Pages

30/07/2021

ఒడిసీ - తెలుగు: బీనా దేవి





ఇలియడ్ చదివి, వీలయితే ట్రాయ్ - నెట్ ఫ్లిక్స్ సిరీస్ రెలీజియస్ గా చూసి కళ్ళు తుడుచుకున్నాకా చదవాల్సిన పుస్తకం, దాని కొనసాగింపు "ఒడిసీ". నిజానికి ఇది కూడా చాలా పెద్ద విషాద గాధ. కాకపోతే, సుఖాంతం. సుందరకాండ లాగా చదివిన వారికి గుండె ధైర్యాన్ని, కష్టాల్ని ఎదుర్కోవడానికి కావల్సిన స్థైర్యాన్ని, స్తితప్రజ్ఞతనూ, ఇంకా ముఖ్యంగా patience ని ఇస్తుంది.  హోమర్ రాసిన ఇలియడ్ లో గ్రీకు సైన్యానికి చీఫ్ (chief strategist), పిచ్చెక్కినట్టు నటించినా వొదలక, బలవంతంగా ఒప్పించి గ్రీకువీరులు యుద్ధభూమికి లాక్కుపోతే, పదేళ్ళ యుద్ధం, తరవాత ఇంకొన్నేళ్ళు (పది) సముద్ర యానం, షిప్ రెక్ లు, దేవతలూ, దయ్యాలకు కోపాలు తెప్పించే వీరోచితమైన పనులు చేసి, బలగం అంతా కళ్ళెదురుగా చనిపోయాకా, ఒక్కడూ ఎలానో బ్రతికి, ఒక దేవత చేతిలో బందీ అయి, గ్రహబలాలు కలిసొచ్చి, శాపాలన్నీ అనుభవించాక, అష్టకష్ఠాలనంతరం,  భార్యా బిడ్డల్ని చేరుకునే ఒడిసీసియస్ కథ ఇది. 

గ్రీకులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకీ మనకీ వ్యాపార సంబంధాలుండేవి. నిజానికి స్పార్టా రాణి హెలిన్ ని అసలెవరో భారత రాజు కూడా చేసుకుందామనుకుని కానుకలు పంపాట్ట కానీ, ఆవిడ తిరక్కొట్టిందంట. ఆ కానుకలు పట్టు పీతాంబరాలు.. మిరియాలు, పసుపు - ఆఫ్రికా నుండి కూడా పసుపు, దాల్చిన చెక్క పంపేవారనీ విన్నాను. ఇంకా ఇలియడ్ నే మన పురాణేతిహాసాల కు స్పూర్థి అనీ, ఇంకా ఈజిప్టు రాజు కథే, కాలక్రమేణా ఆర్యుల నోటి వెంట భారత దేశానికి ప్రయాణం చేసి, పరిణామం చెంది, రాముడి కథ అయిందనీ రక రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. 

అయితే, ఈ పుస్తకం 'ఒడిసీ'  - అదీ మన తెలుగు లో, పిట్ట కథ లాగా, అచ్చ తెలుగులో కాసిని ఇంగ్లీషు పదాలతో, చిన్న పిల్లలకి కూడా అర్ధమయ్యేంత సరళత తో, కొంచెం హాస్యంతో, వదిలేయాల్సిన వివరాలు వొదిలేస్తూ, (ఎందుకు వొదిలేసారో చెప్తూ) చెప్పల్సిన సంగతులు మాత్రం చెప్తూ ఉండడం వల్ల చాలా బావుంది. బీనాదేవి గారి చెప్పడం చాలా బావుంది. ఇది కూడా అదృష్టవశాత్తూ దొరికిన పుస్తకమే కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చదివడం జరిగింది.  

ఆవిడ వాడిన సరళత ఉదాహరణ కి :  

అనగా అనగా గ్రీసు దేశంలో అయోనియన్ సముద్రంలో ఒక చిన్న దీవి. పేరు ఇథాకా. దాని రాజు ఒడిసియస్. అతి తెలివైనవాడు, జిత్తులమారి. ఈటెను విసరడంలో బహునేర్పరి. స్వార్టా రాజు ఇకారియస్ కూతురు పీనోలోప్ ను పెళ్ళిచేస్కున్నాడు. పీనోలోప్ కీ ఓ పిల్ల కథ ఉంది. ఆ పిల్లని చిన్నప్పుడు తండ్రిపోసిడాన్ కొడుకు చేత సముద్రం లో విసిరేయించేస్తాడు. ఎందుకో ? హోమరు ఇష్టం. ఆమెని పీనీలోప్లనే బాతు జాతి పక్షుల గుంపు కాపాడి ఒడ్డుకు చేర్చాయి.  అప్పుడా తల్లితండ్రులకు ఆశ్చర్యం వేసి, ఆ పిల్లని తెచ్చుకుని, పీనీలోప్లు కాపాడాయి కాబట్టి పీనోలోప్ అని పేరు పెట్టారు. అసలు పేరు ఆర్నీషియా. 


ఇలాంటి కథే మనకీ ఉంది. మేనక విశ్వామిత్రుడి వల్ల పుట్టిన పిల్లని అడవిలో వదిలేస్తే (ఏం? ఇంద్రలోకంలో పిల్లలు ఉండకూడదా?!) శాకుంతలాలు అనే పక్షులు కాపాడేయి. అప్పుడు కణ్వమహర్షి ఆ పిల్లని తెచ్చి పెంచుకున్నాడు. ఆ పక్షుల పేరే శకుంతల అని పెట్టేరు. 


పెళ్ళి చేసిన తరవాత అదే తండ్రి ఒడిసియస్ ని తన రాజ్యంలో ఉండిపొమ్మని బతిమలాడేడు. ఒక దేశానికి రాజుని.. మరో దేశానికి ఇల్లరికవా! షట్. ఉండనని భార్యని తీసుకుని ఇథాకా వెళ్ళిపోయాడు. వాళ్ళ గదిలో పడుకోవడానికి మంచం తనే స్వయంగా తయారుచేసేడు. ఏం? రాజుగారికి పనివాళ్ళే లేరా ? ఉన్నారు. కానీ ఆ మంచానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గది మధ్యలో ఉన్న్ ఆలివ్ చెట్టు మానుని మంచానికి ఒక కోడుగా వాడేడు.  ఈ సంగతి  అతని భార్యకీ, ఒక దాసీదానికీ మాత్రవే తెలుసు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టేడు. పేరు 'టెలిమాకస్' . ఒడిసియస్ భార్య కొడుకుతో సంతోషంగా ఉన్నాడు. 


ఇంతే కాదు. ఈ సుఖంగా ఉన్న ఒడిసీసియస్ జీవితంలో హెలెనా లేచిపోవడము గందరగోళం సృష్టిస్తుంది. నానా కష్టాలు పడి, "తప్పదు బంధునాశనము" అని తెలిసీ, భార్యని మళ్ళీ కలుసుకుంటాడో లేదో అనే బెంగతోనే పిల్లాడిని వదిలి, పెద్ద ఘోరమైన యుద్ధం చేసొచ్చి, ఆ శతృ, స్వజన నాశనం తో ఎంతో భారంగా, తిరుగు ప్రయాణంలో చెడ్డశకునాల్ని చూసి బాధపడుతూ, సముద్రంలో నానా కష్టాలు పడి, ఎలాగో ఇల్లు చేరతాడు. 


ఈ చేరడానికి కొన్నేళ్ళు పడుతుంది. ఇల్లు చేరాకా భార్య కోసం ఇంకో యుద్ధం చెయ్యాల్సొస్తుంది. మధ్యలో ఆయన పడిన కష్టాలు, చంపిన శత్రువులు, చూసిన నరకమూ, (వైతరిణి లాంటి నది దాటి, నరకానికి పోయి, చనిపోయిన వారితో మాటాడతాడు - అదో హృదయవిదారకమైన ఘట్టం) చనిపోయిన తల్లిని చూస్తాడు. అప్పటికి తన మీద బెంగతోనే  ఆవిడ మరణించిందని తెలియదు. ఇంటిదగ్గర భార్య చిక్కుల్లో ఉన్న విషయం ఆవిడే చెప్తుంది.  అలాగే ఆ ఆత్మల్లో,   ట్రాయ్ యుద్ధంలో తనతో పాల్గొని విజయులై, ఇళ్ళకి ప్రయాణం అయిన తన  సహచరుల్ని చూస్తాడు. అరె, విజయం వరించి ఇళ్ళకు వెళ్ళినవారిని కూడా శాపాలు (మృత్యువు) ఎలా వెన్నాడాయో కదా అని విచారిస్తాడు. అక్కడ దెయ్యాలన్నీ (ఆత్మలు) తమ కథలు ఒడిసియస్ కు చెప్పుకుంటాయి. ఈ చాప్టర్ ని కూడా బీనాదేవి చాలా బాగా క్లుప్తపరిచి హాస్యంగా (తేలికపరచలేదు) ముగించి, కధని ముందుకు దూకిస్తారు.  దీంతో వీరాధివీరులు, అజేయులు కూడా ఎలా మరణిస్తారో చూసి ఆశ్చర్యం కలుగుతుంది.






సుమారు 2800 ఏళ్ళ క్రితం ఒక స్ట్రీట్ సింగరు గానం చేసిన గాధలకి ఇంత ప్రాచుర్యవా? అది అర్ధం చేసుకోవడం ఇంతటి మహా యజ్ఞ్యమా అని ఆశ్చర్యపోతాం మనం. దీనిలో ప్రతి కథకీ  కొన్ని కారణాలుంటాయి. ముందుదో, తోకదో ఒక అనుబంధ కథ ఉంటుంది. "అల్లప్పుడెప్పుడో మీరు మామాటిన్లేదు గాబట్టి, మేమిప్పుడు మీ మాటినం" అంటారు అందరూ. బలులివ్వక పోతే దేవతలకి కోపాలు. సూర్యుడికీ, గాలి కీ అందరికీ కోపాలు, శాపాలు.  సముద్రయానం లో ప్రకృతి సహకరించడం, సహకరించకపోవడం దేవతల చేతిలోనే ఉంటుంది. ఏదో కొందరు  దయగల దేవతల వల్ల కథ నడుస్తుంది. 


అలా... ఈ మేజ్ లో అన్ని కథల్నీ ఒక లైనులో పెట్టి, కారణాల్ని విడమర్చి మనకెవరు చెప్తారు చెప్పండి?  ఇది మామూలు  మేధ కి అంత తొందరగా అందని విషయం. మనసు ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి యజ్ఞ్యాలు, మంచి మంచి రచయితల చేత చేయించి ఇంతందమైన పుస్తకాలు వేస్తున్నంత కాలమూ, అనువాదాలు, "తిరిగి కథలు చెప్పడాలూ" ఇంత చక్కగా ఉండడమూ జరిగినన్నాళ్ళూ, "చదువుకోవడం" ఒక ఆనందదాయకమైన వ్యాపకం గా కొనసాగుతుంది. రచయిత్రికీ, (బీనాదేవి ఒకరే రాసారు) పబ్లిషర్స్ కీ వేల వేల ధన్యవాదాలు. 


***


No comments: