Pages

12/08/2017

The Ministry of Utmost Happiness - Arundhati Roy



ఏ భేషజాలూ లేకుండా నిజమే చెప్పాలంటే, ఓ 200 పేజీల దాకా... దీనిలో "హాపీనెస్"   అనేది మచ్చుకన్నా లేదే అని నట్టుతూ.. కధ తప్ప చెత్త అంతా ఉందని విసుక్కుంటూ కూడా, వొదల్లేక చదివాను.  వొదల్లేకపోవడానికి సాహితీ స్పృహ, ఇది విడిచిపెట్టేయదగ్గ పుస్తకం కాదు అనే భావన, వగైరాల  కన్నా, మానవత్వం ముందు నించుని తోవ చూపించడం వల్లే, మిగిల్న పుస్తకం అంతా చదవగలిగాను.  ఈ కధ అంతా మనిషిలో లోపించిన  మానవత్వం గురించే.  అసలు దీన్లో కధ ఏమీ లేదు. ఎప్పటిదో పాత కధ.  రెండు మూడు - నుంచీ - ఓ ముప్ఫయ్ అరవై దాకా పాత్రలు ! ప్రతీ పాత్ర దీ ఓ విషాద గాధ.  


దిల్లీ నేపధ్యం. అత్యంత బీదరికం లో మగ్గిపోతున్న అంజుం అనే హిజ్రా మనసు కధ మొదటి భాగం అంతా. అంజుం స్మశానంలో మనకి పరిచయం అవుతుంది.  

She lived in the graveyard like a tree.  At dawn she saw the crows off and welcomed the bats home. At dusk she did the opposite. When she first moved in, she endured months of casual cruelty like a tree would - without flinching.  When people called her names - clown without a circus, queen without a palace - she let the hurt blow through her branches like a breeze and used the music of her rustling leaves as balm to ease the pain. 

పాత దిల్లీ లో ముస్లింలు ఎక్కువ గా ఉండే షాజహాన్ బాద్ లో ఓ చీకటి వేళ ఆఫ్తాబ్ గా పుట్టింది అంజుం. చీకట్లో ప్రసవం చేసిన మంత్ర సాని మగ పిల్లాడు పుట్టాడని ప్రకటించగానే అంతా ఆనందిస్తారు. కానీ తల్లికి ఆఫ్తాబ్ స్త్రీ, పురుషుడూ ఇద్దరూనూ అని మర్నాడు తెలుస్తుంది.  వెంటనే మాతృ సహజమమైన భయం తో ఆ విషయాన్ని దాచి,  దర్గాల చుట్టూ, తన కుమారుడి (!) కోసం వేలాది మొక్కులు మొక్కుతూ, అయిదేళ్ళ వరకూ కొడుకు లానే పెంచుతుంది తల్లి. కానీ పిల్లాడు బడిలో కి వెళ్ళే సమయానికి, మొదటి సారిగా తండ్రికి ఆఫ్తాబ్ విషయం చెప్పాల్సొస్తుంది.  తమకి పుట్టిన బాబు పరిస్థితి ఇదీ అని తెలుసుకున్న తండ్రి హతాశుడయిపోతాడు.  డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలూ,  అవమానాలూ, క్లేశాల అధ్య ఆఫ్తాబ్ పెద్ద వాడవుతున్నాడు. అతని శరీరానికీ, మనసుకీ పొంతన కుదరక, విపరీతమైన మానసిక సంఘర్షణ తో బాధపడుతూ చివరికి తాముండే చోటికి దగ్గర్లోనే హిజ్రాలుండే ఖ్వాబ్ గంజ్ - కు చేరి, అక్కడే తన జీవితాన్ని,  అంజుం గా మారి గడుపుతాడు.  ఈ అంజుం చిన్నతనం లో హిందుస్తానీ సంగీతం నేర్చుకుని గొంతు మారాకా - వివిధ శస్త్ర చికిత్సలూ, నాటు వైద్యాల వల్ల గొంతు లో స్థిరత్వం పోయి, పాడడమే వొదిలేయాలిసి వస్తుంది. 


అంజుం బ్రతుకంతా హిజ్రా గా - దిల్లీ లో వివిధ శుభకార్యాల లో పాల్గొని, ఆశీర్వాదాలు ఇవ్వడం లోనూ, గాన బజానాల లోనూ, పాత దిల్లీ ని చూడడానికొచ్చే విదేశీయులు భారతీయ హిజ్రాల గురించి నిర్మించే డాక్యుమెంటరీల లో మెరవడంలోనూ, వివిధ పత్రికల లో ఇంటర్వ్యూలూ, ఫోటోలూ దిగడం తోనూ ఉపాధి ని పొందుతూ - ఒక రకంగా హాయిగా - జీవిస్తుంది.   కానీ హిజ్రాల లో ఉన్న మానవత్వం - "తల్లి" తనాలు ఓ మెట్టు పెద్దవే.   జమా మసీదులో ఓ పసిపాప ని ఎవరో వొదిలేసి వెళ్ళిపోతే, తప్పిపోయిన పిల్లేమో అని తన వాళ్ళ కోసం వెతికి, ఆఖర్న ఆ పాప ఎవరో వదిలించు కునేందుకు వదిలి పెట్టిన పాప అని గ్రహించి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే అంజుం లోకం. 


సాధారణ కుటుంబం లో ఇమడలేక, తనంతట తానే ఇల్లొదిలి బయటికి వచ్చిన అంజుం కి తన కుటుంబ సభ్యుల ప్రేమాదరాలకు ఎన్నడూ లోటు లేదు.  చాలా మంది హిజ్రాల లాగా ఈమె ను తల్లి దండ్రులే విడిచిపెట్టేయలేదు.  ఖ్వాబ్ గంజ్ చేరిన కొన్నాళ్ళ వరకూ, అంజుం కి తల్లి వేడిగా భోజనం వండి కారియర్ పంపేది. నెమ్మదిగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే వరకూ అంజుం కి అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ ప్రేమ దొరికింది. అందుకే, పరిస్థితులు విపరీతంగా దిగజారి ఖ్వాబ్ గంజ్ వొదిలేసే పరిస్తితులొచ్చిన  సమయానికి చనిపోయిన తన కుటుంబ సభ్యుల సమాధుల దగ్గరకే వచ్చి ఆ సమాధుల  మధ్య కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. ఇక్కడ ఆమె లోకం, పరిధీ విస్తృతమయ్యి, తననంత తాను బ్రతుకుతూ, మరి నలుగుర్ని చేరదీసి పెంచగలిగే ధైర్యం, తోడూ, స్థిరత్వం కలుగుతాయి.  అంజుం ధైర్య శాలి. కరుణామయి. ఎన్నో భయాలు, బెంగల మధ్య, జీవితాన్ని వెతుక్కున్న మంచి మనిషి.  

ఈ లంకె ను అక్కడల్లా వొదిలి, కశ్మీర్ లో ఓ ముగ్గురు స్నేహితుల కధ ని మొదలు పెడుతుంది రచయిత్రి. వాళ్ళు ముగ్గురూ, నాగా, మూసా, బిప్లవ్ -  దిల్లీ లో ఆర్కిటెక్చర్ చదువుతారు. వీళ్ళ క్లాస్ మేట్ - కేరళ కుట్టి - తిలోత్తమ. ఈ నలుగురిదీ కాలేజీ స్నేహమే. వీళ్ళలో నాగా, బిప్లవ్ లు మరీ చిన్ననాటి స్నేహితులు. ముగ్గురు అబ్బాయిలకీ తిలోత్తమ అంటే ఇష్టం. పిల్ల నల్లగా ఉన్నా కళ గా, పైగా చాలా అందంగా పొడవైన జుత్తు తో తిలో ముగ్గురి మనసుల్నీ  గెలిచేస్తుంది. కానీ తిలో ఎవ్వరితోనూ పెద్దగా కలిసి మెలిసి తిరిగే రకం కాదు. ఆమెకు తండ్రి లేడు. తల్లి పెంపుడు తల్లి కాదు, నిజమైన తల్లే అని అపవాదు ఉంది. ఏదేమైనా తిలో ది చాలా స్వంతంత్ర వ్యక్తిత్వం.  కశ్మీర్ కు చెందిన మూసా ది కూడా అదే తీరు. అతనూ అంతర్ముఖుడు.  కాలేజీ ముగిసాకా, మళ్ళీ కధా కాలానికి వివిధ విచిత్రమైన సంఘటనల తరవాత కలుసుకుంటారు.  నలుగురి జీవితం, చిక్కగా అల్లుకుని, పెనవేసుకుపోతుంది.  ఈ భాగం అంతా చాలా హృద్యంగా, తెలివిగా, వేదన తో, సౌందర్యం తో - నింపేసింది రచయిత్రి. అసలు కాశ్మీర్ ని చర్చించడానికి ఎంత రీసెర్చ్ అవసరమో అంతా చేసి, లొసుగుల తో పాటూ, అక్కడ జరిగే అన్యాయాల్ని, మనం రోజూ చూసే రాళ్ళు రువ్వే కాశ్మీర్ ని, పెల్లెట్ లు ప్రయోగించే  సైన్యాన్నీ పక్క పక్కనే పెట్టి చూపిస్తుంది. 

బిప్లవ్ అమితంగా ఆరాధించిన తిలో, ఆఖరికి నాగా ని వివాహం చేసుకుని 20 ఏళ్ళ కి తను ఏమి చేస్తున్నదీ అర్ధం కాక, అతన్ని విడిచి అంజుం ని చేరుకోవడమే ఈ కధ - దీని వెనుక తిలో, మూసాల ప్రేమ కథ, తొలో అందమయిన జుత్తు ని కత్తిరించిన కశ్మీరీ పోలీసు, మరణించిన అమాయకులూ, ఇవన్నీ చాలా కదిలిస్తాయి.  ఒక్కో చోట చాలా బోర్ అనిపించినా,  నరేంద్ర మోదీ ని విపరీతంగా విమర్శించి - గుజరాత్ కా లల్లా గా ఆ పాత్ర ని పిలుస్తూ, గుజరాత్ అల్లర్లనీ, ఇప్పటి ఉద్వేగంగా మన్ కీ బాత్ చదివే లల్లా నీ, తూర్పారబెట్టినా అది అరుంధతీ రాయ్ కే చెల్లు. నిర్మొహమాటంగా, నిర్భయంగా మనం ప్రభుత్వానికి కట్టబెట్టిన సామ్రాజ్యాధికారం - ఎదురులేని తనానికీ, ఆరిస్ట్రోక్రసీ కీ ఎలా దారి తీస్తూందో ఒక మేధావి గా, ఆలోచించే వ్యక్తి గా చాలా వ్యాఖ్యానాలు చేస్తుంది. కొన్ని వీటిల్లో చాలా అతి గా అనవసరంగా, బోరింగ్ గా అనిపిస్తాయి. వీట్లో - ఒక తెలుగు మహిళా నక్సలైట్ రాసిన ఉత్తరం, దిల్లీ లో ధర్నాల, నిరసన ల రొటీన్, అంజుం పిల్లని పెంచే విధానం, నాగా, తిలో ల వివాహ జీవితం, కశ్మీర్ లో అమ్రీక్ సింగ్ అనే సిక్కు పోలీసు దురాగతాల, దుశ్చర్య ల వర్ణన, విపరీతం - మరీ - అనిపిస్తాయి. కానీ అవి వాస్తవానికి దూరం కాదు. ఏ కష్టాలూ ఎరక్కుండా మీడియా చెప్పిందే నిజమని నమ్మే మామూలు ప్రజల కి - నిజాలు కనిపించవు. కానీ కొన్ని పరిస్థితులు సత్యదూరాలు కావు. మేల్కొలుపులు.  

ఈ పుస్తకం రాయడానికి రచయిత్రి కి సుమారుగా 11 ఏళ్ళు పట్టింది. 1980 ల లో సిక్కు ల ఊచకోత దగ్గరినించీ, మేధా పాట్కర్ ఆందోళనలూ, దేశాన్ని ఓ కుదుపు కుదిపిన రెండో స్వాతంత్రోద్యమం - అన్నా హజారే రాం లీలా మైదానం లో సాగించిన ఉద్యమం, కేజ్రీవాల్ పుట్టుకా, పతనం, (నవల లో అగర్వాల్)  ప్రతీ నేతా తాలూకు వితండ వాదనా పటిమ, ఇలా కొన్నేళ్ళ కధా వస్తువు లు - ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ గా జరుగుతున్న  గోరక్షణ పేరుతో జరుగుతున్నసామూహిక హత్యలూ - అలా ఎన్నేళ్ళ నుండో అతి మామూలుగా జరిగిపోతున్న సంఘటనలు ఇవి.  ఇదంతా మన దేశం గురించి, ప్రస్తుత, పాత కాలపు ఎమర్జెన్సీ నుండీ జరిగిన అరాచకాల గురించీ పెద్ద చర్చ - చర్చ అని కూడా అనకూడదు - రేపు ఏంటి అంటూ గతాన్ని మర్చిపోయే ప్రజలకి ఒక రిమైండర్.  అత్భుతం - నచ్చిందీ అనలేము - బోరింగ్ - అనలేము.  ఏదో ఆత్మ వుందీ పుస్తకం లో. 

