Pages

Showing posts with label TV. Show all posts
Showing posts with label TV. Show all posts

15/09/2010

వెటకారం డాట్ కాం

నిజానికి వెతుకుతున్న వీడియో దొరకలేదు. 'యెటకారం.కాం' అని ఒక చిన్న స్పూఫ్ తరహా వీడియో - ఏ టీవీలోనో గుర్తులేదు.. చూసి చాలా ఇష్టపడ్డాను. ప్రధానంగా తెలుగు టీవీ పాలిటి చెత్తెస్ట్ యాంకరు కం ప్రొడ్యూసర్ - ఓంకార్ మీద స్పూఫ్లు ప్రత్యేకంగా చెయ్యడం ఈ యెటకారం.కాం ఎజెండా. ఇక్కడ ఆ 'సృజనాత్మకత' ని మెచ్చుకోవాలి.

''ఆట'' అనే రియాలిటీ డాన్స్ ప్రోగ్రాం కి యాంకరింగ్ చేసి, అంతకు ముందు ఆదిత్య టీవీ లో మ్యూజిక్ వీ.జే గా అపార అనుభవం, టీనేజి అమ్మాయిలూ, అబ్బాయిల్లో భయంగరమా ఫాలోయింగూ సంపాయించిన ఓంకార్, తెలుగు టెలివిజన్ కోసం చాలా కార్యక్రమాలు స్వయంగా నిర్మించారు, యాంకరింగ్ చేసారు. ఇలాంటి టెలివిజన్ సెలిబ్రిటీ ని టార్గెట్ చెయ్యడం కొద్దో గొప్పో సాహసమే !

యెటకారం.కాం నిర్మించిన వీడియో/టీవీ బైట్ లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది, ఆట పై వెటకారంగా చేసిన వీడియో ! 'ఆట-n' అనే కార్యక్రమం, దాన్లో పాల్గొన్న డాన్సర్లూ, మెంటర్లూ, వాళ్ళ పనికిమాలిన పోట్లాటలూ, (మరి అది రియాలిటీ షో - రియల్ అనిపించేలా కార్యక్రమం మొదలు నుంచీ చివరి దాకా కావాలని ఒకర్నొకరు తిట్టుకు చచ్చే జడ్జీలూ, మెంటర్లూ !), వీటి మీద చాలా వెటకారం గా స్పూఫ్ ఈ స్పూఫ్ వీడియో సాగుతుంది. నిజానికి ఆ వీడియోని ఇక్కడ పెట్టుంటే, చాలా మందికి నచ్చి వుండేది.

ఈ వీడియో ఆ 'ఆట' ఆణిముత్యం కాదు గానీ, just, యెటకారం.కాం గొప్పదనాన్ని తెలియచెప్పడానికి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో లో(/ల్లో ) ఓంకార్ లా నటించిన అబ్బాయికి నా బ్లాగ్ ముఖంగా అభినందనలు. తొణక కుండా, బెణకకుండా ఓంకార్ లాంటి వ్యక్తిని ఇమిటేట్ చెయ్యడం చాలా కష్టం అని నా ఫీలింగ్. ఆట మీద 'యెటకారం.కాం' వీడియో దొరికితే ఇంకో సారి పంచుకుంటాను.
ఈ రోజుకి మాత్రం ఈ వీడియో ని చూసి నవ్వుకోండి.

08/02/2010

నాద నీరాజనం - SVBC

నాద నీరాజనం, శ్రీ వేంకటేశ్వరా భక్తి చానల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండీ, 7.30 దాకా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన దగ్గర నుంచీ దాదాపుగా అన్ని ఎపిసోడ్లూ చూస్తూనే వస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరా భక్తి చానెల్ దేవస్థానం శ్రీవారికి నిష్ణాతులయిన సంగీత కళాకారుల చేత, వారి అద్వితీయమైన సంగీత ప్రతిభ చేత, ఇస్తున్న స్వర హారతే ఈ నాద నీరాజనం.

ఈ డైలీ కాన్సెర్టులు - శ్రీ వారి ఆలయం ఎదురుగా బహిరంగం గా - అందరు భక్తులకోసం, ఆరుబయట నిర్మించిన మండపంలో నిర్వహించపడుతున్నాయి. ఇప్పటివరకూ ఈ వేదికపై ప్రముఖ సంగీత విద్వాంసులు, కర్ణాటక, హిందుస్తానీ - భజన - దాస సాంప్రదాయాలలో గాత్ర, వాయిద్య సంగీత ప్రదర్శనలతో ప్రజల్లోకి భారతీయ, హిందూ, భక్తి సంస్కృతులను ఆఘౄణింపచేస్తూ, సామాన్య భక్తులను తమ స్వర రాగాలయ దర్శనం చేయిస్తున్నారు.

అసలే తిరుమల. ఎన్నో వ్యయ ప్రయాశలకోర్చి చేసుకున్న శ్రీవారి దర్శనం. ఉస్సూరుమంటూ గుడి బైటికొచ్చిన భక్త కోటికి సాయంత్రాల్లో ఓదార్పు గా ఈ వీనుల విందు. ఉత్కృష్ఠమైన ఈ సాంప్రదాయ సంగీత కళ, దేశ విదేశాల్లో పేరెన్నిక గన్న కళాకారుల ఉక్కిరి బిక్కిరి చేసే ప్రదర్శనలు - ఉచితంగా, భక్తుల కోసం ఏ ఆస్థాన మండపంలోనో కాకుండా - ఆరుబయట ఏర్పాటు చేసిన వేదిక, దేవస్థానం వారి దూరదర్శని లో ప్రత్యక్ష ప్రసారం - ఇదీ నాద నీరాజనం లో ప్రత్యేకత.

భారతీయ శాస్త్రీయ సంగీతానికి పెరుగుతూన్న ఆదరణ, సామాన్య భక్త జనంలొ ఉన్న భక్తికి, సంగీతం పట్ల అనురక్తినీ జోడించి పారవశ్యంలో ఓలలాడిస్తున్న ఈ నిత్యమూ జరిగే కచేరీలు ఒక నిదర్శనం.

అయితే, ఈ కచేరీలలో, కొన్ని నిజంగా ఆణిముత్యాల లాంటి కచేరీలు - ప్రత్యక్ష ప్రసారం ఒక సారి జరిగిన తరవాత ఇంకోసారి చూసుకునే అవకాశం లేకపోవడం విచారించదగిన విషయం. మిగిలిన చానెళ్ళ లాగా బెస్ట్ ఆఫ్ నాదనీరాజనం లా ఈ మణిపూసల్ని ఇంకోసారి మరోసారి ఎపుడన్నా ప్రసారం చేసే ఆలోచన తి.తి.దే.వారికి ఉంటే బావుండేది.

మొన్ననే లతా మంగేష్కర్ చేత అన్నమయ్య సంస్కృత సంకీర్తనలను సీడీలు గా చేయించి విడుదల చేసిన సందర్భంలో ఈ నాదనీరాజనం వేదికను రసాభాసా చేసింది తి.తి.దే. నాద నీరాజనం కార్యక్రమం చోటుచేసుకునే ఆ సరస్వతీ మండపాన్ని రాజకీయ నాయకుల కాళ్ళు ఎక్కి తొక్కడం - లతా కచేరీ ఉంటుందని విశేషంగా జనాకర్షణ చేసిన సారాయి వీర్రాజు గారు వేదిక మీద త్రిభాషా ప్రసంగం చేసి (ఏ భాష లోనూ తీరా సరిగా మటాడ్లేకపోయారు) లతమ్మనూ, భక్తులనూ విసిగించడం దురదృష్టకరం. తీరా ఈ కార్యక్రమంలో లత పాడలేదు. కానీ ఆరోజు సభా ముఖంగా శ్రీవారికి తాను చేసిన స్వరార్చన (అన్నమాచార్య సంస్కృత సంకీర్తనలు హిందూస్తానీలో ఆలపించడం) సీడీలను విడుదల చేసి, ఏదో ఒక రోజు ఈ వేదిక పై కచేరీ చేయగల శక్తిని తనకు ఈయమని స్వామిని వేడుకుంది.

మంగళంపల్లి బాల మురళి, ఉన్నికృష్ణన్, ప్రియా సిస్టర్స్, హరిప్రసాద్ చౌరాసియా లాంటి ఎందరో ఉద్దండులు చేసిన కచేరీలు శ్రీవారికి నాద నీరాజనంగా సమర్పింపబడ్డాయి ఈ వేదిక మీదే. ప్రతి రోజూ సాయంత్రం భక్తులకు ఈ భక్తి సంగీత విందు - ఆసక్తి గల బ్లాగర్లకూ, సంగీత విద్యార్ధులకు మరి భలే పసందు. ప్రతి సంగీత కళాకారుడూ ఈ వేదిక మీద కచేరీ చేయాలని ఆశించే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రసరమ్యంగా నిర్వహిస్తున్న TTD, SVBC మరియూ ఈ.వో గారు శ్రీ కృష్ణారావుగారూ ధన్యులు. వీడియోలు యూట్యూబ్ లో కొన్ని చూడొచ్చు.

16/09/2009

సిల్లీ కబుర్లు

1) ఏ వయసు కి ఆ ముచ్చటా - అంటూ ముఖ్యంగా ఆడపిల్లల ప్రాణాలు తీసే వాళ్ళెందరో కనిపిస్తారు. పాతికేళ్ళు దాటిన ఆడపిల్లలు, ఎందుకు చెల్లట్లేదో అని తెగ కంగారు పడిపోయి, వాళ్ళ తల్లీ తండ్రుల బుర్ర తినేసి.. వేయించుకు తినే ప్రాణులు ఎక్కువ. అందరూ సోనియా గాంధీ లాగా ఆచీ తూచీ అడుగులు వేస్తే సమస్య ఏముంది ? పెళ్ళి కాని పిల్లల్ని అమ్మో ముప్ఫయి వచ్చేస్తోందనో - దాటిపోతుందనో - కంగారు పెట్టేసి, ఒత్తిడి చేసేస్తే, వాళ్ళూ, నిజమేనేమో - అని భయపడిపోయి, చాలా మటుకూ నష్టపోతున్నారు. ఇంతా డబ్బులిచ్చుకుని, (కట్న కానుకలు), డబ్బు వెదజల్లి - చేసుకున్న ఐశ్వర్యా రాయ్ లకు (అలా లేకపోయినా, ప్రొఫెషనల్ కోర్సు చేయకపోయినా, మంచి ఉద్యోగం లేకపోయినా .. పెళ్ళి కావడం కష్టం) తరవాత తగిలే షాక్ లు ఎలా ఉన్నాయంటే - గుండెలవిసిపోతున్నాయి.

తమిళ నటి మనోరమ - సాంప్రదాయ వాదులని ధిక్కరించి పెళ్ళికి ముందు 'ఆరోగ్య పరీక్ష లు చేయించుకోవాలని, అది చట్టం చేయాలని' పోరాడుతున్నారంట. ఎందుకు పోరాడకూడదు ? పెళ్ళయ్యాక, నపుంశకుడయిన భర్త, సమాజానికి ఏదో నిరూపించుకోవడానికే కట్న కానుకలూ, ఆర్భాటాల మధ్య పెళ్ళాడి, ఆనక 'నీకు విడాకులిస్తాను, ఇంకోర్ని పెళ్ళీ చేసుకో!' - అని సినిమాలో నాగేశ్వర రావు లాగా ఉత్తమమయిన డైలాగు కొడుతున్నాడు. లేదా, తమిళ నాడు లో అత్యధిక శాతం భర్తల లాగా, అమాయక భార్యలకు 'హెచ్. ఐ. వీ.' ని బహుమతి గా ఇస్తున్నారు. పెళ్ళి కాకపోతే, ఆడదాని జీవితం ఏమవునో అని తల్లి తండ్రులే, పెద్దగా అబ్బాయిల గురించి విచారించకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అదీ చింతించాల్సిన విషయం.


పూర్వం లాగా అటు అన్ని తరాలూ.. ఇటు ఇన్ని తరాలూ తెలిసి ఉన్న సంబంధాలు రావడం ఈ ఫాస్టు యుగం లో కష్టం కాబట్టి, ఇంజనీరు అల్లుడు ఇంటరు కూడా పాసవ్వలేదన్న విషయం పెళ్ళయ్యాక తెలుసుకుని నోరెళ్ళబెట్టడం లాంటి చిలిపి పనులకు తల్లి తండ్రులు ఒడికట్టడం మానాలి. అన్నీ బావుంటే, సాడిస్టిక్ లక్షణాలున్న పెళ్ళి కొడుకులు. మానసిక రోగులూ, అనుమానపు పక్షులూ - వీరి బారిన అమ్మాయిని పడేయటం ఎంతవరకూ సబబు ? ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు - మోసగాళ్ళ కు ఆడపిల్లల ను ఇచ్చి పెళ్ళి చేయడం - సగం, సమాజపు ఒత్తిడి కి లొంగిపోవడం మూలంగానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి సమాజంలో చూస్తున్నాం కాబట్టి - ఎపుడన్నా తెలిసిన సర్కిల్లో వయసు మీరిన కన్నె పిల్ల కనిపిస్తే - ఎపుడు పెళ్ళి అని ఏడిపించడమో, అయ్యో పెళ్ళి కాలేదా అని విచారించడమో చేయకూడనిపిస్తూ ఉంది. ఏమో బాబూ ! అది తప్పు ! రోజులు మారాయి.

(నేను ఏకపక్షంగా రాసినా, ఇంతటి బాధ అబ్బాయిలకి ఉండదా అని ఎవరికన్నా కోపం వచ్చినా - ఆ పరిస్థితి ని ఎదుర్కొనే మహిళ కి జరిగినంత అన్యాయం శాతం 'ఎక్కువ' అనిపించే రాశాను)


2) నయీ దిల్లీ రోజుల్లో, కిరన్ బేడీ - బంగ్లా పక్క నుంచీ తాల్ కటోరా ఉద్యానవనానికి (పొద్దున్న వాకింగు కి మాత్రమే !) వెళ్ళేటపుడు -అంత సింపుల్ ఇంట్లో ఉంటూందా ఆవిడా ? అని ఆశ్చర్య పోయేవాళ్ళం. బిర్లా మందిర్ కి సింపుల్ గా వచ్చేస్తూ ఉండేది ఆవిడ - పెద్ద స్కార్పియో లో ! చిన్నప్పట్నించీ ఆవిడ ఒక యూథ్ ఐకాన్! తొలి మహిళా ఐ.పీ.ఎస్. అధికారి. ఢిల్లీ ట్రాఫిక్ ని ఒక దారికి తెచ్చిన స్మార్ట్ పోలీస్. యునైటెడ్ నేషన్స్ లో భారత దేశం తరపున పని చేసిన వ్యక్తి. ఇపుడు - సెలెబ్రిటీ జడ్జ్ ! ఆప్ కీ కచేరీ లో ! అది సరే ! ఈవిడ - ఒక వాణిజ్య ప్రకటన లో కనిపిస్తున్నారు ఈ మధ్య ! అదీ స్త్రీ ల సౌందర్య సాధనం, మచ్చలు లేని ముఖ వర్చస్సు కోసం... నో మార్క్స్ క్రీం ను కిరణ్ బేడీ సిఫారసు చేస్తున్నారు.

ముచ్చట కలిగింది. ఆత్మ స్థైర్యానికీ, సాహసానికీ, తెలివితేటలకూ - ప్రతీక అయిన ఒక మాజీ పోలీస్ అధికారిణి - నో మార్క్స్ - రహో అంటూన్నారు. అయితే, మెచ్చుకోవాల్సిన విషయం - ఆ ప్రకటన రూపకర్తలు - ఈ ఐకాన్ ను ప్రకటనకు ఎంచుకోవడం. నేటి మహిళ ను ఆకర్షించడానికి ఉపయోగిస్తున్నారంటే, మన స్టాండర్డ్ పెరిగిందనే అనుకోవాలి. పిచ్చి పిచ్చి గా - ఆత్మ విశ్వాసానికి - చర్మం రంగుకూ - లింకులు పెట్టే, మార్కెట్ రంగం, 'బే దాగ్' (మచ్చలు లేని) సౌందర్యం కోసం, మచ్చ లేని వ్యక్తిత్వాన్ని - ప్రతీకాత్మకంగా చూపించడం, సంతోషించదగ్గ పరిణామం.




3) పనిలో పని గా ఇంకో వాణిజ్య ప్రకటన ని కూడా ప్రస్తావిస్తాను. ఒక చిన్న పాప, కార్పెట్ మీద పడుకుని పుస్తకం చదువుతూ ఉంటుంది. ఆ పాప తండ్రి పక్కనే సోఫాలో పేపరు చదువుతూ ఉంటాడు. తల్లి లాప్ టాప్ లో ఏదో చేస్తూ ఉంటుంది. పాప అపుడే చదువుతున్న పుస్తకం మూసేసి, అందులో రాకెట్ బొమ్మని చూపించి - నాన్నా నేను పెద్దయ్యాక ' ఇది ' (వ్యోమగామి) అవుతానూ అంటుంది. ఇందులో నాకు చాలా నచ్చింది.. ఆ పాప ను ఎన్నుకోవడం. భారత సమాజం లో ఆడ పిల్లల ఏంబిషన్ కి ప్రాధాన్యం ఇస్తున్నారూ అంటూ ఏదో భరోసా ఇస్తున్నట్టు ఉంటుంది ఆ ప్రకటన.

ఆ పాప ముఖ్యంగా పుస్తకం చదువుతూ ఉండటం ముచ్చట గొలిపే అంశం. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎంత మంది పిల్లలు - టీ.వీ కి అతుక్కోకుండా పుస్తకాలు చదువుతున్నారు ? అలాంటి వాతావరణం ఏదీ ఇళ్ళలో ? పైగా, ఆ అమ్మాయి లక్ష్యం, లక్ష్యం పట్ల ఆమె కున్న సందేహాలూ, తండ్రి ఇచ్చే భరోశా - ఇవన్నీ భవిష్యత్తు ని ఎంతో ఆశావహం గా చూసేలా చేస్తాయి.

You can watch the video here : http://www.youtube.com/watch?v=4y6uigiQ5EE

08/02/2009

టెలివిజన్ & స్త్రీలు

ఎన్నో రోజుల తరవాత టీ.వీ చూసేందుకు టైం చిక్కింది. పొద్దున్న మృణాల్ పాండే - 'బాతో బాతో మే' చూసాను. అప్పుడపుడూ చూస్తూండటం వల్ల ఎప్పటికపుడు ఈ కార్యక్రమాన్ని గురించి అర కొర సమాచారమే ఉంది. మొదటి సారి ఈ 'బాతో బాతో మే' Lok Sabha (DD)లో చూడటం ఆక్సిడెంటల్గా - చానెళ్ళు తిప్పుతూ నా ఫేవరెట్ (మాజీ) రాష్ట్రపతి కలాం తో మృణాల్ పాండే కాఫీ టేబుల్ చాట్ కనిపించగానే ఆగిపోయి కార్యక్రమాన్ని పూర్తి గా చూశాను. ఆ ఇంటర్వ్యూ మాత్రం కలాం వ్యక్తిత శోభను, మృణాల్ పాండే మృదువయిన కంఠం, లలితమయిన భాషా (ఈ ప్రోగ్రాం ఇంగ్లిష్ - హిందీలలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తికి అనుకూలంగా వుంటుంది) కలాం ఆఫీసులో ఉన్నప్పుడు జరిగిన ప్రతీ విషయాన్నీ చక్కగా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకొచ్చి అంతం దాకా ఆకట్టుకుంది.


చిన్నప్పుడు టెలివిజన్ కొత్త గా వచ్చిన రోజుల్లో మృణాల్ పాండే వార్తలు హిందీ లో నూ, ఇంగ్లీషు లో కూడా చక చకా చదివేసేయడం గుర్తు. ఆవిడ హెయిర్ స్టయిల్ నాకు ఎంతో ఇష్టం ఇప్పటికీ ! ఇపుడు ఆవిడ 'హిందూస్తాన్' అనే హిందీ వార్తా పత్రికకు చీఫ్ ఎడిటర్.
మృణాల్ ఈ రోజు మీతా వసిష్ట్ (దిల్ సే లో టెర్రరిస్ట్ గా నటించారు) అనే ప్రముఖ నటి తో చక్కని సంభాషణ జరిపారు. సూటిగా చూసే కళ్ళతో ఆవలీలగా నటించే ఈ సహజ నటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రోడక్ట్ ! నటన పరంగా రంగస్థలం, టెలివిజన్, సినిమా ఇలా అన్ని మాధ్యమాల్లో నూ నటించిన ఈవిడ ట్రాఫికింగ్ కి గురయ్యి, రక్షింపబడి, శరణాలయాల ఆశ్రయంలో ఉండే టీనేజి ఆడపిల్లల కోసం థియేటర్ వర్క్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. ట్రాఫికింగ్ (చిన్న వయసులోనే ఆడపిల్లలను (అమ్మి / కొనుక్కుని / ఎత్తుకొచ్చి) వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా ప్రవేశింపబెట్టడం) కు గురయ్యి అత్యాచారాలను ఎదుర్కొన్న పిల్లలు తీవ్రమయిన షాక్ లో ఉంటారు. వీళ్ళను చదువు వైపో, వృత్తి విద్య లోకో ప్రవేశింపజేసే ముందు వీళ్ళ వ్యక్తిత్వానికి కావలసిన మానసిక ఆలంబన తన కళ ఏమన్నా ఇవ్వగలగొచ్చునేమో అనే ఆలోచన తో ఆవిడ ఈ పనిని మొదలు పెట్టేరుట.

థియేటర్ వర్క్ షాప్ వల్ల ఆ పిల్లల్లో బెరుకు పోయి, ఆత్మ విశ్వాసం, భావ ప్రకటనా సామర్ధ్యం, ఇతరులతో కలిసి పనిచెయ్యగలగడం, నాయకత్వ లక్షణాలూ, భాష మీద పట్టూ - థియేటర్ అనగానే సమజంలో రకరకాల వ్యక్తులను, పరిస్థితులను అవగాహన చేసుకోవాలి కాబట్టి - జెనెరల్ నాలెడ్జూ పెరిగాయి. ఇంతకన్నా మంచి పని ఏముంది ? లోక్ సభ చానెళ్ళో ఈ కార్యక్రమం ఎపుడెపుడు ప్రసారం అవుతుందో నోట్ చేసుకోవడం మర్చిపోయాను. ఆదివారం మాత్రం 12 - 2 గంటల మధ్య మధ్యాన్నం ఒక్క సారి 'లోక్ సభ' చానెల్ని శృతించి చూడండి ! లేదా టైం టేబుల్ తెలుసుకొని పోస్టు చేస్తాను !


అలానే ఈ రోజు ఎన్ డీ టీ వీ ప్రాఫిట్ (NDTV Profit) లో మహిళలకు పనికొచ్చే ఆర్ధిక పరిజ్ఞానాన్ని గురించి చిన్న పరిచయం ఇచ్చారు !
ఇది చాలా విలువయిన సమచారమే. ఎందుకంటే మహిళలు ఇంటిని ఎంత చక్కగా నిర్వహించినా, ఉద్యోగాలు చేసినా డబ్బుల విషయంలో చాలా తక్కువ అవగాహన కలిగి ఉంటారు. ఇందుకు కారణం ప్రధానంగా 'నా భర్త / తండ్రి / సోదరుడూ' చూసుకుంటార్లే అనే ధీమా లేదా నిర్లక్షం లేదా ఆర్ధిక వ్యవహారాల్లో చొరవ చూపించడం వల్ల భర్త/కుటుంబ పెద్దా తమను తప్పుగా అనుకుంటారనే మొహమాటమూ కావొచ్చు.


వీటి వల్లనే కాబోలు మహిళలు మదుపు చేసే రకరకాల తెలివయిన ఉపాయాల గురించి తెలుసుకోవడానికి ఆశక్తే చూపించరు. కానీ ఆడవాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకొని తీరాలిట. సహజంగా ఆడవాళ్ళు - మగవాళ్ళ కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు. (స్టాటస్టిక్స్ ప్రకారం) రకరకాల మ్యూచువల్ ఫండ్స్ - రిస్క్ ఫేక్టర్స్ అన్నీ తెలుసుకోవడం, రిటైర్మెంట్ గురించి ముందుగా అలోచించడం, వివ్హాహం, గర్భధారణ, పిల్లల పెంపకం, తల్లిదండృల అనారోగ్యం లాంటి రకరకాల కారణాల వల్ల తరచూ కెరీర్ ను బ్రేక్ చెయ్యాలిసి వస్తుంది. అప్పుడు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తెలివిగా ఆ కెరీర్ బ్రేకుల్లో తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. అనుకోని పరిస్తితుల్లో ఒంటరులయితే జీవితాన్ని ఎదుర్కోవడమూ తెలుసుకోవాలిట :

ఇలా -

(1) (Working/Non-working) ఒంటరి మహిళలయితే :

(అ) ఒంటరి వారు కాబట్టి - ఆర్ధిక అత్యవసరాల్లో మిమ్మల్ని మీరే ఆదుకోవాలి. మీ ఆదాయంలోంచీ కనీసం 6 - 8 నెలల ఖర్చు ను ముందే దాచి పెట్టుకోండి. బాంకులో ఫిక్సెడ్ డిపాసిట్ అయితే మంచిది. అత్యవసర పరిస్థితి లో ఫిక్సెడ్ డిపాసిట్ ను బ్రేక్ చేస్తే 24 గంటల్లో మీ డబ్బు క్షమంగా మీకు చేరుతుంది.

బ్) జబ్బు పడటం, ఆక్సిటెంట్ కావడం లాంటి హాస్పిటల్ ఖర్చులు సంబాళించుకోవడం కోసం మెడికల్ ఇన్స్యూరెన్స్ చేయించుకోండి.

చ్) మీ మీద ఆధారపడే వాళ్ళెవరూ లేకపోతే లైఫ్ ఇన్స్యూరెన్స్ చేయించుకోకండి. యూలిప్ లు కూడా అనవసరం. దాని బదులు ఆ సొమ్మును ఇన్వెస్ట్ చెయ్యండి.

ఎ) మీకిష్టమయిన వారి పేర్న విల్ రాయండి.

(2) (Working Women) ఉద్యోగం చేసే గృహిణులు

కొందరు ఉద్యోగం చేసే మహిళలు కూడా అంతా భర్త మీదనే వొదిలేస్తారు. జీతం మొత్తం భర్త చేతిలో పోసి, తాము మాత్రం ఇల్లు చక్కబెడితే చాలు అనుకుంటారు. అనుకోనిదేమయినా జరిగితే విడాకులో, వైధవ్యమో ఎదుర్కోవాల్సి వచ్చినపుడు వీళ్ళకు చేతిలో ఎక్కువ సందర్భాల్లో కాణీ మిగలదు లేదా ఖర్చుల్ని ఎలా మేనేజ్ చ్జెయ్యాలో తెలియదు. వీళ్ళు పిల్లల్ని సాకడానికయినా కీడెంచి మేలెంచాలిట. డబ్బే భద్రత కదా. అందుకని వీళ్ళు -

(a) ఇంటి ఖర్చును ఎవరో ఒకరే కాకుండా భార్యా భర్తా ఇద్దరూ ముందే నిర్ణయించుకుని, షేర్ చేసుకోవాలి. ఒక జాయింటు అకౌంట్ మెయింటయిన్ చేస్తూ ఇంటి ఖర్చులకు ఇద్దరూ చెరి సగం డబ్బులు దాన్లో క్రెడిట్ చెయ్యొచ్చు.

b) ఆస్థులు / ఇళ్ళూ / పొలాలూ కొంటే అవి ఎవరి పేరు మీద ఉన్నాయో తెలిసి ఉండాలి. ఇద్దరి పేర్నా రిజిస్టర్ చేయించుకోవడం మంచిది.

c) భర్త / భార్య చేసే ఇన్వెస్టుమెంటుల్లో నామినీలు ఎవరూ అనేది ఇద్దరికీ తెలిసి ఉండాలి. భార్యా, పిల్లల పేర్న తీసుకొనే పాలసీల్లో స్పష్టత ఉండాలి.


d) ఆస్తి / ఇన్స్యూరెన్స్ / ఇన్వెస్ట్మెంట్ పేపర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. భర్త ఏదో పాలసీ తీసేస్కుంటాడు - భార్యకు తెలియనే తెలియదు. అనుకోకుండా భర్త చనిపోతే ఆయన పేర్న లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉందన్న సంగతే తెలియని భార్య అనవసరంగా ఆర్ధికంగా నష్టపోతుంది. ఇలా కేవలం పేపర్లు ఉన్నయ్యో లేవో తెలియకా, తెలిసినా ఎక్కడున్నాయో తెలియకా ఇన్స్యూరెన్సు కంపెనీలలో క్లెయిం కాని డబ్బు కోట్ల కొద్దీ మూలుగుతూ ఉంటుంది. అందుకే ఇది ఒక సింపుల్ మరియూ ప్రధానమయిన సూచన.

3) (Home-makers) గృహిణులు


ఏ) భర్తకు ఆదాయం ఎంత వస్తుంది - ఏ రకంగా వస్తుంది - (జీతం / వ్యాపారం / కమిషన్లూ వగైరా) మొదలయిన వివరాలు తెలిసుండాలి.

బి) భర్త కు ఉన్న లయబిలిటీస్ అంటే లోన్ల గురించి కూడా తెలిసి ఉండాలి. ఒంటరి అయినపుడు ఎవరో వచ్చి మీ ఆయన నాకింత సొమ్మివ్వాలి అంటూ అడిగితే ఆ విషయమేదో స్త్రీ కి తెలిసి ఉండటం అవసరం కదా ! మోసాలకు గురికావడం, ఒత్తిళ్ళకు లొంగడం, పిల్లల భవిష్యత్తు తో కాప్రమైస్ కావడం లాంటివి నివారించొచ్చు.

సి) భర్త కు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా లో ఎంత సొమ్మున్నదో కూడా తెలుసుకోవాలి. ప్రైవేటు ఉద్యోగం చేసే వారూ, రక రకాల ఉద్యోగాలు మారేవారూ తమ ఈ.పీ.ఎఫ్ ఖాతాను ఎప్పటికపుడు అప్డేట్ చేసి పెట్టుకోవాలి.

డీ) ఆస్థులు జాయింట్ గా కొనుక్కోవాలి. వీళ్ళు కూడా డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని తీరాలి.

ఈ) నామినీలుగా / వారసులుగా - పిల్లలు ఉన్నారో లేదో చూసుకోవాలి.

