Pages

29/12/2009

ప్రతీ'కారం'!!!



ఈ ప్రకటన ఎప్పుడూ తెలుగు టీ.వీ.లో చూళ్ళేదు. బహుశా ఈ పాటికి చాలా మంది చూసి ఉండొచ్చు. కానీ భలే ఉంది లే అని ఇక్కడిలా పెడుతున్నాను.

16/09/2009

సిల్లీ కబుర్లు

1) ఏ వయసు కి ఆ ముచ్చటా - అంటూ ముఖ్యంగా ఆడపిల్లల ప్రాణాలు తీసే వాళ్ళెందరో కనిపిస్తారు. పాతికేళ్ళు దాటిన ఆడపిల్లలు, ఎందుకు చెల్లట్లేదో అని తెగ కంగారు పడిపోయి, వాళ్ళ తల్లీ తండ్రుల బుర్ర తినేసి.. వేయించుకు తినే ప్రాణులు ఎక్కువ. అందరూ సోనియా గాంధీ లాగా ఆచీ తూచీ అడుగులు వేస్తే సమస్య ఏముంది ? పెళ్ళి కాని పిల్లల్ని అమ్మో ముప్ఫయి వచ్చేస్తోందనో - దాటిపోతుందనో - కంగారు పెట్టేసి, ఒత్తిడి చేసేస్తే, వాళ్ళూ, నిజమేనేమో - అని భయపడిపోయి, చాలా మటుకూ నష్టపోతున్నారు. ఇంతా డబ్బులిచ్చుకుని, (కట్న కానుకలు), డబ్బు వెదజల్లి - చేసుకున్న ఐశ్వర్యా రాయ్ లకు (అలా లేకపోయినా, ప్రొఫెషనల్ కోర్సు చేయకపోయినా, మంచి ఉద్యోగం లేకపోయినా .. పెళ్ళి కావడం కష్టం) తరవాత తగిలే షాక్ లు ఎలా ఉన్నాయంటే - గుండెలవిసిపోతున్నాయి.

తమిళ నటి మనోరమ - సాంప్రదాయ వాదులని ధిక్కరించి పెళ్ళికి ముందు 'ఆరోగ్య పరీక్ష లు చేయించుకోవాలని, అది చట్టం చేయాలని' పోరాడుతున్నారంట. ఎందుకు పోరాడకూడదు ? పెళ్ళయ్యాక, నపుంశకుడయిన భర్త, సమాజానికి ఏదో నిరూపించుకోవడానికే కట్న కానుకలూ, ఆర్భాటాల మధ్య పెళ్ళాడి, ఆనక 'నీకు విడాకులిస్తాను, ఇంకోర్ని పెళ్ళీ చేసుకో!' - అని సినిమాలో నాగేశ్వర రావు లాగా ఉత్తమమయిన డైలాగు కొడుతున్నాడు. లేదా, తమిళ నాడు లో అత్యధిక శాతం భర్తల లాగా, అమాయక భార్యలకు 'హెచ్. ఐ. వీ.' ని బహుమతి గా ఇస్తున్నారు. పెళ్ళి కాకపోతే, ఆడదాని జీవితం ఏమవునో అని తల్లి తండ్రులే, పెద్దగా అబ్బాయిల గురించి విచారించకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అదీ చింతించాల్సిన విషయం.


పూర్వం లాగా అటు అన్ని తరాలూ.. ఇటు ఇన్ని తరాలూ తెలిసి ఉన్న సంబంధాలు రావడం ఈ ఫాస్టు యుగం లో కష్టం కాబట్టి, ఇంజనీరు అల్లుడు ఇంటరు కూడా పాసవ్వలేదన్న విషయం పెళ్ళయ్యాక తెలుసుకుని నోరెళ్ళబెట్టడం లాంటి చిలిపి పనులకు తల్లి తండ్రులు ఒడికట్టడం మానాలి. అన్నీ బావుంటే, సాడిస్టిక్ లక్షణాలున్న పెళ్ళి కొడుకులు. మానసిక రోగులూ, అనుమానపు పక్షులూ - వీరి బారిన అమ్మాయిని పడేయటం ఎంతవరకూ సబబు ? ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు - మోసగాళ్ళ కు ఆడపిల్లల ను ఇచ్చి పెళ్ళి చేయడం - సగం, సమాజపు ఒత్తిడి కి లొంగిపోవడం మూలంగానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి సమాజంలో చూస్తున్నాం కాబట్టి - ఎపుడన్నా తెలిసిన సర్కిల్లో వయసు మీరిన కన్నె పిల్ల కనిపిస్తే - ఎపుడు పెళ్ళి అని ఏడిపించడమో, అయ్యో పెళ్ళి కాలేదా అని విచారించడమో చేయకూడనిపిస్తూ ఉంది. ఏమో బాబూ ! అది తప్పు ! రోజులు మారాయి.

(నేను ఏకపక్షంగా రాసినా, ఇంతటి బాధ అబ్బాయిలకి ఉండదా అని ఎవరికన్నా కోపం వచ్చినా - ఆ పరిస్థితి ని ఎదుర్కొనే మహిళ కి జరిగినంత అన్యాయం శాతం 'ఎక్కువ' అనిపించే రాశాను)


2) నయీ దిల్లీ రోజుల్లో, కిరన్ బేడీ - బంగ్లా పక్క నుంచీ తాల్ కటోరా ఉద్యానవనానికి (పొద్దున్న వాకింగు కి మాత్రమే !) వెళ్ళేటపుడు -అంత సింపుల్ ఇంట్లో ఉంటూందా ఆవిడా ? అని ఆశ్చర్య పోయేవాళ్ళం. బిర్లా మందిర్ కి సింపుల్ గా వచ్చేస్తూ ఉండేది ఆవిడ - పెద్ద స్కార్పియో లో ! చిన్నప్పట్నించీ ఆవిడ ఒక యూథ్ ఐకాన్! తొలి మహిళా ఐ.పీ.ఎస్. అధికారి. ఢిల్లీ ట్రాఫిక్ ని ఒక దారికి తెచ్చిన స్మార్ట్ పోలీస్. యునైటెడ్ నేషన్స్ లో భారత దేశం తరపున పని చేసిన వ్యక్తి. ఇపుడు - సెలెబ్రిటీ జడ్జ్ ! ఆప్ కీ కచేరీ లో ! అది సరే ! ఈవిడ - ఒక వాణిజ్య ప్రకటన లో కనిపిస్తున్నారు ఈ మధ్య ! అదీ స్త్రీ ల సౌందర్య సాధనం, మచ్చలు లేని ముఖ వర్చస్సు కోసం... నో మార్క్స్ క్రీం ను కిరణ్ బేడీ సిఫారసు చేస్తున్నారు.

ముచ్చట కలిగింది. ఆత్మ స్థైర్యానికీ, సాహసానికీ, తెలివితేటలకూ - ప్రతీక అయిన ఒక మాజీ పోలీస్ అధికారిణి - నో మార్క్స్ - రహో అంటూన్నారు. అయితే, మెచ్చుకోవాల్సిన విషయం - ఆ ప్రకటన రూపకర్తలు - ఈ ఐకాన్ ను ప్రకటనకు ఎంచుకోవడం. నేటి మహిళ ను ఆకర్షించడానికి ఉపయోగిస్తున్నారంటే, మన స్టాండర్డ్ పెరిగిందనే అనుకోవాలి. పిచ్చి పిచ్చి గా - ఆత్మ విశ్వాసానికి - చర్మం రంగుకూ - లింకులు పెట్టే, మార్కెట్ రంగం, 'బే దాగ్' (మచ్చలు లేని) సౌందర్యం కోసం, మచ్చ లేని వ్యక్తిత్వాన్ని - ప్రతీకాత్మకంగా చూపించడం, సంతోషించదగ్గ పరిణామం.




3) పనిలో పని గా ఇంకో వాణిజ్య ప్రకటన ని కూడా ప్రస్తావిస్తాను. ఒక చిన్న పాప, కార్పెట్ మీద పడుకుని పుస్తకం చదువుతూ ఉంటుంది. ఆ పాప తండ్రి పక్కనే సోఫాలో పేపరు చదువుతూ ఉంటాడు. తల్లి లాప్ టాప్ లో ఏదో చేస్తూ ఉంటుంది. పాప అపుడే చదువుతున్న పుస్తకం మూసేసి, అందులో రాకెట్ బొమ్మని చూపించి - నాన్నా నేను పెద్దయ్యాక ' ఇది ' (వ్యోమగామి) అవుతానూ అంటుంది. ఇందులో నాకు చాలా నచ్చింది.. ఆ పాప ను ఎన్నుకోవడం. భారత సమాజం లో ఆడ పిల్లల ఏంబిషన్ కి ప్రాధాన్యం ఇస్తున్నారూ అంటూ ఏదో భరోసా ఇస్తున్నట్టు ఉంటుంది ఆ ప్రకటన.

ఆ పాప ముఖ్యంగా పుస్తకం చదువుతూ ఉండటం ముచ్చట గొలిపే అంశం. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎంత మంది పిల్లలు - టీ.వీ కి అతుక్కోకుండా పుస్తకాలు చదువుతున్నారు ? అలాంటి వాతావరణం ఏదీ ఇళ్ళలో ? పైగా, ఆ అమ్మాయి లక్ష్యం, లక్ష్యం పట్ల ఆమె కున్న సందేహాలూ, తండ్రి ఇచ్చే భరోశా - ఇవన్నీ భవిష్యత్తు ని ఎంతో ఆశావహం గా చూసేలా చేస్తాయి.

You can watch the video here : http://www.youtube.com/watch?v=4y6uigiQ5EE

24/07/2009

టీ.వీ. లో ఏమిటి ?

ఏమిటంటే - ఫేమిలీ డ్రామా, డబ్బున్న మారాణుల సీరియళ్ళూ, సినిమా వాళ్ళ రకరకాల ప్రోగ్రాంలూ, వాళ్ళలో వాళ్ళనే భళా అని చరుచుకునే ఇంటర్వ్యూ లూ కాకండా - రియాల్టీ - అచ్చమైన రియాల్టీ షోలు గురించి చిన్న లెక్చర్ ! వీటిల్లో న్యూస్ చానెళ్ళను చేర్చలేదు. ఎందుకంటే, అందులో, వీలైతే కొంచెం న్యూస్, మిగతా టైం పాస్(చర్చలు, ఇంటర్వ్యూలు వగైరా), భజన, కవరింగ్, సిన్మా, గాసిప్, నేరాలూ, దర్యాప్తు ల్లో తరీఖాలూ - కొంచెం - మాల్ మసాళాల్తో కుక్కేసి, జనాల్కి ఆలోచించడానికి టైం లేకండా చేస్తారు కాబట్టి.

అందరికీ తెలిసిన విషయాలే గానీ - ఇంకోసారి రియాల్టీ షో ల లో రకాల్ని చూద్దాం.

సెలెబ్రిటీ షోలు - మన దేశంలో సాధారణంగా ఇవి నచ్ బలియే లాంటి డాన్స్ షో లు, Big Boss లాంటివి.

ఆటపట్టించే షోలు - ఎం.టీ.వీ. బకరా లాంటివి

గేం షోలు - కౌన్ బనేగా కరోర్ పతీ లాంటివి

టేలెంట్ హంట్ లు - సరేగమపా, ఇండియన్ ఐడల్, The Great Indian Laughter Challenge లాంటివి.

మేక్ ఓవర్ లు - నయా రూప్ నయీ జిందగీ లాంటివి

డేటింగ్ షోలు - రాఖీ కా స్వయంవర్ లాంటివి

భీభత్స సాహస షో లు - Who dares wins లాంటివి

న్యాయం షోలు - కిరణ్ బేడీ 'ఆప్ కీ కచేరీ' లాంటివి

ఇలా జన సామాన్యాన్ని ఒక ఊపు ఊపేసే ఈ షోలు చాలా మటుకు విదేశాల్నుంచీ ఎత్తుకొచ్చిన ఐడియాల్తోనే తయారయ్యాయి. వీటిల్లో మన దేశ వాతావరణాన్ని బట్టి, ఉద్దేశ్య పూర్వకంగా కొన్ని కార్యక్రమాల్ని కాపీ కొట్టలేక పోయారు. Eg. 'ఎప్రంటీస్' లాంటి ఉద్యోగ వేట షోనో, వంటా వార్పుల వీరుల 'హెల్స్ కిచెన్' లాంటి ప్రోగ్రాములూ, 'ఎక్ట్రీం మేక్ ఓవర్ - హోం ఎడిషన్' లాంటి డబ్బుల్తో కూడుకున్న షోలూ ఇంకా మనకి చేరలేకపోయాయి. ఇపుడు సచ్ కా సామ్నా ! సెన్సేషనల్ హిట్ట్ ! దీన్ని గురించి పెద్దల సభ లో కూడా చర్చలూ, గొడవలూ జరుగుతున్నయి. మరి ఏ పబ్లిసిటీ అయినా మంచి పబ్లిసిటీ నే అని, ఈ కార్యక్రమానికి టీ.ఆర్.పీ.రేట్లు, తద్వారా ఆదాయం పెరగడం జరుగుతుంది. ఇదెన్నాళ్ళు ?

ఒక విధంగా చూస్తే, మన దేశంలో ఎక్కువ అమ్ముడయేవి డాన్సూ, పాటల షోలు. మిగతా కార్యక్రమాల సంగతి కొస్తే, డబ్బు గెలుచుకోదగ్గ క్విజ్ ప్రోగ్రాములు తర్వతి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఈ షో ల వల్ల లాభపడేది ఎవరు ? చివరాఖర్న టీ.వీ మరియూ కార్యక్రమ నిర్మాతలే ! అయితే రియాల్టీ షో లో, మామూలు షో ల కన్నా ఎక్కువ ప్రయోజనాలున్నాయి. జనాల్లో ఉన్న కాంపిటీటివ్ స్పిరిట్ ని అది కాస్తో కూస్తో బయటకు తెస్తుంది. భూమి చిన్నది అనే ఫీలింగ్ నీ కలిగిస్తుంది.

ఇవన్నీ చూస్తే, రియాల్టీ షో ల ముసుగు లో టెలివిజన్, ఇంకొన్ని మంచి పనులు చెయ్యొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. వివిధ రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగాల నుంచీ స్పాన్సర్ షిప్ స్వీకరించి, ఏ పల్లెలోనో ఒక మంచి స్కూలు భవనం నిర్మించవచ్చు. దీని వెనక స్కూలు పిల్లల, తల్లితండృల ఎమోషన్సూ, పల్లెలో జీవితం గురించి ఇబ్బందుల గురించీ, సంఘ సేవ గురించీ కవర్ చేస్తూ, ఆయా సంస్థలకు ప్రచారం చేసి పెట్టొచ్చు. దీన్లో సిమెంటూ, ఇటుకా, కలపా, ఇంజనీరింగూ, డిజైనూ, ఇంటీరియరూ, రంగులూ - ఇలా అన్నీ, దేశంలొనే ద బెస్ట్ ఉత్పత్తులతో తయారుచేసాం అని చెప్తూ ఆయా ఉత్పత్తుల, సేవల గురించి ప్రచారం చేయొచ్చు. పైగా, నగరాల్లో కోట్ల లో వ్యాపారం చేసే రియల్ ఎస్టేటు వ్యాపార్లు పల్లెలో ఒక స్కూలు కో, ఆస్పత్రికో సరిపడేంత స్థలాన్ని విరాళం ఇస్తే, పుణ్యమూ, ప్రచారం అనే పురుషార్ధమూ దక్కించుకున్నవాళ్ళు అవుతారు.

దీనికొక సినిమా హీరో చేత అపీలు చేయించొచ్చు ! ఏ మినరల్ వాటర్ కంపెనీ నో, ఫ్లోరైడ్ నీళ్ళు దొరికే ప్రాంతం లో రక్షిత మంచి నీటి పధకం, ఆయా దాతల, విరాళాల, స్పాన్సర్ షిప్ ల సాయంతో ఏర్పాటు చేసి చూపించొచ్చు. ఏడుపుగొట్టు జీవితాలని, మనం విసుక్కునే కొన్ని అభాగ్య జీవితాల్లో చిన్ని మంచి మార్పులు తేవొచ్చు. అయితె, ఇలాంటి దేశీ రియాల్టీ షోలను ఎవరు చూస్తారు ?

మనమే చూడాలి ! ఈ షోలను అందంగా శేఖర్ కమ్ముల - ఒక 'లాంచీ ట్రిప్పు'నీ, 'విశాఖ' నీ అమ్మినట్టు అందంగా పేక్ చేసి అమ్మాలి. రియాల్టీ షో వెనుక స్పాన్సర్ షిప్ అనే బోల్డంత తతంగం ఉంటుంది కదా. దాన్ని సంపాయించడమే కాదు, నిలబెట్టుకోవాలి. అయితే, ఇలాంటి అత్భుతమైన ఐడియాలు నా బోంట్లకు (చాలా తెలివైన వారికి) వస్తూంటాయి గానీ, అమ్ముడవవు.

ఇవన్నీ మన దేశంలో ఎందుకు జరగవు అంటే, టీవీ చూడటం అనే ఆర్టు మనవాళ్ళకు వంట బట్టలేదు. మన అంత ఫ్రీ దేశం ఎక్కడన్నా ఉంటుందా ? విదేశాల్లో లాగా టీవీ కి లైసెన్సు అంటూ డబ్బులు కట్టం కనక & టీ.వీ కొనుక్కోవడం, కేబులు కనక్షనో, డిస్షో తగిలించుకోవడం, సాకెట్లో ప్లెగ్గు పెట్టడం, టీవీ చూడటం - అనే ఈజీ విధానంలో చూస్తామా, అందుకే మనకి టీ.వీ. విలువ తెలియదు. ఇంట్లో ఆడవాళ్ళయితే సీరియళ్ళూ, మగవాళ్ళయితే వార్తలూ, ఆటలూ, పిల్లలయితే కార్టూన్లూ, ముసలాళ్ళుంటే, భక్తీ, పాత సినిమాలూ.. తప్ప ఇంకేవయినా చూద్దామని ఎవరికన్నా తోస్తుందా ? వెరైటీ కోసం చూసే రియాల్టీ షో లు పిల్లలతో చూడదగ్గగా లేకపోయినా పర్లేదు. ఇదీ మన మనస్థత్వం.

అందుకే రియాల్టీ షోలకి మన దేశ రియాల్టీ కాస్త జోడించి - బాధ్యతాయుతం గా ఎవరన్నా తీసేరే అనుకోండి - ఎంతమంది జనం చూస్తారంటారు ? అందుకే, ఈ రియాల్టీ టెలివిజన్ విదేశీ ఆత్మ తో మన కళ్ళకి గంతలు కట్టేసి మరీ పనికిమాలిన కలలు చూపించేస్తుంది. ప్రచారం కావాలనుకున్నవాళ్ళకు ప్రచారం, అవకాశాల్లేనివాళ్ళకు ఉపాధీ కల్పించేస్తూ - ఉరుకులు పరుగుల్తో దూసుకెళ్ళిపోతూ ఉంది - మరిన్ని కాపీ ప్రోగ్రాముల దిశగా !

ఇతి వార్తాః

23/07/2009

కొన్ని జ్ఞాపకాలు


లూసేన్ (స్విట్సర్లాండ్)లో ముసురు లో లేక్


ఈఫిలు టవర్ నుంచీ పారిస్ నగర దృశ్యం



పగలు - ఈఫిలు టవర్



రాత్రి లో ఈఫిలు టవర్



జెనీవాలో రోడ్లు కడగటం


పారిస్ లో రిపబ్లిక్ మెట్రో స్టేషన్ బయట మొక్క బుట్టలు

15/07/2009

Khosla ka Ghosla

ఏముంది ? ఇల్లు కట్టుకోవాలి - ఇది స్వప్నం ! ఇదే కధ ! వాస్తు ప్రకారం, భవిష్యత్ ప్రణాళికల ప్రకారం, అన్నిరకాలుగా సరిపోయే బంగారం లాంటి ఇంటి స్థలం, జీవితకాలపు ఆర్జనంతా మదుపుపెట్టి కొన్నారు. ఇల్లు 'ఇలా కట్టాలీ, అలా కట్టాలీ' అని ప్లాన్లు వేసుకుంటున్నారు. వారానికోసారి కాబోలు ఇంటిల్లిపాదీ స్థలం చూడ్డానికెళ్తారు. అదో తంతు ! పిల్లలకి తండ్రి చాదస్తం అంటే పరిహాసం, విసుగు ఇంకా.. సానుభూతి ! అయినా తప్పది. సొంతిల్లు, ఖోస్లా గారి కల ! ఈ కల కోసమే చాన్నాళ్ళు కష్టపడ్డారు !

తీరా 30 లక్షలిచ్చి స్థలం కొంటారు. ఒక ఆదివారం, ఎండలో సైటుకి వెళ్ళి చూస్తే, స్థలం కనబడదు. పటిష్ఠమైన కాంపౌండూ, దానిమీద వేరే వ్యక్తి పేరూ కనబడతాయి. లబో దిబో మనే ముందు ఏదో పొరపాటు జరిగిందనుకుంటారు. మెల్లగా ప్యార్ సే (ప్రేమగా) మాటడ్డానికి ప్రయత్నిస్తే, ఆ స్థలం ఖురానా అనే తిమింగలం గారు కబ్జా చేసారని తెలుస్తుంది. పాపం చిన్ని చేప ఖోస్లా గారు - నానా తిప్పలూ పడి, ఖురానా గారి ఎడ్రసు సంపాయించి, అవమానాల్నెదుర్కొని, తిమింగలం దగ్గరకు వెళ్ళి - మాట్లాడతారు. 15 లక్షలు (ఒరిజినల్ ధర మీద 50% చెల్లిస్తే) స్థలం తిరిగి మీ చేతికిచ్చేస్తాం అని కబ్జాదారులు చెప్తారు/బ్రోకరు ద్వారా చెప్పిస్తారు. పైగా ఇదేదో నిజం డీల్ లానే - ఇంత చీప్ గా మీకు సౌథ్ ఫేసింగ్ ఇల్లు దొరుకుతుందా చెప్పండి ? అని బుకాయించేసారు.


ఇదీ ఖోస్లా కా ఘోస్లా ! రియల్ ఎస్టేట్ దుండగత్వం, పెద్ద పెద్ద బిల్డర్లు చేసే కబ్జాలూ, అంకుల్జీ అంటూనే, తడి గుడ్డతో గొంతుకోసే రకాలూ - ఢిల్లీ, హర్యాణా వాసుల భాషా, దౌర్జన్యం - ఇవన్నీ చక్కగా పెనవేసి, మన కళ్ళ ముందే ఖోస్లా గారిని ముప్పతిప్పలు పెట్టించే ఈ సినిమా - ప్రధానంగా నిష్టూరమైన కామెడీ !


ఖోస్లా (అనుపం ఖేర్) ఒక సాధారణ డిల్లీ వాసి. రాజ్మా చావల్ తినడం (భార్యా బాధిత లక్షణం - ఈజీ కదా అని ఆవిడ రోజూ అదే వొండుతుంది), పొద్దున్నే వాకింగూ, లాఫింగ్ క్లబ్బులో సభ్యత్వం,చార్టెర్డ్ బస్సులో ప్రయాణం - ఇలా ఆయనొక సగటు ఢిల్లీ పౌరుడు ! ఈయనకున్న పిల్లల్లో చిన్నాడు చిరోంజీ లాల్ (చెర్రీ) ఒక్కడే కాస్త కుదురైనవాడు - మల్టీనేషనల్ లో సాఫ్ట్వేరు ఉద్యోగం చేస్తున్నడు. పెద్దాడు (రన్వీర్ షౌరీ) పెద్దగా చదూకోలేదు - షేర్ల వ్యాపారంలో ఉంటాడు. కూతురు టీనేజ్ పిల్ల !

ఈ ఫ్లాటు గొడవల్లో, చిన్నాడు చెర్రీ అమెరికా వెళిపోతానంటాడు ! ఫ్లాటు చూస్తే కబ్జా అయింది. ఖురానా గారు ఫ్లాటులో గూండాలని పెట్టి ఉంటాడు. ఇంక లాభం లేదని జబర్దస్తీ గా పెద్ద కొడుకు - పహిల్వాన్లతో స్థలం ఖాళీ చేయిస్తాడు. తెల్లారేసరికీ పోలీసులు ఖురానా స్థలాన్ని ఖోస్లానే ఆక్రమించబోయాడని, ఇంటికొచ్చి అరెస్టు చేసి తీసుకుపోతారు. సామ, దాన, దండో పాయాలు పనిచేయకపోగా, ఖోస్లా గారి కుటుంబం పరువు వీధినపడుతుంది.

సరే ! ఆ భూమి కి 12 లక్షలివ్వండి - ఖాళీ చేస్తానంటాడు తిమింగలం. అన్నివిధాలా దెబ్బతిన్న ఖోస్లా గారు దిగాలుపడిపోతారు. స్థలాన్ని తమకు అమ్మిన బ్రోకరు కూడా తిమింగలం తో చేతులు కలిపాడని నెమ్మదిగా అర్ధం అవుతుంది. ఈ పరిస్థితుల్లో చెర్రీ అమెరికా వెళ్ళడం అనేది ఊగిసలాడుతూ ఉంటుంది. చెర్రీ కి వీసా ఇప్పించబోయిన ఇంకో బ్రోకరు విషయం తెల్సుకుని సహాయం చేస్తానంటాడు. ఆ తరవాతంతా మలుపులూ, ఉత్కంఠా, కేవలం చాన్స్ తీసుకుని - చేసిన ఈ ప్రయత్నంలో అన్నీ అనుకూలించి, పెద్ద తిమింగలాన్ని బుట్టలో వేసి, మోసం చేసి, ప్రభుత్వ భూమినే అంటగట్టి, అమ్మి, కసి తీర్చుకుంటారు ఆ తిమింగలం బాధితులు. ఈ మోసం (రివర్సు మోసం) చేస్తున్నంత సేపూ నిజాయితీపరుడైన ఖోస్లా గా అనుపంఖేర్ అంతర్మధనం, తండ్రి మీద కుటుంబ సభ్యుల ప్రేమాదరాలతో కూడిన ఆప్యాయతా, అయినా తండ్రి కోసం, ఆయన ఎదుర్కొన్న మానసిక వ్యధ కు, కోల్పోయిన ధన, మనశ్శాంతులకోసం పిల్లలు పడే తాపత్రయం - వారి స్నేహితుల ఉదారత, ఇవన్నీ కదిలిస్తూ ఉంటాయి. ఈ కామెడీ డ్రామాని చూస్తే తప్ప నిస్సహాయతలో - 'క్యా కరేంగే భయి - కహా జాయెంగే భయి ?' అని పాడుకోవడంలో కిక్కు తెలిసి రాదు.


