Pages

14/04/2023

దిగంతం - కాశీభట్ల వేణుగోపాల్



మామూలుగా చాలామందికి లానే, ఇవెప్పటి కథలో,    వీళ్ళెక్కడి చదువుకున్న అనామకులో - ఇంత దారిద్ర్యమా   - ఇంత  నిరుద్యోగమా - అంటూ పాత్రలు "సక్సెస్ ఫుల్"  కాపోతే ,  లేదా వారికి అసహ్యకరమైన పరిసరాల్లో, తృప్తి లేని బ్రతుకులు బ్రతకాల్సొచ్చి, తలా తోకా లేని & అసలు భవిష్యత్తంటూ ఉండని బతుకు బ్రతుకుతుంటే,  అంత డార్క్నెస్ భరించడం నాకూ చేత కాదు.  కానీ 'ఇనీషియల్ షాక్' తట్టుకోగలిగితే ఇది ఆయన మాత్రమే రాయగలిగే నవల. ఆయన అలానే రాస్తాడు చదువూ అని పుష్ చేసే "మిత్రో" ఉండబట్టి గానీ.. లేకపోతే, ఈ రచయిత [కాశీభట్ల వేణుగోపాల్] నాకు చిక్కకనే పోను. 

ఆరంభం లోనే  "ఏ ముఖమూ" లేని కథానాయకుడు, తనని తానే వెంబడించుకుంటూ, తాను పారేసుకున్న ముఖాన్నే వెతుక్కుంటూ, అలుపొచ్చేలా పరిగెడుతుంటాడు. అతనికో  నిర్లిప్త, భావరహిత, ప్రేమమయి,  ఓ "కుంటి, చెవిటి, మూగ" తల్లి.   ఆమెతోనే తన జీవితం. చుట్టు పక్కల బస్తీ లో అపరిశుభ్ర వాతావరణం మధ్య బీద, ఇంటెలెక్చువల్, చేతకాని జీవితం!  ఇది ఏ కాలం నాటి కథో అనిపిస్తుంది. అలాంటి నిరుద్యోగం ఇప్పటికీ ఉందేమో. అలాంటి నిస్సహాయత గురించి మురికివాడల జీవితం గురించీ 70 లలోనే ఎక్కువ కథలొచ్చేవి. మహానుభావుడు ఈ కధానాయకుడు -    తన ముఖానెప్పుడో పోగొట్టుకున్నాడు. మిగిలిన అర్భక మైన దేహం, ఉడిగిపోతున్న వయసు, ఒంటరి తనం, ఎక్కడో కొద్ది శాతాలలో మిగిలిన మంచి హృదయం, మిగిలినవన్నీ అంత హాని చెయ్యని నలుపు ఆలోచనలూ.  (ఒకరికి సాయం చెయ్యగలిగినంత "కాండక్టు" ఉన్న మనిషే). 

ఇప్పుడు కథలకు కాలం మారిందనుకుంటాను. అంత చదువుకున్న మనుషులు పాశ్చాత్య సాహిత్యం గురించి చర్చించుకునే బీద వ్యభిచారులు, గుడిసెల్లో ఉండే వ్యభిచారులూ, డబ్బులు చాలని చిరుద్యోగులూ ఆ కాలంలో ఉండేవారేమో. ఇప్పుడున్నంత సమాచార విప్లవం అపుడు లేదో. ఇపుడున్నంత డబ్బు సంపాదించే మార్గాలు లేవేమో అని జాలి కలిగించే పాత్రలు.  ఈ కథా నాయకుడికి చాలీ చాలని సంపాదన, కచ్చితమైన సిగరెట్టు + బీడీ దురలవాటు,  డార్కు ఇంగిలీషు ఆలోచనలు, [గొణుక్కునేందుకు ఇంగ్లీషూ, తిట్టుకునేందుకు బూతులూ !] అయితే ఈ మొహం కోల్పోయిన ఆత్మకు మనసుంటుంది.   [అప్పుడప్పుడు వెతకడం మానేసాక, అతనికి తన ముఖం లిప్తల్లో దొరుకుతూంటుంది.] 

ఆ మనసుకు బోల్డన్ని అనుభవాలుంటాయి. ఆదరించిన ప్రతి మనిషి పట్లా బోల్డంత కృతజ్ఞత ఉంటుంది. పెళ్ళికాదు.  ఆ పరిస్థితుల్లో  శరీరానికి ఓదార్పునిచ్చిన వ్యభిచారి అంటే కృతజ్ఞత ఉంటుంది. ఆమె మరణ సమయంలో ఆమె పోయాకానూ, "ఆవిడ ఎంత బాధలు పడుంటుందో ఈ ఇన్స్టిట్యూషన్ లో, ఈ మురికికూపంలో" - అని బాధపడగలిగేంత మనవత్వం ఉంటుంది. ఆఫీసు లో అమ్మాయినీ, పొద్దున్న పల్చని నైటీలో కనిపించే,  ఆనవాలు తెలీని మహిళనీ, లాలస తో చూడడం, సహజంగానే తనకు కావలసినది పొందలేకపోయిన నికృష్ట దురదృష్టం పట్ల ఏహ్యభావంతో నూ, కోరికలతోనూ,  చాలీ చాలని సంపాదన తోనూ పెనుగులాడే  కధానాయకుడు.  ఎందుకో సహజంగానే అతనికి పెద్దగా తన పరిస్థితిని మార్చుకోవాలన్న కసీ ఉండదూ, దార్లూ వుండవు. 

తల్లి - ఏమీ లేని తనం లో కూడా  అచ్చంగా తల్లి లానే, ఈ నలభైయేళ్ళ వృద్ధ యువకుణ్ణి కాపాడుకుంటూ, కడుపునిండా తిండి 'వండి' పెడుతూ,  అవిటిదయినా ధైర్యంగా జీవిస్తూ, కొడుక్కి స్పూర్తి నిస్తూండే మూగ మనిషి.    ఆవిడ ఓ ఆనందాన్నీ, చిరాకునీ, అసహనాన్నీ, దేన్నీ వ్యక్తపరచదు. ఆవిడ కి తన చేష్టలు ఆనందాన్ని కలిగిస్తున్నాయా, కోపం తెప్పిస్తున్నాయో ఎప్పటికీ తెలీయదు. ఆవిడ నవ్వగా అతనెప్పుడూ చూడలేదు. పైగా కనీసం చిరునవ్వో, కళ్ళలో మెరుపో -  అలా ఇంకేదో పద్ధతిలో నైనా సరే  ఎటువంటి భావాన్నీ వ్యక్తపరచని గాజు కళ్ళూ, చెక్క ముఖమూ ఆమెవి.  తల్లిని దాదాపు రోజూ కసురుకుంటాడు. కిరోసిన్ స్టవ్ మీద నీళ్ళు పోసి ఆర్పుతుందని,  వగైరా.. ఆవిడకి వినబడదు. అయినా కేకలేస్తుంటాడు. రోజూ ప్రేమగానూ, లాలనగానూ మాట్లడతాడు.  ఆవిడ లేని జీవితం లేనే లేదనుకుంటాడు.  "ఆది, అంతం" లేని జీవితం!  ఎన్ని లోతులకి జారాలో అన్ని లోతులకీ జారాక, వాటిల్లొంచీ పాక్కుంటూ, పైకొచ్చి, ఎదుగుతున్నాననుకుంటాడు. ఇదీ దిగంతం కథ. 

రచయిత శైలి విభిన్నం, శక్తి మంతం. బాగా చదువుకుని, అన్ని దారులూ నడిచొచ్చిన అనుభవం,  జీవితం అంటే కృతజ్ఞత ఉన్న శైలి. ముందుమాట లో "నే నోనేల బారు మనిషిని.  నా రచనల్లో గొప్ప గొప్ప ఆశయాలుండవు. గొప్ప విషయాలుద్భోదించే జ్ఞానం నాకు లేదు. నాలా ఆలోచించే వారికోసమే నా రచనలు.  "నా జీవితమే నా రచన, నా రచనే నా జీవితం. అంగవైకల్యంతో అయిదేళ్ళుగా మగ్గుతున్న నన్ను కాపాడుతున్న నా తల్లి సావి (సావిత్రక్కకు) సాష్టాంగపడుతూ.." అని రాసారు.  ఈ ఆఖరు వాక్యం చదివి నిశ్చేష్టురాలైనాను. ఒకరి మీద ఆధారపడవలసి రావడం, అదీ పెద్ద వయసులో, చాలా పెద్ద శిక్ష. ఈ మానసిక స్థితే చాలా విచిత్రమైనది. ఈ సమయంలో మనసులో కృతజ్ఞతను పెంచుకోవడమూ, కాపాడుకోవడమూ ఎంతో గొప్ప విషయం. ఈ సంపుటి (అన్వీక్షకి ప్రచురణ ట్విలైట్ సిరీస్ - 1) లో అన్ని రచనల్లోనూ ఈ కృతజ్ఞత కనిపించింది. 

ఈ పుస్తకాలలో ఒక దానికి ముందుమాట గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసారు.  దాని కన్నా "దిగంతం" బావుందనిపించింది. [ ఇది మూడు పుస్తకాల సంపుటి. ] "దిగంతం" లో ముగింపెంత బావుందో.  ముగింపు లో పూల బజారు కెళ్తాడు హీరో. అక్కడి దృశ్యం : 


పూల బజారు వీధిలోకి కావాలనే వెళ్ళా. ఉత్తినే పూల వాసనల్ని పీల్చడానికి. 

ఖరీదు లేని ఆనందం అప్పనంగా దొరికితే ఆబగా అనుభవించేందుకు.

పువ్వులమ్మే వాళ్ళందరూ ముళ్ళలానే వున్నారెందుకూ ?

కంటక దృష్టి ..!

వెధవా, నీ చూపు ముళ్ళ చూపు .. పాపం ఆ ముసలి సాయిబు చూడు తెల్లటి వెండి గడ్డం..!  మిల మిలా మెరిసే కళ్ళూ, తెల్లటి పైజామా లాల్చీతో తెల్లటి పొడుగాటి వేళ్ళతో.. 

యెంత సుతారంగా తాకుతున్నాడూ పూలని ? పూల మజ్జెనింకో వృద్ధసుమంలా లేడూ..?

నీ చూపు ముళ్ళ చూపంతే .. !

అరటి నారతో కట్టిన పూవులు హర్షాతిరేకంతో చేతులు చేతులు కట్టుకుని, చుట్టలు చుట్టుకుని నిల్చున్న ఆడపిల్లల్లా లేరూ .. !" 

ఓహో !  యేమి గొప్ప భా... వ.. న ..!

ఆయనెవరో ముసలి బాపనాయన "ఊలుదారాలతో గొంతుకురి బిగించి.." అని బాధపడి తన్నుకు చచ్చాడే....!

ఆయన దృక్కోణమది..! హాలెండు లో ట్యూలిప్పుల పైర్లకోతలు చూస్తుంటే ఆయన పుష్ప విలాపం వ్రాసుండేవాడా ? 

ఆయన చూసినట్లుగానే ప్రపంచంలో జనాలందరూ చూస్తుంటే.. యిన్ని వందల వేల కోట్ల రూపాయల పువ్వులమ్ముడు పోతాయా రోజూ..? 


తన బీద, ఒంటరి తల్లి కోసమూ, అమ్మ నవ్వగా చూడాలని దాని కోసం రకరకాలుగా ప్రయత్నించే తపించుకుపోయే పెద్ద యువుకుడు ఆకర్న తల్లి నవ్వు చూసినప్పుడు రాసిన పేరా చదివి చాలా తృప్తి కలుగుతుంది. ఒకే మూసలోని రచన చదివినపుడు కలిగిన చిన్న అలక్ష్య భావాన్ని ఈ వాక్యాలు చెదరగొట్టేసాయి. రచననూ, రచయితనూ, రికమెండు చేసి, కొని పెట్టి,  తరవాత చదివేందుకు బద్ధకిస్తే ప్రోత్సహించి, చదివించిన మిత్రునికి కృతజ్ఞతలు. నిజంగా విలువైన రచన. 


నిర్మలమై.. అరిటాకు పొట్లంలో ముద్ద గులాబీలాగా అమ్మ పెదవులు విచ్చుకునే వున్నాయి. 

శాస్వత హాస రేఖయై.. పై పెదవి ఆకాశం. కింది పెదవి భూతలం ! 

విచ్చుకున్న విశ్వాంతరాళ కాంతులై చిరునవ్వు..! 

అమ్మ చిరునవ్వు.. చూళ్ళేననుకున్న చిరునవ్వు...! 

ముఖమ్మీది ముడుతలు విడిగి విప్పారి విశ్వరహస్య భోధలు చేస్తూ.. కఠోర సత్యం.. ప్రవచిస్తూ, ఆమె పెదవుల మధ్య కుంచించుకుపోయి హీనమై క్షీణమై సత్యమై పేలిపోయిన దిగంతం..!


Its all Worth it. 






No comments: