Pages

26/04/2017

సాదత్ హసన్ మంటో కధలు - 2

ఈ రోజు ఇంకో మంటో కధ.

సిరాజ్

'నాగపడా' పోలీస్ స్టేషన్ దగ్గర ఇరానీ రెస్టారెంట్ దగ్గర,  దీపపు స్థంబానికి తలనానించుకుని నించునుంటాడు 'ఢూండూ'.   అతనికి ఈ ముద్దు పేరు ఎవరు పెట్టారో గానీ, సరిగ్గా అతికినట్టు ఉంటుంది ఈ పేరు.  'ఢూండూ' అంటే 'వెతికి పెట్టేవాడు'  అని అర్ధం. సరిగ్గా అదే పని చేస్తాడు మనవాడు. విటులు కోరే ఎటువంటి అమ్మాయినైనా చిటికెలో సమకూర్చడం అతని వృత్తి.   అతనొక పింప్.

ఏ కులం,మతం, రంగు, వర్ణన కైనా అనుగుణంగా అమ్మాయిల్ని విటులకు అందివ్వడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.   ఈ దీపపు స్థంబం,  అతని ఫేవరెట్ స్పాట్. ఎప్పుడన్నా ఆ వీధెమ్మట వెళ్తే, తప్పకుండా ఆ దీపెపు స్థంబాన్ని ఆనుకుని ఢుండూ కనిపిస్తాడు. ఒక వేళ అతనునా రోజు కనబడకపోయినా ఆ స్థంబం అతని మరో ఆత్మ లా అక్కడే నుంచుని నవ్వుతుంటుంది. ఎందుకంటే ఆ స్థంభం పొడుగైనది.  ఢుండూ కూడా పొడగరి.  

ఆ స్థంబాన్నించీ బోల్డన్ని కరెంటు తీగలు ఎక్కడెక్కడికో ప్రవహిస్తుంటాయి.. వాటిదో నెట్వర్క్. అలానే ఢుండూ ది కూడా పెద్ద నెట్వర్క్. ఆ స్థంబానికి  టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక జంక్షన్ బాక్స్ పెట్టారు. ఎపుడన్నా కనెక్షన్ లు కలపడానికీ, రిపైర్లు చెయ్యడానికీ.  ఢుండూ కూడా అలాంటి బాక్స్ లాంటి వాడే, ఏ తీగ ఎక్కడ పట్టుకోవాలో, ఎవరి అభిరుచికి అనుగుణంగా వారికి కొత్త కనెక్షన్లు ఎలా ఇవ్వాలో తెలిసిన వాడు.

అతనికి తన వృత్తిలో ప్రతి అమ్మాయీ తెలుసు. వారి శరీరపు ఆకృతి,  వారి చర్మాల క్రింద ఊపిరి తీసుకునే  ప్రతీ నరమూ,  ప్రతి అమ్మాయి స్వభావమూ, వగైరా.   ఏ అమ్మాయి ఎవరికి నప్పుతుందో ఢుండూ కి తెలుసు. ఇలా జీవితం సాఫీ గా గడిచిపోతున్న వేళ సిరాజ్ ప్రవేశిస్తుంది.  ఆమె కొత్తగా వచ్చిన వేశ్య.   స్వగతంగా చెప్పిన ఈ కధ లో  ఢుండూ, రచయిత (మంటో) తో,   ఈ పిల్ల గురించి చెప్తూ మొత్తుకుంటాడు.   

"ఈ దరిద్రానికి మెదడు వాచిందేమో చూడండి మంటో సాబ్!!  దుష్ట స్వభావి, అహంకారి.. అనూహ్యమైన మనిషి. అసలు ఈ వృత్తిలోకి ఎందుకొచ్చిందో?!   ఎవణ్ణీ తాకనివ్వదు.   ప్రతీ మనిషి మీదా నోరేసుకుని పడిపోతూంటుంది.   ఏ 'పాసింజరు'  నూ దగ్గరకే రానివ్వకపోతే బ్రతుకెట్టా గడిచేది? ఇపుడు చూడండి - మనిషి ఒక వస్తువను కొనుక్కున్నాకా, దాన్ని తాకి చూస్తాడు.   అంత దాకా ఇష్టమున్న మనిషిలా నటించి, తీరా వాళ్ళు ముందుకొచ్చాకా రంకెలు వేసి బెదరగొట్టేస్తుంది.   ఆఖరికి పాసింజర్లను ఉగ్ర రూపం దాల్చి కొట్టేస్తుంది కూడా.   నా సగం బిజినెస్స్ ఈ మనిషి వల్లే పడిపోయింది" అని చెప్తూ.. ఈ సమస్యను పరిష్కరించమంటాడు.