ఎఫ్) ఇన్స్యూరెన్స్ పాలసీ లు తీసుకొనేటపుడు Married Womens' Property Act కింద (పాలసీ తీసుకొనే సమయంలోనే ఒక చిన్న ఫాం ని నింపడం ద్వారా) తీసుకోవాలి. దీని వల్ల పాలసీ సొమ్ము కేవలం పాలసీదారుని పిల్లలకు, భార్యకూ మాత్రమే చెందుతాయి. ఇతర కుటుంబ సభ్యులు (అన్నదమ్ములూ వగైరాలు) ఆ సొమ్ము కు ఎంతమాత్రం హక్కుదారులు కారు.

మొత్తానికి అందరు మహిళలూ రిటైర్మెంట్ కోసం ముందునుండీ డబ్బు ఆదా చేసుకోవాలి. ఇవన్నీ మంచి సూచనలే కదా.

23/07/2008

కధా స్రవంతి

ప్రతి సోమవారం, డీ.డీ సప్తగిరి చానల్లోసాయంత్రం 8 గంటలకు 'కధా స్రవంతి' అని ఒక మంచి ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో అజరామరులు అయిన గొప్ప రచయితల, రచయిత్రుల కధలు కొన్నిటిని ఎంచుకుని, వేరే వేరే ఎపిసోడ్లుగా ధారావాహికంగా ప్రసారం చేస్తున్నారు. ఈ వారం శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన 'ధర్మ వడ్డీ' అనే కధ ను ప్రసారం చేసారు.


అనుకోకుండా శ్రుతించి, ఈ కార్యక్రమం చూసాకా, నాకు ఈ కార్యక్రమ దర్శక నిర్మాతల మీదా, దూరదర్శన్ మీదా చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే, ఈ కధను చక్కగా బుల్లి తెరకనుగుణంగా మలిచి, ఒక పల్లె లో చిత్రీకరించి, గుండెకు హత్తుకునేలా చక్కగా తీసారు.


ఈ కధ ఎప్పట్లోనో, ధర్మవడ్డీ అనే ఒక అప్పు ఇచ్చే పద్ధతి గురించి శ్రీ గోపీచంద్ రాసినది. అప్పట్లో బాంకులు లేవు. అప్పు ఇవ్వటానికి గ్రామంలోనే ఎవరో వడ్డీ వ్యాపారం చేసేవారు. ఇష్టం వచ్చిన లెక్కలతో వడ్డీ పాపంలా పెరుగుతూ.. అసలు కన్నా మించిపోయి, అప్పు తీసుకున్న వాళ్ళ బ్రతుకులు చిందర వందర చేసే ఈ పద్ధతి మీద ప్రభుత్వానికి గానీ, సమాజానికి గానీ ఎటువంటి అదుపు లేని పరిస్థితుల్లోంచీ ఈ కధ పుట్టుకొచ్చింది.


ఈ కధ లో మన Protagonist - సూరయ్య (/సూరన్న) ఒక వడ్డీ వ్యాపారంలోకి దూకిన మోతుబరి. ఇతని తండ్రి 100 ఎకరాల మాగాణికి యజమాని గా ఉండి, చేతికి ఎముక లేనట్టు దాన ధర్మాలు చేసి, తను పోయేవేళకి కొడుక్కి కేవలం నాలుగు ఎకరాలు మాత్రం విడిచి పోతాడు. అందుకే సూరన్నకు దాన ధర్మాలు అంటే చిరాకు. అతనికున్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చేసాడు. ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారం అంటే.. ఎందరో పేదల ఇళ్ళు గుల్ల చేసి, పెళ్ళాల పుస్తెలు తెంచి, గొడ్డూ, గోదా పొట్టన పెట్టుకునే వ్యాపారం అనీ.. పాపం అనీ ఒక సెంటిమెంట్ వ్యాప్తి లో ఉండేది. అయినా సూరన్న, తన ఆస్తి ని ఇబ్బడి ముబ్బడి చేద్దామని ఉన్న పొలం అమ్మి, ఆ డబ్బు తో ఊర్లో వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాడు.


అయితే, ఈ వ్యాపారం కారణంగా.. వసూళ్ళలో అతని నిక్కచ్చితనం, కౄరత్వం వల్ల గ్రామంలోనే అతనికి శత్రువులు తయారయ్యారు. ఇంతలో అతని దగ్గర రెండొందలు అప్పు తీసుకున్న ఒకానొకడు, వడ్డీ ఇవ్వనంటూ తిరగబడతాడు. ఎక్కువ మాటాడితే, అసలు కూడా ఇవ్వనని పట్టు బట్టాడు. ఇది అన్యాయం! సూరన్న కూడా ఆర్ధిక ఇబ్బందుల లో ఉన్నాడు. అతని చేతి లో డబ్బు అంతా వ్యాపారం మీద అప్పులు ఇవ్వబట్టి.. అంతా బయటే ఉంది. ఈ ఎదురుతిరగటం ఎక్కువ అయ్యాకా, సూరన్న డబ్బు అతనికి వాపసు రావట్లేదు. సూరన్న కోర్టుకు వెళ్తానని భీష్మించుకున్నా, పట్టించుకున్న నాధుడు లేడు.

సూరన్న ఈ బాధలో, దుగ్ధ లో పట్నానికి వెళ్ళి లాయరు తో మాట్లాడతాడు. అప్పు తీర్చని వాని మీద కేసు వేసి, వకీలు కి ఒక యాభయి సమర్పించుకుని, రాత్రి పూట ఇంటికి వస్తున్న అతన్ని దారి కాసి, అతని ప్రతివాది (అప్పు తీర్చని వ్యక్తి), మరికొందరు యువకులతో దాడి చేసి, డబ్బు దోచి, తీవ్రంగా కొట్టి పడేస్తారు. సూరన్న ఇంటికి ఎలాగో చేరతాడు. బయట అతనికి రక్షణ లేదు.

ఇలా సూరన్న ఊరివారి వ్యతిరేకత ఊబిలో చిక్కుకుపోయాకా, అతని అల్లుడు కూడా.. ఇంక ఆస్తి రాదని గ్రహించి, కూతుర్ని ఇంటికి పంపేస్తాడు. సూరన్న వడ్డీ వ్యాపారాన్ని ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న అతని భార్య కూడా అతనిని ఆ వ్యాపారం పాపం అనీ.. ఎంతగానో నచ్చ చెప్పినా, సూరన్న మాత్రం డబ్బు - డబ్బే లోకం అనే గట్టిగా వాదిస్తున్నడు. ఇలాంటి పరిస్తితుల్లో ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని అల్లుడింటికి పంపే ఉపాయం లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, నిశ్చేష్టుడై, చెరువు గట్టున కూర్చుండిపోతాడు.

ఈలోగా, కూతురు కూడా ఒంటరిగా పొలంలో రోదిస్తుండగా.. ఊరి యువకులే కొందరు దుండగులు, సూరన్న మీద కసి తో ఆ పిల్ల మీద అత్యాచారం చేస్తారు. ఆ పిల్ల పాపం ఇంటికి తిరిగి వచ్చి, పెరటి బావిలో దూకి చనిపోతుంది. అప్పుడు విషయం తెలిసి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చిన సూరన్న కళ్ళ ముందే, కోపావేశంతో అతని భార్య నిప్పంటించుకుని, సూరన్న ఎంత బతిమలాడినా వినకుండా ఆత్మ హత్య చేసుకుంటుంది.

ఈ అకస్మాత్తు సంఘటనలూ, అతని మనసుకు తగిలిన తీవ్ర గాయాల కారణంగా సూరన్న పిచ్చివాడైపోతాడు. అతని ఇల్లు అప్పు కింద ఇంకెవరో రాయించుకుని, అతను రోడ్డు మీద పడతాడు. రోడ్డు మీద రాళ్ళను ఒక మూటలో కట్టి, తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి, ఆ రాళ్ళనే డబ్బు గా అప్పు ఇచ్చి, మళ్ళీ, ఆ రాళ్ళనే, లెక్క పెట్టుకుని, మరిన్ని రాళ్ళనే వడ్డీ (ధర్మ వడ్డీ) గా వసూలు చేసుకుంటూ.. చాలా దీన స్థితిలో బ్రతుకుతూ ఉంటాడు. ఈ కధ చూసిన తరువాత, సూరన్న పరిస్థితి మీద ఎంత జాలి కలిగిందంటే, ఇటువంటి నిజ సంఘటన జరిగి, నేను ఆపలేని నష్టం జరిగిందే అని చాలా బాధ కలిగింది.

ఈలోగా, సూరన్న కూడా ఊర్లోని పిల్లలు పిచ్చి వాడంటూ రాళ్ళతో కొట్టి తరుముతూ ఉంటే, తన ఇంటికే వెళ్ళి, తన కూతురు చనిపోయిన బావిలోనే ఒక్క గెంతు గెంతి చనిపోతాడు. అతని శవాన్ని బయటికి తీసాకా.. ఊరివారంతా అతని జీవితాన్ని తలచుకుని చాలా బాధ పడతారు.

ఈ కధ లో తండి విచ్చలవిడి దానధర్మాల వల్ల విసిగి, డబ్బు మీద ఒక అభద్రతాభావాన్ని పెంచుకున్న సూరన్న అమాయకత్వం - ఆఖరికి డబ్బు చేతే నాశనం అయిన అతని జీవితం, ఆడబ్బు (రాళ్ళూ -రప్పలే) చేతే తరమి కొట్టబడి అతను చనిపోవటం చాలా సింబాలిక్ గా రాసారు రచయిత. ఇందులో సూరన్న మీద కోపం రాదు. తన మీద ప్రజల్లో కలిగిన వ్యతిరేకతను అర్ధం చేసుకున్నా, డబ్బు మీది అభద్రత తోనే, తన వైఖరిని మార్చుకోలేకపోయిన సూరన్న ని చూసి జాలి కలుగుతుంది.


ఈ కధ, ఇద్దరు స్నేహితులు చెప్పుకున్న కధ. టీవీ లో నేను చూసిన ఒక మంచి కార్యక్రమం. వచ్చే సోమవారం కోసం తప్పకుండా ఎదురు చూస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు సప్తగిరి చానెల్ని అభినందించాలి.

అయితే, ఒక కధ చదివితే వచ్చే ఆనందాన్ని టీవీ ధారావాహిక ఇవ్వక పోవచ్చు. కానీ మనం చదవకుండా మిస్ అయిన మంచి కధలు ఇంత హాయిగా నాటక రూపంలో దొరుకుతుంటే.. చూసేందుకు సమస్య ఏముంది ?