ఆ ఆత్మ అంతా - ఎపిటాప్ లది. కధంతా పంచదార గుళికల్లాంటి కవితలు - వందల ఏళ్ళ నాటి సూఫీ కవితలు - ఉర్దూ కవితలు - ఇవే అందం.   మచ్చుకి :-


Le saans bhi ahista ki nazuk hai bahut kaam
Afaq ki iss kargah-e-shishagari ka 

Breathe, gently here, for with fragility all is fraught, 
Here, in this workshop of the world, where wares of glass are wrought 


కశ్మీర్ గురించి మాత్రం ఓ నిజం - మనందరికీ తెలిసిన నిజమే గానీ, కొంచెం ఎక్కువ నిజం :-

The inbuilt idiocy, this idea of jihad, has seeped into Kashmir from Pakistan and Afghanistan.  Now, twenty-five years down the line, I think, to our advantage, we have eight or nine versions of 'True'  Islam battling it out in Kashmir.  Each has its own stable of Mullahs and Moulanas.  Some of the most radical among them - those who preach against the idea of nationalism and in favour of the great Islamic Ummah - are actually on our payroll.  One of them was recently blown up outside his mosque by a bicycle bomb.  He wont be hard to replace.   The only thing that keeps Kashmir from self-destructing like Pakistan and Afghanistan is good old petit bourgeois capitalism.  For all their religiosity, Kashmiris are great businessmen.  And all businessmen eventually, one way or another, have a stake in the status quo - or what we call the "Peace Process", which, by the way, is an entirely different kind of business opportunity from peace itself. 


కాశ్మీర్ గురించీ, హిజ్రాల జీవితం గురించీ, ఏదీ దాయకుండా, భయపడకుండా - కాసిన్ని అతిశయోక్తుల తో రాసినా - కొన్ని థియరీ లు మాత్రం నిజంగా ప్రసంశించే విధంగా చక్కగా వివరించడం లో  మాత్రం చాలా చక్కని ప్రతిభ కనబరిచిందీవిడ.   అన్యాయాలూ, మానవ హక్కుల ఉల్లంఘనా - వీటన్నిటి మధ్యా - ఇస్లాం అనే మాట మీద తమ లో తామే కొట్టేసుకుని లేదా భద్రతా దళాలతో ఎదురు కాల్పుల్లో  ఈ తీవ్రవాదులు భారత్ లో కి చొరబడిన ఆర్నెల్లకల్లా  చనిపోయే విషయాన్ని - నవ్వుతూ చెప్పేస్తారు.   హిజ్రాలూ, వాళ్ళ వ్యవస్థా, నక్సలిజం లో మహిళా కామ్రేడ్ల దుస్థితీ, వాళ్ళ కర్తవ్య దీక్ష, తీవ్రవాదుల భావోద్వేగాలూ, వాళ్ళని రక్షించే ప్రజల  defiance,  వీటన్నిటి మధ్యా మన కధ ఇది. మన దేశం కధ.    అంజుం ఉండే స్మశానం  లో   కొన్ని సమాధులకి కధ లుంటాయి.  ఈ సమాధుల చుట్టూ అల్లుకున్న కధల పుస్తకం చదవచ్చు.  అందుకే కవర్ కూడా ఒక సమాధి - దాని మీద ఓ చిన్న పూవు.  చావు లో సౌందర్యాన్ని విప్పి చెప్పే వర్ణనలు. దాల్ లేక్ నుంచీ దర్గాల వరకూ, ఉర్దూ కవితల మాధుర్యాన్నీ, చనిపోయిన పిల్లల సమాధుల మీద చిన్ని చిన్ని రాతల్నీ - అన్నిట్నీ ఎంతో నిబద్ధత తో సేకరించి,  విస్తారంగా రాసిన కధ ఈ Ministry of Utmost Happiness.  (ఈ పేరు వెనక కూడా ఒక చారిత్రాత్మక కధ ఉంటుంది. అది మాత్రం చదివి తీరాల్సిందే)

 అరుంధతీ రాయ్ అతిశయోక్తుల్లో మన దేశ వినాశన ప్రస్తావన కూడా వస్తుంది. కశ్మీర్ వాది ఒకడు మన దేశం ఏదో ఓ నాటికి సమాధి కావల్సిందే అంటాడు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే నేల మట్టం అయినప్పుడు మన లాంటి చిన్న దేశం ఒక లెక్కా.. ఇలానే స్వయంకృతాపరాధాల్ని పునరావృతం చేస్తూంటే - నీ పరిస్థితి కూడా ఇంతే అని చెప్పబోయేటట్టుండే ఈ ప్రస్తావన మరీ అతి గా అనిపిస్తుంది.  కానీ ఇదొ మంచి ప్రయత్నం అని చెప్పడానికి సందేహించక్కర్లేదు.  


* * *

First published in pustakam.net. 



09/08/2017

The portrait of a Lady - Kushwant Singh




మా నాయనమ్మ అందరి నాయనమ్మ ల లానే ఒక ముసలావిడ.  నాకు తను తెలిసిన ఇరవయ్యేళ్ళుగా ఆమె ముడుతలు పడిన చర్మంతో వృద్ధు గానే వుండేది. జనం ఆమె వయసులో చాలా అందంగా ఉండేదనీ, ఆమె కు ఒక భర్త కూడా వుండేవాడనీ అంటూంటారు. కానీ అది ఇపుడు నమ్మడం కష్టం.  మా తాత గారి ఫోటో పెద్ద చెక్క ఫ్రేము లో కట్టినది, మా ఇంటి చావిట్లో వేలాడుతూండేది.  ఆయన పెద్ద తల పాగా, వొదులుగా వుండే బట్టలూ వేసుకుని ఉంటాడందులో.  ఆయన పొడవైన తెల్లని గడ్డం, అతని చాతీని దాదాపూ కప్పేసి, ఓ వందేళ్ళ వృద్ధుడిలాగా కనిపిస్తారు ఆ ఫోటో లో. ఆయన్ని చూస్తే భార్యా పిల్లలూ  ఉండే తరహా మనిషి లా కనిపించరు. కేవలం బోలెడు మంది మనవలే ఉన్న వాడిలా కనిపిస్తారు.  మా నాయనమ్మ ఒకప్పుడు యవ్వనంగా, అందంగా ఉండేది అన్న ఆలోచనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది.  ఆమె తాను చిన్నప్పుడు ఆడిన ఆటల గురించీ అదీ ఎప్పుడూ చెప్తూండేది.  వాటిని మేము నాయనమ్మ చెప్పే మిగిల్న ప్రవక్తల కధల్లానే వినేవాళ్ళం.

తను  పొట్టిగా, లావుగా, ఎప్పుడూ,కొంచెం ముందుకి వొంగి ఉండేది. తన ముఖం నిండా ముడుతలూ, గీతలూ చెదురు ముదురుగా గీసినట్టుండేవి. తను ఎప్పుడూ చూడడానికి ఇలానే ఉండేదని మా మనసుల్లో ఒక స్థిర చిత్రం ముద్రించుకుపోయింది.    ఆవిడని ఇంకో విధంగా ఊహించుకోగలిగే ఆలోచనే మాకు లేదు.   తను ఎప్పుడూ ఇలానే వృద్ధు రాలి లానే వుండేది. ఎంత వృద్ధురాలంటే ఇరవయ్యేళ్ళు గా ఆమె అంతే వృద్ధురాలి లా ఉండటమే మాకు తెలుసు. ఆమె లో చక్కతనం కన్నా అందం ఎక్కువ.   తను బాలెన్స్ కోసం వొంగిన తన నడుము మీద ఒక చెయ్యి వేసుకుని, తెల్లని బట్టల్లో, ఇల్లంతా కుంటుతూ నడుస్తూ ఉండేది.  ఇంకో చెయ్యి ఎప్పుడూ జప మాల ని పట్టుకుని, ఒక్కో పూసనీ తిప్పుతూ ఉండేది.  తన వెండి జుత్తు, తన మొహాన్నంతటినీ అలల్లా తాకుతూ ఎగురుతూ ఉండేది. తన పెదవులు ఎప్పుడూ ఏదో వినబడని ప్రార్ధనని పలుకుతూ ఉండేవి. అవును తను అందమైన మనిషి.  చలి కాలంలో తెల్లగా పర్వతాల మీద పరచుకున్న మంచులా దిగంతాల వరకూ విస్తరించుకున్న ప్రశాంత లహరి లా ఒక శ్వాసించే శాంతి, తృప్తీ మా నాయనమ్మ.

నాయనమ్మా, నేనూ మంచి స్నేహితులం.  చిన్నతనంలో నన్ను మా తల్లిదండృలు ఆమె దగ్గర విడిచిపెట్టి నగరంలో ఉన్నన్నాళ్ళూ మేము ఒకర్నొకరం అంటిపెట్టుకునే వుండేవాళ్ళం.  తను నన్ను పొద్దున్నే నిద్ర లేపి, తయారు చేసి స్కూల్ కి పంపేది.  తన ప్రభాత  కీర్తనల్ని ఒకే రాగంలో పాడుతూ నా స్నానపానాదులు ముగించేది. అలా ఆమె ముఖతః కీర్తనల్ని నేర్చుకుంటానేమో అని తన ఆశ !  కానీ  ఆమె గొంతు నాకు నచ్చినా, ఆ కీర్తనల ని నేర్చుకునే  సదుద్దేశ్యం నాకుండేది కాదు.

అప్పుడు తను అప్పుడే కడిగిన పలకా, పచ్చని బలపం, మట్టి తో చేసిన సిరా బుడ్డీ, ఒక వెదురు పెన్నూ సిద్ధంగా ఒక కట్ట గా కట్టి, నా చేతికి ఇచ్చేది.  ఒక మందమయిన పాచి చపాతీ నిండా వెన్నా, చక్కెరా కలిపి రాసిస్తే అది తిని, స్కూల్ కి బయలుదేరేవాళ్ళం.  ఆమె తనతో ఒక కట్ట గా కొన్ని చపాతీలని ఊరిలో వీధి కుక్కల కోసం తెచ్చేది. 

నాయనమ్మ ఎప్పుడూ నాతో పాటూ స్కూల్ కి వచ్చేది. ఎందుకంటే స్కూల్ ఒక ప్రార్ధనాలయానికి అనుబంధంగా వుండేది. పూజారి రోజూ నాకు అక్షరాలూ, ప్రభాత కీర్తనా నేర్పించేవారు. పిల్లలందరూ వరండా అంచులెమ్మడి, చతురస్రాకారంలో కూర్చుని కీర్తన, అక్షరమాలా వల్లె వేస్తూంటే, నాయనమ్మ మాత్రం ఆలయంలో కూర్చుని గ్రంధ పఠనం చేసేది. మా ఇద్దరి చదువూ ముగిసాకా, ఇద్దరం ఇంటిబాట పట్టేవాళ్ళం. అప్పుడు మాకు తోడుగా వీధి కుక్కలూ వచ్చేవి. వాటి కోసం మేము వేసే చపాతీల కోసం,  వాటిల్లో అవి అరచుకుంటూ, గొణుక్కుంటూ, మా వెంటే ఇంటి దాకా వచ్చేవి.

మా తల్లిదండృలు నగరంలో సుఖంగా స్థిరపడ్డాకా, మేమూ నగరానికి వెళ్ళాం.  నాయనమ్మ కీ నాకూ ఉన్న స్నేహం లో ఇదో పెద్ద మలుపు.  మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నప్పటికీ, నాయనమ్మ ఇక్కడ నాతో స్కూలికి వచ్చేది కాదు. నేను ఇంగ్లీషు స్కూల్ లో చేరాను. బస్ లో వెళ్ళేవాడిని. వీధుల్లో కుక్కలు ఊరి లో అన్ని వుండేవి కావు కాబట్టి, నాయనమ్మ ఇంటి ఆవరణ లో  వాలే పక్షులకీ, పిచ్చుకలకీ ఆహారం పెట్టడానికే తనను పరిమితం చేసుకుంది. 

ఏళ్ళు గడిచే కొద్దీ మేమిద్దరం ఒకరినొకరు చూసుకునేదే తగ్గిపోయింది.  కొన్నాళ్ళ వరకూ ఆమె నన్ను పొద్దున్నే లేపి స్కూల్ కి తయారు చేసేది. నేను స్కూల్ నుండీ వచ్చాకా ఆరోజు టీచర్ స్కూల్ లో ఏమి చెప్పారో ఎంతో ఆసక్తి గా అడిగేది. నేనూ ఆమె కు ఇంగ్లీష్ పదాలూ, కొత్త కొత్త సంగతులూ, గురుత్వాకర్షణ శక్తీ, ఆర్కెమెడీస్ సూత్రాలు లేదా చుట్టుపక్కల ప్రపంచం గురించి చెప్పే వాణ్ణి. ఇదంతా విని ఆమె చాలా సంతోషించేది. కానీ ఇంగ్లీష్ స్కూల్లో చెప్పే ఈ విషయాలన్నీ నిజమని మాత్రం నమ్మేది కాదు.  ఈ స్కూల్లో దేవుడి గురించీ, ధార్మికత గురించీ ఏమీ చెప్పట్లేదని బాధపడేది.  ఒక రోజు నేను సంగీత పాఠాల్లో చేరబోతున్నట్టు చెప్పాను నాయనమ్మ కు. అది విని తను చాలా బాధపడింది.  ఆవిడ దృష్టి లో సంగీతానికీ అశ్లీల స్నేహాలకూ సంబంధం వుంది. అది కేవలం బిచ్చగాళ్ళకూ, వేశ్యలకూ సంబంధించిన విద్య అని ఆమె ఉద్దేశ్యం.   మర్యాదస్తులకు సంగీతం ఏమిటన్నది ఆమె అభ్యంతరం.  ఇలా నా సంగీత పాఠాల అనంతరం, నాతో మాటలు బాగా తగ్గించేసింది నాయనమ్మ.

నేను కాలేజీ కి వెళ్ళాకా, నాదీ అంటూ ఒక గది దొరికింది ఇంట్లో.  ఒకే గదీ అని నాకూ నాయనమ్మ కూ  ఉన్న బంధం కూడా తెగిపోయింది.   తన ఒంటరితనంతో నాయనమ్మ వెంటనే రాజీ పడిపోయింది.  చాలా అరదుగానే తన రాట్నాన్ని విడిచిపెట్టి , ఎవరితోనైనా మాటాడేది. పొద్దుట్నించీ పొద్దు పోయేదాకా ఆ రాట్నం వొడుకుతూ, పెదవులతో ఏవో ప్రార్ధనలు చేస్తూ ఒంటరిగానే కాలం గడిపేసేది.  ఒక్క మధ్యాహ్నాలు మాత్రం వరండాలో తీరిగ్గా కూచుని, ఆవరణలో వాలే పిచ్చుకలకు రొట్టెల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంపి వెదచల్లుతూ గడిపేసేది. ఆ సమయంలో నాయనమ్మ చుట్టూ వాలే పక్షుల హడావిడీ, వాటి కిచ కిచలూ, గోలా చూసి తీరాల్సిందే.  కొన్ని పిచ్చుకలు వచ్చి ఆవిడ కాళ్ళ మీదా, భుజాల మీదా వాలేవి.  కొన్ని తల మీద కూడా.  ఆవిడ నవ్వుతూ ఉండేది గానీ ఎప్పుడూ ఆ పక్షుల్ని అదిలించలేదు.  ఈ మధ్యాహ్నపు అరగంట సమయమూ.. చాలా సంతోషకరమైన సమయం నాయనమ్మకు.


నేను విదేశాల్లో చదువుకుంటానని నిర్ణయించుకున్నాకా, నాయనమ్మ చాలా బాధపడుతుందని ఖచ్చితంగా అనుకున్నాను.  నేను అయిదేళ్ళ పాటూ ఇంటికి దూరంగా ఉండబోతున్నాను. తన వయసు రీత్యా ఈ మధ్య కాలంలో నాయనమ్మ కాలం చెయ్యదని నమ్మకం లేదు.  కానీ నాయనమ్మ అస్సలు సెంటిమెంటల్ గా ప్రవర్తించలేదు. తను నన్ను సగర్వంగా సాగనంపింది. రైల్వే స్టేషన్ లో అందరితో పాటూ వచ్చి వీడ్కోలు ఇచ్చింది.  తన పెదవులు ఏవో ప్రార్ధన ని పలుకుతున్నాయి, చేతులు జప మాల ని తిప్పుతున్నాయి అప్పుడు ఆవిడ నన్ను దగ్గరకు తీసుకుని నుదిటి మీద మౌనంగా పెట్టుకున్న ముద్దు - ఆ చెమ్మా, ఆ స్పర్శా, ఇదే ఆఖరుది, మళ్ళీ ఈ స్పర్శ దొరుకుతుందా అని చాలా భయపడ్డాను.   ఇదే మా ఇద్దరి మధ్యా ఆఖరి భౌతికమైన స్పర్శ అని అనిపించింది.


కానీ అలాంటిదేమీ జరగలేదు. అయిదేళ్ళయ్యాకా, నేను విదేశాల నుండీ తిరిగొచ్చాకా నాయనమ్మ నన్ను స్టేషన్ లో నే కలుసుకుంది. నా  చేతిని తన చేతుల్లో అదుముకుని నా పక్కన కూర్చుందన్న మాటే గానీ నాతో కబుర్లు చెప్పే తీరిక తనకి లేదు. తన పెదవులు ఏవో కీర్తన ని జపిస్తున్నాయి.  నేను వొచ్చిన మొదటి రోజు కూడా  ఆ మధ్యాహ్నం పక్షుల భోజన సమయం మాత్రమే నాయనమ్మ ఆనందకరమైన సమయం.   ఆ పక్షుల భోజనాన్ని మాత్రం మరిచిపోలేదు తను.   వాటిని తీరిగ్గా, మురిపెంగా తిడుతూ, ప్రేమగా తిండి పెట్టింది నాయనమ్మ. అవే నాకు మిగిలిన అపురూప క్షణాలు.

ఆ రోజు సాయంత్రం నుండీ ఆమె లో మార్పు కనపడింది. ఆ పూట తను ఎటువంటి ప్రార్ధన, కీర్తనా అదీ చెయ్యలేదు.  ఇరుగు పొరుగు అమ్మలక్కలందరినీ పిలిపించుకుని ఒక పాత ఢోలక్ తీయించి పాట పాడ్డం మొదలు పెట్టింది.  తన సాగిన సన్నని వెళ్ళతో ఢోలక్ ని గంటల తరబడి వాయిస్తూ ఇంటికి తిరిగొచ్చిన వీరుల స్వాగత గీతాలు పాడింది.  అతి గా అలిసిపోతావు వొద్దూ అని మేమెంత వారించినా, ఆపలేదు.  అదే ఆఖరు.  నేను నాయనమ్మ ప్రార్ధన అంటూ చెయ్యకుండా వుండడం చూడటం.

మరుసటి రోజు పొద్దున్న కల్లా ఆమెకు సుస్తీ చేసింది.  చిన్న జ్వరం.   డాక్టరు అదే మెల్లగా తగ్గి పోతుందని చెప్పారు. అయితే  నాయనమ్మ కు మాత్రం అది తగ్గిపోతుందని నమ్మకం లేదు.  ఇక తనను   మృత్యువు సమీపించిందని మాతో అంది.   ఇక చావుకు కొద్ది గంటల సమయమే ఉంది కాబట్టి మాతో మాటలాడి సమయం వృధా చెయ్యకుండా ఉండేందుకు మేము ఎంత వారిస్తున్నా వినకుండా జప మాల తీసుకుని ప్రార్ధన మొదలుపెట్టింది.  కాసేపటికి మాకు అనుమానమే రాక మునుపే ఆమె పెదవుల కదలిక ఆగిపోయింది.   జీవం లేని వేళ్ళ నుండీ జప మాల జారిపోయింది.    మాకు ఆమె చనిపోయిందని తెలిసేటప్పటికీ,  ఆమె మొహం నిండా  ఎంతో ప్రశాంతత పరచుకుంది.

ఆమెను శాస్త్ర  ప్రకారం మంచం మీద నుండీ దించి, నేల మీద పడుకోబెట్టి  ఒక ఎర్రని వస్త్రంతో కప్పాము.  కాసేపు ఏడుపులూ అవీ అయ్యాక తనని అలా ఒంటరిగా విడిచిపెట్టి అంతిమ సంస్కారపు ఏర్పాట్లలో మునిగిపోయాము.

సాయంకాలం నాయనమ్మ గదిలోకి తన శరీరాన్ని అంతిమ సంస్కారం కోసం తీసుకెళ్ళేందుకు వచ్చాం.  అదో మరిచిపోలేని దృశ్యం.  అప్పటికి సూర్యాస్తమయం అవుతూంది. వరండా అంతా బంగారపు అగ్ని అంటుకున్నట్టు పల్చని వెలుతురు.  నాయనమ్మ గది లో ఆమె దేహం, ఆ ఎర్రని వస్త్రంలో చుట్టబడి నేల మీద వుంది.  గది లో నేల మీదా, వసారాలోనూ, ఆవరణ అంతటా వందలాది పిచ్చుకలూ, చిన్నా పెద్దా పక్షులూ - నిశ్శబ్దంగా - ఎటువంటి కువ కువలూ లేకుండా ఆమె చుట్టు పక్కలంతా వాలి ఉన్నాయి. మేము నడవడానికి ఖాళీ నే లేకుండా.

ఆ పక్షుల ని చూసి మేమంతా జాలిపడ్డాం. మా అమ్మ వాటికోసం కొన్ని రొట్టెలు తెచ్చి, వాట్ని చిన్ని చిన్ని ముక్కలు గా తుంపి వేసారు. కానీ ఆ  పిచ్చుకలు వాటిని గమనించనే లేదు.  నాయనమ్మ శరీరాన్ని మేము తీసుకువెళ్ళిపోయేదాకా వుండి అవి మౌనంగా ఎగిరి వెళ్ళిపోయాయి.  మరుసటి రోజు పని వాడు వచ్చి ఆవరణ నిండా ఉన్న రొట్టె ముక్కల్ని తుడిచి శుభ్రం చేసాడు. 



 "The Portrait of a Lady" by Kushwant Singh, Novelist, Columnist and Historian of the Sikhs.

* * *