తిమింగలం ఖురానాగా బొమన్ ఇరానీ, ఖోస్లా గా అనుపం ఖేర్, ఎప్పట్లాగే సహజ నటనతో అదరగొట్టేసారు. నటన తో జనాల్ని మైమరిపింప చేసింది మిగతా నటీనట వర్గం ! రన్వీర్ షౌరీ, ప్రవీణ్ డబాస్ (పీటర్ ఇంగ్లండు మోడల్), వినయ్ పాఠక్ (ఈయన సినిమా 'భేజా ఫ్రై' - ఎన్నో ఆశలతో చూసాను ఖోస్లా కా ఘోస్లా అనుభవంతో ! చప్పగా ఉండింది) నవీన్ నిశ్చల్,తారా శర్మ ఇంకా, మిస్సెస్ ఖోస్లా గా కిరణ్ జునేజా - అతికినట్టు సరిపోయి, జీవించేసారు. ఢిల్లీ వాలాలు, వాళ్ళ జీవితాల్ని ప్రతిబింబించిన ఈ సినిమా, ప్రధానంగా - ఒక జరగగలిగే సంభావ్యతనే ఆధారంగా చేసుకుని అల్లిన కధని నమ్ముకుంది. హీరో ఎడంచేత్తో కొడితే, నాలుగయిదు పల్టీలు కొడుతూ ఒకేసారి నలుగురయిదుగురు ఫైటర్లు పడిపోవడంలో సాంభావ్యత ని అచ్చంగా నమ్మేసే ప్రేక్షకులు - ఖోస్లా గారి బుల్లి బృందం, మోసాన్ని మోసంతోనే కొయ్యడం అనే ప్రిన్సిపల్ మీద - ఖురానా అనే తిమింగలాన్ని మోసం చెయ్యడం - అనే దాన్ని కూడా నమ్మేయాలి ! కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని వెర్రివాళ్ళని చేసేస్తాయి. కానీ ఈ సినిమా అలా కాదు. ఆమధ్య తెలివయిన సినిమాలు కూడా వచ్చాయి. ఇదీ ఆ కోవలోనిదే !అసలీ సినిమానే ఒక తమాషా అయిన అనుభవం. ఎక్కడ తేడా / అనుమానం వచ్చినా, మొత్తం వ్యవహారం బెడిసికొట్టేది ! ఈ కామెడీ లో ఉత్కంఠ ని పట్టి ఉంచేలా చెయ్యడం దర్శకుని ప్రతిభకు నిదర్శనం. పాటలు బావున్నాయి. కధా బావుంది. దర్శకుడు దిబాకర్ బెజర్జీ - ఈ సినిమాతోనే మురిపించేసాడు! టైటిల్స్ దగ్గర్నుంచీ గమ్మత్తుగా అనిపించే సినిమా ఆరంభం కూడా - తెలివిగా, సరదాగా ఉంటుంది.

బోరుకొట్టిన సాయంత్రాలు - వర్షం కురిసే మద్యాహ్నాలూ, మసాలా తేనీరు సేవిస్తూ చూడాల్సిన సినిమా !

29/06/2009

The Last king of Scotland

ఈ వారం అనుకోకుండా ఒక మంచి సినిమా చూసాను. ఇది 'ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్'. ఏదో మామూలు మూడ్ లైట్ చేసుకుందామని, దీని ఓ, నా, మా లు తెలీకండా, ఇదేదో ఫన్నీ సినిమా అనుకుని, చూసాను గానీ, కొంచెం కధ లో మునిగేదాకా నేనెందులో పడ్డానో తెలిసిరాలేదు. ఒకసారి నా బ్లాగ్ లో 'ఇండిపెండెంట్'గారు, 'కొలంబియా లో ఇంగ్రిడ్ విడుదల' గురించి రాసినపుడు, వ్యాఖ్యానిస్తూ, ఆపరేషన్ ఎంటెబ్ గురించి వీడియో లింక్ ఇచ్చారు. వీడియో పని చెయలేదు గానీ, దాన్ని గురించి అపుడే వికీపీడియాలో చదివి థ్రిల్ అయ్యాను. ఈ సినిమాలో ఆపరేషన్ ఎంటెబ్ కొంచెం కల్పితంగా ఉంటుంది.

ఈ సినిమా ప్రధానంగా, ఉగాండా నిరంకుశ అధినేత, నరరూప రాక్షసుడిగా పేరు తెచ్చుకున్న 'ఈడీ ఆమిన్' జీవితం గురించి - సగం నిజం, సగం కల్పనా కలిపి, ప్రముఖ జర్నలిస్ట్ గైల్స్ ఫోడెన్, తన కళ్ళారా చూసిన వాస్తవాల సాయంతో రాసిన నవల, 'The Last King of Scotland' ఆధారంగా తీసినది. సినిమా - స్కాట్లాండు లో అపుడే వైద్య విద్య లో పట్టబధ్రుడైన - విలాస పురుషుడు - జీవితంలో కొంత వినోదం, కొంత సాహసం ఉండాలనుకునే నవ యువకుడి పరిచయంగా - హీరో - డా.నికోలస్ గారిగన్ పరిచయంతో మొదలు ! కేవలం - సరదాకి, కొంచెం సాహస జీవితం అంటే ఉన్న కుతికీ - కోతి లాంటి బుద్ధితో, కేవలం చాన్సు తీసుకుని ఆఫ్రికన్ దేశమయిన ఉగాండా కి ఒక మిషనరీ కోసం పనిచేయడానికి వస్తాడు నికోలస్.


నికోలస్ దిగేసరికీ, దేశం అంతా, తుపాకులూ, టాంకులూ, సైనికులూ - భీభత్సంగా ఉంటుంది. ఇదేంటీ - అని అడిగితే, మిషనరీ నడిపే వ్యక్తి భార్య ఇది 'కూ' (సైనిక తిరుగుబాటు) అనీ, 'మిల్టన్ ఒబటు' ప్రభుత్వాన్ని కూలదోసి, కొత్తగా 'ఈడీ అమిన్' అధ్యక్షుడయ్యాడనీ, అందుకే ఈ సంత అంతా అని, కూల్ గా చెప్తుంది. ఉగాండా చాలా అస్థిరమైన దేశం. ఇక్కడ సైనిక పాలనా, తిరుగుబాట్లూ, నియంతృత్వం, ఆటవిక పాలనా, సర్వ సాధారణం.

మొత్తానికి ఆ దేశంలో జరుగుతున్న 'సంబరాన్ని ' కాస్త దగ్గరగా చూసే అవకాశం వస్తుంది. కొత్త అద్యక్షుడి స్వాగతం (!) కోసం నికోలస్ పని చేస్తూన్న మారుమూల ప్రాంతాల్లో, గన్ పాయింటు కింద ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంబరాలకు ఈడీ అమిన్ వస్తాడు. ప్రజల ముందు 'నేనూ మీ వాడినే - అని ఉపన్యసిస్తాడు. ఆఫ్రికన్ పాటలు పాడతాడు. నృత్యాలు చేస్తాడు. అచ్చం మన రాజకీయ నాయకుల్లానే, ప్రజల మనసు గెలుచుకునే ఫీట్లు చేస్తాడు. ఇక్కడే అమిన్ ను మొదటి సారి చూసిన నికోలస్, ఈ అధ్యక్షుడు మంచివాడేనేమో అనుకుంటాడు. కానీ ఆ దేశంలో చాలా ఏళ్ళుగా ఉన్న మిషనరీ సభ్యురాలు మాత్రం, ఇదంతా బూటకమని చెప్తుంది.

ఇలా ఉంటూండగా, ఒకసారి, డాక్టర్ని వెతుక్కుంటూ, నికోలస్ దగ్గరికి సాయుధ సైనికులు కొందరు వస్తారు. అధ్యక్షులవారికి ఆ పల్లెటూరి దారెమ్మట వెళ్తూంటే, రోడ్డు పక్కన నడుస్తున్న ఒక ఎద్దు కొమ్ము తగిలి, చేతికి గాయమైంది. ఎద్దు కూ ఆయన ప్రయాణిస్తున్న జీపు తగిలి గాయాలయ్యాయి. ఎద్దు మరణ యాతన పడుతూ ఉంటుంది. దాన్నీ, దాన్ని పట్టుకున్న రైతునూ రోడ్డు పక్కకు ఈడ్చి, అధ్యక్షులు నొప్పితో చిందులు వేస్తుంటే, ఆ పల్లె లో డాక్టరు కోసం వస్తారు వీళ్ళు. నికోలస్ - వెంటనే వెళ్ళి, ఆమిన్ కు పరిచర్య చేస్తాడు. ఈ లోగా ఎద్దు - ఆ పక్కనే పడి, గోల గోలగా రోదిస్తూంటే, విసుక్కుని, ఆమిన్ పిస్టల్ తీసుకుని దాన్ని కాల్చి చంపేస్తాడు నికోలస్. ఆ ధైర్యానికి, ఈడీ అమిన్ పిస్టల్ నే తీస్కుని, అతని ఎదుటనే - ఎద్దుని చంపిన అతని సాహసాన్నీ, ఈడీ అమిన్ అభిమానిస్తాడు. మాటలు పొడిగిస్తూ, నికోలస్, స్కాట్ లాండ్ నుండీ వచ్చినట్టు తెలుసుకుని, ఈడీ ఆమిన్ స్నేహ హస్తం చాస్తాడు.


తనకు పెర్సనల్ డాక్టర్ గా ఉండమని, నికోలస్ ను కంపాలా వచ్చేయమని, ఆహ్వానిస్తాడు. మొదట ఈ ఆహ్వానాన్ని తిరస్కరించినప్పటికీ, అమిన్ చరిష్మా ని చూసి, భ్రమలో - నికోలస్ ఒప్పుకుంటాడు. సహజంగా, అతను స్కాటిష్ బూర్జువా కుటుంబం నుంచీ వచ్చినవాడు కావడం వల్ల, కంపాలా లో విలాస వంతమైన జీవితం, పూల్ సైడ్ పార్టీలూ, అందమయిన భవంతులూ, అమిన్ స్వయంగా బహూకరించిన మెర్సిడెస్ కారూ, నికోలస్ది కూడా, ఇది ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దాం - అనుకునే తత్వం వల్ల... అతను ఉగాండా దేనికొచ్చాడో మరిచిపోయేలా - చేసి, చూస్తూండగానే నికోలస్ రోజు రోజుకీ ఊబిలో కూరుకు పోతూంటాడు.

ఈ లోగా బ్రిటిష్ డిప్లోమాట్ లు - నికోలస్ తో మంతనాలు చేస్తుంటారు. నికోలస్ ఈ నియంత కు వ్యక్తిగత డాక్టర్, పైగా సన్నిహితుడు గాబట్టి, అతని ద్వారా, ఈ నియంతను తుదముట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే, ఈడీ అమిన్ - దురాగతాల గురించి చూచాయ గా తెలిసినా, ఉగాండా గురించి అతను ఏదో కల కంటున్నాడనీ, ఉగాండా లో మంచి పరిస్థితులు రావడం కోసమూ, ప్రత్యర్ధులను తొలగించుకోవడం కోసమూనే అమిన్ అలా రాక్షసుడి లా మారణ హోమాలు జరిపిస్తున్నాడనీ, అమిన్ మామూలుగానైతే మంచోడే అని - తాను ఇందులో పార్ట్ కాననీ - నికోలస్ భ్రమల్లో ఉంటాడు.

చూస్తూండగా, ఆమిన్ - 5గురు భార్యల్లో, నాలుగో భార్య, అందమయిన నల్ల శిల్పం, 'కే' తో పరిచయం మొదలవుతుంది. అప్పటికి - 'కే' కు ఒక మూర్చ వ్యాధిగ్రస్తుడైన కొడుకు పుట్టినప్పట్నించీ, అమీన్, ఆమెను దురదృష్టవంతురాలిగా భావించి, మిగిలిన భార్యల కు దూరంగా వేరొక భవంతి లో పెడతాడు. ఈ దురదృష్టవంతురాలికీ, నికోలస్ కూ ప్రేమ - ఆకర్షణా, రహస్య ప్రణయం కొనసాగుతాయి. కే కు తాను గర్భవతి అని తెలుస్తుంది. ఈ విషయం భర్త కు తెలిస్తే, తనని చంపేస్తాడని భయబ్రాంతురాలైన ఆమె, డా.నికోలస్ ను ఎబార్షన్ చేయమని అడుగుతుంది. కానీ అప్పటికే - అమీన్ - అన్ని రకాలుగా నికోలస్ ను చుట్టుముట్టి ఉంటాడు. తీయగా మాట్లాడుతూ, అనూహ్యమైన ఎత్తులు వేస్తూ, అతని పాస్పోర్ట్ కూడా నాశనం చేసి, అతనికి ఉగాండన్ పాస్పోర్ట్ ఇచ్చి - దిగ్భంధనం చేసేస్తాడు.

తీరా - అనుకున్న సమయానికి నికోలస్ రాలేకపోవడంతో నాటు వైద్యుడి దగ్గరకు వెళ్ళిన 'కే' ను అమిన్ ఆదేశాల మేరకు సైనికులు హత్య చేసి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు గా నరికి, ప్రదర్శనకు పెడతారు - 'అధ్యక్షుడిని మోసం చేసే వారి గతి ఇంతే!' అని ప్రజలను భయపెట్టేందుకు. ఆ తరువాత అక్కడికి చేరుకున్న నికోలస్, ఆమె శవంలో, ఆమిన్ - రాక్షసత్వాన్ని చూసి, వెర్రెక్కిపోతాడు. అంతకు ముందే అధ్యక్షుడిని వ్యతిరేకించిన వారూ, ఉదారవాద ఉగాండన్లూ - అహింసావాదులూ ఒక్కొక్కరూ అదృశ్యం అవుతూండటం గురించి బ్రిటిష్ డిప్లొమాట్లు నికోలస్ తో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలా 'కే' చావు, తదనంతరం-తన చావు, తన ముందు కనిపిస్తూండే వరకూ, అమిన్ రాక్షసత్వాన్ని అర్ధం చేసుకోలేని నికోలస్, ఆ క్షణంలో ఆవేశంతో ఊగిపోతాడు. బ్రిటిష్ డిప్లొమాట్ ను కలిసి, తన పరిస్థితి చెప్పి, దేశం వదిలి వెళ్ళడానికి సహాయం కోరతాడు. ఆ డిప్లొమాట్ - అమిన్ ను చంపే షరతు మీద సహాయం చేస్తానంటాడు.

క్లైమాక్స్ లో అమిన్ కు తల నొప్పి మందు ఇచ్చే మిష మీద కలవడానికి వెళ్తాడీ డాక్టర్. అక్కడ ఈలోగా వివిధ దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్న కొందరు కరుడుగట్టిన పాలస్తీనియన్ తీవ్రవాదుల విడుదల కోసం, ఏర్ ఫ్రాన్స్ విమానం ఒకటి పాలస్తీన్ తీవ్రవాద సోదరుల చేత హైజాక్ చేయబడి కంపాలాలో ఎంటెబ్ విమానాశ్రయంలో దిగిందని కబురొస్తుంది. వెంటనే అక్కడికి వెళ్తాడు అమీన్, వెంటే, నికోలస్! ఈ లోగా నికోలస్ మీద అనుమానంతో అతన్ని అరెస్ట్ చేస్తారు అధ్యక్షుడి అంగరక్షకులు! నికోలస్ అధ్యక్షుడికి ఇవ్వబోయేవి తలనొప్పి మందులు కావనీ, విషం అనీ కనిపెడతారు. అమిన్, ఇజ్రాయెలు ప్రభుత్వం తోనూ, అంతర్జాతీయ సమాజం తోనూ సంప్రదింపులు జరుపుతూ, తన దేశపు విమానాశ్రయాన్ని తీవ్రవాదుల అడ్డా గా ఉపయోగించుకోవడాన్ని సమర్ధిస్తూ - ఈ మధ్య లో ఒక సారి - నికోలస్ ను కలుసుకోవడానికొచ్చి, 'నీ గురించీ, కే గురించీ నాకు తెలుసు నికోలస్ - మా గ్రామంలో ఇలా ఇంకొకరి భార్య ను తీసుకున్నవాణ్ణి ఏమి చేస్తారో తెలుసా ? వాడి చర్మానికి హుక్స్ తగిలించి, వాణ్ణి అలానే చెట్టుకి ఎత్తులో వేలాడేస్తారు - ఆ రక్తం కారి కారి ఏ మూడు నాలుగు రోజులకో వాడు చస్తాడు. నువ్వూ అలానే చావాలి కన్నా !' అని చెప్పేసి, విశ్రాంతి తీసుకోవడానికి వెళిపోతాడు. సరిగ్గా ఇదే శిక్ష ని నికోలస్ కి అమలు చేస్తారు !

అప్పటికి - బందీ ల విషయం లో కొంత నిగోషియేష్ నడిచి, ఒక 100 మంది దాకా యూదులు కాని వారినీ, ఇజ్రాయిలీ లు కానివారినీ విడుదల చెయాలని నిర్ణయం జరుగుతుంది. మిగిలిన 122 మంది బందీలూ ఎంటెబ్ లాబీ లో ఉండిపోతారు. వీరిని తీసుకెళ్ళడానికి ఒక కార్గో విమానం వస్తుంది. దాన్లో వెళ్ళేందుకు బందీలను గుంపులుగా విడదీస్తూ ఉంటారు.

ఈ భయానక పరిస్థితుల్లో ఒక ఆశాకిరణం - అమిన్ కు ఇంతకు ముందు పెర్సనల్ డాక్టర్ గా పని చేసి, ఇప్పుడు కంపాలా లో అధ్యక్షుడు నిర్మించిన ఇంకో ఆధునిక ఆస్పత్రి లో పని చేస్తున్న డాక్టర్ - జుంజూ, ఆ సమయానికి విమానాశ్రయం లో క్షతగాత్రులయిన ఏర్ ఫ్రాన్స్ ప్రయాణీకుల కోసం వచ్చి వుంటాడు. అతనికి నికోలస్ పరిస్థితి మీద జాలి కలుగుతుంది. అప్పటికి - మొదట్లో నికోలస్ ను కొంచెం తిరస్కారంగా చూసినా, నికోలస్ కు మానవత్వం ఉందని, అతను అమిన్ కు అత్యంత సన్నిహితుడయ్యేంత రాక్షసుడు కాడనీ - అతను కేవలం ట్రాప్ చేయబడ్డాడనీ, అర్ధం చేసుకున్న డా. జుంజూ - ఒక హాలు లో చాతి కి ఇనుప కొక్కేలు తగిలించి సీలింగ్ కు వేలాడుతున్న నికోలస్ ను ఎవరూ చూడకుండా రక్షించి, డ్రెస్సింగ్ చేసి, రక్తాన్ని తుడిచి - ఇంక నువ్వీ దేశం లో ఉండొద్దు, బైటి ప్రపంచానికి ఈ దేశాన్ని గురించీ, అమిన్ గురించీ చెప్పు - అని - సగం మంది ప్రయాణీకులు విడుదల అవుతున్నారు - నువ్వు వాళ్ళలో కలిసిపో ! అని చెప్పి, నెమ్మదిగా విడుదల ఔతున్న కొందరు నాన్-ఇజ్రాయిలీ బందీ లతో నికోలస్ ను కలిపేస్తాడు. ఇలా నికోలస్ ను రక్షించినందుకు జుంజూ ను కాల్చి చంపేస్తారు.

నికోలస్ ఆ విమానంలో ఉన్నడని అమిన్ కి తెలిసేసరికీ, విమానం టేక్ ఆఫ్ అయిపోతుంది. అలా మృత్యువు కోరల దాకా వెళ్ళి, వచ్చిన డా.నికోలస్ - కేవలం కల్పిత పాత్రే అయినా, అమిన్ రాక్షసత్వాన్ని బయట పెట్టేందుకు - చక్కని ఉదాహరణ ! కనీసం మూడు మిలియన్ల మంది అమాయక ఉగాండన్ ప్రజల్ని ఈడీ అమిన్ మట్టు పెట్టాడు. ఎపుడు తన మీద దాడి / హత్య కు కుట్ర జరిగినా తను ఎలా చనిపోతాడో,తనకు తెలుసు అనీ , తన చావు తన కల లోచూసాడనీ అంటూ - ఆవేశంతో మరిన్ని హత్యలకు పూనుకునే అమిన్ - ఫక్తు బ్రిటిష్ వ్యతిరేకి. స్వప్రయోజనాల కోసం, వివిధ దేశాల్లో పావులు కదుపుతూ, రాజకీయ అస్థిరత కు వాళ్ళే కారణమనీ, బ్రిటన్ పక్కనే ఉన్న స్కాట్లాండ్ వాసుల్లానే తమదీ, బ్రిటన్ తో పారంపరిక శతృత్వం అనీ, అందుకే స్కాట్లు తమ సోదరులనీ, తాను స్కాటిష్ కింగుననీ, తనకు తానే బిరుదిచ్చుకున్న ఘనుడు !


నెనెన్నో డీటైల్స్ చెప్పకుండా వొదిలేశాను గానీ - ఈ సినిమా లో - అమిన్ నిరంకుశత్వాన్ని, అతని రాక్షసతాన్నీ చూసేసరికీ గుండెలవిసి పోతాయి. పైగా నికోలస్ తో కూల్ గా చరిస్మాటిక్ గా వ్యవహరిస్తూ, పెద్ద ఉదారవాది లాగా ప్రపంచానికి ఫోసిచ్చే ఈ నియంత - రెండో కోణం - అత్యంత హేయం !!

అమిన్ గా నటించిన ఫారెస్ట్ స్టీవెన్ విటేకర్ కు అకాడమీ అవార్డ్ లభించింది. క్షణానికో మూడ్ లో ఉండే ఈ భయంకర పాత్ర పోషించినందుకు అతనికి జోహార్లు. మన ఎక్స్ ఫైల్స్ హీరోయిన్ స్కల్లీ ఎంతో అందంగా కనిపిస్తుంది మిషనరీ నడిపే అతని భార్యగా ! భీభత్సాన్ని తట్టుకోగలిగితే - తప్పకుండా చూడొచ్చు.

ఈ సినిమా కల్పిత ముగింపు తరవాత, ఎన్ని చర్చలు జరిపినా వినట్లేదని, నిజంగానే ఆపరేషన్ ఎంటెబ్ - అనే మిలిటరీ ఆక్షన్ ద్వారా - ఓ చీకటి వేళ, ఎంతో పక్కాగా ప్రణాళిక తొ సిద్ధమయి, నాటకీయంగా దాడి చేసి, ఎంటెబ్ విమానాశ్రయంలో ఏర్ ఫ్రాన్స్ బందీలందర్నీ ఇజ్రాయిలీ సైన్యం విడిపించుకు పోయింది. ఇలా దాడి చేసి, ఒక దేశపు సార్వభౌమత్వానికి విఘాతం కలిగించారని ఉగాండా - ఐక్యరాజ్య సమితి లో దొంగ ఏడుపులు ఏడిచింది. ఇలాంటి సినిమాలు చూస్తే, స్వతంత్ర భారత దేశం లో పుట్టినందుకు మనమెంతో పుణ్యం చేసుకున్నామని అనుకోవాలి.

01/06/2009

సరళ భగవద్గీత


కొత్త పాళీ గారి ఈ నెల కబుర్లలో రామకృష్ణ గారి షిర్డీ సాయినాధుని మీద ఉత్పలమాల, చంపకమాల్లో శతకం ప్రస్తావన ఉండేసరికీ నాకీ 'సరళ భగవద్గీత ' గుర్తొచ్చింది. ఇది మా స్నేహితురాలి మామగారయిన శ్రీ వుగ్రాల శ్రీనివాసరావు గారు రచించగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో ప్రచురింపబడిన ఒక మంచి పుస్తకం.

ఈ పుస్తకాన్ని గురించి రాయాలని ఎన్నో సార్లు అనుకున్నా, పద్యాల మీద అంత జ్ఞానం లేకపోవడం వల్ల, రాయడానికి ధైర్యం చాలలేదు. కానీ ఇపుడు మాత్రం కనీసం పరిచయం చెయ్యడం వల్ల పద్యాల మీద ఆశక్తి ఉన్నవారు కనీసం ఈ పుస్తకం గురించి తెలుసుకుంటారని రాస్తున్నాను. ఈ పుస్తకం లో పద్యాలన్నీ 'ఆటవెలది' లో చాలా సరళంగా, అందరికీ అర్ధమయ్యే సులభమయిన భాష లొ రాయడం జరిగింది.

కాంప్లిమెంటరీ కాపీ గా నేను కొట్టేసిన ఈ పుస్తకం వెల కేవలం 100/- మాత్రమే. పుస్తకాన్ని పరిచయం చెయ్యడానికి కావలసిన ప్రజ్ఞ లేకపోవడం చేత ఆచార్య కశిరెడ్డి గారు రాసిన పరిచయం లో కొంత భాగాన్ని - అతి క్లుప్తంగా - ఇక్కడ రాస్తున్నాను.


(య ఏవం వేత్తిహంతారం .... రెండవ అధ్యాయంలో 19 వ శ్లో ||)
కు ఆటవెలది అనువాదం చూడండి !

ఆత్మనెవడు దలచు హంతకుడగునంచు
ఆత్మనెవడు చచ్చు నంచుదలచు
ఇద్దరును నిజంబు నెఱుగని వారలే
చందెన్నడాత్మ చావదెపుడు

(వా సాంసి జీర్ణాని ... కి ఆటవెలది ..)

వస్త్రములు చిరిగిన వదలిపెట్టి యెటుల
క్రొత్త వస్త్రములను కోరు నరుడు
పనికిరాని తనువు పారవైచి యటుల
క్రొత్త తనువు నాత్మ కోరి పొందు

సాంఖ్యయోగంలో 'హతో వాప్రాప్స్యసే .. అనే శ్లోకానికనువాదం మూలంలో ఉన్న అర్ధానికన్నా, రచయిత కొన్ని చేర్పులు చేయడం వల్ల అర్ధం స్పష్టమై - సరళమైంది. విషయ స్పష్టతకు రచయిత అక్కడక్కడా మూలలో లేని చిన్ని అంశాన్ని చేరిన ఘట్టాలు ఉన్న ఉదాహరణ :-

చంపబడితి వేని స్వర్గంబు దొరకును
కలుగు రాజ్య సుఖము గెలుచుకొన్న
ఏది తగును నీకు నెంచుకో కౌంతేయ !
పోరు సలుపలెమ్ము ఊరుకొనక.





పద్యాలలో గీతా మకరందాన్ని అందుకోదలచిన పాఠకులకు ఈ ఆటవెలది లో భగవత్గీత నిజంగా చాలా నచ్చుతుంది. అందుకే ఈ .. ప్రయత్నం!

'సరళ భగవత్గీత'
రచయిత : వుగ్రాల శ్రీనివాస రావు
వెల : రూ.100/-

ప్రతులకు : సరళ ఆధ్యాత్మిక ప్రచురణలు
7-1-282/C/33
ప్లాట్ నెం. 101, సాయి డ్రీం హౌస్
శ్రీ రాం నగర్, బల్కంపేట
హైదరాబాదు - 500 038
ఫోన్ : 9347510558

22/04/2009

చాక్లెట్ కత్తులు

మా హీరో ప్రోజెక్ట్ కోసం జెనీవ్ ప్రయాణం కట్టినపుడు ఒక స్నేహితుడు 'అయితే నీకు స్విస్ బాంకు అకౌంటు ఉంటుందిరొయ్ !' అని చెణికేరు. అపుడు గానీ మాకా విష్యం తట్టనే లేదు. అంతవరకూ అక్కడ ఇళ్ళు దొరకకపోవడం గురించీ, మనకు ఫ్రెంచీ, ఇటాలియనూ రాకపోవడం గురించీ చింత పడిన తరవాత, ఈ సంగతి పట్టుకుని, మేము కూడా మా హీరోని ఉబ్బేసి పంపించేశేము ! అద్వానీకి ఇపుడు ఏమీ తోచక, అమెరికన్లు ఇచ్చిన అయిడియా ఒకటి పట్టుకుని స్విస్సు బాంకుల వెంట పడటంతో ఈ విషయం మళ్ళా గుర్తొచ్చింది.

చిన్నప్పుడు నేను రేడియోలో వాతారరణ సూచనలు వినేటపుడు 'భారీ వర్షం ' అనే పదానికీ, పేపరు చదివేటపుడు 'స్విస్ బాంకు ' అనే పదానికీ అర్ధం తెలీక తికమక పడేదాన్ని. భారీ వర్షం అంటే ఇందృడి భార్య శచీ దేవి కుర్పించే వర్షం అని అర్ధం అయింది గానీ - ఈ స్విస్ బాంకు అంటే ఏమిటో తెలిసేది కాదు. ఈ లాజిక్ కి వెనుక వాళ్ళు భార్య వర్షం అనే అంటున్నారేమో గానీ అది నాకు భారీ అని వినిపిస్తోంది లే అని ఖచ్చితంగా నమ్మకం వుండేది.


నేను పోయినేడు జెనీవ్, బెర్న్ ల లో తిరిగినపుడు అక్కడక్కడా యూ బీ ఎస్ బాంకు బిల్డింగ్ ఎదురయేది. అప్పటికి పేరు తెలిసిన ఏకైక & ప్రముఖమైన బాంకు కాబట్టి గుర్తుపట్టి.. మేమిద్దరం - ఆహా ఎంత డబ్బు ఉంటుంది కదా.. మన సినిమా వాళ్ళ, రా.నా. ల, గాంగుస్టర్ల డబ్బల్లా ఇక్కడే కదా ఉండేది - అని అబ్బురపడ్డాం. ఇలాంటి సందర్భం లోనే, నా మెదడు లో చిలిపి Cells జెఫ్ఫెరీ ఆర్చర్ రాసిన Twist in the Tale కధల సంపుటి లోని ఒక కధను గుర్తు చేసేయి.

మొంబాసా అనే ఆఫ్రికన్ సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. (పై పై న కధ చెప్తున్నా..) ఇక్కడ ప్రభుత్వం లో అందరూ తీవ్రంగా అవినీతిపరులు. పాపం అధ్యక్షుడు ఎంత ఆ దేశాన్ని అభివృద్ధిపదం లో కి తీస్కెళ్దామని ఎత్తులు వేసినా, ఈ అవినీతిపర అధికార యంత్రాంగం అంతకు పై ఎత్తులు వేసి, కనబడిన రూపాయినల్లా (వాళ్ళ రూపాయి) కబ్జా చేసేసేది. అధ్యక్షుడికి ఈ డబ్బంతా, స్విస్సు బాంకుల్లో మూలుగుతోందని తెలుసు - అచ్చం ఇపుడు అద్వానీ గారికి వచ్చిన అవిడియాలాంటిదే ఆయనకీ వస్తుంది. అంటే ఎవరెవరికి ఎంత సొమ్ముందో కనీసం ఆ బాంకు వాళ్ళనడిగి తెలుసుకుని, ఆయా అధికారులను దండించో, అదిరించో, బెదిరించో ఆ డబ్బుని మొంబాసా కి తెప్పించుకోవాలి. అపుడే అవినీతీ అరికట్టబడుతుంది, రూపాయలతో దేశమూ బాగుపడుతుంది - అని ఆయన ప్లాన్.

అయితే, ఆయనకి అడుగడుగునా శత్రువులే. ఈ పనిని తానై స్వయంగా చేయలేడు. కాబట్టి ఒక నమ్మకమయిన అధికారి కావాలి. అపుడు హీరో ని పట్టుకుంటాడు. ఈ నవ యువకుడు - ఇంగ్లండు లోనీ, అమెరికాలోనీ చదువుకుని, దేశాన్ని పైకి తీసుకురావాలనే తపన తో వచ్చినవాడు. ప్రభుత్వం లో చేరి, తన నిజాయితీ తో, నిష్పాక్షికత తో, ఖచ్చితత్వంతో అందరి దృష్టినీ (చివరికి అధ్యక్షుల దృష్టినీ..) ఆకర్షిస్తాడు.

ఆయన మీద అధ్యక్షుని నమ్మకం పెరుగుతుంది. ఇక రకరకాల ప్రాజెక్టులకూ, పనులకూ అతన్నే పర్యవేక్షకుని గా నియమిస్తాడు. కొన్నాళ్ళకు ఎలా అవుతుందంటే, ఈ యువకుడు చెప్తే కానీ మొంబాసా లో ఆకు కూడా కదలడానికి వీలు లేదు. దేశంలో అవినీతి తగ్గలేదు కానీ బహిరంగత్వం తగ్గింది. విచ్చలవిడి అవినీతి స్థానంలో 'ఉస్ష్ ..గప్ చుప్ అవినీతి ' బయల్దేరింది. అధ్యక్షుడికి అంతా బానే ఉంది గానీ ఈ తెర వెనుక అవినీతి నచ్చలేదు. ఆయన కి తన ప్లాను గుర్తొచ్చి ఈ కుర్రాడితో డిస్కసన్ పెడతాడు. అయ్యవారి ఆదేశాల మీదను కుర్రాడు తన తెలివితేటలన్నీ ఉపయోగించి, రక రకాల స్విస్ బాంకుల్లో అకౌంట్లున్న మొంబాసా వాసుల లిస్టు ఒకటి తయారు చేస్తాడు. ఇంక స్విజ్జర్లాండు వెళ్ళి బాంకు ల లో ఇంకొన్ని వివరాలు సేకరించడమూ, అధికారికంగా అధ్యక్షులవారి విన్నపాన్ని విన్నవించడమూనే మిగిలి వుంది.

ఇలా ఈ బాంకుల్లో డబ్బు దాచుకోవడానికి - ఈ బాంకులు పాటించే నియమావళి కారణం. అవి పీక పోయినా సరే తమ కస్టమర్ల వివరాలను బయట పెట్టము అని ప్రమాణం చేసేస్తాయి. కేవలం ఈ నియమావళి వల్లనే స్విజ్జర్లాండు లో ఆయా బాంకుల్లో ఆయా దేశాలనుంచీ పోగయ్యే ధనం ఉత్పత్తి చేసే లాభం ఆ దేశ జీ.డీ.పీ లో 12% ఉందంట ! అందుకే మరి - ఇదో విన్ - విన్ వ్యాపారం.


సరే మన వాడు అయ్యవారి అనుమతి తో, భార్యా, పిల్లలకు ఒక వారం పాటూ అమెరికా తిరిగొస్తానని చెప్పి, జెనీవా ప్రయాణం కడతాడు. (తన ప్రయాణం రహస్యం మరి !) జెనీవ్ లో దిగగానే హోటలు కెళ్ళి టిప్పు టాపు గా తయారయ్యి ఒక ప్రసిద్ధ బాంకు కు తను తయారు చేసిన లిస్టు పట్టుకుని వెళ్తాడు. మేనేజర్ ని కలుస్తానంటాడు. కారణం చెప్పడు. మేనేజరు కు తను మొంబాసా నుంచీ వచ్చిన రాయబారిననీ, అధ్యక్షుడిచ్చిన ఉత్తరం చూపించి, ఈ లిస్టూ చూపించి, ఎవరి ఖాతా లో ఎంత సొమ్ముందో చెప్పమంటాడు. సహజంగానే మేనేజరు ఒప్పుకోడు. గొడవ (వాదనలు) జరిగాకా, చైర్మెన్ ను కలుస్తారిద్దరూ. చైర్మను, ఈ అతిధి కి బ్రెమ్మాండంగా అతిధి మర్యాదలు చేస్తాడు గానీ ఈ విష్యాలు మాత్రం చెప్పనంటాడు. అది మా బాంకు పోలసీ గురూ - అని నచ్చ చెప్తాడు.

మన వాడు ఊరుకోడు. నేను రాయబారిని. మా అధ్యక్షుడి కి చెప్పి మీ దేశం తో మా దేశం చేసే బిజినెస్సునంతా (!!!!) ఆపు చేయించేస్తానంటాడు. మాకు ఫ్రాన్సు మిత్ర దేశం కాబట్టి ఫ్రాన్సు, స్విజ్జర్లాండుల మధ్య వ్యాపారం కూడా కట్టడి చేస్తానంటాడు. యూ.ఎన్.ఓ లో ఫిర్యాదు చేస్తానంటాడు.. అయినా చైర్మెన్ ఒప్పుకోడు. చివరికి తన కోటు చేబులోంచీ అకస్మాత్తుగా పిస్టలు తీసి చైర్మన్ నూ, మేనేజర్ నూ చంపేస్తానని బెదిరిస్తాడు. వాళ్ళు పాపం వొళ్ళంతా చెమటలు పట్టి, చావు భయంతో వొణికిపోతారు గానీ, ఈ రాయబారి గారి కోరిక తీర్చం అంటారు. ఏ.సే. (వేడి గది అనాలేమో) గది లో వాతావరణం అదుపు తప్పి వుంటుంది. బాంకు చైర్మను మతి పోయి వుంటుంది. మన యువకుడూ వొళ్ళెరగని కోపంలో వుంటాడు.. రెండు క్షణాలు గడుస్తాయి....

అప్పుడు మన వాడు 'ఎట్ ఈస్' లో నిల్చుని, టై వొదులు చేసి, తన తో పాటూ తీస్కొచ్చిన చెత్త సూట్కేసు తెరిచి చైర్మెను ముందు పెడతాడు. 'Well.. ఇంక నేను నిశ్ఛింతగా ఇక్కడ అకౌంటు ఓపెన్ చేస్కోవచ్చన్నమాట' అంటూ చైర్మెన్ ను చూసి అందంగా నవ్వుతాడు. ఇంతకీ ఆ సూట్కేసు (బ్రీఫ్ కేసు) లో కట్టల కొద్దీ కొన్ని కోట్ల విలువ చేసే కరెన్సీ ఉంటుంది.

ఇదీ కధ ! ఇపుడు అద్వానీ అడిగాడనో, జీ 20 లో పెద్ద వాళ్ళు తీర్మానించేరనీ - టెర్రరిస్టు లతో థ్రెట్ అనీ - ఇలా రక రకాల కారణాలకు స్విస్సు బాంకులు లొంగి తమ కస్టమర్ల గుట్టు విప్పాయనుకోండి - ఇలాంటి ట్విస్టే ఏదో ఎదురవ్వొచ్చు. వీ.డీ.ఎస్ లాంటి హాస్యస్ఫోరకమయిన అయిడియాలు, ఎలక్షన్లప్పుడు రా.నా.లు చెప్పే తమ తమ ఆదాయ వ్యయాల, ఆస్తిపాస్తుల వివరాలూ చూసి వాళ్ళ నిజాయితీ + సిగ్గులేని తనాన్ని చూసి నవ్వుకునే మనం, అప్పుడు హిందూజాల పేర్న ఇన్ని వేల కోట్లూ ఇంకా ఫలానా ఇంకోరి పేర్న ఉన్న ఇంకొన్ని కోట్ల కోట్లూ గురించి పేపర్లలో చదివి నవ్వుకుంటామో, నివ్వెరపోతామో చూడాలి. చివరికి బీ.జే.పీ ఆధ్వర్యంలో బోల్డంత కార్పొరేటైసేషను జరిగి ఇండియా వెలిగిపోయింది కాబట్టి భా.జ.పా నేతల పేర్లు కూడా బయటపడొచ్చు. అందుకే మేలో ఫలితాలు విడుదల అయ్యాకా - చాక్లెట్లకూ, కత్తులులకూ ఫేమస్ అయిన స్విజ్జర్లాండు మీద మన బడా నేతలు చాక్లెట్టు కత్తులు దూయటం తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఎన్నికల స్టంటు మాత్రమే. అదీ ఇక్కడ Twist in the Tale.

20/04/2009

నేను + నేను = నేను

నేను నాకోసం నాకై తీసుకున్న నిర్ణయం ఒకటుంది. ఇంక నుండీ నన్ను నేను ప్రేమించేసుకోవాలి గాట్టిగా !

చాలా రోజులయింది నేను నిజంగా బ్లాగింగ్ చేసి. నిరుడు ఎంతో ఉత్సాహం తో మొదలు పెట్టేసి, ఏవేవో రాసేసి, నా వెన్ను నేనే తట్టేసుకుని చతికిలబడ్డాను. బ్లాగు రాయడం సరదాగా ఉండేది. చదవడం కూడా ఇష్టమే. కానీ అప్పుడు ఇన్ని బ్లాగులు లేవు. కావల్సినంత సమయం ఉండేది. బ్లాగు వల్ల లోకం పెద్దదయ్యి, నాలుగు ముక్కలు మంచీ చెడూ తెలిసి నా పరిధి విస్తృతం అయింది సుమీ అని ఆనందించే లోపే రక రకాల కారణాల వల్లా, స్వయంగా అంతర్ముఖ ను అయి ఉండడం వల్లా, ఇంకో సగం వీలు చిక్కకా కాస్త ఇక్కడి వాతావరణానికీ, ఆవరణానికీ దూరం అయ్యాను.

మధ్య మధ్య లో కూడలికి వచ్చినా, తెలిసిన వారిని మాత్రమే పలకరించి పోతూ ఉండటం వల్ల, కొత్త వాళ్ళూ, కొత్త గాలీ అలవడలేదు. ఇపుడు కొంచెం టైం దొరికి రోజూ కూడలికి వస్తున్నాను. వివాదాలూ - హేళన లూ ఉంటాయని భయపడి ఇప్పటి దాకా జోలికి పోని కొత్త (నాకు - రిలెటివ్ గా) బ్లాగుల్ని చదివాను. నా బ్లాగులో వ్యాఖ్యలు విదిల్చిన అపరిచితులను వెంటాడి, వాళ్ళ బ్లాగులూ చదివాను.

ఈ అనుభవం బావుంది. ఎన్నో కొత్త సంగతులూ, శైలులూ తెలిసాయి. 'అర్రె ! ఈ బ్లాగు బావుందే' - అనుకుంటూనే ఇప్పటి దాకా కనీసం ఒక డజను బ్లాగుల్ని ఆపాదమస్తకం (అన్ని టపాలూ) చదివేసేను.


ఇన్నాళ్ళూ కుంచుంచుకుపోయిన పరిధి ఇప్పుడు కాస్త వదులయింది. ఆ రచనల్నీ, ఆ ఉత్సాహానీ, కసినీ - హాయినీ - కొత్త కొత్త బ్లాగులు నాలో పూరించిన కొత్త ఉత్సాహాన్ని అందిపుచ్చుకుని, నేనూ కొంచెం హాయిగా బ్లాగుదామని నిర్ణయించుకున్నానుల్. మునుపు 'బ్లాగులు రాయండి మహాశయులారా - అని పెద్దలు ప్రచారం చేస్తుంటే - ఏమో అనుకునేదాన్ని.

బానే ఉంది - బ్లాగులు ఎక్కువయ్యాయి. సమాచారమూ ఎక్కువే ఉంది. మంచో చెడో నిర్ణయించాల్సింది చదువరులే ! ఏదో ఉత్సాహం ఉండనే ఉంది. పాత వాళ్ళూ, కొత్త వాళ్ళూ అదే ఉత్సాహం తో ముందుకు దూసుకెళ్తూనే ఉన్నారు.

నేనూ ఇంక ఏదో ఒకటి మంచిగా రాయాలి. ఎందుకంటే - పిపీలికంలాగా మిగిలిపోకుండా ఉండాలంటే ఏవైనా మంచి విషయాలు తెలుసుకోవాలి. గడ్డిపూలా - అవేవీ - గొబ్బి పూలా - జిల్లేడు పూలా అని - ఎవరయినా ఎగతాళి చేస్తే నవ్వుకునేందుకు సరిపడా ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి.

ఇంతకీ - ఈ మధ్య నేను సాధించిన విజయాలు - పాత స్నేహితులకూ, ఎన్నాళ్ళుగానో మాట్లాడకుండా దూరం అయిన బంధువులకూ ఫోను చేసి పాత స్నేహాల్నీ, ప్రేమల్నీ నెమరు వేసుకోవడం..

ఊర్లో ఉన్న బందు మిత్ర పరివారాల్ని ఒక్కర్నీ వొదలకుండా ఇంటికెళ్ళి వాళ్ళకి నాకు అతిధిసత్కారాలు చేసుకుని తరించే భాగ్యాన్నివ్వడం,

ఆఫీసులో నూ, బయటా - ఎవరికి ఎంత మాటంటే అంత మాట సమాధానం ఇవ్వడం (అతి కోపం, వీర నారీ టైపు) (ఇది విజయం కాదు కానీ, నా మంచితనాన్ని (మెతక స్వభావాన్ని) అపార్ధం చేసుకునే వాళ్ళను షాక్ చేసాను) సగం మంది జనం నాకు పిచ్చెక్కిందని తీర్మానించేరు. అయినా ఒప్పుకోలేదు మరి !

- ఇలా - ఇవన్నీ నాకు నేను చేసుకున్న మేళ్ళే ! ఒక్కటీ ఇంకొకరి కోసం చేసినది కాదు. కానీ ఇలా నన్ను నేను ఉద్ధరించుకోవడం సంవత్సరానికొకసారి కాబట్టి ఈ సీజన్ ముగిసే లోగా నా బ్లాగును కూడా కొంచెం ఉద్ధరిద్దామనీ (లేకపోతే ఈ పోటీ ప్రపంచం లో - ఏమో అయిపోయి - ఇంకేమో అయిపోతాయని బెంగపడి... ) నిర్ణయించీసుకున్నాను.

రేపట్నించీ చూడండి - సరికొత్త రకం గడ్డిపూలని (!) (ఏమో రేపు ఇటు తొంగి చూసే వీలుంటుందో లేదో !!! రేపంటే - దీని తరువాత రాయబోయే టపా నుంచీ. ఎందుకంటే - ఈ టపా ఎలాగూ సొంత సోది కాబట్టి) ఇది నా గడ్డిపూలమీద ఈ వేసవిలో కొంచెం నీళ్ళ చిలకరింపు - నన్ను ప్రేమించేసేసుకుంటే సరిపోదు కదా... నా బ్లాగు తో కూడా మళ్ళా ప్రేమలో పడాలి. లేకపోతే ఇంతమంది అందమయిన బ్లాగుల్లో నా బ్లాగు పేలవమయిపోతుంది.

01/04/2009

నగరం మీద ప్రేమగీతం

టాంక్ బండ్ సన్నని నడుంచుట్టూ చెయ్యి చుట్టి
అందమైన నగర ముఖాన్ని దగ్గరగా తీసుకుని
ఆశలతో అలసమైన అబిడ్స్ కళ్ళలోకి చూసి
దీపాల వెలుతురు ప్రతిఫలించే చెక్కిళ్ళపై ముద్దు పెట్టుకో

సిగలో నౌపహాడ్ నాగరం తళుక్కున మెరుస్తుంది
బంజారాహిల్స్ వక్షోజాలుద్రిక్తంగ చలిస్తాయి
అలా అలా నైలాన్ చీరకింద మెత్తని గాగరాలో
సికిందరాబాద్ జఘనోరు సౌందర్యం నిన్ను కవ్విస్తుంది.

వేలవేల బార్లలో కొన్నివేల నిషాగీతాలమధ్య
బాళిగొలిపే జవరాలి నృత్యం పరవశింప చేస్తుంది.
ఓరగా తెరచిన జనానాల తలుపులలోంచి
ఉండి ఉండి నిలవగాలి వస్తుంది
హుసేన్ సాగర్ మీద ఒలికిన వెన్నెల లోంచి
ఒక విరహిణి మధు విషాదగాధ వినిపిస్తుంది.

వాడినపువ్వుల వాసన వేడివేడి పాదాలకు తగులుతుండగా
రోడ్లమీద అజ్ఞాతకామం ప్రతిరోజూ రాత్రి ప్రవహిస్తుంది.
తెలుగువాళ్ళ తెలివిలేనితనం ధోవతి కుచ్చెళ్ళతో పాటు మోటుగా
యం.యల్.ఏ.క్వార్టర్స్ దగ్గర యెబ్బెట్టుగా జీరాడుతుంది.
దర్బారులో సిగ్గుల్నీ, వగల్నీ ఒలకబోసే నెరజాణతనం నుండీ
దాపరికంలేని పారిశ్రామిక నాగరికతా నగ్నత్వంలోకి
ఎదుగుతూన్న నగరసుందరిని ఒదులొదులుగా కౌగలించుకో
మదం, మదం, మృగమద పరిమళం మత్తెక్కిన కన్నుమూతలో
పెట్రోలు వాసన ఫెళ్ళుమని తగిలి ఉలిక్కి పడతావు.

మూసీనది ముతకశృంగారాన్నే, పాపకశ్మలాన్నీ
మౌనంగా, దీనంగా మోసుకుపోతూ వుంటుంది,
ముసలిగద్ద చార్మినార్ మీద గత వైభవాన్ని తలుచుకుని
మూలుగుతూ ''మోసం!'' అని అరుస్తుంది.

అయినా యౌవనం తగ్గలేదు, లావణ్యం తగ్గలేదు
మెహబూబ్ జిందాబాద్ !
ఫ్యూడల్ రహస్యాల్ని నేటికి దాచుకున్న
పుండ్రేక్షు కోదండం హైదరాబాద్ !

-1956

- దేవరకొండ బాలగంగాధర తిలక్
(అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నుండీ)


{హైదరాబాద్ మీద కవిత అనేసరికీ ఇంటరెస్టింగ్ అనిపించి..}

18/03/2009

ఆరంభింపరు నీచ మానవులు

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ - ఏనుగు లక్ష్మణ కవి.



ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.


(ఇష్టమైన తెలుగు పద్యం.. పాత ఈనాడులో దొరికింది)

08/02/2009

టెలివిజన్ & స్త్రీలు

ఎన్నో రోజుల తరవాత టీ.వీ చూసేందుకు టైం చిక్కింది. పొద్దున్న మృణాల్ పాండే - 'బాతో బాతో మే' చూసాను. అప్పుడపుడూ చూస్తూండటం వల్ల ఎప్పటికపుడు ఈ కార్యక్రమాన్ని గురించి అర కొర సమాచారమే ఉంది. మొదటి సారి ఈ 'బాతో బాతో మే' Lok Sabha (DD)లో చూడటం ఆక్సిడెంటల్గా - చానెళ్ళు తిప్పుతూ నా ఫేవరెట్ (మాజీ) రాష్ట్రపతి కలాం తో మృణాల్ పాండే కాఫీ టేబుల్ చాట్ కనిపించగానే ఆగిపోయి కార్యక్రమాన్ని పూర్తి గా చూశాను. ఆ ఇంటర్వ్యూ మాత్రం కలాం వ్యక్తిత శోభను, మృణాల్ పాండే మృదువయిన కంఠం, లలితమయిన భాషా (ఈ ప్రోగ్రాం ఇంగ్లిష్ - హిందీలలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తికి అనుకూలంగా వుంటుంది) కలాం ఆఫీసులో ఉన్నప్పుడు జరిగిన ప్రతీ విషయాన్నీ చక్కగా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకొచ్చి అంతం దాకా ఆకట్టుకుంది.


చిన్నప్పుడు టెలివిజన్ కొత్త గా వచ్చిన రోజుల్లో మృణాల్ పాండే వార్తలు హిందీ లో నూ, ఇంగ్లీషు లో కూడా చక చకా చదివేసేయడం గుర్తు. ఆవిడ హెయిర్ స్టయిల్ నాకు ఎంతో ఇష్టం ఇప్పటికీ ! ఇపుడు ఆవిడ 'హిందూస్తాన్' అనే హిందీ వార్తా పత్రికకు చీఫ్ ఎడిటర్.
మృణాల్ ఈ రోజు మీతా వసిష్ట్ (దిల్ సే లో టెర్రరిస్ట్ గా నటించారు) అనే ప్రముఖ నటి తో చక్కని సంభాషణ జరిపారు. సూటిగా చూసే కళ్ళతో ఆవలీలగా నటించే ఈ సహజ నటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రోడక్ట్ ! నటన పరంగా రంగస్థలం, టెలివిజన్, సినిమా ఇలా అన్ని మాధ్యమాల్లో నూ నటించిన ఈవిడ ట్రాఫికింగ్ కి గురయ్యి, రక్షింపబడి, శరణాలయాల ఆశ్రయంలో ఉండే టీనేజి ఆడపిల్లల కోసం థియేటర్ వర్క్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. ట్రాఫికింగ్ (చిన్న వయసులోనే ఆడపిల్లలను (అమ్మి / కొనుక్కుని / ఎత్తుకొచ్చి) వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా ప్రవేశింపబెట్టడం) కు గురయ్యి అత్యాచారాలను ఎదుర్కొన్న పిల్లలు తీవ్రమయిన షాక్ లో ఉంటారు. వీళ్ళను చదువు వైపో, వృత్తి విద్య లోకో ప్రవేశింపజేసే ముందు వీళ్ళ వ్యక్తిత్వానికి కావలసిన మానసిక ఆలంబన తన కళ ఏమన్నా ఇవ్వగలగొచ్చునేమో అనే ఆలోచన తో ఆవిడ ఈ పనిని మొదలు పెట్టేరుట.

థియేటర్ వర్క్ షాప్ వల్ల ఆ పిల్లల్లో బెరుకు పోయి, ఆత్మ విశ్వాసం, భావ ప్రకటనా సామర్ధ్యం, ఇతరులతో కలిసి పనిచెయ్యగలగడం, నాయకత్వ లక్షణాలూ, భాష మీద పట్టూ - థియేటర్ అనగానే సమజంలో రకరకాల వ్యక్తులను, పరిస్థితులను అవగాహన చేసుకోవాలి కాబట్టి - జెనెరల్ నాలెడ్జూ పెరిగాయి. ఇంతకన్నా మంచి పని ఏముంది ? లోక్ సభ చానెళ్ళో ఈ కార్యక్రమం ఎపుడెపుడు ప్రసారం అవుతుందో నోట్ చేసుకోవడం మర్చిపోయాను. ఆదివారం మాత్రం 12 - 2 గంటల మధ్య మధ్యాన్నం ఒక్క సారి 'లోక్ సభ' చానెల్ని శృతించి చూడండి ! లేదా టైం టేబుల్ తెలుసుకొని పోస్టు చేస్తాను !


అలానే ఈ రోజు ఎన్ డీ టీ వీ ప్రాఫిట్ (NDTV Profit) లో మహిళలకు పనికొచ్చే ఆర్ధిక పరిజ్ఞానాన్ని గురించి చిన్న పరిచయం ఇచ్చారు !
ఇది చాలా విలువయిన సమచారమే. ఎందుకంటే మహిళలు ఇంటిని ఎంత చక్కగా నిర్వహించినా, ఉద్యోగాలు చేసినా డబ్బుల విషయంలో చాలా తక్కువ అవగాహన కలిగి ఉంటారు. ఇందుకు కారణం ప్రధానంగా 'నా భర్త / తండ్రి / సోదరుడూ' చూసుకుంటార్లే అనే ధీమా లేదా నిర్లక్షం లేదా ఆర్ధిక వ్యవహారాల్లో చొరవ చూపించడం వల్ల భర్త/కుటుంబ పెద్దా తమను తప్పుగా అనుకుంటారనే మొహమాటమూ కావొచ్చు.


వీటి వల్లనే కాబోలు మహిళలు మదుపు చేసే రకరకాల తెలివయిన ఉపాయాల గురించి తెలుసుకోవడానికి ఆశక్తే చూపించరు. కానీ ఆడవాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకొని తీరాలిట. సహజంగా ఆడవాళ్ళు - మగవాళ్ళ కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు. (స్టాటస్టిక్స్ ప్రకారం) రకరకాల మ్యూచువల్ ఫండ్స్ - రిస్క్ ఫేక్టర్స్ అన్నీ తెలుసుకోవడం, రిటైర్మెంట్ గురించి ముందుగా అలోచించడం, వివ్హాహం, గర్భధారణ, పిల్లల పెంపకం, తల్లిదండృల అనారోగ్యం లాంటి రకరకాల కారణాల వల్ల తరచూ కెరీర్ ను బ్రేక్ చెయ్యాలిసి వస్తుంది. అప్పుడు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తెలివిగా ఆ కెరీర్ బ్రేకుల్లో తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. అనుకోని పరిస్తితుల్లో ఒంటరులయితే జీవితాన్ని ఎదుర్కోవడమూ తెలుసుకోవాలిట :

ఇలా -

(1) (Working/Non-working) ఒంటరి మహిళలయితే :

(అ) ఒంటరి వారు కాబట్టి - ఆర్ధిక అత్యవసరాల్లో మిమ్మల్ని మీరే ఆదుకోవాలి. మీ ఆదాయంలోంచీ కనీసం 6 - 8 నెలల ఖర్చు ను ముందే దాచి పెట్టుకోండి. బాంకులో ఫిక్సెడ్ డిపాసిట్ అయితే మంచిది. అత్యవసర పరిస్థితి లో ఫిక్సెడ్ డిపాసిట్ ను బ్రేక్ చేస్తే 24 గంటల్లో మీ డబ్బు క్షమంగా మీకు చేరుతుంది.

బ్) జబ్బు పడటం, ఆక్సిటెంట్ కావడం లాంటి హాస్పిటల్ ఖర్చులు సంబాళించుకోవడం కోసం మెడికల్ ఇన్స్యూరెన్స్ చేయించుకోండి.

చ్) మీ మీద ఆధారపడే వాళ్ళెవరూ లేకపోతే లైఫ్ ఇన్స్యూరెన్స్ చేయించుకోకండి. యూలిప్ లు కూడా అనవసరం. దాని బదులు ఆ సొమ్మును ఇన్వెస్ట్ చెయ్యండి.

ఎ) మీకిష్టమయిన వారి పేర్న విల్ రాయండి.

(2) (Working Women) ఉద్యోగం చేసే గృహిణులు

కొందరు ఉద్యోగం చేసే మహిళలు కూడా అంతా భర్త మీదనే వొదిలేస్తారు. జీతం మొత్తం భర్త చేతిలో పోసి, తాము మాత్రం ఇల్లు చక్కబెడితే చాలు అనుకుంటారు. అనుకోనిదేమయినా జరిగితే విడాకులో, వైధవ్యమో ఎదుర్కోవాల్సి వచ్చినపుడు వీళ్ళకు చేతిలో ఎక్కువ సందర్భాల్లో కాణీ మిగలదు లేదా ఖర్చుల్ని ఎలా మేనేజ్ చ్జెయ్యాలో తెలియదు. వీళ్ళు పిల్లల్ని సాకడానికయినా కీడెంచి మేలెంచాలిట. డబ్బే భద్రత కదా. అందుకని వీళ్ళు -

(a) ఇంటి ఖర్చును ఎవరో ఒకరే కాకుండా భార్యా భర్తా ఇద్దరూ ముందే నిర్ణయించుకుని, షేర్ చేసుకోవాలి. ఒక జాయింటు అకౌంట్ మెయింటయిన్ చేస్తూ ఇంటి ఖర్చులకు ఇద్దరూ చెరి సగం డబ్బులు దాన్లో క్రెడిట్ చెయ్యొచ్చు.

b) ఆస్థులు / ఇళ్ళూ / పొలాలూ కొంటే అవి ఎవరి పేరు మీద ఉన్నాయో తెలిసి ఉండాలి. ఇద్దరి పేర్నా రిజిస్టర్ చేయించుకోవడం మంచిది.

c) భర్త / భార్య చేసే ఇన్వెస్టుమెంటుల్లో నామినీలు ఎవరూ అనేది ఇద్దరికీ తెలిసి ఉండాలి. భార్యా, పిల్లల పేర్న తీసుకొనే పాలసీల్లో స్పష్టత ఉండాలి.


d) ఆస్తి / ఇన్స్యూరెన్స్ / ఇన్వెస్ట్మెంట్ పేపర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. భర్త ఏదో పాలసీ తీసేస్కుంటాడు - భార్యకు తెలియనే తెలియదు. అనుకోకుండా భర్త చనిపోతే ఆయన పేర్న లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉందన్న సంగతే తెలియని భార్య అనవసరంగా ఆర్ధికంగా నష్టపోతుంది. ఇలా కేవలం పేపర్లు ఉన్నయ్యో లేవో తెలియకా, తెలిసినా ఎక్కడున్నాయో తెలియకా ఇన్స్యూరెన్సు కంపెనీలలో క్లెయిం కాని డబ్బు కోట్ల కొద్దీ మూలుగుతూ ఉంటుంది. అందుకే ఇది ఒక సింపుల్ మరియూ ప్రధానమయిన సూచన.

3) (Home-makers) గృహిణులు


ఏ) భర్తకు ఆదాయం ఎంత వస్తుంది - ఏ రకంగా వస్తుంది - (జీతం / వ్యాపారం / కమిషన్లూ వగైరా) మొదలయిన వివరాలు తెలిసుండాలి.

బి) భర్త కు ఉన్న లయబిలిటీస్ అంటే లోన్ల గురించి కూడా తెలిసి ఉండాలి. ఒంటరి అయినపుడు ఎవరో వచ్చి మీ ఆయన నాకింత సొమ్మివ్వాలి అంటూ అడిగితే ఆ విషయమేదో స్త్రీ కి తెలిసి ఉండటం అవసరం కదా ! మోసాలకు గురికావడం, ఒత్తిళ్ళకు లొంగడం, పిల్లల భవిష్యత్తు తో కాప్రమైస్ కావడం లాంటివి నివారించొచ్చు.

సి) భర్త కు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా లో ఎంత సొమ్మున్నదో కూడా తెలుసుకోవాలి. ప్రైవేటు ఉద్యోగం చేసే వారూ, రక రకాల ఉద్యోగాలు మారేవారూ తమ ఈ.పీ.ఎఫ్ ఖాతాను ఎప్పటికపుడు అప్డేట్ చేసి పెట్టుకోవాలి.

డీ) ఆస్థులు జాయింట్ గా కొనుక్కోవాలి. వీళ్ళు కూడా డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని తీరాలి.

ఈ) నామినీలుగా / వారసులుగా - పిల్లలు ఉన్నారో లేదో చూసుకోవాలి.

ఎఫ్) ఇన్స్యూరెన్స్ పాలసీ లు తీసుకొనేటపుడు Married Womens' Property Act కింద (పాలసీ తీసుకొనే సమయంలోనే ఒక చిన్న ఫాం ని నింపడం ద్వారా) తీసుకోవాలి. దీని వల్ల పాలసీ సొమ్ము కేవలం పాలసీదారుని పిల్లలకు, భార్యకూ మాత్రమే చెందుతాయి. ఇతర కుటుంబ సభ్యులు (అన్నదమ్ములూ వగైరాలు) ఆ సొమ్ము కు ఎంతమాత్రం హక్కుదారులు కారు.

మొత్తానికి అందరు మహిళలూ రిటైర్మెంట్ కోసం ముందునుండీ డబ్బు ఆదా చేసుకోవాలి. ఇవన్నీ మంచి సూచనలే కదా.

06/02/2009

డెబిట్ కార్డు డౌటు !

బ్లాగు ద్వారా కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవం, ఖచ్చితమయిన ఆధారాలతో సమాచారం అందిపుచ్చుకోగలగడం సాధ్యం అవుతుంది. ఇప్పటి దాకా నాకు కావల్సిన పాటలేంటి, సమాచారమేంటి, కావలసిన పుస్తకం, సినిమా.. ఇలా అన్నిటి గురించీ చదువరులు విలువయిన సమాచారాన్ని అందించారు. Many thanks to them. ఇపుడు నాముందు ఉందో ముఖ్య సందేహం !

హెరిటేజ్ ఫ్రెష్ వాళ్ళు 300/- కన్నా తక్కువ బిల్ అమౌంట్ కి డెబిట్ కార్డు తీసుకోరుట - పాలసీట ! మేనేజర్ ని అడిగాను - ఎందుకు ? అని! ఆయన వివరించలేకపోయాడు. ఎందుకు తీసుకోరు ? వాళ్ళకు నష్టమా ? మరి ఎస్.బీ.అయి వాళ్ళు డెబిట్ కార్డు వాడండీ అని టీవీలో వచ్చి కూడా చెప్తున్నారు కదా ! 300/- లకు షాపింగ్ చేస్తేనే డెబిట్/క్రెడిట్ కార్డు తీసుకుంటారని వినియోగదారుడు అవసరం లేని వస్తువేదో బలవంతంగా కొనాలిసి రావడం అన్యాయం కదా ! పెట్రోలు పంపుల్లో మాత్రం వంద, యాభయికి కూడా కార్డు వాడొచ్చు ! షాపుల్లో ఎందుకు కాదు ?


ఇది ఇంకో ధర్మ సందేహం ! కొన్ని దుకాణాల్లో డెబిట్ కార్డు మీద 2% సెస్సు వేస్తారు ! రిసీట్ ఇచ్చినాకూడా అదే కొనుగోలు కి కేష్ పర్చేస్ కి సెస్సు ఉండదు ! ఏమిటి ఈ రహస్యం ? డెబిట్ కార్డు వాడడం మనకి మంచిది కాదా ? బాంకుకు మంచిది కాదా / దుకాణదారులకు మంచిది కాదా ?

11/01/2009

Limca



లింకా - లైం అండ్ లెమనీ లింకా వాణిజ్య ప్రకటనలు నాకు చాలా నచ్చుతాయి. నిరుడు బాగా నడిచిన ''బూందో మే - బూందో మే'' కూడా నచ్చింది. కానీ ఈ పాట (జింగిల్) పాడింది ఎవరో తెలుసుకోవాలనుంది.

09/01/2009

మెట్రో మేన్ డాక్టర్ ఈ.శ్రీధరన్

ఢిల్లీ మెట్రో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఈ. శ్రీధరన్ – భారత దేశపు Metro Man గా, ఒంటిచేత్తో దేశ ఉపరితల రవాణా చరిత్రను తిరగరాసిన వ్యక్తి గా పేరు తెచ్చుకున్నారు. భారత దేశం లాంటి దేశంలో బ్యూరోక్రాటిక్ ఒడిదుడుకులనూ, రెడ్ టేప్ నూ సమర్ధవంతంగా చక్కబెడుతూ అనుకున్న సమయానికే ప్రాజెక్టులను పూర్తి చెయ్యగలగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన సాధించిన విజయం కేవలం ఇదే కాదు. డెడ్ లైన్లను అందుకోవడం, సమర్ధ వంతమయిన పనితీరూ, ఎవరూ వేలెత్తి చూపించలేని నిజాయితీ, ఒత్తిడికి లొంగని మనస్తత్వం – ఈ మెట్రో పురుషుడి ప్రభను ఇనుమడింప జేసాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమయిన ప్రాజెక్టులను ప్రణాళికా బద్ధంగా, నిర్ణీత వ్యవధి కన్నా ముందుగా, నిర్ణీత బడ్జెట్ లోనే ముగించగలగడం మామూలు విన్యాసం కాదు.

డాక్టర్ ఎలట్టువలపిల్ శ్రీధరన్ జూన్ 12, 1932 వ తేదీన కేరళ లో పాలక్కడ్ జిల్లాలో జన్మించారు. ఆయన పాల్ఘాట్ లో విక్టోరియా కాలేజీలో చదువుకున్నారు. కాకినాడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. కోజికోడ్ లో కేరళా పాలిటెక్నిక్ లో, ఒక సంవత్సరం పాటూ లెక్చరర్ గా పని చేసారు. ఆ తరువాత బాంబే పోర్ట్ ట్రస్ట్ లో అప్ప్రెంటీస్ గా పని చేసారు. ఆ తరవాత భారతీయ రైల్వే లో జాతీయ స్థాయి నియామకాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన్ను, మొట్ట మొదటి గా దక్షిణ రైల్వే లో ప్రొబేషనరీ అస్సిస్టంట్ ఇంజనీర్ గా నియమించారు.

భారతీయ రైల్వే లో అవిరళ కృషి,సంవత్సరాలుగా ఆయన సమర్ధవంతంగా నిర్వర్తించిన విధులూ, ఆయనకు పేరు ప్రతిష్ఠలను సంపాయించిపెట్టాయి. 1963 లో రామేశ్వరం ద్వీపాన్నుంచీ, భారత భూభాగానికి (Mainland) సముద్రంలో వేసిన పంబన్ రైల్ బ్రిడ్జ్ ఈ రోజుకీ ఒక ఇంజనీరింగ్ అత్భుతం గా నిలిచింది. పంబన్ బ్రిడ్జ్ విజయానికి గాను శ్రీధరన్ కు 1963 వ సంవత్సరానికి రైల్వే మంత్రి అవార్డ్ లభించింది. 1970 లో ఆయన్ను కలకత్తా మెట్రో ప్రాజెక్ట్ కు Dy Chief Engineer (Design, Planning & Implementation) గా నియమించారు. ఇది దేశంలోనే మొట్ట మొదటి మెట్రో ప్రోజెక్ట్. శ్రీధరన్ ఆధ్వర్యంలో కొచ్చిన్ పోర్ట్ కూడా రాణీ పద్మిని అనే నౌకను లాంచ్ చేసింది.

డాక్టర్ శ్రీధరన్ భారతీయ రైల్వే నుంచీ 1990 లో పదవీ విరమణ చేశారు. ఆ తరవాత ఆయన్ను ప్రభుత్వం కొంకణ్ రైల్వే కు సీ ఎం డీ గా నియమించింది. ఈ ప్రాజెక్ట్ ఎంత క్లిష్టమయినదంటే పశ్చిమ కనుమల్లో దట్టమయిన అరణ్యాల్లోంచీ, పర్వతాలూ, క్లిష్టమయిన దారుల్లోంచీ, మెత్తని మట్టి మీద బలమయిన రైల్వే లైను నిర్మాణం జరిగింది. సాధారణ రైల్వే సెట్ అప్ లో జరిగే జాప్యాలకు భిన్నంగా కేవలం ఏడు సంవత్సరాలలో మనిషికి ఏమాత్రం సహకరించని దారిలో 93 టన్నెళ్ళూ (సొరంగ మార్గాలు) (వీటిలో ఒక సొరంగం 83 కిలో మీటర్ల పొడుగు కలిగినది), 150 వంతెనలూ కూడిన 760 కిలో మీటర్ల రైల్వే లైను నిర్మించారు. భారత దేశంలోనే మొదటి సారిగా ఈ ప్రాజెక్టు లో బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (BOT) పద్ధతి ని ఉపయోగించారు. కొంకణ్ రైల్ విజయం లో తల ఎత్తిన కష్టాలనూ, అడ్డంకులనూ, సవాళ్ళనూ శ్రీధరన్ మొక్కవోని పట్టుదలతో, సమర్ధతతో ఎదుర్కొన్నారు.

ఢిల్లీ నగరంలో మెట్రో రైలు నిర్మాణం కూడా ఎంతో క్లిష్టమయిన ప్రాజెక్టు. ఢిల్లీ లో పురాతన, సాంప్రదాయ, చారిత్రాత్మక భవనాల మధ్య, వివాదాస్పదం కాకుండా, వివిధ ప్రదేశాల లో మొదలయిన పనిని అనుసంధానిస్తూ గడువు లో నిర్మించడం శ్రీధరన్ సమర్ధత కు నిలువెత్తు నిదర్శనం. ఢిల్లీ మెట్రో ఇప్పుడు లక్షలాది ప్రజలు సుఖవంతమయిన, వేగవంతమయిన ప్రయాణిస్తున్నారు. మీడియా ఈయన్ను మెట్రో పురుషుడిగా అభివర్ణించడం మొదలయింది. భారత దేశపు అత్యంత ప్రతిభావంతమయిన టెక్నోక్రాట్ గా శ్రీధరన్ గుర్తింపు పొందారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులూ, బిరుదులూ గెలుచుకున్నారు. 2001 లో పద్మ భూషణ్, 2005 లో ఫ్రెంచి ప్రభుత్వం నుంచీ చెవాలియర్ డి లా లీజియన్ డి హానర్, 2008 లో పద్మ విభూషణ్ అందుకున్నారు. ఢిల్లీ ఐ.ఐ.టీ ఆయనకు డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ సైన్స్ (ఆనరిస్ కాసా) తో సత్కరించింది. 2003 లో శ్రీధరన్ ను ఆసియా హీరోలలో ఒకరు గా టైం మాగజీన్ అభివర్ణించింది. శ్రీధరన్ 2008 లో CNN IBN ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం (పబ్లిక్ సర్వీస్) గెలుచుకున్నారు. 2002 – 03 సంవత్సరానికి గానూ లీడర్షిప్ మరియూ ఇంఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ విభాగంలో సీ ఐ ఐ జ్యూరర్ అవార్డ్ ఆయన్ను వరించింది. డాక్టర్ శ్రీధరన్ 2005 లో రిటైర్మెంట్ ను ప్రకటించారు. కానీ ప్రభుతం ఆయన పదవీ కాలాన్ని ఇంకో మూడేళ్ళ పాటూ పొడిగించింది. ఇపుడు పాకిస్తాన్ ప్రభుత్వం లాహోర్ నగర మెట్రో ప్రాజెక్ట్ కోసం శ్రీధరన్ ను సంప్రదిస్తూ ఉంది.

భారత దేశపు ఉపరితల / ప్రజా రవాణా వ్యవస్థ చిత్రాన్ని మార్చివేసిన మరియూ వృత్తి పట్ల నిభద్ధతా, నిజాయితీ లాంటి విలువలకు కట్టుబడి అద్వితీయ, అసమాన ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వ్యక్తి గా డాక్టర్ శ్రీధరన్ మిగిలిపోయారు.

(కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ జనవరి 2009 సంచిక నుంచీ)

08/01/2009

భంగిమా Part - 2


తిరుపతి - గరుడుని స్వాగతం


బాపట్ల లో ట్రాఫిక్


పెరటి తోటలోనే సపోటా


బాపట్ల బీచ్ లో వేట - 2


శిల్పారామం కార్ పార్క్

Please Note: Some pictures may not be clear. Please double click on the image to have a clear view.

భంగిమా ! Part 1


1. ఆశీల్ మెట్ట జంక్షన్ లో సిగ్నల్ దగ్గర అమూల్ బోర్డు !


2. విజయవాడ నుండి బాపట్ల వెళ్ళే దార్లో పొలం


3. బాపట్ల సముద్ర తీరం - సముద్రం లో మత్స్యకారుల వేట - 1



4. విశాఖపట్నం - మావయ్య గారి పెరటి తోటలో కనకాంబరం

02/01/2009

ఒక్క మాట !

చాలా రోజులయింది కదా
అసలు మాటలాడుకుని ..
తెల్లారితే పరుగు పరుగు జీవితం అయిపోయింది.

ఆఫీసులో నవ్వుతూ తిట్టే బాసు గోడు
నీకు కాక ఎవరికి చెప్పుకోను ?
ఇంట్లో అంతా గందర గోళం గా వుంది
బయట కూడా ఏవో గొడవలు
ఆ పనీ ఈ పనీ మిగిలిపోతుంటాయి.
మరీ కష్టం అనిపిస్తే నీ దగ్గరకే గా నేను పరిగెట్టేది ?

ఏ పనీ కాదనకుండా చేసేస్తావు
నా కష్టాల్లో కడగండ్లలో బోల్డన్ని
కబుర్లు చెప్పి, అందమయిన ధైర్య వచనాలు చెప్పేసి
నా పని సుళువు చేసి పడేస్తావు

ఏవో బాధలు - టెన్షన్లూ - నీతో కాక ఎవరితో
పంచుకోను ?
నాకు ఎల్లప్పుడూ శక్తి ని ఇచ్చేందుకు
రోజుకెంత శక్తి ని ఉత్పత్తి చేస్తావో నువ్వు !
అబ్బ - ఈ పరుగుల్లో నీతో నా బాధలు చెప్పుకోవడానికే కుదరట్లేదు!

ఎలా వున్నావు ? ఏమిటి కత ?
ఎప్పుడు మనం మాటాడుకునేది ?
ఎపుడు పాట్లాడుకునేది ?
ఎపుడబ్బా కనీసం ఫోన్ చేసుకునేది ?
పొద్దున్న లేవడం ఆలశ్యం అవుతూంది -
నీ ప్రపంచంలోని కొన్ని పక్షుల కిచ కిచలు ముఖ్యంగా
వినిపించి చాలా కాలం అయింది.
నీ కారు హారన్ శబ్దం కూడా !

ఆ మధ్య పుస్తకాల్లో, నీ చేతి రాత ని చూసుకుని ఒక్క సారి
నీ జ్ఞాపకాల ఉప్పెన్లో కొట్టుకుపోయాను !
చదవమని చెప్తూంటావు కదా !
ఎపుడు మనం డిస్కషన్ కి కూర్చునేది ?
నాకు ఖాళీ ఉంటే నువ్వు పరుగుల్లో ఉంటావు !
నీకు ఖాళీ అయితే నేను పరుగులు !

ఒక్క మాట ! మనం ఒకర్నుంచీ ఒకరు మాత్రం దూరంగా
పరుగులు తీయకూడదు !
అంటే - ఎన్ని పరుగుల తరవాతయినా,
ఎన్ని రోజులు గడిచిపోయినా కూడా
మన మనసులు మాత్రం దగ్గరగానే ఉండాలి.
సరే నా ?

అన్నట్టు - నీకో మంచి పెన్ను కొన్నాను
పరుగుల్లో పడి ఇవ్వడం మర్చిపోయాను
ఈ సారి నీకు తీరికయితే
పాటలాడుకోవడానికి వస్తేనే ఇచ్చేది !

ఎపుడూ నాకోసమే ఆలోచించే నీ
కాల్పనికత -
కాసేపు నేనూ అప్పు తీసుకుంటే
అరే ! చాన్నాళ్ళయిపోయిందే- మాటాడుకుని
అని విపరీతంగా బాధేసేస్తుంది !
ఈ బాధ ని నువ్వెలా తట్టుకుంటావో !

ఈ ఒక్క మాట కే నాకు ఎంతో
ఆశ్చర్యంగా వుంది !
మొత్తానికి నీతో మాట్లాడాలని
ప్రాణం కొట్టుకుపోతుంది - అంతే !