'మరి వృత్తి సరిపడని అలాంటి పిల్లను బలవంతంగా ఉంచడం దేనికి ?  పిల్లను తిప్పి పంపేయలేకపోయావా ?    కావాలంటే  ఆమెను పంపేందుకు డబ్బును ఇస్తానంటాడు' మంటో.   ఆ మాటకు సిగ్గుపడిపోతాడు ఢుండూ.   "పంపేయదల్చుకుంటే ఆమె ను పంపేందుకు  కావల్సిన డబ్బు నేనూ సర్దగలను.   కానీ ఆమె ఇక్కడే ఉండాలి" అంటాడు. 

"ఆమెను ప్రేమిస్తున్నావా ?"  అంటే, అవునూ కాదన్నట్టు తలాడించి.   ఆమె అంటే ఇష్టం!  అని ఒప్పుకుంటాడు.   "మీరు చదువుకున్న వారు సాబ్.   ఆమెకు కాస్త నచ్చచెప్పండి.  బీదరాలు.  వొంటి మీద చిరిగిన దుస్తులు తప్ప ఏమీ లేనిది.   హషిష్,  హిందీ సినిమా   పాటలూ తప్ప ఇంకేదీ రుచించని మనిషి.   మీకు తెలుసా ఇప్పటికీ ఆమె కన్యే. ఎవరినీ మీద చెయ్యే వెయ్యనివ్వని మనిషి కన్యే కదా!!!  చూడండి మంటో సాబ్, ఈ నాగపడా పోలీసులు మంచివారు కాబట్టి నేను ఇంకా బ్రతికున్నాను. ఆ పిచ్చిది సృష్టించిన హంగామా కి ఈ విటులే నన్ను లేపేసేవారేమో.. ఆమె తో మాటాడి ఆ పిల్ల బాధేంటో కనుక్కోండి. మీకు పుణ్యముంటుంది"  అని ప్రాధేయపడతాడు.

"ఇప్పటికే బొంబాయిలో వివిధ 'మేడం'  ల దగ్గర పనికి కుదిరి, 'పాసెంజర్ల'ను అదరగొట్టి, బిజినెస్సు దెబ్బ తీసిందని బయటికి తరమబడింది.   ఆ తరవాత ఒక హోటెల్ లో చేరింది, ఈమె ప్రవర్తన చూసి, వాళ్ళూ తరిమేసారు.   తిండీ, గూడూ లేకపోతే చూసి నేను చేరదీస్తే ఇదీ పరిస్థితి.  ఆమెను నేనూ తరిమేయలేను.  ఆమె లో ఈ మిగిల్న అమ్మాయిలో లేనిది ఏదో ఉంది.   పంజాబీ పిల్ల.   అలా నోటినే నమ్ముకుని,  ఎన్నాళ్ళు ఇలా ఉండగలదు?  చూసి చూసి ఏ వెధవో  ఆమెను బలవంతంగానైన చెరుస్తారు. లేదా పొడిచి పారేస్తారు. ఆ పిల్లని మీరే మార్చాలి మంటో సాహిబ్!"  అని మొత్తుకుంటాడు.

