేసే బీదరికం, పులుల వల్ల కుటుంబ పెద్దలు మరణించడంతో వీధిన పడిన కుటుంబాలు, ఒంటరైపోయిన ఆడవాళ్ళూ, వాళ్ళని దళార్లు పని ఆశ పెట్టి కలకత్తా తీసుకెళ్ళి కామాటిపూరా లో వేశ్యలు గా అమ్మేయడం - సర్వ సాధారణం.  కనాయ్ బంధువులు అక్కడి సామాజిక రాజకీయ బీదరికాల్లో, తమ సొంత ఆస్తులతో ఇలా అవసరం ఉన్నవాళ్ళకు దన్నుగా నిలవడం, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ఉన్న వాళ్ళకు అవి అందేలా చూడడం, మెయిన్ లాండ్ నుండీ అధికారన్నవాడు తొంగిచూడని ద్వీపాలలో అడపా దడపా అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి, ఆడవాళ్ళని ఆదుకోవడం, చదువు చెప్పడం, చిన్న చిన్న నర్సింగ్ పనులు నేర్పడం లాంటివి చేస్తుంటారు.  విధవలు, నిస్సహాయులయిన ఆడవారి తో స్వయం సహాయక సంఘాల వంటివి నడుపుతుంటారు.


పియాలీ పరిశోధనల కోసం కథా ప్రారంభంలో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన లాంచ్ ఎక్కి నీళ్ళమధ్యకు ప్రయాణం చేస్తుంది. ఆమెకు అప్పటికే, రక రకాల ఏషియన్ దేశాలలో ఈ తరహా డాల్ఫిన్ల మీద పరిశోధన చేసిన అనుభవం ఉంది. అయితే, ఫారెస్ట్ గార్డు, ఆమె తెచ్చుకున్న గైడ్ ఆమెకు సాయపడేది పోయి ప్రతిబంధకాలుగా మారతారు. ఈలోగా ప్రమాదవశాత్తూ ఆమె నీళ్ళలోకి పడిపోతే, ఫకీర్ అనే బెస్తవాడు ఆమెను కాపాడతాడు. ఇక ఆమె ప్రయాణం అంతా అతనితోనే, అతని బోటు మీదే. అతనికీ, ఆమెకి మాటాడుకునేందుకు భాష లేకపోయినా, ఆమె కి కావల్సింది అర్ధం చేసుకున్నట్టుగా అక్కడి పరిసరాల మీద చిన్నప్పట్నించీ పుట్టిపెరిగిన అనుభవం వల్ల, రాత్రీ పగలూ, మారుతుండే అలలల రీతుల మధ్య ఆమెను డాల్ఫిన్లు తిరిగే చోట్లకు జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు ఫకీర్. ఆమెకు కొద్ది రోజుల్లోనే, తన పరిశోధనలకు నెలలు పట్టవచ్చని అర్ధం అవుతుంది.  ఆ సమయం వీళ్ళిద్దరూ దగ్గరయేందుకు కూడా సాయపడుతుంది.


ప్రధానంగా కథంతా ఈ మూడు పాత్రల తోనే నడిచినా, ఈ నవల్లో హీరోలు సుందర్బన్, అక్కడి స్థానిక  ప్రజలు, వాళ్ళ అంతులేని జీవన పోరాటం.  సుందర్బన్ లో దట్టమైన అడవులు, ఆటుపోట్లకు నీళ్ళు వస్తూ పోతూ ఉండడం వల్ల విచిత్రమైన చిక్కదనంతో, గ్రీనరీతో, బలమైన వేళ్ళతో, తీరం పొడవునా ఉన్న మడ అడవుల్లో పెరిగే విచిత్రమైన చేపలు, మొసళ్ళు, పొదల్లో దాగి ఉన్న బలమైన పులులతో చాలా డేంజరస్ గా ఉంటాయి. రాత్రిళ్ళు పడవ ప్రయాణాలు ప్రమాదకరం.  రాత్రిళ్ళు గ్రామాల బెస్తవాళ్ళు తమ పడవలు కొట్టుకుపోకుండా,  తీరానికి కాస్త దూరంలో అన్ని పడవల్నీ తాళ్ళతో కట్టుకుని గుంపుగా మకాం వేస్తారు. ఫకీర్ మాత్రం వేటకు వెళ్ళినప్పుడు లో  యోగి లా ఒక్కడే ఉంటాడు. తీరానికి మరీ దగ్గరగా పడవని ఉంచితే ఏ రాత్రప్పుడో పులులో ఇంకేవో జంతువులు పడవలోకి దూకగలవు. ఎక్కువ లోతున్న  నీళ్ళలో ఉంచితే, తెల్లరేసరికి ఏ దీవికి కొట్టుకెళిపోతామో తెలీదు. ఈ పడవల బెస్తవాళ్ళకి అవే ఇళ్ళు. వేటకు వెళ్ళినపుడు, వండుకోవడానికీ, తినడానికీ, రాత్రిళ్ళు పడుకోవడానికీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్న బీద గూటి పడవలు అవి.  రాత్రంతా వలలేసి, చేపలు పట్టి, తెల్లారుతూ ఊరిలోని దళారులకు అమ్ముకోవడానికి తీసుకొస్తారు. 


ఈ అడవుల్లో డేంజర్ లు పిల్లా పాపా అందరికీ తెలిసినవే. అందుకే వాళ్ళకు  "బొన్ బీబీ" వనదేవత  ఉంటుంది. మంచి కర్మలు చేసేవాళ్ళకి, తనని మనసారా నమ్మేవాళ్ళకీ ఈ వన దేవత అండ ఉంటుందని స్థానికులు నమ్మేవారు. వారి నాటకాలలో బొన్ బీబీ కాపాడిన పిల్లల కథలుంటాయి. ఈ వన దేవి పాలిటికి దక్ఖిన్ రాయ్  అనే విలన్ రాక్షసుడు అడ్డు తగులుతుంటాడు. ఆవిడ భక్తులను అమాంతం తినేస్తుంటాడు.  వాడే ఈ డేంజరస్ పులుల వాడు. ఎవరైనా పులిబారిన పడ్డారంటే దానర్ధం ఈ రాక్షసుడి ఉచ్చులో మనం పడబట్టే అని. దీవులమీదికి రాత్రి పూట ఆవరించే చీకటిలో ఆ రాక్షసుడు దాక్కునుంటాడు. అతనికి చిక్కితే ఇంక అంతే సంగతులు. 

ఈ నవల 2004 లో వచ్చింది. అంటే 20 ఏళ్ళ తరవాత చదువుతున్నాను. ఇప్పటికీ సుందర్బన్ ఇంతందంగా ఉందో లేదో తెలీదు.  కథ లో చిన్న చిన్న పిల్లల కళ్ళ ముందే వాళ్ళ తండ్రులను పులులు మెడ దగ్గర కొరికి చంపేసి, శరీరాన్ని అడవుల్లోకి ఈడ్చుకుని పోతుంటాయి. 1978-79 ప్రాంతాలలో బాంగ్లాదేశ్ నుండీ పారిపోయొచ్చిన బీదసాదల్ని,  ప్రాణాలతో మిగిల్నవాళ్ళని బెంగాల్ ప్రభుత్వం సగానికి పైగా కాల్చి చంపేసింది. దీన్ని మోరిచ్ ఝాపీ మసాకర్ అంటారు. ఆ మసాకర్ లోనే ఒకానొక ప్రధాన పాత్ర మరణిస్తుంది. ఆవిడ తరవాతి తరం వాళ్ళు ఈ కథ కి ప్రాణం పోస్తారు. ఈ పిల్లల Trauma చెప్పనలవి కానిది. తండ్రిని పులి చంపేస్తున్నపుడు బొన్ దీదీని ఎంత పిలిచినా వచ్చి కాపాడలేదని ఒకప్పుడు బాధపడిన పిల్లే ఈ మరణించిన ప్రధాన పాత్ర. 


కథలో అమితవ్ ఘోష్ కాసింత చరిత్రా, వైజ్ఞానిక శాస్త్ర ప్రభోధన చేస్తాడు. దాదాపు మౌలిక సదుపాయాలు శూన్యమైన  ప్రాంతాలలో సాధారణ ప్రజలు మెయిన్ లాండ్ నుండీ వెళ్ళి చిన్న చిన్న వలంటరీ సంఘాలు స్థాపించి, అక్కడి ప్రజలతో పని చెయ్యడం ముఖ్యమైన అంశం.   ఆసంఘాలు ఇప్పుడు చాలా దూరం ప్రయాణించి వ్యవస్థాత్మక మార్పులు చెందాయనుకోండి.  అసలు మనిషన్నవాడు ఉండలేని ఆ కీకారణ్యాలలో బ్రతుకుతెరువు వెతుక్కుంటూ వచ్చి స్థిరపడి ప్రతి పూటా బ్రతికేందుకు ప్రాణాలడ్డం పెట్టి పోరాటం చేసిన పాటకజనం, ఒకనాడు కన్సర్వేషన్ పేరిట అక్కడనుండీ వెళ్ళగొట్టబడడం, ఎవడో ఇంగ్లీసువాడు హామిల్టన్ కట్టించిన స్కూలు భవనం, అక్కడి ప్రజల ఎకలాజికల్ నాలెడ్జ్ - వీటన్నిటినీ తెలుసుకోవచ్చు. 


ప్రజల లో మతానిది పెద్ద విషయం కాదు. క్రూర జంతువులండీ, రోగాలు రొచ్చుల నుండీ, ఆకలి నుండీ తమని తాము కాపాడుకోవడమే వాళ్ళ గోల్. రోడ్లు లేని, బురద ప్రాంతాలలో వెలిసిన చిన్న చిన్న సెటిల్మెంట్లు ఇప్పుడు పట్టణాలయ్యేయి. సుందర్బన్ లో ఆకలి గొన్న పోటు జలాలు ప్రతీ సీజన్లోనూ పొలాల్ని ముంచెత్తి, ఉప్పుమయం చేసేస్తాయి. అక్కడి జంతుజాలం, ఆటుపోట్ల సంగీతాల రిథం కు అలవాటు పడి, తమ తమ బిహేవియర్లను మార్చుకున్నాయి. మనిషి, ఆ మాటకొస్తే ప్రతీ ప్రాణీ, కాలంతో పాటూ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది.  


ఈ వనంలో వచ్చిన  భీకర తుఫానులు, ఆకాశమూ, సముద్రమూ కలిసే చోటి అందాల వర్ణనలూ రచయితని ఓ మెట్టు పైకి తీస్కెళ్ళినిలబెడతాయి. తుఫానులు సర్వసాధారణమైన బాంగ్లాదేష్ ని ఆనుకునున్న ప్రాంతం కాబట్టి, మడ అడవులు నీళ్ళలో మునుగుతూ, తేలుతూ, తీర ప్రాంతాల్ని రక్షిస్తూ, అక్కడి ఎకాలజీని పరిపుష్టం చేస్తుంటాయి. అక్కడి పడవలు,రకరకాల చేపలు, క్రాబ్స్, జంతువులు, కథాకాలం 70-80 ల మధ్యది కాబట్టి అప్పటి జీవన విధానం, అక్కడి నుండీ వచ్చి కలకత్తాలో జీవనం వెతుక్కున్న తరాల నాస్టాల్జిక్ తిరుగుప్రయాణాలు, ముఖ్యంగా కన్సర్వేషన్ గురించి, తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఒక మంచి రిఫరెన్స్. పాత సబ్జక్ట్, రచయిత రాస్తున్న మొదట్లో అప్పటి పుస్తకం కాబట్టి, కూడబెట్టి ఉన్న డేటాను విపరీతంగా ప్రవేశపెట్టడం వల్లానూ, బోరు కొడుతుంది. కానీ కొన్ని పుస్తకాలు ఇంఫోటైన్మెంట్ కోసం. ఇదీ అంతే. 

***

 

‘నాళై’ - A. Muthulingam (Original in Tamil)

‘నాళై’  - A. Muthulingam (Original  in Tamil)

రేపు - అనువాదం అవినేని భాస్కర్  (https://eemaata.com/em/issues/201704/11094.html)

***

ఈ కథ ని 'పిల్లల కోసం వెబ్ సిరీస్' తీద్దామని ఒకరు సంకల్పించి పిల్లలు protagonist /  సబ్జెక్ట్ గా ఉన్న (ప్రముఖ) కథలని సూచించమంటే, కుదించి, ఇలా రాసాను. దురదృష్టవశాత్తు ఇది ఎంపిక కాలేదు.  కానీ బ్లాగ్‌లో పెట్టేస్తే ఎవరైనా చదువుతారని పోస్ట్ చేస్తున్నాను. 

***

శ్రీలంక లో యుద్ధం జరుగుతున్న రోజులు.  అనాధలయిపోయిన ఇద్దరు పిల్లల కథ ఇది. ఒక కేంప్ లో యుద్ధ బాధితులకు భోజనం ఇస్తున్నారు. అక్కడ వరుసల్లో నిల్చున్న వారందరికీ సూప్ పోసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పిల్లలకి పేర్లుండవు. పెద్దాడు అన్న, చిన్నాడు తమ్ముడూ. అంతే. అయితే, వీళ్ళు ఆ కేంప్ లో దొరికే రొట్టె, సూప్ తప్ప ఇంకే ఆధారమూ లేనోళ్ళు. కానీ కేంపులకు వెళ్ళడం, క్యూలలో నిల్చోవడం, వేచి ఉండడం, అదీ చిన్నపిల్లవాడితో చాలా కష్టం. అందుకే అన్న తమ్ముడికి ఇవాళ కేంప్ లో మాంసం ఇస్తార్రా అని ఆశ పెట్టి కేంపు కు నడిపించుకుంటూ తీస్కెళ్తాడు. 

చిన్నాడు ఎంతో ఆశ పడి వస్తాడు. వాళ్ళకు మాంసం లాంటి luxury దొరికి ఎన్నో రోజులయిపోయింది. ఈ తిండి యాత్ర చెయ్యకపోతే ఇంకో దిక్కు లేదు. పెద్దాడు కూడా చిన్న పిల్లాడే. వాడికి తమ్ముడు తప్ప ఇంక   ఎవరూ లేరు. వాళ్ళ తల్లిదండ్రులూ, బంధు వర్గమూ ఏమయ్యారో ఎక్కడా వుండదు.   వీడినీ తననీ బ్రతికించుకుని ఉంచుకోవడం పెద్దాడి మొదటి ప్రయారిటీ. 

ఆ రోజూ వాళ్ళు అలా వస్తారు. ఎందరో మనుషుల తరవాత వీరి వంతు వస్తుంది. పెద్దాడు కూడా మాంసం ఆ సూప్లో దొరుకుతుందేమో అని ఆశ పడతాడు కానీ దొరకదు. తమ్ముడు నిరాశపడిపోతాడు. వీళ్ళకి దొరికిన ఇంత బ్రెడ్ లోనూ కాస్త తీసి వీధికుక్కకు పెడతాడు తమ్ముడు. అర్ధాకలితో ఉన్నా, వీళ్ళ మనసులు మంచివి. 

రేపు తప్పకుండా మాంసం ఇచ్చే కేంపు కు తీస్కెళ్తాను అని పెద్దాడు చిన్నాడికి ప్రామిస్ చేస్తాడు. ఆ కేంపు పది మైళ్ళ దూరంలో ఉంది. కానీ 'రేపు' మీద ఆశ వాళ్ళ జీవన రధాన్ని లాక్కెళ్తూండడం వల్ల, 'రేపు తప్పకుండా నీకు మాంసం పెట్టించే చోటుకు తీస్కెళ్తానని' పెద్దాడు నిర్ణయించుకుంటాడు. 

ఆ "రేపు" నిజంగా వస్తుందో రాదో గానీ, ఆ ఆశ అనే  driving force ని ఆధారంగా చేసుకుని,  ఆ పిల్లలు ఎలా బ్రతుకుతారో చెప్తుంది ఈ కథ.  యుద్ధాల్లో, ఉత్పాతాల్లో, మొదటగా బాధితులయ్యే పసివాళ్ళ గురించి, చెప్పిన కథ ఇది. వాళ్ళలో నిజానికి చుట్టు పక్కల జరిగే పరిణామాలు కుంగదీత కు గురిచేసేటట్టే ఉన్నా, వీళ్ళందరూ తరాలుగా ఆ ఆశని ఆధారగా జేసుకునే, adversity తో   పోరాడారు. వీళ్ళ అమాయకత్వమూ, మంచి మనసూ చల్లగా ఉండాలి. ఈ కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని వాళ్ళకి ఆ దేవుడు కలిగించాలి అని పాఠకుడికి అనిపిస్తుంది. 

***