Pages

04/05/2018

Personal Recollections of Joan of Arc - Mark Twain


 



మార్క్ ట్వైన్ రాసిన అన్ని నవలల్లోకీ చాలా సీరియస్  నవల "పెర్సొనల్ రెకలెక్షన్స్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్".   కామిక్ రచయిత గా మొదలుపెట్టినా, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల కారణంగా, భార్య, ఇద్దరు కూతుర్ల మరణానంతరం, తన మలి సంధ్య లో.. సీరియస్, నిరాశాపూరిత కధలను రాయడం మొదలుపెట్టాడు ఈయన.  'జోన్ ఆఫ్ ఆర్క్'  గురించి ఇంగ్లీషు లోకంలో పెద్దగా తెలీని కాలంలో పన్నెండు సంవత్సరాలు శ్రమపడి, సమాచారాన్ని సేకరించి, రెండేళ్ళ పాటు రచించిన, అతను తన నవలల్లోకెల్లా ఉత్తమమైనదని భావించిన నవల ఇది.  1850 లో జోన్ గురించి తెలుసుకుని, ఆమె గురించి లోకానికి తెలపాలన్న తీవ్ర కాంక్ష తో, ఈ కధ నిజమా కాదా అని వెయ్యిన్నొక్క సార్లు నిర్ధారించుకుని, ఈ చారిత్రాత్మక నవలను ప్రేమ తో రాసాడు.

జోన్ ఒక చిన్న పేద రైతు బిడ్డ. ఫ్రెంచ్ వారి చరిత్రలో ఆమెది ఒక సుస్థిరమైన స్థానం.  ఆమె తో పాటూ పెరిగిన ఒక స్నేహితుడి జ్ఞాపకాల వెల్లువ ఈ పెర్సొనల్ రీకలెక్షన్స్ అన్న మాట.  లూయీ దె కాంట్ అనే జోన్ సహచరుడు, 82 ఏళ్ళ వృద్ధుడు, ఒక ఫ్రెంచు పల్లె లో,  వాళ్ళంతా చిన్న నాడు ఆడుకున్న చెట్టు దగ్గర కూర్చుని, జోన్ ని తలచుకుంటూ చెప్పిన కధ ఇది. "మొదటి నుండీ, ఆమె మరణం దాకా నేను తన తోనే ఉన్న వాడిని"  అంటూ.. మొదలుపెడతాడు. ఫ్రాన్స్ లో పిల్లలు, ఒక అయిదు వందల సంవత్సరాలో, వెయ్యి సంవత్సరాలో ఆమె ను గుర్తు చేసుకుంటారు. ఆమె గాధలను గానం చేస్తారు. ఫ్రాన్స్ ఆమె ను మర్చిపోకూడదు. ఆ త్యాగధని ని కొలుస్తూ ఉండాలి అని లూయీ ఆకాంక్ష.  

డోర్మెరీ లో పిల్లలందరకీ ఈ చెట్టు భలే ఇష్టం. వారి ఆట పాటలన్నీ ఈ చెట్టు చుట్టూతానే. ఎందుకంటే ఆ చెట్టు మీద ఫెయిరీ లున్నాయి.  అవి ప్రతీ రోజూ ఈ పిల్లలతో ఆడుకుంటూండేవి.  ఒక ప్రీస్ట్ ఫెయిరీలను ఆ చెట్టు నుండీ పొమ్మని శపించినపుడు అతన్ని ప్రశ్నించడం ద్వారా జోన్ నిజానికి కట్టుబడే మనిషి అని, చిన్న పిల్ల అయినా ధైర్య సాహసాలలో, తెలివి తేటలు ప్రదర్శిస్తూ వాగ్వాదం చెయ్యడంలో ఘనురాలు అని అందరికీ తెలుస్తుంది.  అదే విధంగా ఒక కరుకైన మంచు కురిసే చలి రాత్రి జోన్ ఇంట్లో అందరూ సమావేశమై ఉన్నపుడు ఒక బిచ్చగాడు చలికి వణికిపోతూ, ఆకలితో అలమటించిపోతూ అక్కడికి వచ్చినపుడు అందరూ అతన్ని ఏవగించుకున్నా, దయగల తల్లి తన ఆహారాన్ని అతనికిచ్చి,  ఆదరిస్తుంది. అతను పనికిమాలిన వాడైనా, వెధవ అయినా, ముందు అతని కడుపు నింపాకే మిగతా అంతా అని తండ్రితో వాదిస్తుంది.   మనుషులు తప్పు చెయ్యొచ్చు. ఆకలి గొన్న అతని పొట్టదేమి పాపం ?  అతనికి  భోజనాన్నివ్వడం మన ధర్మం. అతని పాప పుణ్యాల విచారణ కు ఇది సమయం కాదు అంటుంది.

ఈ పిల్లలు కాస్త శాంతియుతంగా ఉండే ఆ ప్రాంతాల్లో అలా పెరిగి పెద్దవుతున్నారు.  నిజానికి అప్పుడు ఫ్రాన్స్ అస్థిరత తో ఉడికిపోతుంది.  ఇంగ్లీష్ పాలన లో మగ్గుతూంది. రాజు పదవీచ్యుతుడయ్యాడు. ఫ్రెంచ్ అభిమానానికి తీవ్ర గాయమైన కాలం. బర్గుండీ లూ, ఇంగ్లీష్ వాళ్ళూ ఫ్రాన్స్ లో వివిధ ప్రాంతాలను ఏలుతున్నారు. ఫ్రెంచు వారి పరిస్థితి దయనీయంగా ఉంది.  పదవీచ్యుతుడైన రాజు ని డాఫిన్ అంటారు.  ఫ్రాన్సు కు చెందిన కేథరీన్ కూ ఇంగ్లాండు కు చెందిన హెన్రీ కీ వివాహం జరగబోతున్న వార్త విని ఫ్రెంచు వారు ఉడికిపోతున్నారు.  వాళ్ళ సంతానం ఫ్రాన్సు నూ ఇంగ్లండు నూ ఏలేట్టయితే  ఈ జన్మ లో ఫ్రాన్సు కు స్వాతంత్ర్యం లభించదనీ, డాఫిన్ ఇక రాజవ్వడనీ బాధపడుతున్నారు. 

రాజకీయ పరిస్థితులు ఇలా ఉండగా ఊర్లో ఒక బెనోయిస్ట్ అనే పిచ్చివాడు ఎక్కడో గొడ్దలి దక్కించుకుని, వీధుల్లో విలయ తాండవం చేస్తున్నపుడు, పిల్లలంతా పారిపోగా, జోన్ మాత్రం అతనికెదురెళ్ళి ఏదో లా అతన్ని కన్విన్స్ చేస్తుంది. ఆ మహాబలుడు, ఈ చిన్న పిల్ల మాట విని బుద్ధిమంతుళ్ళా  వచ్చి తనకై నిర్దేశించిన చెర లో కూచుంటాడు. అతన్ని తాళం వేసి బంధిస్తారు ఊరివాళ్ళు. అయితే దురదృష్టవశాత్తూ అదే రోజు శత్రు సేనలు ఊరి మీద దాడి చేస్తాయా రాత్రి. అన్ని ఇళ్ళూ తగలబెడతారు. ప్రజలు కట్టు బట్టలతో అడవిలోకి పారిపోతారు.  వారు పొద్దున్న తిరిగొచ్చి చూసేసరికీ, చెరలో ఈ మహాబలుడి కాలిన మృతదేహాన్ని చూసి, జోన్ తో సహా అందరూ దుఃఖిస్తారు.   అప్పుడు మొదటి సారిగా యుద్ధ భీభత్సం, ఫ్రాన్స్ స్వతంత్ర లాలసా జోన్ కి ఎరుకలోకొస్తాయి.

ఫ్రాన్స్ పతనాన్ని దర్శిస్తున్న ఈ పిల్లలు యుద్ధావేశంతో రగులుతున్న పెద్దవాళ్ళు, నిస్సహాయమైన పరిస్థితులు.. వీటన్నిటి మధ్యా, లూయీ ఒక మారు అడవిలో చెట్ల మధ్య జోన్ ఏదో పెద్ద వెలుగులో మాటలాడుతూండడం చూస్తాడు.  ఆ చిన్న పిల్ల తనకు దేవుడు ఫ్రాన్స్ రక్షణకై నియమించాడని, తనని రాజుని కలవనీయమనీ, కొందరు సైనికులనిమ్మనీ, సైన్యాధికారుల కు మొరపెట్టుకుని, ఎలాగో రాజుని కలిసి, ఆయన్ని గద్దెనెక్కిస్తానని ప్రమాణం చేసి, తరవాత ఎన్నో  యుద్ధాల్లో పాల్గొని, చిన్న పిల్లే అయినా మెరుపు లా యుద్ధం చేసి, ఆర్లియన్స్ లాంటి శతృదుర్భేద్యమైన కోటల్ని చార్లెస్ వశం చేస్తుంది.

నిండా 17 ఏళ్ళు అన్నా లేని పిల్ల సాధిస్తున్న విజయాలను చూసి, ఆమె ని విచ్ అనీ, మంత్ర కత్తె అనీ, ఇంగ్లీష్ సైనికులు అభాండాలు వేస్తారు. దేవుడే తనని నడిపిస్తున్నాడని నమ్మి జోన్, వెండి పళ్ళెంలో విజయాన్ని తెచ్చి రాజుకిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో విజయాలు, గాయాలు, అనవసరమైన విరామాలూ, ఈ లోగా రాజు చుట్టూ చేరిన కుయుక్తులు, జోన్ పారిస్ మీద దండెత్తినపుడు,  పారిస్ యుద్ధంలో విజయం సాధించక పోతే, ఫ్రాన్స్ పూర్తిగా స్వతంత్రమయేందుకు ఇంకో 20 యేళ్ళు పడుతుందని చెప్పిన జోన్ మాటల్ని మరిచి,    రాజు  అకస్మాత్తుగా సంధి ప్రకటించేలా చేసి, ఆమె చేతులు కట్టేస్తారు. ఆ యుద్ధంలోనే  ఈమె అత్యంత సాహసోపేతమైన జెనరళ్ళు వీర మరణం చెందుతారు. రాజు వైఫల్యం వల్ల ఫ్రాన్స్ ఓడిపోతుంది. 

జోన్ ను అరెస్ట్ చేసి, ఆమె ప్రజాదరణ ను దృష్టి లో ఉంచుకుని, ఆమె సాతానుకు చెందిన వ్యక్తి అని  ఋజువు చేయడానికి  శత విధాలా ప్రయత్నం జరుగుతుంది.   వాళ్ళడిగిన సొమ్మునిచ్చి జోన్ ని విడుదల చేసుకోవడానికి చార్ల్స్ అస్సలు ప్రయత్నించడు. అత్యంత దయనీయ నిస్సహాయ పరిస్థితుల్లో ఆమె పై విచారణ జరుగుతుంది.  ఒంటరి ని చేసి,  చెరలో ఆమె ని బలాత్కరించారు.  మానసికంగా ఆమెని లొంగదీయడానికి అమానవీయ పరిస్థితుల్లో బంధించి ఉంచారు.  ఆఖరికి చదువు రాని ఆ పిల్ల చేత ఒక తప్పుడు ఒప్పుకోలు సంతకం పెట్టించి, సజీవ దహనం చేస్తారు.      

బహిరంగంగా అమలు పరచిన ఆ శిక్ష ని లూయీ తన కళ్ళారా చూసి,  విల విలా ఏడుస్తాడు.  జోన్ చాలా నిస్సహాయంగా, ఒంటరిగా చనిపోతుంది.  ఆమె ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించిన వ్యక్తి బిషొప్ బావియా చరిత్రలో బాలిక ని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తి గా నిలిచిపోయాడు.  ఇది జరిగిన 20 ఏళ్ళకి చార్లెస్ యుద్ధంలో అంతిమ విజయం సాధించిన నాడు, జోన్ ని తలచుకుంటాడు

ఈ జోన్ కథ ను మార్క్ ట్వైన్ ఇంగ్లీషు మాట్లాడే ప్రజలకు పరిచయం చేసి,  జోన్ కు ఒక విస్తృత ప్రచారం కల్పించాడు.   ఫ్రాన్స్ విజయం తరవాత రాజు చార్ల్స్ పోప్ దగ్గర జోన్ పై పెట్టిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆమె హత్య తప్పని నిరూపింపచేసాడు అంటారు.  ఫ్రాన్స్ లో దేవతగా కొలువబడే జోన్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  మార్క్ ట్వైన్, చివరి దినాల్లో  సావకాశంగా ముగించి, ఒక రూపాన్నిచ్చిన ఈ కథ ని ఆధారంగా చేసుకుని వచ్చిన  హాలీవుడ్ సినిమాలు, నాటికలూ  కూడా ఆదరణ పొందాయి. ఎన్నో సార్లు పునర్ముద్రణ పొందిన జోన్ కథ,  పట్టుదలా, కరుణ, దయా, స్నేహమూ, త్యాగమూ, దేశభక్తీ లాంటి విలువలకు మానవ చరిత్రలో ఎంతో   ఆదరణ, గౌరవం, ఉండి తీరతాయని  నిరూపిస్తుంది. 
***

A Village by the Sea - Anita Desai



బాలల పుస్తకాలు రాసేవాళ్ళు అరటిపండు వొల్చినట్టు కొన్ని ముద్దైన కథలు చెప్తూంటారు.  బాల సాహిత్యంలో కష్టాలూ, కడగళ్ళూ ఉన్నా, ముగింపు పాసిటివ్ గా ఉండేదే మంచి కథ అని నా నమ్మకం.   ఈ రోజుల్లో పిల్లలు ఊహించలేనంత  దారుణాలకూ, దాడులకూ గురవుతున్నారు.  కష్టాలు మనసుల్ని రాటు తేలుస్తాయి. మనుషుల్ని దగ్గరగా కూడా తెస్తాయి, ప్రేమ తో, ఐక్యత తో  కుటుంబం అంతా వాటిని ఎదుర్కోవచ్చు అని ఒక భరోసా ఇవ్వాగలగడమే పెద్ద విషయం. అన్నిటికన్నా బీదరికం ఒక పెద్ద కష్టం. కుటుంబంలో అందరూ కలిసి, ప్రేమాభిమానాలతో ఆ బీదరికాన్నీ, విపరీతమైన నైరాశ్యాన్నీ ఎదుర్కోగలం అనే నమ్మకాన్ని ఒదులుకోలేకపోవడమే ఈ కధ లోని ఆత్మ.

సముద్ర తీరంలో తుళ్ (ముంబాయి కి 17 కిలో మీటర్ల దూరంలో) ఆలీబాగ్ కి దగ్గర్లో ఉన్న ఓ జాలరి పల్లె.  ఇక్కడ 13 ఏళ్ళ లీల, 11 ఏళ్ళ తమ్ముడు హరి, ఇంకో ఇద్దరు చిన్న వయసు చెల్లెళ్ళు బేల, కమల ల కొబ్బరాకుల తో కప్పిన పూరిపాక నుంచీ కథ మొదలవుతుంది.  వాళ్ళ తండ్రి తాగుబోతు, తల్లి అనారోగ్యంతో శుష్కించిన ప్రాణి.  పిల్లలకు వండి వార్చే పెద్ద దిక్కు లీలే.  హరి బాధ్యత తెలిసిన వాడు. తమ భవిష్యత్తు గురించి వయసుకు మించిన బెంగతో, పట్టుదలతో ఉక్కిరిబిక్కిరవుతుండే స్వచ్చమైన బాలుడు. తండ్రి తాగి పొద్దంతా నిద్రపోయి, రాత్రి లేచి, కల్లు పాక కి పోయి, తాగి, ఇరుగు పొరుగు తో గలాటా పెట్టుకుని ఇల్లు చేరి.. నిద్రపోవడమే తప్ప గ్రామంలో మిగిలిన వాళ్ళ లాగా పడవ మీద చేపల వేట కు వెళ్ళడమో, నాలుగు రాళ్ళు సంపాయించడమో పిల్లలు ఎపుడూ చూడనే లేదు.

అది ఒక సముద్ర తీర గ్రామం.  అభివృద్ధి కి దూరంగా, చేపల పడవల మీద జాలరులు సముద్రంలోకి పోయి ఏదో కొంత వేట తెస్తే అవీ, ఊరి నిండా ఉన్న కొబ్బరి చెట్ల నుండీ వచ్చే బొండాల ఆదాయమూ.. పొలాల్లో కొద్దొ గొప్పో పండే ధాన్యమూ తప్ప వేరే బ్రతుకు తెలియని వాళ్ళు.  వాతావరణానికీ, ప్రాణానికీ లంకె. అందరివీ నాటు పడవలే. మర బోట్ ఉన్న బిజూ అనే ఆసామీ స్మగ్లింగ్ చేస్తాడని, సముద్రంలో పెద్ద పెద్ద నౌకల నుండీ పెట్టెలు ఈ తీరానికి తీసుకు వస్తాడనీ అంతా అనుకుంటూంటారు. ఎందుకంటే బిజూ నే కాస్తొ కూస్తో సంపన్నుడు. డాబా ఇల్లు ఉన్న ఆసామీ.


ఊర్లో ఏదో చిన్న బడి తప్ప, పెద్ద సౌకర్యాలేమీ లేవు.  ఆసుపత్రి లేదు. లీల తల్లికి ఏమి జబ్బో తెలీదు.  ఆలీబాగ్ కి ఏ బస్సులోనో బండిమీదో తీసుకెళ్ళాలి.  ఆవిడకి సరైన వసతులలో చికిత్స ఇప్పించగలిగేంత డబ్బూ లేదు వీళ్ళకి. ఒకో పూట తినడానికి తిండి కూడా వుండదు. తండ్రికి ఇవేమీ పట్టవు. అప్పో సొప్పో చేసి తన తాగుడు వరకూ మాత్రమే చూసుకుంటాడు.  భార్యా పిల్లలు అసలు ఎలా ఉంటున్నారో, ఏమి తింటున్నారో కూడా తెలీదు అతనికి.  అతనికి అప్పిచ్చి మునిగిన వాళ్ళు అక్కసుతో పిల్లలు ప్రాణంగా పెంచుకుంటున్న "పింటో" అనే కుక్క పిల్లని చంపేయడంతో వాళ్ళ పరిస్థితులు మరింత దిగజారతాయి. ముఖ్యంగా పిల్లలు మానసికంగా చాలా దెబ్బ తినిపోతారు.

వాళ్ళకున్న కొద్ది పాటి స్థలంలో ఏవో కూర మొక్కలు పాతుకుంటారు. ఒక్కోసారి పిల్లలు తీరం దాకా నడిచెళ్ళి, ఒడ్డున రాళ్ళ కి పట్టిన నత్తల్ని ఏరుకొస్తారు.  హరి చిరిగిపోయిన పాత వల తో సముద్రం ఒడ్డునే ఏవో చేపలు పట్టాలని ప్రయత్నిస్తూంటాడు.  లీల పెరట్లో కాచిన మిరపకాయలతో పిల్లలకు ఏదో కాస్త తినడానికి ఇస్తుంది.  బేల, కమల లు బడికి వెళ్తూంటారు. లీల కి ఆ సౌకర్యం లేదు.  వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ హరీ, లీల ఆ సంసారాన్ని లాక్కొస్తున్నారు.

ఇంతలో ఊరిలో ఎరువుల ఫేక్టరీ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లభిస్తుంది. పల్లెలో ఒక కుదుపు. ఫేక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయని మభ్యపడుతున్న వారు,  భూములు ప్రభుత్వం లాక్కుంటే నిర్వాసితులమైతే తమ భవిష్యత్తు ఏంటని బాధపడేవారూ, ఈ లోగా పట్నం నుండీ వచ్చిన  పర్యావరణ వేత్తలూ, ఎరువుల కర్మాగారాలు వదిలే విష రసాయనాల వల్ల సముద్రంలో మరణించబోయే చేపల గురించి చెప్పి జాలర్లను అప్రమత్తం చేయడం.. ఇలా కొన్నాళ్ళు తుళ్, ఆ చుట్టు పక్కల గ్రామాల్లోనూ  ఉద్రిక్తత రగులుకుంటుంది.

ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా తనకి ఏదో ఒక ఉద్యోగమో, ఆధారమో కావాలని వెతుకుతున్న హరి ని కూడా ఆ సంఘర్షణ తాకుతుంది.   అందరూ బొంబాయి వెళ్ళి ఒక ప్రదర్శన లో పాల్గొని, ప్రభుత్వానికి తమ నిరశన వ్యక్తపరుస్తామని అనుకుంటారు. దానికి తుళ్ నుండీ, మిగతా గ్రామాల నుండీ, పడవల్లో సముద్రమార్గాన బయలు దేరుతారు. హరి పొద్దున్న వాళ్ళతో వెళ్ళి, రాత్రికి వచ్చేద్దామనుకుంటాడు -  హరి ఆలోచన బొంబాయి లో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని.   లీలా, హరీ ఆ విషయం మాటాడుకున్నప్పుడల్లా, లీల 'మమ్మల్ని వదిలి అంత దూరం వెళతావా హరీ ?' అని బెంగ గా అడుగుతూండడం వల్ల హరి ఎటూ తేల్చుకోలేకపోతుంటాడు.

తుళ్ లో ఒక బంగళా వుంటుంది. దాని సొంతదార్లు డిసిల్వాలు బొంబాయిలో వుంటారు. ఎపుడన్నా సెలవులకి తుళ్ కి వస్తూంటారు. వాళ్ళ పిల్లలు సముద్రంలో ఈదుతూ, నీళ్ళలో ఆడుకుంటూ, తోటల్లో తిరుగుతూ, ఎంజాయ్ చేసి, కొన్నాళ్ళ తరవాత బొంబాయి వెళిపోతుంటారు.   ఒక సారి డిసిల్వా హరికి తన ఎడ్రస్ ఇచ్చి, బొంబాయి  వస్తే కలువు నీకు ఏదైనా సాయం చేస్తాను అనడం... హరి బొంబాయి యాత్ర కి ఒక ట్రిగ్గర్.   వాళ్ళు వచ్చినప్పుడల్లా, వాళ్ళకి కావల్సిన సౌకర్యాలు చూడడానికి, పని చెయ్యడానికీ లీల, హరి వెళ్తూంటారు.  అందువల్ల వీళ్ళకి పరిచయం.

హరి మాత్రం ఆందోళన కారులతో బొంబాయి వెళిపోయాక,  ఇంక రాకుండా అక్కడే మరింత చిక్కుల్లో పడిపోతాడు. అతను డిసిల్వా ఇంటికి చేరేసరికీ, వాళ్ళు తుళ్ వచ్చి వుంటారు.  ఇక తిరుగు ప్రయాణమవుదామనే సరికీ, చేతిలో చిల్లి గవ్వ లేదు, రేవులో తమ పడవలు వెళ్ళిపోయాయి. ఆఖర్న మంచి మనసు గల వాచ్ మేన్, ఒక చవకబారు హోటల్ ఓనర్ జోగూ, ఒక వాచీ మెకానిక్ ల ఆదరణతో, పని చేసుకుంటూ, దీపావళి కల్లా కొంత డబ్బు, జీవించడానికి కావలసిన ఆత్మ స్థైర్యం, వాచీ మెకానిక్ పని నేర్చుకోవడం వల్ల చేతిలో జీవనాధారమైన విద్య తో ఇంటికి తిరిగొస్తాడు.   ఆ రోజుల్లో ఇప్పుడున్నంత మొబైల్ కమ్మ్యూనికేషన్ లేదు కాబట్టి, లీల కి తాను బొంబాయిలో ఉన్నట్టు ఎపుడో ఒక్క కార్డు రాయడం తప్ప - ఇంకే సందేశమూ, వార్తా ఉండదు.

ఇక్కడ తుళ్ లో డిసిల్వాలు సెలవులు ముగిసాక వెళ్ళబోతున్నప్పుడు వాళ్ళ తిరుగు ప్రయాణంలో ఆలీబాగ్ లో తమ తల్లిని ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర డ్రాప్ చెయ్యమని అడుగుతుంది లీల. ఈ మాత్రం దానికి మంచివాళ్ళైన డిసిల్వాలు లీల తల్లిని ఆస్పత్రి లో చేర్చి, కొంత డబ్బూ ఇచ్చి, డాక్టర్లతో మాటాడి, ఆవిడకి క్షయ కావడంతో కొన్నాళ్ళు అక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు.  ఇక్కడ లీల కోసం ఒక ఉద్యోగం కూడా ఏర్పాటు చేస్తారు. వారి బంగళాకొక పక్షి శాస్త్రవేత్త వచ్చి కొన్నాళ్ళుండబోతుండడం వల్ల, ఆయనకి కావల్సినవన్నీ చూడడం లీల పని. ఈ పని వల్ల లీల కి చేతుల్లో కొంత డబ్బు వస్తుంది. ఆమె నెలకోసారి ఆలీబాగ్ వెళ్ళి ఆస్పత్రిలో తల్లిని కలిసి రాగలుగుతూంది. 

ఈలోగా లీల తండ్రి కూడా మంచి వాడయి, తాగుడు మానేసి, ఆలీబాగ్ లో భార్య బాగోగులు చూసుకుంటూ, ఆస్పత్రి దగ్గరే ఉండిపోతాడు. దీపావళి నాటికి హరి ఇంటికి రావడం, తల్లి ట్రీట్మెంట్ ముగిసి ఆరోగ్యవంతురాలై తిరిగి రావడం, లీల చేసిన స్వీట్లూ,  వాళ్ళ జీవితాల్లో, మనసుల్లో ఆశ, భవిష్యత్తు కోసం బెంగ పోయి, ఒక ధైర్యం కలగడం.. నైరాశ్యం మీద ఇంటిల్లపాదీ కొందరు మంచి మనుషుల సాయంతో చేసిన పోరాటం వల్ల చిక్కిన ఆత్మ సంతృప్తి తో  హాయిగా నవ్వడంతో కధ ముగుస్తుంది.

ఈ నవల నిండా, జాలర్ల జీవితాల గురించి, చిక్కటి చేపల వాసనలు, సముద్రపు హోరు, వలలు, వేటలు, తుఫాన్లూ,  బొంబాయి నగరం. ఎందరో పేదలని అక్కున చేర్చుకుని ఆదరించిన నిర్దాక్షిణ్యమైన నగరం గురించీ... అక్కడ కూడా ఉన్న మంచి మనుషుల గురించి.. చదివి ఎంతో ఆనందం కలుగుతుంది.  తుళ్ ఒక సముద్ర తీర గ్రామం కావడం వల్ల జాలరులు సముద్ర తీరంలో ఉన్న బండలకి కొబ్బరికాయలు కొట్టి, పూలు, కుంకుమా సమర్పించి తమ ప్రాణాల కోసం ప్రార్ధించడమనే సాంప్రదాయం వుంటుంది.  కధ ఆ దృశ్యంతో,  మొదట లీల పూజతో మొదలయ్యి, చివరికి ఆరోగ్యం పుంజుకున్న లీల అమ్మ పూజ తో - ఆవిణ్ణి చూసుకుని మురిసిపోయే హరి, లీల ల నవ్వుతో ముగుస్తుంది.

ఇంత కన్నా మంచి బాల సాహిత్యం ఉంటుందా అనిపించింది.   కిరణ్ దేశాయ్ తల్లి అనితా దేశాయ్ చాలా రచనలు చేసినా, పిల్లల కోసం రాసిన పుస్తకాలు ప్రాచుర్యం చెందాయి.    సముద్రం అంటే ఉన్న ఇష్టం వల్ల - చిన్నప్పుడు చదివిన డేవిడ్ కాపర్ ఫీల్డ్  పెగోట్టీ ల ఇంటికి వెళ్ళడం అదీ, Yarmouth  జాలర్ల గ్రామం కూడా గుర్తొచ్చి భలే భలే సంబరంగా అనిపించింది.   సెలవుల్లో పిల్లల చేత చదివించొచ్చు.  1980 లలో రాసిన ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, నెహ్రూ బాల పుస్తకాలయం "సముద్ర తీర గ్రామం " అనే పేరుతో   ప్రచురించింది. అనువాదం ఎం.వీ.చలపతి. వెల : రూ.27/- మాత్రమే.