ఈ సిరాజ్ ను మంటో ఒకట్రెండు సార్లు చూసాడు.  సరైన భోజనం లేక బక్కచిక్కినా అందమైన మనిషి సిరాజ్. బలహీనంగా ఉన్నా ఏదో తెలియని ఆత్మ విశ్వాసం ఉంటుంది ఆమెలో.   ఆమె కళ్ళు పెద్దవి. స్పష్టంగా, ఆ చక్కని మొహంలో మెరుస్తూ ఉంటాయి. ఆ పెద్ద కళ్ళే మనకు కుతూహలం కలగజేస్తాయి. మంటో కి ఆ కళ్ళను కాసేపు ఎవరన్నా కాసేపు పక్కకు తప్పిస్తే తప్ప ఆమెను పూర్తిగా చూడడం  అసాధ్యం అనిపిస్తుంది. ఆమె పూర్తిగా నిండి ఒలికిపోతున్న మధుపాత్రలా వుంటుంది.  స్త్రీ కి ఉండాల్సిన మృదుత్వమూ, తెచ్చిపెట్టుకున్న చిక్కటి కరుకుతనం కలిపి వైన్ లా ఉండే మనిషి. చిటపటలాడుతూండే స్వభావం ఆమె చిందరవందర జుత్తుకూ,  ముడుచుకుపోయున ముక్కుకీ పెదవులకూ అంటుకునే వుంటుంది.

మంటో చివరికి సిరాజ్ ను,  ఢుండూ కు తెలియకుండా కలుస్తాడు.  ఢుండూ ఇచ్చిన ఆనవాళ్ళ ప్రకారం పరమ రొచ్చు వాతావరణంలో ఒక గుడిసెలో వుంటూన్న సిరాజ్ ని పది రూపాయల కు, మాటాడుకుని, ఒక రెస్టారెంటుకు తీసుకొస్తాడు. నాలుగు పెగ్గుల విస్కీ తరవాత ఆమె మిగిల్న విటులతో ఎలా ప్రవర్తిస్తుందో చూసేందుకు, ఆమె లో ఆగ్రహాన్ని రగిలించడానికీ కాస్త ప్రయత్నిస్తాడు.   అయినా ఆమె ప్రశాంతంగానే ఉంటుంది.  ఆమెకు నలభై రూపాయలిస్తే పుచ్చుకుంటుంది.   విస్కీ తీసుకోదు గానీ,  చరస్ అడిగి తీసుకుంటుంది. ఆ  చరస్  మత్తులో ఆమె,  'రాజ్యాలు కోల్పోయిన మహారాణి' లా అత్యంత విషాదంగా కనిపిస్తుంది.  ఆమె లో గూడుకట్టుకున్న దు:ఖానికి కారణమేమిటో తెలియక బాధనిపిస్తుంది మంటోకి. మర్నాడు   వీరిద్దరి 'మీటింగ్'  గురించి తెలిసి ఢూండూ కొంచెం ఫీలయ్యి, "మీరు ఇలా చేస్తారని అనుకోలేదు సాహిబ్!!" అని ఊరుకుంటాడు.    

విచిత్రంగా ఆ తరవాత కొన్నాళ్ళ పాటూ, సిరాజ్, ఢుండూ,  ఇద్దరూ ఎక్కడా కనిపించరు. సిరాజ్ గురించి వాకబు  చేస్తే ఆమె తిరిగి లాహోర్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరి ఢుండూ ఏమయినట్టు ? ఆమె ను దింపేసి రావడానికి వెళ్ళాడా? లేదా ఇద్దరూ లేచిపోయారా అర్ధం కాదు. ఢుండూ అలాంటి పని చెయ్యడు. భార్యా పిల్లలున్న వాడు. వాళ్ళంటే అతనికినెంతో అభిమానం.. ఇలా - ఆ దీప స్థంబాన్ని చూస్తూ, ఢుండూ వార్తల కోసం ఎదురు చూస్తుంటాడు మంటో.

ఆఖరికి, ఒక రోజు,  తనకలవాటైన చోటే ఢుండూ కనిపిస్తాడు.   ఇద్దరూ ఇరానీ హోటెల్లో చాయ్ తాగుతూ మాటాడుకుంటారు.   జరిగిందంతా చెప్తాడు ఢుండూ.   "మీతో కలిసి వచ్చాకా, నన్ను లాహోర్ తీసుకెళ్ళమని ప్రాధేయపడింది సిరాజ్. మీరు మిగిల్నసేఠ్ ల లా కాకుండా ఆమె తో ఎంతో బాగా ప్రవర్తించారంటగా.. మిమ్మల్ని ఆ రోజా మాట అన్నందుకు మన్నించండి. మీకు తెలుసు కదా, ఆమె ను నేను కాదనలేను. ఎంత నచ్చజెప్పినా వినలేదు.  మొత్రానికి లాహోర్  వెళ్ళాం. ఒక హోటెల్లో గది అద్దెకు తీసుకున్నాం. ఆమె కోరిక పై ఒక బురఖా కొన్నాను. అది వేసుకుని నెల రోజుల పాటూ వీధి వీధీ తిరిగింది, ఆమె తో నా టైం, బిజినెస్సూ పోగొట్టుకున్నందుకు, నన్ను నేను తిట్టుకోని క్షణం లేదు.

ఆఖరికి ఒక రోజు జట్కాలో  వెళ్తుండగా జట్కా వాణ్ణీ, బండి ఆపమని,  ఒక యువకుణ్ణి చూపించింది.  "నువ్వు ఇక్కడ దిగి, ఆ యువకుణ్ణి హోటెల్ కు తీసుకుని రా.. నేను ముందు వెళ్ళి అక్కడ ఎదురు చూస్తుంటాను"   అంది. నేను ఆ యువకుడితో మాటాడేసరికీ, నా ఇన్నేళ్ళ వ్యాపారానుభవాన్ని బట్టీ వాడుత్త స్త్రీలోలుడని అర్ధమైంది.  అతన్ని తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాకా, ఆ యువకుడు,   సిరాజ్ ని చూసి అదిరిపోయాడు. సిరాజ్  అతన్ని చూసి,  "నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించాను. నువ్వూ నన్ను ప్రేమించావన్నావు.  నీ కోసం, నా తల్లిదండ్రులనూ, ఇంటినీ వొదిలి వచ్చాను. మనం ఈ హోటెల్లోనే ఒక రాత్రి గడిపాము. నువ్వు మర్నాడు పొద్దున్నే, నన్నొదిలి పారిపోయావు. నేను నీ కోసం ఎదురుచూడడం తప్ప, ఏమి చెయ్యాలో తెలీని పరిస్థితి లో వొదిలేసి వెళ్ళావు.. నా ప్రేమ మాత్రం ఆ రోజు ఎలా వుందో, ఈ రోజూ అలానే వుంది"  అంటూ అతన్ని కౌగిలించుకుంది.  అతను దు:ఖంతో వొణికిపోయాడు.  ఆ రోజు సమాజానికి భయపడి అలా చేసానన్నాడు. నన్ను బయటకు వెళ్ళమంది,   నేను వరండా లో మంచం వాల్చుకుని పడుకున్నాను. తెల్లారుతూనే సిరాజ్ వచ్చి, 'పద'  అంది.  'ఎక్కడికి' అంటే 'బొంబాయికి' అంది.   'మరి అతనో?' అంటే,   "తను పడుకున్నాడు. నా బురఖా కప్పేసి వచ్చాను"  అంది.  అలా ఇద్దరం వెనక్కి వచ్చాం" అన్నాడు.

వీళ్ళిలా  మాటల్లో పడి ఇంకో స్పెషల్ టీ ఆర్డరిచ్చే సమయానికి అక్కడికి సిరాజ్ రానే వచ్చింది.   మంటో కి స్పష్టంగా కనిపించడం మాత్రం ఇలా -   "ఆమె మొహం, కళ్ళూ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఏదో సాధించినట్టు, పెదవులపైన అత్భుతమైన చిరునవ్వు. పలకరింపుగా నవ్వుతున్న ఆమె కళ్ళు పచ్చ రైల్వే సిగ్నళ్ళలాగా మెరుస్తున్నాయి!"  ఇదీ సిరాజ్ ముగింపు. వేశ్యల జీవితాల వెనుక ఉన్న విషాద కోణాల్ని చూపించడానికి సిరాజ్ లాంటి ఎన్నో పాత్రలను మంటో సృష్టించాడు.  ఇది కూడా ఒక బాంబే స్టోరీ. కుష్వంత్ సింగ్ మెచ్చినదీనూ.  దీనితో నేను రాయాలనుకున్న రెండు మంటో కధలూ అయిపోయాయి.  

No comments: